మంగళవారం, అక్టోబర్ 02, 2012

అప్పారావూ... అతడి భాష!



అప్పారావు కరడు కట్టిన పాత్రికేయుడు. పాత్రికేయం అతడి నరనరానా వంటబట్టేసింది. అసలు పుడుతూనే కలం పట్టుకుని పుట్టేడేమో తెలియదు. మంత్రసానిని కనుక్కోవాలి. బుల్లి గుప్పెట్లో గట్టిగా పట్టుకున్న సదరు కలం పదును చూసి ఆవిడ ముచ్చటపడి బొడ్డు కోసేముందే తన బొడ్లో దోపేసి ఉంటే ఆ నిజం బయటకు రాకపోవచ్చు. మొత్తం మీద చిన్నప్పటి నుంచీ అప్పారావు అలాంటి బుద్ధులే చూపించాడు. దినపత్రిక చూపిస్తే కానీ గోరుముద్దకు నోరు జాపేవాడు కాదు. టీవీలో వార్తలు పెడితే కానీ అన్నం తినేవాడు కాదు. పైగా బాల్యం నుంచీ సామాజిక స్పృహ ఎక్కువేనేమో కూడా. ఎందుకంటే మనవాడు మారాం లేకుండా తినాలంటే ఆరోజు వార్తల్లో దారుణాలు జరిగి ఉండాలి. భూకంపాలో, వరదలో, సునామీలో వస్తే గుటుకూ గుటుకూ ముద్దలు మింగేసేవాడు. వాళ్లమ్మ రోజూ దినపత్రిక తిరగేస్తూ, టీవీ మీట నొక్కుతూ, 'భగవంతుడా! ఏదైనా ఉత్పాతం జరిగేలా చూడు తండ్రీ!' అని కోరుకునేది.

బడిలో కూడా అంతే. పలక మీద అక్షరాలు ఇష్టం వచ్చినట్టు రాశేసేవాడు. మాస్టారు గతుక్కుమన్నారు. ఆనక ఆరా తీస్తే తెలిసింది. అప్పారావు అమ్మ రచయిత్రి. నాన్న విలేకరి. ఇద్దరూ ఇష్టం వచ్చిన రాతలు రాసేవారే. మరి ఆ బుద్ధులు ఎక్కడికి పోతాయి? దరిమిలా అప్పారావు చాలా చురుగ్గా ఎదిగాడు. పత్రికలన్నీ చదివేసేవాడు. వార్తలే వల్లెవేసేవాడు. వార్తా ప్రసారాలే చూసేవాడు.

ఓసారి పరీక్షలో న్యూటన్ గమన సూత్రాలను రాయమన్నారు. విశ్వంలో ఏదైనా స్థితిని మార్చుకోవాలంటే బాహ్యబలం పనిచేయాలని న్యూటన్ చెబితే, మనవాడు ఈ విశ్వంలో ఏ వార్త పుట్టాలన్నా కలం బలం ఉండాల్సిందేనన్నాడు. దేని త్వరణమైనా బలానికి అనులోమానుపాతంలోను, ద్రవ్యరాశికి విలోమానుపాతంలోను ఉంటుందని ఆయన చెబితే, మనవాడు ఏ వార్త వేగమైనా పత్రిక సిద్ధాంతానికి అనులోమానుపాతంగాను, రాద్ధాంతానికి విలోమానుపాతంలోను ఉంటుందని నిర్వచించాడు. ప్రతి చర్యకూ ప్రతిచర్య ఉంటుందని ఆయన చెబితే, మనవాడు ప్రతి వార్తకు ఖండన ఉంటుందని రాశాడు. మాస్టారు మొదట తెల్లబోయారు. తర్వాత తేరుకుని అడ్డంగా కొట్టేస్తే అప్పారావు తరగతిలోనే బైఠాయించాడు. ప్రధానోపాధ్యాయుడికి ఫిర్యాదు చేశాడు. విద్యాధికారికి వినతి పత్రం సమర్పించాడు.

'నేను సమాధానాన్ని సృజనాత్మకంగా రాయడం జరిగింది. దాన్ని మాస్టారు గ్రహించక పోవడం జరిగింది. కాబట్టి నాకు అన్యాయం జరిగింది. మీరు ఈ విషయంలో జోక్యం చేసుకోవడం జరిగితే, నాకు న్యాయం జరిగి, నేను ఆనందించడం జరుగుతుంది. ఇవన్నీ జరిగే వరకు తరగతి నుంచి జరగనని నేను శపథం చేయడం జరిగిందని మీరు గ్రహించడం జరగకపోతే నాకు మార్కులు రావడం జరగదు' అని రాశాడు.

ఆ భాషాప్రయోగానికి ప్రధానోపాధ్యాయుడి కళ్లు తిరిగాయి. విద్యాధికారికి కడుపులో తిప్పింది. తల్లిదండ్రుల్ని పిలిచి మాట్లాడారు. వాళ్లు అంతావిని 'వీడు ఇంట్లో కూడా ఇలాగే మాట్లాడుతున్నాడు. ఏం చేయాలో ఏంటో?' అన్నారు అయోమయంగా. పక్కనే ఉన్న అప్పారావు విసురుగా కుర్చీలోంచి లేచి, 'మీ వ్యాఖ్యలను నేను ఖండిస్తున్నాను. వాటిని వెంటనే ఉపసంహరించుకోండి' అన్నాడు. అందరూ తలలు పట్టుకున్నారు.

ఆపై అమ్మానాన్నా ఎంత చెప్పినా అప్పారావు వినలేదు. చక్కని తెలుగు చదివి వినిపిస్తే చెవులు మూసుకునేవాడు. దినపత్రికల్లోనే తేట తెలుగు వాక్యాలతో ఉన్న వార్తల్ని, భాష మీద మంచి ప్రయోగాలు చేసే పత్రికల్ని ఇచ్చినా కన్నెత్తి చూసేవాడు కాదు. తనకు నచ్చిన పత్రికాభాషలోనే మాట్లాడేవాడు. నచ్చచెప్పాలని చూస్తే, 'నాకు తోచినట్టు మాట్లాడ్డం నా ప్రాథమిక హక్కు. దాన్ని కాలరాయాలని చూస్తే సహించేది లేదని మిమ్మల్ని చివరిసారిగా హెచ్చరిస్తున్నాను' అనేశాడు. ఆపై అమ్మానాన్నా నోరెత్తితే ఒట్టు.

అలాంటి అప్పారావు ఎదుగుతున్న కొద్దీ మరింత కరడుకట్టేశాడు. తెలుగు ఇలా కూడా మాట్లాడవచ్చా అనే సందేహం కలిగేలా మాట్లాడేవాడు. పాపం... అతనికి స్నేహితులు కూడా లేరు. కారణం అతడి భాషే. ఓసారి ఓ స్నేహతుడు అప్పారావుని సినిమాకి తీసుకెళ్లాడు. చివర్లో 'ఎలా ఉందిరా?' అని అడిగితే, 'ఇలాంటి సినిమా నాకు నచ్చుతుందని నువ్వు భావిస్తే, నువ్వెంత హీన స్థితిలో ఉన్నావో అని నేను అనుకుంటాననే విషయం నీకు తోచనందుకు నేను ఆశ్చర్యపోతానని నువ్వెందుకు గ్రహించడం లేదు?' అన్నాడు. ఆ స్నేహితుడు రోడ్డు మీదే కళ్లు తిరిగి పడిపోయాడు. చుట్టుపక్కల వాళ్లు మొహం మీద సోడానీళ్లు కొట్టి సేదతీర్చి ఇంటికి పంపారు. ఆపై అతడు అప్పారావు ఇంటి ఛాయలకు కూడా రావడం మానేశాడు. అతడే అప్పారావు చిట్టచివరి స్నేహితుడు.

చదువైపోపోగానే ఇక అప్పారావు సమయాన్ని వృథా చేయదలుచుకోలేదు. వెంటనే బజార్లోకెళ్లి ఓ పెద్ద కంకణం కొనుక్కుని ఇంటికి వచ్చాడు. అమ్మ అదేంట్రా అని అడిగితే, 'పాత్రికేయ వృత్తిలో ప్రవేశించి సమాజాన్ని ఉద్ధరించాలని కంకణం కట్టుకున్నానమ్మా! అదే ఇది. నను కన్న మాతృమూర్తిగా ఆశీర్వదించి పంపితే, పీడిత తాడిత ప్రజలకు చేయూతనై, అణచివేత వల్ల అణగారిన బతుకులకు ఆశాదీపాన్నై వెలుగొందుతా' అన్నాడు ఆవేశంగా. అమ్మ నీరసంగా చెయ్యెత్తగానే బయటకి పరిగెత్తాడు. ఓ దినపత్రిక కార్యాలయానికి వెళ్లి సంపాదకుడిని కలిశాడు.

'నాలో రక్తం లేదు. పాత్రికేయమే ప్రవహిస్తోంది. నరనరానా అక్షర కణాలు అగ్ని విస్ఫోటనాలై ప్రజ్వరిల్లుతున్నాయి' అన్నాడు.

ఆయన ఎగాదిగా చూసి, 'కణాలు విస్ఫోటనాలవుతున్నాయా? క్యాన్సరేమో చూపించుకో నాయనా!' అని పంపేశాడు.

ఇది కాదు పనని దస్తాడు కాగితాలు తెచ్చుకుని దినపత్రికలకు ధరకాస్తులు పంపాడు. చాలా మంది చురుకైన సంపాదకులు చటుక్కున ప్రమాదాన్ని శంకించి, ఉండ చుట్టి చెత్త బుట్టలో పడేయడం వల్ల బతికిపోయారు. కొంత మంది పాపం పూర్తిగా చదివి అస్వస్థతకు గురయ్యారు. అనుకున్నది అందక తిక్కరేగిన అప్పారావు, ఇంట్లో దినపత్రికలన్నీ చింపి పడవలు చేస్తుండడంతో నాన్న భరించలేక తనకు తెలిసున్న సంపాదకుడికి సిఫార్సులేఖ రాశాడు. 'వాడిని ఎక్కడో అక్కడ కూర్చోబెట్టండి. ఏదో ఒకటి రాయనివ్వండి. వేస్తే వేయండి, లేకపోతే లేదు. నేను నెలనెలా కొంత మొత్తం పంపుతాను. దాన్నే జీతంగా ఇవ్వండి' అంటూ ఏకరువు పెట్టుకున్నాడు. మర్నాడు ఆ పత్రిక కార్యాలయం నుంచి ఉత్తరం వస్తే అప్పారావు అశ్వనీ నాచప్పలా పరుగెత్తుకుంటూ వెళ్లి సంపాదకుడితో, 'నాలోని ప్రతిభను చూసి ఉద్యోగం ఇచ్చారని భావిస్తున్నాను. మీరు ఏకీభవిస్తున్నారా?' అని అడిగాడు. ఆయన మౌనంగా తలూపి ఓ కుర్చీ చూపించాడు. వారం రోజులైనా ఏ పనీ చెప్పకపోయేసరికి అప్పారావుకి విసుగొచ్చింది. 'మీరు నాలోని విలేకరిని చంపేస్తున్నారు. తృష్ణని చిదిమేస్తున్నారు. ఆకాంక్షను అదిమేస్తున్నారు. ఎక్కడికైనా పంపండి' అన్నాడు.

సంపాదకుడు కాసేపు ఆలోచించి, 'సరే. సినిమా తార నగల దుకాణం ప్రారంభోత్సవానికి వస్తోంది. వెళ్లిరా' అన్నాడు.

అప్పారావు దూసుకుపోయాడు. అభిమానుల మధ్య నుంచి తోసుకుంటూ సినీతారను సమీపించి 'ఇంకా చేయడం లేదేం? గబగబా చేయండి' అన్నాడు.

ఆ తార తెల్లబోయి, 'ఏంటి చేసేది?' అంది.

'అదే... సందడి!'

'అంటే?'

'అంటే ఏంటేంటి? మీరు వచ్చి సందడి చేశారని పత్రికల్లో రాస్తుంటారు. నాకు తెలియదనుకున్నారా? ఆ సందడేదో చేయండి. మీరు ఎలా సందడి చేశారో చూసి చక్కగా రాస్తా. ఇంతకీ మీరు అందరి తారలు చేసే సందడే చేస్తారా? లేక కొత్త సందడేమైనా చేస్తారా?' అన్నాడు అప్పారావు.

ఆ తారకు తారలు కనిపించాయి.

తిరిగొచ్చిన అప్పారావు, 'ఆ తార నగల దుకాణంలో ఎలాంటి సందడీ చేయలేదు. కేవలం ప్రారంభోత్సవం చేసింది' అని రాశాడు. కానీ మర్నాడు పత్రికలో ఆ వార్త రాలేదు. మరో విలేకరి రాసిన వార్తలో సందడి చేసినట్టు వచ్చింది.

'ఇది అన్యాయం. అబద్ధపు పాత్రికేయం. అసలామె సందడి చేయందే?' అంటూ అప్పారావు ఎంత వాదించినా అందరూ నవ్వారే తప్ప జవాబివ్వలేదు.

మరోసారి అప్పారావు ఓ రాజకీయ నాయకుడు పెట్టిన విలేకరుల సమావేశానికి వెళ్లాడు. ఆరోజే జరిగిన అగ్నిప్రమాదం గురించి ఆయన మాట్లాడాడు. తిరిగొచ్చాక అప్పారావు, 'అగ్నిప్రమాదానికి ఆయన దిగ్భ్రాంతికి గురయ్యానన్నారు. అయితే దిగ్భ్రాంతికి గురైన వారెవరూ కారులో విలేకరుల సమావేశానికి వచ్చి మాట్లాడలేరు. అలాగే జరిగిన దానికి ఎంతో విచారిస్తున్నానన్నారు. కానీ ఏడ్చిన దాఖలాలేవీ కనిపించలేదు. ఇదిలా ఉండగా, ఆయన బుగ్గలపై కన్నీటి చారికలు లేవు సరికదా, మధ్యలో నవ్వారు కూడా' అని రాశాడు. సంపాదకుడు పిలిచి ఇదేమిటని అడిగాడు.

'వాస్తవ పాత్రికేయం' అన్నాడు అప్పారావు. వెంటనే ఆయన దిగ్భ్రాంతికి గురయ్యాడు.


ఓసారి అప్పారావు టీవీలో వార్తలు చదువుతున్న మెరుపుతీగలాంటి అమ్మాయిని చూశాడు. చూస్తూనే ప్రేమలో పడిపోయాడు. వెంటనే కాగితం అందుకుని ఉత్తరం రాశాడు.

'తొలి చూపులోనే నాకు నీ మీద ప్రేమ కలిగిందని నేను భావిస్తున్నానంటే నువ్వు ఆనందిస్తావని నొక్కివక్కాణిస్తున్నాను. అందుకే నా ప్రేమను పునరుద్ఘాటిస్తున్నాను. కాగా, ఇది కేవలం కాలక్షేపం ప్రేమ కాదని, ప్రత్యక్షర సత్యమని నిండు మనసుతో ప్రకటిస్తున్నాను. ఇదిలా ఉండగా, మనం పెళ్లి చేసుకుంటే పాత్రికేయంలో రెండు పార్శ్వాలు ఏకమవుతాయని మనవి చేసుకుంటున్నాను. ఆ విధంగా ముద్రణ మాధ్యమం, దృశ్య మాధ్యమం మమేకమై పరిఢవిల్లుతాయని నేనంటే నువ్వు కాదనవనే నమ్మకం నాకు ఉందని నీకు మరోసారి ధ్రువీకరించనక్కర్లేదని అనుకుంటున్నాను. నీ అంగీకారాన్ని స్వయంగా కానీ, పత్రికాముఖంగా కానీ, తెలియజేస్తే నా అంత అదృష్టవంతుడు మరెవరూ ఉండరని భావిస్తాను'.

ఆ ఉత్తరానికి ఆ అమ్మాయి నుంచి జవాబు వచ్చింది. 'మీకు నామీద ఉన్న ప్రేమను నేను పూర్తిగా విశ్వసిస్తున్నానని చెప్పడం అతిశయోక్తి కాదు. అంతకు పదింతల ప్రేమ నాకూ మీ మీద కలిగిందని చెప్పడానికి ఏమాత్రం సంశయించనవసరం లేదని నేను భావిస్తున్నానంటే మీరెంత ఆనందిస్తారో నాకు తెలియనిది కాదు. మీరు చెప్పినట్టు మనిద్దరం ఏకమైతే, రెండు మాధ్యమాల మధ్య ప్రేమ బంధం, మూడు ముళ్లతో ముడిపడి, నాలుగు కాలాల పాటు చల్లగా, పంచభూతాల సాక్షిగా, ఆరు రుతువుల్లోనూ పచ్చగా ఉండేలా, మీతో ఏడడుగులు నడవడానికి అష్టకష్టాలైనా పడతానని, నవగ్రహాలను ఎదిరించైనా, పదిమంది ముందు పెళ్లి చేసుకోడానికి వెంటనే నడిచి వస్తానని చెప్పకనే చెబుతున్నాను'

అప్పారావు ఉత్తరాన్ని ఆ అమ్మాయి తన తల్లిదండ్రులకు, ఆ అమ్మాయి ఉత్తరాన్ని అప్పారావు తన తల్లిదండ్రులకు చూపించారు. ఇరువైపుల పెద్దలు కలుసుకున్నారు.

అమ్మాయి తండ్రి గద్గద స్వరంతో, 'అసలు మా అమ్మాయికి పెళ్లవుతుందని మేం అనుకోలేదండి. ఆ టీవీ యజమాని నా స్నేహితుడే కావడంతో రాసిచ్చినవి మాత్రమే చదవాలనే షరతు మీద ఉద్యోగమిచ్చాడు' అన్నాడు.

అప్పారావు తండ్రి ఆయన్ని ఓదార్చి, 'అసలు వీళ్లకి ఈ తెలుగెలా వంటబట్టిందో తెలియడం లేదండి. వీడికెలా పెళ్లవుతుందని మేమూ బెంగ పెట్టుకుంటే మీ అమ్మాయి తారసపడింది' అన్నాడు.

'పోన్లెండి. దొందు దొందే. పెళ్లయ్యాక ఇద్దరూ మారతారేమో. ఒకవేళ మారకపోయినా వాళ్లలో వాళ్లు మాట్లాడుకుంటారు కాబట్టి మనకిక చింతలేదు' అని ఇద్దరి తరపున పెద్దలు నవ్వుకుని తాంబూలాలు పుచ్చేసుకున్నారు.

పెళ్లయ్యాక అప్పారావు దంపతుల చేత వేరు కాపురం పెట్టించారు. ఆరునెలలకి అప్పారావు మామగారికి ఉత్తరం రాశాడు.

'దైవ స్వరూపులైన మామగారి సముఖానికి! అల్లుడు అప్పారావు వ్రాయునది. నా భార్య అయిన మీ అమ్మాయి నెలతప్పిందని అభిజ్ఞవర్గాల భోగట్టా. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఆమెకు రెండో నెలని తెలియవచ్చింది. అయితే ఈ విషయం ఇంకా నిర్ధరణ కావలసి ఉంది. వాస్తవాలు వెలికి వచ్చేంత వరకు ఎవరికీ చెప్పవద్దని వైద్యులు హెచ్చరించినా, మీ అమ్మాయి పట్టుబట్టడం వల్ల మీకు ఉత్తరం రాస్తున్నాను. ఈ విషయంలో నా ప్రమేయం ఏమీ లేదని తెలుసుకోగలరు'

ఆయన ఆదరాబాదరా వియ్యంకుడి దగ్గరకి పరిగెత్తుకుని వచ్చి ఆ ఉత్తరంలో ఆఖరి వాక్యం చూపించి లబోదిబోమన్నాడు.

'మీరేం కంగారు పడకండి. అంటే మా వాడి ఉద్దేశం ఈ శుభవార్తను ముందుగానే చెప్పడంలో తన ప్రమేయం లేదని మాత్రమే. వాడి తెలుగు వాడిది. మనమేం చేస్తాం' అని సముదాయించాడు.

తేరుకున్నాక వియ్యంకులిద్దరూ ఒక గట్టి నిర్ణయానికి వచ్చారు. పుట్టిన మనవడిని కానీ, మనవరాలిని కానీ టీవీ లేని ఇంట్లో పెంచాలనీ! వార్తల ప్రపంచానికి దూరంగా ఉంచాలనీ!

                                                                       -ఎ.వి.ఎన్.హెచ్.ఎస్. శర్మ
PUBLISHED IN EENADU 'TELUGU VELUGU' MONTHLY MAGAZINE OCTOBER 2012 ISSUE.

1 కామెంట్‌:

  1. సింప్లీ సూపర్బ్ సర్.
    నవ్వులే నవ్వులు, మనసారా నవ్వించారు.
    చాలాచాలా బావుంది.

    రిప్లయితొలగించండి