శనివారం, ఆగస్టు 31, 2013

అవకతవక సినిమా!



'యూపీఏ ప్రొడక్షన్స్‌... సోనియా సమర్పించు... మన్మోహన్‌ చిత్రవారి 'అవకతవక భారతం' సినిమా. కడుపుబ్బ నవ్వించే నాయకుల విన్యాసాలు, కడుపు రగిలించే కుంభకోణాలు, కంటతడి పెట్టించే ధరవరలు, ఉత్కంఠ కలిగించే ఉద్వేగాలు, నమ్మశక్యం కాని వాగ్దానాలు, గిలిగింతలు పెట్టే అవకాశవాద పొత్తులు, నరాలు తెగిపోయే సస్పెన్స్‌, అబ్బురపరచే పోరాటాలు... ఆలసించిన ఆశాభంగం! రండి బాబూ రండి... నేడే చూడండి!' 
'ఏం రేపు ఆడదా?' 
'అదే సస్పెన్స్‌' 
'ఇంతకీ హీరో ఎవరు?' 
'ఒకరు కాదు...' 
'ఓ, బహుతారా చిత్రమా, ఎవరెవరో వాళ్లు?' 
'గండర గండడు ద్రవ్యోల్బణం, విచిత్ర వేషాల విదేశ మారక ద్రవ్యం, అంతుపట్టని అభినయ విన్యాస రాజకీయం...' 
'మరి కథానాయికలు ఎవరు?' 
'ఎన్నెన్నో అందాల ఉల్లిపాయ, పచ్చని సోయగాల పచ్చిమిరపకాయ, తళుకు బెళుకుల బంగారం...' 
'అబ్బో, భలే జంటలే! మరి విలన్‌ ఎవరు?' 
'అమెరికా డాలర్‌' 
'మరైతే హాస్యనటులు ఎవరో?' 
'పాలక పల్లకీ మోతగాళ్లు, ఆ పార్టీల నేతలే హాస్యగాళ్లు...' 
'చాలా బాగుంది... ఇంతకీ కథేంటి?' 
'ఇంతవరకు భారతీయ వెండితెరపై కనీవినీ ఎరుగని కథ. అంతులేని, అంతుపట్టని, చిత్రవిచిత్ర మలుపులతో కూడిన అద్భుతమైన కథ...' 
'అవునా? మరి అంత చక్కని కథకు స్క్రీన్‌ప్లే ఎవరు?' 
'ఒక్కరు కాదు. అదే ఈ సినిమా ప్రత్యేకత. అందరు నేతలు తలో సన్నివేశాన్నీ సృష్టించారు. తలో దృశ్యాన్నీ ఆవిష్కరించారు...' 
'ఇంతకీ ఇంత గొప్ప చిత్రానికి దర్శకుడు ఎవరు నాయనా?' 
'అది కూడా చిత్రమే. తెరమీద పేరు కనిపించేది ఓ తలపండిన దర్శకుడిది. కానీ, తెర మీద సినిమా మొత్తాన్ని నడిపించేది మాత్రం ఓ దర్శకురాలు. ఏ సన్నివేశం తీసుకున్నా అందులోని షాట్‌లన్నీ ఎలా తీయాలో చెప్పేది ఆవిడే. ఈయన మాత్రం- లైట్సాన్‌, యాక్షన్‌, కట్‌... చెబుతారంతే!' 
'ఆహా, ఏం సినిమా అయ్యా! వింటుంటేనే అదిరిపోతోంది. మరి పాటలు ఉన్నాయా?' 
'ఉన్నాయి కానీ, అన్నీ విషాద గీతాలే...' 
'వార్నాయనో! వినగలమా?' 
'టికెట్‌ కొనుక్కుని వెళ్లాక వినక చస్తారా? వెక్కి వెక్కి ఏడుస్తూ మరీ వింటారు. ఇప్పటికే ఆ పాటలన్నీ విశేష ఆదరణ పొందాయి. దేశంలో ఏ మూల చూసినా ప్రజలంతా వాటిని సణుక్కుంటూ, గొణుక్కుంటూ, నిర్వికారంగా, నిర్వేదంగా పాడుకుంటూనే ఉన్నారు' 
'భలే బాగున్నాయయ్యా ఈ సినిమా విశేషాలు. ఆ కథేంటో కూడా కాస్త చెబుదూ?' 
'అనగనగా ఓ సామాన్యుడు. ఆశలు తప్ప ఏదీ ఆశించనివాడు. ఎవరొచ్చి ఏది చెప్పినా నమ్మేంత అమాయకుడు. గుమ్మం దగ్గరకు వచ్చి అడిగితే చాలు తన దగ్గరున్న ఓటును వెంటనే ఇచ్చేసే దానగుణం కలవాడు. అలాంటి సామాన్యుడికి ముగ్గురు ఆడపిల్లలు. పెద్ద కూతురు ఉల్లిపాయ- బాధ్యతలు తెలిసిన పిల్ల. ఎప్పుడూ వంటింట్లో సహకరిస్తూ చేదోడు వాదోడుగా ఉంటుంది. రెండో పిల్ల- పచ్చిమిరపకాయ. అక్కకు తోడుగా రుచులు పండిస్తుంది. మూడో పాప- బంగారం లాంటి పిల్ల. శుభకార్యాల నిర్వహణలో ముక్కుపుడక, తాళిబొట్టు, ఉంగరాల దగ్గర్నుంచి, గాజులు, నగల వరకు స్థోమతను బట్టి సమకూరుస్తూ, తళుక్కున మెరుస్తూ పరువు కాపాడుతూ ఉంటుంది. ముగ్గురమ్మాయిలతో గుట్టుగా సాగిపోతున్న ఆ సామాన్యుడి కుటుంబంలో ఒక్కసారిగా కలవరం పుట్టింది...' 
'ఏమిటా కలవరం?' 
'ద్రవ్యోల్బణం, విదేశ మారక ద్రవ్యం, రాజకీయమనే ముగ్గురు సంపన్నుల బిడ్డల చూపు ఈ ఆడపిల్లల మీద పడింది. ముగ్గురూ కలిసికట్టుగా వాళ్లని వలలో వేసుకున్నారు' 
'ఇదేం కథయ్యా, వీళ్లు హీరోలంటావ్‌? మళ్ళీ వల్లో వేసుకున్నారంటావ్‌?' 
'అదే ఈ సినిమాలో మలుపు. సందేహాలుంటే సినిమా పేరోసారి తల్చుకో. నోర్మూసుకుని వింటే విను. లేకపోతే చూడకతప్పని సినిమా చూడు' 
'సర్లే, మధ్యలో ఆపన్లే. అప్పుడేమైందో చెప్పు' 
'ఆ ముగ్గురివల్ల ముచ్చటైన ముగ్గురు అమ్మాయిలు సామాన్యుడికి అందకుండా పోయారు. పెద్దపిల్ల ఉల్లిపాయ, రెండో పిల్ల పచ్చిమిర్చి విపరీత ప్రవర్తనలవల్ల సామాన్యుడి కుటుంబం అల్లకల్లోలమైంది. అక్కలిద్దర్నీ చూసి బంగారం కూడా పట్టపగ్గాలు లేకుండా పొగరుతో వగలు పోసాగింది' 
'మరి ఆ సంపన్నుల అడ్డదిడ్డ బిడ్డల్ని అదుపు చేసేవారే లేరా?' 
'ఉంటే అది ఈ సినిమా ఎందుకవుతుంది, ఆ పేరెందుకు నప్పుతుంది? అసలే సామాన్యుడు సతమతమవుతుంటే అమెరికా డాలర్‌ కూడా రంగప్రవేశం చేసి విశ్వరూపం చూపించసాగింది. దాంతో సామాన్యుడి కుటుంబం చితికిపోయింది. ఈ కష్టాలు చాలవన్నట్టు సామాన్యుడి కుటుంబ పెద్ద అకస్మాత్తుగా జబ్బుపడి మంచమెక్కాడు' 
'సామాన్యుడి కుటుంబ పెద్దా, ఆయనెవరు?' 
'రూపాయి!' 
'అరె పాపం... అప్పుడేమైంది?' 
'ఇంకా ఏమవ్వాలి? పతాక సన్నివేశం ఆసుపత్రి అత్యవసర విభాగానికి చేరింది. రూపాయి ప్రాణం నిలబెట్టడానికి ఆక్సిజన్‌ పెట్టసాగారు. సెలైన్‌ ఎక్కించసాగారు. బయట ఎర్రలైటు. లోపల నీరసించిన రూపాయి. అంతటా ఉత్కంఠ...' 
'ఇంతకీ దర్శకులు, స్క్రీన్‌ప్లే రచయితలు చివరికి ఏం చేస్తారయ్యా?' 
'ఏంటి చేసేది! వాళ్లేం చేయకే కదా, కథ ఇలా తయారైంది?' 
'మరి చివరికి ఏమవుతుంది?' 
'ఈ అవకతవకల కథకు ముగింపు ఎలా పలకాలో వాళ్లకే తెలియడం లేదు. మిగతా కథ భారతీయ వెండితెరపై చూడాల్సిందే... అర్థమైందా? ఆ... రండి బాబూ రండి... నేడే చూడండి...' 
'అవున్లే దీన్ని నేడే చూడాలి. రేపు అనుమానమే. వెళ్లి ప్రచారం చేసుకో... పో'

PUBLISHED IN EENADU ON 31.08.2013

శనివారం, ఆగస్టు 24, 2013

అప...హాస్యం!



'హ హ్హ హ్హ హ్హ హ్హా!'
శంకర్రావు నవ్వుకి వంటింట్లో ఉన్న పంకజాక్షి ఠారెత్తిపోయి పరిగెత్తుకుని వచ్చింది. వీధి గదిలో శంకర్రావు పొట్టపట్టుకుని దొర్లుతూ నవ్వుతున్నాడు. వూరినుంచి వచ్చి, పాత దినపత్రికలు సర్దే పని పెట్టుకున్న భర్త ఎందుకు అంతగా నవ్వుతున్నాడో పంకజాక్షికి అర్థం కాలేదు.

'దినపత్రికలో జోకులేముంటాయండీ? మీది మరీ చోద్యం కాకపోతే' అంది పంకజాక్షి.

'నీ మొహం, ఇందులో మన నేతల మాటలు చూడు. అన్నీ బ్రహ్మాండమైన జోకులే...' అన్నాడు శంకర్రావు నవ్వుతూనే.

'చాల్లెండి సంబరం. మీతో మాట్లాడుతూ కూర్చుంటే నాకు అవతల పోపు మాడిపోతుంది' అంటూ వెళ్లబోయింది పంకజాక్షి.

శంకర్రావు ఆమెను వారించి, 'ఇవతల దేశంలో పరిస్థితే మాడిపోతోంది. సంగతేమిటో తెలిస్తే నువ్వూ నాలాగే నవ్వుతావు మరి' అన్నాడు.

'అయితే ఉండండి. స్టవ్‌ కట్టేసి వస్తా' అంటూ పంకజాక్షి క్షణాల్లో వచ్చి, 'ఇప్పుడు చెప్పండి ఆ జోకులేంటో?' అంది సరదా పడుతూ.

శంకర్రావు ఆమె చేతికి తాను చదువుతున్న పాత దినపత్రిక ఇచ్చి ఓ వార్త చదవమన్నాడు. అది స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మన్మోహన్‌ ప్రసంగం.

పంకజాక్షి చదువుతూ 'చిరునవ్వుల భారతమే మా ప్రభుత్వ లక్ష్యం...' అనేసరికి, శంకర్రావు 'అదే... అదే...' అంటూ మళ్ళీ నవ్వసాగాడు.

పంకజాక్షి మొహం చిట్లించి, 'ఇందులో నవ్వడానికేముంది? ముందు మీరు మీ పేరును శంకల్రావు అని మార్చుకోండి. మీకన్నీ శంకలే...' అంది.

'నీ తలకాయ్‌, చిరునవ్వుల భారతమేమిటి... ఇప్పటికే భారతమంతా అట్టహాస ప్రహసనమైతేనూ. ప్రజలంతా పగలబడి నవ్వుకుంటున్నారు. ఆ నవ్వులు మామూలివా? విషాదం నుంచి పుట్టిన వినోదం. ఈ ప్రభుత్వ విన్యాసాలను చూసి ఏడవలేక నవ్వుతున్న నిర్వేదం. మన భారత ప్రభుత్వమనే తెల్లతెర మీద కనిపించేది ఒకరు. ఆయన కేవలం పెదవులు మాత్రమే కదుపుతారు. కానీ, మాటలు ఆయనవి కావు. తెర వెనక నుంచి పలికేది మరొకరు. కుర్చీలో కూర్చుని ఆడేది ఒకరు. ఆడించేది వేరొకరు. పల్లకి మీద బొమ్మ ఒకరు. పల్లకిని మోసేది ఎవరెవరో. కానీ, వూరేగేది మాత్రం వీరెవరూ కాదు. ఇదొక విచిత్ర అధికార ప్రకరణం. ఎన్నడూ చూడని సరికొత్త పెత్తన ప్రహసనం. ఈ తైతక్కల ప్రభుత్వాన్ని చూసి ప్రజలంతా నిత్యం నవ్వుకుంటూనే ఉంటే, ఇంకా చిరునవ్వుల భారతమంటే పొట్ట పగిలిపోదూ?' అంటూ వివరించాడు శంకర్రావు.

'అవునండోయ్‌. మీరు చెబుతుంటే నాకూ నవ్వొస్తోంది. ఉండండి ఇంకా చదువుతా. ఇంకెన్ని జోకులున్నాయో...' అంటూ కొనసాగించింది.

'పేదలు అర్ధాకలితో అలమటించరాదనేదే మా ప్రభుత్వ లక్ష్యం...' అంటూ చదువుతున్న పంకజాక్షి కూడా నవ్వేసింది.

'చూశావా... నీకు కూడా నవ్వాగడం లేదు?' అన్నాడు శంకర్రావు. 'ఓ పక్క పేదరికం మీద పనికిమాలిన సర్వేలు అవీ చేసేది వీళ్లే. అట్టు తింటే అమీరని, ఇడ్లీ తింటే గరీబు కాదని, సాయంత్రానికి పదో, పాతికో జేబులో పడ్డవాడు సంపన్నుడేనని దిక్కుమాలిన నిర్వచనాలు ఇచ్చేదీ వీళ్లే. దేశంలో ఎక్కడ చూసినా నిత్యావసరాల ధరవరలు ఆకాశం పరిధులు దాటి రోదసిలోకి సైతం రాకెట్లలా దూసుకుపోతున్నాయి. నేతల దౌర్జన్యాల్లా నిరుద్యోగం పెరిగిపోతోంది. నాయకుల నిజాయతీలాగా సంక్షేమం అంతకంతకు సన్నగిల్లుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన మాటలకు నవ్వు రాదా మరి?' అన్నాడు.

పంకజాక్షి నవ్వుతూనే చదవసాగింది. 'రకరకాల జాడ్యాల నుంచి భారత్‌ను విముక్తం చేసే రోజు ఇంకెంతో దూరంలో లేదు...' అంటూనే నవ్వేసింది.

'అసలైన జాడ్యాలు తలచుకునే కదా నీకు నవ్వొస్తుంట? నిజమే మరి. లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలు జరిగాయి. ఆటల్లో వేటాడారు. బొగ్గు గనుల్లో తవ్వుకున్నారు. ఫోన్ల పేరు చెప్పి పిండుకున్నారు. దర్యాప్తులో వేలెట్టి అడ్డుకోబోయారు. దస్త్రాలు సైతం మాయం చేశారు. సుప్రీంకోర్టు చేత చివాట్లు తిన్నారు. వీటి నుంచి కాక ఇక వేటి నుంచి భారత్‌ విముక్తి పొందాలి?' అంటూ శంకర్రావు నవ్వసాగాడు.

పంకజాక్షి మరో పేజీ తిప్పి, ముఖ్యమంత్రి ఉపన్యాసం చదివింది. 'చూశారా, రాష్ట్రంలో ఏడున్నర కోట్లమందికి కిలో రూపాయికే బియ్యం ఇస్తున్నారంట. భలే, మొత్తం జనాభాయే ఎనిమిదిన్నర కోట్లయితే ఇదెక్కడి ప్రసంగమండీ చోద్యం కాకపోతే?' అంది మరింత నవ్వుతూ.

'అందుకే మరి... దినపత్రికలు చదవమనేది. రాష్ట్ర జనాభాలో ఇరవై శాతానికి కార్డులే లేవు. నలభై శాతం గులాబీ కార్డులవారికి చౌక బియ్యం ఇవ్వరు. మిగిలినవాళ్లు ఏడున్నర కోట్లంటే, ఒకటో తరగతి చదువుతున్న మన బుజ్జిగాడు కూడా పొర్లి పొర్లి మరీ నవ్వుతాడు' అన్నాడు శంకర్రావు.

'మొత్తానికి మన నేతలు భలే నవ్వించార్లెండి...'

'కాబట్టే, దినపత్రికలు చదివితే ఆరోగ్యమని చెప్పేది. ఓ నాయకుడు కోట్లకు కోట్లు కళ్లముందు దోచుకుంటూనే స్వర్ణయుగం తెస్తానంటాడు. మరో నాయకుడు ప్రజల ఆస్తులు కొల్లగొడుతూ, వాళ్ల కోసమే తన బతుకంటాడు. ఇంకో నేత దేశం వెలిగిపోతోందంటాడు. ఇక మనం కామెడీ సినిమాలకు వెళ్లక్కర్లేదు. హాస్యపత్రికలు కొనక్కర్లేదు. లాఫింగ్‌ క్లబ్బుల్లో చేరక్కర్లేదు. ఎ...హే...మం...టావ్‌?'

పంకజాక్షి మరోసారి నవ్వేసింది.
PUBLISHED IN EENADU ON 24.08.2013

గురువారం, ఆగస్టు 15, 2013

బీదల వైభవం



'ఏంటి మావా? ఎప్పుడూ మొహం దిగులుగా పెట్టుకుని తెగ ఆలోచిస్తూ కూర్చునేవాడివి. ఇవాళేంటి? మంచి దిలాసాగా కాలు మీద కాలేసుకుని వూపేస్తూ నీలో నువ్వు నవ్వుకుంటున్నావు... ఏంటి కత?'
'మరేంటనుకున్నావే? ఇన్నాళ్లూ మనవన్నీ బీదల పాట్లు అనుకున్నాం... రెక్కాడితే కానీ డొక్కాడదు... దరిద్రగొట్టుగాళ్లమని ఈసురోమని ఉండేవాడిని... ఇప్పుడు తెలిసింది అసలు సంగతి'

'ఓసోస్‌... ఇంతలోకే ఏం మారిపోయిందేంటి? మన బతుకులు ఎప్పటిలాగే ఏడుస్తున్నాయే?'

'నువ్వూరుకోవే... మనం ఇన్నాళ్లూ అజ్నేనంలో కొట్టుమిట్టాడిపోయాం. మన యువరాజుగారి మాటలు విన్నాక తెలిసింది. ఇందాకా రచ్చబండకాడ పేపరు చదువుతుంటే విన్నాన్లే. అబ్బో... ఎంత బాగా చెప్పాడే? వినగానే మెదడులో మబ్బులన్నీ విడిపోయాయనుకో'

'యువరాజుగారంటే ఆ సోనియా అమ్మ కొడుకేగా... ఇంతకీ ఏం చెప్పాడేంటి ఆయన?'

'అదేమన్నా మామూలు విషయమేంటే? పేదరికమనేది వట్టి భావనంట. అంతా మనం అనుకునేదేనంట. మన ఆలోచనలనుబట్టే ఆ భావన పుడుతుందేగాని నిజానికి పేదరికమన్నది లేనేలేదంట. మరి ఆయన చెప్పినట్టు పేదరికమనేదే లేదనుకో, ఇక మనం దిగులు పడ్డమెందుకు? అందుకే మరి లోపల్నుంచి సంబరం తన్నుకొస్తా ఉంది'

'వార్నీ! అదా సంగతి... నువ్వూ నీ తెలివీ ఏడ్చినట్టే ఉన్నాయి. పొద్దున్న తిండి గొంతు దిగిందో లేదో, రాత్రికి ఆకలేస్తే ఏం తినాలో తెలీదు మనకి. నులక మంచమ్మీద కాళ్లు వూపేసుకుంటూ మనం పేదలం కాదని వూరికే అనేసుకుంటే సరిపోతుందేటి? ఆ యువరాజా బాబుకేం... ఎన్నయినా చెబుతాడు. కడుపునిండిన వాడు. ఆయనగారి మాటలు విని కడుపులో కాళ్లు పెట్టుకుని కూర్చున్నామనుకో, డొక్కలెగరేయాల్సిందే. ముందా మంచం దిగి పిల్లల కడుపు నిండే దారేదో చూడు'

'వూరుకోవే... వెధవ నస, వెధన నసాని. నీదెప్పుడూ ఒకటే గోల. ఆయనేం చెప్పాడో ఓసారి నిదానంగా ఆలోచించి చూడు. నిజమేంటో తెలుస్తాది. అసలు పేదలంటే ఎవరు? ఏది లేనివాడిని పేదవాళ్లని అంటాం? మన సంగతే చూడు. కంతల్దో, కన్నాల్దో ఓ పూరి గుడిసంటూ ఉందా? వూగేదో, వూడేదో ఓ నులక మంచముందా? కలో, గంజో తింటున్నామా లేదా? మరీపాటి కూడా లేనివాళ్లు లేరేంటి? మరి వాళ్లకంటే మనం గొప్పే కదా? ఓసారి ఆలోచించు'

'నిన్ను చూస్తుంటే రాత్రి వూళ్లో పంచాయతీ ఎన్నికలోళ్లు పోయించిన మందు మత్తు ఇంకా దిగినట్టు లేదు. సిగ్గు లేకపోతే సరి. ఏ పూటకాపూట కాయకష్టం చేస్తే కానీ ఇంత కూడు కూడా నోటి దగ్గరకి రాదు. మన బతుకులు గొప్పంటావేంటి? ఆయనకేం? తల్లి చాటు బిడ్డ. ఆ సోనియా అమ్మ చంకనేసుకుని సాకుతూ, రేపో మాపో పెద్ద కుర్చీ ఎక్కించేద్దామని ఆలోచిస్తోంది. వాళ్లకి ఆ కుర్చీలు, అవి ఎక్కే దారులే కనిపిస్తాయి కానీ మనలాంటి పేదల బతుకుల్లో అతుకులు అగపడతాయా? ఆయనేదో అన్నాడంట... ఈయన కులాసాగా కూర్చున్నాడంట. లే...లే...'

'అది కాదే. మరాయన మాటల్లో అసలు పసేమీ లేదంటావా?'

'పసా, నసా? దిక్కుమాలిన గొడవ. ఆ యువరాజు నాయనమ్మ ఇందిరమ్మ ఏమంది? దేశంలోంచి అసలు పేదరికాన్నే తరిమేస్తామంటూ గొప్పలు చెప్పారా లేదా? మరి తరిమారా? ఎక్కడ చూసినా పేదల్నే తరిమి తరిమి కొడుతున్నారు. ఇక యువరాజు నాన్న ఏమన్నారో గుర్తు లేదా? పేదవాళ్ల బతుకుల్లో పూలు పూయించేస్తామన్నారు. కానీ మనకి అడుగడుగునా ముళ్లే కదా ఉన్నది? ఇప్పుడీయనగారి అమ్మగారి మాటలూ అంతే. ఈవిడగారి హయాములోనే కదా, ఆ మధ్యన పేదరికం మీద సర్వేలు, గట్రా చేసి మాగొప్ప విషయాలు చాటి చెప్పారు... గుర్తుకు రాలే? పొద్దున్న ఫలహారంగా ఇడ్లీలు, అట్టు తింటే పేదవాడికింద లెక్కలోకి రారని, రోజుకి ఇరవయ్యో పాతికో సంపాదించేవాళ్లెవర్నీ పేదలని అనక్కర్లేదని నానా కూతలు కూశారు. ఇవన్నీ చూడకుండా యువరాజుగారు కలతనిద్రలో వాగినట్టు ఏదో అంటే దాన్నే పట్టుకుని వేలాడుతున్నావ్‌... నేను చెబుతున్నది బుర్రలోకెక్కుతోందా?'

'ఎక్కడమేటే బాబూ... రాత్రి ఎక్కిందంతా దిగిపోతేను? నువ్విన్ని విషయాలు విడమరిచి చెప్పాక ఇంకా బుర్రకెక్కదా? ఏదో అదాటున ఆయన మాటలు నిజమే కాబోలనుకున్నాను. కానీ ఆయనగారి నాయనమ్మ నుంచి ఇప్పటి వరకు ఎవరెన్ని మాటలు చెబుతున్నా మన పేదల బతుకులు ఇలాగే నానాటికీ తీసికట్టు అన్నట్టు ఉన్నాయని తెలుసుకోలేకపోయాను. నువ్వనేది నిజమేలే...'

'ఇంకా నెమ్మదిగా అంటావేంటి? ఎవరెన్ని చెప్పినా మన బతుకులేవీ మారవు. అంతగా అంతా భావనలోనే ఉందంటే ఆ యువరాజుగారే భావించుకోవచ్చుగా... పెద్ద కుర్చీలో తానే కూర్చున్నట్టు... దేశానికి రాజైపోయినట్టు... చాలా చక్కగా పరిపాలిస్తున్నట్టు... దేశవిదేశాల్లో ఆయనగారి సత్తా గురించి మీటింగులు గట్రా పెట్టేసి మరీ పొగిడేస్తున్నట్టు... అమ్మా బాబూ కలిసి మన దేశానికి బంగారు తాపడం చేసేసినట్టు... ఇంకా ఇలా తోచినట్టు! పడక పడక మన పేదరికం మీద పడాలేటి... ఏమంటావు?'

'ఇంకేమంటాను, నువ్వింత బాగా చెప్పాక? నువ్వేటంటే నేనూ అదే అంటాను. పేదరికమంటే వట్టి భావనన్నాడు! ఛీ... ఇందులో ఏదో కొత్త సంగతి ఉందనుకున్నాను... మన దరిద్రం మారదని తోచలేదు... మా బాగా చెప్పావే... మొత్తమ్మీద నాకంటే బుర్రున్నదానివే'

'ఈ సంగతి నీకు ఇన్నాళ్లు కాపురం చేశాక తెలిసిందేంటి? కానీ ఓ సంగతి చెప్పనా? నిజానికి నేను బుర్రలేనిదాన్నేలే...'

'అదేంటి?'

'అంత బుర్రే ఉంటే నిన్ను కట్టుకుంటానేంటి? ఇకనైనా లే. లేచి సాయంత్రానికి నాలుగు నూకలు తీసుకొచ్చే దారేదో చూడు!'

PUBLISHED IN EENADU ON 13.08.2013

బందిపోటుకి 50 ఏళ్లు

అరాచకత్వం అధికారం చెలాయిస్తున్నప్పుడు...
ప్రజాచైతన్యం ఓ కథానాయకుడి రూపం దాలుస్తుంది...
అవినీతి అక్రమాలు ప్రజావంచనకు పాల్పడినప్పుడు...
ఆ కథానాయకుడి వీరత్వం నీరాజనాలు అందుకుంటుంది...
'బందిపోటు' సినిమా వెండితెరపై ఆవిష్కరించినది ఇదే!
అందుకే 50 ఏళ్లయినా అదొక చెరగని జ్ఞాపకంగా మిగిలింది!

ఆత్మవిశ్వాసాన్ని పోత పోసినట్టుండే ఆరడుగుల కథానాయకుడు... పొగరు, తలబిరుసు కలబోసిన అందాల రాకుమారి... ఇక వీరిద్దరి మధ్య జరిగే ప్రేమకథ ఆకట్టుకోకుండా ఎలా ఉంటుంది? నందమూరి తారక రామారావు కథానాయకుడిగా, కృష్ణకుమారి కథానాయికగా 50 ఏళ్ల క్రితం విడుదలైన 'బందిపోటు' సినిమా అందుకనే అఖిలాంధ్ర ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. జానపద బ్రహ్మ విఠలాచార్య దర్శకత్వంలో నిర్మాతలు సుందర్‌లాల్‌ నహతా, డూండీలు తీసిన ఈ సినిమా పేరును తల్చుకోగానే ఇప్పటికీ ఆ దృశ్యాలు కళ్లముందు కదలాడుతాయి.
సినిమా మొదట్లోనే అడవిలో విహారానికి వచ్చిన రాకుమారిని కాపాడిన కథానాయకుడు ఆమె అందానికి ముగ్ధుడైపోతే, అతడిలోని చిలిపిదనం వెల్లువెత్తి ప్రేక్షకుల చేత నవ్వులు పూయిస్తుంది. ఎంత సాహసవంతుడైనా ఓ సామాన్య యువకుడి చొరవను సహించలేని రాకుమారి రాచరికపు అహంకారం కస్సుమంటుంటే ప్రేక్షకులందరూ ముసిముసిగా నవ్వుకుంటారు. రాజుగారి అనారోగ్యాన్ని సాకుగా తీసుకుని అరాచకం సాగించే బావమరిది రాజనాలలాగా రెచ్చిపోతే, ఎదురు తిరిగిన కథానాయకుడు అందుకు దీటుగా విజృంభిస్తాడు. చిన్నాన్నని, తండ్రిని మోసగించి చంపించిన రాజనాల దౌర్జన్యాల బారి నుంచి ప్రజల్ని కూడా రక్షించడానికి తానే బందిపోటుగా మారతాడు. ఇదేమీ తెలియక ఆ బందిపోటును బందీ చేస్తానని బయల్దేరిన రాకుమారికి కథానాయకుడు నిజమేమిటో చెప్పాలనుకున్నాడు. అందుకే ఓ పాటందుకుని... 'వగల రాణివి నీవే...' అన్నాడు. 'సొగసుకాడిని నేనే...' అని కూడా చెప్పాడు. ఆపై... 'ఈడు కుదిరెను, జోడు కుదిరెను, మేడ దిగిరావే' అంటూ పిలిచాడు. బందిపోటనుకుని బంధించడానికి వచ్చిన రాకుమారికి అతడి ప్రేమ కబుర్లు చికాకు కలిగించకుండా ఎలా ఉంటాయి? కాబట్టే, అతడు 'పిండి వెన్నెల నీకోసం... పిల్లతెమ్మెర నాకోసం... రెండు కలిసిన నిండు పున్నమి రేయి మనకోసం...' అని ఎంతగా చెప్పినా వినలేదు. చివరికి ఆమెను బంధించి గుహలోకి తీసుకెళ్లి మరీ రాజ్యంలో జరుగుతున్న అరాచకాలను వివరించాల్సి వచ్చింది. బందిపోటు మంచి మనసు అర్థమైన వెంటనే రాకుమారి, ఇక ఇప్పటికే ఆలస్యమైందని చటుక్కున ప్రేమలో పడుతుంది. ఇంకేముంది? డ్యూయట్టే!



ఆమె అక్కడ అంతఃపురంలో. అతడు అడవిలోని గుహలో. వెండితెర రెండు భాగాలైన రవికాంత్‌ నగాయిచ్‌ చక్కని ఫొటోగ్రఫీ సాక్షిగా, ఘంటసాల అద్భుతమైన సంగీతం బాసటగా ఆమె తీయని గొంతెత్తి, 'వూహలు గుసగులాడె... నా హృదయము వూగిసలాడె...' అని ప్రేమను బయటపెట్టేసింది. ఆపై వివశమైపోయి 'వలదన్న వినదీ మనసు... కలనైన నిన్నే తలచు...' అని కూడా చెప్పేసింది. చివరికి 'నీ ఆనతి లేకున్నచో విడలేను వూపిరి కూడా...' అనేసింది. మరి అతడు వూరుకుంటాడా? 'నను కోరి చేరిన వేళ... దూరాన నిలిచేవేల?' అని ప్రశ్నించి మరీ దగ్గరయ్యాడు. ఇంకేముంది? వాళ్ల ప్రేమకు 'దివి మల్లెపందిరి వేసింది... భువి పెళ్లి పీటను వేసింది'! ప్రేక్షకులంతా కేరింతలు కొట్టారు.
ఓ సినిమా జనరంజకంగా రూపొందాలంటే ఏమేం అంశాలుండాలో అన్నీ సమపాళ్లలో కుదిరిన 'బందిపోటు', విఠలాచార్య దర్శకత్వ పటిమను, మహారథి కథలోని పట్టును చాటి చెబుతుంది. రాజైన బావగారిని బంధించి, మేనకోడలైన కృష్ణకుమారిని పెళ్లి చేసుకుని సింహాసనం ఎక్కాలనుకునే రాజనాల క్రౌర్యం, అతడిని ముప్పుతిప్పలు పెట్టి నవ్వులు పండిస్తూనే అతడి నిజస్వరూపాన్ని బయటపెట్టే ఎన్టీఆర్‌ ధీరత్వాలను కథ, కథనాలు కదం తొక్కిస్తాయి. కోటలోకి చొరబడి రాకుమారిని ఉడికించడం, మారువేషాలతో రాజనాలను ఏడిపించడం లాంటి ఎన్నో సన్నివేశాల్లో ఎన్టీఆర్‌ నటన ప్రేక్షకుల చప్పట్లను, ఈలల్ని అందుకుంటుంది. ముఖ్యంగా రాకుమారి అంతఃపురంలో అద్దం వెనక నుంచి ఎన్టీఆర్‌, తాగిన మత్తులో ఉన్న రాజనాలను ఆటపట్టించే సన్నివేశం థియేటర్లలో నవ్వులు పండించింది. ఇక పతాక సన్నివేశాలను ఈస్ట్‌మన్‌ కలర్‌లో చూపించడం మరింత ఆకర్షణను చేకూర్చింది. ఈ సినిమా అప్పట్లో 5 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకొంది. మొత్తానికి ఇప్పటి తరంవారు ఏ సీడీయో వేసుకుని చూసినా హాయిగా ఆనందించగలిగే అపురూప జానపద చిత్రం 'బందిపోటు'.

PUBLISHED IN EENADU ON 15.08.2013