గురువారం, ఏప్రిల్ 26, 2012

బాగోతాల గీత

బాగోతాల గీత


గురువుగారు వ్యాసపీఠం ముందేసుకుని భగవద్గీత చదువుకుంటుండగా శిష్యుడు వచ్చాడు. వెంటనే కళ్లు తిరిగి పడిపోయాడు. గురువుగారు ఇన్ని బీరు చుక్కలు మొహం మీద చల్లితేకానీ స్పృహలోకి రాలేదు.
'ఏట్రా! కళ్లు తేలేశావ్‌, కొంపదీసి గ్నానోదయం అయిపోలేదు కద?' అంటూ పరామర్శించారు.

కాస్త తేరుకున్న శిష్యుడు, 'కాకపోతే మరేంటండీ? మీ దగ్గర నీచ రాజకీయాలు నేర్చుకుని నికృష్ఠుడినయ్యానని నేనేదో సంబరపడుతుంటే, ఉన్నట్టుండి తమరు భగవద్గీత పట్టుకుని కనిపిస్తే... కళ్లు తిరగవా చెప్పండి?' అన్నాడు.

'వార్నీ... అదా నీ కంగారు? బలేవోడివే! నువ్వు నీచావతారంలో నిగ్గు తేలావని నమ్మకం సిక్కింది కాబట్టే, నీకో కొత్త ఇసయం సెప్పేసేద్దారని అనుకుంటుంటే, సటుక్కున నువ్వే ఊడిపడ్డావ్‌!'

'అంటే పాఠం మొదలెట్టేశారన్నమాటే. చెప్పండి గురూగారూ!'

'నేను సెప్పడం కాదురా. అలనాడు ఆ సీకిట్ట పరమాత్మ, మునులు, మగానుబావులు సెప్పినవే. ఆటినిప్పుడు అరజెంటుగా ఒంటబట్టించుకోవాల...'

'అంటే వాళ్లంతా కూడా ఈ నీచరాజకీయాలు చెప్పారంటారా?'

'సిస్సీ, నోర్ముయ్‌! కబోదివైపోగలవు. ఆల్లు బగవద్గీతలు సెబితే, మనం ఆటిని బాగోతాల గీతగా మార్సుకోవాల. అందుకు ఆల్లు సెప్పిన మంచి ముక్కల్ని నువ్వు బట్టీపట్టాలని సెబుతున్నా. అంచేత ఇదిగో ఈ బగవద్గీత, ఆ పురాణం, ఈ పంచాంగం... అన్నీ బజారుకెల్లి తెచ్చేసుకోమరి!'

'అయ్యబాబోయ్‌! అవన్నీ ఎందుకండీ? నోరు తిరగదు కూడానూ! పైగా వాటిలో ఏవేవో మనకు మింగుడుపడని ధర్మపన్నాలు, నీతిసూత్రాలు గట్రా ఉంటాయి కదా, మనకెందుకూ?'

'అందుకే రాగానే కళ్లు తిరిగిపడిపోయావ్‌! ఏదో నా దగ్గర నాలుగు నీచోపాయాలు నేర్సుకున్నావు కదాని, బాగా దిగజారిపోయాననుకుని విర్రవీగకు. నువ్వింకా జారాల్సిన లోతులు, వదులుకోవాల్సిన ఇలువలు శానా ఉన్నాయి మరి!'

'బాబ్బాబు! తమకెంత కోపమొచ్చినా సరే, మంచోడినని మాత్రం తిట్టకండి. అది నా మనసుని గాయపరుస్తుంది. అయినా కానీ గురూగారూ... ఆ ధర్మాధర్మ సూక్ష్మాలన్నీ చదివితే ఎదుగుతాం కానీ, ఎందుకు దిగజారతామండీ?'

'ఓరెర్రోడా! జారాలనుకునేవోడు ముందు ఎత్తులేంటో తెలుసుకోవాల. సెడిపోవాలనుకునేవోడు ముందు మంచేంటో కానుకోవాల. అదరమాలు బాగా సేయాలన్నా, సేసిన ఎదవ పన్లను ఎనకేసుకోవాలన్నా నాలుగు దరమపన్నాలు బుర్రకెక్కించుకోవాల. నువ్వాటిని పాటించనంతకాలం పెమాదం లేదు. నువ్వెన్ని నీతిసూత్రాలు నేర్సుకుంటే అంతలా దూసుకుపోతావు. రాజకీయంలో ఇదొక నీచాతినీచోపాయం. అర్దమైందా?'

'ఓహో... అదన్నమాట మీ గీతా సారాంశం! మరి ఇలాంటి విద్యలో ఆరితేరినవారెవరైనా మన సమకాలీన సమాజంలో వేగుచుక్కలా వెలుగులీనుతున్నారాండీ?'

'కళ్లెట్టుకు సూడ్రా కుర్రసన్నాసీ! సుట్టూ జరిగే రాజకీయమంతా అదే! అందునా ఆ తండ్రి కన్నబిడ్డని, ఆ బిడ్డ పలుకుల్ని సూత్తా కూడా నేర్సుకోకపోతే ఎట్టారా! సేసినవన్నీ సేసేసి సానుబూతి పొందాలని సూడ్డంలేదూ? వాడిపోయిన గంజాయి మొక్కలా మొగమేసుకుని తులసి మొక్కనంటూ తెగించి మాట్టాడ్డం లేదూ? పెజానీకం మనసుల్లో తులసిమొక్క ఎంత పవిత్రమైందో నీకు తెలీలేదనుకో, అప్పుడు దాన్ని అడ్డమేసుకోగలవా? అంచేత ముందు పవిత్రమైనవేంటో జాబితా రాసుకో. గంగిగోవు పాలు, గంగాభవాని నీళ్లు, రాములోరి పాలన తీరు... ఇలాగన్నమాట. ఆటిని ఎడాపెడా వాడేసుకో. నీలాంటోల్లకు ఆ యువనేత ఓ నడిచే విగ్నాన గ్రందమనుకో. ఆయన దారిలో నువ్వు కూడా ముందు జనాన్ని దోసేసుకో. ఆనక మనసంతా జనమను. అదే నిజమను. ఇక ఆయన తండ్రిగారి జమానా ఓపాలి గురుతు సేసుకో. తమదంతా దేవుడి పాలనన్నా, వరుణుడు తమలో దూరిపోయాడన్నా, తన మనసే శివుడన్నా... అయ్యన్నీ సెప్పాలంటే ముందుగాల నీకు పురాణాలు గట్రా తెలిసుండాలిగా? అదన్న మాట. అర్దమైందా?'

'ఎందుకు అర్థం కాదండీ, ఇంత బాగా చెప్పాక! రాబోయేది రామరాజ్యమని, సువర్ణస్వామ్యమని చెబుతుంటే విని విస్మయం చెందుతున్నాం కదండీ?'

'అద్గదీ! అయ్యన్నీ ఇంటూ కూడా బుర్రలోకి ఇంకించుకోలేదనుకో, నిన్నా దేవుడు కూడా కాపాడలేడు. ఆయనగారి పెతి పలుకూ నీలాంటోల్లకు నికార్సయిన పాటమే మరి'

'కానీ గురూగారూ! పంచాంగం చదవమన్నారు, అదెందుకండీ?'

'మూర్తాలు చూసుకోడానికిరా...'

'మనం చేసేవే నీచకార్యాలు... మళ్ళీ వాటికి ముహూర్తాలెందుకండీ?'

'ఓరెర్రోడా! ఎదవపన్లకు అవకాశం వస్తే సటుక్కున సేసేయాలి కానీ మూర్తాలు సూసుకుంటా కూసుంటామేంట్రా? పంచాంగాలు కొనమన్నది ఆటిగ్గాదు. నీ సేతకాని తనానికి అడ్డమేసుకోడానికి'

'చేతకానితనమా? విజయవంతంగా అడ్డగోలు పనులు చేసే మనల్ని మనమే ఇలా కించపరుచుకుంటే ఎలాగండీ?'

'అది కాదెహె! అడ్డగోలు పన్లు బానే సేత్తాం. ఆటిని సేసే పెద్ద నేతల మాటలకు తానతందానా అని తలూపుతాం. అంతవరకు ఓకే. మరా సందడిలో పెజాసేవ కూడా సేయాలనే సంగతి ఒకోసారి మర్సిపోతాం కదా? ఆనక నీ పరిపాలన జావగారిపోయిందని అంతా అనుకుంటారు కదా? అప్పుడు అడావుడిగా పంచాంగాలు తిరగేసి మూర్తాలు అడ్డమేసుకోచ్చు. నేను కుర్సీ ఎక్కిన సమయాన్ని ఏ రాహువో ఒంటి కన్నుతో సూశాడనో, మంచి పనులు సేద్దామనుకున్నప్పుడల్లా ఏ కేతువో వంకరగా నవ్వాడనో సెప్పుకోవచ్చు. మొత్తం మీద మూర్తం బాలేదంటే సరి! దాని మీద పడి అంతా కొట్టుకుపోద్ది! మరి మన రాట్రంలో పెద్దాయన ఏమన్నాడో మర్సిపోయావా? అదన్నమాట! అర్దమైందా? అరెరె... అదేంట్రా? ఉన్నట్టుండి లేచి అదాటున బయల్దేరావు?'

'భలేవారండి బాబూ! అర్జంటుగా వెళ్లి పురాణాలు, పంచాంగాలు కొనుక్కోవాలి. వస్తా!'

PUBLISHED IN EENADU ON 26.4.2012

మంగళవారం, ఏప్రిల్ 10, 2012

సోదెమ్మ బోధ


సోదెమ్మ బోధ


'సోది చెబుతానమ్మ... సోది చెబుతాను. చెయ్యి చూసి చెయ్యబోయేది చెబుతాను. గీతలు చూసి రాతలు చెబుతాను. సోది చెబుతానమ్మ... సోది చెబుతాను'

సోదెమ్మ దారంట పోతూ ఓ పెద్ద భవనం ముందు ఆగింది. గూర్ఖా పరుగున వచ్చి, 'రుకో... ఏ బడా ఆద్మీకా ఘర్‌ హై... జావ్‌ జావ్‌' అన్నాడు.

సోదెమ్మ కస్సుమంది. 'మై భీ బడా సోదెకత్తే హు! జబర్దస్‌ న కరో! మామూలు సోది కాదు, రాజకీయ సోది చెబుతా! సామాజిక సోది చెబుతా... సంఝే!' అంది అంతకంటే గట్టిగా.

ఈలోగా ఇంట్లోంచి రాహుల్‌ బయటికొచ్చాడు. 'అమ్మా... అమ్మా! సోది చెప్పించుకుంటానే. ఏమీ తోచట్లేదు' అన్నాడు.

మాతాజీ మెత్తగా నవ్వారు. 'ఓకే బేటా. నీ ఆనందమే నా ఆనందం. అందుకోసం ఏమైనా చేస్తా' అన్నారు. పక్కనే ఉన్న ఆమె కూతురు ముచ్చటగా తల్లి బుగ్గ పుణికింది. ఆమె మరోసారి నవ్వారు.

సోదెమ్మ బుట్ట పుచ్చుకొని లోపలికి అడుగుపెట్టింది. దారిన పోతున్న సామాన్యుడికి ఇదేదో ఆసక్తిగా అనిపించి గేటులోంచి లోపలికి చూడసాగాడు.

సోదెమ్మ చాప పరచి, 'రా! యువరాజా, కూచో! ఏదీ చెయ్యి చూపించు' అంది. యువరాజు కూర్చున్నాడు కానీ చెయ్యి చాపలేదు. 'ఊహూ... చేయి చూపించను. సిగ్గుగా ఉంది' అన్నాడు.

'ఉన్న చెయ్యి చూపించడానికి సిగ్గెందుకు దొర. తీసిలా బుట్టమీద పెట్టు' అంది సోదెమ్మ.

లాల్చీ జేబులోంచి రాహుల్‌ చెయ్యి తీశాడు. అదంతా కట్టు కట్టి ఉంది. 'అందుకే చూపించనన్నాను. దెబ్బ తగిలింది. అందుకు బాధ్యత వహించి నాకు నేనే కట్టు కట్టుకున్నాను. మరిప్పుడెలా?' అన్నాడు.

సోదెమ్మ నవ్వింది. 'కట్టు కట్టిన చెయ్యే ఇక్కడెట్టు దొర. కనికట్టు చేసి కబురు చెబుతా. కళ్లు చూసి చెబుతా. కళ్ల ముందరిది చెబుతా. నుదురు చూసి చెబుతా. దాని రాత చెబుతా. ముఖం చూసి చెబుతా. మనసు విప్పి చెబుతా' అంది తన ధోరణిలో.

రాహుల్‌ ఉత్సాహంగా ముందుకు వంగి, 'అయితే చెప్పు. ఇలా ఎలా జరిగింది?' అన్నాడు. సోదెమ్మ అందుకుంది.

'ఆ... ఉత్తరాన ఉసుపోశమ్మ పలుకు. పంజాబు సీమలో అంకాలమ్మ పలుకు. పశ్చిమాన గోవా గింగిర్లమ్మ పలుకు. ఆ పక్క సీమలో ఖండమ్మ పలుకు... ఉన్నదున్నట్టు పలుకు. ఉలుకులికి పలుకు...' అంటూ రాగం తీసింది.

'వీళ్లంతా ఎవరు?' అన్నాడు రాహుల్‌.

'మధ్యలో అడ్డురాకు దొర. ఏ అమ్మ పలకాలో ఆయమ్మే పలుకుద్ది. అది విని నేను పలుకుతా'

'సర్లె... సర్లె... అడ్డురాను చెప్పు!'

సోదెమ్మ మళ్ళీ రాగం అందుకుంది.

'ఆ... చేతులు మడిచావు దొర ... చేష్టలుడిగావు! హామీలు చింపావు... అదిరిపడ్డావు! ఎదుటోర్ని తిట్టావు... ఎగిరిపడ్డావు! కోపాలు చూపావు... కునారిల్లేవు! కులాల కుంపటి రాజేసినావు... మతాల మంటల్ని ఎగదోసినావు... ఇన్ని చేసి కూడ, ఇరుకున పడ్డావు! ఎందుకో తెలుసా దొరా? పేదోళ్ల కష్టాల పేరు మరిచావు... మామూలు మనుషుల ఊసు విడిచావు...'

గేటులోంచి అంతా వింటున్న సామాన్యుడు నిట్టూర్చాడు. 'అవును నిజమే! ఉత్తరప్రదేశ్‌లో స్థానికంగా ఉన్న సమస్యల్ని పరిష్కరిస్తారనే నమ్మకం కలిగించడం మీదకన్నా, సామాజికంగా ప్రజల్ని విడగొట్టడానికే ఆ పార్టీ నేతలంతా ప్రయత్నించారు. కులాల వారీగా, మతాల వారీగా ఆకట్టుకోవాలనే ఎక్కువగా చూశారు. లేకపోతే మేధావిగా దేశవిదేశాల్లో పేరొందిన శ్యామ్‌పిట్రోడాను ఓ ఎన్నికల సభలో ఒక వడ్రంగిగా ఈయనగారు పరిచయం చేయడం ఎంత హాస్యాస్పదం? ఆ ప్రాంతంలో ఆ కులంవారు ఎక్కువనే కదా? ఇది కుల రాజకీయాలకు ఉదాహరణ కాదా? ఇక ఆ పార్టీ నేతలంతా మతపరమైన రిజర్వేషన్ల అంశాన్ని తలకెత్తుకోలేదా? ఎన్నికల సంఘం తప్పుపట్టినా పట్టించుకున్నారా? ప్రధానికి, రాష్ట్రపతికి ఫిర్యాదులు వెళ్లినా ఆ నేతలకు అడ్డుకట్ట వేసే ప్రయత్నమే జరగలేదన్నది ఎవరికి తెలియదు? ఆఖరికి ఎన్నికల సంఘాన్నీ ఓ మతానికి వ్యతిరేకిగా చిత్రించాలనుకోలేదా? ఎన్నికలకు రెండు నెలల ముందే ఓ ప్రధాన కులస్థుణ్ని ఆదరాబాదరా మంత్రివర్గంలోకి తీసుకోవడం ఎలాంటి సంకేతం ఇస్తుంది? ఇవన్నీ ఓ జాతీయ పార్టీ చేసే పనులేనా? అంతా అయిపోయాక బాధ్యత వహిస్తే సరిపోతుందా?' అనుకున్నాడు.

లోపల సోదెమ్మ చెబుతూనే ఉంది. 'మరిప్పుడు- ఏం చేయాలంటావు?' అన్నాడు రాహుల్‌.

'చేసిన తప్పుల్ని చూసుకో దొర. చేతి గాయానికి మందులేసుకో దొర. బాధ్యత వహించకు దొర. బాధ్యతగా నడుచుకో!' అంది సోదెమ్మ.

'అమ్మా... అమ్మా! నువ్వు కూడా చెప్పించుకోవే' అంటూ రాహుల్‌ సరదాపడ్డాడు. యువరాజు సరదా కాదనలేక మాతాజీ ముందుకొచ్చి చెయ్యి చాపారు. ఆమె చేతిలో నాలుగు వేళ్లకు కట్టుకట్టి ఉంది. ఒక్క చిటికెన వేలికి ఉంగరం తళుక్కుమంటోంది.

సోదెమ్మ కళ్లు మూసుకుని రాగం అందుకుంది.

'ఆ... రోట్లో పచ్చడి రుబ్బబోయావు. చేతి వేళ్లనే పచ్చడి చేసుకున్నావు! రుబ్బడానికి ఒక మనిషిని పెట్టావు... పక్క నుంచి నీవు పొత్రమ్ము తిప్పేవు! రుచులు వడ్డించే మార్గమిది కాదే తల్లీ! ప్రజల అభిరుచులు తెలుసుకోవే తల్లి! అధికారంతో మురిసేవు... వారసత్వమే నీకు వరమని తలచేవు... కానీ ఇప్పటికైనా నిజము తెలుసుకో! సామాన్యుల మనసును తెలుసుకోవాలమ్మ! సానుకూల పనులు సాధించాలమ్మ! అవినీతి అనుచరుల కంట కనిపెట్టమ్మ... అపుడు కానీ నీకు కలిసిరాదమ్మ!'

గేటు దగ్గరి సామాన్యుడు నవ్వుకున్నాడు. 'సంకీర్ణ పార్టీలను బుజ్జగిస్తూ సామాన్యుల మనోభావాలు గమనించకపోతే ఫలితాలిలాగే ఉంటాయి. ఇక ముందైనా ఈ సంగతి తెలుసుకుని ముందుకు సాగితే బాగుణ్ను!' అనుకుని ముందుకు సాగిపోయాడు.

సోదెమ్మ కూడా బుట్టవాయినం అందుకుని బయటపడింది!

PUBLISHED IN EENADU ON 10.3.2012

అధికార పైత్యం!



అబ్బ! ఎంత నిజాయతీ! తల్చుకుంటేనే మనసు పులకించి పోతుంది. హృదయం ఉప్పొంగి పోతుంది. తనువంతా రోమాంచితమై వెంట్రుకలన్నీ ఒక్కుమ్మడిగా నిక్కబొడుచుకుని సూదుల్లా నుంచుంటాయ్‌. అసలీ మధ్య కాలంలో చూశామా ఇంతటి నీతి నిజాయతీలు! అమాత్యుల వారు ఎంత బాగా సెలవిచ్చారు! ఎంత నిబ్బరంగా వాక్రుచ్చారు! 'ప్రభుత్వం మాది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేయగలం ఇలాంటి పన్లు?' అని చెప్పేసేసి ఎంత చక్కగా వివరించారు! ఇంకెవ్వరూ ఏమీ మాట్లాడకండి. ఎన్నాళ్ల నుంచో జరుగుతున్న తతంగాన్ని ఉన్నదున్నట్టు ఒప్పుకోవడమంటే ఎంత నిబ్బరం ఉండాలి? ఎంత ధైర్యం కావాలి? అన్నింటికన్నా మంచి ఆయన మాటల్లో పారదర్శకతను గమనించారా! అసలెక్కడైనా మర్మమనేది ఉందా? లౌక్యమనేది కనిపించిందా? మరింకెందుకు గొడవ? ఇందిరా గాంధీ ఇళ్ల పథకం అసలెవరి కోసమో తేటతెల్లం అయిపోయిందని అఖిలాంధ్ర ప్రజానీకమంతా గ్రహించాలి. అది కేవలం ఏలిన వారి అనుయాయులకే అని అర్థం చేసుకోవాలి. అప్పుడెంత నిశ్చింతగా ఉంటుందో ఒక్కసారి వూహించండి.

ఈ విషయం తేలిపోతే పాపం అర్హులైన పేదవారు అనవసరంగా ఆశలు పెంచుకోవాల్సిన పని ఉండదిక. ఆశనేది లేకపోతే ఇక నిరాశకు చోటేదీ? కాబట్టి పేదలు పేదల్లాగా పడి ఉండచ్చు. ఎలాటి హడావుడి, ఆందోళన లేకుండా కాలం గడిపేయవచ్చు. కొంప కట్టుకునే ఆలోచన వదిలేసి కడుపు నింపుకొనే వీలు చూసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ ఆలోచించారు కాబట్టే ఆయన అధికారులకు చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కాంగ్రెస్‌ నాయకులు సూచించే జాబితాలోని వారికే ఇందిర ఇళ్లు ఇవ్వవలెనని ఎలాంటి శషబిషలూ లేకుండా చెప్పేశారు. రాష్ట్రానికే ప్రాతినిధ్యం వహించే మంత్రి పదవిలో ఉండి, ఓ పార్టీకి చెందిన వారికే లబ్ది చేకూర్చేలా ప్రవర్తించడమేంటని అనవసరంగా ఆయన్ని ఆడిపోసుకోకండి. ఆయనది సంకుచితత్వం కానేకాదు. ఇంకా మాట్లాడితే విశాల దృక్పథం! నిజమైన పేదలకు అసలైన శ్రేయోభిలాషి ఆయనే.

కాదూ కూడదూ, ఆయన మాటలు సరైనవి కానేకావని ఎవరైనా అన్నారంటే వారికి మెదడు మోకాల్లో ఉందనే అర్థం. అసలు ఆయన్ని తీసుకొచ్చి సన్మానం చేసి, నిజాయతీ రత్నలాంటి బిరుదేదో ఇవ్వాల్సింది పోయి, కోడిగుడ్డుకు ఈకలు పీకితే ఎలా? ఎలాటి దాపరికం లేకుండా, మెరమెచ్చు మాటలాడకుండా, లోపాయికారీగా పని జరిపించకుండా బహిరంగంగా మనసులోని మాట చెప్పారంటేనే తెలియడం లేదూ ఆయన మంచితనం ఏమిటో?

ఆ పథకం సంగతి పక్కన పెట్టండి. అసలే పథకం సరిగ్గా పేదలకు అందుతోంది కనుక? ఆ సంగతి ఆలోచించరేం? నీటి పథకాలు తీసుకుంటేవాటి గుత్తేదారులు అస్మదీయులేగా? అంచనాలు పెంచేసుకుని, పని జరక్కపోయినా జరిగినట్టు చూపించేసి ఖజానా సొమ్ము పంచేసుకోలేదూ? పైగా జనానికి ఇంత లాభం, అంత లాభమంటూ మసి పూసి మారేడుకాయ చేసే ప్రకటనలు గుప్పించడం లేదూ? అలాంటి మేడిపండు ప్రకటనలు ఇచ్చేవారిని వదిలేసి, పాపం చక్కగా కుండ బద్దలు కొట్టిన ఈయన్ని అనుకుంటారేం? అసలేమైనా ఇంగితమనేది ఉందా అని!

అసలు మంత్రులందరూ ఇదే బాటలో సాగితే ఇంకా మంచిది. 'ఇదిగో అబ్బాయ్‌... ఇదీ పథకం. దీంట్లో మావాళ్లే ఉంటారు. మీరూరికే ఆశలు గట్రా పెంచుకోకండి. మావాళ్లంతా అయిపోయాక ఒకటో, రెండో ఉంటే మీకే ఇప్పిస్తాం' అని ప్రతి పథకం మీద నిక్కచ్చిగా చెప్పేస్తే హాయిగా ఉంటుంది. కావాలంటే ప్రతి ఎమ్మార్వో కార్యాలయంలోనూ జాబితాలు కూడా పెట్టిస్తే సరి. ఇక సామాన్యులు ధరఖాస్తులు పెట్టుకోవడాలు, ఎదురు చూడ్డాలు, కాళ్లరిగేలా కార్యాలయాల చుట్టూ తిరగడాలు, కలలు కనడాలు, భ్రమల్లో తేలిపోవడాలు ఏవీ ఉండవు. అందరి మనసులూ తేటతెల్లంగా ఉంటాయి.

ముఖ్యమంత్రి కూడా ఈ విషయంలో వెంటనే చొరవ తీసుకోవాలి. వీలుంటే శాసనసభలో ప్రకటించేస్తే ఇంకా మంచిది. అసలు సమాచార కమీషనర్ల నియామకానికి ముందే ఆయన ఈ సంగతి ఆలోచించి ఉండాల్సింది. చట్టం, దాని ప్రయోజనం, ప్రజల హక్కు ఇవన్నీ ఆలోచించేది లేదని, కేవలం మా పార్టీవారికి పదవులు ఇప్పించడమే మా ముఖ్య లక్ష్యమని ముందే చెప్పి ఉంటే జనానికి గొంతు చించుకునే బాధ తప్పేది. గవర్నరు కూడా అవాక్కై గమ్మునుండిపోయేవారేమో. తిరస్కరించే అవసరం కూడా ఉండకపోను. ఇప్పటికైనా మించి పోయిందేమీ లేదు.

పాలనలో ఉన్నప్పుడు కాకపోతే ఇంకెప్పుడండీ ఇలాంటి పనులు చేసే అవకాశం వస్తుంది? అర్థం చేసుకోరేం? అధికారాన్ని అడ్డం పెట్టుకుని అయినవారికి అడిగిందిచ్చి లక్షల కోట్ల రూపాయలు దండుకుని సొంత వ్యాపారాలు పెంచుకున్న హయాం సంగతి మర్చిపోయారా? అన్ని అడ్డగోలు పనులూ చేసి కూడా 'మాది దేవుడి పాలన' అంటూ మభ్యపెట్టేకన్నా, ఎంచక్కా 'మా తీరింతేనర్రా!' అని ప్రకటించడం ఎంత సబబో తెలుసుకోండి. అలాంటి కాపట్యం లేనందుకైనా అమాత్యుల వారిని ఆకాశానికెత్తాలి.

ప్రజలు కూడా ఎంత తొందరగా ఈ సంగతి గ్రహిస్తే అంత మంచిది. ఎందుకంటే అమాత్యుల వారు అన్నదానికి భిన్నంగా ఏమీ జరగడం లేదు. మరో మంత్రిగారేం చేశారో గుర్తు లేదా? కొడుకు పెళ్లి కోసం కళాశాల ప్రాంగణం కావలసి వస్తే ఏకంగా పరీక్ష కేంద్రాన్నే మార్చేయలేదూ? అప్పటి కప్పుడు మార్చేయడం వల్ల పాపం అభ్యర్థులు ఎంత హైరానా పడ్డారు? ఓ కన్నతండ్రి మరణం, ఓ కూతురి కంటతడి, ఓ కుటుంబం గుండెకోత ఇవన్నీ అవసరమా? పరీక్ష కేంద్రాలను ప్రకటించడానికి ముందే అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లల్లో శుభకార్యాలూ, సమర్తలూ గట్రా ఉన్నాయేమో వాకబు చేసుకుంటే ఇంతటి ప్రయాసలు ఉండేవా?

ఎక్కడి కక్కడ అధికార పైత్యం తైతక్కలాడుతుంటే ఊరికే విమర్శించి ఏమిటి లాభం? అంతకన్నా పారదర్శకమైన పాలన కావాలని కోరుకుంటే మంచిది. 'మేమింతే! మా పాలనింతే! మా ఇష్టం! ఇలాగే ఉంటాం! ఏదైనా చేస్తాం! చేయగలం! ఇదే మాకు అవకాశం! ఇకనైనా తెలుసుకోండి!' అని చక్కగా పత్రికల్లో అధికార ప్రకటనలు జారీ చేసేస్తే ప్రజానీకం అందరూ చక్కగా చదువుకుని, అర్థం చేసుకుని నోరు మూసుకుని పడుంటారు. ఏమంటారు?

PUBLISHED IN EENADU ON 5.3.2012

మత్తోన్మాదులు

మత్తోన్మాదులు



'మత్తు వదలరా... నరుడా!' అన్న తత్వం వినడానికి బాగానే ఉంటుంది. ఒంటపట్టించుకుందామని మాత్రం చూడకూడదు. ఎందుకంటే తత్వం కూడా ఓ మత్తు లాంటిదే. తలకెక్కిందా- మన తత్వాన్నే మార్చేస్తుంది. ఈ విషయం మన ప్రజాప్రతినిధులకు బాగా తెలుసు. అందుకే వాళ్లు తత్వం మాట పక్కనపెట్టి, మత్తును తలకెత్తుకున్నారు. ఏ మత్తని అడక్కండి. 'మత్తులందు మహా మత్తులు వేరయా!' అని కొత్తగా పాడుకోవాలి.

ఒకటా రెండా మనం ఓటేసి నెత్తిన పెట్టుకున్న నేతలు పలు 'మత్తో'న్మాదులు. నెలనెలా వచ్చిపడుతున్న వాటాలే అందుకు సాక్ష్యం. మంత్రుల ఇళ్లకు లక్షల రూపాయలు నడిచి వచ్చేస్తుంటే- 'ఆహా! ఏమందు, ఈ మందునేమందు... మందు మహిమనేమందు, అమందానంద కందలిత హృదయారవిందుండనై ముందు మందు విందునందుకొందు' అనుకోకుండా ఉంటారా? ఒక్క మంత్రులనేముంది, మన నియోజకవర్గ ప్రయోజకులూ తక్కువేం కాదు. లోటాలకు లోటాలు తాగుతూ సామాన్యులు మందభాగ్యులవుతుంటే, వాటాలకు వాటాలతో ఈ అసామాన్యులు 'మందు'భాగ్యులవుతున్నారు. పరగణాలో మందుకొట్టు కనిపిస్తే చాలు, 'ముందు కొట్టు' అని మరీ దండుకొంటున్నారు. వీరి వెనకే అధికారుల బారులు, పోలీసుల బాసులు, ప్రముఖుల గోముఖులు కూడా సిద్ధం. ఈ మత్తుకు బానిసైనవారి జాబితా తయారు చేస్తే- అందులో ముందుగా ప్రస్తావించాల్సింది ప్రభుత్వాన్నే! వేలకోట్ల ఆదాయం ఖజానాలో జమ అయితేనే కదా, జనాకర్షక పథకాల జమానా ముందుకెళ్లేది?

ఇంతమందికి ఇన్ని వాటాలు వేసేది సామాన్యుడి జేబులో చిల్లర పైసలతోనే. కాయకష్టం చేసి, కాసిని కాసులు జేబులో వేసుకున్నాడో లేదో- కుడివైపు గలాసు ఘల్లుమంటోంది. ఎడమవైపు సీసా రాగాలు పోతోంది. గుడి పక్కనుంచైనా, బడి పక్కనుంచైనా తల తిప్పితే చాలు, వ్యసనానందం వల వేస్తోంది. 'రావోయి మా కొట్టుకి ఓరయ్యో... మందున్నది అందుకొమ్మన్నది...' అంటూ ఊరిస్తోంది. అతడి నాలుక తడిస్తేనే కిందనుంచి పైదాకా నేతల చేతులు తడుస్తాయి. ఊరింపునకు లోబడి అటుకేసి అడుగులేశాడా- అమ్మాల్సిన ధరకన్నా అధిక మొత్తం సమర్పించుకోవలసిందే. అదేంటని అడిగితే చెప్పే నాథుడు లేడు.

అధికారైనా, అమాత్యుడైనా అందులోంచి పిండుకునేవాళ్లే కాబట్టి నోరెత్తేందుకు లేదు. నిబంధనలన్నీ నిషాలో తూగుతుంటాయి. దిక్కులు చూస్తే కిక్కు పోతుంది. ఏటా వేలకోట్లు కురవాలన్నా, వ్యాపారంలో పెట్టుబడికి అనేక రెట్లు రాబట్టాలన్నా 'మత్తు'ను వదలకూడదు. కాబట్టే కళ్ల ముందు కేటులున్నా, సిండికేటులున్నా మందు పొరలు కమ్మేసి ముందుచూపు ఆనట్లేదు. ఏబీసీడీ అంటూ ఏసీబీ ఎన్ని పేర్లు బయటపెట్టినా, సర్కారువారి నర్సరీ బడిలో 'జానీ జానీ... ఎస్‌ పాపా... ఈటింగ్‌ సుగర్‌... నో పాపా!' అనేసి సరిపెట్టేస్తారు.

అసలు అన్నింటికన్నా పెద్ద మత్తు- అధికారం! ఆ కిక్కు ఎక్కితే దిగదు. దిగనివ్వదు. అధికారం అందలం ఎక్కించగానే, బుద్ధి బురదగుంటలోకి లాగుతుంది. అది లేనప్పుడే ప్రజల కష్టాలు కళ్లకు ఆనతాయి. కాళ్లకు బలపాలు కట్టి తిరగమంటాయి. కనిపించిన ప్రతివాణ్నీ వాటేసుకుని బావురుమని ఏడవమంటాయి. వాడు ఏడవకపోయినా ఓదార్చమంటాయి. చేతులూపినా, చెక్కిళ్లు తుడిచినా, చేతిలో చెయ్యేసినా- అంతా అధికార మత్తు కోసమే! సూదిలాంటి సమస్య కూడా గునపంలా కనిపిస్తుంది. ఆ సమయంలో కళ్ల డాక్టరుకి చూపించుకుంటే 'ఇవి కళ్లా, మైక్రోస్కోపులా?' అని కిందపడిపోతాడు. అదే కుర్చీ ఎక్కితే కొండలాంటి సమస్యలైనా గులక రాళ్లలా ఆనతాయి. మళ్ళీ కళ్లు చూపించుకుంటే అవి టెలిస్కోపులా మారిపోయి ఉంటాయి. చూపులు పక్కదారి పడతాయి. సమస్యల పేరుచెప్పి సొమ్ము మళ్ళించే పథకాలను రచించమంటాయి.

నోరు 'జనం...జనం...' అన్నా, మనసు 'మనం...మనం...' అంటుంది. సొంత వ్యాపారాల్ని ఉరకలెత్తిస్తుంది. ఓట్ల పథకాలకు ఓనమాలు దిద్దిస్తుంది. బడ్జెట్‌ అంచనాలు పెంచేయమంటుంది. పన్నుల పరిధి విస్తరించమంటుంది. అంకెల గారడీ చేయమంటుంది.

అధికార మత్తు కమ్మేసినవారికి అసెంబ్లీ అయినా, పార్లమెంట్‌ అయినా ఒకటే. గెలిచి సభలోకి వెళ్లి కూర్చున్నాక వలువలు ఊడిపోయిన విలువలు సెల్‌ఫోన్లలో వీడియోలు చూపిస్తాయి. అవకాశం వస్తే చాలు అరిషడ్వర్గాలు అసభ్య నర్తనం చేస్తాయి. సమస్యలన్నీ సర్కారు సొమ్ముకు గీటురాళ్లుగా కనిపిస్తాయి. కళ్లముందు కుంభకోణాలు కరాళ నృత్యం చేస్తున్నా- సంకీర్ణ ధర్మం మౌనం మత్తులో మునిగిపోతుంది. తెరవెనక చేయి తోలుబొమ్మలాట ఆడిస్తుంటే, వికృత పాలన తైతక్కలాడుతుంది.

ఇన్ని మత్తుల మధ్య జనం ఉన్మత్తులై ఆశల మత్తులో జోగుతుంటారు. దానాదీనా ఎవరి దగ్గరకు వెళ్లి 'మత్తు వదలరా... నరుడా!' అని ఎంత తత్వం పాడినా ప్రయోజనం ఉండదు. ముందుగా ఈ తత్వం ఒంటపట్టించుకుంటే మంచిది. మనం కూడా గమ్మత్తుగా పడి ఉండవచ్చు.

PUBLISHED IN EENADU ON 21.2.2012

తరంగాల తతంగం

తరంగాల తతంగం



కోలు కోలోయన్న కోలో నా సామి...
కొమ్మలిద్దరు మాంచి జోడు...'- అంటూ కూనిరాగం తీస్తూ వచ్చి పడక్కుర్చీలో వాలారు గురువుగారు. శిష్యుడు సర్దుకు కూర్చుని మొహమాటంగా నవ్వాడు.
'ఏరా... ఈ పాట ఎరికొచ్చిందిరా?' ప్రశ్నించారు గురువుగారు.
'పాత పాట కదండీ?' అన్నాడు శిష్యుడు.
గురువుగారు నవ్వి, 'కాదురా కొత్తదే' అన్నారు.
'అయ్‌బాబో! ఇది కొత్తదేంటండి బాబూ? గుండమ్మకథలోదండి' అన్నాడు శిష్యుడు అయోమయంగా.
'కావచ్చు లేరా! కానీ ఇది నేటి గూండాల కథకి కూడా సరిగ్గా సరిపోద్ది మరి' అంటూ గురువుగారు నవ్వేశారు.
'అయితే గురువుగారు రాజకీయ పాఠం మొదలెట్టేశారన్నమాట. నేనే కనుక్కోలేకపోయా' అన్నాడు శిష్యుడు కుదుటపడి.

'ఈ పాటలో సామి అంటే ఎవరనుకున్నావ్‌ సుబ్రమణ్య సామి. మరాయన సుప్రీంకోర్టులో అర్జీ తగిలించబట్టే కదా, గూండాల కథ రసకందాయంలో పడింది? ఆ యవ్వారంపై కోర్టు అక్షింతలు వేస్తే కోలుకోలోయనిపించింది మరి. కొమ్మలిద్దరంటే వేరే చెప్పాలా? టూజీ కుంభకోణమే. ఇది అటు తిరిగి ఇటు తిరిగి ఢిల్లీ 'జీ'లకు కూడా చుట్టుకునేలా ఉంది కదా? అందుకే సరదాగా పాటందుకున్నా'

'అన్యాయం గురూగారూ! అవతల తోటి అవినీతిపరుల లైసెన్సులు రద్దయిపోయి, జరిమానాలు కూడా పడితే మీరిలా సంబరపడ్డం భావ్యమా చెప్పండి?'
గురువుగారు ఓసారి దీర్ఘంగా నిట్టూర్చి, 'ఇన్నాల్లనుంచీ నా వాగుడంతా రాసుకుంటున్నావు కానీ, నేనేంటో తెలుసుకోలేకపోయావురా! అదే నా బాధ. సర్లె... ఇంతకీ నీకా తరంగాల తతంగమైనా పూర్తిగా ఒంటపట్టిందా, అదీ లేదా?'

'తరంగాల తతంగమేంటి గురూగారూ?'
'అదేరా... ఈజీగా డబ్బులు కురిపించిన టూజీ యవ్వారమే. రెండో తరం సెల్లుఫోన్లకి సొగసులద్ది తైతక్కలాడించే అయ్యేవో అయస్కాంత తరంగాల కతే. ఆ తరంగాలే అవినీతి నేతల అంతరంగాలు. సర్కారుకు దక్కాల్సిన లచ్చల కోట్ల సొమ్ముకు గండి కొట్టిన 'కంత'రంగాలు. అనుంగు కంపెనీల జేబులు నింపిన అనంతరంగాలు. అడ్డగోలుగా అయినవారికి మేలు సేసిన 'మేత'రంగాలు. అనుమతులు దక్కించుకుని ఆ ఎమ్మటే అమ్ముకుని అసలుకెన్నో రెట్లు నొల్లుకున్నవారికి కోర్టు వేసిన జరిమానా ఎంతరా? సముద్రంలో కాకిరెట్ట కాదూ? అందుకనే ఆల్లంతా కలిసి, 'కోట్లు కోట్లోయమ్మ కోట్లో నా సామి... కట్టేది కూసింతే సూడు...' అని పాడుకోవచ్చురా. ఏమంటావ్‌?'

'అనేదేముందండీ... అంత బాగా చెప్పాక! ఇంతకీ ఈ వ్యవహారంలోంచి ఒంటపట్టించుకోవాల్సినవేమైనా ఉన్నాయాండీ?'
'ఎందుకు లేవురా? తేరిపారి చూస్తే తేరగా ఆరగించడానికి అన్నీ సూత్రాలే. ఏ పనికైనా నిబంధనలంటూ ఉంటాయి కాబట్టి, ముందుగా ఆటినో చూపు చూడాల. అవి కట్టుదిట్టంగా ఉంటే పనిగట్టుకుని మార్చేయాల. మరయ్యే మన పని సులువు చేసేలా ఉన్నాయనుకో... వాటినే నెత్తిమీద పెట్టుకోవాల. మరీ తరంగాల తతంగంలో జరిగిందదే కద? ఫోన్లు వాడేటోల్లు లచ్చల్లో ఉన్నప్పటి రూల్సునే, వాళ్లు కోట్లలోకి పెరిగినా సవరించలేదంటే తెలీడంలే? సవరిస్తే కజానాకే కద లాభం? ఆపని చేస్తామా? అమ్మమ్మా... అదిగో అలాంటప్పుడే కళ్లు మూసుకోవాల. పనికి టెండర్లెట్టి వేలమేస్తే అయినవాళ్లు వెనకబడతారనిపించిందనుకో... ఆ వూసే ఎత్తకూడదు. మనోళ్లకి ముందుగానే ఉప్పందించేసి లోపాయికారీగా దండుకున్నదేదో దండేసుకున్నాక, రెడీ ఒన్‌...టూ...త్రీ అని గబుక్కున లెక్కెట్టేసి ఎవరు ముందొస్తే వాళ్లకే పనోచ్‌ అని వూదరగొట్టేయాల. మరా అవినీతి రాజావోరు చేసిందదే కద?'

'కానీ ఏం లాభం గురూగారూ! అంతా బయటపడి జైల్లో పడితేనూ?'
'పడి గమ్మునున్నాడా? అసలిదంతా డబ్బుల మంతిరిగారికి తెలిసిందేనని చిదంబర రహస్యం అడ్డేసుకోలేదూ? అది కూడా నీకో పాటమే మరి. తెలిసిందా?'

'తెలిసింది కానీండీ, మరి ఢిల్లీ 'జీ'లన్నారు కదా, వాళ్లనుంచి ఏం నేర్చుకోవాలి?'
'అబ్బో... వాళ్లు చెప్పేది మరీ పెద్ద పాఠం... అదే నిమ్మకు నీరెత్తినట్టుండటం... కళ్ల ముందు కజానాకి కన్నం పడుతోందని తెలిసినా నోరు మెదపలేదు చూడూ, అదిగో... ఆ నిబ్బరాన్ని నేర్చుకోవాల. ఒకరు కుర్చీమీద కూచున్న నేతా'జీ'గారైతే, మరొకరు కీలక బాధ్యతల మంత్రీ'జీ'గారు. మరి ఈళ్లిద్దరూ ఇలా ష్‌... గప్‌చుప్‌ అని ఉండటానికి కారణమెవరో తెలుసా? తెర వెనకాలనుంచి తతంగమాడిస్తున్న మాతా'జీ'గారు. ఇలా పెద్దలందరూ పెదవి విప్పలేదంటే- నువు రాసుకోవాల్సిన అసలైన పాఠం వేరే ఉంది మరి. అదే అధికారం! ఆ పల్లకీలో కూర్చున్నవాళ్లకు మోతే కీలకం. పైగా మోసేది వేర్వేరు పార్టీలైనప్పుడు సంకీర్ణ ధర్మాలని కొన్ని ఉంటాయి మరి. వాటి ముందు అసలైన ధర్మాలు దిగదుడుపే. మింగుడుపడిందా?'

'భేషుగ్గా గురూగారూ! టూజీ వ్యవహారంలో త్రీ'జీ'ల పాఠం తిరుగులేనిదని తెలిసిపోయింది!'

PUBLISHED IN EENADU ON 8.2.2012

దొంగ తెలివి


దొంగ తెలివి


పంకజం...!' అంటూ గావుకేక పెట్టాడు పాపారావ్‌. వంటింట్లోంచి నిదానంగా వచ్చి ఏమిటన్నట్టు కళ్లెగరేసింది పంకజం. అప్పటికే వగరుస్తున్న పాపారావ్‌, గ్లాసుడు నీళ్లు గటగటా తాగేసి, 'కూరలో అంతకారం వేశావేంటి?' అన్నాడు జీరబోయిన గొంతుతో.

అంతే... పంకజం తన చేతిలో ఉన్న మూకుడు అతడి నెత్తి మీద బోర్లించింది. ఆపై వీధిలోకి పరిగెత్తి 'ఓ ఎంకాయమ్మా... ఎల్లాయమ్మా... పుల్లాయమ్మా...' అంటూ కేకలేసింది.

పాపారావ్‌ అవాక్కైపోయాడు. ఏంటా అని వీధిలోకి వెళ్లి చూస్తే, చుట్టూ మూగిన ఆడవాళ్ల మధ్య నిలబడి వగర్పులు మొదలెట్టింది.

'ఈ వేధింపులు ఇక భరించలేనమ్మా. కూరలో కారం ఎక్కువైందట. ఎంత గట్టిగా అరిచాడో. అంతకన్నా ఒకేసారి చంపేయమనండి' అంటూ గోల చేసింది. ఏడుపు మొహం పెట్టుకుని, ముక్కు ఎగపీలుస్తూ హడావుడి చేసింది...

* * *

'అదిరా కథ. విన్నావుగా? దీన్నిబట్టి నీకేం తెలిసిందో చెప్పు చూద్దాం!' అన్నారు గురువుగారు నిమ్మళంగా పడక్కుర్చీలో వెనక్కి వాలుతూ. గురువుగారు చదివి వినిపించిన కథని ఓసారి గుర్తు తెచ్చుకుని శిష్యుడు ఉత్సాహంగా చెప్పాడు.

'మొగుణ్ని కొట్టి మొగసాలకెక్కడమంటే ఇదేనండి. పంకజం వట్టి గయ్యాళి రకమన్నమాటండి. కూర సరిగ్గా చేయకపోగా, అడిగిన భర్తను నలుగురిలో చులకన చేసిందంటే, అమ్మమ్మా... మహా జాణన్నమాటేనండి. పైగా మొగుడేదో ఆరళ్లు పెడుతున్నట్టు ఏకరువు పెట్టి సానుభూతి కోసం పాకులాడ్డమండి...'

గురువుగారు నవ్వుకున్నారు. 'పంకజాన్ని బాగానే తిట్టావులే కానీ, మరి ఆమెనుంచి నేర్చుకోవాల్సిన పాఠమేంటో గ్రహించావా?' అన్నారు.

'అయ్యబాబోయ్‌... ఆవిడ దగ్గర్నుంచి నేర్చుకోవడం ఏంటండీ?ఆ గుణమే మాచెడ్డదండి' అన్నాడు శిష్యుడు.

'అయితే నువ్వు రాజకీయాలకు పనికి రావురా! నా దగ్గరకి పదేపదే వచ్చి విసిగించకుండా, ఏదైనా కొట్టు పెట్టుకుని బతికెయ్‌...'

'అదేంటండీ అంతమాటనేశారు? మరీ అన్యాయం కాకపోతేనూ?'

'కాదేంట్రా మరి? నయా నీచ రాజకీయాల్లో దూసుకుపోవాలనుకుంటే ఇలాంటివాళ్లనుంచే పాఠాలు నేర్చుకోవాలి. గయ్యాళ్లు, అహంకారులు, నీచులు, నికృష్ఠులు, బడాచోరులు, నంగనాచులు, పచ్చి దొంగలు, పయోముఖ విషకుంభాలు, గోముఖ వ్యాఘ్రాలు... వీళ్లేరా మనకి గురువులు. ముందు ఆ సంగతి తెలుసుకో. వీళ్లు వేసే అధమాధమ ఎత్తుగడలన్నీ మన జీవనశైలిలోకి అనువదించుకోవాలి. లేదా ఇప్పటికే ఈ పనిచేసిన నేతలను గమనించి, వాళ్ల అడుగుజాడల్లో నడవాలి. అర్థమైందా?'

'ఆ మాత్రం తెలివేడిస్తే అల్లుకుపోతాకానీ, ఇలా మీ దగ్గర నొల్లుకుంటానా చెప్పండి? కాబట్టి ఉదాహరణ ఏదైనా ఉంటే చెప్పి పుణ్యం కట్టుకోండి గురూగారూ!'

'వార్నీ! ఆ బాధ్యతా నా నెత్తినే పెట్టావ్‌? ఊరూవాడా తిరుగుతూ ఊదరగొడుతున్న యువనేతని చూడు. పేపర్లు చదివేసి, టీవీలు చూసేస్తే సరిపోయిందట్రా! ఎప్పుడెవరు ఎలా మాట్లాడుతున్నారో చూసి వాటిలోని గూఢార్థాలను గుండెల్లో దాచుకోవద్దా!'

'అవునండోయ్‌! ఓదార్పు యాత్రలాగే చిత్రాతిచిత్రమైన ఆయన మాటలూ ఓ పట్టాన అర్థం కావండి. ఇంతకీ ఏంటన్నాడండీ?'

'అచ్చం ఆ గయ్యాళి పంకజంలాగే హడావుడి చేస్తున్నాడు. కాగితాల మీద కంపెనీలు కల్పించి, వాటిలోకి కాసులు మళ్లించి, విదేశాలకు పంపించి, పెట్టుబడులుగా తెప్పించి, సొంత వ్యాపారాలు విస్తరించి, అందుకు తోడ్పడిన అస్మదీయులకు అధికారాన్ని అడ్డమెట్టుకుని ప్రయోజనాలు చేకూర్చి, జనాన్ని ఏమార్చి, ప్రజల సొమ్ము దోచి, కోట్లకు పడగలెత్తి, చేసిందంతా చేసి, చేజారిన కుర్చీ కోసం అలమటిస్తున్నాడా... ఇప్పుడా అవినీతి కథలన్నీ బయటపడుతున్నాయనేసరికి వీధుల్లో తారంగం ఆడ్డం లేదూ? ఇదేంటయ్యా ఇలా చేశావని అడగడం తప్పా చెప్పు? అలా అడగడం వెనక ఆధారాలున్నా ఆ సంగతి మాట్లాడకుండా, తననేదో పనిగట్టుకుని వేధిస్తున్నారనీ, అంతకన్నా చంపేస్తేనే నయమని జనం ముందు జజ్జనకరి జనారే అంటూ ఆడిపోసుకుంటున్నాడంటే- ఏమనుకోవాలి?'

'సార్సార్సార్‌! ఇంతకీ మీరతడిని తిడుతున్నారా? పొగుడుతున్నారా?'

'అతడిని మనం కాదురా తిట్టేది. ఏమాత్రం కాస్త తెలివిడి ఉన్న సామాన్యులకైనా ఆ హక్కు ఉంటుంది. మనం తిడతామా చెప్పు? విల్లాలకు విల్లాలు నొల్లేసుకుని విలవిల్లాడిపోతున్నట్టు జనం ముందు నటించడం ఎలాంటి దగుల్బాజీలకైనా పెదబాలశిక్ష కాదూ? కేసెట్టిన సీబీఐకే దురుద్దేశాలు అంటగట్టడం నీలాంటివాళ్లకు ఓనమాలు కాదూ? ఆఖరికి న్యాయమూర్తుల్నే నమ్మకపోవడం, వారి నిజాయతీనే శంకించడం నీచులకు శ్రీరంగనీతులు కాదూ? దొరికిపోయిన దొంగ ఊరందర్నీ తిట్టినట్టు, కళ్లముందు జరిగే అవినీతి గురించి రాసిన పత్రికల్ని, చూపిన ఛానళ్లని ఏకడమంటే బరితెగింపును బడిలో నేర్చుకోవడం కాదూ?'

'ఆహా... కళ్లు తెరుచుకున్నాయి గురూగారూ! ఇతగాడు చివరాకరికి న్యాయసూత్రాల్ని, రాజ్యాంగ నియమాల్ని, ధర్మపన్నాల్ని కూడా తప్పుపట్టేలా ఉన్నాడు. ఎంత గొప్ప గడసరి గయ్యాళితనమండీ! మొత్తానికి అతడొక 'విజ్ఞాన' సర్వస్వం అన్నమాటే కదండీ!'

'ఆ... ఇప్పుడు నువ్వు రాజకీయాలకి తొలి అర్హత సాధించావురా! ఈసారికి పోయిరా!'

PUBLISHED IN EENADU ON 28.1.2012

పేదరికం పరార్‌!

పేదరికం పరార్‌!


టట్టడాయ్‌... టడట్టడాయ్‌!
అరకొర దేశం రాజు అవకతవకలుంగారు గుర్రమెక్కి వ్యాహ్యాళికి బయల్దేరారు. మంత్రి గందరగోళకలుంగారూ అనుసరించారు.
టక్కు టిక్కు... టక్కు టిక్కు!

కొంతదూరం వెళ్లేసరికి గుడి ముందు ఓ బిచ్చగాడు కనిపించాడు. అవకతవకడి కనుబొమలు ముడివడ్డాయి.

టక్కు టిక్కు... టక్కు టిక్కు!

మరి కొంతదూరం వెళ్లేసరికి, ఎండిన డొక్కలతో మరో పేదవాడు ఎదురొచ్చాడు.

అవకతవకడి మొహం చికాగ్గా మారిపోయింది.

'గందరగోళకా!' అని అరిచారు రాజుగారు.

'చిత్తం ప్రభూ!' అన్నాడు గందరగోళకుడు.

'మనదేశంలో పేదలా, బిచ్చగాళ్లా... ఏమిటిది?'

'ఏ దేశంలోనైనా ఇది సహజమే ప్రభూ'

'ఆపు నీ అధిక ప్రసంగం. నా దేశంలో ఇలా ఉండటానికి వీల్లేదు. వెంటనే పేదలందరినీ పరిమార్చు...'

'హతవిధీ, పరిమార్చడమా?'

'అదే... పేదలందరినీ తగ్గించెయ్‌. అవకతవకడి దేశంలో పేదలున్నారంటే ఎంత అప్రతిష్ఠ, ఎంత నామర్దా? ఇరుగుపొరుగు దేశాల్లో మన పరువేంగాను, ఎక్కడైనా అప్పు పుట్టునా? విదేశాలకు పోయిన, వీపు వెనకనే నవ్వరా? అదియునుగాక... పేదలకు సాయమందించాలన్న, అందుకు మన ఖజానా చాలునా?'

'చిత్తం ప్రభూ! మీరు నిశ్చింతగా ఉండండి. రేపటికల్లా మనదేశంలో పేదరికాన్ని తుడిచేస్తాను'

'సెభాష్‌!'

ఇద్దరూ గుర్రాలను వెనక్కు మరలించారు.

టక్కు టిక్కు... టక్కు టిక్కు!

* * *

మర్నాడు సభలో సింహాసనం మీద కూర్చున్న అవకతవకడి దగ్గరకు గందరగోళకుడు ఒక వ్యక్తిని తీసుకుని వచ్చాడు.

'ప్రభూ! ఈయన మహా మేధావి. పేరు వక్రబుద్ధి. మనదేశంలో పేదరికాన్ని తుడిచిపెట్టి ఇప్పుడే వచ్చారు' అన్నాడు గందరగోళకుడు.

'అదెలా సాధ్యం, నిన్ననే కదా నీకు చెప్పింది?' అంటూ ఆశ్చర్యపడ్డాడు అవకతవకుడు.

'చెప్పాను కదా ప్రభూ! ఈయన మేధావని. ఆ సంగతి ఆయనే చెబుతారు వినండి'

వక్రబుద్ధి వినయంగా ముందుకు వచ్చి నమస్కరించి చెప్పాడు, 'నిజమే ప్రభూ! మీ దేశంలో పేదరికం లేనే లేదు. నేను నా అనుచరులతో పరిశీలన చేసి నిర్ధారణకు వచ్చాను' అన్నాడు.

'అదెట్లు? మేం మా కళ్లతో స్వయంగా పేదరికాన్ని చూశామే?' అన్నాడు అవకతవకడు.

వక్రబుద్ధి నవ్వాడు. 'మీరు చూసినవాళ్లంతా నిజానికి ధనవంతులే ప్రభూ! ఒకడు గుడి ముందు బిచ్చమెత్తుకుంటూ మరింత ఆర్జిస్తున్న ధనవంతుడు. మరొకడు తక్కువ తింటూ ఎక్కువ కాలం బతకాలని చూస్తున్న ఆశపరుడు' అన్నాడు.

'నిరూపించగలవా?'

'తప్పకుండా ప్రభూ! మీ చేతనే ఈ సంగతి ఒప్పించగలను. నేను అడిగిన వాటికి సమాధానం చెబితే చాలు'

'అటులనే కానిమ్ము...'

'మీ దృష్టిలో పేదలంటే ఎవరు?'

'ఏమీ లేనివారు...'

'ఏమీ లేనివారంటే?'

'అంటే, తినడానికి తిండి లేనివారు...'

'అట్లయిన దేశంలో అందరూ ఏదో ఒకటి తింటూనే ఉన్నారు ప్రభూ! కలో, గంజో, అంబలో ఏదో ఒకటి. అలా తినకపోతే ఈపాటికి చచ్చిపోయి ఉండేవారు కదా ప్రభూ!'

'భలే, మరి ఉండటానికి నీడ లేనివారు కూడా పేదవారేగా?'

'ఆ స్థితిలోనూ ఎవరూ లేరు ప్రభూ! ఏదో ఒక చెట్టు నీడనో, వంతెన కిందనో, చూరు కిందనో ఉంటున్నారు. లేకపోతే వారికి నిద్ర ఎలా పడుతుంది ప్రభూ!'

'అవున్నిజమే! అట్లయిన కట్టుకోవడానికి బట్టలేనివారి సంగతేంటి?'

'తమ దేశంలో వాళ్లు కూడా లేరు ప్రభూ! కనీసం మూడు మూరల గోచీనైనా పెట్టుకుంటున్నారు. అది కూడా లేకపోతే దేశంలో దిగంబరులు తిరుగాడేవారు కదా ప్రభూ!'

'నిజమే. కానీ మా దేశంలో అందరూ ధనవంతులే అన్నావు. అదెలా?'

'ఎందుక్కాదు ప్రభూ! గోచీని కొన్నాడంటే ఎంతో కొంత స్థితిపరుడేగా? వాడు బతికి ఉన్నాడంటే- ఏదో ఒకటి తింటున్నాడన్న మాటేగా? తిండి కొనుక్కున్నాడంటే- కాసినో కూసినో డబ్బులున్నవాడేగా? కాబట్టి అందరూ ఏదో ఒకటి ఉన్నవారే. కలవారే'

'ఆశ్చర్యమాశ్చర్యము. ఒక్క రాత్రిలో మా దేశంలో పేదరికాన్ని ఎలా మాయం చేశావు?'

'చాలా సులభం ప్రభూ! పేదలకు మనం ఇచ్చుకునే నిర్వచనాన్ని మార్చుకుంటే సరి. నేనదే చేశాను. మీచేత ఒప్పించాను'

అవకతవకడు ఉప్పొంగి పోయాడు. గందరగోళకుడిని సన్మానించాడు. వక్రబుద్ధిని సత్కరించాడు.

* * *
కొసమెరుపు: అలనాటి రాజు అవకతవకడు, మంత్రి గందరగోళకుడు, మేధావి వక్రబుద్ధి పునర్జన్మ ఎత్తి వర్తమానంలో పుట్టారు. ప్రణాళిక సంఘం సభ్యులుగా, సర్కారు నేతలయ్యారు. పట్నాల్లో రోజుకు 28.65 రూపాయలు, పల్లెల్లో రోజుకు 22.42 రూపాయలు ఖర్చు చేయగలవారు పేదలు కాదంటూ... పేదరికానికి అవకతవక, గందరగోళ, వక్రబుద్ధితో కూడిన నివేదికలు రూపొందిస్తున్నది వాళ్లే!

PUBLISHED IN EENADU ON 6.4.2012