ఆదివారం, జులై 05, 2026
సైన్స్ కూడా చెబుతోంది... మరి పొద్దున్నే లేద్దామా?
బ్రహ్మముహూర్తంలో నిద్ర లేస్తే అనేక ప్రయోజనాలు ఉంటాయని ఆధ్యాత్మిక వాదులు చెబుతుంటారు. ఇది చాలా మంది అంగీకరించే విషయం కూడా. ప్రపంచ ప్రముఖులెందరో ఈ విషయాన్ని పాటించడమే కాదు, తరచు ప్రస్తావిస్తూ ఉంటారు కూడా. వీరిలో అత్యధిక సంపన్నులు, విజయ పథంలో దూసుకుపోతున్నవారు, కళాకారులు, క్రీడాకారులు... ఇలా ఎంతో మంది ఉంటారు.
అయితే ఇదే విషయాన్ని సైన్స్ కూడా చెబుతోందంటే అది ఆసక్తికరమైన సంగతే కదా? అందుకే బ్రహ్మముహూర్తం లేదా తెల్లవారుజామున లేవడం గురించిన సంగతులేంటో తెలుసుకుందాం.
సూర్యోదయానికి సుమారు 1 గంట 36 నిమిషాల ముందు ప్రారంభమయ్యే కాలాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు. ఈ సమయంలో నిద్ర లేవడం వల్ల కలిగే ప్రయోజనాలపై పురాతన నమ్మకాలతో పాటు, ఆధునిక శాస్త్రవేత్తలు కూడా అనేక పరిశోధనలు చేశారు.
దీని వెనుక ఉన్న శాస్త్రీయ నిజాలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న నమ్మకాల గురించిన వివరాలేంటో చూద్దాం.
- శాస్త్రీయ పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
ఆధునిక విజ్ఞానశాస్త్రం "సిర్కాడియన్ రిథమ్" (Circadian Rhythm - శరీర జీవ గడియారం), "క్రోనోబయాలజీ" (Chronobiology) అనే విభాగాల ద్వారా బ్రహ్మముహూర్తం ప్రాముఖ్యతను నిరూపించింది.
• కార్టిసాల్, మెలటోనిన్ సమతుల్యత: శాస్త్రీయ పరిశోధనల ప్రకారం, తెల్లవారుజామున 3:00 నుండి 4:30 AM మధ్య కాలంలో నిద్రను ప్రేరేపించే మెలటోనిన్ (Melatonin) హార్మోన్ స్థాయిలు క్రమంగా తగ్గిపోతాయి. అదే సమయంలో, మనల్ని చురుగ్గా ఉంచే కార్టిసాల్ (Cortisol) హార్మోన్ స్థాయిలు సహజంగానే పెరుగుతాయి. ఈ మార్పు జరుగుతున్నప్పుడు నిద్ర లేవడం వల్ల రోజంతా అలసట లేకుండా, ఉత్సాహంగా ఉండవచ్చని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.
• మానసిక ఆరోగ్యం - డిప్రెషన్ నివారణ: 2021లో Nature Communications అనే అంతర్జాతీయ జర్నల్లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం, ఉదయాన్నే త్వరగా లేచే అలవాటు ఉన్నవారిలో డిప్రెషన్ (కుంగుబాటు) వచ్చే ప్రమాదం 23% తక్కువగా ఉన్నట్లు తేలింది. తెల్లవారుజామున మన మెదడులో ఆలోచనలను క్రమబద్ధీకరించే డోపమైన్, సెరటోనిన్ వంటి హార్మోన్లు సరైన మోతాదులో విడుదలవుతాయి.
• నాణ్యమైన 'ప్యూర్ ఆక్సిజన్' (Nascent Oxygen): తెల్లవారుజామున వాతావరణంలో కాలుష్యం చాలా తక్కువగా ఉంటుంది. ఈ సమయంలో గాలిలో ఓజోన్ (O3) శాతం కొద్దిగా ఎక్కువగా ఉండి, విడిపోయి స్వచ్ఛమైన ఆక్సిజన్ (O2) లభిస్తుంది. ఇది ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచి, రోగనిరోధక శక్తిని (Immunity) బలపరుస్తుందని వైద్య పరిశోధనలు చెబుతున్నాయి.
• జీవన నాణ్యత (Quality of Life) పై రీసెర్చ్: ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం ఒక ప్రసిద్ధ ఆయుర్వేద పరిశోధనా పత్రికలో (ResearchGate) 600 మందిపై ఒక సర్వే చేశారు. అందులో బ్రహ్మ ముహూర్తంలో లేచే 300 మందిలో ఏకాగ్రత, నిద్రపై సంతృప్తి, శారీరక శక్తి స్థాయిలు... ఆలస్యంగా లేచే మిగతా 300 మంది కంటే గణనీయంగా మెరుగ్గా ఉన్నట్లు రుజువైంది.
- ప్రపంచవ్యాప్తంగా ఏ ఏ దేశాల్లో దీనిని నమ్ముతారు?
తెల్లవారుజామున లేవడం ఆధ్యాత్మికంగా, ఆరోగ్యపరంగా మేలు చేస్తుందనే నమ్మకం భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోని వివిధ దేశాల సంస్కృతులలో విభిన్న పేర్లతో ముడిపడి ఉంది:
1. భారతదేశం (భారతీయ సంస్కృతి, ఆయుర్వేదం)
భారతదేశంలో దీనిని బ్రహ్మ ముహూర్తం లేదా అమృత వేళ (సిక్కు సంప్రదాయంలో) అంటారు. ఈ సమయంలో 'వాత దోషం' ఎక్కువగా ఉంటుందని, ఇది మెదడును చురుగ్గా ఉంచి, ధ్యానం, యోగా, అధ్యయనాలకు అత్యంత అనుకూలమైనదని ఆయుర్వేద గ్రంథాలైన చరక సంహిత, అష్టాంగ హృదయం పేర్కొన్నాయి.
2. చైనా (సాంప్రదాయ చైనీస్ వైద్యం - TCM)
చైనా దేశపు సాంప్రదాయ వైద్యంలో శరీరానికి ఒక 'ఆర్గాన్ క్లాక్' (Organ Clock) ఉంటుందని నమ్ముతారు. వారి ప్రకారం తెల్లవారుజామున 3 AM నుండి 5 AM వరకు ఉండే సమయం ఊపిరితిత్తులకు (Lungs) సంబంధించినది. ఈ సమయంలో లేచి ప్రాణాయామం లేదా శ్వాసక్రియలు చేయడం వల్ల శరీరంలో 'చి' (Qi - ప్రాణశక్తి) అద్భుతంగా ప్రవహిస్తుందని చైనీయులు బలంగా నమ్ముతారు.
3. జపాన్ (ఇకిగాయ్, ఉదయాన్నే మేల్కొనడం)
జపనీస్ సంస్కృతిలో "అసకాట్సు" (Asakatsu - ఉదయపు కార్యకలాపాలు) అనే భావన ఉంది. సూర్యోదయానికి ముందే లేచి ఆ సమయాన్ని కేవలం ఆత్మపరిశీలనకు, వ్యాయామానికి లేదా వ్యక్తిగత ఎదుగుదలకు కేటాయించడం వల్ల జీవితకాలం (Longevity) పెరుగుతుందని వారు నమ్ముతారు. జపనీయుల ప్రసిద్ధ జీవన విధానం 'ఇకిగాయ్' (Ikigai) లో కూడా ఇది ఒక భాగం.
4. పశ్చిమ దేశాలు (అమెరికా, యూరప్ - "The 5 AM Club")
పాశ్చాత్య దేశాలలో దీనికి మతపరమైన కోణం లేకపోయినప్పటికీ, విజయవంతమైన వ్యక్తులు దీనిని ఒక లైఫ్స్టైల్గా మార్చుకున్నారు. రాబిన్ శర్మ రాసిన ప్రసిద్ధ పుస్తకం "The 5 AM Club" ద్వారా ఈ pre-dawn (సూర్యోదయానికి ముందు) సమయం పశ్చిమ దేశాల్లో ఒక ఉద్యమంలా మారింది. ఉదయాన్నే ఎవరి Distraction (అంతరాయం) లేని ప్రశాంతమైన సమయాన్ని విజయానికి మూలస్తంభంగా వారు భావిస్తారు.
ప్రాచీన కాలంలో మన పెద్దలు ఏ సమయాన్ని అయితే "దేవతల సమయం" అని ఆధ్యాత్మికంగా చెప్పారో, నేటి ఆధునిక విజ్ఞానం దానిని "Biological Prime Time" (శరీరానికి అత్యంత అనుకూలమైన సమయం) అని సైంటిఫిక్గా అంగీకరిస్తోంది.
-ప్రముఖులు చెబుతున్నారిలా...
తెల్లవారుజామున నిద్రలేవడం తమ విజయానికి, ఉత్పాదకతకు (productivity) అత్యంత ముఖ్యమైన కారణమని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది అగ్రశ్రేణి వ్యాపారవేత్తలు, సీఈఓలు, రచయితలు, నాయకులు గట్టిగా చెబుతున్నారు.
పాశ్చాత్య దేశాలలో దీనిని "The 5 AM Club" లేదా "Early Risers" సంస్కృతి అని పిలుస్తారు. ఉదయాన్నే లేవాలని గట్టిగా సిఫార్సు చేసే ప్రపంచ ప్రముఖులలో కొందరు ఏమంటున్నారో చూద్దాం...
- ప్రపంచ ప్రసిద్ధ బిజినెస్ లీడర్స్, సీఈఓలు (Business Leaders)
• టిమ్ కుక్ (Tim Cook) - ఆపిల్ (Apple) సీఈఓ: ఈయన ప్రతిరోజూ తెల్లవారుజామున 3:45 AM కే నిద్రలేస్తారు. ఆ సమయంలోనే ఆయన తన ఈమెయిల్స్ అన్నీ చెక్ చేసుకుని, ఉదయం 5 గంటలకల్లా జిమ్లో వ్యాయామం పూర్తి చేస్తారు. మిగిలిన ప్రపంచం నిద్ర లేవకముందే రోజూవారీ పనులపై ఒక పట్టు సాధించడం దీనివల్ల సాధ్యమవుతుందని ఆయన అంటారు.
• బాబ్ ఐగర్ (Bob Iger) - డిస్నీ (Disney) సీఈఓ: బాబ్ ఐగర్ ప్రతిరోజూ ఉదయం 4:15 AM కి అలారం పెట్టుకుని లేస్తారు. ఆ ప్రశాంతమైన సమయంలో ఎటువంటి ఫోన్ కాల్స్, డిస్ట్రాక్షన్స్ లేకుండా సంగీతం వినడం, వ్యాయామం చేయడం, పేపర్ చదవడం వంటివి చేస్తారు. "ఇది నా మానసిక ప్రశాంతతకు అత్యంత అవసరం" అని ఆయన పేర్కొన్నారు.
• ఇంద్రా నూయి (Indra Nooyi) - పెప్సికో (PepsiCo) మాజీ సీఈఓ: భారత సంతతికి చెందిన ఈ విజయవంతమైన మహిళా లీడర్ ప్రతిరోజూ తెల్లవారుజామున 4:00 AM కి మేల్కొనేవారు. తెల్లవారుజామున లేవడం వల్ల లభించే అదనపు సమయం, క్లిష్టమైన వ్యాపార నిర్ణయాలు తీసుకోవడానికి తనకు ఎంతో సహాయపడిందని ఆమె చెబుతారు.
• రిచర్డ్ బ్రాన్సన్ (Richard Branson) - వర్జిన్ గ్రూప్ (Virgin Group) వ్యవస్థాపకుడు: ఈ ప్రసిద్ధ బిలియనీర్ రోజూ ఉదయం 5:00 AM కి నిద్రలేస్తారు. "నా 50 ఏళ్ల వ్యాపార జీవితంలో నేను నేర్చుకున్నదేమిటంటే, త్వరగా లేవడం వల్ల మనం అనుకున్న పనులన్నింటినీ ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయవచ్చు" అని ఆయన తన బ్లాగ్లో రాశారు.
2. రచయితలు, జీవనశైలి నిపుణులు (Authors & Thinkers)
• రాబిన్ శర్మ (Robin Sharma) - ప్రముఖ రచయిత: ఈయన రాసిన "The 5 AM Club" అనే పుస్తకం ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కొద్దీ అమ్ముడుపోయింది. "ఉదయం 5 గంటల నుండి 6 గంటల వరకు ఉండే సమయాన్ని 'The Victory Hour' (విజయాల సమయం) అంటారు. ఈ సమయంలో మీ మెదడు అత్యంత శక్తివంతంగా పనిచేస్తుంది" అనేది ఈయన సిద్ధాంతం. ఈయన ప్రతిపాదించిన 20/20/20 సూత్రం (20 నిమిషాల వ్యాయామం, 20 నిమిషాల ఆత్మపరిశీలన/ధ్యానం, 20 నిమిషాల చదువు) ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది.
• జోకో విలింక్ (Jocko Willink) - మాజీ యూఎస్ నేవీ సీల్ & రచయిత: ఈయన ప్రతిరోజూ ఉదయం 4:30 AM కి లేచి, తన వాచ్ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. డిసిప్లిన్ (క్రమశిక్షణ) అనేది ఉదయాన్నే లేవడం నుండే ప్రారంభమవుతుందని, మీ పోటీదారుడి కంటే ఒక అడుగు ముందుండడానికి ఈ సమయం పనికొస్తుందని ఆయన అంటారు.
3. చారిత్రక ప్రముఖులు (Historical Figures)
• బెంజమిన్ ఫ్రాంక్లిన్ (Benjamin Franklin) - అమెరికా వ్యవస్థాపక పితామహుడు: ఈయన చెప్పిన ప్రసిద్ధ సామెత ప్రపంచమంతటా వినబడుతుంది:
"Early to bed and early to rise, makes a man healthy, wealthy, and wise."
(త్వరగా పడుకుని, త్వరగా లేవడం మనిషికి ఆరోగ్యాన్ని, సంపదను, తెలివితేటలను ఇస్తుంది).
• మహాత్మా గాంధీ (Mahatma Gandhi): గాంధీజీ ప్రతిరోజూ తెల్లవారుజామున 4:00 AM కి నిద్రలేచేవారు. ఆ సమయంలోనే ప్రార్థనలు ముగించుకుని, ముఖ్యమైన లేఖలు రాయడం, దేశానికి సంబంధించిన వ్యూహాలను ఆలోచించడం చేసేవారు.
- వీరంతా తెల్లవారుజామునే ఎందుకు ఎంచుకుంటారు?
ఈ ప్రపంచ ప్రముఖులందరి మాటల్లో ఉమ్మడిగా వినిపించే అంశాలు మూడు:
1. Zero Distractions: ఆ సమయంలో ఫోన్ రింగ్ అవ్వదు, మెసేజ్లు రావు, ఇమెయిల్స్ వేధించవు. పూర్తిగా మీ నియంత్రణలో ఉండే సమయం అది.
2. Willpower (సంకల్ప బలం): రోజంతా గడిచేకొద్దీ మన నిర్ణయాత్మక శక్తి తగ్గుతుంది. కానీ ఉదయాన్నే విల్పవర్ అత్యధికంగా ఉంటుంది.
3. Proactive vs Reactive: ఆలస్యంగా లేస్తే రోజును నెట్టుకొస్తున్నట్టు (reactive) ఉంటుంది, అదే త్వరగా లేస్తే రోజును మనమే నడుపుతున్నట్టు (proactive) ఉంటుంది.
ఇంతమంది ఇన్ని రకాలుగా చెబుతుంటే... సైన్స్ కూడా సమర్దిస్తుంటే... ఇంకా పడుకోవడం ఏంటి? ఇక నుంచి తెల్లవారుజామునే లేద్దాం... రండి.
మిథిలా నగరంలో రామలక్ష్మణులు! (పిల్లల కోసం రాముడి కథ - 18)
రామ దర్శనంతో అహల్యకు శాపవిమోచనం అవగానే గౌతమ మహర్షి విచ్చేశాడు. గౌతముడు, అహల్య కలిసి పరమానందంతో రాముడిని పూజించారు. వారి సత్కారాలు పొందిన తర్వాత రామలక్ష్మణులు, విశ్వామిత్రుడి వెంట మిథిలా నగరానికి బయల్దేరారు.
మిథిలలో జనక మహారాజు యజ్నం చేస్తున్న చోటుకి చేరుకున్నారు. యజ్నవాటిక కోలాహలంగా ఉంది. అదంతా చూసిన రాముడు విశ్వామిత్రుడితో ‘‘ఓ మహర్షీ... జనకుడి యాగశాల వైభవంగా, సకల సంరంభాలతో కూడి ఉంది. అనేక దేశాల వారు, వేద పండితులైన బ్రాహ్మణులు వేలాదిగా ఉన్నారు. ఈ ప్రాంతమంతా రుషుల నివాసాలతోను, వందల కొద్దీ బండ్లతోనూ నిండి ఉంది. మనం ఉండడానికి యోగ్యమైన ప్రదేశం ఏది?’’ అని అడిగాడు.
అందుకు విశ్వామిత్రుడు, ‘‘రామా... జలం సమృద్ధిగా ఉండే చోటు, జనం అంతగా లేని ప్రదేశం చూసి బస ఏర్పాటు చేస్తాను’’ అన్నాడు.
ఈలోగా జనక మహారాజుకు, విశ్వామిత్రుడు వచ్చినట్టు తెలిసింది. వెంటనే ఆయన తన పురోహితుడు శతానంద మహర్షితోను, బ్రాహ్మణులు, పరివారంతోను కలిసి వినయంగా అక్కడకి వచ్చాడు. యాగం నిర్వహించే రుత్విజులు భక్తితో విశ్వామిత్రుడికి పూజించి తగిన సత్కారాలు చేశారు.
విశ్వామిత్రుడు జనకుడితో, ‘‘రాజా... నీవు క్షేమంగా ఉన్నావా? యాగం సక్రమంగా సాగుతోందా?’’ అంటూ కుశల ప్రశ్నలు వేశాడు. అలాగే రుత్విజులను, బ్రాహ్మణులను పలకరించి, ‘‘మిమ్మల్ని అందరినీ ఇక్కడ కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది’’ అన్నాడు. జనక మహారాజు వారందరికీ ఆసనాలు చూపించి ‘‘మహర్షీ... మీరు ఈ మునులందరితో కలిసి సుఖంగా కూర్చోండి. బ్రహ్మర్షులైన మీ రాక వల్ల నా యగ్నం సఫలమైంది. మీరందరి దర్శనంతో నా జన్మ ధన్యమైంది. మహాత్మా... ఇంకొక పన్నెండు రోజుల్లో యగ్నం పూర్తి అవుతుంది. అప్పుడు హవిస్సులను స్వీకరిచండానికి దేవతలంతా వస్తారు. మీరు కూడా వారిని చూడవచ్చు’’ అంటూ సంతోషంగా చెప్పాడు.
ఆ తర్వాత జనకుడు విశ్వామిత్రుడి వెంట ఉన్న రామలక్ష్మణులను చూసి వినయంగా ప్రశ్నించాడు.
‘‘ఓ బ్రహ్మర్షీ... మీతో వచ్చిన ఈ బాలురు ఎవరు? కాలినడకన ఇంత దూరం ఎందుకు వచ్చారు? చూస్తుంటే ఎంతో ఠీవిగా రాజకుమారుల వలె కనిపిస్తున్నారు. ధనుర్బాణాలు ధరించిన వీరు దేవతలతో సమానమైన పరాక్రమవంతులుగా అనిపిస్తున్నారు. విశాలమైన కన్నులతో, యవ్వనంలోకి అడుగుపెడుతున్న వీరు... అందంలో అశ్వనీ దేవతలనే మించిపోతున్నారు. వీరు ఎవరి కుమారులు? ఈ చిరంజీవుల గురించి తెలుసుకోవాలని ఉంది’’ అంటూ అడిగాడు.
అందుకు విశ్వామిత్రుడు,‘‘జనక మహారాజా... వీరిద్దరూ దశరథ మహారాజు కుమారులు. రామలక్ష్మణులు. సిద్ధాశ్రమంలో నేను చేస్తున్న యాగానికి మారీచ సుబాహులనే రాక్షసులు ఆటంకాలు కల్పిస్తుంటే వీరిని తీసుకువచ్చాను. వీరు ఆ రాక్షసులను జయించి యాగ రక్షణ చేశారు. ఆ తర్వాత నాతో కలిసి విశాల నగరానికి వచ్చారు. ఆపై గౌతముడి ఆశ్రమానికి వచ్చాం. అక్కడ రాముడి దర్శనంతో అహల్యకు శాప విమోచనం కలిగింది. గౌతమ మహర్షి, అహల్యల సత్కారాలు అందుకున్న మీదట ఇలా వచ్చాం. నీ దగ్గర ఉన్న శివధనుస్సును గురించి తెలుసుకోడానికి నాతో పాటు వచ్చారు’’ అంటూ వివరించాడు.
విశ్వామిత్రుడి మాటలు వినగానే రాజ పురోహితుడైన శతానందుడు పరమానందం చెందాడు. అహల్య, గౌతముల కుమారుడైన ఆయన, రామలక్ష్మణులను పరికించి చూసి పులకరించిపోయాడు. తర్వాత విశ్వామిత్రుడితో, ‘‘మహాత్మా... తీవ్ర తపస్సులో మునిగిపోయి ఉన్న మా తల్లి అహల్యను మీరంతా చూశారా? పవిత్రురాలైన నా తల్లి శ్రీరాముడికి తగిన విధంగా అతిథి సత్కారాలు చేసిందా? నా తండ్రి గౌతముడిని చేరిందా? నా తల్లికి విధివశాత్తు ఎదురైన సంఘటన గురించి రాముడికి వివరంగా చెప్పారా? నా తల్లిదండ్రులు ఇద్దరూ రాముడిని పూజించారా? శ్రీరాముడు వారిని అనుగ్రహించాడా?’’ అంటూ ప్రశ్నలు కురిపించాడు.
అందుకు విశ్వామిత్రుడు సవివరంగా అన్ని సంగతులూ చెప్పి, ‘‘శతానందా... నీ తల్లిదండ్రులిద్దరూ కలుసుకున్నారు. నేను ఆ సమయానికి తగిన విధంగా చేయగలిగనదంతా చేశాను. రేణుకాదేవిని జమదగ్నిలాగా నీ తండ్రి అహల్యను స్వీకరించాడు’’ అన్నాడు.
ఆ మాటలకు శతానందుడు ఎంతగానో ఆనందించి, రాముడి దగ్గరకు వచ్చి,
‘‘ఓ రామచంద్రా... నీవు విశ్వామిత్రుడితో కలిసి ఇక్కడకి రావడం మా అదృష్టం. నీకిదే స్వాగతం’’ అంటూ ఆప్యాయంగా పలకరించాడు.
ఆ తర్వాత, ‘‘రామా... ఈ విశ్వామిత్రుడు మహా శక్తిమంతుడు. ఈయన సాధించలేని కార్యం అంటూ ఏదీ లేదు. తపస్సుతో బ్రహ్మర్షి అయిన తేజశ్శాలి. ఇలాంటి గొప్ప గురువును ఆశ్రయించినందుకు నిన్ను అభినందిస్తున్నాను. ఆ మహనీయుడి కథ చెబుతాను. విను’’ అన్నాడు.
రామలక్ష్మణులు భక్తిశ్రద్ధలతో వింటున్నారు. శతానందుడు చెప్పసాగాడు. ఆయన సవివరంగా చెప్పిన విశ్వామిత్రుడి కథ ఏంటో వచ్చే భాగంలో తెలసుకుందాం. జై శ్రీరామ్.
బుధవారం, జూన్ 24, 2026
కొండను తొలిచిన సా‘మాన్యుడు’!
కళ్ల ముందే భార్య చనిపోయింది...
కన్నీరుమున్నీరయ్యాడు...
ఆ బాధ నుంచి తేరుకుని తన బతుకేదో తాను చూసుకుని ఉంటే అతడి గురించి చెప్పుకోవలసిన పనే లేదు...
కానీ అతడలా చేయలేదు...
తన భార్యలాగా తన ఊళ్లో మరెవరూ చనిపోకూడదనుకున్నాడు...
ఒక సుత్తి, ఒక ఉలి తీసుకుని ఆ ఊరికి అడ్డంగా ఉన్న కొండను తొలవడం మొదలు పెట్టాడు...
ఉదయం నుంచి సాయంత్రం వరకు అదే పని...
రోజులు గడిచాయి...
నెలలు మారాయి...
సంవత్సరాలు దొర్లాయి...
అతడిది మాత్రం ఒకటే పని...
ఎండ...
వాన...
చలి...
పని ఆపలేదతడు...
అలా ఏకంగా 22 ఏళ్లు!
మొదట్లో అతడిని చాలా మంది పిచ్చివాడన్నారు...
ఆ తర్వాత పట్టించుకోవడం మానేశారు...
అర్థం చేసుకున్న కొందరు మాత్రం చేతనైన సాయం చేశారు...
భార్య పోయిన బాధ లోంచి, ఊరికి ఉపకారం చేసే అతడి సంకల్పానికి, వెనుదిరగని అతడి పట్టుదలకి ఆ కొండ తలవంచింది! దారిచ్చింది!!
అతడి పేరు దశరథ్ మాంఝీ...
‘ద మౌంటైన్ మ్యాన్’!
ఏమిటతడి కథ?...
బీహార్ రాష్ట్రంలోని ఒక చిన్న గ్రామం గెహ్లౌర్...
ఆ ఊరి చుట్టూ భారీ కొండలు...
ఊర్లో వాళ్లు ఆసుపత్రికి వెళ్లాలన్నా...
మార్కెట్కు వెళ్లాలన్నా...
పాఠశాలకు వెళ్లాలన్నా...
ఆ కొండ చుట్టూ తిరిగి వెళ్లాల్సిందే...
దాదాపు 55 కిలోమీటర్లు...
ఆ ఊరివాడే దశరథ్ మాంఝీ...
నిరు పేద కూలీ...
రోజూ కష్టపడితేనే కుటుంబానికి భోజనం...
అతడి భార్య ఫల్గుణీ దేవి...
ఒక రోజు ఆమె భర్తకు భోజనం తీసుకెళ్లడానికి కొండ ఎక్కుతూ వెళ్తోంది...
అనుకోకుండా జారి కిందపడింది...
తీవ్రంగా గాయపడింది...
ఆసుపత్రికి తీసుకెళ్లాలి...
కానీ మధ్యలో పెద్ద కొండ...
రోడ్డు లేదు...
సమయానికి వైద్యం అందలేదు...
ఆమె మరణించింది...
దశరథ్ మాంఝీ గుండె పగిలిపోయింది...
భార్యను కోల్పోయిన బాధ ఒకవైపు...
తన గ్రామ ప్రజలు కూడా ఇదే కష్టాన్ని అనుభవిస్తున్నారనే ఆలోచన మరోవైపు...
అప్పుడు అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు...
"ఈ కొండే నా భార్యను నాకు దూరం చేసింది...దీన్ని తొలిచేస్తాను...’’
జనం నవ్వారు...
పట్టించుకోలేదతడు...
ఒక సుత్తి, ఒక ఉలి కొనుక్కున్నాడు...
అనుకున్న పని మొదలుపెట్టాడు!
అలా 22 ఏళ్లు గడిచాయి...
అందరూ అసాధ్యం అన్న పనిని అతడు సాధ్యం చేశాడు!
కొండలోంచి 360 అడుగుల పొడవు...
30 అడుగుల వెడల్పు...
25 అడుగుల లోతు గల మార్గాన్ని సృష్టించాడు!
ఒకప్పుడు 55 కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సిన దూరాన్ని, కేవలం 15 కిలోమీటర్లకు తగ్గించాడు!!
- ఇవిగివిగో అతడి వివరాలు...
దశరథ్ మాంఝీ బీహార్లోని గయ సమీపంలో ఉన్న గెహ్లౌర్ అనే గ్రామంలో పేద దళిత కుటుంబంలో 1934లో పుట్టాడు. అక్కడే పెరిగాడు. పెళ్లి చేసుకున్నాడు. భార్య చనిపోయాక 1960 నుండి 1982 వరకు దాదాపు 22 సంవత్సరాల పాటు ఒంటరిగా కొండను తొలిచాడు.
అతడు చేసిన ఈ అద్భుతాన్ని గుర్తించి బీహార్ ప్రభుత్వం గౌరవించింది. 2007లో ఆయన క్యాన్సర్తో మరణించినప్పుడు, బీహార్ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది.
- ఆయన జీవిత కథ ఆధారంగా బాలీవుడ్ దర్శకుడు కేతన్ మెహతా "Manjhi - The Mountain Man" (2015) అనే సినిమాను రూపొందించారు. ఇందులో నవాజుద్దీన్ సిద్దికీ, దశరథ్ మాంఝీ పాత్రలో అద్భుతంగా నటించారు.
- ప్రముఖ నటుడు అమీర్ ఖాన్ తన "సత్యమేవ జయతే" టీవీ షో మొదటి ఎపిసోడ్ను దశరథ్ మాంఝీ జీవితానికే అంకితం చేశారు.
- ఓ శిలా విగ్రహం, ఓ పోస్టల్ స్టాంపు అతడి పట్టుదలకు జోహార్లు చెబుతాయి.
- అతడి గురించి తెలిశాక మనలో కలిగే స్ఫూర్తి... ఎప్పటికీ ఆరిపోని జ్యోతి.
సోమవారం, జూన్ 22, 2026
తర్కమా? వివేకమా?
ఒక ఇరవై ఐదేళ్ల యువకుడు ఒక ప్రముఖ గురువుగారి తలుపు తట్టి, “నేను మీ దగ్గరకు వేదాలు నేర్చుకోవడానికి వచ్చాను” అని చెప్పాడు.
గురువుగారు అతనిని చూసి, “నీకు సంస్కృతం వచ్చా?” అని అడిగారు.
“రాదు” అని సమాధానం ఇచ్చాడు ఆ యువకుడు.
“పోనీ, భారతీయ తత్వశాస్త్రం (ఫిలాసఫీ) ఏమైనా చదివావా?”
“లేదు. కానీ మీరేం కంగారు పడకండి. నేను ఇప్పుడే హార్వర్డ్ యూనివర్సిటీలో ‘లాజిక్’ (తర్కశాస్త్రం) మీద నా పీహెచ్డీ పూర్తి చేశాను. నా చదువుని పరిపూర్ణం చేసుకోవడం కోసం ఈ వేదాలను కూడా కొద్దిగా చదువుదామని వచ్చాను.”
అప్పుడు గురువుగారు, “నువ్వు వేదాలు చదవడానికి ఇంకా సిద్ధంగా లేవని నా అనుమానం. ఎందుకంటే అది ప్రపంచంలోనే అత్యంత లోతైన జ్ఞానం. కానీ, నీకు ఇష్టమైతే నేను తర్కశాస్త్రంలో ఒక చిన్న పరీక్ష పెడతాను. అందులో నువ్వు పాస్ అయితే, నీకు వేదాలు నేర్పిస్తాను” అన్నారు.
ఆ యువకుడు సరేనన్నాడు.
గురువుగారు తన రెండు వేళ్లు పైకెత్తి ఇలా అడిగారు: “ఇద్దరు వ్యక్తులు ఒక పొగగొట్టం (చిమ్నీ) గుండా కిందకు దిగారు. అందులో ఒకరి ముఖం శుభ్రంగా ఉంది, మరొకరి ముఖం మసిగా (నల్లగా) అయిపోయింది. ఇప్పుడు వీరిద్దరిలో ఎవరు ముఖం కడుక్కుంటారు?”
ఆ యువకుడు గురువుగారి వైపు ఆశ్చర్యంగా చూస్తూ, “నిజంగా ఇదేనా తర్కశాస్త్ర పరీక్ష?” అని అడిగాడు.
గురువుగారు అవునన్నట్లు తలూపారు.
యువకుడు పూర్తి నమ్మకంతో, “ముఖం మురికిగా ఉన్నవాడే కడుక్కుంటాడు” అని చెప్పాడు.
“తప్పు!” అన్నారు గురువుగారు. “లాజిక్ ఆలోచించు. ముఖం మురికిగా ఉన్నవాడు అవతలి వ్యక్తి శుభ్రమైన ముఖాన్ని చూసి, తన ముఖం కూడా అలాగే శుభ్రంగా ఉందనుకుంటాడు. కానీ, ముఖం శుభ్రంగా ఉన్నవాడు అవతలి వ్యక్తి మురికి ముఖాన్ని చూసి, తన ముఖం కూడా మురికిగా ఉందేమో అనుకుంటాడు. కాబట్టి, ముఖం శుభ్రంగా ఉన్నవాడే మొదట ముఖం కడుక్కుంటాడు.”
“చాలా తెలివైన ప్రశ్న,” అన్నాడు యువకుడు. “నన్ను ఇంకో ప్రశ్న అడగండి.”
గురువుగారు మళ్లీ రెండు వేళ్లు పైకెత్తి అదే ప్రశ్న అడిగారు: “ఇద్దరు వ్యక్తులు పొగగొట్టం గుండా కిందకు దిగారు. ఒకరి ముఖం శుభ్రంగా ఉంది, మరొకరిది మురికిగా ఉంది. ఎవరు ముఖం కడుక్కుంటారు?”
“మనం ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ముఖం శుభ్రంగా ఉన్నవాడే కడుక్కుంటాడు” అన్నాడు యువకుడు.
“తప్పు! ఇద్దరూ ముఖం కడుక్కుంటారు” అన్నారు గురువుగారు. “లాజిక్ చూడు. ముఖం శుభ్రంగా ఉన్నవాడు అవతలి వ్యక్తిని చూసి తన ముఖం మురికిగా ఉందనుకుని ముఖం కడుక్కోవడం మొదలుపెడతాడు. అది చూసి, ముఖం మురికిగా ఉన్నవాడు కూడా తను ముఖం కడుక్కోవాలని గ్రహించి కడుక్కుంటాడు. కాబట్టి ఇద్దరూ కడుక్కుంటారు.”
“నేను ఇలా ఆలోచించలేదు. లాజిక్లో నేను తప్పు చేయడం నాకు ఆశ్చర్యంగా ఉంది. నన్ను మళ్లీ పరీక్షించండి” అన్నాడు యువకుడు.
గురువుగారు మూడోసారి అదే ప్రశ్న అడిగారు: “ఇద్దరు వ్యక్తులు పొగగొట్టం గుండా కిందకు దిగారు. ఒకరి ముఖం శుభ్రంగా ఉంది, మరొకరిది మురికిగా ఉంది. ఎవరు ముఖం కడుక్కుంటారు?”
“ఇద్దరూ కడుక్కుంటారు” అన్నాడు యువకుడు.
“తప్పు! ఎవ్వరూ కడుక్కోరు” అన్నారు గురువుగారు. “లాజిక్ ప్రకారం... ముఖం శుభ్రంగా ఉన్నవాడు ఎదుటివాడిని చూసి తన ముఖం మురికిగా ఉందనుకుంటాడు. కానీ, ఆ మురికిగా ఉన్నవాడు ప్రశాంతంగా కూర్చుని ముఖం కడుక్కోకపోవడం చూసి, ముఖం శుభ్రంగా ఉన్నవాడు కూడా ‘నా ముఖం బానే ఉందేమో’ అని ఊరుకుంటాడు. కాబట్టి ఇద్దరిలో ఎవ్వరూ ముఖం కడుక్కోరు.”
ఆ యువకుడు తట్టుకోలేకపోయాడు. “నాకు వేదాలు చదివే అర్హత ఉంది. దయచేసి నాకు చివరిగా ఒక్క అవకాశం ఇవ్వండి” అని బ్రతిమాలాడు.
గురువుగారు మళ్లీ తన రెండు వేళ్లు పైకెత్తేసరికి అతను నీరసపడిపోయాడు. గురువుగారు అదే ప్రశ్న అడిగారు: “ఇద్దరు వ్యక్తులు పొగగొట్టం గుండా కిందకు దిగారు. ఒకరి ముఖం శుభ్రంగా ఉంది, మరొకరిది మురికిగా ఉంది. ఎవరు ముఖం కడుక్కుంటారు?”
“ఎవ్వరూ కడుక్కోరు!” అని అరిచాడు యువకుడు.
“తప్పు! వేదాలు చదవడానికి కేవలం లాజిక్ (తర్కం) ఎందుకు పనికిరాదో ఇప్పుడు నీకు అర్థమైందా? అసలు ఇద్దరు వ్యక్తులు ఒకే పొగగొట్టం గుండా కిందకు దిగినప్పుడు... ఒకరి ముఖం శుభ్రంగా, ఇంకొకరి ముఖం మురికిగా ఉండడం ఎలా సాధ్యం? నువ్వు అడిగే ప్రశ్నలోనే అర్థం లేదు, అది ఒక పిచ్చి ప్రశ్న! జీవితాంతం ఇలాంటి అర్థం లేని ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ ఉంటే, నీకు దొరికే సమాధానాలు కూడా అంతే అర్థం లేకుండా ఉంటాయి.”
సారాంశం:
కేవలం తర్కం ఉండడం కంటే, ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోగలిగే విచక్షణ లేదా వివేకం ఉండడం చాలా ముఖ్యం.
అహల్యకు శాప విమోచనం (పిల్లల కోసం రాముడి కథ-17
మహర్షి విశ్రామిత్రుడితోను, ఇతర మునులతోను కలిసి రామలక్ష్మణులు మిథిలకు వెళుతూ, మార్గమధ్యంలో విశాల నగరం చేరుకున్నారు. రాముడి అడిగిన మీదట విశ్వామిత్రుడు ఆ నగరం ఏర్పడడానికి గురించిన కథంతా చెప్పాడు. విశాల మహారాజు సుమతి వారందరికీ తగిన రీతిలో ఆతిథ్యమిచ్చాడు. ఆ రాత్రికి అక్కడే విశ్రమించిన వారు, ఆ మర్నాడు తమ ప్రయాణాన్ని కొనసాగించి మిథిలా నగరానికి చేరుకున్నారు. విశ్వామిత్రుడితో ఉన్న మునులందరూ అందమైన మిథిలను చూసి ఎంతో ఆనందానికి గురై ‘బాగు బాగు’ అంటూ ప్రశంసించారు. మిథిలకు సమీపంలోనే ఉన్న ఒక వనంలో ఒక ఆశ్రమాన్ని రాముడు చూశాడు. అది బాగున్నప్పటికీ అందులో ఎవరూ లేకపోవడాన్ని గమనించాడు. ఆ సంగతినే విశ్వామిత్రుడిని అడిగాడు.
‘‘మహాత్మా... ఈ ఆశ్రమంలో మునులెవ్వరూ కనిపించడం లేదేమిటి? పురాతనమైన ఈ ఆశ్రమం ఎవరిది? దీని వివరాలు తెలియజేయమని కోరుతున్నాను’’ అని వినయంగా అన్నాడు.
అందుకు విశ్వామిత్రుడు, ‘‘రామా... ఈ ఆశ్రమం ఒక మహాత్ముని కోపం కారణంగా శాపానికి గురైంది. ఆ వివరాలన్నీ చెబుతాను విను’’ అంటూ చెప్పడం ప్రారంభించాడు.
‘‘మహాత్ముడైన గౌతమ మహర్షి ఆశ్రమం ఇది. ఒకానొకప్పుడు దివ్య శోభలతో విలసిల్లుతూ ఉండేది. దేవతల పూజలు సైతం అందుకునేది. గౌతముడు తన భార్య అహల్యతో కలిసి ఇక్కడ ఉంటూ ఎన్నో సంవత్సరాలు తపస్సు చేశాడు. ఒకరోజు గౌతమ మహర్షి ఆశ్రమంలో లేని సమయం చూసుకుని ఇంద్రుడు అతడి రూపం ధరించి అహల్య దగ్గరకి వచ్చాడు.
‘‘సుందరీ... కోరిక కలిగిన వారు సమయం కోసం ఆగరు. నాకు నీతో కలవాలనే కోరిక కలిగింది’’ అన్నాడు.
అహల్య తన భర్త రూపంలో వచ్చిన వాడు ఇంద్రుడేనని తన తపశ్శక్తితో గ్రహించింది. దేవతలకు రాజయిన వాడు మారువేషంలో వచ్చి ఇలా మాట్లాడుతున్నాడేమిటని అహల్య ఆలోచనలో పడింది.
తర్వాత, ‘‘ఓ దేవేంద్రా... నేను నా దాంపత్య జీవితంలో సుఖంగా ఉన్నాను. నీవు ఇక్కడి నుంచి వెంటనే వెళ్లిపో. నీ గౌరవాన్ని, నా గౌరవాన్ని కూడ నిలబెట్టు’’ అంది.
అందుకు ఇంద్రుడు నవ్వుతూ, ‘‘సుందరీ... నీ ప్రవర్తనకు సంతోషించాను. ఎలా వచ్చానో, అలాగే వెళ్లపోతాను’’ అంటూ ఆశ్రమం బయటకి వచ్చాడు. అదే సమయానికి, నదీ స్నానం చేసి వచ్చిన గౌతమ మహర్షి ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. ఆశ్రమం నుంచి తన వేషంలో బయటకి వస్తున్న ఇంద్రుడిని చూసి ఆగ్రహించాడు.
‘‘ఓరీ దుర్మతీ... నా రూపం ధరించి వచ్చి అనుచితంగా ప్రవర్తించావు. కాబట్టి నువ్వు వృషణములను కోల్పోతావు’’ అని శపించాడు. వెంటనే ఇంద్రుడి వృషణములు నేలపై రాలి పడ్డాయి.
కోపంతో ఉన్న గౌతముడు, అహల్యను కూడా శపించాడు. ‘‘నువ్వు కొన్ని వేల సంవత్సరాల పాటు ఇక్కడే పడి ఉంటావు. అన్నపానాలు లేకుండా నిరాహారంగా గాలి మాత్రమే భుజిస్తూ ఎవరికీ కనిపించకుండా తపిస్తావు’’ అన్నాడు. ఆ తర్వాత, ‘‘చాలా కాలం తర్వాత దశరథుడి కుమారుడైన శ్రీరాముడు వచ్చినప్పుడు నీకు శాపవిమోచనం కలుగుతుంది. శ్రీరాముడికి అతిథి సత్కారాలు చేశాక నీలో లోభమోహాలు నశించి నన్ను చేరుకుంటావు’’ అని చెప్పి ఆశ్రమాన్ని విడిచి తపస్సు చేసుకోడానికి హిమాలయాలకు వెళ్లిపోయాడు.
గౌతముడి శాపానికి గురైన ఇంద్రుడు దీనంగా మహర్షులు, చారణులతో కూడి ఉన్న అగ్ని మొదలైన దేవతల దగ్గరకు వెళ్లాడు.
‘‘సమస్త దేవతలారా... మహర్షులారా... చారణులారా... మహాత్ముడైన గౌతముడికి కోపం తెప్పించి ఆయన తపస్సును భగ్నం చేశాను. దేవతల మేలు కోసమే ఇదంతా చేశాను. గౌతముడి శాపం వల్ల నేను అశక్తుడనయ్యాను. కాబట్టి మీరంతా నాకు సాయపడాలి’’ అని వేడుకున్నాడు.
అప్పుడు దేవతలంతా పితృదేవతల దగ్గరకి వెళ్లి, ‘‘యగ్జ్యాల్లో మీ భాగంగా వచ్చే మేకపోతు వృషణాలను ఇంద్రుడికి ఇవ్వండి’’ అని కోరారు. వారందుకు అంగీకరించారు.
విశ్వామిత్రుడు ఈ కథంతా చెప్పి, ‘‘రామా... అప్పటి నుంచి పితృదేవతలు వృషణాలు లేని మేకలనే స్వీకరిస్తున్నారు. ఇంద్రుడు ‘మేష వృషణుడు’ అయ్యాడు. ఇప్పుడు నీవు ఈ ఆశ్రమంలో అడుగుపెట్టు. అహల్యకు శాపవిమోచనం కలిగించు’’ అన్నాడు.
ఆపై విశ్వామిత్రుడు, లక్ష్మణులతో కలిసి రాముడు గౌతముడి ఆశ్రమంలోకి అడుగుపెట్టాడు. కఠోరమైన తపస్సు చేస్తూ ఎవరికీ కనిపించకుండా, తేజోరూపంలో ఉన్న అహల్యను చూశాడు. శ్రీరాముడి దర్శనం అయిన వెంటనే అహల్యకు శాప విముక్తి కలిగింది. ఆమె తన పూర్వరూపంలో అందరికీ కనిపించింది. రామలక్ష్మణులు ఆమెకు భక్తితో నమస్కరించారు. అహల్య వారికి అర్ఘ్యపాద్యాలతో అతిథి సత్కారాలు చేసింది. ఆకాశం నుంచి దేవతలు దుంధుభులు మోగిస్తూ పుష్ప వర్షం కురిపించారు. గంధర్వులు గానం చేశారు. అప్సరసలు నాట్యం చేశారు. శ్రీరాముడు తన ఆశ్రమానికి వచ్చినట్టు గ్రహించిన గౌతమ మహర్షి ఆ క్షణమే అక్కడకి చేరుకున్నాడు. తపస్సుతో పవిత్రురాలైన అహల్యను దేవతలు ప్రశంసించారు. గౌతముడు అహల్యతో కలిసి, శ్రీరాముడిని భక్తిశ్రద్ధలతో పూజించి పరమానందభరితుడయ్యాడు. ఆపై శ్రీరాముడు లక్ష్మణుడితో కలిసి విశ్వామిత్రడి వెంట మిథిలా నగరానకి బయల్దేరాడు. జై శ్రీరామ్.
గురువారం, జూన్ 11, 2026
వార్నాయనో... చంద్రుడే లేకపోతే?!
చంద్రుడు కేవలం రాత్రి వేళ వెన్నెల కురిపించే వాడే అనుకోకండి. మన భూమి ఎంత వేగంగా తిరగాలో చురుగ్గా నియంత్రిస్తున్న వాడు కూడా.
ఎప్పుడో 450 కోట్ల సంవత్సరాల క్రితం భూమిని అంగారకుడి పరిమాణంలో ఉన్న ఒక గ్రహం ఢీకొట్టడం వల్ల చంద్రుడు ఏర్పడ్డాడు. ఆ సమయంలో భూమి చాలా వేగంగా తిరిగేది. ఎంత వేగంగానో తెలుసా? అప్పట్లో ఒక రోజు కేవలం 6 నుండి 8 గంటలు మాత్రమే ఉండేది. చంద్రుడు ఏర్పడ్డాక భూమి వేగానికి బ్రేకులు పడ్డాయనుకోవచ్చు. చంద్రుని గురుత్వాకర్షణ శక్తి వల్ల "టైడల్ ఫ్రిక్షన్" అనే ప్రక్రియ మొదలైంది. ఇదే భూమి భ్రమణాన్ని తగ్గేలా చేసింది. భూమి తిరిగే శక్తి క్రమంగా చంద్రునికి బదిలీ అవుతోంది. దీని వల్ల మన భూమి వేగం తగ్గుతోంది. అంతేకాదు, చంద్రుడు ప్రతి సంవత్సరం సుమారు 3.8 సెంటీమీటర్ల చొప్పున మనకు కొద్దికొద్దిగా దూరంగా జరుగుతున్నాడు.
చంద్రుడనేవాడు లేకపోతే ఆ బ్రేకింగ్ ప్రక్రియ ఎప్పటికీ జరగదు. భూమి తన వేగాన్ని అలాగే కొనసాగిస్తుంది. రోజులు చిన్నవిగానే ఉండిపోతాయి. అప్పుడు ఒక సంవత్సరానికి వెయ్యికి పైగా రోజులు వస్తాయి.
దీని పరిణామాలు కేవలం సమయాన్ని లెక్కించడానికే పరిమితం కావు. వేగంగా తిరిగే భూమి చాలా శక్తివంతమైన గాలులను సృష్టిస్తుంది. వాతావరణ ప్రసరణ విధానాలు పూర్తిగా మారిపోతాయి. మరింత తీవ్రమైన, తరచుగా వచ్చే తుఫానులను సృష్టిస్తాయి. వాతావరణ వ్యవస్థలను, సముద్ర ప్రవాహాలను శాసించే "కొరియోలిస్ ప్రభావం" (Coriolis effect) మరింత తీవ్రంగా ఉంటుంది. జీవం ఏర్పడడానికి కారణమైన సంక్లిష్ట పరిస్థితులు ఏర్పడేవే కావు. జీవులు వృద్ధి చెందడానికి తోడ్పడిన ప్రస్తుత స్థిరమైన వాతావరణం అప్పుడు ఉండదు.
భూమి తన అక్షం మీద కొంత వంపుతో ఉంటాడని తెలుసుకదా? దీన్ని ‘అక్షీయ వంపు’ అంటే ‘యాక్సియల్ టిల్ట్’ అంటారు. చంద్రుడు దీన్ని కూడా స్థిరంగా ఉండేలా చేస్తున్నాడు. ఈ వంపు సుమారు 22 నుండి 24.5 డిగ్రీల పరిమిత పరిధిలోనే ఉండేలా చూస్తున్నాడు. ఈ స్థిరత్వం లేకపోతే, లక్షల సంవత్సరాల కాలంలో ఆ వంపు విపరీతంగా మారిపోయేది. ఫలితంగా తీవ్రమైన వాతావరణ మార్పులు సంభవించేవి. జీవన వ్యవస్థలు నిలదొక్కుకోవడం చాలా కష్టమయ్యేది. మన పొరుగు గ్రహం మార్స్ లో ఇదే జరుగుతోంది. మనకి చంద్రుడిలాగా మార్స్ కి స్థిరత్వాన్ని ఇచ్చే ఉపగ్రహం లేదు కదా? అందుకనే మార్స్ గ్రహం ఇలాంటి తీవ్రమైన అక్షీయ మార్పులను చరిత్రలో ఎదుర్కొంది.
ఇక అలల విషయానికి వస్తే, చంద్రుని గురుత్వాకర్షణ శక్తి వల్లనే సముద్రంలో ఆటుపోటులు కలుగుతున్నాయి. ఈ అలలే మన తీరప్రాంతాలను తీర్చిదిద్దాయి. సముద్ర రసాయన శాస్త్రాన్ని ప్రభావితం చేశాయి. అంతేకాదు, సేంద్రీయ రసాయనాలు కేంద్రీకృతమై చర్యలు జరపడానికి వీలైన తీరప్రాంత మడుగులను (Tidal pools) సృష్టించాయి. ఇవన్నీ భూమిపై తొలి జీవం ఆవిర్భవించడానికి దోహదపడిన పరిణామాలే.
ఇప్పుడు చంద్రుడిని తీసేశామనుకోండి. ఏం జరుగుతుందో తెలుసా? మనం కేవలం వెన్నెల రాత్రులను, సముద్రపు అలలను మాత్రమే కోల్పోతామని అనుకోకండి. సంక్లిష్ట జీవం ఏర్పడటానికి కారణమైన స్థిరమైన వాతావరణ పరిస్థితులనే పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉంది.
మన భూమి కక్ష్యలో ఉంటూ, మన చుట్టూ తిరుగుతున్న ఉపగ్రహంగా చంద్రుడు ఎంత బాగా మనకి ఉపయోగపడుతున్నాడో అర్థమైంది కదా. చంద్రుడు మనకి 3,84,000 కిలోమీటర్ల దూరంలో ఉంటూ, నిశ్శబ్దంగా తన పనిని తాను చేసుకుపోతున్నాడు. మనకి చల్లని వెన్నెలతో పాటు మరెన్నో ప్రయోజనాలు కలిగిస్తున్నాడు. అందుకే అందామా... ‘హ్యాట్సాఫ్ చందమామా’ అని.
ఆదివారం, జూన్ 07, 2026
గురువారం, మే 28, 2026
శ్రీకృష్ణుడు తీర్చుకోలేని రుణం
దేవదేవుడైన శ్రీకృష్ణుడికే దేవతలు సహా ప్రాణులందరూ రుణపడి ఉంటారు కదా? అలాంటిది ఆయన తీర్చుకోలేని రుణం అంటూ ఉంటుందా?
ఉందని స్వయంగా శ్రీకృష్ణుడే
చెప్పాడు. ఎవరితోనో తెలుసా? గోపికలతో. శ్రీమద్భాగవతంలో దశమ స్కందంలో 32వ అధ్యాయంలో
కనిపిస్తుంది ఈ ఘట్టం.
ఓసారి గోపికలు
శ్రీకృష్ణుడిని అడుగుతారు.
‘‘కృష్ణా... కొందరు తమను
ప్రేమించేవారినే ప్రేమిస్తారు. మరి కొందరు తమను ప్రేమించని వారిని సైతం
ప్రేమిస్తారు. ఇంకొందరు తమను ప్రేమించిన వారిని కానీ, ప్రేమించని వారిని కానీ...
ఇద్దరినీ ప్రేమించరు. మరి వీరిలో నీకు ఎవరంటే ఇష్టం?’’ అని అడిగారు.
అందుకు శ్రీకృష్ణుడు,
‘‘సఖులారా... కొందరు ప్రతిఫలాపేక్ష కలవారై ఉంటారు. తమకు మేలు చేసేవారినే
సేవిస్తారు. ఇందులో స్నేహం కానీ, ధర్మం కానీ ఉండవు. సహజంగానే దయా స్వభావం కల వారు
కొందరుంటారు. వాళ్లు తమను ప్రేమించని వారిని సైతం సేవిస్తారు. ఇలాంటి వారి ప్రేమలో
ధర్మం, సుహృద్భావం ఉంటాయి. కొందరైతే తమకు మేలు చేసిన వారిని సైతం సేవించరు. వీరు
కృతఘ్నులు, కఠినాత్ములు. నేను వీరిలో ఎవ్వడనూ కాను. అయితే నన్ను ప్రేమించేవారి
పట్ల నేను అదే విధమైన ప్రేమను ప్రకటించకుండా, నా పట్ల వారి ప్రేమ మరింత పెరిగేలా,
అది నిరంతరం నిలిచేలా వ్యవహరిస్తాను. అందుకోసం నేను వారిని కలిసినట్టే కలిసి,
కనిపించినట్టే కనిపించి, దాగినట్టు ఉంటాను. మీతోనే, మీ మధ్యనే ఉంటూ నేను
అదృశ్యమవడానికి కారణం అదే. నేను మాయమై ఉన్నా మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాను’’ అంటూ
వివరించాడు. అందుకు గోపికలు ఎంతో ఆనందపడ్డారు.
ఆపై శ్రీకృష్ణుడు వారి పట్ల
తన గాఢమైన ప్రేమను వెల్లడిస్తూ, ‘‘గోపికలారా... మీ ప్రేమ కపటం లేనిది. మీరు నాపై
చూపించే ప్రేమకు తగిన ప్రత్యుపకారము చేయడం నాకు సాధ్యం కాదు. నాకు దేవతలకు ఉండేంత
ఆయుర్దాయము ఉన్నా సరే, నేను మీ రుణం తీర్చుకోలేను. మీరు నన్ను చేరుకోడానికి మీ
ఇళ్లు, వాకిళ్లు, బంధాలు అనే సంకెళ్లను పూర్తిగా వదిలించుకుని వచ్చారు. నిర్మలమైన
మీ ప్రేమ భావాన్ని నాకే సమర్పించారు. అందువల్ల నేను ఎప్పటికీ రుణపడే ఉంటాను’’
అన్నాడు.
శ్రీకృష్ణుడు చెప్పిన
మధురమైన ఈ మాటలు విని గోపికలందరూ సంతోషంతో పొంగిపోయారు. అదీ కృష్ణ తత్వం.
పుణ్యం... పాపం... సైన్స్ కోణం!
‘పరోపకారాయ పుణ్యాయ, పాపాయ పరపీడనం’ అంటుంది మన సనాతన
ధర్మం. అంటే...ఇతరులను సంతోషపెట్టడమే పుణ్యం, బాధపెట్టడమే పాపం. ఈ పాపపుణ్యల భావనలను ఆధునిక సైన్స్ కోణంలో
అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దామా?
"పుణ్యం చేస్తే
స్వర్గానికి వెళ్తాం, పాపం చేస్తే
నరకానికి వెళ్తాం" అని మనకు పెద్దలు చెబుతారు. చిత్రగుప్తుడు పైన కూర్చుని ఒక
పెద్ద పుస్తకంలో మన లెక్కలు రాస్తుంటాడని కూడా అంటారు. ఆధునిక యుగంలో ఇవన్నీ
పాతకాలపు నమ్మకాలుగా కొందరికి అనిపించవచ్చు. కానీ ఈ నమ్మకాలను సైన్స్ కోణంలో ఎలా అర్థం చేసుకోవాలి? ఈ విషయంలో
శాస్త్రీయమైన పరిశోధనలు ఏమైనా జరిగాయా? ఆ విషయాలనే ఇప్పుడు తెలుసుకుందాం.
·
క్వాంటమ్ ఫిజిక్స్ ఏమంటోంది?
ఈ విశ్వంలో ప్రతీదీ ఒక శక్తే. అంటే ‘ఎనర్జీ’ అన్నమాట. మన ఆలోచనలు, మాటలు,
పనులు అన్నీ ‘వైబ్రేషన్స్’ను కలిగిస్తాయి. ఆ ప్రకారం సనాతన ధర్మంలో చెప్పే
పాపపుణ్యలను సైన్స్ పరిభాషలో ‘నెగిటివ్, పాజిటివ్ ఎనర్జీలు’ అనుకోవచ్చు. దీన్ని
ఇంకా లోతుగా అర్థం చేసుకుందాం.
·
పుణ్యం అంటే ఏమిటి?
మనం ఇతరుల పట్ల చూపించే
నిస్వార్థమైన ప్రేమ, జాలి, ఇతరులకు సాయం చేయడం, కృతజ్నత కలిగి ఉండడం.... ఇలాంటి
మంచి భావాలను కలిగి ఉండడమే కదా. ఈ భావోద్వేగాలను సైన్స్ పరంగా ‘హై ఫ్రీక్వెన్సీ’...
అంటే ఉన్నత స్థాయి తరంగాలు అనుకోవచ్చు.
మీరు ఎవరికైనా ఉపకారం
చేసినప్పుడు, ఏ పేదవాడికో అన్నం పెట్టినప్పుడు, లేదా ఒక మూగజీవికి సాయం
చేసినప్పుడు... మీలో కలిగే శారీరక, మానసిక ప్రభావాలు ఎలా ఉంటాయో చూద్దాం. ఇలాంటి
మంచి పనులు చేసినప్పుడు మీలో తెలియని ఒక ఆనందం, సంతృప్తి కలుగుతాయి. ఇవి మీ
మెదడులో ‘డోపమైన్’, ‘ఆక్సిటోసిన్’ అనే హార్మోన్స్ ను విడుదల చేస్తాయి. వీటిని
‘హ్యాపీ హార్మోన్స్’ అంటారు.
సమాజానికి, ప్రకృతికి
లేదా తోటి ప్రాణికి మేలు చేసినప్పుడు మనలోనూ, మన చుట్టూ
ఉన్న వాతావరణంలోనూ ఒక విధమైన సమతుల్యత అంటే హార్మొనీ, ప్రశాంతత ఏర్పడుతాయి. దీన్నే మనం 'పాజిటివ్
ఎనర్జీ' అనవచ్చు.
అంతేకాదు, ఇలాంటి పాజిటివ్ పనులు చేసినప్పుడు మీ శరీరం చుట్టూ ఉండే శక్తి వలయం
అంటే ‘ఆరా’, ప్రకాశవంతంగా మారుతుంది. ఈ పాజిటివ్ ఎనర్జీ మీ జీవితంలోకి మంచి
వ్యక్తులను, అదృష్టాన్ని అయస్కాంతంలా ఆకర్షిస్తుంది. దీన్నే మన పెద్దలు ‘‘చేసిన
పుణ్యం ఊరికే పోదు, ఎప్పుడో ఒకప్పుడు కాపాడుతుంది’’ అంటారు.
·
పాపం సంగతి ఏంటి?
మనలో కోపం, అసూయ, స్వార్థం, ఇతరులను మోసం చేయడం, పగ పెంచుకోవడం... ఇలాంటివన్నీ
‘లో ఫ్రీక్వెన్సీ’ తరంగాలను ఉత్పత్తి చేస్తాయి. మీరు ఎవరి పట్ల అయినీ తీవ్రమైన
ద్వేషం పెంచుకున్నప్పుడు, ఎవరినైనా మోసం చేసినప్పుడు, మీ శరీరంలో ‘కార్టిసాల్’ అనే
‘స్ట్రెస్ హార్మోన్’ విడుదల అవుతుంది. ఇది మీ బీపీని పెంచడం, నిద్రను దూరం చేయడం,
రోగ నిరోధక శక్తిని తగ్గించడం లాంటి ప్రభావాలు
చూపిస్తుంది. ఇలాంటి ప్రతికూల భావోద్వేగాలు కలిగి ఉండేవారు, చెడు పనులు
చేసేవారి చుట్టూ ఉండే ‘ఆరా’ ముడుచుకుపోయి, నల్లగా మారుతుంది. అంటే ఇతరుల పట్ల మీరు
చేసే విషపూరితమైన ఆలోచనలు, తరంగాలు ముందుగా మీ శరీరాన్నే పాడు చేస్తాయి. ఈ
నెగిటివ్ ఎనర్జీ మీ జీవితంలోకి దురదృష్టాన్ని, అనారోగ్యాన్ని, సమస్యలను ఆకర్షిస్తుంది.
‘‘వాడి పాపం పండింది’’ అంటుంటారు ఇలాంటప్పుడే.
·
ఆలోచనలు కూడా శక్తి తరంగ
కేంద్రాలే
పాప పుణ్యాలనేవి కేవలం చేతలకు సంబంధించినవే కాదు. మీరు మనసులో ఏమనుకంటున్నారు,
ఎలాంటి ఆలోచనలను కలిగి ఉన్నారనేది కూడా ఒక ఎనర్జీ రూపమే. ‘వాడు నాశనమైపోవాలి’ అని
అనుకుంటే మీరు ఒక నెగిటివ్ ఎనర్జీని సృష్టించినట్టే. అంటే పాపం చేశారన్నమాటే.
అదే ఎదుటి వారికి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే మీరొక పాజిటివ్
ఎనర్జీని పుట్టించినట్టే. అంటే పుణ్యం చేసినట్టే.
ఈ దృష్టి కోణంలో చూస్తే... మానవ
శరీరంలో ప్రతి కణం, ప్రతి ఆలోచన ఒక నిర్దిష్టమైన
కంపన తీవ్రతను కలిగి ఉంటాయి. అంటే వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ అన్నమాట.
·
ఇవిగిదవిగో పరిశోధనలు...
సరే... అనుకోడానికి బాగానే ఉంది కానీ, మరి ఈ విషయంలో శాస్త్రీయ పరిశోధనలు
ఏమైనా జరిగాయా? ఆ సంగతులే ఇప్పుడు తెలుసుకుందాం.
డాక్టర్ డేవిడ్ హాకిన్స్ అనే ఓ ప్రఖ్యాత సైకియాట్రిస్ట్ కొన్ని పరిశోధనలు
చేశారు. వాటి ప్రకారం ఆయనొక ‘కాన్షియస్నెస్ మ్యాప్’ తయారు చేశారు. ఈయన మానవ
భావోద్వేగాల ఫ్రీక్సెన్సీలను ఒక స్కేల్ గా విభజించారు.
వాటి ప్రకారం చూస్తే... ప్రేమ, జాలి, కరుణ, ఆనందం లాంటి ఎమోషన్స్ అంటే
భావోద్వేగాలు 500 హెర్జ్ కు పైగా వైబ్రేషనల్ స్థాయిని కలిగి ఉంటాయి. వీటి వల్ల
శాంతి, ఆరోగ్యం ఏర్పడుతాయి.
ఇక తటస్థత అంటే న్యూట్రాలిటీ అనేది 250 హెర్జ్ వైబ్రేషనల్ స్థాయిలో ఉంటుంది.
దీని వల్ల సమతుల్యత కలుగుతుంది.
అదే... కోపం, పగ, అహంకారం అనే భావోద్యేగాలు 150 నుంచి 175 హెర్జ్ లాంటి ‘లో
వైబ్రేషనల్’ స్థాయిలో ఉంటాయి. వీటి ప్రభావం వల్ల సంకుచితత్వం, ఒత్తిడి అనేవి
వ్యక్తి స్వభావంలో కలుగుతాయి.
అలాగే భయం, ఆందోళన అనే భావోద్వేగాలు 100 హెర్జ్ ఫ్రీక్వెన్సీలో ఉంటాయి. ఇవి
బలహీనతగా మారుతాయి.
ఇంతేకాదు... అసూయ, తప్పు చేశాననే భావన లాంటివి 30 హెర్జ్ అంటే అత్యల్ప స్థాయి
వైబ్రేషనల్ లెవెల్ లో ఉంటాయి. వీటి వల్ల వ్యక్తి స్వభావంలో ఆత్మన్యూనత, అశాంతి
చేరుతాయి.
నిస్వార్థమైన ప్రేమ, దయ వంటివి శరీరంలో కార్టిసోల్
(ఒత్తిడి హార్మోన్)ను తగ్గించి, ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్ల
వంటి హ్యాపీ హార్మోన్లను విడుదల చేస్తాయి. దీనివల్ల మన 'బయో-ఎలక్ట్రోమాగ్నెటిక్
ఫీల్డ్' (Bio-electromagnetic field) చాలా బలంగా, పాజిటివ్గా
మారుతుంది. అదే కోపం, పగ ఉన్నప్పుడు శరీరం నిరంతరం 'ఫైట్ ఆర్
ఫ్లైట్' (Fight or Flight) మోడ్లో ఉండి, ‘లో-ఫ్రీక్వెన్సీ’ తరంగాలను విడుదల చేస్తుంది.
·
క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ (Quantum
Entanglement)... కర్మ
సిద్ధాంతం
క్వాంటమ్ ఫిజిక్స్ ప్రకారం, బ్రహ్మాండంలో ఒకానొక సమయంలో
కలిసి ఉన్న రెండు పరమాణువులు ఎంత దూరంలో ఉన్నా... ఒకదాని చలనం లేదా మార్పు
ఇంకోదానిపై తక్షణమే ప్రభావం చూపిస్తుంది.
దీని ప్రకారం, మనం ఇతరులకు
చేసే కీడు లేదా మేలు అనవి ఏదో ఒక రూపంలో యూనివర్స్ ద్వారా తిరిగి మనల్నే చేరతాయి.
ఎందుకంటే మనమందరం క్వాంటమ్ స్థాయిలో ఒకరితో ఒకరు ముడిపడి ఉన్నాం.
మన మనసులో మంచి సంకల్పం ఉంటే మన
చుట్టూ పాజిటివ్ వాతావరణం, చెడు సంకల్పం ఉంటే నెగిటివ్
వాతావరణం ఏర్పడుతాయి.
·
హార్ట్మత్ ఇన్స్టిట్యూట్
పరిశోధనలు
అమెరికాకు చెందిన హార్ట్మత్ ఇన్స్టిట్యూట్ వారు మానవ హృదయంపై చేసిన
పరిశోధనల్లో... మనం ప్రేమ, కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు గుండె
చుట్టూ ఉండే విద్యుదయస్కాంత క్షేత్రం చాలా క్రమబద్ధంగా, శక్తివంతంగా
మారుతుందని, అది మన చుట్టూ ఉన్న ఇతరుల మూడ్ను
కూడా ప్రభావితం చేస్తుందని నిరూపించారు.
·
ఈ విశ్వమే... చిత్రగుప్తుడా?
ఈ విశ్వం ఒక పెద్ద బ్యాంక్
లాంటిది. మీరు చేసే ప్రతి మంచి పని, మాట్లాడే ప్రతి మంచి మాట ఆ కాతాలో ‘పాజిటివ్
ఎనర్జీ’ అంటే పుణ్యం రూపంలో డిపాజిట్ అవుతాయి. మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు,
ప్రమాదం ఎదురైనప్పుడు ఆ అకౌంట్లో ఉన్న పాజిటివ్ ఎనర్జీ ఒక కవచంలా మారి మిమ్మల్ని
రక్షిస్తుంది. అలాంటప్పుడే ‘ఏదో పుణ్యం కాపాడింది’ అంటుంటారు. మనం నెగిటివ్ పనులు
చేస్తే ఈ అకౌంట్ బ్యాలన్స్ తగ్గిపోతూ ఉంటుంది. అప్పుడు మనం సమస్యల్లో
చిక్కుకుంటాం. ఆ విధంగా చూస్తే మన పాప
పుణ్యాలకు ఈ విశ్వమే చిత్రగుప్తుడిలాగా లెక్కలు రాస్తుందనుకోవచ్చు.
·
సనాతన ధర్మం... సైన్స్...
సనాతన ధర్మం 'పాపం, పుణ్యం' అని దేన్నైతే
పిలిచిందో... దాన్ని నేటి ఆధునిక పరిభాషలో "ఎనర్జీ ఫ్రీక్వెన్సీ
మేనేజ్మెంట్" అని చెప్పుకోవచ్చు.
మనం చేసే పనులు, ఆలోచనల ద్వారా సృష్టించే
ఫ్రీక్వెన్సీలు విశ్వంలోకి వెళ్ళి, తిరిగి మన
జీవితాన్నే ప్రభావితం చేస్తాయి. కాబట్టి, నిస్వార్థమైన
ప్రేమ, దయ అనే 'హై ఫ్రీక్వెన్సీ' తరంగాలతో
జీవించడమే పుణ్యం; కోపం, పగ అనే 'లో
ఫ్రీక్వెన్సీ' తరంగాల్లో చిక్కుకుపోవడమే
పాపానికి మూలం అని శాస్త్రీయంగా అర్థం చేసుకోవచ్చు.
·
సైన్స్, ఆధ్యాత్మికతల కలయిక...
భౌతిక శాస్త్రం ప్రకారం "శక్తిని మనం
సృష్టించలేము, నాశనమూ చేయలేము’’ అంటే... Energy can neither be created nor destroyed. అది ఒక రూపం నుంచి మరో రూపంలోకి
మారుతుంది."
కర్మ సిద్ధాంతం
ప్రకారం... మీరు ఈ విశ్వంలోకి ఎలాంటి
శక్తిని పంపిస్తారో... అది వడ్డీతో సహా తిరిగి మీ దగ్గరకే వస్తుంది. బంతిని
గోడకేసి ఎంత గట్టిగా కొడితే, అంతే వేగంగా మనవైపు తిరిగి వచ్చినట్టన్నమాట.
అంటే మీరు సృష్టించే నెగిటివ్ ఎనర్జీయే
మిమ్మల్ని
శిక్షిస్తుంది. మీరు సృష్టించే పాజిటివ్ ఎనర్జీయే మిమ్మల్ని ఎల్లప్పుడూ
కాపాడుతుంది.
కాబట్టి...ఇప్పటినుంచైనా
మన ఆలోచనలను, పనులను పాజిటివ్గా మార్చుకుందాం... అద్భుతమైన
జీవితాన్ని నిర్మించుకుందాం!
.png)






.png)
