సోమవారం, మార్చి 02, 2026

అమెరికాలో వైద్యం... అమ్మో!

 

 

(అమెరికా పర్యటనలో ఉన్న ఒక సీనియర్ సిటిజన్ సలహా)

ప్రియమైన మిత్రులారా,
మేము గత రెండు నెలలుగా అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రంలో ఉన్న సియాటెల్ నగరంలో ఉంటున్నాము. భారతదేశం నుండి వచ్చేటప్పుడే నా భార్యకు శ్వాసకోస సంబంధిత సమస్య తీవ్రంగా ఉంది. ఆమె పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, మేము భారత్ నుండి తగినన్ని మందులను వెంట తెచ్చుకున్నాము. అమెరికాలో ఆ మందులు వాడిన తర్వాత ఆమె దాదాపు కోలుకుంది.
అయితే, తెచ్చుకున్న మందులు అయిపోవడంతో, మా పర్యటన సమయంలో ఆమెకు మళ్లీ శ్వాసకోస సమస్య వస్తుందేమోనని నేను ఆందోళన చెందాను. అందుకే, సియాటెల్‌లోని ఒక పల్మనాలజిస్ట్ (శ్వాసకోస నిపుణుడు) అపాయింట్‌మెంట్ తీసుకోమని నా కుమార్తెను కోరాను.
కానీ, నేరుగా నిపుణుడిని కలవడానికి వీల్లేదని, ముందుగా జనరల్ ఫిజీషియన్‌ను కలవాలని నా కుమార్తెకు చెప్పారు. దాని కోసం మాకు వారం రోజుల తర్వాత అపాయింట్‌మెంట్ ఇచ్చారు, అది కూడా కేవలం వీడియో కాల్ ద్వారా మాత్రమే.
మేము ఫోన్‌లో సుమారు 10 నిమిషాల పాటు డాక్టరుతో మాట్లాడి, ఇండియాలో నా భార్య వాడుతున్న మందుల గురించి వివరించాము. ఆయన సమస్యను అర్థం చేసుకున్నానని చెబుతూ, అందుకు తగ్గట్టుగా మందులు రాసిచ్చారు. ఆ మందులను మెడికల్ స్టోర్ నుండి తీసుకోవచ్చని చెప్పారు. తీరా మేము స్టోర్‌లో విచారించగా, ఆ మందులు వెంటనే అందుబాటులో లేవని, రావడానికి 4-5 రోజులు పడుతుందని చెప్పారు.
చివరికి ఐదో రోజున మాకు ఆ మందులు అందాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆ మందులను 'సిప్లా' (Cipla) కంపెనీ తయారు చేసింది మరియు వాటిపై 'మేడ్ ఇన్ ఇండియా' అని రాసి ఉంది. అమెరికాలో తీసుకున్న మెడికల్ ఇన్సూరెన్స్ వల్ల 50% రాయితీ లభించిన తర్వాత కూడా మేము ₹21,000 చెల్లించాల్సి వచ్చింది. అంటే, ఇండియాలో కేవలం ₹2,500 ఖరీదు చేసే మందులు, అమెరికాలో అక్షరాలా ₹42,000 అన్నమాట.
భారతదేశంలో మందుల దుకాణాల్లో నేరుగా దొరికే మందులను ఇక్కడ పొందడానికి మాకు 12 రోజుల సమయం పట్టింది. వారం రోజుల తర్వాత, డాక్టర్ సంప్రదింపుల ఫీజు (కన్సల్టేషన్) కోసం మాకు $283 (సుమారు ₹23,000) బిల్లు వచ్చింది.
భారతదేశంలో వైద్య సదుపాయాలు చాలా అధ్వాన్నంగా ఉన్నాయని భావించే నా భారతీయ మిత్రుల కోసం నా ఈ అనుభవాన్ని పంచుకుంటున్నాను.
మీ విశ్రాంత జీవితంలో మీరు భారతదేశంలో నివసిస్తున్నందుకు మిమ్మల్ని మీరు అదృష్టవంతులుగా భావించండి.

పుణ్యభూమి ఐన మన భారతదేశం లో మనం ప్రశాంతంగా బ్రతుకుతున్నందుకు సంతోషించండి. 

బాల్య మిత్రుల భలే గొడవ

 

(ఈ యదార్ధ గాధను ఉటంకించినవారు శ్రీ పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి గారు)

అప్పుడు నేను బాపట్లలో ఉండే వాణ్ణి...
కూరగాయలు కొందామని మిత్రుడు పున్నయ్య దుకాణానికెళ్ళాను ఆరోజు ఉదయం.... చాలా బిజీగా ఉండే కూరగాయల దుకాణం పున్నయ్యది...
ఆ రోజు ఏదో పెద్ద గలాటా జరుగుతోంది అతడి దుకాణం దగ్గర... మార్కెట్లో జనమంతా ఇంచుమించుగా  అక్కడే గుమి గూడి ఉన్నట్టుగా అనిపించింది...
లోపల నుండి ఒకటి రెండు  గొంతులు గట్టిగా వినిపిస్తున్నాయి. జనాన్ని తప్పించుకుని ముందుకు వెళ్ళాను. తగాదా జరుగుతున్నది ముగ్గురి మధ్య అనిపించింది ! 

ఒకరు పున్నయ్య,  రెండో వ్యక్తి సినీ నటుడు పి. యల్. నారాయణ గారి అన్నగారైన చలం గారు. మూడో వ్యక్తి ఎవరో నాకు తెలియదు.  టై లేకుండా సూటులో ఉన్నారు. 

"ఏమైంది? ఎందుకీ గొడవ?" అన్నాను జోక్యం చేసుకుని...

"మీరు న్యాయం చెప్పండి సార్." అన్నాడు పున్నయ్య నా చేతులు పట్టుకుని...

"అసలు విషయం ఏమిటి?" అన్నాను.

"నేనూ, చలం మీకు తెలుసు కదాండీ. ఈ మూడో వ్యక్తి కుంభంపాటి బలరాం గారు ..."

"అదిగో! అందుకే నిన్ను తంతానంటున్నాను! 'గారుట! గారు!!" అంటూ సూటూ బూటూ వ్యక్తి అంత ఎత్తున లేచాడు!

"ఇదెక్కడ గొడవండీ? నేనతడిని 'గారు' అనకూడదట!" అన్నాడు పున్నయ్య.

"అసలు మన తగాదా అందుకే మొదలైంది!" అంటూ గుడ్లురిమి చూశాడు సూ.బూ.వ్యక్తి.

"గారు అంటే తప్పేమిటండీ? మిమ్మల్ని గౌరవిస్తూ అన్నాడు." అన్నాను.

"తప్పా? తప్పున్నరా? ఇంతకీ మీరెవరు? మీకేం తెలుసని మామధ్య జోక్యం చేసుకుంటున్నారు?" నావైపు కోపంగా చూశాడు. నన్ను పరిచయం చేశాడు చలం.  సూ.బూ. వ్యక్తి పెద్ద ఉపన్యాసమే ఇచ్చాడు. సారాంశమేమిటంటే -  పున్నయ్య , చలం , అతడూ బాల్య స్నేహితులు!!
ముగ్గురూ ఒకే బెంచి మీద కూర్చునేవారు స్కూల్లో. కలసి ఆడుకుంటూ తిరిగే  వారు. వారి బాల్య స్నేహం ఎంతో అపురూపమైనది. పున్నయ్య , చలం బాపట్ల లోనే ఉండిపోతే,  
సూ. బూ. వ్యక్తి  
పై చదువులు చదివి బొంబాయిలో ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఐదారు సంవత్సరాల కోసారి బాపట్ల వస్తూంటాడు... 
ఆ ఉదయం పున్నయ్య ని చూడడానికి దుకాణానికి వస్తే పున్నయ్య "ఎలా ఉన్నారు బలరాం గారూ?" అని పలుకరించాడట!! 
అక్కడ మండింది     
సూ. బూ. వ్యక్తికి!!🤓

"ఇప్పుడు చెప్పండి. ఏఁరా బలరాం! ఎప్పుడొచ్చావ్? అనాలి గాని 'గారూ' అనొచ్చా?" అన్నాడు సూ.బూ. వ్యక్తి కోపంగా ఊగిపోతూ... 

చలించిపోయాను నేను! "నిజమే, పున్నయ్యా. బాల్య మిత్రుణ్ణి అలా అనొచ్చా?" అన్నాను.

"ఇదెక్కడి న్యాయమండీ? ఆయన భాభా అటామిక్ ఇన్స్టిట్యూట్ లో ఛీఫ్ మేనేజర్! పేరున్న కెమికల్ ఇంజనీర్!నేను సామాన్య కూరగాయల కొట్టు వాణ్ణి! ఆయన్ని అలా ఎలా అంటాను?" అన్నాడు పున్నయ్య.

"నువ్వు నన్ను అలా అనవా? నన్ను 'మీరు' అనేవారు చాలా మంది ఉన్నారురా. 'నువ్వు' అనేవారు నువ్వూ , చలం మాత్రమే! అలా పిలిపించుకుందుకే అంత దూరం నుండి వస్తూంటాను. క్రిందటి సారి వచ్చినప్పుడు నువ్వు ఊళ్ళో లేవు! ఇప్పుడున్నావంటే నన్నిలా దూరం పెట్టేస్తావా? సరే ! నేను వెళ్తున్నా." అన్నాడు సూ.బూ. వ్యక్తి! అతడి కళ్ళ నిండా నీరు చేరడం అందరం గమనించాం!😒
 వారి మైత్రీ, ఆప్యాయతకి అందరం చలించిపోయాం...
 నిండు మనసుతో వారిని అభినందిస్తూ సయోధ్య కుదిర్చాం. 🤝
పిల్ల వాడిలా ఏడుస్తూ పున్నయ్య అతణ్ణి కౌగిలించుకొన్నాడు! బాల్య స్నేహితులు అంటే వారే! కాదంటారా?