గురువారం, ఫిబ్రవరి 29, 2024

ఇక అంతా సిద్దం!


అధినేత అద్దంలో రకరకాలుగా నవ్వుకుని చూసుకుంటున్నాడు. చేతులు పైకి మడత పెట్టుకుంటూ అటూ ఇటూ నుంచుని చూశాడు. నెత్తి మీద కంటా చేతులు జోడించి పైకి కిందకి ఊపి చూసుకున్నాడు.  ఈలోగా సెక్రటరీ వచ్చి అధినేత ఎలా సిద్ధం అవుతున్నాడో గమనించి చిన్నగా దగ్గాడు.

''రావయ్యా సెకట్రీ! బాగా సిద్ధం అయ్యానంటావా?'' అనడిగాడు, అద్దంలో అన్ని కోణాల్లోనూ మొహాన్ని చూసుకుంటూ.

''తమరెప్పుడూ సిద్ధంగానే ఉంటారు కదండీ?'' అన్నాడు వినయంగా నవ్వుతూ.

''మరైతే మనం వెళ్లబోయే ప్రచార సభకి అంతా సిద్ధం చేశావా?''

''... అన్నీ సిద్దమండి. పాదయాత్రల నాటి నుంచి, అధికారం అందుకున్న ఈ ఐదేళ్లుగా తమరు అనేక  సందర్భాల్లో వాడే రకరకాల నవ్వులన్నింటినీ ఉతికి ఆరేయించానండి. వాటన్నింటినీ మీ జేబురుమాలు మడతల్లో పెట్టానండి. ఇక మీరు ఆ రుమాలుతో మొహం తుడుచుకుంటూ ఒకోసారి ఒకోలా నవ్వు పులుముకోవచ్చండి. ప్రతిపక్షం వాళ్ల గురించి మాట్లాడేప్పుడు వెటకారం నవ్వూ, వాళ్ల ఆరోపణలు తిప్పికొట్టేప్పుడు వెకిలి నవ్వూ, మీ పథకాల గురించి చెప్పేటప్పుడు ముసిముసి నవ్వూ, సభకి పెద్దగా జనం రాకపోయినా జావగారి పోకుండా గంభీరపు నవ్వూ, ఉపన్యాసం మధ్యలో జనాలు లేచి వెళ్లిపోతుంటే సహనపు నవ్వూ, మీరు చెప్పినదే చెబుతున్నప్పుడు ప్రజలు ఆవులిస్తే దాన్ని గమనించకుండా వెర్రినవ్వూ, అమ్మా అక్కా అవ్వా తాతా అంటూ పలకరించేప్పుడు మురిపించడానికి ప్రయత్నించే నవ్వూ, దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేశానని చెప్పేటప్పుడు ఆత్మవిశ్వాసాన్ని ఎరువుతెచ్చుకునే నవ్వూ, ఇంకా ఏ భావమో ఎవరూ చెప్పలేని అయోమయపు నవ్వూ, అదోరకం నవ్వూ, చెప్పలేని నవ్వూ... ఇలా అన్నీ ఉన్నాయండి''

అధినేత ముసిముసిగా నవ్వి, ''బాగుందయ్యా... నేనిన్ని నవ్వులు నవ్వుతానని నాకే తెలీదూ. నువ్వు చెబుతుంటే నిజంగానే నవ్వొస్తోంది. మరింకా ఎలాంటి ఏర్పాట్టు సిద్ధం చేశావూ?'' అనడిగాడు.

సెక్రటరీ వినయంగా నవ్వి, ''మీరు ప్రతి సభలోనూ పదే పదే చెబుతూ వాడి పారేసిన విమర్శలన్నింటినీ దులిపి ఇస్త్రీ చేయించి పెట్టానండి. ఎలాగూ వాటినే ఈ సభలోనూ ఏకరువు పెడతారు కాబట్టి వాడేసుకోవచ్చండి. ఇక హామీల విషయానికి వస్తే కొత్తవేమీ లేవు కాబట్టి, ఇన్నవాటినే డ్రైక్లీనింగ్కి ఇచ్చి తెప్పించానండి. పాతవైనా కొత్తగానే కనిపించడానికండి. ఇక మీ ఉపన్యాసాలన్నింటినీ ఊకలో పోసి దంపించానండి. ఆ ఊకదంపుడు ఉపన్యాసాలనే మీరు మళ్లీ ఉపయోగించేసి ఊదరగొట్టేయచ్చండి. ఏ సభలో ఎక్కడ మొదలెట్టి, ఎక్కడ  ఆపినా పెద్దగా బెంగలేదండి...''

అధినేత అన్నీ వింటూ చేతుల్ని ఊపి చూసుకున్నాడు. మణికట్లను పైకి కిందకీ మాంసాన్ని కైమా చేస్తున్నట్టు కదిలించి చూశాడు. సెక్రట్రీ చటుక్కున జేబులోంచి ఏదో ట్యూబు తీసి దాంట్లోంచి ఆయింటుమెంటు తీసి చేతులకు రాసి మర్దనా చేశాడు.

''కొత్తగా వచ్చిన ఈ ఆయింటుమెంటు వల్ల అరచేతుల్ని అటూ ఇటూ ఇష్టం వచ్చినట్టు ఊపొచ్చండి. సభలో నాలుగు వైపులా ఉన్న వారికి కనిపించేలా చేతికి ఎముకే లేనంతగా తిప్పేయచ్చండి. నెప్పేమీ ఉండదండి...''

''బాగుందయ్యా సెక్రట్రీ! సభన్నాక వచ్చిన జనాన్ని చూసి చేతులు ఊపక తప్పదు. ప్రసంగం మధ్యలో రకరకాలుగా తిప్పకా తప్పదు. ఎలా ఊపినా నెప్పి లేకుండా బాగానే సిద్ధం చేశావు...''

సెక్రట్రీ గొంతు సవరించుకుని, ''ఇక మీ ప్యాంటు కుడి జేబులో అబద్ధాలను మూట కట్టి పెట్టానండి. మీరు ఇంతవరకు చేసిన అభివృద్ధి గురించి మాట్లాడవలసి వచ్చినప్పుడు అలా అలవోకగా జేబులో చెయ్యి పెట్టి అందిన అబద్ధాలను తీసి విసిరేయచ్చండి. ప్యాంటు ఎడమ జేబులో బోలెడన్ని అంకెలు, పెద్ద పెద్ద సంఖ్యలు పోగేసి పోశానండి. పథకాల గురించో, ప్రాజెక్టుల గురించో చెప్పేటప్పుడు జేబులోంచి మీ ఇష్టం వచ్చిన సంఖ్యల్ని తీసి చూసుకుని వాటికి కోట్లు జత చేసి చెప్పి పారేయవచ్చండి. జనాలెలాగూ అప్పటికప్పుడు లెక్కలేసుకోలేరు కాబట్టి  చెల్లిపోతుందండి''

అధినేత జేబులు తడుముకుని అన్నీ సిద్దంగా ఉన్నయో లేదో చూసుకున్నాడు.

''అంకెలూ, అబద్ధాలూ బాగా సిద్ధం చేశావయ్యా. ఇంకేం సిద్ధం చేశావో గబుక్కున చెప్పు మరి అవతల సభకి టైమవుతోంది...''

''ఇక తమరు వెళ్లబోయే సభా వేదిక మీద ఒక డబ్బా నిండా బురద సిద్ధం చేశానండి...''

''బురదా? అదెందుకయ్యా?''

''ఎగస్పార్టీ వాళ్ల మీద జల్లడానికండి. మీ ఉపన్యాసాల్లో అభివృద్ధి గురించి కన్నా ఎదుటి వాళ్ల మీద బురద జల్లడమే ఎక్కవ కదండి మరి. అలాగే ఓ సంచి నిండా దుమ్ము పోసి ఉంచానండి...''

''అదెందుకయ్యా?''

''ప్రత్యర్థుల మీద దుమ్మెత్తి పోస్తారు కదండీ, అందుకండి. సమయానికి తమరు వెతుక్కోకుండా సిద్దం చేశానన్నమాటండి. ఇక వేదిక వెనకాల కుంపట్లు పెట్టించి, బొగ్గులు సిద్ధంగా ఉంచానండి. చేటలు కూడా ఉన్నాయండి. మీరు ఉపన్యాసం మధ్యలో ఉండగా మన వాలంటీర్లు కుంపట్లో బొగ్గులు రాజేసి, చేటల్లో పోసి అందిస్తారండి...''

''వార్నీ... అవి దేనికయ్యా?''

''ప్రతిపక్షాల గురించి ప్రస్తావించినప్పుడు, తమరు నిప్పులు చెరుగుతారు కదండీ, అందుకండి. ఆ నిప్పుల వేడికి జనం ఇక చేసేది లేక చప్పట్లు కొట్టక తప్పదండి...''

''...హ్హ...హ్హా! అన్నీ బాగా సిద్ధం చేశావయ్యా. మరింతకీ మన ఉపన్యాసాలెలా ఉన్నాయంటావు?''

''వాటి గురించి చెప్పేదేముందండీ? అన్నీ ఒకేలా ఉన్నాయండి. అయినా చెప్పినవన్నీ చేసేశామనీ, చెసేవన్నీ చెప్పేశామనీ, చెప్పనివి కూడా చేశామనీ, చేసినవన్నీ చెప్పలేమనీ, చెప్పలేనివి కూడా చేశామనీ చెప్పక తప్పక చెబుతున్నాక... ఇక చెప్పేది మాత్రం ఏముంటుందండీ?''

అధినేత పకపకా నవ్వేసి, ''మొత్తానికి నువ్వు ఉండాల్సిన వాడివేనయ్యా! మరి సభలకి జనం దండిగా వస్తారంటావా?''

''రాక చస్తారటండీ? ముందుగానే మన అనుచరులు వాడవాడలకీ వెళ్లి సభలకు తరలి రావాలని అదరగొడుతున్నారండి. మన వాలంటీర్లయితే సభలకు రాకపోతే లబ్దిదారుల జాబితాలు సవరిస్తామని బెదరగొడుతున్నారండి. ఇక ఆరోజు బడులకి, కాలేజీలకి సెలవు ఇప్పించేలా మనోళ్లు రుబాబు చేయిస్తున్నారండి. కాలేజీలకీ బడులకీ పిల్లల్ని తీసుకెళ్లే బస్సులన్నింటినీ తీసుకొచ్చి తమరి సభలకు జనాన్ని తరలించడానికి ఎక్కడికక్కడ ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారండి. కొట్లు, దుకాణాలు కూడా మూయించేస్తున్నారండి. తమరి వాహనాలకు ఎక్కడా అడ్డంకులు ఎదురవకుండా రోడ్లకు ఇరు పక్కలా ఉన్న చెట్లను కూడా కొట్టించేస్తున్నారండి. బోర్డింగులు, హోర్డింగులు తీయించేస్తున్నారండి. ఊర్లలో ఉండేవాళ్లకి ఇక మీ సభకి రావడం తప్ప వేరే గతి లేనట్టు చేసేసి, గొర్రెల్ని తోలుకొచ్చినట్టు తీసుకొచ్చేస్తున్నారండి. వచ్చిన జనం మీ ఉపన్యాసాలు వింటూ నిద్ర పోకుండా చూడ్డానికి మన వాలంటీర్లు సిద్ధంగా ఉన్నారండి. జనం చేతికి పార్టీ జెండాలిచ్చి వాటిని ఎప్పుడెలా ఊపాలో చెప్పి జనాన్ని సిద్ధం చేశారండి. ఎక్కడెక్కడ చప్పట్లు కొట్టాలో కూడా సూచించడానికి మనోళ్లు సిద్ధమయ్యారండి. ఇక మనం పెట్టిన ఫొటోగ్రాఫర్లు జనం పెద్దగా రాకపోయినా, బాగా వచ్చినట్టు ఫొటోలు తీయడానికి సిద్ధంగా ఉన్నారండి. వాటిని పెద్ద పెద్దగా అచ్చేయడానికి మన పేపర్లో పేజీలకు పేజీలు సిద్ధం చేయించామండి. ఇక తమరి ఉపన్యాసాన్ని ఉన్నదున్నట్టుగా, ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా పుంఖాను పుంఖాలుగా రాయించి మన పేపర్లో పెద్ద పెద్ద అక్షరాలతో హెడ్డింగులు పెట్టి రాయించే ఏర్పాట్లు కూడా సిద్ధమండి...''

''సెహభాషయ్యా సెక్రట్రీ! ఇంతకీ మరి సర్వేలు చేయించావా?''

''... భేషుగ్గానండి. అయ్యగారు చేయించమన్నారని డబ్బులు గుప్పించేసరికి, మనకి వంత పాడే సర్వే సంస్థలన్నీ రెచ్చిపోయాయండి. ఉన్న సీట్లన్నీ తమకే రానున్నట్టు సర్వేలో తేలినట్టు ప్రకటించి జనాన్ని గందరగోళంలో పెట్టడానికి అంతా సిద్ధమండి. కొన్నయితే 175 కన్నా ఎక్కువ స్థానాలు గెలవబోతున్నట్టు ఫలితాలు ఇద్దామని ముచ్చట పడితే... నేనే మరీ బాగోదని చెప్పి సముదాయించానండి. మనం చేయించే ఈ సర్వేల హడావుడికి జనం కాబోసనుకుని అయోమయంలో పడితే, ఎగస్పార్టీ వాళ్లు నోరెళ్లబెడతారండి...''

''మొత్తానికి మన సిద్ధం సభలకి అంతా బాగానే సిద్ధం చేశావయ్యా. మరి జనం ఏమనుకుంటున్నారో ఏమైనా పసిగట్టావా?''

''జనం ఇప్పటికే సిద్ధం అయిపోయినట్టు అనిపిస్తోందండి. ఇక ఎన్నికలు రావడమే తరువాయండి. మీటలు నొక్కేయడానికి సిద్ధంగా ఉన్నారండి. ఇక తమరు, నేను కూడా సిద్ధంగా ఉండాల్సిందేనండి...''

సెక్రటరీ మాటల్లో ఉన్న మర్మమేంటో గ్రహించేందుకు అధినేత సిద్ధంగా లేనంత భ్రమల్లో ఉన్నాడు. దాంతో తెగ ఆనందపడిపోతూ ప్రచార సభకి బయల్దేరడానికి సిద్ధం అయిపోయాడు!

-సృజన

 

 

మంగళవారం, ఫిబ్రవరి 20, 2024

మామగారి కోసం అల్లుడి యజ్ఙం! (పిల్లల కోసం రాముడి కథ-3)


 

మామగారి కోసం అల్లుడి యజ్ఙం!


(పిల్లల కోసం రాముడి కథ-3)

రాముడి కథను నారదుడు, వాల్మీకి మహర్షికి క్లుప్తంగా చెబితే, బ్రహ్మదేవుడు అందులోని సన్నివేశాలన్నీ అతడి కళ్ల ముందు కనిపించేలా చేశాడు. అలా వాల్మీకి 24 వేల శ్లోకాలతో రామాయణాన్ని రచిస్తే, రాముడి తనయులైన లవకుశలు దాన్ని రమ్యంగా గానం చేశారు.  రామాయణంలోకి వెళ్లాలంటే ముందుగా మనం అయోధ్యలోకి ప్రవేశించాలి. అంతకన్నా ముందు రాముడి వంశం గురించి కూడా తెలుసుకోవాలి.

పూర్వం  భూమండలాన్నంతా వైవశ్వతుడు అనే చక్రవర్తి పరిపాలించేవాడు. ఆయన సూర్యుడి కొడుకు. ఈయన 7 మనువుగా శాశ్వత కీర్తి సంపాదించాడు. ఇతడి కొడుకు ఇక్ష్వాకుడు. ఇతడి అనంతరం ఇక్ష్వాకు సంతతి వారంతా ఇక్ష్వాకులనీ, సూర్యవంశం వారనీ పేరు పొందారు. వీరిలో సగరుడు కూడా ఒకడు. సగరుడి కొడుకులు 60 వేల మంది ఒకానొక కారణం వల్ల సముద్రాన్ని తవ్వారు. అందుకనే దానికి సాగరమని పేరు వచ్చింది. గంగను స్వర్గం నుంచి భూమికి తెచ్చిన భగీరథుడు,  సగరుడి మనవడే. సూర్యవంశపు రాజులంతా అయోధ్యా నగరాన్ని రాజధానిగా చేసుకుని సరయూ నదీ తీరాన ఉండే కోసల రాజ్యాన్ని పాలించారు. అయోధ్య నగరాన్ని వైవశ్వత మనువు స్వయంగా నిర్మించాడు.  వంశానికే చెందిన దశరథుడు, సకల సంపదలతో తులతూగే అయోధ్యను పాలిస్తూ ఉండేవాడు. ఈయన ఐశ్వర్యంలో ఇంద్రుడు, కుబేరుడంతటి వాడు. అవసరమైతే దేవతలకు సైతం సహాయపడగలిగే మహా పరాక్రమవంతుడు.  అయోధ్యా నగరం దుర్భేధ్యమైన కోటలతో, నలువైపులా కందకాలతో, నాలుగు వైపులా రాజవీధులతో, విశాలమైన రహదారులతో, దారికి ఇరుపక్కలా వృక్షాలతో, సొగసైన భవంతులతో, అంగళ్లతో  అలరారుతూ ఉండేది. రత్నఖచితమైన అక్కడి భవనాలన్నింటినీ మహా శిల్పులు అద్భుతంగా నిర్మించారు.  అందమైన ఉద్యానవనాలు, రకరకాల పండ్ల తోటలతో, పూల మొక్కలతో నగరం కళకళలాడుతూ ఉండేది. అయోధ్యలో నివసించేవారందరూ మహా వీరులే కాకుండా ధర్మపరులు కూడా. దశరథ మహారాజుకి ఎనిమిది మంది మంత్రులు ఉండేవారు. దృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్థసాధకుడు, అశోకుడు, మంత్రపాలుడు, సుమంత్రుడు అనే  మంత్రుల సాయంతో దశరథుడు ప్రజా రంజకంగా పరిపాలన చేసేవాడు. ఈయనకు వశిష్ఠుడు కుల గురువు. వామదేవుడు, జాబాలి మొదలైనవారు ప్రధాన పురోహితులు.

ఎంత వైభవం ఉన్నా దశరథుడికి సంతానం లేని లోటు వేధిస్తూ ఉండేది. ఒకనాడు ఆయనకు అశ్వమేధ యాగం చేసి దేవతలను మెప్పించి సంతానాన్ని పొందాలనే ఆలోచన కలిగింది. వెంటనే తన మంత్రులలో ముఖ్యడైన సుమంత్రుడి ద్వారా వశిష్ఠ వామదేవులను, జాబాలి, సుయజ్ఞుడు మొదలైన గురువులనూ, పండితులను పిలిపించి తన ఆలోచనను చెప్పి వారి సలహా అడిగాడు. అందుకు వారంతా మెచ్చుకుని అశ్వమేధ యాగానికి ఏఏ ఏర్పాట్లు చేయాలో, ఎలాంటి వస్తు సామగ్రిని సమకూర్చుకోవాలో సూచించారు. దశరథుడు అప్పటికప్పుడే అందుకు తగిన ఆదేశాలను అందరికీ జారీ చేశాడు.

వారందరూ వెళ్లిపోయాక దశరథుడిని సుమంత్రుడు ఏకాంతంగా కలిశాడు. ఇక్కడ సుమంత్రుడి గురించి ఒక విషయం చెప్పుకోవాలి. అదేమంటే, ఒకానొక తరుణంలో సనత్కుమారుడనే మహర్షి భవిష్యత్తులో జరగబోయే విషయాల గురించి రుషులతో చెబుతుండగా, అక్కడే ఉన్న సుమంత్రుడు కూడా విన్నాడు. అలా ఆయనకు రామాయణంలోని ప్రధాన అంశాలు అవగతమయ్యాయి. సందర్భాలను బట్టి సుమంత్రుడు ఆయా విషయాలను ప్రస్తావించడం రామాయణంలో కనిపిస్తుంది.

దశరథుడిని ఏకాంతంగా కలిసిన సుమంత్రుడు, ''మహారాజా! నేను సనత్కుమారుడి ద్వారా విన్న విషయాలను బట్టి,  అశ్వమేధ యాగాన్ని నిర్వహించడానికి రుష్యశృంగుడిని మించిన వాడు లేడు. అతడి వృత్తాంతం చెబుతాను వినండి'' అంటూ  కథ చెప్పాడు.

కశ్యప మహర్షి కుమారుడు విభాండకుడు. ఇతడి కొడుకే రుష్యశృంగుడు. ఇతడికి తలపై ఒక కొమ్ము మొలిచి ఉంటుంది. అందుకనే అతడిని అందరూ రుష్యశృంగుడని పిలిచేవారు. అడవిలో తండ్రి దగ్గరే పెరిగిన రుష్యశృంగుడికి అక్కడి జంతువులు, రుషులు తప్ప వేరే ప్రపంచం తెలియదు. మనుషులలో ఆడవారు, మగవారు అని విడివిడిగా ఉంటారని కూడా తెలియదు. బాల్యం నుంచి వేదాధ్యయనము, యజ్ఞయాగాదులు తప్ప ఇంకేమీ తెలియని రుష్యశృంగుడు, మహా యోగ సంపన్నుడిగా పెరిగాడు. అతడు ఉన్న చోట కరువు కాటకాలు ఉండవు. వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి.

 కాలంలోనే అంగ రాజ్యాన్ని రోమపాదుడు పాలిస్తూ ఉండేవాడు. ఒకసారి అతడి రాజ్యంలో తీవ్రమైన కరవు ఏర్పడింది. వర్షాలు లేక, పంటలు పండక ప్రజలు తిండి గింజల కోసం అలమటించసాగారు.  పరిస్థితికి దిగులు పడిన రోమపాదుడు వేద పండితులను పిలిచి కరవు పోయే మార్గం సూచించమని కోరాడు. అప్పుడు వాళ్లు రుష్యశృంగుడి గురించి తెలిపి, ''రాజా! మీరు ఎలాగైనా అతడిని అంగరాజ్యానికి రప్పించండి. అప్పుడు కరవు కాటకాలు పోయి దేశం సుభిక్షంగా ఉంటుంది'' అని సూచించారు. వెంటనే రోమపాదుడు మంత్రులను, పురోహితులను పిలిపించి ''మీరు వెంటనే వెళ్లి రుష్యశృంగుడిని తీసుకురండి'' అని ఆజ్ఞాపించాడు.  మాట విని వారందరూ  భయపడ్డారు. ఎందుకంటే రుష్యశృంగుడు అడవిలో తపస్సు మాని, ఎవరో పిలిస్తే వచ్చే మనిషి కాడు. కోపం వస్తే శపించగలడు కూడా. అందుకని రుష్యశృంగుడిని రప్పించడానికి వాళ్లొక ఉపాయం ఆలోచించి రాజు రోమపాదుడికి చెప్పారు.

''రాజా! రుష్యశృంగుడికి ఆడవాళ్లు ఎలా ఉంటారో కూడా తెలియదు. కాబట్టి మీరు సుందరాంగులైన కొందరు నాట్యకత్తెలను అడవులకు పంపండి. వాళ్లు రుష్యశృంగుడిని ఆకర్షించి తీసుకు వస్తారు. అప్పుడు అతడికి మీ కుమార్తె శాంతనిచ్చి వివాహం జరిపించి దేశంలోనే ఉంచుకుంటే ఇక ఎన్నటికీ కరువనేదే ఏర్పడదు'' అని చెప్పారు. రోమపాదుడు అందుకు అంగీకరించాడు. ఆయన ఆదేశాల ప్రకారం అందగత్తెలైన కొందరు యువతులు చక్కగా అలంకరించుకుని, రుష్యశృంగుడి ఆశ్రమం దగ్గరకు చేరుకున్నారు. ఒకనాడు రుష్యశృంగుడు  ప్రాంతానికి వచ్చాడు. వెంటనే  యువతులు పాటలు పాడుతూ, నాట్యం చేస్తూ అతడిని సమీపించారు. వాళ్ల అందమైన రూపాలను, అలంకారాలను, ఆటపాటలను చూసి రుష్యశృంగుడు ఆశ్చర్యపోయి ఆకర్షితుడయ్యాడు.  యువతులు అతడిని పలకరించి, ''నువ్వెవరు? ఎందుకీ అడవిలో ఒంటరిగా తిరుగుతున్నావు?''అని వయ్యారంగా ప్రశ్నించారు.

దానికి రుష్యశృంగుడు ''నా తండ్రి విభాండక మహర్షి. మీరంతా మా ఆశ్రమానికి రండి'' అంటూ వాళ్లను తీసుకు వెళ్లాడు.  సమయంలో విభాండకుడు ఆశ్రమంలో లేడు. రుష్యశృంగుడు వాళ్లకి కందమూలాలు ఇచ్చి ఆతిథ్యమిచ్చాడు. బదులుగా  సుందరాంగులు అతడికి తాము తీసుకు వచ్చిన తీపి భక్ష్యాలను ఇచ్చి'' ఇవి మా పండ్లు. రేపు నువ్వు కూడా మా దగ్గరకు రా'' అంటూ ఆప్యాయంగా కౌగలించుకుని ఆహ్వానించారు. వాళ్లిచ్చిన తీపి భక్ష్యాలు తిన్న రుష్యశృంగుడు అవి కొత్త రకం పండ్లనే భావించాడు. వాళ్లను మరవలేని అతడు, మర్నాడు  యువతులు ఉన్న ప్రాంతానికి వెళ్లాడు. వాళ్లు అతడిని చూస్తూనే ప్రేమగా మర్యాదలు చేసి, ''నువ్వు మాతో మా ఆశ్రమానికి వస్తే ఇంతకంటే చక్కని ఆతిథ్యమిస్తాము'' అంటూ ఆకర్షించి అతడిని అంగరాజ్యానికి తీసుకెళ్లారు. రుష్యశృంగుడు అడుగు పెట్టగానే అంగరాజ్యంలో వర్షాలు కురవసాగాయి. రుష్యశృంగుడిని చూస్తూనే మహారాజు రోమపాదుడు అతడికి ఎదురు వచ్చి, సాష్టాంగపడి మొక్కి, ''మహాత్మా! మిమ్మల్ని  విధంగా ఇక్కడికి రప్పించినందుకు క్షమించండి'' అంటూ వేడుకున్నాడు. తర్వాత తన కూతురు శాంతనిచ్చి అతడికి వివాహం జరిపించాడు. నిజానికి శాంత, దశరథుడి ఔరస పుత్రిక. దశరథుడు, రోమపాదుడు కూడా మిత్రులే. రోమపాదుడికి సంతానం లేకపోవడంతో దశరథుడు తన కుమార్తె శాంతని అతడికి దత్తత ఇచ్చాడు.

సుమంత్రుడు వివరాలన్నీ దశరథుడికి చెప్పి, ''మహారాజా!  రుష్యశృంగుడు మీకు కూడా అల్లుడే. కాబట్టి అతడిని అయోధ్యకు తీసుకువస్తే అంతా మంచే జరుగుతుంది'' అంటూ ముగించాడు. దశరథుడు ఎంతో సంతోషించి వెంటనే తన భార్యలు, మంత్రులతో అంగరాజ్యానికి వెళ్లాడు. వాళ్లకి రోమపాదుడు చక్కని ఆతిథ్యం ఇచ్చాడు. దశరథుడు వచ్చిన కారణాన్ని తెలుసుకున్న రోమపాదుడు, ఎంతో సంతోషంగా రుష్యశృంగుడిని, శాంతను అయోధ్యకు పంపించాడు.

అలా అయోధ్యకు వచ్చిన రుష్యశృంగుడు, దశరథుడికి పుత్రసంతానం కలగడం కోసం అశ్వమేధ, పుత్రకామేష్టి యాగాలను నిర్వహించాడు.   అంటే మామగారికి పుత్రులు కలగడం కోసం, అల్లుడు యాగం జరిపించాడన్నమాట.  యాగాలు ఎంత వైభవంగా జరిగాయో మరో భాగంలో తెలుసుకుందాం. జై శ్రీరామ్‌!