బుధవారం, జూన్ 30, 2021
శరణు... శరణు
ఆదివారం, జూన్ 27, 2021
మాటను మార్చెను! మోసము చేసెను!!
"వేషము మార్చెనూ...
భాషను మార్చెనూ...
మోసము నేర్చెను...
అసలు తానే మారెను...
అయినా... మనిషి మారలేదు!
ఆతని కాంక్ష తీరలేదు!"
-శిష్యుడు వచ్చేసరికి గురువుగారు సెల్ఫోన్లో పాట వింటున్నారు. శిష్యుడు కూడా నిశ్శబ్దంగా కూర్చుని విన్నాడు. పాట పూర్తవగానే, "భలే పాట గురూగారూ! గుండమ్మ కథలోది. నాకెంతో ఇష్టం..." అన్నాడు.
గురువుగారు నవ్వి, "నీకు, నాకు ఇష్టమైన పాటలు చాలానే ఉంటాయిరా. కానీ నువ్వొచ్చే సమయానికి ఈ పాట ఎందుకు పెట్టానో ఆలోచించు..." అన్నారు.
"ఓహో... ఇవాళ రాజకీయ పాఠం ఇలా పాటలతో మొదలుపెట్టారన్నమాట. కానీ ఇంతకీ ఈ పాట ఎవరి గురించి పెట్టారో చెప్పండి సార్..."
"ఒరే... అన్నీ నేనే చెబితే ఇక నువ్వుఎలా ఎదుగుతావురా? కాబట్టి ఇప్పుడు ఈ పాటకు పేరడీ చెబుతాను. దాన్నిబట్టి నువ్వే ఎవరి గురించో చెప్పాలి. సరేనా?"
"భలే హుషారుగా ఉంది సార్... చెప్పండి..."
"ఆశలు పెంచెనూ....
హామీలిచ్చెనూ...
కుర్చీ ఎక్కెను...
ఆపై... అన్నీ మరిచెను...
అయినా... మనిషి మారలేదు!
ఆతని తృష్ణ తీరలేదు!!
ప్రతిపక్షంలో విరుచుకు పడెను...
ప్రజలను ఎంతో మభ్య పెట్టెను...
ప్రత్యేక హోదా తెస్తాననెను...
అరచేతిలో వైకుంఠము చూపెను...
వేదికలెక్కెను... వాదము చేసెను...
అధికారం అందాక అన్నీ మరచెను...
అయినా...మనిషి మారలేదు!
ఆతని ఆబ తీరలేదు!!"
గురువుగారు చెప్పిన పేరడీ వినగానే శిష్యుడు పగలబడి నవ్వాడు. ఆపై "అర్థమైంది గురూగారూ! ఆంధ్రుల ఆత్మగౌరవంతో ఆటలాడి, అధికారం చేజిక్కించుకుని, ప్రజలను ఏమార్చి, ఇప్పుడు మాట మార్చిన మహానుభావుడి గురించే కదండీ?" అన్నాడు.
"శెభాష్ రా! దార్లో పడ్డావ్. ఇప్పుడు పాట సంగతలా ఉంచు. ఈ మొత్తం వ్యవహారంలో నీకు అర్థమైన రాజకీయ పాఠం ఏమిటో చెప్పు?" అన్నారు గురువుగారు గంభీరంగా.
"ఇందులో పాఠం ఏముంది సార్? అంతా నీచ రాజకీయం అయితేనూ! అరెరె... ఎంత ఘోరమండీ? అసలే దెబ్బతిని, రాజధాని కూడా లేని పరిస్థితిలో పడిపోయి, ఎవరితో చెప్పుకోవాలో కూడా తెలియని అయోమయంలో ప్రజలు ఉంటే, వారిని నమ్మించి, ఊరించి, ప్రత్యేక హోదా తెస్తానంటూ ప్రగల్భాలు పలికి, ఆశలు రేకెత్తించి అధికారం అందుకుని ఇప్పుడు చేతులెత్తేయడం ఏంటి సార్? పాత ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీకి సిద్ధపడితే, ఈయనగారే కదండీ, అప్పట్లో నానా యాగీ చేసింది? నేనయితే కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి మరీ హోదా సాధిస్తానని మోర పైకెత్తుకుని బీరాలు పలికింది ఈయనే కదండీ? జనం కామోసని నమ్మి కనీవినీ ఎరుగనంత ఘనంగా అధికారం అప్పగిస్తే... కుర్చీలో కూర్చుని రెండేళ్లయినా ఆ ఊసే ఎత్తని ఈయన్ని ఏమనాలండీ? ఈయనగారు ఢిల్లీ వెళ్లనప్పుడల్లా ఏదైనా తీపి కబురు వినిపిస్తుందేమోనని జనం ఎంత ఆశపడుతున్నారండీ? రాజధాని వెళ్లొచ్చాక... వాళ్లకి దండలేశానూ, వీళ్లకి వెంకటేశ్వరుడి పటాలిచ్చానూ, ఆయన భోజనం పెడితే గంట సేపు తిన్నానూ, ఈయనతో చాలా సేపు మాట్టాడేశానూ అంటూ గప్పాలు కొట్టుకోవడం తప్ప... ఈయన ఏం సాధించాడండీ? రెండేళ్ల పాటు కాలక్షేపం చేసి, ఇప్పుడు కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం లేదు కాబట్టి ఏమీ చేయలేమంటాడా? వాళ్లకి పూర్తి అధికారం ఉంటే ఈయనకెందుకు, అరకొర అధికారం ఉంటే ఈయనకెందుకంట? మన రాష్ట్ర ప్రయోజనం కోసం, మన ప్రజల కోసం మన ప్రయత్నమేదో మనం చేయాలి కానీ... ఇలా చేతలుడిగి, చేతులు దులిపేసుకుంటే ఎలాగండీ? మెడలు వంచుతానంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పి, ఇప్పుడు మెడ వేలాడేయడానికా జనం ఓట్లేసింది? పైగా దేవుడి దయ ఉంటే అంతా మంచే జరుగుతుందని వేదాంతం చెప్పడమేంటండీ, దారుణం కాకపోతేనూ! పాపం... ఓట్లేసి గెలిపించిన జనానికి ఏం దక్కిందండీ? అటు ప్యాకేజీ పోయి, ఇటు హోదా ఆశలు అడుగంటి... రెంటికీ చెడ్డ రేవడిలా మిగిలారు కదండీ? మీరెన్నయినా అనుకోండి గురూగారూ! ఇదంతా తల్చుకుంటుంటేనే అరికాలి మంట నెత్తికి ఎక్కిపోతుంటే... మీరేమో పేరడీలు పాడి, పాఠాలు నేర్చుకోమంటారేంటండీ?" అంటూ శిష్యుడు ఆవేశ పడిపోయాడు.
గురువుగారు మాట్లాడకుండా మంచినీళ్లు అందిస్తే శిష్యుడు గడగడా తాగేశాడు. కాసేపు ఆగాక గురువుగారు మొదలు పెట్టారు.
"ఆపరా... నీ అవకతవక మాటలు. నీకసలు సిగ్గుందా అని! రాజకీయాలకీ, ఆవేశానికీ పొంతన కుదరదని ముందు తెలుసుకో. కుర్చీ ఎక్కి అధికారంతో తైతక్కలాడుతున్న వాళ్లు, నీ లాంటి వర్థమాన రాజకీయ ప్రవేశాభిలాషులకి నిజమైన మోడల్సురా. వాళ్ల మాటలే నీకు పాలిటిక్సులో థియరీ. వాళ్ల నయవంచన పద్ధతులే నీకు ప్రాక్టికల్సు. వాళ్ల పాలనే నీకు ప్రాజెక్టు వర్కు. వాళ్ల చేతలే నీకు ఎంట్రెన్సు. ఇవన్నీ మర్చిపోయి, సామాన్య జనంలో ఒకడిలాగా ఆవేశపడితే ఎలా? ఇలా అయితే నువ్వు వీధుల్లోకెళ్లి నినాదాలు చేసుకో. రేపట్నుంచి నా దగ్గరకి రాజకీయ పాఠాలంటూ రాకు".
"అయ్ బాబోయ్... అంత మాటనకండి గురూగారూ! రాష్ట్రంలో జరుగుతున్న నయా నీచ రాజకీయ విధానాలు చూసి, ప్రజలకు జరుగుతున్న అన్యాయం చూసి గబుక్కున ఆవేశపడిపోయానండి. ఇప్పుడు చెప్పండి గురూగారూ నన్నేం చేయమంటారు?"
"అలారా దారికి. ఇందాకా పేరడీ పాటని అపహాస్యం చేశావు కాబట్టి, నువ్వు కూడా పేరడీ కట్టి వినిపించు. అదే నీకు కంపోజిషన్".
శిష్యుడు బుర్ర గోక్కున్నాడు. కాసేపు జుట్టు పీక్కున్నాడు. మెదడు వేడెక్కేలా ఆలోచించాడు. ఆ తర్వాత కాగితం మీద రాసి తీసుకొచ్చి గురువుగారి ముందు చదివాడు.
"పిడికిలి మించని హృదయంలో...
కడలిని మించిన పేరాశలు దాచెను...
మాటలు మార్చి మాయ చేసెను...
అయినా మనిషి మారలేదు! ఆతని తీరు మారలేదు!
అడిగిన వారిపై ఆగ్రహించెను...
కాదన్న వారిపై కేసులు మోపెను...
చివరకి ప్రజలకే టోపీ వేసెను...
అయినా మనిషి మారలేదు! ఆతని యావ చావలేదు!!".
గురవుగారు నవ్వి, "సెభాష్రా ఇక పోయిరా" అన్నారు.
-సృజన
PUBLISHED ON 27.6.2021 IN JANASENA WEBSITE
ఆదివారం, జూన్ 20, 2021
ఇచ్చినట్టే ఇచ్చుకో... జెల్ల కొట్టి గుంజుకో!
"రా రా శిష్యా... సమయానికి వచ్చావ్... నేనిప్పుడే కొన్ని కొత్త సంక్షేమ పథకాలు రచించాన్రా... వాటిలో ఒకటి 'శిష్య భరోసా' పథకం... ఇంద ఈ 50 రూపాయలు తీసుకో..."
అంటూ గురువుగారు డబ్బు అందించారు.
శిష్యుడు ఉబ్బితబ్బిబ్బయిపోయాడు. వినయంగా నోటు అందుకుని కళ్లకద్దుకుని జేబులో వేసుకుని, "ఆహా గురూగారూ... రాజకీయ పాఠాలు చెబుతూ రాటు దేలేలా చేయడమే కాకుండా, ఇలా శిష్యుల కోసం సంక్షేమ పథకాలు రచించే రాజగురువును మిమ్మల్నే చూశాను సార్..." అన్నాడు భక్తితో అరమోడ్పు కన్నులతో.
"అప్పుడే అయిపోలేదురా... 'గురువు ఒడి' అని మరో పథకం కూడా ఉంది. ఇంద ఈ 50 రూపాయలు కూడా తీసుకో... " అంటూ నోటు అందించారు.
"ఆహా.. గురూగారూ! మీలాంటి గురువు దొరకడం నా పూర్వజన్మ సుకృతం సార్..." అంటూ శిష్యుడు అందుకుని, "ఇంతేనాండీ, ఇంకేమైనా పథకాలున్నాయాండీ" అని అడిగాడు ఆశగా.
"ఉన్నాయ్రా... గురువు ఆసరా, గురువు చేయూత, శిష్యశ్రీ, రాజకీయ యజ్ఞం, పాఠాల పెంపు... ఇలా మరికొన్ని ఉన్నాయిరా... "
"అద్భుతం గురూజీ... ఆనందంతో నాకు నోట మాట రావడం లేదండి... నోరెండిపోతోంది. కాస్త మంచి నీళ్లు ఇప్పించండి సార్..."
గురువుగారు మంచినీళ్లు తెప్పించి ఇచ్చి... "ఒరేయ్... కొన్ని కొత్త పన్నులు కూడా ఉన్నయిరోయ్... మన రాజకీయ గురుకులం బాగా నడవాలంటే అవి నువ్వు చెల్లించాలి మరి..." అన్నారు.
"తప్పకుండా సార్... చెప్పండి..." అన్నాడు శిష్యుడు.
"అయితే నువ్వు తాగిన మంచి నీళ్లకు 100 రూపాయలు చెల్లించాలిరా శిష్యా... ".
బిక్కచచ్చిపోయిన శిష్యుడు జేబులోంచి డబ్బు తీసిచ్చి, "ఇది చాలా అన్యాయం గురూగారూ... ఇచ్చినట్టే ఇచ్చి తీసుకుంటున్నారు..." అన్నాడు.
గురువుగారు పగలబడి నవ్వేసి, "ఒరేయ్... ఎప్పుడూ నేను చెప్పడం, నువ్వు రాసుకోవడం అంటే బోర్ కొడుతుందని, కాస్త వెరైటీగా ఇలా చేశాన్రా సన్నాసీ...అయినా ఇది కూడా ఓరాజకీయపాఠమేరా..."
"ఇందులో పాఠమేముంది సార్... సరదాగా నన్ను ఆట పట్టించారంతేగా?"
"కాదురా బడుద్దాయ్... నయా రాజకీయ శకంలో ఇదొక రంజయిన అధ్యాయంరా. బడుగు ప్రజలను ఆకర్షించి, ఊరించి, ఆశపెట్టి, ప్రలోభాలకు గురిచేసి, నమ్మించి, మభ్యపెట్టి, మాయ చేసి, మత్తులో ముంచి, మైకంలో పడేసి, మైమరపించి, గారడీ చేసి, మురిపించి, మరపించి, ఏమరుపాటుకు గురిచేసి... మన రాజకీయ పబ్బం గడుపుకుంటూ, కుర్చీ కాపాడుకుంటూ, అధికారాన్ని చిరకాలం అనుభవించే అనితరసాధ్యమైన నీచ, నికృష్ట, నీతిబాహ్య, నిర్లజ్జ, నిరుపమాన రాజకీయ గజకర్ణ, గోకర్ణ, టక్కు టమార విద్యరా నాయనా..."
"అమ్మబాబోయ్ ఇంత ఉందాండీ? మొత్తానికి మసి పూసి మారేడుకాయ చేయడమే కదండీ? మరిందులో ఆరితేరిన సమకాలీన, సమర్థ, అసమాన రాజకీయ నేత ఎవరైనా ఉన్నారాండీ?"
"ఎందుకు లేరురా... కాస్త పాఠ్య పుస్తకాల పుటల మధ్య నుంచి నీ మస్తకాన్ని చుట్టూ తిప్పి చూడరా... నీ ఆంధ్రా పరగణలోనే పరమాద్భుతమనిపించేలా పరిపాలిస్తున్న అధికార లీలా మానుషవిగ్రహుడు, సుదీర్ఘ రాజకీయ సోపాన నిర్మాణ సంకల్పుడు, కుటిల రాజకీయ వ్యవహార కౌశలుడు, దురంహంకార అధికార వ్యూహ రచనా దురంధురుడు కనిపిస్తాడు కదరా? ఆయన రచించిన పథకాల ముందు నా పథకాలెంతరా నాయనా... అర్థం కాలేదా?"
"అర్థమైంది గురూగారూ! కానీ నాదో చిన్న సందేహమండి... మరి ఆయన రచించిన పథకాల వల్ల ప్రజానీకానికి గొప్ప మేలు జరిగిపోతోందని ఆయన అనుచరులంతా ఊదరగొడుతున్నారు కదండీ... అలాగే వాటిని అందుకుంటున్న జనం కూడా ఆహా... ఓహో అనుకుంటున్న ఉదాహరణలు ఉన్నాయి కదండీ... మరి దానికేమంటారు?"
"అనడానికేముందిరా... అర్థం చేసుకోవడమే కష్టం అవుతుంటేనూ... కానీ ఆ పథకాల మాటున జరుగే తంతు చూస్తే నీకు అంతకు మించిన రాజకీయ పాఠాలు వేరే ఉండవురా... పైకి మేలు చేస్తున్నట్టు కనిపంచే ఆ పథకాలన్నీ ఓట్ల పంట కోసం జల్లే విత్తనాలురా... ఓట్ల చేపల్ని ఒడుపుగా పట్టే వలలురా... తెలిసిందా?"
"సరే గురూగారూ! మీరన్నట్టు ఓట్ల కోసమే అనుకుందాం. కానీ ఎంతో కొంత మేలు జరుగుతున్నట్టే కదండీ? ఇందులో నిగూఢంగా ఉండే పాఠాలు ఏమున్నాయో, నా మట్టి బుర్రకు అర్థమయ్యేట్టు చెబుదురూ, రాసుకుంటాను..."
"ఓరి... నా వెర్రి శిష్యా... ఆ పథకాల కోసం అప్పనంగా ధారపోస్తున్నదంతా ప్రజాధనమే కదరా... ప్రజలంతా కష్టపడి కడుతున్న పన్నుల ద్వారా సమకూరేదే కదా? అమూల్యమైన ప్రజాధనాన్ని రాష్ట్ర సుదీర్ఘ ప్రయోజనాల కోసం, స్వావలంబన కోసం, భవిష్యత్ ప్రగతి చర్యల కోసం, ప్రజల ఆర్ధిక స్థాయి పెంచడం కోసం, రేపటి తరం పురోగతి కోసం కాకుండా... ఇలా తాత్కాలిక స్వీయ రాజకీయ, సొంత అధికార ప్రయోజనాల కోసం విచ్చలవిడిగా ఖర్చు పెట్టడంలో ఎలాంటి ఉద్దేశాలు ఉన్నాయో అర్థం చేసుకో. ఇక నువ్వు చెబుతున్నట్టు కొందరు జనం ఉబ్బితబ్బిబ్బవుతున్నా, ఇటు పథకాల పేరు చెప్పి ఇచ్చినట్టే ఇచ్చి, అటు వాళ్లకి తెలియ కుండానే వాళ్ల జేబులోంచే తిరిగి తీసుకుంటున్న రాజకీయ చాతుర్యాన్ని ఒంట బట్టించుకో. జనాన్ని మత్తులో ముంచి ఖజానాను నింపే మద్యం అమ్మకాల సంగతి చూడు. ఆ అమ్మకాలన్నీ నాణ్యమైన సరుకు సరఫరా పేరిట టోకుగా ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్లిపోయినట్టే కదా? ఆపై వాటి ధరలు అమాంతం పెరిగిపోలేదూ? మరి ఆ భారం అంతా భరించేది ప్రజలే కదా? అదిగో... అలాంటి రాజకీయ కుటిలతను నేర్చకో. మరో పక్క కొత్త పన్నుల సంగతి చూడు. చెత్త మీద కూడా పన్నులు వడ్డించడానికి మున్సిపాల్టీలు సిద్ధం అయిపోతున్నాయి. చెత్తను నిర్మూలించడం ప్రభుత్వం బాధ్యతే కదా? కానీ ఆ చెత్త నిర్వహణకు కూడా ప్రజలే డబ్బులు చెల్లించాల్సి రావడం ఎంత వింతో ఆలోచించు. ఇలాంటి మురికి, చెత్త రాజకీయ ఎత్తుగడలను ఔపోసన పట్టు. అలాగే ప్రజల రక్షణ పేరు చెప్పి వాహనాలని, హెల్మెట్లని, రోడ్డు రూల్స్ అనీ, ప్రమాదాల నివారణ కోసమని పెంచేసిన జుర్మానాలు, చలానాలు, ఫైన్ల సంగతి చూడు. రోడ్డు మీదకు వస్తే చాలు ఏదో విధంగా జనం జేబులో డబ్బు గుంజుకునే సరికొత్త విధానాల రచనా చాతుర్యాన్ని అధ్యయనం చెయ్యి. ఒకప్పుడు సులువుగా దొరికే ఇసుక కూడా అధినేతల అస్మదీయుల అధీనంలోకి పోయి, కృత్రిమ కొరతతో అందరానిదైపోవడం లేదూ? దాని ధర కూడా అంతకు ముందు ఉన్నట్టు ఎక్కడుంది? అదిగో... అలా జనావసరాలకు కావలసిన వ్యవస్థలన్నింటినీ కేంద్రీకృతం చేసి నీ అనుచరులకు, అనుయాయులకు, నీ సొంత ప్రయోజనాలకోసం నువ్వు చెప్పే కంపెనీల్లో పెట్టుబడులు పెట్టగలిగే బడాబాబులకు అప్పగించి, ఆనక ప్రజల నడ్డి విరిచే అధునాతన అరాచకం మీద పరిశోధన చెయ్యి... అర్థమైందా?"
"అర్థం కావడమేంటండి బాబూ... బుర్ర తిరిగిపోతుంటేనూ? అరచేతిలో పాకం చూపించి, మోచేతులు నాకించడం అంటే ఇదే కదండీ... ఇచ్చినట్టే ఇవ్వడం, జెల్లకొట్టి గుంజడం, జేబు గుల్లచేయడం... అబ్బో ఇలా చాలా చాలా పాఠాలు రాసేసుకోవచ్చండి..."
"శెభాష్... ఇక పోయిరా!"
-సృజన
PUBLISHED ON 19.6.2021 IN JANASENA WEBSITE
ఆదివారం, జూన్ 13, 2021
అదీ... అసలైన అర్హత!
"నిన్నెప్పటికైనా ముఖ్యమంత్రిని చేస్తాన్రా... ఇదే నా శపథం" అన్నారు గురువుగారు గంభీరంగా.
అప్పుడే వచ్చిన శిష్యుడు ఆ మాట వింటూనే పులకించిపోయాడు. కళ్ల వెంట నీళ్లు ఉబికాయి. ఒళ్లంతా గగుర్పొడిచింది. గద్గద కంఠంతో "నా జన్మ ధన్యమైపోయింది గురూగారూ... " అంటూ ఉన్నపళంగా గురువుగారి కాళ్లమీద పడిపోయాడు.
గురువుగారు తాపీగా శిష్యుడిని లేవదీసి, "ఓరి నా వెర్రిశిష్యా! ఇలా నీరుగారిపోతే ఎలారా? ఇప్పుడు నువ్వు చేసిన హంగామా అంతా నేనన్నది నిజంగా జరిగినప్పుడు చెయ్యాలి..." అన్నారు.
"అంటే... జరగదా గురూగారూ" అన్నాడు శిష్యుడు బిక్కమొహం పెట్టి.
గురువుగారు నవ్వేసి, "ఓరి పిచ్చి సన్నాసీ... చెప్పడం వేరు, చెయ్యడం వేరురా. ముందు ఇది నేర్చుకో"
"అదేంటి సార్. మీరు చెప్పారంటే చేశారన్నమాటే కదండీ. మీ మాట మీద నాకంత నమ్మకం మరి" అన్నాడు అయోమయంగా.
"ఒరే... నా దగ్గర రాజకీయ పాఠాలు నేర్చుకోడానికి వస్తున్నావ్ నువ్వు. నిన్ను పరీక్షించడానికి అలా అన్నా. నీకేమాత్రం రాజకీయం వంటబట్టి ఉన్నా, నేనలా అనగానే... 'ఏదో మీ అభిమానం... సరే అలాక్కానీండి...' అనాలి గుంభనంగా. అంతేకానీ గబుక్కున గుడ్డిగా నమ్మేయకూడదు. లేకపోతే ఆనక ఆంధ్ర ప్రజానీకంలాగా వెర్రిమొహం వేయాల్సి ఉంటుంది. అర్థమైందా?"
"అంత సులువుగా అర్థమైతే ఇంకా మీ దగ్గరకి ఎందుకు వస్తాను సార్? ఇంతకీ ఆంధ్ర ప్రజానీకం గురించి ఎందుకెత్తుకున్నారో చెప్పండి" అంటూ నీర్సంగా నోట్సు పుస్తకం, పెన్ను తీశాడు శిష్యుడు.
"నీకంత సులువుగా అర్థం కాదులే కానీ, ముందుగా నీకో కథ చెబుతా శ్రద్ధగా విను..." అంటూ గురువుగారు మొదలెట్టారు.
"... అనగనగనగా ఓ పల్లెటూరికి ఓ వస్తాదు వచ్చి, నలుగురి ముందూ బల ప్రదర్శన చేశాడు. పెద్ద పెద్ద బరువులు అవీ ఎత్తి ఆశ్చర్య పరిచాడు. ఆ ఊళ్లో పెద్ద బండరాయి ఉంటే దాన్ని అమాంతం ఎత్తుకుని మోసి చూపించాడు. ఊళ్లో జనమంతా చప్పట్లు కొట్టి ఆనందించారు. తలాకాస్తా పోగేసి ఆ వస్తాదుకు ముట్టచెప్పి పంపించారు. ఆ ఊళ్లో జగ్గూగాడని, ఓ పనికిమాలిన వాడున్నాడు. వాడు ఊరి జనం ముందుకు వచ్చి, 'ఆ వస్తాదుదేం గొప్ప? బాగా తిని బలిశాడు. వాడు తిన్నంత తిండి నాకు ఏడాది పాటు పెడితే చాలు, నేను ఆ కొండనే మోయగలను తెలుసా?' అన్నాడు. ఊరిజనం వాడి మాటలు నమ్మారు. 'సరే అయితే నువ్వంత బలశాలివైతే మా ఊరికే గొప్ప కదా? ఏడాది పాటు ఏది కావాలంటే అది పెడతాం' అంటూ ఒప్పుకున్నారు. అప్పటి నుంచి ఊరివాళ్లందరూ కలిసి చందాలేసుకుని వాడిని మేపారు. ఆ జగ్గూగాడు బాగా పిస్తాలు, బాదాలు, మాంసం, గుడ్లు, పాలు, పళ్లు తింటూ ఏడాది గడిపేశాడు. వాడన్నగడుపు పూర్తవగానే ఊరి జనమంతా కొండ దగ్గర చేరి, 'మరైతే ఆ కొండను ఎత్తు చూద్దాం' అన్నారు. అప్పుడు ఆ జగ్గూగాడు ఏమన్నాడో తెలుసా? 'నేను కొండను మోస్తానన్నాను కానీ ఎత్తుతాననలేదు. మీరంతా ఆ కొండను తెచ్చి నా భుజాల మీద పెడితే ఇట్టే మోసేస్తాను' అన్నాడు. అదీ కథ"
శిష్యుడు కథంతా విని, "వార్నీ ఎంత మోసం? అప్పుడు ఆ ఊరివాళ్లంతా కలిసి ఏం చేశారు సార్?" అన్నాడు ఉత్కంఠతో.
"ఆ ఊరివాళ్లు ఏం చేశారన్నది కాదురా పాయింటు. ఆ పనికిమాలిన వాడు ఏడాది పాటు తన పబ్బం గడుపుకున్నాడా లేదా అనేదే అసలు విషయం. జనాన్ని ఎలా నమ్మించాలో తెలియడం రాజకీయంలో ముఖ్యమైన సూత్రం. తెలిసిందా? చెప్పింది చేశావా లేదా అనేది తర్వాతి సంగతి. ఇప్పుడు చెప్పు ఆ జగ్గూగాడి కథ నీకెందుకు చెప్పానో?"
"తెలిసింది గురూగారూ! ఆ ఊరివాళ్లలాంటి వాళ్లే ఆంధ్ర ప్రజానీకం అని అర్థమైందండి. ఇందులో రాజకీయ సూత్రాలేంటో చెప్పండి రాసుకుంటాను"
"నేను చెప్పడం కాదురా. కొత్త ప్రభుత్వం కొలువుదీరి రెండేళ్లయింది కదా... ఏదో చేసేస్తానని, ఏదేదో ఊడబొడిచేస్తానని చెప్పి కుర్చీ ఎక్కిన వాళ్లు ఏం చేశారో నువ్వే చెప్పు. నీ పరిజ్ఞానం ఎంతో చూద్దాం..."
"చెప్పడానికి ఏముందండీ? ఎక్కడి వేసిన గొంగడి అక్కడే అన్నట్టుందండి కథ. అధినేతగారు అధికారంలోకి రాగానే చేసిన మొదటి ఉపన్యాసం విని ఉబ్బితబ్బిబ్బయిపోయారండి జనం. ఇన్నాళ్లకి మనమంతా ఎదురుచూసిన గొప్పోడొచ్చాడు. ఇక రాజకీయాల్లో మహామహా మర్పులూ గట్రా వచ్చేస్తాయీ అనేసేసి, తెగ సంబర పడిపోయారండి. మొట్టమొదటిగా పాత నేత కట్టించిన అధికార భవనాన్ని అక్రమ నిర్మాణమంటూ పడగొట్టినప్పుడు, ఇక రాష్ట్రంలో ఎక్కడా అక్రమా కట్టడాలూ అవీ ఉండవన్న మాట అనుకున్నారండి. కానీ ఏమైందండీ? ప్రత్యర్ధులను దెబ్బతీయడం కోసమే ఆదర్శాలన్నీ అని బోధపడిందండి. ఎంతసేపూ, ఎగస్పార్టీ వారి మీద పాత కేసులు తిరగదోడి వెంటాడి వేధించడమే తప్ప, జనం గురించి ఆలోచించిన దాఖలాలు లేవండి. ఓటు బ్యాంకు కాపాడుకోడానికి ప్రజాధనాన్ని అప్పనంగా దోచి పెట్టే పథకాలే తప్ప, ప్రజల పురోగతి, ప్రగతి, స్వావలంబన, ముందు చూపులాంటి పన్లేవీ కనిపించడం లేదండి. చట్టం చట్టబండలైపోయిందండి. న్యాయం అనేది అన్యాయమైపోయిందండి. అధికార వ్యవస్థ కూడా అడ్డగోలు పనులకి అలవాటు పడిపోయిందండి. నేత నోటిలో మాటే వేదమైపోయిందండి. ఆఖరికి పెద్ద పెద్ద న్యాయస్థానాలు చురకలేసినా, చలనం అనేది లేదండి. పాత రాజధానిని కాదన్నారండి. దానికోసం భూములిచ్చిన రైతుల్ని, వాళ్ల ఆవేదనని అర్థం చేసుకునే ఇంగితం ఎక్కడా లేదండి. మూడు రాజధానులంటూ మూడుముక్కలాట మొదలైందంది. పోనీ అదేమైనా ముందుకెళ్లిందా అంటే అదీ లేదండి. ప్రత్యేక హోదా అంటూ ఊదరగొట్టిన నోరు, ఇప్పుడా ఊసే ఎత్తడం లేదండి. ఇక పరిశ్రమలు రాబోయేవి కూడా పారిపోయాయండి. కొత్తవేవో వస్తాయనే ఆశ అడుగంటిందండి. మంత్రులు, ఎమ్మెల్యేలు... ముఖ్యమంత్రికి నచ్చని వాళ్లని తిట్టడానికే పరిమితమయ్యారండి. ఎవరైనా నోరెత్తితే ఆళ్ల మీద గూండా పోలీసులు విరుచుకుపడి, అడ్డమైన కేసులూ బనాయించడం నిత్యకృత్యమైపోయిందండి. 'ఒక్క ఛాన్స్... ఒక్క ఛాన్స్...' అంటూ బతిమిలాడితే, గొప్ప ఛాన్సే ఇచ్చారండి జనం. కానీ ఇప్పుడు నోరెత్తే ఛాన్సే లేకుండా పోయిందండి. కులం, మతం అనే కనిపించని గీతలొచ్చేస్తున్నాయండి జనం మధ్యకి. ఇంకెన్ని చెబుతానండి బాబూ... ఒకటా, రెండా... అన్నీ అవకతవకలేనండి. ఆయ్..." అంటూ ఆయాసమొచ్చి ఆగాడు శిష్యుడు.
"సెభాష్రా... నీ చుట్టూ ఏం జరుగుతోందో బాగానే గమనిస్తున్నావ్. నా పాఠాలు ఒంట పడుతున్నట్టే ఉన్నాయి. పోనీ... ఆ ఛాన్స్ నీకే వస్తే ఏం చేస్తావో అదీ చెప్పు.."
"ఛీ... ఛీ... ఇలాంటి పనులు చస్తే చేయనండి. చేసేదే చెబుతానండి. చెప్పింది చేస్తానండి. ఓట్ల కోసం కాకుండా, జనం సంక్షేమం కోసం పాటుపడతానండి. అంతేకదండీ?"
"ఏడిశావ్. నా ఉత్సాహం మీద నీళ్లు జల్లేశావ్ కదరా. ఇలా అయితే నువ్వు రాజకీయాలకు అస్సలు పనికి రావు. నేనేదో నిన్ను ఎప్పటికైనా ముఖ్యమంత్రిని చేద్దామనుకున్నాను. శుద్ధ దండగని అర్థం చేసుకున్నాను"
"అయ్ బాబోయ్... అదేంటి సార్ అలాగనేశారు? మన్నించి మార్గం ఉపదేశించండి గురూగారూ..."
"ఒరేయ్ నేను చెప్పిన కథలో ఆ జగ్గూగాడే నీకు ఆదర్శం. ఆడిలాగా జనం ముందు గప్పాలు గొట్టి, నమ్మించడమే ముఖ్యం. ఆనక నువ్వేం చేస్తావో అనవసరం. చేసేది చెప్పావా, నాశనమైపోతావ్. చెప్పింది చేశావా, మసైపోతావ్. ఇంతకు మించిన రాజకీయ పాఠం ఇంకేం అక్కర్లేదు. ముందు నువ్వు నీ మనస్సులో ఉన్న మంచి భావాలన్నీ వదిలించుకుని వచ్చి నాకు కనబడు. అప్పుడు చెబుతాను, నీకు ముఖ్యమంత్రి అయ్యే అసలైన అర్హత ఉందో లేదో..." అంటూ గురువుగారు గద్దించారు.
శిష్యుడు మొహం వేలాడేసుకుని వెళ్లిపోయాడు.
PUBLISHED ON 12.6.2021 IN JANA SENA WEBSITE
శనివారం, జూన్ 05, 2021
మనమేం చేస్తే అది ఘనకార్యం!
అధినేత ఆకాశంలో సూర్యుడికేసి తదేకంగా చూస్తున్నాడు. వెనక నుంచి సెక్రటరీ వచ్చాడు.
-సృజన
PUBLISHED ON 4.6.2021 IN JANA SENA WEBSITE