శుక్రవారం, డిసెంబర్ 21, 2012

అద్దంలో అవినీతి కొండ...

అద్దంలో అవినీతి కొండ... 



'పందొమ్మిదొందల పద్దాలుగు... పందొమ్మిదొందల పదేను... పందొమ్మిదొందల...'
ఆగకుండా, ఆవేశంగా, అరుస్తూ అంకెలు లెక్కపెడుతున్న అప్పారావును అతడి భార్య పంకజాక్షి జబ్బ పుచ్చుకొని లాక్కొచ్చి, డాక్టర్‌ పిచ్చేశ్వరరావు ముందు కూలేసింది. అప్పారావు కూర్చుంటూనే బల్ల మీద ఉన్న మందుల చీటీ పుస్తకం తీసుకుని చకచకా నోట్లు లెక్క పెట్టినట్టు లెక్కబెట్టసాగాడు. నర్సు గబగబా వచ్చి అతడి చేతిలో పుస్తకం లాక్కుంది.

అప్పారావు 'కయ్యి...'మంటూ అరచి, 'ఛీ... నీ వల్ల లెక్క తప్పింది. మళ్ళీ మొదట్నుంచీ లెక్కెట్టాలి...' అంటూ పుస్తకం లాక్కుని, 'ఓట్రెండ్మూడ్నాలుగైదారేడు...' అంటూ లెక్కపెట్టసాగాడు.

డాక్టర్‌ పిచ్చేశ్వర్రావు అతడి వాలకాన్ని గమనిస్తూనే 'ఏమైందమ్మా?' అన్నారు పంకజాక్షితో.

పంకజాక్షి చీర చెంగుతో కళ్లొత్తుకుని ఓసారి చీది, 'ఏం చెప్పమంటారు డాక్టర్‌, పొద్దున్న పేపరు చూడగానే కెవ్వున కేకేశారండి. వంటింట్లోంచి పరుగెత్తుకు వచ్చి చూద్దును కదా, గాలిలో వేళ్లు తిప్పుతూ అంకెలు లెక్కెట్టడం మొదలు పెట్టారండి. ఇదేంటండీ అనడిగితే, లెక్క తప్పిందని మొదట్నుంచీ లెక్కలెడుతున్నారండి. ఈయన్ని మీరే కాపాడాలి...' అంది వెక్కుతూ.

'పేపర్లో ఏ వార్త చదువుతుండగా ఇలా జరిగిందో చెప్పగలవామ్మా?'

'ఆయ్‌... ఏదో నల్లధనం గురించండి. ముందు దాన్ని పైకి గట్టిగా చదివారండి. ఆ తరవాత అమ్మో... అమ్మో... అని గుండెలు బాదుకున్నారండి. వెంటనే ఓసారి ఏడ్చారండి. ఆపై పగలబడి నవ్వారండి. ఇహ అక్కడ్నుంచి ఇదండి వరస. వందలు, వేలంటూ లెక్కలెట్టేస్తున్నారండి. అదేదో పెద్ద సొమ్మంట గదండీ?'

డాక్టర్‌ పిచ్చేశ్వర్రావు నిట్టూర్చాడు. ఆపై చెప్పాడు, 'అవునమ్మా, మన దేశంనుంచి అక్రమంగా విదేశాలకు తరలిపోయిన నల్లధనం అది. ఏకంగా ఆరు లక్షల డెభ్ఫైమూడు వేల కోట్ల రూపాయల పైచిలుకు సొమ్ము. అది చదివే మీవారు షాక్‌కి గురై ఉంటారు...' అన్నాడు.

'అయ్యబాబోయ్‌ అంత సొమ్మాండీ? అదంతా ఉండుంటే ఎన్ని మంచి పన్లు చేయొచ్చోగదండీ...'

'అదే మన దేశ దౌర్భాగ్యం తల్లీ...'

'ఆ దౌర్భాగ్యం సంగతి సరేగానీ, ముందు నా సౌభాగ్యం సంగతి చూడండి డాక్టర్‌! ఈయన మళ్ళీ మన్లోకొస్తారంటారా?'

డాక్టర్‌ అప్పారావుకేసి చూశాడు.

'రెండొందలారు... రెండొందలేడు...' అంటున్నాడు.

అప్పారావు దగ్గరగా డాక్టరు వెళ్లి, 'నేను పొద్దున్నే లెక్క పెట్టేశా తెలుసా?' అన్నాడు.

'అవునా, ఎలా? అంత డబ్బు లెక్క ఓ పట్టాన తేల్తుందేంటీ? మీరు అబద్దాలాడుతున్నారు...' అన్నాడు అప్పారావు ఉక్రోషంగా.

'ఇదో పెద్ద డబ్బేంటి? ఇంతకన్నా ఎక్కువ డబ్బు చూపిస్తా. లెక్కెడతావా?' అంటూ డాక్టర్‌ ఓ మీట నొక్కాడు. వెంటనే ఆ గదిలో తెర మీద ఓ చిత్రం వచ్చింది. అందులో సముద్రంపై కాకి ఎగురుతోంది. అలా ఎగురుతూ అది రెట్ట వేసింది.

'నీకు ఏం కనిపించింది?' అని అడిగారు డాక్టర్‌.

'సముద్రంలో కాకిరెట్ట' అన్నాడు అప్పారావు.

'సరిగ్గా చెప్పావు. నువ్వు ఇందాకా లెక్క పెట్టిన డబ్బు కూడా అంతే' అంటూ మాటల్లో పెట్టి సూది మందు ఇచ్చాడు డాక్టర్‌.

అప్పటికి అప్పారావు దృష్టి మళ్లింది. నీరసంగా కూర్చుని 'అదెలా?' అన్నాడు.

డాక్టర్‌ పిచ్చేశ్వరరావు చెప్పసాగాడు. 'చూడు అప్పారావ్‌, దేశంలో జరుగుతున్న కుంభకోణాల సంగతి మర్చిపోయావా? అధికారం ముసుగులో అవినీతి కథాకళి చూడటం లేదా? పదేళ్ల కాలంలో దేశంనుంచి తరలిపోయిన చీకటి డబ్బు చాలా విలువైనదే! కాదనను. కానీ మనదేశంలో ప్రజలిచ్చిన అధికారం అనుభవిస్తూ, దాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలు దోపిడికి పాల్పడిన అవినీతి నేతల దారుణాల విలువ ముందు ఇదెంత? నువ్వన్నట్టు సముద్రంలో కాకిరెట్ట కాదూ? టూజీలో టక్కుటమారమైన కోట్లను లెక్కపెట్టగలవా? సీడబ్ల్యూజీ పేరు చెప్పి ఆటల్లో అరటిపళ్లుగా లాగించిన సొమ్మును సొమ్మసిల్లకుండా గణించగలవా? చనిపోయిన సైనికుల కుటుంబాల కోసం కట్టిన నివాసాల్లోతిష్ఠ వేసిన చెదపురుగులు తినేసిన డబ్బుకు విలువ కట్టగలవా? ఆంధ్రా రాజావారి కుటుంబం ఆరగించిన లక్ష కోట్ల నిగ్గు తేల్చగలవా? దేశానికి అల్లుడైనా, రాష్ట్రంలో కొడుకైనా, తమిళ సీమ చెల్లాయైనా, కర్ణాటక సోదరులైనా ఎవరి వాటా ఎంతెంతో తేల్చి చూపగలవా? ఈ డబ్బంతా లెక్కపెట్టడానికి నీ జీవితం సరిపోతుందా చెప్పు?' అంటూ సముదాయించాడు.

అప్పారావు దిగాలుగా మొహం పెట్టి 'మరి ఈ దారుణాలను ఇలా కొనసాగనివ్వాల్సిందేనా? స్పందించే హృదయాన్ని బంధించి బతికేయాలా?' అన్నాడు.

డాక్టర్‌ అతడి భుజం తట్టి, 'చూడు అప్పారావ్‌, నీకు సామాజిక స్పృహ చాలా ఉంది. కానీ, ఇలా చీటికీమాటికీ తెలివి తప్పి ప్రవర్తించడం మాత్రం బాగోలేదు. నీ ఆవేశాన్ని సరైన దిశలోకి మళ్లించు. నీతిమాలిన నేతల పనిపట్టే సమయం వచ్చినప్పుడు వాళ్లకు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉండు' అన్నాడు ధైర్యం చెబుతూ.





PUBLISHED IN EENADU ON 21.12.2012

శనివారం, డిసెంబర్ 08, 2012

జైలే ఒక యోగం


జైలే ఒక యోగం 



'నమస్కారం గురూగారూ...'
'శీఘ్రమేవ కారాగారవాస ప్రాప్తిరస్తు!'

'అయ్యబాబోయ్‌, ఇదేం దీవెనండీ బాబూ? నేనేదో మీ దగ్గర నాలుగు రాజకీయ పాఠాలు నేర్చుకుని ఓ చిన్నపాటి నేతననిపించుకోవాలని తపిస్తుంటే, అంత మాటనేశారు!'

'భలేవాడివిరా, జైలుకెళ్లే యోగం అంత తొందరగా పడుతుందేంట్రా? అందుకు పూర్వజన్మ సుకృతం ఉండాలి. లేదా ప్రస్తుత జన్మ వికృతం కావాలి. నీకది అర్థం కావాలంటే మరో జన్మ ఎత్తాలేమోనన్నదే నా బెంగ'

'ఏమిటో గురూగారూ, మీ మాటలోపట్టాన మింగుడు పడవు. కానీ, మీరు నా మంచి కోరేవారు కాబట్టి కాస్త వివరంగా చెబుదురూ'

'ఒరే, నీచ రాజకీయ నేతగా ఎదగాలనుకునేవాడికి జైలుకు వెళ్లడమనేది మహర్దశ లాంటిదిరా. ముందు ఈ పాఠం ఒంటపట్టించుకో'

'మీరెంత చెప్పినా నా మట్టి బుర్రకు ఎక్కడం లేదండీ. జైలుకెళ్లడమంటే ఎంత సిగ్గుచేటు, ఎంత తలవంపు? ఇక నలుగురిలో నవ్వగలమా, ఎవరినైనా పలకరించగలమా, మొహం చూపించగలమా, కళ్లలోకి సూటిగా చూడగలమా? ఇంటా బయటా నరకం కాదుటండీ?'

'అలాగంటావా? అయితే రేపట్నుంచి నా దగ్గరకి రాకు, సరేనా?'

'అంటే, రాజకీయ పాఠాలు అయిపోయాయాండీ? మీ దగ్గర పాసైపోయినట్టేనా? ఓ నేతగా ఎదగడానికి తగిన అర్హత సాధించినట్టేనా?'

'కాదురా సన్నాసీ, అడ్డంగా ఫెయిలైపోయావు. నేతగా ఎదిగే అవకాశమే నీకు లేదు. బయటికి పో!'

'గు... గు... గు... గురూగారూ! శాంతించండి. నేనేమైనా తప్పుగా మాట్లాడితే మన్నించండి'

'తప్పా? తప్పున్నరా? నీలాంటి మంచివాళ్ల మొహం చూస్తేనే పంచ మహాపాతకాలు పట్టుకుంటాయి. సిగ్గు, శరం, మానం, అభిమానం లాంటిసుగుణాలు నీలో ఇంకా ఏ మూలనో ఏడిశాయి. వాటిని చిదిమేస్తేనే కానీ నీచ రాజకీయాల్లో ఎదగలేవు. ముందు వాటిని వదిలించుకుని ఆనక వచ్చి అఘోరించు'

'అర్థమైంది గురూగారూ, పొరపాటున ఓ సాధారణ మనిషిలా ఆలోచించేశాను. దయచేసి పాఠం చెప్పండి. జైలుకెళితే కలిగే లాభాలేమిటో వివరించండి. నోరెత్తకుండా రాసుకుంటాను'

'అట్టారా దారికి, సమకాలీన రాజకీయ పరిణామాలు చూస్తూ కూడా పాఠాలు నేర్చుకోకపోతే ప్రజాసేవకు తప్ప ఇంకెందుకూ పనికి రావు. జైలు గేటులోంచి కాలు బయటపెడుతూ కూడా ఏమాత్రం ఆత్మన్యూనత కనబడనీయకుండా విశాలంగా నవ్వుతూ, పెద్ద ఘనకార్యం చేసినట్టు చేతులూపుతూ, ఘరానాగా కోర్టు వాయిదాలకెళ్లొస్తున్న నేతల్ని నిన్నా మొన్నా టీవీల్లో చూశావుగా? వాళ్లే నీకు ఆదర్శం! కాబట్టి, అలాంటి నేతగా ఎదగాలంటే ముందు నువ్వు మనిషిగా దిగజారాలి. అందుకు తగిన ఏ అవకాశాన్నీ వదులుకోకూడదు. తెలిసిందా?'

'తెలిసింది కానీండీ, కొంత సందేహం పీడిస్తోందండి. అరెస్ట్‌ చేశారంటే ఎంతో కొంత మనం చేసిన వెధవ పన్లు బయటపడినట్టే కదండీ? మరలాంటప్పుడు అన్నీ గమనిస్తున్న జనం మననెందుకు నమ్ముతారండీ? ఎంత సిగ్గు చిదిమేసుకుని చేతులూపినా నవ్వుకోరాండీ?'

'అదిగో మళ్ళీ సిగ్గు మాటెత్తుతావ్‌? ఎన్నిసార్లు చెప్పినా సిగ్గుగా లేదురా? నికార్సయిన నీచ నికృష్ట నేతగా ఎదిగిపోయాక ఇంకా సిగ్గేంట్రా, సిగ్గులేనెదవా? నువ్వు సిగ్గు పడాల్సింది సిగ్గులేని నేతగా ఎదగలేకపోయినప్పుడు మాత్రమే. అర్థమైందా?'

'సిగ్గొచ్చిందండి బాబూ సిగ్గొచ్చింది! ఇక సిగ్గు మాటెత్తితే ఒట్టు. కానీ జైల్లోకెళ్లి కూర్చున్నాక ఇక చేసేదేముంటుందండీ?'

'ఎందుకు ఉండదురా? నికృష్ట నేతకి అన్నీ అవకాశాలేరా! అసలు నిన్ను అరెస్టు చేయడమే నీచ రాజకీయమని గోల చేయవచ్చు. తడిగుడ్డతో గొంతులు కోయగలవాడివైనా సరే, నోట్లో వేలెడితే కొరకలేనంత అమాయకుడినని గొల్లుమనొచ్చు. కళ్లముందు కోట్లకు పడగెత్తినా సరే, ఎర్రని యాగానీ ఎరుగనట్టు యాగీ చేయవచ్చు. పేద ప్రజానీకానికి సేవ చేసేసి, వాళ్ల బతుకులెక్కడ బాగు చేసేస్తానోనని కిట్టనివాళ్లంతా కలిసి కాళ్లూ చేతులూ కట్టేసి లోపల పడేశారని మోరెత్తుకుని మరీ బుకాయించవచ్చు. జాలిగుండెలున్న జనం కరిగి నీరైపోయేలా సానుభూతి కోసం నీ తల్లినో, చెల్లినో, భార్యనో, బామ్మర్దినో యాత్రలకు పంపించవచ్చు. అసలు నీ అరెస్టంటూ జరిగి ఉండకపోతే జనమంతా ఈపాటికి కోటీశ్వరులైపోయేవారని వూరూవాడా హోరెత్తించవచ్చు. నిన్ను జైల్లో పెట్టడం మూలాన, రావలసిన స్వర్ణయుగం సరిహద్దుల్లో ఆగిపోయిందని భ్రమ కలిగించవచ్చు. పనిలో పనిగా ఎదుటి పార్టీల్లోని వాళ్లకి, నువ్వు అడ్డంగా దోచుకున్న ప్రజాధనంలో ఓ అర పైసా వాటా బయటికి తీసి ఎరలేయవచ్చు. అదిగదిగదిగో అన్ని పార్టీలవాళ్లూ నీకేసి వెనకా ముందూ చూడకుండా దూకేసి కాళ్లుచేతులు విరగ్గొట్టుకుంటున్నారని వూదరగొట్టొచ్చు. బుర్రకెక్కిందా?'

'ఎక్కిందండి. మరంతగా ఎదగడానికి ఏం చేయాలండీ?'

'అధికారాన్ని అడ్డం పెట్టుకోవాలి. చట్టంలో లొసుగులు ఉపయోగించుకోవాలి. ప్రజల కోసం పనిచేస్తున్నట్టు నటిస్తూ జనం జెల్ల కొట్టాలి. ఖజానా కొల్లగొట్టి కోట్లకి పడగెత్తాలి. ఇన్ని చేసి కూడా నిమ్మకు నీరెత్తినట్టు నీతికబుర్లు చెప్పే ఆత్మస్త్థెర్యాన్ని పెంచుకోవాలి'

'ఆహా, ఎంత బాగా చెప్పారండీ! నేనిక ఎన్ని వెధవ పన్లు చేసి, ఎంత తొందరగా జైలుకెళ్లి మీ పేరు నిలబెడతానో మీరే చూద్దురుగాని!'

'శెభాష్‌, అదేరా నువ్వు నాకిచ్చే గురుదక్షిణ, వెళ్లిరా!'


PUBLISHE IN EENADU ON 7.12.2012

శనివారం, నవంబర్ 24, 2012

 కృ ష్ణం వందే జగద్గురుం


నిర్మలమగు నా మానస సరసిని...

విషము చిమ్ము కాళింది శిరసిపై...

దివ్యమైన నీ పాదము మోపగ...

అంతరించె నా మోహము వింతగ!


పిశాచాల సందేహం


పిశాచాల సందేహం

విద్యాధర పురానికీ, వైశాలీనగరానికీ మధ్య ఉన్న దట్టమైన అడవిలో, కాలి బాటకు పక్కన ఉన్న ఒక మర్రిచెట్టు మీద, రెండు కొంటె పిశాచాలుండేవి.

ఆ రెండు పిశాచాల్లో ఒకటి వృద్ధ పిశాచం కాగా, రెండవది కుర్ర పిశాచి. కాలి బాట వెంట వచ్చే మనుషుల ముఖాలను వృద్ధ పిశాచి పరీక్షగా చూసి, వాళ్ల బలహీనత ఏమిటో చెప్పగలిగేది. ఆ బలహీనతకు అనుగుణంగా కుర్ర పిశాచి వాళ్లను ఆకర్షించి ాట పట్టించేది.

 ఒక రోజున, ఆ రెండు పిశాచాలూ చెట్టు కింద కూర్చుని పిచ్చాపాటీ మాట్లాడుకుంటున్న సమయంలో, అన్నింటికన్నా పెద్ద బలహీనత ఏది? అన్న విషయం చర్చకు వచ్చింది.

అప్పుడు వృద్ధ పిశాచి, ‘ఎవరి బలహీనత వల్ల, వారి చుట్టు పక్కల వాళ్లందరికీ మనస్తాపం కలుగుతుందో, అదె పెద్ద బలహీనత’ అన్నది.

అయితే, ఆ బలహీనత ఏదన్న విషయంలో, రెండు పిశాచాలూ ఏకాభిప్రాయానికి రాలేక వాదులాడుకుంటున్న సమయంలో, కాలిబాట వెంట ఒక  మనిషి రావడం వాటి కంటపడింది. వృద్ధ పిశాచి, ఆ మనిషి ముఖంలోకి పరీక్షగా చూసింది. కాని, అతడి బలహీనత ఏమిటో దానికి అంతుపట్టలేదు. కారణం అతడి ముఖం చాలా గంభీరంగా  ఉన్నది.
వృద్ధ పిశాచి ఏమీ చెప్పకపోయేసరికి, కుర్రపిశాచి ఒక డబ్బు సంచీని సృ ష్టించి, కాలిబాట మధ్యలో పడవేసింది.
దారే వస్తున్న మనిషి, దాన్ని తీసుకునే ప్రయత్నం చేయక, ‘పాపం, ఎవరో డబ్బు సంచీని ఇక్కడ పారేసుకున్నారు’ అనుకుంటూ ముందుకు సాగిపోయాడు.
 అది చూసి పిశాచాలు రెండూ నిరుత్సాహపడ్డాయి. ఇంతవరకూ అందరూ కూడా డబ్బు సంచీని చూడగానే తబ్బిబ్బు పడేవాళ్లు. తర్వాత తలతిప్పి చుట్టుపక్కల చూసి, డబ్బు సంచీని దుస్తుల మాటున దాచుకుని, ఎవరూ లేని చోట విప్పేవాళ్లు. అప్పుడు సంచీలో రాళ్లో, తేళ్లో ఉండేలా చేసి, వాళ్ల భయం చూసి పిశాచాలు రెండూ పొట్ట  చెక్కలయేలా నవ్వుకునేవి.

 ఆ వచ్చిన వాడు, డబ్బు సంచీని వదిలి ముందుకు పోవడంతో, కుర్రపిశాచికి పట్టుదల పెరిగింది. వెంటనే అది చెట్టు దిగి, అపురూప సౌందర్య వతిలాగా రూపం ధరించి, ఒయ్యారంగా ఆ మనిషికి ఎదురు వచ్చింది.


అయితే, ఆ మనిషి ఆమెను చూసి పక్కకు తప్పుకుని వెళ్లిపోశాగాడు. ఆమె కాలిలో ముల్లు గుచ్చుకున్న దానిలాగా, ‘అబ్బా’ అంటూ కూలబడి పోయింది.

 ఆ మనిషి వెనక్కు తిరిగి వచ్చి, చక్కని యువతి రూపంలో ఉన్న కుర్రపిశాచి కాలిలోని ముల్లును తీసేశాడు. ఆ మరుక్షణం, యువతి అతడి చేయి పుచ్చుకుని, ఎక్కడలేని ప్రేమ నటిస్తూ ‘నేను నిన్ను ప్రేమిస్తన్నాను. నన్ను పెళ్లి చేసుకో’ అన్నది.

 దానికతడు చిరాకు పడుతూ, ‘చిన్న ముల్లు తీయగానే, నా వెంటపడ్డావు. రేపు మరెవడో  ఇంతకంటే పెద్ద ముల్లు తీస్తే , వాడి వెంట పోతావు. నా కిలాంటి ప్రేమలంటే చెడ్డ చిరాకు’ అంటూ వెళ్లి పోయాడు.

 నిరుత్సాహంగా తిరిగి వచ్చిన కుర్రపిశాచితో, వృద్ధ పిశాచి, ‘అతణ్ణి నేను ఆట పట్టిస్తాను చూడు’ అంటూ మాయమైపోయింది.


ఆ మనిషి అలా నడిచిపోతుండగా, ఒక పొదచాటు నుంచి, ‘దాహం, దాహం’ అన్న మూలుగులు వినిపించాయి.

అతడు ఆగి చూడగా, మహారాజు దుస్తుల్లో ఉన్న ఒక వ్యక్తి, అక్కడ పడి ఉన్నాడు. ఆయన ఒంటి నిండా గాయాలు. వెంటనే అతడు తన సంచీలోంచి మర చెంబొకటి తీసి, నీళ్లను దాహం అంటున్న వ్యక్తి నోటిలో పోశాడు.

  కొంత సేపటికి రాజులా ఉన్న వ్యక్తి తేరుకుని, ‘మీరు, నా ప్రాణం కాపాడిన మహానుభావులు. నేనీ దేశాన్నేలే రాజును. మీరు, నా వెంట రాజధానికి రండి. మీకు గొప్ప పదవి, కీర్తీ లభించేలా చూస్తాను’ అన్నాడు.
  అందుకు దారేపోయే మనిషి, ‘దాహంతో ఉన్నవారిని సేద తీర్చడం మానవ థర్మం. నాకే ప్రతిఫలమూ అక్కర్లేదు’ తన దారిన తాను వెళ్లసాగాడు.

అతడు అలా వెళ్లగానే, కుర్రపిశాచి  మహారాజు వేషంలో ఉన్న వృద్ధ పిశాచి దగ్గరకు వచ్చి, ‘ఇతనెవరో, ఏ బలహీనతా లేని మనిషిలా ఉన్నాడు’ అన్నది.

 దానికి వృద్ధ పిశాచి, ‘లోకంలో, ఏదో  ఒక బలహీనతలేని మనిషంటూ ఉండడు. ఇప్పుడతణ్ణి మనుష్యరూపంలో వెంబడించి, అతడి బలహీనత ఏదో తెలుసుకుందాం. పద’ అన్నది.

వెంటనే అవి రెండూ తండ్రీ కొడుకుల్లాగా రూపాలు ధరించి బయలుదేరాయి. వాటికి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్న బాటసారి మనిషి కనిపించాడు. పిశాచాలు ప్రయాణికుల్లాగా నటిస్తూ, అతడి పక్కన చేరి, అతణ్ణి మాటల్లోకి దించాయి.

 కొద్ది సేపట్లోనే, ఆ మనిషి అడవి ప్రయాణంలో తనకు కలిగిన అనుభవాలను గురించి వాటికి చెప్పసాగాడు.

దారిలో తనకు డబ్బు మూట కనిపించడం, అందమైన యువతి తారసపడడం, మహారాజు దాహం తీర్చడం- ఇవన్నీ పిశాచాలకు పూసగుచ్చినట్టు చెప్పాడు. ఇవన్నీ తెలిసినవే అయినా, పిశాచాలు రెండూ వింత కనబరుస్తూ విన్నాయి.
 అంతా చెప్పాక, ఆ మనిషి పిశాచాలను, ‘ఇప్పడు చెప్పండి, నాలాగా ధనదాహం, అందం పట్ల వ్యామోహం, కీర్తి కాంక్షా లేనివాణ్ణి  ఎక్కడైనా చూశారా?’ అని అడిగాడు.

‘చూడలేదు. చూడలేదు’ అన్నవి పిశాచాలు రెండూ ఏకకంఠంగా.

ఆ జవాబుకు అతడు సంతృప్తిపడి, తన చిన్ననాటి విషయాలు వాటికి చెప్పసాగాడు. తనకున్న మంచి గుణాలను, వాటి సాయంతో జీవితాన్ని తానెలా తీర్చి దిద్దుకున్నదీ, అంచెలంచెలుగా వివరించడం మొదలు పెట్టాడు.

 పిశాచాలు రెండూ చాలా సేపు ఓపికగా విన్నాయి. కాని, ఆ మనిషి తనను గురించి గొప్పగా చెప్పుకోవడం ఆపలేదు. క్రమంగా పిశాచాలకు ఓపికపోయి, మెదడు స్తంభించి, కడుపులో తిప్పడం మొదలుపెట్టింది. మరి కాసేపటికి  చెవులు గింగుర్లెత్తడం, కళ్ల వెంట నీళ్లు కారడం మొదలైంది. అయినా ఆ మనిషి తనను గురించి చెప్పుకోవడం ఆపలేదు. ఇక భరించలేక, పిశాచాలు మాయమైపోయి, వాటి నివాసమైన మర్రిచెట్టును చేరాయి.

‘అయ్యోబూబూ, ఏం మనిషి. తల వాచేలా చేశాడు’ అన్నది కుర్రపిశాచి.

అందుకు వృద్ధ పిశాచి నవ్వి, ‘తల వాస్తే వాచింది కానీ, మన సందేహం తీరిపోయింది’ అన్నది.

కుర్రపిశాచం అర్థం కానట్టు చూసింది.

వృద్ధ పిశాచం తాపీగా చెట్టు కొమ్మకు జారగిలపడి, ‘చూశావా, అన్నిటికన్నా పెద్ద బలహీనత తనను తాను పొగడుకోవడం. ఒక మనిషికి  ఏ దుర్గుణాలూ లేకపోవచ్చు కానీ, తనను తాను పొగడుకోవడం అనే బలహీనత ఉంటే, ఇక అతడి సుగుణాలకు విలువ ఉండదు. ఒకరి సుగుణాలను ఇతరులు గ్రహించాలి తప్ప, తానే పొగడుకోకూడదనే ఆలోచన లేకపోవడం వల్ల, నలుగురిలో చులకన అవుతుంటారు. ఇంతెందుకు, ఎప్పడూ మనుషుల్ని ఏడిపించే మనల్నే, ఏడిపించాడీ మనిషి’ అన్నది.

వృద్ధ పిశాచం చెప్పినదానికి, కుర్రపిశాచం అవునన్నట్టు తలాడించింది.




PUBLISHED IN CHANDAMAMA CHILDREN'S MAGAZINE IN 1988 DECEMBER ISSUE






బుధవారం, నవంబర్ 07, 2012

అసలైన 'మార్పు'


అసలైన 'మార్పు' 



అబ్బే... లాభంలేదు. చాలా మార్పులు తీసుకురావాలి. వూరించి వూరించి కేంద్ర మంత్రివర్గంలో మార్పులు చేసి ఉండవచ్చు. బులిపించి బులిపించి అస్మదీయులకు పదవుల పంపిణీ చేసి ఉండవచ్చు. ఉన్నవారినే అటూ ఇటూ మార్చి 'తార్‌మార్‌ తక్కిడమార్‌...' చేసి ఉండవచ్చు. అసలు తమ పార్టీవల్లనే 'మార్పు' అనేది సాధ్యమని కాంగ్రెస్‌ అధినేతలు ఉప్పొంగిపోతూ ప్రకటించవచ్చు. ఇవన్నీ సరే, అసలైన మార్పుల గురించి ఆలోచించరేం? ఎవరికీ పట్టని, ఏమాత్రం ఆలోచించని, వూహించలేని మార్పులెన్నో ఇంకా బోలెడు చేయాల్సి ఉంది. మంత్రివర్గం సంగతలా ఉంచండి, అసలు మంత్రిత్వ శాఖలకేసి ఓసారి చూడండి. ఎంత పాతవవి, ఎన్నాళ్లయింది వాటిని ఏర్పరచి, ఎల్లకాలమూ ఇవేనా, కొత్త శాఖలు పెట్టాల్సిన అవసరం ఉందా లేదా అని ఒక్కసారైనా ఆలోచించారా?
ఇకనైనా మించిపోయింది లేదు. దేశంలో రాజకీయ మేధావులంతా కూర్చుని ఆలోచనలను చిలగ్గొట్ట వలసిందే. అవసరమైతే రాజ్యాంగాన్నో, అందులోని విభాగాల్నో మార్చేయండి. అప్పుడే ప్రభుత్వ నిర్వహణ సజావుగా, సక్రమంగా జరుగుతుంది. విదేశీ వ్యవహారాల శాఖ ఉంది సరే, మరి మిగతా వ్యవహారాల సంగతేంటి? వాటికి కూడా శాఖలు ఉండొద్దూ! మొన్నటికి మొన్న శశి థరూర్‌, నరేంద్ర మోడీల పరస్పర వ్యాఖ్యానాలు వింటే ఏమనిపిస్తోంది? అత్యవసరంగా 'స్వదేశీ ప్రేమ వ్యవహారాల శాఖ' ఒకటి పెట్టాలనిపించడం లేదూ! మోడీగారి రూ.50కోట్ల వ్యంగ్యం వెనక ఏ కుంభకోణం నీడలున్నాయో, శశిగారి వ్యాఖ్యల వెనక ఏ ప్రేమ ప్రలోభాలు ఉన్నాయో తేల్చద్దూ! పోనీ ఆ సంగతి వదిలేసినా దేశానికే పెద్దింటి కూతురుది కూడా ప్రేమ వ్యవహారమే కదా? ఆ ప్రేమ ఎంత విలువైనదో ఆ పెద్దింటి అల్లుడు కొనసాగిస్తున్న వ్యవహారాలనుబట్టి తెలియడం లేదూ!

ఇలా చూసుకుంటే, బోలెడు వ్యవహారాలు ఈ శాఖతో చక్కబెట్టవచ్చు. ముసలి మాజీ గవర్నర్‌గారు వయసులో ఉన్నప్పుడు మనసు పడిన వ్యవహారంలో పుట్టాను కాబట్టి ఆయనే నా తండ్రని కోర్టుకెక్కిన కొడుకు వాదన లాంటి సంగతులు, రసిక మంత్రిగారికి ఎదురు తిరిగి ప్రాణాలు కోల్పోయినమహిళ కేసులాంటి రహస్య బాగోతాలు... ఇలా ఒకటేమిటి, దేశ వ్యాప్తంగా ఎన్నో రసవత్తర ఘట్టాలను ఈ శాఖకు బదలాయించవచ్చు.

ఇక్కడితో అయిపోయిందా? 'సకల పార్టీ పొత్తుల శాఖ' కూడా ఒకటి ఉండాల్సిందే. సంకీర్ణ ప్రభుత్వాన్ని పల్లకిలో కూర్చుని నడపాలంటే ఏ ప్రాంతీయ పార్టీతో ఎలాంటి వ్యవహారాలు నడపాలి, ఎవరికి ఎలాంటి పదవులు పంపిణీ చేయాలి, వాళ్లలో ఎవరైనా అడ్డగోలుగా అవినీతికి పాల్పడితే గంభీరంగా మౌనం వహించి లోపాయికారీగా ఎలా విషయాన్ని నాన్చాలి, ఎప్పుడు ఎవరు తోకజాడిస్తే ఎవరి మద్దతుతో నెట్టుకు రావాలి... లాంటి అనేక వ్యవహారాల్ని చూసుకోవడానికి ఓ కేంద్ర మంత్రిత్వ శాఖ అంటూ ఉంటే చాలా సులువుగా ఉంటుంది. అటు ప్రభుత్వానికీ సుఖం, ఇటు పత్రికలవాళ్లకూ సులువు. నేరుగా ఆ శాఖ మంత్రినే విషయమేమిటో కనుక్కుని, ప్రజానీకం జ్ఞాననేత్రాలు తెరిపించి చైతన్యపరచవచ్చు.

'వారసత్వ శాఖ' కూడా అత్యవసర శాఖల్లో ఒకటి. దీన్ని అధినేతలే స్వయంగా నిర్వహించవచ్చు. లేదా నమ్మకస్థులైన నమ్మినబంటుల్లాంటి వారికైనా అప్పగించవచ్చు. దేశాధినేతలనుంచి, రాష్ట్ర నేతల వరకు ఎవరెవరికి వారసులు ఉన్నారో, వారి కార్యకలాపాలేమిటో ఈ శాఖ గమనిస్తూ ఉంటుంది. అధికార పార్టీకి వారసుడెవరైనా ఉంటే అతణ్ని సమయానుకూలంగా పొగడ్డం, సభల్లో పాల్గొనేలా చేయడం, అతడి మేధావితనాన్ని చాటిచెప్పడం లాంటి అసంఖ్యాక వ్యవహారాలు చూసుకుంటుంది. అలాగే ప్రత్యర్థి పార్టీలకు చెందిన వారసులు ఉంటే వారి సంగతులు ఎప్పటికప్పుడు సేకరిస్తూ ఎలా వారిని అడ్డుకోవాలో కూడా ఇది చూసుకుంటుంది.

ఇక 'సమస్త పనుల గుత్తేదారుల నిర్వహణ శాఖ' కూడా అత్యవసరం. అస్మదీయ గుత్తేదారులందరూ ఈ శాఖలో తమ పేరు నమోదు చేయించుకుంటే పరిపాలన చాలా సులువుగా ఉంటుంది. అధికారులకు టెండర్లు పిలవడం, నిబంధనలు రూపొందించడం, జీఓలు మార్పించడం,అప్పటికప్పుడు చట్టాల్లో లొసుగుల గురించి వెతకడం లాంటి అనవసర ప్రయాసలన్నీ తప్పుతాయి. ఎన్ని అడ్డంకులున్నా కావాల్సినవారికే ఎలాగూ పనులు దక్కుతాయి కాబట్టి, ఎకాఎకి వాళ్లకే పనులన్నీ అప్పగించేసి చేతులు దులుపుకోవచ్చు.

'ప్రత్యక్ష, పరోక్ష పైరవీల మంత్రిత్వ శాఖ' ఆవశ్యకతను ఇప్పటివరకు ఎవరూ గుర్తించినట్టు లేదు. ఇదొకటి పెట్టి ఓ మంత్రిగారిని, ఆయన కింద పనిచేసే అధికార వర్గాన్ని కేటాయిస్తే జాతీయ, ప్రాంతీయ పైరవీలన్నీ దీనికిందకు తీసుకురావచ్చు. దాంతో ఏ పనికి ఎవరిని ఎలా పట్టుకోవాలో, ఎలా పైరవీలు చేయించుకోవాలో లాంటి సవాలక్ష పనులు చకచకా జరిగిపోయి ఎంతో విలువైన సమయం ఆదా అవుతుంది.

ఇలా చెప్పుకొంటూ పోతే 'దర్యాప్తులను నీరుగార్చే శాఖ', 'ఆరోపణలను తిప్పికొట్టే శాఖ', 'నానావిధ విమర్శల ఖండన శాఖ', 'ఎదురెట్టి ఏకే శాఖ', 'సానుభూతి శాఖ', 'బేరసారాల శాఖ', 'పాదయాత్రల శాఖ','స్వీయ ప్రచార శాఖ', 'బురద జల్లుడు శాఖ'... అబ్బో చాలా ఉంటాయి. అప్పుడు చాలామందికి పదవులూ దక్కుతాయి, అసంతృప్తులూ ఆగుతాయి.

అయితే గియితే ఇలాంటి సమూల వినూత్న విప్లవాత్మక మార్పులు తెచ్చే దిశగా ఆలోచించాలి కాని, వూరికే వేదికలెక్కి 'మార్పు' గురించి ఎంత చెప్పినా దండగే. ఏతావతా ప్రజలు కూడా సరైన మార్పు గురించి ఆలోచిస్తే మటుకు ఈ రాజకీయ నాయకుల ప్రయత్నాలు ఏమవుతాయని ఎవరైనా అడిగితే, వాళ్లతో మాట్లాడకపోవడమే మేలు. ఎందుకంటే వాళ్లు నిజమైన మేధావులు మరి!



PUBLISHED IN EENADU ON 07.11.2012

ఆదివారం, నవంబర్ 04, 2012

ప్రేమాయణం లో పదనసలు



నా చేతిలో తన చేయి... మెత్తని స్పర్శ... బిగుసుకున్న వేళ్లలో దగ్గరితనం... గుండెల నిండా వెచ్చని ఉపిరి...
పెళ్లి ఇంత ఉత్సాహాన్ని నింపు తుందా మనసులో? ఒక తోడు ఇంత ధీమాని  ఇస్తుందా?

ఇద్దరం సెలయేటి తరగల్లా గుడి చుట్టూ తిరిగి కోనేరు మెట్ల మీదకి వచ్చాం. ఒకర్నొకరం  చూసుకున్నాం.

అంతే... ఒక్కసారిగా   కూడబలుక్కున్నట్టు  ఫక్కుమని నవ్వేశాం. అలా ఎందుకు నవ్వుకున్నామో ఆ కోనేరు మెట్లకు తెలుసు. అలల తాకిడికి కదిలే తామరాకులకు తెలుసు.

తను మెట్ల మీద చేతులు రెండూ మోకాళ్ళకు బిగించి ఒద్దికగా కూర్చుంది. ఆరు నెలల క్రితం తనను ఇక్కడే, ఇలాగే కూర్చుని ఉండగా చూసిన జ్ఞాపకం ఇంకా నాలో తాజాగానే ఉంది. అప్పుడేగా నాలో అలజడి రేగింది? ఆ అలజడేగా గుడి చుట్టూ ప్రదిక్షిణలు చేయించింది? ఆ మెతో మాట్లాడించింది?  అమ్మానాన్నల్ని వాళ్ళింటికి పంపించి నిశ్చితార్ధం వరకూ లాక్కొచ్చిం ది?
జ్ఞాపకాల మధ్య తనకేసి చుస్తే తను కొంటెగా నవ్వుతోంది. ఎందుకు నవ్వుతోందో నాకు అర్థమై చటుక్కున చేయి ఎత్తాను, కొట్టబోతున్నట్టు! తల వెనక్కి వాల్చేసి తెరలు తెరలుగా నవ్వేసింది.

నాకు ఆ క్షణంలో మనోహర్ గుర్తొచ్చాడు. వాడే కదూ, మా నిశ్చితార్థానికి, పెళ్ళి ముహూర్తానికి ఉన్న మూడు నెలల వ్యవధిలో మా మధ్య తుపాను రేపింది?  రోజూ సాయం సంధ్యల్లో కోనేటి మెట్ల మీద అందంగా సాగిపోతున్న మా ముచ్చట్లని ముప్పుతిప్పలు పెట్టింది?

'కాబోయే శ్రీమతిని అంచనా వేయాలంటే ఇలాంటి చిట్కాలే ఉపయోగించాల్రా ... సరదాకే కదా? ఊ... ప్రొసీడ్ ' అంటూ మనోహర్ కిర్రెక్కిస్తే మాత్రం, నేను వినాలని ఎక్కడుంది?

ఇదిగో ఈ కోనేరు మెట్ల మీదే మొదలు పెట్టాను సొద...

'నీతో ఒక సంగతి చెప్పాలి'... నా గొంతు నాకే కొత్తగా వినిపించింది.

'చెప్పండి' అంది తను ఇదిగో ఇలాగే కూర్చుని.

'నువ్వు పరిచయం కాక ముందు నేనొక అమ్మాయిని ప్రేమించాను...'

తను చివ్వున తలెత్తింది.  అది పట్టించుకోకుండా చెప్పుకు పోయాను.

'పేరు కల్పన. నిజానికి నీకన్నా బాగుంటుంది. మన నిశ్చితార్థం తర్వాత ఇలా ఆమె గురించి నీకు చెప్పడం నాకూ ఇబ్బందిగానే ఉంది కానీ...'

కాసేపు మౌనం. తను నెమ్మదిగా గొంతు పెగల్చుకుని అడిగింది.

'మరెందుకు పెళ్లి చేసుకోలేదు?'

'ఇంటిలో ప్రోబ్లం. మా కులం కాదు. పాపం... కల్పన. పారిపోదామని కూడా ప్రొపోజ్ చేసింది. నాకే ధైర్యం చాలలేదు'
భలేగా నటించాను. ఓ పక్క నవ్వు వస్తున్నా గొంతులో గాంభీర్యాన్ని ప్రదర్శిం చాను. తను ఏమీ మాట్లాడలేదు.

'నా మీద కోపంగా ఉంది కదూ?' నెమ్మదిగా అడిగాను.

'కోపమా? ఎందుకు? మీ నిజాయితీ నాకు నచ్చింది. ఇంతకీ మన పెళ్ళికి కల్పనని పిలుస్తున్నారా లేదా?' అంది తను చాలా తేలిగ్గా.
తెల్లబోవడం నా వంతు అయింది.

ఇదంతా చెబితే మనోహర్ గాడు నవ్వేసాడు. 'ఒరేయ్... మంచి క్లారిటీ ఉన్న అమ్మాయిని చెసుకుం టున్నావురా. యు ఆర్ లక్కీ' అంటే అప్పటికి పొంగిపోయాను.

ఆ తర్వాతే మొదలైంది అసలు కథ.  తను వరసగా నాలుగు రోజులి గుడికి రాలేదు. కోనేరు చిన్నబోయిం ది, నా మనసులాగే.
ఒకవేళ పాపం బాధ పడుతోందా? చెల్లి చేత కబురంపితే ఆ మరునాడు వచ్చింది. మౌనంగా... భారంగా...

వచ్చి కూర్చుంది, మోకాళ్ళలో తల దాచుకుని.

నాకు చాలా జాలి వేసింది. 'ఐ యాం సారీ... అసలు నీకు చెప్పకూడదనే అనుకున్నాను...'

తను తలెత్తింది. కళ్ళ నిండా నీళ్ళు...

'నన్ను క్షమిచండి... మీ నిజాయితీ తెలిశాక కూడా నేను మీకు వినోద్ గురించి చెప్పకపోతే అది నిజంగా చీటింగే..'
ఆమె వెక్కుతోంది...

'వినోదా? వాడు ఎవడు?' ... నా గొంతులో ఎదో అడ్డుపడింది.

'డిగ్రీ లో నా క్లాస్ మేట్. ఇద్దరం ప్రేమిచుకున్నాం. ఎన్నో ఉత్తరాలు రాసుకున్నాం. ఇంట్లో తెలిసి చదువు మానిపించారు... అన్నయ్య వెళ్లి వినోద్ ని కొట్టి, నేను రాసిన ఉత్తరాలు అన్నీ తెచ్చేసాడు. పాపం...వినోద్... మర్నాడే ఆత్మహత్య చేసుకున్నాడు...' అంటూ ఉత్తరాల కట్ట నా చేతుల్లో పెట్టేసి ఏడుస్తూ వెళ్ళిపోయింది.

నా గుండెల్లో ఏదో  కలుక్కుమంది. కోనేటి అందం అంతా చీకట్లో కలిసి పోయింది.

ఆ ఉత్తరాలన్నీ నేను, మనోహర్ చదివాం. నా రక్తం ఉడి కిపో యింది.

'పెళ్లి రద్దు చేద్దాం అనుకుంటున్నాను'  అన్నాను.

మనోహర్ తిట్టాడు. 'పెళ్ళికి నాలుగు రోజుల ముందు ఏమిటిది? నీ కేమైనా పిచ్చా?'

ఏడిసాడు ... నా బాధ వాడికేం తెలుసు?...

'ఒకవేళ ఆ వినోద్ గురించి తను నీకేమీ చెప్పనే లేదనుకో... నువ్వు హ్యాపీగా? ఎప్పటికీ దాచేసే అవకాసం ఉన్నా, తను ఎంత నిజాయితీగా ఉత్తరాలు తెచ్చి ఇచ్చింది?... అది ఎందుకు అర్థం చేసుకోవు? ఎప్పుడైతే నీకు అంతా చెప్పేసిందో, ఆ వినోద్ జ్ఞాపకాలు ఆమె తుడిచేసిమ్దని అర్థం' అంటూ నచ్చ చెప్పాడు. పైగా చేసేదేమీ లేదు.  బంధువులంతా వచ్చేసారు. గుండెల్లో బాధ అలాగే ఉంది. చేతులు మాత్రం ఎలాగో తాళి కట్టాయి.

నిన్ననే తోలి రేయి. ప్రతి వారికి అది మధురం.. నాకు మాత్రం విషం.

పాల గ్లాసుతో తను వస్తూనే అడిగింది. 'కల్పన  పెళ్ళికి రాలేదా?'

అప్పుడు కట్టలు తెంచుకుంది నా కోపం....

'అసలు కల్పనంటూ  ఉంటే గా? ఏదో సరదాకి చెప్పానంతే... నీలా వెధవ ప్రేమాయణం నాకు లేదు'... పాల గ్లాసు విసిరి కొట్టాను.

అప్పుడు నవ్వింది తను... కడలి పో టెత్తి నట్టు!

నాకేమీ అర్థం కాలేదు. తనే చెప్పింది.

'మనోహర్ చెల్లెలు మీ మాటలు విని నాకు ముందే చెప్పేసింది. అందుకే మీరు కల్పన గురించి చెబితే నేనేమీ అన లేదు. మరి నేనూ ఇవ్వాలిగా రిటార్డు? అందుకే నాలుగు రోజులు కాస్తపడి రాసాను వినోద్ రాసినట్టుగా ఉత్తరాలు..'

'అంటే?' అన్నాను నేను అయోమయంగా!

'అంటే.... కల్పన మీ కల్పన అయితే, వినోద్ నా వినోదం...' అంటూ నవ్వుతునే ఉంది.  వెన్నెల చిన్నబోయే ట్టు... మల్లెలు తెల్లబోయే ట్టు...!!!


  (ఈనాడు ఈతరంలో ప్రచురితం)



గురువారం, అక్టోబర్ 25, 2012

మూగబోయిన కలం



(ఎప్పుడో చిన్నప్పుడు రాసిన కవిత)


కాగితాన్ని చూడగానె రాయాలని ఉబలాటం...
మనసులోని భావాలను కక్కాలని ఆరాటం...

రాయాలని ఉత్సాహం మది నిండా ఉన్నా,
భావాలను వ్యక్తపరుచు సామర్థ్యం సున్నా

ఏదో ఒక కవిత్వాన్ని రాసేయాలి...
నాలో గల నవత్వాన్ని చూపించాలి...

ఒక్కసారి ఉరికింది నాలో గల ఆవేశం...
కళపెళమని మరిగింది నాలోపలి రక్తం

కలంపట్టి, కాగితాన్ని చేతబట్టి...
పట్టుపట్టి రాయాలని పట్టుబట్టి కూర్చున్నా...

అంతలోనె అంతరాత్మ నన్ను చూసి నవ్వింది...
అంతావేశం వద్దని నెమ్మదిగా ఇలా అంది...

నీకెందుకు బాలుడా రాయాలని ఉబలాటం?
రాయలేని నీకెందుకు లేనిపోని ఝంఝాటం?

చీకటినే చూడలేని నీకెందుకు కవిత్వం?
జీవితాన్ని వడబోయక నీకు రాదు నవత్వం...

అంతరాత్మ మాటలోని పచ్చి నిజం చూశా...
క్షణమైనా యోచించక పెన్ను క్యాప్ మూశా









శుక్రవారం, అక్టోబర్ 19, 2012

నేతలు... నీతులు!


నేతలు... నీతులు!



'న...హ...మ...హ...స్కారం గురూగారూ!'
'ఏంట్రోయ్‌? అంతలా నవ్వుతా వత్తన్నావ్‌? నీమీద ఎవురైనా అవినీతి ఆరోపణలేవైనా సేసారా?'
'అదేంటండి అలాగనేశారు? అవినీతి ఆరోపణలు చేస్తే బాధపడతాం కానీ నవ్వుతామేంటండి...'

'వూరుకోరా... ఆరోపణలకి బాధపడేంత సత్తెవంతుడవుగాదని నాకు తెలుసులే. మహా అయితే, ఎలా తెల్సిపోయిందబ్బా అని ఆచ్చర్యపోతావ్‌, ఆనక ఎట్టా తిప్పికొట్టాలా అని దారులెతుకుతావ్‌ అంతేగా?'

'అయ్యా! మనిషిని కాక వాడి ఎక్స్‌రేని నేరుగా చూసే శక్తి మీ కళ్లకుందని మర్చిపోయి మాట్లాడాను. మన్నించండి. కానీ, ఆరోపణలకు, నవ్వులకు సంబంధమేమిటా అని తన్నుకు చస్తున్నా...'

'ఏముందిరా... ఇన్నేల్లుగా నాకాడ రాజకీయం నేర్సుకుంటున్నావు కాబట్టి ఇదో కొత్త పాటమనుకో. నువు సేసిన అవినీతి పన్లని పసిగట్టి ఆటినెవుడైనా బయటెడితే వూరికే మొగం కందగడ్డ లాగెట్టుకుని ఆవేశపడిపోకండా నీకు వత్తాసు పలికే వోల్లని పోగేసి, ఆల్లసేత పెత్రికలవోళ్లని పిలిపించి జోకులేయించాల. నిన్నటికి నిన్న కేంద్ర మంతిరి గోరిలాగన్నమాట...

'అంటే... కేంద్ర న్యాయశాఖ మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌ మీద వచ్చిన ఆరోపణల గురించే కదండీ మీరు చెబుతున్నది. ఆయనగారు నడిపే వికలాంగుల ట్రస్టు ద్వారా 71 లక్షల రూపాయల మేర అవకతవకలు జరిగాయని విన్నానండి...'

'అదేరా మరి నీకూ నాకూ తేడా. నువ్విట్టాంటి యవ్వారాల గురించి తెలీగానే అవకాసమొత్తే ఎలా సేయాలో అంచనాకొత్తావు. నేనయితే అయి సెప్పే రాజకీయ పాటాలు ఏటాని ఆలోసిత్తాను...'

'అవున్సార్‌! అందుకే కదండీ, అడపాదడపా తమ దర్శనం చేసుకుంటుంట. మరిందులో పాఠం ఏంటండీ?'

'మరాయన్ని ఎనకేసుకొత్తా ఆయనగోరి సతీమణి, తోటి మంతిరిగోర్లు ఎట్టాంటి జోకులు పేల్చేరో కానుకోలేదా? పెల్లామంటే ఆవిడే మరి. ఆ కేజిరీవాల్‌ సెప్పేదంతా వట్టి జోకులని తేల్చేయలేదూ? ఆ మాటతో అవకతవకలన్నీ ఆసికాలైపోలేదూ? అంటే, ఎవుడైనా ఆరోపణలు సేసాడనుకో, అయ్యన్నీ కడుపుబ్బ నవ్వేసే కులాసా కబుర్లన్నట్టు సూడాలన్నమాట. కావాలంటే పెత్రికలోల్ల ముందు పగలబడి నవ్వేయాల. అప్పుడాల్లంతా బిత్తరపోయి సెప్పింది రాసుకుపోతారు. ఏటంటావ్‌?'

'అనేదేముందండి, ఇంతబాగా చెప్పాక! వెధవది ఇలాంటి ఆరోపణలు రోజుకోటి వస్తున్నాయండి. ఇంకా ఎలా ఎదుర్కోవాలో చెబుదురూ...'

'ఈ యవ్వారంలోనే ఆ కేంద్రమంతిరిగోరి తోటి మంతిరి ప్రెసాదవరమగోరు ఎంత బాగా సెలవిచ్చారో సూడలేదా? అన్నన్నన్నా... ఎంత మాట? కుర్సీద్‌గోరేంటీ, ఆయన తాహతేంటీ, కేవలం ముష్టి డెబ్బయ్యొక్క లచ్చలకి కక్కుర్తి పడతారా? ఎంత నామర్దా, ఎంత సిగ్గుసేటు? అదే ఏ డెబ్బయ్యొక్క కోట్లో అయితే ఆలోసించాలిగానీ... అంటూ రెచ్చిపోలేదూ?'

'అవునండోయ్‌. స్వయానా మరో కేంద్రమంత్రి అయి ఉండీ, ఆయనిలా మాట్లాడ్డం తప్పు కదండి? కావాలంటే కాదనాలి కానీ ఇదేం వాదనండి...'

'వార్నీ! నువ్వేదో కాసింతో, కూసింతో ఎదిగుంటావులే అనే బ్రమలో ఉన్నారా ఇన్నాల్లూనూ. ఇప్పుడు తెలత్తాంది, నీకింకా రాజకీయం ఒంటబట్టలేదని. రాజకీయాల్లో సమర్దింపులు, బుకాయింపులు, తిప్పికొట్టడాలు, తిట్టడాలు, మొండికెత్తడాలే ఉంటాయి కానీ తప్పుల గురించి తల్లడిల్లడాలుండవు. ఇలా అడపాదడపా రాజకీయ ముసుగులోంచి బయటికొచ్చేసి, నికార్సయిన మనిసిలా ఆలోసించావనుకో ఎప్పుడోపాలి పెద్ద దెబ్బ తింటావు మరి...'

'బుద్ధొచ్చిందండి బాబూ తిట్టకండి. అయినా కానీ ఈ రోజుల్లో అవినీతంటే కోట్లకు కోట్లు గుర్తొస్తున్నాయికానీ వెధవది ఈ లక్షలేంటండి? అసలిలాంటి ఆరోపణల్ని ప్రజలు కూడా పట్టించుకుంటారా అని నా అనుమానమండి...'

'ఏడిశావ్‌లే! పెజానీకాన్నెప్పుడూ తేలిగ్గా సూడమాక. ఓటు ముద్దర్లప్పుడు ఓటి కుండలా మిగిలిపోతావ్‌. మన సూపంతా ఆల్ల మాటల్ని తేలికసేయడం మీదే ఉండాల. కానయితే ఇందులో అవినీతినిబట్టి కొన్ని బిరుదులు, అవార్డులు గట్రా నేతలకివ్వచ్చేమోనని తడుతోందిరా. ఉదారనకి పెద్ద పదవిలో ఉండి కేవలం లచ్చల్లో నొక్కేసాడని తెలీగానే 'వట్టి అమాయక సెక్రవర్తి' అనో, 'పిచ్చిమాలోకం' అనో పేరెట్టచ్చేమో. ఉన్న నేతల్లో అందరికన్నా తక్కువ తిన్నోడే నీతున్నోడని జనం జేజేలు పలికే రోజులొత్తాయేమో మరి. మన నాయకుల యవ్వారాలు సూత్తే అట్టాగే ఉన్నాయి మరి. ఏటంటావ్‌?'

'అద్భుతం సార్‌! మీ శిష్యుడిగా అలాంటి నేతల్లో ఒకడిగా ఎదగాలనేదే నా ఆకాంక్ష. అందుకు మీ ఆశీర్వచనం కావాలి'

'ఆటికేంలే... అయ్యెప్పుడూ ఉంటాయి కానీ, నువుసేసె యదవపన్ల ఇలువ ఇలువ కోటికి తగ్గితే మాత్రం నిన్ను గుమ్మం ఎక్కనీయన్రో... అది కానుకుని మసలుకో. ఇక పోయిరా మరి!'


PUBLISHED IN EENADU ON 19.10.2012

శుక్రవారం, అక్టోబర్ 12, 2012


పెద్దింటి అల్లుళ్లు 





'అల్లుడెందుకొచ్చాడు? 
అప్పాలు తినడానికొచ్చాడు! 
కూతురెందుకొచ్చింది? 
కుడుములు తినడానికొచ్చింది!'

 అనే పాట దసరా రోజుల్లోనే పాడుకోనక్కర్లేదు. సరదాగా ఉన్నా పాడుకోవచ్చు. పాట పాడినంత మాత్రాన అందరికీ ఇలాంటి సరదాలూ తీరవు. ఏ పాటలూ పాడకపోయినా కొందరికి ఈ సరదాలొచ్చి ఒళ్లో వాలతాయి. పెట్టి పుట్టడమంటే అదే. పెట్టి పుట్టకపోయినా, పుట్టి సాధిస్తున్నవారి గురించి పాడుకుంటే అదో సరదా. వూరికే బాధపడుతూ కూర్చుంటే ఏం లాభం?

అప్పాలు తిన్న అల్లుడుగారు అరుగుమీద పడక్కుర్చీలో కూర్చుని పండగ చేసుకుంటుంటే చూసి ఉడుక్కోవడంలో అర్థం లేదు. ఆయనగారి అదృష్టానికి జోహార్లర్పించే విశాల దృక్పథాన్ని అలవరచుకోవాలి. అత్తగారి సొత్తుమీద అల్లుడికి కాక ఇంకెవరికి హక్కుంటుంది? అసలామాటకొస్తే, పాపం పండక్కొచ్చి అప్పాలు తినే అల్లుళ్లంతా వట్టి అమాయకుల కిందే లెక్క. ఒకటికి రెండు వడ్డిస్తేనే ఆనందపడి ఆరగించి ఆపై ఆయాసపడి అరాయించుకోలేక ఆపసోపాలు పడతారు. ఇలాంటి అల్లాటప్పా అల్లుళ్లను మించిపోయే గొప్ప గొప్ప అల్లుళ్లు చాలామంది ఉన్నారు. అదృష్టమంటే వాళ్లదీ!

సోదాహరణంగా చెప్పాలంటే ఢిల్లీ అల్లుడి హరికథ, ఆంధ్రా అల్లుడి బుర్రకథ వినాలి. ఒక్కసారి వాళ్లకేసి చూస్తే అటు అత్తగారి గొప్పదనం, ఇటు మామగారి ఘరానాతనం అర్థమవుతాయి. అత్తసొత్తు అల్లుడి దానమంటూ సామెతలు చెబుతారు కానీ, అల్లుడికి తన సొత్తే కాకుండా ప్రజల సొత్తునూ దానంచేసే అత్త చరిత్ర తెలుసుకుంటే జన్మ తరిస్తుంది. అధికారాన్ని అడ్డంపెట్టుకుని అల్లుడిగారికి గనులూ గట్రా కట్టబెట్టిన మామ పురాణం పారాయణచేస్తే పురుషార్థమంటే ఏమిటో తేటతెల్లమవుతుంది.

కాబట్టి, అల్లుళ్లందరూ ఇప్పటికైనా కళ్లు తెరుచుకుని వచ్చే జన్మలోనైనా రాజకీయాల్లో చక్రం తిప్పే అత్తమామలు దొరకాలని వ్రతాలేమైనా ఉన్నాయేమో వాకబు చేసుకుని, చేసుకుంటే మంచింది.

'ఆది లక్ష్మి వంటి అత్తగారివమ్మా...

సేవలంది మాకు వరములీయవమ్మ...' - అంటూ పాటలు గట్రా ఇప్పటి నుంచే కంఠతా పట్టుకోవడం మేలు. పదిమంది అల్లుళ్లను పేరంటానికి పిలిచి యథాశక్తి వాయినాలిచ్చుకుంటే ఢిల్లీలో అధికార పీఠాన్ని అదృశ్యంగా అజమాయిషీచేసే ఘరానా అత్తగారు దొరికే అవకాశాలు మెరుగుపడతాయి. అప్పుడు ఎంచక్కా దేశంలోని భూముల్నే అప్పాల్లాగా అప్పనంగా ఆరగించవచ్చు. ఆరోపణలు వెల్లువెత్తినా అమాయకంగా అరాయించుకోనూ వచ్చు. నోరు విప్పాల్సిన పని కూడా లేదు. అవసరమైతే అల్లుడిగారిని వేలెత్తి చూపే దుస్సాహసగాళ్లపై దుమ్మెత్తి పోయడానికి అత్తగారి హయాములో అమాత్యులంతా మూకుమ్మడిగా సిద్ధంగా ఉంటారు. ఈలోగా ప్రజాశ్రేయం కోసం కేటాయించిన భూముల్ని ఎకరాలకు ఎకరాలు కొనడం, ఆనక అమ్మినవాళ్లకే అమ్మడం, వడ్డీలేని రుణాలు పొందడం, ఆస్తులు పెంచుకోవడం, పెంచుకున్నవి లెక్కెట్టుకోవడం, లెక్కెట్టుకున్నవి దాచుకోవడం, దాచుకున్నవి దక్కించుకోవడం లాంటి పనులు తిరగామరగా చేస్తూ 'తార్‌మార్‌ తక్కిడమార్‌... ఎక్కడి దొంగలు అక్కడేే గప్‌చిప్‌' అంటూ ఆటలాడుకోవచ్చు.

ఇలాంటి చిత్రవిచిత్ర లీలావిన్యాసాలతో సాగిపోయే ఢిల్లీ అల్లుడి హరికథ వింటుంటే ఎవరికైనా సరే ఒళ్లు పులకించి, రోమాంచితమై 'అత్తగారూ మీరు వాసిగలవారు... అల్లుడింట్లో సిరుల రాసిపోశారు...' అని పాడుకోకుండా ఉండగలరా? కొండొకచో ఒకరిద్దరు కళ్లెర్రజేసి 'అల్లుడు చేసిన గిల్లుడి పనులకు అత్తగారిని ఆడిపోసుకుంటారేం?' అని కోప్పడినా దేశవాసులందరూ కితకితలు పెట్టినట్టు నవ్వుకుంటారు. ఎందుకంటే ఆవిడగారి అధికార ఛత్రం నీడంటూ లేకపోతే అంత అడ్డగోలుగా ఆస్తుల అప్పాలు అల్లుడిగారి విస్తట్లో వడ్డిస్తారా అనే ఇంగితజ్ఞానం అంతో ఇంతో అందరికీ ఉంది మరి!

కాబట్టి, ఇలాంటి అత్తా అల్లుళ్ల గురించి పాటలు పాడుకుంటూ ముందు ముందు ఆడవాళ్లంతా 'అల్లుడు లేని అత్త ఉత్తమురాలూ ఓయమ్మా... అత్తలేని అల్లుడు వట్టి వాజమ్మా... ఆహుం... ఆహుం...' అంటూ కారాలూ అవీ దంచుకోవచ్చు!

ఢిల్లీ హరికథనుంచి ఆంధ్రా బుర్రకథ దగ్గరకి వస్తే మామగారి జమానా జబర్దస్తీ జమాయింపు కళ్లముందు కదలాడుతుంది. తవ్వినకొద్దీ గనుల కథలు జ్ఞాపకాల్లో ఊరుతూ కంచికి చేరకుండా కవ్విస్తూనే ఉంటాయి. 'మామగారి మనసు బంగారం...

ఆయన చేతిలో అధికారం...

అల్లుడిగారి కొంగుబంగారం...' లాంటి పాటలు పాడుకోవాలనిపిస్తుంది.

ఏతావతా చెప్పుకోవాలంటే ఏడిస్తే ఇలాంటి అల్లుళ్ల అదృష్టానికి ఏడవాలి కానీ, పాపం అప్పాలు తినే అమాయకపు అల్లుళ్ల మీద పాటలు పాడ్డం మహా ఘోరం. అయినా అధికారంతో ఆటలాడగలిగే నాయకమ్మన్యులుండాలే కానీ ఒక్క అల్లుళ్లేం ఖర్మ- కొడుకులు, కూతుళ్లు, అయినవాళ్లు అందరూ తరించిపోరూ!

రాష్ట్రంలో రంగేళీ రాజాగారి కంగాళీ కథాకళిని మరిచిపోగలమా? ఆయనగారి కొడుకులుంగారి పనులింకా ఎవరికీ కొరుకుడు పడ్డమే లేదు. 'ఓ నాన్నా... నీ మనసే వెన్న...' అంటూ అతగాడు అలుపెరగకుండా పాడుకునేంతగా ప్రజల భూములు ఎవరెవరికో ధారాదత్తమై, వాళ్లనుంచి పెట్టుబడులు ఇబ్బడిముబ్బడిగా ఇంట్లోకొచ్చి వాలలేదూ?

దానాదీనా ఒక్క విషయం అర్థం చేసుకుంటే మంచిది. రాజకీయ రాబందుల బంధుజనుల విందువినోద వికృత కృత్యాల గురించి తలచుకుంటే మనసు వికలం కావడం తథ్యం. అందువల్ల ఆ మాటెత్తకుండా, నోరెత్తకుండా పడి ఉంటే అందరికీ ఆరోగ్యం!

PUBLISHED IN EENADU ON 12.10.2012

మంగళవారం, అక్టోబర్ 02, 2012

అప్పారావూ... అతడి భాష!



అప్పారావు కరడు కట్టిన పాత్రికేయుడు. పాత్రికేయం అతడి నరనరానా వంటబట్టేసింది. అసలు పుడుతూనే కలం పట్టుకుని పుట్టేడేమో తెలియదు. మంత్రసానిని కనుక్కోవాలి. బుల్లి గుప్పెట్లో గట్టిగా పట్టుకున్న సదరు కలం పదును చూసి ఆవిడ ముచ్చటపడి బొడ్డు కోసేముందే తన బొడ్లో దోపేసి ఉంటే ఆ నిజం బయటకు రాకపోవచ్చు. మొత్తం మీద చిన్నప్పటి నుంచీ అప్పారావు అలాంటి బుద్ధులే చూపించాడు. దినపత్రిక చూపిస్తే కానీ గోరుముద్దకు నోరు జాపేవాడు కాదు. టీవీలో వార్తలు పెడితే కానీ అన్నం తినేవాడు కాదు. పైగా బాల్యం నుంచీ సామాజిక స్పృహ ఎక్కువేనేమో కూడా. ఎందుకంటే మనవాడు మారాం లేకుండా తినాలంటే ఆరోజు వార్తల్లో దారుణాలు జరిగి ఉండాలి. భూకంపాలో, వరదలో, సునామీలో వస్తే గుటుకూ గుటుకూ ముద్దలు మింగేసేవాడు. వాళ్లమ్మ రోజూ దినపత్రిక తిరగేస్తూ, టీవీ మీట నొక్కుతూ, 'భగవంతుడా! ఏదైనా ఉత్పాతం జరిగేలా చూడు తండ్రీ!' అని కోరుకునేది.

బడిలో కూడా అంతే. పలక మీద అక్షరాలు ఇష్టం వచ్చినట్టు రాశేసేవాడు. మాస్టారు గతుక్కుమన్నారు. ఆనక ఆరా తీస్తే తెలిసింది. అప్పారావు అమ్మ రచయిత్రి. నాన్న విలేకరి. ఇద్దరూ ఇష్టం వచ్చిన రాతలు రాసేవారే. మరి ఆ బుద్ధులు ఎక్కడికి పోతాయి? దరిమిలా అప్పారావు చాలా చురుగ్గా ఎదిగాడు. పత్రికలన్నీ చదివేసేవాడు. వార్తలే వల్లెవేసేవాడు. వార్తా ప్రసారాలే చూసేవాడు.

ఓసారి పరీక్షలో న్యూటన్ గమన సూత్రాలను రాయమన్నారు. విశ్వంలో ఏదైనా స్థితిని మార్చుకోవాలంటే బాహ్యబలం పనిచేయాలని న్యూటన్ చెబితే, మనవాడు ఈ విశ్వంలో ఏ వార్త పుట్టాలన్నా కలం బలం ఉండాల్సిందేనన్నాడు. దేని త్వరణమైనా బలానికి అనులోమానుపాతంలోను, ద్రవ్యరాశికి విలోమానుపాతంలోను ఉంటుందని ఆయన చెబితే, మనవాడు ఏ వార్త వేగమైనా పత్రిక సిద్ధాంతానికి అనులోమానుపాతంగాను, రాద్ధాంతానికి విలోమానుపాతంలోను ఉంటుందని నిర్వచించాడు. ప్రతి చర్యకూ ప్రతిచర్య ఉంటుందని ఆయన చెబితే, మనవాడు ప్రతి వార్తకు ఖండన ఉంటుందని రాశాడు. మాస్టారు మొదట తెల్లబోయారు. తర్వాత తేరుకుని అడ్డంగా కొట్టేస్తే అప్పారావు తరగతిలోనే బైఠాయించాడు. ప్రధానోపాధ్యాయుడికి ఫిర్యాదు చేశాడు. విద్యాధికారికి వినతి పత్రం సమర్పించాడు.

'నేను సమాధానాన్ని సృజనాత్మకంగా రాయడం జరిగింది. దాన్ని మాస్టారు గ్రహించక పోవడం జరిగింది. కాబట్టి నాకు అన్యాయం జరిగింది. మీరు ఈ విషయంలో జోక్యం చేసుకోవడం జరిగితే, నాకు న్యాయం జరిగి, నేను ఆనందించడం జరుగుతుంది. ఇవన్నీ జరిగే వరకు తరగతి నుంచి జరగనని నేను శపథం చేయడం జరిగిందని మీరు గ్రహించడం జరగకపోతే నాకు మార్కులు రావడం జరగదు' అని రాశాడు.

ఆ భాషాప్రయోగానికి ప్రధానోపాధ్యాయుడి కళ్లు తిరిగాయి. విద్యాధికారికి కడుపులో తిప్పింది. తల్లిదండ్రుల్ని పిలిచి మాట్లాడారు. వాళ్లు అంతావిని 'వీడు ఇంట్లో కూడా ఇలాగే మాట్లాడుతున్నాడు. ఏం చేయాలో ఏంటో?' అన్నారు అయోమయంగా. పక్కనే ఉన్న అప్పారావు విసురుగా కుర్చీలోంచి లేచి, 'మీ వ్యాఖ్యలను నేను ఖండిస్తున్నాను. వాటిని వెంటనే ఉపసంహరించుకోండి' అన్నాడు. అందరూ తలలు పట్టుకున్నారు.

ఆపై అమ్మానాన్నా ఎంత చెప్పినా అప్పారావు వినలేదు. చక్కని తెలుగు చదివి వినిపిస్తే చెవులు మూసుకునేవాడు. దినపత్రికల్లోనే తేట తెలుగు వాక్యాలతో ఉన్న వార్తల్ని, భాష మీద మంచి ప్రయోగాలు చేసే పత్రికల్ని ఇచ్చినా కన్నెత్తి చూసేవాడు కాదు. తనకు నచ్చిన పత్రికాభాషలోనే మాట్లాడేవాడు. నచ్చచెప్పాలని చూస్తే, 'నాకు తోచినట్టు మాట్లాడ్డం నా ప్రాథమిక హక్కు. దాన్ని కాలరాయాలని చూస్తే సహించేది లేదని మిమ్మల్ని చివరిసారిగా హెచ్చరిస్తున్నాను' అనేశాడు. ఆపై అమ్మానాన్నా నోరెత్తితే ఒట్టు.

అలాంటి అప్పారావు ఎదుగుతున్న కొద్దీ మరింత కరడుకట్టేశాడు. తెలుగు ఇలా కూడా మాట్లాడవచ్చా అనే సందేహం కలిగేలా మాట్లాడేవాడు. పాపం... అతనికి స్నేహితులు కూడా లేరు. కారణం అతడి భాషే. ఓసారి ఓ స్నేహతుడు అప్పారావుని సినిమాకి తీసుకెళ్లాడు. చివర్లో 'ఎలా ఉందిరా?' అని అడిగితే, 'ఇలాంటి సినిమా నాకు నచ్చుతుందని నువ్వు భావిస్తే, నువ్వెంత హీన స్థితిలో ఉన్నావో అని నేను అనుకుంటాననే విషయం నీకు తోచనందుకు నేను ఆశ్చర్యపోతానని నువ్వెందుకు గ్రహించడం లేదు?' అన్నాడు. ఆ స్నేహితుడు రోడ్డు మీదే కళ్లు తిరిగి పడిపోయాడు. చుట్టుపక్కల వాళ్లు మొహం మీద సోడానీళ్లు కొట్టి సేదతీర్చి ఇంటికి పంపారు. ఆపై అతడు అప్పారావు ఇంటి ఛాయలకు కూడా రావడం మానేశాడు. అతడే అప్పారావు చిట్టచివరి స్నేహితుడు.

చదువైపోపోగానే ఇక అప్పారావు సమయాన్ని వృథా చేయదలుచుకోలేదు. వెంటనే బజార్లోకెళ్లి ఓ పెద్ద కంకణం కొనుక్కుని ఇంటికి వచ్చాడు. అమ్మ అదేంట్రా అని అడిగితే, 'పాత్రికేయ వృత్తిలో ప్రవేశించి సమాజాన్ని ఉద్ధరించాలని కంకణం కట్టుకున్నానమ్మా! అదే ఇది. నను కన్న మాతృమూర్తిగా ఆశీర్వదించి పంపితే, పీడిత తాడిత ప్రజలకు చేయూతనై, అణచివేత వల్ల అణగారిన బతుకులకు ఆశాదీపాన్నై వెలుగొందుతా' అన్నాడు ఆవేశంగా. అమ్మ నీరసంగా చెయ్యెత్తగానే బయటకి పరిగెత్తాడు. ఓ దినపత్రిక కార్యాలయానికి వెళ్లి సంపాదకుడిని కలిశాడు.

'నాలో రక్తం లేదు. పాత్రికేయమే ప్రవహిస్తోంది. నరనరానా అక్షర కణాలు అగ్ని విస్ఫోటనాలై ప్రజ్వరిల్లుతున్నాయి' అన్నాడు.

ఆయన ఎగాదిగా చూసి, 'కణాలు విస్ఫోటనాలవుతున్నాయా? క్యాన్సరేమో చూపించుకో నాయనా!' అని పంపేశాడు.

ఇది కాదు పనని దస్తాడు కాగితాలు తెచ్చుకుని దినపత్రికలకు ధరకాస్తులు పంపాడు. చాలా మంది చురుకైన సంపాదకులు చటుక్కున ప్రమాదాన్ని శంకించి, ఉండ చుట్టి చెత్త బుట్టలో పడేయడం వల్ల బతికిపోయారు. కొంత మంది పాపం పూర్తిగా చదివి అస్వస్థతకు గురయ్యారు. అనుకున్నది అందక తిక్కరేగిన అప్పారావు, ఇంట్లో దినపత్రికలన్నీ చింపి పడవలు చేస్తుండడంతో నాన్న భరించలేక తనకు తెలిసున్న సంపాదకుడికి సిఫార్సులేఖ రాశాడు. 'వాడిని ఎక్కడో అక్కడ కూర్చోబెట్టండి. ఏదో ఒకటి రాయనివ్వండి. వేస్తే వేయండి, లేకపోతే లేదు. నేను నెలనెలా కొంత మొత్తం పంపుతాను. దాన్నే జీతంగా ఇవ్వండి' అంటూ ఏకరువు పెట్టుకున్నాడు. మర్నాడు ఆ పత్రిక కార్యాలయం నుంచి ఉత్తరం వస్తే అప్పారావు అశ్వనీ నాచప్పలా పరుగెత్తుకుంటూ వెళ్లి సంపాదకుడితో, 'నాలోని ప్రతిభను చూసి ఉద్యోగం ఇచ్చారని భావిస్తున్నాను. మీరు ఏకీభవిస్తున్నారా?' అని అడిగాడు. ఆయన మౌనంగా తలూపి ఓ కుర్చీ చూపించాడు. వారం రోజులైనా ఏ పనీ చెప్పకపోయేసరికి అప్పారావుకి విసుగొచ్చింది. 'మీరు నాలోని విలేకరిని చంపేస్తున్నారు. తృష్ణని చిదిమేస్తున్నారు. ఆకాంక్షను అదిమేస్తున్నారు. ఎక్కడికైనా పంపండి' అన్నాడు.

సంపాదకుడు కాసేపు ఆలోచించి, 'సరే. సినిమా తార నగల దుకాణం ప్రారంభోత్సవానికి వస్తోంది. వెళ్లిరా' అన్నాడు.

అప్పారావు దూసుకుపోయాడు. అభిమానుల మధ్య నుంచి తోసుకుంటూ సినీతారను సమీపించి 'ఇంకా చేయడం లేదేం? గబగబా చేయండి' అన్నాడు.

ఆ తార తెల్లబోయి, 'ఏంటి చేసేది?' అంది.

'అదే... సందడి!'

'అంటే?'

'అంటే ఏంటేంటి? మీరు వచ్చి సందడి చేశారని పత్రికల్లో రాస్తుంటారు. నాకు తెలియదనుకున్నారా? ఆ సందడేదో చేయండి. మీరు ఎలా సందడి చేశారో చూసి చక్కగా రాస్తా. ఇంతకీ మీరు అందరి తారలు చేసే సందడే చేస్తారా? లేక కొత్త సందడేమైనా చేస్తారా?' అన్నాడు అప్పారావు.

ఆ తారకు తారలు కనిపించాయి.

తిరిగొచ్చిన అప్పారావు, 'ఆ తార నగల దుకాణంలో ఎలాంటి సందడీ చేయలేదు. కేవలం ప్రారంభోత్సవం చేసింది' అని రాశాడు. కానీ మర్నాడు పత్రికలో ఆ వార్త రాలేదు. మరో విలేకరి రాసిన వార్తలో సందడి చేసినట్టు వచ్చింది.

'ఇది అన్యాయం. అబద్ధపు పాత్రికేయం. అసలామె సందడి చేయందే?' అంటూ అప్పారావు ఎంత వాదించినా అందరూ నవ్వారే తప్ప జవాబివ్వలేదు.

మరోసారి అప్పారావు ఓ రాజకీయ నాయకుడు పెట్టిన విలేకరుల సమావేశానికి వెళ్లాడు. ఆరోజే జరిగిన అగ్నిప్రమాదం గురించి ఆయన మాట్లాడాడు. తిరిగొచ్చాక అప్పారావు, 'అగ్నిప్రమాదానికి ఆయన దిగ్భ్రాంతికి గురయ్యానన్నారు. అయితే దిగ్భ్రాంతికి గురైన వారెవరూ కారులో విలేకరుల సమావేశానికి వచ్చి మాట్లాడలేరు. అలాగే జరిగిన దానికి ఎంతో విచారిస్తున్నానన్నారు. కానీ ఏడ్చిన దాఖలాలేవీ కనిపించలేదు. ఇదిలా ఉండగా, ఆయన బుగ్గలపై కన్నీటి చారికలు లేవు సరికదా, మధ్యలో నవ్వారు కూడా' అని రాశాడు. సంపాదకుడు పిలిచి ఇదేమిటని అడిగాడు.

'వాస్తవ పాత్రికేయం' అన్నాడు అప్పారావు. వెంటనే ఆయన దిగ్భ్రాంతికి గురయ్యాడు.


ఓసారి అప్పారావు టీవీలో వార్తలు చదువుతున్న మెరుపుతీగలాంటి అమ్మాయిని చూశాడు. చూస్తూనే ప్రేమలో పడిపోయాడు. వెంటనే కాగితం అందుకుని ఉత్తరం రాశాడు.

'తొలి చూపులోనే నాకు నీ మీద ప్రేమ కలిగిందని నేను భావిస్తున్నానంటే నువ్వు ఆనందిస్తావని నొక్కివక్కాణిస్తున్నాను. అందుకే నా ప్రేమను పునరుద్ఘాటిస్తున్నాను. కాగా, ఇది కేవలం కాలక్షేపం ప్రేమ కాదని, ప్రత్యక్షర సత్యమని నిండు మనసుతో ప్రకటిస్తున్నాను. ఇదిలా ఉండగా, మనం పెళ్లి చేసుకుంటే పాత్రికేయంలో రెండు పార్శ్వాలు ఏకమవుతాయని మనవి చేసుకుంటున్నాను. ఆ విధంగా ముద్రణ మాధ్యమం, దృశ్య మాధ్యమం మమేకమై పరిఢవిల్లుతాయని నేనంటే నువ్వు కాదనవనే నమ్మకం నాకు ఉందని నీకు మరోసారి ధ్రువీకరించనక్కర్లేదని అనుకుంటున్నాను. నీ అంగీకారాన్ని స్వయంగా కానీ, పత్రికాముఖంగా కానీ, తెలియజేస్తే నా అంత అదృష్టవంతుడు మరెవరూ ఉండరని భావిస్తాను'.

ఆ ఉత్తరానికి ఆ అమ్మాయి నుంచి జవాబు వచ్చింది. 'మీకు నామీద ఉన్న ప్రేమను నేను పూర్తిగా విశ్వసిస్తున్నానని చెప్పడం అతిశయోక్తి కాదు. అంతకు పదింతల ప్రేమ నాకూ మీ మీద కలిగిందని చెప్పడానికి ఏమాత్రం సంశయించనవసరం లేదని నేను భావిస్తున్నానంటే మీరెంత ఆనందిస్తారో నాకు తెలియనిది కాదు. మీరు చెప్పినట్టు మనిద్దరం ఏకమైతే, రెండు మాధ్యమాల మధ్య ప్రేమ బంధం, మూడు ముళ్లతో ముడిపడి, నాలుగు కాలాల పాటు చల్లగా, పంచభూతాల సాక్షిగా, ఆరు రుతువుల్లోనూ పచ్చగా ఉండేలా, మీతో ఏడడుగులు నడవడానికి అష్టకష్టాలైనా పడతానని, నవగ్రహాలను ఎదిరించైనా, పదిమంది ముందు పెళ్లి చేసుకోడానికి వెంటనే నడిచి వస్తానని చెప్పకనే చెబుతున్నాను'

అప్పారావు ఉత్తరాన్ని ఆ అమ్మాయి తన తల్లిదండ్రులకు, ఆ అమ్మాయి ఉత్తరాన్ని అప్పారావు తన తల్లిదండ్రులకు చూపించారు. ఇరువైపుల పెద్దలు కలుసుకున్నారు.

అమ్మాయి తండ్రి గద్గద స్వరంతో, 'అసలు మా అమ్మాయికి పెళ్లవుతుందని మేం అనుకోలేదండి. ఆ టీవీ యజమాని నా స్నేహితుడే కావడంతో రాసిచ్చినవి మాత్రమే చదవాలనే షరతు మీద ఉద్యోగమిచ్చాడు' అన్నాడు.

అప్పారావు తండ్రి ఆయన్ని ఓదార్చి, 'అసలు వీళ్లకి ఈ తెలుగెలా వంటబట్టిందో తెలియడం లేదండి. వీడికెలా పెళ్లవుతుందని మేమూ బెంగ పెట్టుకుంటే మీ అమ్మాయి తారసపడింది' అన్నాడు.

'పోన్లెండి. దొందు దొందే. పెళ్లయ్యాక ఇద్దరూ మారతారేమో. ఒకవేళ మారకపోయినా వాళ్లలో వాళ్లు మాట్లాడుకుంటారు కాబట్టి మనకిక చింతలేదు' అని ఇద్దరి తరపున పెద్దలు నవ్వుకుని తాంబూలాలు పుచ్చేసుకున్నారు.

పెళ్లయ్యాక అప్పారావు దంపతుల చేత వేరు కాపురం పెట్టించారు. ఆరునెలలకి అప్పారావు మామగారికి ఉత్తరం రాశాడు.

'దైవ స్వరూపులైన మామగారి సముఖానికి! అల్లుడు అప్పారావు వ్రాయునది. నా భార్య అయిన మీ అమ్మాయి నెలతప్పిందని అభిజ్ఞవర్గాల భోగట్టా. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఆమెకు రెండో నెలని తెలియవచ్చింది. అయితే ఈ విషయం ఇంకా నిర్ధరణ కావలసి ఉంది. వాస్తవాలు వెలికి వచ్చేంత వరకు ఎవరికీ చెప్పవద్దని వైద్యులు హెచ్చరించినా, మీ అమ్మాయి పట్టుబట్టడం వల్ల మీకు ఉత్తరం రాస్తున్నాను. ఈ విషయంలో నా ప్రమేయం ఏమీ లేదని తెలుసుకోగలరు'

ఆయన ఆదరాబాదరా వియ్యంకుడి దగ్గరకి పరిగెత్తుకుని వచ్చి ఆ ఉత్తరంలో ఆఖరి వాక్యం చూపించి లబోదిబోమన్నాడు.

'మీరేం కంగారు పడకండి. అంటే మా వాడి ఉద్దేశం ఈ శుభవార్తను ముందుగానే చెప్పడంలో తన ప్రమేయం లేదని మాత్రమే. వాడి తెలుగు వాడిది. మనమేం చేస్తాం' అని సముదాయించాడు.

తేరుకున్నాక వియ్యంకులిద్దరూ ఒక గట్టి నిర్ణయానికి వచ్చారు. పుట్టిన మనవడిని కానీ, మనవరాలిని కానీ టీవీ లేని ఇంట్లో పెంచాలనీ! వార్తల ప్రపంచానికి దూరంగా ఉంచాలనీ!

                                                                       -ఎ.వి.ఎన్.హెచ్.ఎస్. శర్మ
PUBLISHED IN EENADU 'TELUGU VELUGU' MONTHLY MAGAZINE OCTOBER 2012 ISSUE.

శుక్రవారం, ఆగస్టు 10, 2012

ఆటల్లో అరటిపండు

ఆటల్లో అరటిపండు


రాజకీయ ఒలింపిక్స్‌. స్టేడియంలో ప్రేక్షకులంతా ఉత్కంఠగా చూస్తున్నారు. మైకుల్లో క్రీడల వివరాలు ప్రకటిస్తున్నారు. 'ఇప్పుడు పరుగు పందెం' అని వినిపించింది. వెంటనే ప్రధాని మన్మోహన్‌ స్టేడియంలోకి ముసిముసి నవ్వులు నవ్వుతూ వచ్చారు. కానీ... ఆశ్చర్యం! ఇంకెవరూ పోటీలో లేరు. పైగా ఒకే ఒక ట్రాక్‌ ఉంది. ఇంతలో సోనియా గాంధీ వచ్చి విజిల్‌ వేశారు. మన్మోహన్‌ సింగ్‌ నెమ్మదిగా నడవసాగారు. ట్రాక్‌కి బయట సోనియా గాంధీ నడుస్తూ 'అడుగులు వేయండి. అలుపు తీర్చుకోండి. మలుపు తిరగండి' అంటూ చెబుతున్నారు.
ఇదంతా చూస్తున్న గుంపులో గోవిందానికి సందేహం వచ్చింది. 'ఇదెక్కడి పందెం గురూ?' అన్నాడు పక్కవాడితో.

'అదంతేనోయ్‌! పనిగట్టుకుని స్టేడియానికి వచ్చాక నోరు మూసుకుని చూడటమే. ఆయన్ని పోటీకి ఎంపిక చేసింది ఆవిడే. ఇంకెవరూ పక్కన లేరు. ఇక పరుగెట్టినా, నడిచినా, డేకినా ఆయనేగా విజేత?' అన్నాడా అనుభవజ్ఞుడైన పక్కవాడు.

ఇంతలో కొందరు రాహుల్‌ గాంధీని చంకనేసుకుని వచ్చారు. నోట్లో వేలేసుకుని ఉన్న అతడికి స్పోర్ట్స్‌ షూ తొడిగి మన్మోహన్‌ వెనకాల ట్రాక్‌పైకి వెళ్లమని బతిమాలుతున్నారు. అతడేమో సోనియాకేసి చూస్తున్నాడు. ఆమె ఎటూ చెప్పకుండా 'ట్రాక్‌లోకి దిగాలో లేదో నిర్ణయించుకోవాల్సింది అతడే. ఎప్పుడు దిగుతానంటే అప్పుడే దింపండి' అంటున్నారు.

'వార్నీ! ఆవిడ చుట్టూ అంతమంది పెద్దపెద్దవాళ్లు ఉన్నారు కదా, వాళ్లలో ఎవరూ ట్రాక్‌లో పరుగెత్తలేరా? మారాం చేస్తున్న ఆ పిల్లాడినెందుకు దిగమంటారు?' అన్నాడు గోవిందయ్య.

'వారసత్వ వీరుడు ఉండగా ఇంకెవరు దిగుతారయ్యా? అమ్మగారి ఆనందం కోసం ట్రాక్‌ను ఎప్పుడూ ఖాళీగానే ఉంచుతారు. ఆ పిలగాడు పరుగు నేర్చుకునే వరకూ అంతే. ఈలోగా మన్మోహన్‌గారి నత్తనడకలు చూడాల్సిందే మనం. ఓపికుంటే చప్పట్లు కొట్టు, లేదా మరో పోటీ చూడు' అన్నాడు అనుభవజ్ఞుడు.

గోవిందయ్య మరోవైపు తల తిప్పాడు. అక్కడ షూటింగ్‌ జరుగుతోంది. కేంద్రమంత్రులందరూ వరసగా నిలబడి తుపాకులు ఎక్కుపెట్టి దూరంగా ఉన్న లక్ష్యాలను గురి చూసి పేల్చారు. చిత్రం! వాటిలో ఒక్కటీ బోర్డుకు తగల్లేదు. అప్పుడే అక్కడికి వచ్చి చూస్తున్న సోనియా, మన్మోహన్‌ మాత్రం ఆనందంగా చప్పట్లు కొట్టసాగారు.

'గురి తప్పినా సంబరమేంటి?' అన్నాడు గోవిందయ్య.

'వాళ్లంతా వేర్వేరు పార్టీలనుంచి వచ్చిన సంకీర్ణ షూటర్లు. ప్రగతి లక్ష్యాలు సాధించడానికే గురిపెట్టి తూటాలు కాల్చారు. కానీ, ఏ లక్ష్యమూ ఇంకా అందలేదు మరి. అయితే బోర్డుకు బారెడు దూరం నుంచైనా తూటాలు దూసుకుపోయాయని వాళ్లిద్దరూ ప్రోత్సహిస్తున్నారు. ప్రస్తుతానికివాళ్లకు ట్రిగ్గరైనా నొక్కడం చేతనైందని మనం ఆనందపడాలంతే' అన్నాడు అనుభవజ్ఞుడు.

గోవిందయ్య మరోవైపు చూశాడు. అక్కడ హర్డిల్స్‌ జరుగుతున్నాయి. ట్రాక్‌ మీద ముందుగానే అమర్చిన హర్డిల్స్‌ కాకుండా పరిగెడుతున్నవారికి కాళ్ల ముందు వేరేవాళ్లు అడ్డంకులు పెడుతున్నారు. 'అరె... క్రీడాస్ఫూర్తికి వ్యతిరేకంగా ఉందే ఈ వ్యవహారం?' అన్నాడు గోవిందయ్య.

'అది ఆంధ్రా మైదానం నాయనా! అక్కడ తలపడుతున్నవాళ్లంతా ఒకే జట్టు. కానీ, ఎవరు పరుగెడుతున్నా మరొకరు అడ్డాలు కల్పిస్తారు. ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటారు. అక్కడి అధికార పార్టీ సంస్కృతే అంత. అడిగితే అదంతా అంతర్గత ప్రజాస్వామ్యం అంటారు. కళ్లప్పగించి చూడ్డమే' అంటూ వివరించాడు అనుభవజ్ఞుడు.

ఆ పక్క ఈత కొలనులో అంతా గందరగోళంగా ఉంది. అందులో ఓ గెడ్డపాయన ఈదుతుంటే మరికొందరు అడ్డంగా ఈదుతున్నారు. కొందరు ఉన్నచోటనే ఉంటూ నీళ్లని తపతపా కొడుతూ అల్లరి చేస్తున్నారు. 'దయచేసి అందరం ఒకే దిశగా కలిసికట్టుగా ఈదుదాం' అని ఆయన చెబుతున్నా ఎవరూ వినిపించుకోవడం లేదు.

'ఇలాటి ఈతను నేనెప్పుడూ చూడలేదు' అన్నాడు గోవిందయ్య.

'ఆయనే చెయ్యి తిరిగిన క్రీడాకారుడు చంద్రబాబు. ఆయనది, ఆయన అనుచరులది ఇప్పుడు ఎదురీతే. వీళ్లు మునుగుతారో, తేలుతారో, ఎప్పుడు గట్టెక్కుతారో తెలియకుండా ఉంది కాబట్టే కొలనంతా సుడిగుండంలా మారింది' అన్నాడు అనుభవజ్ఞుడు.

ఇంతలో ఆ మైదానంలో పెద్ద కలకలం రేగింది. కొందరు 'దొంగ... దొంగ' అని అరుస్తున్నారు. పోలీసులు విజిల్స్‌ వేసి పరిగెడుతున్నారు. ఓ యువ క్రీడాకారుడు అక్కడి పతకాలను చేజిక్కించుకుని పారిపోతుంటే పట్టుకున్నారు. మరి కొందరు ఆ యువకుడికి వత్తాసుగా జేజేలు పలుకుతున్నారు.

ఆ యువక్రీడాకారుడు పోలీసుల చేతుల్లో గింజుకుంటూ, 'ఎలాగూ ఇక్కడి పతకాలన్నీ నాకే వస్తాయి. ఈ మాత్రం దానికి ఆటలెందుకని ముందే పట్టుకుపోతున్నా. ఏం తప్పా? కావాలంటే స్టేడియంలో ప్రేక్షకులను అడగండి' అంటూ అడ్డదిడ్డంగా వాదిస్తున్నాడు.

'వీడెవడడండీ బాబూ?' అన్నాడు గోవిందయ్య.

'అతడు ఒకట్రెండు ఆటల్లో గెలిచిన మాట వాస్తవమే. దాంతో తన శక్తి మీద తనకు నమ్మకం పెరిగిపోయింది. మొత్తం ఆటలన్నీ గెలిచేస్తాననుకుంటున్నాడు. గెలవకుండానే పతకాలు దోచేద్దామనుకున్న వాడు, తీరా గెలిస్తే ఏం చేస్తాడోననే చాలామంది దిగులు పడుతున్నారు' అన్నాడు అనుభవజ్ఞుడు.

'ఏంటో? ఈ ఆటలన్నీ చూస్తుంటే నాకు ఆయాసంగా ఉంది. చివరికి ఆటల్లో అరటిపండులా మిగిలిపోయేలా ఉన్నా. ఇక ఇంటికి పోతా' అంటూ గోవిందయ్య బయల్దేరాడు.

ఇంతలో తొలికోడి కూయనే కూసింది!

PUBLISHED IN EENADU ON 10.08.2012

గురువారం, జులై 12, 2012

ఎవరి సమర్థత వారిది...

ఎవరి సమర్థత వారిది...




'గురూగారూ! మీ దగ్గర రాజకీయ పాఠాలు నేర్చుకుంటుంటే నేను తప్పకుండా సమర్థుడిగా పేరు తెచ్చుకుంటాననే నమ్మకం కలుగుతోందండి...'
'అప్పుడే నమ్మకాల్దాకా వద్దులేగానీ, ముందు కుసింత నిదానించు. సేద తీరాక సెప్పు, అసలు సమర్దతంటే నీకేటర్దమైందో...'

'ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందండీ? మనమెందులో అడుగుపెడితే అందులో బాగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడమే సమర్థత కదండీ?'

'మరక్కడే పొరపడ్డావు. పదాలకి పెపంచికం అర్దాలేరు, రాజకీయ అర్దాలేరు. దాన్ని బట్టి అంతరార్దం కానుకోవాలి మరి...'

'మీతో వాదించి గెలవలేం కానీ, రాజకీయాల్లో సమర్థతకి అర్థమేంటో మీరే చెప్పండి...'

'అట్టారా దారికి! అధికార పీటమ్మీద నువ్వే బాసింపట్టేసుకుని కూసున్నట్టోపాలి వూహించుకో. ఇప్పుడు సెప్పు సమర్దుడివి కావాలనుకుంటే ఏం సేయాలో?'

'ఏముందండీ? మనల్ని ఇంతవాళ్లని చేసిన ప్రజలకి ఉపయోగపడేలా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాలండి. సమస్యల్ని పరిష్కరించాలండి. అన్ని రంగాల్లో అభివృద్ధిని పరుగులు పెట్టించాలండి. అంతేనాండీ?'

'ఒరే... నువ్వరజంటుగా లెగిసి, ఎనక్కి సూడకుండా ఇంటికిపో. రేప్పొద్దున పప్పుల కొట్టెట్టుకుని నాక్కబురంపించు. నేనొచ్చి రిబ్బను సింపి, నువ్వందుకు తప్ప ఎందుకూ పనికి రావని ఉపన్నాసం వాగేసి సక్కా వత్తాను. సరేనా?'

'అయ్యబాబోయ్‌! అదేంటండీ, అంతమాటనేశారు? నేనేమన్నా పొరపాటుగా మాట్లాడానంటారా?'

'ఇన్నాల్లూ రాజకీయ పాటాలంటా నన్ను తెగ వాగించి, ఇప్పుడిలా మాట్టాడితే ఒల్లు మండుకు పోదేంట్రా! నీ మాటలెవరైనా ఇంటే నిన్ననరు, నీకు పాటాలు సెప్పిన నన్నంటారు, వట్టి అసమర్దుడినని. పోయిరా...'

'బాబ్బాబు... బుద్ధొచ్చిందండి. కాస్త శాంతించి బోధించండి'

'ఏటీ? కుర్సీ ఎక్కి కూసున్నాక సమస్సెలు తీర్సేత్తావా? అన్నీ తీర్సేత్తే వచ్చేపాలి ఎన్నికల్లో ఇక హామీలేటుంటాయి? నీకసలు బుర్రుందాని! కాబట్టి సమస్సెని సెప్పు కింద తేలులా అట్టాగే పడుండనివ్వాల. కానీ పరిస్కారం సేసేత్తన్నట్టు అడావుడి మాత్రం సెయ్యాల. పథకాలెట్టాల, కానీ అమలు కానీకుండా సాగదీయాల. ఈలోగా బిల్లులెట్టి కజానా సొమ్ముని, కొబ్బరి బొండాంలో నీల్లలా జుర్రుకోవాల. అన్ని రంగాల్లో అభిరుద్ది సాదించాల, కానీ పెజానీకానిక్కాదు, నీకు! ఇప్పటికైనా అర్దమైందా?'

'అర్థమైంది మహప్రభో, మన్నించండి. నాకు సమర్థత లేదని ఒప్పుకొంటున్నాను. కాబట్టి దాని గురించి మొదట్నుంచీ చెప్పండి...'

'సరే... రాసుకో! రాజకీయ సమర్దత పలు రకాలు. అందులో సమర్దుడు బయటి పెపంచికానికి ఏమీ సేతకాని వోడిలాగే ఆనతాడు. ఉదారనకి మన పెదాన మంతిరి గోరిని సూడు. ఆయనొట్టి సేతకాని వోడని దేసిదేసాల్లో పుత్తకాలు తెగ రాసేత్తన్నాయి. కానీ అసమర్దుడా? కాదు. ఎందుకంటే అమ్మగోరికి అనిగిమనిగి ఉండటంలో ఆయనంత సమర్దుడు ఇంకెవరుంటారు సెప్పు? అందుకని ఆమెకు అనువుగా ఉంటమే ఆయన సమర్దతన్నమాట. ఇంకెన్ని పెత్రికలు ఏం రాత్తే ఏమవుద్ది? బోలెడు మంది మోత్తన్న పల్లకిలో అమ్మ కూసోబెట్టిన బొమ్మలా వూరేగుతున్నప్పుడు సొంతంగా ఏమీ సెయ్యకపోవడమే ఆయన సమర్దత. మోతగాల్లు తప్పులు సేసి కజానా సొమ్ముని మజా సేత్తన్నా నిమ్మకు నీరెత్తినట్టుండటమే ఆయన సమర్దత. కాబట్టి, నీకు పదవిచ్చినోరి మనసులో సమర్దుడిగా ఉండాలని సూడాలే తప్ప, పెజానీకం ముందు సమర్దుడివైపోవాలనుకున్నావనుకో. అదే నీ అసమర్దతని అర్దం సేసుకో. అర్దమైందా?'

'ఆహా... ఎంత బాగా చెప్పారండీ! ఇంకా ఇలాటి సమర్థులెవరో చెబుదురూ?'

'ఒకోరిలో ఒకో సమర్దత ఉంటదిరా. కొందరిలో బోలెడు సమర్దతలు కిక్కిరిసిపోయుంటాయి. ఏమీ సెయ్యకపోవడం దేశానికే పెద్దాయన సమర్దత అనుకుంటే- సొయంగా కుర్సీ ఎక్కక పోయినా, ఎక్కినోల్ల సాటుగా సెక్రం తిప్పడం మరో రకం సమర్దత. ఉదారనకి మన రాట్రంలో యువనేతని వేరే సెప్పాలా? ఆయన సమర్దతలు పలురకాలు. ఆయనగోరు సేసిన పన్లు ఎన్నెన్నో, నొక్కేసిన సొమ్ములెంతెంతో లెక్క సూడలేక సీబీఐవోల్లే కిందా మీదా పడిపోతుండటం సూత్తన్నావుగా? ఇన్ని సేసి కూడా తన వూపిరి, తిండి, పడక, నిద్ర అన్నీ పెజానీకానికే అంకితమన్నట్టు సాటుకోవడం మాగొప్ప సమర్దత. ఎదవ పన్లు సేత్తా కూడా, ఎదురెట్టి పెద్ద మగానుబావుడిలా పెజానీకానికి బ్రెమ కలిగించేలా సూసుకోడం అసలైన సమర్దత. సేసిన పన్లు బయటపడినా కూడా సానుబూతికి డోకా లేని ఏసాలెయ్యడం నికార్సయిన సమర్దత. తెలిసిందా?'

'తెలిసింది కానీండీ, ఇంతమంది రాజకీయ సమర్థుల మధ్య అవకాశం వచ్చినా ఏమీ చేయలేనివాళ్ల పరిస్థితి ఏమిటండీ?'

'సెయ్యలేనప్పుడు సేతులెత్తేయడం కూడా సమర్దతేరా. ఉదారనకి మన రాట్ర నేత సంగతి సూడు. కుర్సీమీద ఎంత కాలం ఉంటాడో, ఎప్పుడు దిగుతాడో తెలీని సిక్కులో ఉన్నాడు. ఏం సెప్పాలన్నా, ఏం సెయ్యాలన్నా విమానమెక్కి డిల్లీకెల్లాల్సిందే. అయినా పైకి నిబ్బరంగా ఉండటం ఆయన సమర్దత. దాన్ని కప్పిపుచ్చుకోడానికి విరాగిలా మాట్టాడతా పెద్దమనిసిలా సెలామనీ కావాలని సూడ్డం గమనించలేదా? మొన్నకి మొన్న బడికెల్లే పిల్లల సబలో ఏదాంతం మాట్టాడలేదా? మన సేతిలో ఏమీ లేదని, వచ్చేప్పుడు ఏమీ తీసుకురామనీ, పోయేప్పుడు ఏదీ ఎంటరాదనీ సెప్పే సందర్బమా అది సెప్పు? అలా ఎటుపోయి ఎటొచ్చినా డోకరా లేకుండా సూక్తులు మాట్టాడ్డం కూడా ఓ రకం సమర్దతే మరి!'

'అదరగొట్టారండీ! సమర్థత గురించి ఇంత సమర్థంగా చెప్పడం మీ సమర్థతే సుమండీ!'

'పొగడ్డంలో నీ సమర్దత కూడా అర్దమైందిలే కానీ... ఇక బయల్దేరు!'

Published in Eenadu on 12.07.2012

సోమవారం, జులై 02, 2012

కుతంత్ర రాజకీయం

కుతంత్ర రాజకీయం



'నమస్కారం గురూగారూ!'
'ఏంట్రోయ్‌ శాన్నాళ్లకి కనిపించావ్‌? సేతిలో ఏటది... పుత్తకమా?'

'అవునండి. విజయానికి 116 మెట్లని ఎవరో రాశారండి, చూద్దామని కొన్నా'

'వార్నీ, అందుకే నువ్వింకా ఎదగలేదొరే... ఇజయం సాధించాలంటే అడ్డదార్లు ఎతకాలి! మెట్లెవరికి కావాల్రా? మోకాళ్లు అరిగేట్లు ఎక్కద్దూ?'

'మరందుకేనండి. ఆ అడ్డదార్లేవో చెబుతారనే పుస్తకం కొనగానే ఇలా వచ్చా...'

'పోన్లే, బతికించావ్‌. ఇన్నాళ్లూ రాకపోతే నువ్వేమన్నా నా మీద కుట్రలు సేత్తన్నావేమో అనుకున్నా...'

'అయ్యబాబోయ్‌ అదేంటండీ బాబూ! మీ మీద కుట్రా? కలలో కూడా అనుకోనండి...'

'కలలో సంగతలా ఉంచు. ఇలలో మాత్రం నువ్వెన్ని కుట్రలు సేసైనా కుట్ర సంగతేంటో తెలుసుకోవాల్రా...'

'ఈ కుట్రల గొడవేంటండి బాబూ, సరిగా చెప్పండి...'

'ఏం లేదురా. కుట్రలు సేయడం వేరు. ఎదుటోల్లు కుట్ర సేశారని గగ్గోలు పెట్టడం వేరు. ఈ రెంటికీ తేడా తెలుసుకో ముందు. రాజకీయాల్లోకి రాగానే నువ్వెలాగా కుట్రలే మొదలెడతావు. ఏ పథకాన్ని అడ్డవెట్టుకుని ఎలా దోసుకోవాలన్న కాన్నుంచి, నీ నిజ రూపం జనానికి తెలీకుండా ఎలా జో కొట్టాలనేంత వరకు నీయన్నీ కుట్రలని పెత్తేకంగా సెప్పాలా? నేను సెప్పబోయేది ఆటి గురించి కాదు. సీటికీ మాటికీ ఎదుటోన్ని ఇబ్బంది పెట్టాలంటే ఆడే నీపై కుట్రలు సేత్తన్నాడని ఎదురెట్టి బురదెయ్యాల. అప్పుడాడు కాదని సెప్పుకోడానికి నానా తంటాలూ పడతాడు. ఒకేల ఆడు నీ వంకర మాటలు పట్టించుకోకుండా వూరుకున్నాడనుకో, కాదన్లేదు కాబట్టి నిజమే కాబోలని జనం నమ్మేత్తారు. అర్దమైందా?'

'అబ్బో... ఇది రెండు విధాలా ఉపయోగపడే కుట్రన్నమాటండి...'

'సురుకైన వోడివే కానీ, ఇదొట్టి రెండిందాలే కాదు, వందిందాల పనికొచ్చే మాట. కిందపడినా అనచ్చు, మీదకి సేరినా అనచ్చు...'

'కిందున్నప్పుడైతే సరేగానీండీ, పైకెదిగాక ఎలా ఉపయోగపడుతుందండీ?'

'బలేవోడివే. నీ మీద కుట్రల్ని పెజానీకం నమ్మలేదని, తిప్పికొట్టిందని వాడేసుకోవచ్చు. అర్దమైందా?'

'భేషుగ్గానండి! ఇక ఈ కుట్రని వదలనంటే నమ్మండి. ఇంకా ఏయే సందర్భాల్లో ఇది ఉపయోగపడుతుందో చెబుతారా?'

'ఒహటని కాదురా. దేనికైనా అడ్డమేసుకోవచ్చు. చివరాకరికి నువ్వు సేసిన కుట్రపన్లు బయటపడి అరెస్టులు గట్రా అయినా ఇది పనికొత్తాదిరా...'

'అప్పుడెలా పనికొస్తుందండీ?'

'ఏముందిరా... అరెస్టయ్యాక నీ సేతికి బేడీలేత్తారా? అన్నన్నన్నా... నేనెంత గొప్పోన్నీ, నా ఇలువేంటీ, ఇంతలేసి నీచపు పన్లు సేసాను కదా... నాక్కూడా మామూలు నేరగాడికేసినట్టు ఇనుప సంకెల్లు ఏత్తారా? బంగారు బేడీలెయ్యద్దా? ఇది నన్ను అవమానింసినట్టు కాదా? కావాలనే కుట్ర పన్ని ఇలా సేసారని గోలెట్టొచ్చు. జైల్లో ఏశారనుకో, వజ్రాలు పొదిగిన ఊసలు లేవుకాబట్టి ఇదంతా కుట్రనొచ్చు. వెండి కంచంలో అన్నవెట్టకుండా సీవండి బొచ్చెలో ముద్దేశారు కాబట్టి... కుట్రకాక మరేంటని ఎదురెట్టొచ్చు. నీపై విసారణ సేసిన అధికారిది, నిన్ను పట్టుకున్న పోలీసోడిది, నీకు సిచ్చేసిన జడ్జిగోరిది, ఆ వార్తలు రాసిన ఇలేకర్లది, ఇంటికి పేపరేసే కుర్రాళ్లది, ఆకరికి నీ జైలు గదికి కాపలాకాసే సెంట్రీది కూడా... కుట్రేననొచ్చు. రాసుకుంటన్నావా?'

'ఓ రాసుకున్నానండి. కుట్ర పదం వెనక ఇన్నేసి కుట్రలున్నాయన్నమాట. ఇంకా ఎన్ని రకాలుగా వాడుకోవచ్చో చెబుదురూ?'

'అంటిపండొలిచినట్టు అన్నీ సెబుతారేంట్రా? కుసింత అందిస్తే మిగతాది అల్లుకుపోవాల. అయినా అమాయకుడివి కాబట్టి ఇసదంగా ఇవరిత్తా. ఉదారనకి నువ్వు రోడ్డు మీదకొచ్చాక సెప్పు కరిసిందనుకో- అది కిట్టనోడి కుట్రేననాల. ఆడే రాత్రేల సెప్పులు మార్సేసాడనాల. ఈదిలో నడుస్తుంటే నెత్తిమీద కాకి రెట్టేసిందనుకో... అదీ అంతేననాల. ఆ కాకి ముందు మా ఇంటిమీద వాలి, ఆనక ఆడింటిమీద వాలిందనీ, అది కిట్టక నేను బయటకొచ్చినప్పుడే ఆడు ఉస్సుస్సని దాన్నదిలించాడనీ, అంచాతే నా నెత్తిమీద రెట్టేసిందనీ ఆరోపించాల. నీ కారు సెక్రానికి పంచరైందనుకో, ఎగస్పార్టీవోడు మేకులిసిరించాడనాల. నీ పెన్ను కక్కిందనుకో, ఇంకు ఆడిదేననాల. సివరాకరికి మీ ఆవిడ కొన్న వంకాయల్లో పుచ్చులున్నా, పొద్దుటేలే కూరలమ్మినోడు ఎగస్పార్టీవోల్ల మడిసనాల. ఇంత అడ్డగోలుగా దూసుకుపోయావనుకో. నయా రాజకీయాల్లో నీకిక డోకా ఉండదొరే...'

'అబ్బబ్బబ్బ... ఏం చెప్పారండీ? కానీ మరీ ఇంత చవగ్గా కుట్రలు ఆపాదిస్తే జనం నమ్ముతారాని...'

'మరీ నమ్మరనిపిత్తే నీ తరపున ఓ పేపరెట్టుకో. దాన్లో ఇంకు బదులు బురద నింపి అచ్చేయించుకో. రోజూ అదే దరువేత్తే నమ్మక సత్తారా? ఇయ్యాల ఏం ఏడిశావో సూడ్డానికైనా రోజూ కొంటారు'

'మరి... ఇన్ని పన్లుచేసి ప్రజల దగ్గర మొహం ఎలా చూపించాలండీ... సిగ్గేయదూ?'

'సిగ్గు మాట నీ నోట ఇనిపించిందంటే నువ్వు రాజకీయాలకి పనికి రావనే అర్థం. కాబట్టి దాన్నొదిలెయ్‌. ఇక పెజానీకం దగ్గరకి ఎప్పుడెల్లినా ఏడుపు మొగం పెట్టుకుని ఎల్లాల. లోకమంతా ఏకమై నిన్ను పెజాసేవ సేయనీయట్లేదన్నంత జాలిగా మొగమెట్టాల. అదే జైలుకెల్లేప్పుడు మాత్రం పెద్ద గనకార్యం సేసినట్టు నవ్వుతా, సేతులూపుతా ఎల్లాల... సిద్విలాసంగా వేనెక్కాల. అర్దమైందా?'

'ఆహా... మీ దగ్గరికొస్తే దివ్యోపదేశం లభిస్తుందండి. విజయానికి అడ్డగోలు దార్లని మీరో పుస్తకం రాస్తే లక్షల్లక్షలు అమ్ముడు పోతుందండి'

'మరీ ఎక్కువ పొగుడుతున్నావంటే కుట్రేదో సేత్తన్నావని అర్దం. కాబట్టి బజన ఆపేసి పోయిరా!'

PUBLISHED IN EENADU ON 26.06.12

మంగళవారం, జూన్ 12, 2012

అయ్యయ్యో... ఎంత కష్టం?

అయ్యయ్యో... ఎంత కష్టం?

'ఓలమ్మో... ఓరయ్యో... ఓలక్కో... ఓరన్నో... మాకెంతకట్టమొచ్చినాదోలమ్మా... మీరంతా కలిసి ఆదుకోవాలమ్మో...'

'ఓలమ్మలమ్మ... అంత దుక్కపడకే తల్లీ! సూడ్లేక పోతన్నాం. ఇంతకీ ఏ కట్టమొచ్చినాది?'

'ఇంకా అడుగుతారేటమ్మో... నాకు మాటలు పెగల్టం లేదు. నిచ్చేపంలాటి నా కొడుకును పోలీసులు ఎత్తుకుపోనారమ్మో...'

'అయ్యో తల్లీ, ఎంత కట్టం! కొడుకునెత్తుక పోతే ఏ తల్లి తల్లడిల్లదమ్మా? ఎండనక, కొండనక తారట్టాడతా మా గుమ్మంలోకొచ్చి గింగిరాలు తిరిగిపోతన్నావు. ఇంతకూ నీ కొడుకునెందుకు ఎత్తుకెల్లారే తల్లీ!'

'ఏటి సెప్పేదమ్మో... ఏవో దొంగతనాలు, దోపిడి సేశాడంటన్నారమ్మా... ఈ రోజుల్లో ఎవులు సేత్తంలేదు సెప్పండమ్మా... ఆల్లందర్నీ ఒగ్గేసి నా కొడుకునే అన్నాయంగా ఎత్తుకపోనారమ్మో...'

'ఏటేటీ? దొంగతనాలూ దోపిడి సేసినాడా? అదేటమ్మా, ముందుగాలే కొడుకును అదుపులో ఎట్టుకోలేక పోనావా? తోటకూర నాడే మందలించి ఉంటే ఇంతదాకా వచ్చేది కాదు కదమ్మా? దోచేసినోడిని మరట్టికెల్లక ముద్దెట్టుకుంటారేటి? బాధగానే ఉంటదికానీ కూసింత ఓర్సుకోమ్మా...'

'అదొక్కటే కాదమ్మా! నా కొడుకు కట్టాలకు మొదట్నుంచీ లెక్కేలేదు తల్లీ...'

'అట్టాగా తల్లీ? ఎంతెంత కట్టపడిపోనాడమ్మా నీ కొడుకు?'

'ఏం సెప్పమంటారు తల్లీ! ఆల్ల నాయన కూసున్న కుర్సీ ఎక్కాలని ముచ్చట పడ్డాడమ్మా... కానీ అందరూ కలిసి అడ్డుకుని మరొకర్ని కూసోబెట్టేరమ్మా... అందుకని అలిగి రోడ్ల మీద పడ్డాడమ్మ బిడ్డ!'

'అయ్యో... తల్లీ ఎంత కట్టం? ఆ కుర్సీ ఎప్పుడోపాలి ఎక్కుదువులేరా... తొందరపడమాకని సెప్పలేకపోనావమ్మా! నట్టింట్లో కన్నకొడుక్కు సెప్పుకోలేక, ఇప్పుడిట్టా రోడ్డుమీద పడాల్సి వచ్చింది కదమ్మా? ఇంకేటమ్మా నీ బిడ్డ కట్టం?'

'ఏం సెప్పమంటావు తల్లీ? ఆ కుర్సీ ఎక్కినాయన్ని దించేదాక నా కొడుక్కి సుకం లేదమ్మా... అందుకోసరమే ఆయనకి మద్దతిచ్చేటోల్లని తనవైపు తిప్పుకోడానికి ఎంత సతమతమైపోయాడోనమ్మ బిడ్డ! ఆయనొట్టి అసమర్దుడని లోకానికి సాటాలని తిరగని సోటు లేదమ్మ... అంతలేసి తిరుగుడు ఎవులైనా తట్టుకోగలరా సెప్పండమ్మ?'

'అబ్బో... సానా కట్టం తల్లీ! అంతులేని ఆశలెట్టుకుంటే అంతేనని ముందుగాలే సెప్పలేకపోనావామ్మా? ఇప్పుడు నువ్వు కూడా ఇట్టా తిరగాల్సి ఉండకపోను... ఇంకేటమ్మా నీ కట్టం?'

'నా బిడ్డ ఐద్రాబాద్‌లో రాజబవనం కడుతున్నాడమ్మా... దానికి ఇటుకలు, సిమెంట, కూలీల పనులన్నీ సూసుకోడానికెంత ఆయాస పడిపోయాడో. ఇప్పుడయ్యన్నీ సూసుకోడానికి లేదే కదమ్మ?'

'ఏటీ రాజబవనమే! అవున్లేమ్మా... అంతోటి పెద్దిల్లు మొదలెడితే కట్టమే! మాం పూరింట్ల తాటేకులు మార్సడానికే ఆపసోపాలు పడిపోతామే. కానీ ఏటి సేత్తం? ఎవుల్నైనా పురమాయించుకో తల్లీ...'

'అదొక్కటే కాదమ్మా... రాట్రమంతటా బూములు సుట్టబెట్టాడమ్మా... ఎవురెవరికో కట్టబెట్టాడమ్మా... ఆల్లనుంచి సొమ్ములు పట్టాడమ్మా... కంపెనీలెట్టాడమ్మా... ఆ యవ్వారాలన్నీ నాకేటి తెలస్తయి సెప్పండమ్మ... ఇప్పుడేం సేతురో తెల్టం లేదమ్మ...'

'ఓలోలోలి! ఇయ్యెక్కడి కట్టాలమ్మా... ఎక్కడా ఇనలేదు? ఇన్నోసి పన్లు నెత్తి మీదెట్టుకుంటే ఎట్టాగమ్మా? ఎంత కట్టబడిపోనాడమ్మ బిడ్డ... ఇంకేటి కట్టాలు తల్లీ?'

'ఏమని సెప్పనమ్మ? ఎనిమిదేళ్ల కితం సక్కంగానే ఉండేవాల్లమమ్మ... అంతా పోగుసేసి మా కాడున్నది లచ్చల్లోనేనమ్మ ఆస్తంతా... పేనం సుకంగా ఉండేది... ఈమద్దె కాలంలో నా కొడుకు కాయకట్టం వల్ల లచ్చ కోట్లకు పడగలెత్తామమ్మా... ఆ నోట్లన్నీ లెక్కబెట్టి నా కొడుకు వేళ్లన్నీ నొప్పులేనమ్మా...'

'ఓలమ్మలమ్మ! ఎంత కట్టమమ్మ... ఎదవది కూలి డబ్బులు నెక్కెట్టుకోడాకే కిందిమీదులవుతామమ్మ మేమంతా. అట్టాంటిది అంతలేసి సొమ్ములొచ్చి పడిపోతా ఉంటే ఎంత కట్టం? బిడ్డ సేతులకు నొప్పి లేపనం రాయలేక పోయావమ్మా?'

'అది కాదమ్మా... ఆ డబ్బులేంటో, కంపెనీలేటో, మనుసులేటో, మాటలేటో, నాకేటి తెలుత్తాది సెప్పండమ్మ?'

'అయ్యయ్యో! ఇంటుంటే కడుపు తరుక్కుపోతావుంది. కుసింత ఓపిక పట్టమ్మ...'

'ఎట్టా పట్టేదమ్మ? పొరుగు రాట్రంలో కూడా బవంతుల పన్లెట్టుకున్నాడు బిడ్డ! ఎన్నెన్ని కోట్లో తీస్కెల్లి ఇదేశాలు పంపేడు. ఆటిని దొడ్డిదారిని తీస్కొచ్చి సొంత కంపెనీల్లోకి తోడుకున్నాడు. ఇన్నేసి యవ్వారాలు సూసుకోవాల్సి ఉంటే కొడుకుని తీస్కెల్లి జైల్లో పెడితే ఎట్టాగమ్మా?'

'ఓలమ్మో... ఎంత కట్టం! గుండెలవిసిపోతన్నాయి తల్లీ...'

'మీకట్టా అనిపించాలనేనమ్మా... సానుబూతి కురిపించాలనేనమ్మా... నా కట్టాలు మీకాడ ఏకరువు ఎట్టుకోడానికి వచ్చాను...'

'అవునుకానీ తల్లీ... ఇంతకీ మామేటి సేయాలంటావు సెప్పమ్మా...'

'ఏం లేదమ్మా... మీరంతా కలిసి నా బిడ్డకు మద్దతియ్యాల. ఆడెనకాల జనమంతా ఉన్నారని సాటి సెప్పాల... అదేనమ్మా నా కోరిక...'

'శానా బాగుంది తల్లీ! ఆడేమో దొంగతనాలు సేసేడూ? దోపిడి సేసేడూ? ఎవుల్ల బూములో గుంజుకుని మరెవుల్లకో అప్పజెప్పి మాయజేసి కోట్లు కొల్లగొట్టేడూ? ఇయన్నీ తెలుసుకుని కూడా నీ కొడుక్కి మద్దతియ్యటానికి మాకు మనసెట్టా ఒప్పుద్దమ్మా? నీతిమాలినోడికి జేజేలు కొడితే నవ్వులపాలు కామా! పున్నామ నరకానికి పోమా తల్లీ! నీ కట్టాలన్నీ ఇని ఓదార్చగలం కానీ మామేటీ సెయ్యలేమమ్మా. అవునుగానీ తల్లీ... ఇంతలేసి కట్టాలడిపోతా నీ బిడ్డ బయటుండే బదులు జైల్లోనే ఉంటే సుకం కదా తల్లీ? నీడపట్టున పడుండి ఇంత బువ్వ తింటాడు? కాసింత ఓర్సుకో తల్లీ! పోయిరా!'

PUBLISHED IN EENADU ON 12.6.2012

శుక్రవారం, జూన్ 08, 2012

అవినీతి మాంత్రికుడు



అవినీతి మాంత్రికుడు

పట్టువదలని అక్రమార్కుడు శ్మశానంలోకి అడుగుపెట్టగానే 'సారొత్తారొత్తారే... వస్తారొత్తారొత్తారే...' అనే పాట వినిపించింది. రాజకీయ బేతాళుడు, పిశాచాలు కలిసి చెట్టుకింద స్టెప్పులేస్తూ కనిపించాయి.
అక్రమార్కుడు ఉబ్బితబ్బిబ్బైపోయి, 'ఇదేంటి బేతాళా, నువ్వు నాకు వశమైనట్టేనా?' అన్నాడు.

బేతాళుడు భళ్లున నవ్వి, 'వార్నీ, నీకు ఆశ చాలా ఎక్కువయ్యా! అందుకే రాష్ట్రాన్ని అంతలా దోచుకున్నావు! రోజూ ఒకేలా మొదలెట్టడం ఎందుకని ఇలా కొత్తగా ఆలోచించానంతే. బాగుందా?' అన్నాడు.

అక్రమార్కుడు డీలా పడిపోయి సమాధి మీద నీరసంగా కూలబడ్డాడు. బేతాళుడు దగ్గరకొచ్చి, 'ఏమయ్యా, జైల్లో ఆహారం సరిపోవడం లేదా? రోజూ నువ్వు తినేలా అక్రమాల సన్నబియ్యంతో అన్నం వండటం లేదా? అందులోకి కమ్మని కాసుల కలగలుపు పప్పు వడ్డించడం లేదా? గనులు కూరిన గుత్తొంకాయ కూర చేయించలేదా? ఖనిజాల ఖైమా సంగతేంటి? సెజ్‌ల పులుసైనా పెట్టారా లేదా? పెట్టుబడుల పచ్చడి వేశారా? రాకరాక వచ్చిన అతిథివి కదా, భూముల బొబ్బట్లు చేయించొద్దూ? ఆశలు తోడెట్టిన గడ్డపెరుగుతోపాటు జుర్రుకోవడానికి మారిషస్‌ నుంచి మాయాజాలం మామిడిపళ్లు తెప్పించొద్దూ? కనీసం నంజుకోవడానికి నల్లడబ్బైనా వేయాలి కదా? అవినీతి అప్పడాలు, వక్రబుద్ధి వడియాలు కూడా లేవా? ఎంత దారుణం... ఎంత దారుణం!' అంటూ వగలుపోయాడు. పిశాచాలన్నీ ముసిముసిగా నవ్వసాగాయి.

అక్రమార్కుడు దీనంగా మొహం పెట్టి, 'బేతాళా! నీకిది భావ్యమా? వశం చేసుకుందామని వచ్చానుకదాని ఇలా ఎగతాళి చేస్తావా? నాకు తెలిసి అలనాటి విక్రమార్కుడి కథలో బేతాళుడు కథలు చెబుతాడు కానీ, నీలా కబుర్లు చెప్పడు...' అన్నాడు ఉక్రోషంగా.

బేతాళుడు నవ్వుతూనే దగ్గరకు వచ్చి, 'భలేవాడివయ్యా అక్రమార్కా! అలనాటి ఆయనకు, ఇలనాటి నీకు పోలికెక్కడుంది చెప్పు? ఆ విక్రమార్కుడు అవక్రమ పరాక్రమవంతుడు. మరి నువ్వో? అక్రమ వక్రబుద్ధుడివి. ఆయన ప్రజారంజకుడు. నువ్వు ప్రజావంచకుడివి. ఆయన జనాన్ని రంజింపజేసి ఆనందపరిస్తే, నవ్వు ఏడిపించి ఓదారుస్తున్నావు. ఆయన బేతాళుణ్ని వశం చేసుకోవాలనుకున్నది పరోపకారం కోసం, ప్రజాహితం కోసం! నువ్వు నన్ను వశం చేసుకోవాలనుకుంటున్నది అధికారం కోసం, ప్రజాధనాన్ని మరింత దోచుకోవడం కోసం! చెప్పిన తేడాలు చాలా, ఇంకా చెప్పాలా?' అన్నాడు.

విసిగిపోయిన అక్రమార్కుడి మొహం కోపంతో ఎర్రబడిండి. చర్రుమంటూ లేచి, 'బేతాళా, వూరుకున్న కొద్దీ రెచ్చిపోతున్నావు. చూస్తూ ఉండు. త్వరలోనే నీకు బుద్ధిచెప్పే రోజు వస్తుంది. నీకు తెలియదేమో, నీకన్నాముందే నాకు ప్రజలంతా వశమయ్యారు, తెలుసా?' అన్నాడు ఆవేశంతో వూగిపోతూ!

ఆ మాటకు పిశాచాలన్నీ పొట్టచెక్కలయ్యేలా నవ్వుతూ కిందపడి దొర్లసాగాయి. బేతాళుడు కూడా శ్మశానం దద్దరిల్లేలా నవ్వి, 'అక్రమార్కా, నీకు చాలా తిక్కుందయ్యా! కానీ, దానికి ఓ లెక్క మాత్రం లేదు. అందుకే చట్టమన్నా, న్యాయమన్నా, నీతన్నా, నిజాయతీ అన్నా, ప్రజలన్నా, ప్రజాస్వామ్యమన్నా అస్సలు లెక్కలేకుండా అడ్డమైన అక్రమాలు చేశావు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని అడ్డగోలుగా దోచుకున్నావు. అయినా నీ నోట ప్రజలనే మాట వచ్చింది కాబట్టి, ఇప్పుడు అడుగుతున్నాను చెప్పు? ప్రజలు నిన్ను నమ్ముతున్నారని నువ్వెలా అనుకొంటున్నావు? నీకింత భరోసా ఎక్కడిది? జనాన్ని ఏ విధంగా ఆకట్టుకున్నావని భావిస్తున్నావు? అందుకు నువ్వు పాటించిన నయవంచక పద్ధతులు ఏంటి? ఈ ప్రశ్నలకు తెలిసి కూడా సరైన సమాధానాలు చెప్పకపోయావో... ప్రజల మనసు నువ్వంటే విరిగిపోయినంత ఒట్టు' అన్నాడు.

అక్రమార్కుడు దిగాలుపడిపోయాడు. బేలగా మొహం పెట్టి, 'నీ శాపంతో చెడ్డ చిక్కొచ్చింది బేతాళా! నువ్వంత మాటన్నాక చెప్పక తప్పుతుందా? రాక రాక మాకు అధికారం అంది వచ్చింది. దాని ఆధారంగా ఎదగాలంటే అమాయకమైన ప్రజానీకానికి మత్తు చవి చూపించాలి. వాళ్లకేదో మేలు చేస్తున్నట్టు ప్రచారం చేయాలి. అందుకే కొత్తకొత్త పథకాలు రచించాం. వాటి అమలు పేరిట వారికి కొంచెం విదిల్చి మేము, మా అనుయాయులు కోట్లకు పడగలెత్తాం. సోదాహరణంగా చెబుతాను, విను. జలపథకాల పేరిట ప్రాజెక్టులు మొదలుపెట్టాం. కానీ కాంట్రాక్టులన్నీ మా అనుచరులకే ఇచ్చాం. వాళ్లు పనులు చేసినా, చేయకపోయినా కోట్ల కొద్దీ రూపాయల బిల్లులు చెల్లించాం. అదీ చాలకపోతే అంచనాలు సవరించి మరీ సొమ్ములు విడుదల చేశాం. ఆ ధనమంతా ఎవరిది? ప్రజలనుంచి పన్నుల రూపంలో వసూలు చేసినదే. ఫలితంగా ఎక్కడి ప్రాజెక్టులు అక్కడే ఉన్నా మేమంతా కోట్లు వెనకేసుకున్నాం. ఉపాధి పనుల పేరిట పేదలకు కొంత సొమ్ము పంచినట్టే పంచి, వాటి కోసం పెట్టే బిల్లుల పేరిట కిందిస్థాయి అధికారి నుంచి పైస్థాయి నాయకుల వరకు ప్రభుత్వ ఖజానా నుంచి సొమ్ము పారేలా ఏర్పాటు చేశాం. విద్యార్థులకు ఫీజులు ఇప్పించినట్టే విదిల్చి, ఆ నెపంతో మా వారిచేత వందలకొద్దీ కాలేజీలు పెట్టించి గ్రాంటులు మంజూరు చేశాం. ఇప్పుడా కాలేజీలన్నీ అరకొర వసతులతో మూతపడ్డాయి. విద్యా ప్రమాణాలు కూడా దిగజారాయి. రోగాలకు చికిత్స పేరిట అస్మదీయ వైద్యులకు కోట్లు పంపిణీ చేశాం. ఇలా ఏం చేసినా ప్రజలకు గోరంత, మేం మెక్కేది కొండంత ఉండేలా చూసుకున్నాం. కానీ పాపం... ప్రజలు అమాయకులు. మా వల్ల అవినీతి వ్యవస్థాగతమైందని, అందువల్ల అడుగడుగునా అణగారిపోక తప్పదని తెలుసుకోలేరు. వాళ్ల అజ్ఞానం మీదనే నాకు అనంతమైన నమ్మకం. వాళ్ల అమాయకత్వమే నాకు రక్ష' అంటూ మనసులోని మాయనంతా వెల్లగక్కాడు.

బేతాళుడు నిట్టూర్చి, 'ఎంతగా దిగజారిపోయావు అక్రమార్కా! అవినీతి మాంత్రికుడిలా కనిపిస్తున్నావు. ఇంత పచ్చిగా నిజాలు చెప్పాక ఇక నాకిక్కడేం పని?' అంటూ శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు!



PUBLISHED IN EENADU ON 8.6.12