మంగళవారం, ఫిబ్రవరి 03, 2026

అరుణాచలం... అడుగడుగున పుణ్యం!



పంచభూత లింగాలలో అగ్నిలింగంగా భాసిల్లుతున్న అరుణాచల క్షేత్రం తమిళనాడులో తిరువణ్ణామలైలో ఉంది. అరుణ అంటే ఎర్రని, చలం అంటే కొండ అని అర్ధం. అరుణాచలం కొండ అగ్ని రూపంలో సాక్షాత్కరించిన శివ స్వరూపం. అందుకే అరుణాచలంలో గర్భాలయంలోని శివుని దర్శనం కన్నా అరుణాచలం కొండకు చేసే గిరి ప్రదక్షిణకే ప్రాధాన్యత ఎక్కువ. అరుణాచలంలో ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తుంటారు. పౌర్ణమి రోజుల్లో ఈ సంఖ్య రెట్టింపవుతుంది. అయితే అరుణాచలం గిరి ప్రదక్షిణ వలయంలో తప్పకుండా దర్శించ వలసిన 44 అతి శక్తి వంతమైన ఆలయాలు గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

స్మరణతోనే పుణ్యం
తమిళ భక్తులు అన్నామలై గా పిలుచుకునే అరుణాచలం క్షేత్రం పేరు స్మరించినంతనే సకల పాప దోషాలు తొలగిపోయి పుణ్యం లభిస్తుందని విశ్వాసం. ఈ అరుణాచల స్వామి తేజోలింగం, జ్యోతిర్లింగం. అందుకే ఈ క్షేత్రాన్ని అగ్ని క్షేత్రమని కూడా కొనియాడతారు. 14 కి. మీ. ఉన్న అరుణగిరి ప్రదక్షిణ చేయడమంటే సాక్షాత్తు ముక్కంటికి ప్రదక్షిణ చేసినట్లే అని పురాణాలు చెబుతున్నాయి. వేదాలు, ఉపనిషత్తులలో అరుణాచలం కొండ సాక్షాత్తు ఆ మహేశ్వరుడని సెలవిస్తోంది. ఇక ఈ గిరిప్రదక్షిణ చేసే మార్గంలో 44 చిన్న చిన్న ఆలయాలు దర్శించుకుని ప్రధాన ఆలయం దగ్గరకు చేరుకుంటే గిరిప్రదక్షిణ పూర్తైనట్టే! గిరి ప్రదక్షిణ మార్గంలో చూడవలసిన ఆలయాల వివరాలు ఇప్పుడు చూద్దాం.


బ్రహ్మలింగం:
అరుణాచలం గిరి ప్రదిక్షిణ ప్రారంభించాల్సిన ప్రదేశం ఇది. ఇక్కడ ముందుగా వినాయకునికి నమస్కరించుకుని గిరి ప్రదక్షిణ మొదలు పెట్టాలి.
ఇంద్ర లింగం:
ఇది ఇంద్రుడు ప్రతిష్టించిన శివలింగం. దీనికి శుక్రుడు, సూర్యుడు అధిదేవతలు. ఈ లింగాన్ని దర్శించుకుంటే వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి.
అగ్నిలింగం - అగ్ని తీర్థం :
అరుణగిరి చుట్టూ మొత్తం 8 శివలింగాలున్నాయి.. వాటిలో ఏడు రోడ్డుకి ఎడమవైపు ఉంటే అగ్నిలింగం మాత్రం కుడివైపుకు ఉంటుంది. దీనినే అగ్ని తీర్థం అని కూడా అంటారు. ఇక్కడ స్వామి వారిని దర్శించుకుంటే కష్టకాలంలో ప్రమాదాల నుంచి గట్టెక్కిస్తాడని నమ్మకం.
శేషాద్రి స్వామి :
శేషాద్రి స్వామి అరుణాచలంలో చిరకాలం నివసించి ముక్తిని పొందారు. ఈయన ఆశ్రమంలోని సమాధి దర్శనంతో సానుకూల శక్తులు పెరుగుతాయని విశ్వాసం.
దక్షిణా మూర్తి:
శివుని యొక్క జ్ఞాన స్వరూపం దక్షిణామూర్తి. అరుణగిరి ప్రదక్షిణ వలయంలో ఉన్న అతి పురాతనమైన, శక్తివంతమైన దక్షిణామూర్తి ఆలయం తప్పకుండా దర్శించాలి.
రమణాశ్రమం:
రమణమహర్షి ఆశ్రమంలో చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి.
మీనాక్షీ, సుందరేశ్వరుడు, గణేశ ఆలయాలు:
పార్వతీ పరమేశ్వరుల శక్తి ఇక్కడ భక్తుల విశ్వాసం.
ద్రౌపది ఆలయం:
గిరి ప్రదక్షిణ వలయంలో ఉన్న ద్రౌపది ఆలయం నుంచి గిరి దర్శనం అద్భుతంగా ఉంటుంది. జీవితంలో ఎదురుదెబ్బలు తిని విసిగిపోయిన వారికి ఈ ఆలయ దర్శనం మానసిక స్థైర్యాన్నిస్తుంది.
యమలింగం:
యముడు పూజించిన ఈ శివలింగాన్ని దర్శించుకుంటే అకాలమృత్యువు దరిచేరదు. మృత్యుభయం తొలగిపోతుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
పృథ్విలింగం:
అరుణాచలం గిరిచుట్టూ ఉన్న 8 శివలింగాల్లో ఇదొకటి.
గణపతి:
తొండం కుడివైపు తిరిగిఉండే ఈ గణపయ్యను దర్శించుకుంటే అదృష్టం వరిస్తుంది.
దూర్వాస ఆలయం:
ఇక్కడ దూర్వాసుడిని కుంతీ దేవి ప్రతిష్టించిందని చెబుతారు. ఇక్కడున్న వేప చెట్టుకి పసుపు దారాలు కడితే సంతాన భాగ్యం కలుగుతుందని, రాళ్లు పేరిస్తే ఇల్లు కట్టుకుంటారని భక్తుల విశ్వాసం.
కాట్టు శివాశ్రమం:
గిరి ప్రదక్షిణలో భాగంగా ఈ ఆశ్రమాన్ని రోడ్డుపై నుంచి దర్శనం చేసుకుని వెళ్ళిపోవచ్చు.
అప్పు నంది:
ఈ నంది దర్శనం కుటుంబ వివాదాలను సమసిపోయేలా చేసి బంధాలను వృద్ధి చేస్తుంది.
తేయునంది:
ఈ నంది నుంచి చూస్తే గిరి చతుర్ముఖ దర్శనం ఉంటుంది. బ్రహ్మదేవుడు జీవుల సృష్టికి కావాల్సిన జ్ఞానం ఇక్కడి నుంచి పొందారని చెబుతారు.
శోణ తీర్థం:
ఇక్కడ రెండు నందులుంటాయి. ఇక్కడున్న వినాయకుడిని జ్యోతి వినాయకుడు అంటారు. రమణ మహర్షి గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు సేదతీరిన ప్రదేశం ఇది.
నైరుతి లింగం:
గిరి ప్రదక్షిణలో ఉన్న అష్ట లింగాల్లో నాలుగోది ఇది. ఇక్కడ స్వామిని దర్శించుకుంటే రుణ, గ్రహ బాధలు తొలగిపోయి కీర్తి ప్రతిష్టలు వస్తాయి.
నంది ముఖ దర్శనం:
ఇక్కడి నుంచి అరుణ గిరివైపు చూస్తే నంది ముఖంలా కనిపిస్తుంది.
ఎదిర్ నేర్ అన్నామలై:
ఇది అరుణ గిరికి సరిగ్గా వెనుకవైపు ఉంటుంది. ఇక్కడి నుంచి గిరిని చూస్తే శివశక్తి దర్శనం అవుతుంది. అంటే శివుడు ఓ కొండగా, శక్తి మరో కొండగా కనిపిస్తారు.
ఆకాశ నంది:
పంచభూతాల్లో భాగంగా ఉండే నందుల్లో నాలుగోది ఆకాశనంది.
పళని ఆండవార్ ఆలయం:
కుమార స్వామి ఇక్కడ తపస్సుచేసి స్వయంభువుగా వెలిశాడని చెబుతారు. అందుకే ఈ ప్రదేశం అత్యంత శక్తివంతమైనది విశ్వాసం.
రాజ రాజేశ్వరి ఆలయం:
ఇది చిన్న ఆలయమే కానీ మహాశక్తివంతమైన ఆలయం. తప్పకుండా దర్శించుకోవాలి.
సింహ తీర్థం, సింహ నంది:
పంచభూత నందుల్లో ఇది ఐదోది. ఇక్కడున్న సింహ తీర్థంలో నీరు తాగితే ఎంతటి వ్యసనం అయినా మానేయగలుగుతారు.
కన్నప్ప గుడి:
అటవీశాఖ అధీనంలో ఉన్నందున ఈ గుడికి రోడ్డుపై నుంచి మాత్రమే నమస్కారం చేసుకోవాల్సి ఉంటుంది.
గౌతమ ఆశ్రమం:
గౌతమ మహర్షి తపస్సు చేసిన పుణ్య ప్రదేశం ఇది.
సూర్య లింగం:

అరుణగిరిపై నుంచి వెళ్లిన సూర్యుడు తేజస్సు కోల్పోయి ఇక్కడ తపస్సు చేసి మళ్లీ తేజస్సు పొందాడని చెబుతారు. ఇక్కడ ఆదిత్య హృదయం చదువుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్య అయినా పరిష్కారం అవుతుంది.
వరుణ లింగం:
ఈ వరుణ లింగానికి గ్రహదోషాలు తొలగించే శక్తి ఉంది.
మాణిక్య వాచకర్ ఆలయం:
మాణిక్యవాచకర్ గొప్ప శివభక్తుడు. ఈయన శివుని కీర్తిస్తుంటే పరమేశ్వరుడు ఆ శ్లోకాలను రచించి భద్రపరిచాడని చెబుతారు.
ఆది అన్నామలై:
బ్రహ్మదేవుడు ప్రతిష్టించిన ఈ శివలింగం అరుణాచలేశ్వరుడి కన్నా ముందు నుంచే ఉండేదంట!
వాయులింగం:
ఈ ఆలయంలో కొంతసేపు కూర్చుంటే బయట ఎండగా ఉన్నా లోపల చల్లగా ఉంటుంది.
వాయు నంది
: వాయునంది చాలా శక్తివంతమైనది.
భగవాన్ బ్రిడ్జ్:
రమణ మహర్షి సేదతీరిన ప్రదేశం ఇది.
చంద్ర లింగం:
చంద్రుడు ప్రతిష్టించిన శివలింగం ఇది. దీనిని దర్శించుకుంటే జీవితంలో ఉండే కష్టనష్టాలు, బాధలు తొలగిపోతాయని విశ్వాసం.
అధికార నంది:
శ్రీశైలంలో సాక్షి గణపతిలా అరుణాచలంలో అధికారి నంది ఉంటుంది. ఈ నంది చెవిలో గోత్రనామాలు చెప్పుకోవాలి.
అగస్త్య ఆశ్రమం:
ఇక్కడి నుంచి అరుణాచలం కొండను చూస్తే శివపార్వతులు ఇద్దరూ కలసి కనిపిస్తారు. ఇక్కడ దర్శనం చేసుకుంటే వివాహం, సంతాన దోషాలు తొలగిపోతాయి
కుబేర లింగం:
లక్ష్మీదేవి ఈ లింగాన్ని ఆరాధించి కుబేరుడికి అప్పగించింది. ఇక్కడ శివయ్యను దర్శించుకుంటే భోగభాగ్యాలు కలుగుతాయి.
ఇడుక్కు పిళ్లయార్:
చూడటానికి చాలా చిన్నగా కనిపించే ఇది ఆలయం కాదు. లోపల రెండు యంత్రాలు అమర్చారని, గిరిప్రదిక్షిణ వల్ల వచ్చిన అలసట ఈ ప్రదేశం మాయం చేసేస్తుందని నమ్మకం.
పంచముఖ దర్శనం:
ఇక్కడి నుంచి అరుణ గిరిని చూస్తే ఐదు ముఖాలుగా కనిపిస్తుంది. ఈ ప్రదేశం వృత్తి ఉద్యోగాల్లో ఉన్నతిని కలిగిస్తుంది.
ఊసి లింగం:
'ఊసి' అంటే తమిళంలో సూది అని అర్థం. ఇక్కడ శివలింగం సూది ఆకారంలో ఉంటుంది.
పచ్చయ్యమ్మ గుడి:
ఇక్కడ శ్యామలాదేవి పచ్చయ్యమ్మన్ స్వరూపంలో కొలువైంది.
ఈశాన్య లింగం - యజమాన నంది:
ఈశాన్య లింగం దర్శనంతో అష్టదిక్పాలకుల లింగాల దర్శనం పూర్తవుతుంది.
షణ్ముఖ ఆలయం:
ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామివారు ఆరుముఖాల్లో దర్శనమిస్తాడు.
దుర్గాలయం - ఖడ్గ తీర్థం:
ఇక్కడ అమ్మవారు మహిషాసురుడిని సంహరించాడని చెబుతారు.
ప్రవాళ పర్వతం:
అరుణ గిరిప్రదిక్షిణలో ఆఖరి ప్రదేశం ఇది. రమణ మహర్షి తన తల్లికి ఉపదేశం చేసిన ప్రదేశం ఇది.
అరుణాచలంలో నిత్యమూ అన్నివేళలా ఎంతమంది గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. గిరిపైన గల మహౌషధీ ప్రభావం వల్ల శరీరమునకు, శివనామ స్మరణవల్ల మనస్సుకు, శివానుగ్రహం వల్ల ఆధ్యాత్మిక జీవనానికి స్వస్థత చేకూరుతుందని విశ్వాసం. అయితే గిరి ప్రదక్షిణ హడావుడిగా ఏదో మొక్కుబడిగా కాకుండా మొత్తం 44 దర్శనీయ స్థలాలు దర్శిస్తూ ప్రదక్షిణ చేసినప్పుడు  గిరి ప్రదక్షిణ ఫలం మరింతగా దక్కుతుంది. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః

సోమవారం, ఫిబ్రవరి 02, 2026

అడుగడుగున గుడి... అందులో దీపం!





 

అద్వైతం...దీని గురించి చెప్పాలంటే మహా మహా గ్రంథాలున్నాయి. అవన్నీ చదివినా అర్థం చేసుకోవడం కష్టమే. దీన మీద ఎన్నో సిద్ధాంతాలు, వాదోపవాదాలు ఉన్నాయి. వాటన్నింటినీ పక్కన పెట్టి చాలా సులువుగా, సరళంగా అద్వైతం సారాన్ని ఓ సినిమా పాటలో అందించాలంటే ఆ రచయితలో ఎంత పరిణతి ఉండాలి?

అలాంటి రచయిత దేవులపల్లి కృష్ణశాస్త్రి. ఆయన రాసిన పాట గురించి ఇక్కడ తెలుసుకుందాం.

‘దేవుడు ఎక్కడో లేడు... నీలోనే ఉన్నాడు...’ అంటుంది అద్వైతం. కానీ ఆ సంగతి సామాన్యులకు కొరుకుడు పడదు. అవగాహనకు రాదు. కానీ దేవులపల్లి ఎంత చక్కగా చెప్పారో చూడండి.

‘‘అడుగడుగున గుడి ఉంది... అందరిలో గుడి ఉంది...

ఆ గుడిలో దీపముంది... అదియే దైవం...’’

గుడిని, గుడి పరిసరాలని ఎంత శుభ్రంగా ఉంచుకుంటాం? ఎంత పవిత్రంగా భావించుకుంటాం? మరి మనలోనే గుడి ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి? అదే చెబుతారు ఆయన చరణంలో....

‘‘ఇల్లు, వాకిలి, ఒళ్లు, మనసు ఈశుని కొలువనిపించాలి...’’ ఎంత చక్కని వ్యక్తీకరణ. పూజలు, వ్రతాలు చేసేప్పుడు ‘‘యత్ స్మరేత్ పుండరీకాక్షం... సబాహ్యాభ్యంతర శుచి:’’ అని చదువుతారు. మన ఇల్లు, వాకిలితో పాటు మన ఒళ్లు, మనసు కూడా శుభ్రంగా, పవిత్రంగా ఉండాలని ఒకే ఒక వాక్యంలో చెప్పారు. మనసు కూడా ఈశుని కొలువనుకుంటే ఎవరిలోనైనా ఈర్ష్యా ద్వేషాలు, అసూయలు, కక్షలు ఉంటాయా? వాటన్నింటినీ కూడా శుభ్రం చేసుకోవాలని చిన్న పిల్లలకి సైతం, ఏమీ చదువుకోని సామాన్యుడికి సైతం అర్థమయ్యేలా చెప్పారు కృష్ణశాస్త్రి.

అందరిలోనూ గుడిని, ఆ గుడిలో దేవుడిని చూడగలిగితే ఒకరినొకరం ఎంత గౌరవించుకుంటాం? ఎంత ప్రేమిస్తాం? ఆ సంగతిని రెండో చరణంలో చెప్పారు.

‘‘తల్లీ తండ్రీ గురువు పెద్దలు.. పిల్లలు కొలిచే దైవం

కల్లా కపటం తెలియని పాపలు.. తల్లులు వలచే దైవం’’

మొదట ఇంట్లోంచే మొదలు పెట్టారాయన. కుటుంబంలో అందరూ ఇది గుర్తిస్తే ప్రతి ఇల్లు అద్భుతంగా మారిపోతుంది కదా? ఇంటి సంగతి చెప్పిన తర్వాత ఆయన సమాజం కేసి దృష్టి సారించారు. ఆపై ఈ  సమస్త సృష్టిని కూడా కలిపారు, తర్వాతి వాక్యంలో...

‘‘ప్రతిమనిషీ నడిచే దైవం.. ప్రతి పులుగూ ఎగిరే దైవం..’’ అనేటప్పటికి మనిషి విశ్వమానవుడిగా మారిపోతాడు. అందరినీ, అన్నిటినీ, ప్రతి ప్రాణినీ గౌరవించి ప్రేమించే స్థాయికి మనిషిని తీసుకెళిపోతారు ఆయన.

ఇప్పుడు ఆ పాటను పూర్తిగా చదవండి.

‘‘పల్లవి:
అడుగడుగున గుడి ఉంది.. అందరిలో గుడి ఉంది
అడుగడుగున గుడి ఉంది.. అందరిలో గుడి ఉంది
ఆ గుడిలో దీపముంది.. అదియే దైవం..

అడుగడుగున గుడి ఉంది.. అందరిలో గుడి ఉంది
ఆ గుడిలో దీపముంది.. అదియే దైవం..

అడుగడుగున గుడి ఉంది.. అందరిలో గుడి ఉంది

చరణం 1:
ఇల్లూ వాకిలి ఒళ్లూ మనసూ.. ఈశుని కొలువనిపించాలి
ఇల్లూ వాకిలి ఒళ్లూ మనసూ.. ఈశుని కొలువనిపించాలి

ఎల్లవేళలా మంచు కడిగిన మల్లెపూవులా ఉంచాలి
ఎల్లవేళలా మంచు కడిగిన మల్లెపూవులా ఉంచాలి
దీపం మరి మరి వెలగాలి.. తెరలూ పొరలూ తొలగాలి

అడుగడుగున గుడి ఉంది.. అందరిలో గుడి ఉంది
ఆ గుడిలో దీపముంది.. అదియే దైవం..

అడుగడుగున గుడి ఉంది.. అందరిలో గుడి ఉంది

చరణం 2:
తల్లీ తండ్రీ గురువు పెద్దలు.. పిల్లలు కొలిచే దైవం
తల్లీ తండ్రీ గురువు పెద్దలు.. పిల్లలు కొలిచే దైవం

కల్లా కపటం తెలియని పాపలు.. తల్లులు వలచే దైవం
కల్లా కపటం తెలియని పాపలు.. తల్లులు వలచే దైవం
ప్రతిమనిషీ నడిచే దైవం.. ప్రతి పులుగూ ఎగిరే దైవం..

అడుగడుగున గుడి ఉంది.. అందరిలో గుడి ఉంది
ఆ గుడిలో దీపముంది.. అదియే దైవం..



చిత్రం : ఉండమ్మా బొట్టు పెడతా (1968)
సంగీతం : కె.వి. మహదేవన్
రచన : దేవులపల్లి
గానం: పి.సుశీల

 

విశేషణాలు సరిపోని విశిష్ట వ్యక్తి ... ‘దేవులపల్లి’

కొందరి గురించి చెప్పాలంటే విశేషణాలు వెతుక్కోవాలి. అసలు అవి సరిపోవు కూడా. అలాంటి వ్యక్తుల్లో ఒకరు దేవులపల్లి కృష్ణశాస్త్రి. ఆయన గురించి ఓ వ్యాసంలో చెప్పలేం. ఓ పుస్తకం రాయాల్సిందే. దానికి కూడా మన జ్ఞానం, విశ్లేషణ శక్తి లాంటివి సరిపోవు. కాబట్టి తెలిసినంత వరకు సూర్యుడికి దివిటీ చూపించినట్టు ప్రయత్నం చేయాల్సిందే.

భావకవిగా, రచయితగా, గీత రచయితగా ఇంకా బహుముఖంగా సాహితీ సేవ చేసిన కృష్ణశాస్త్రి గోదావరి జిల్లా వారే. తూర్పగోదావరి జిల్లా పిఠాపురం దగ్గర్లోని చంద్రపాలెం పుట్టిన ఊరు. 1897 నవంబరు 15న పుట్టిన ఈయన పువ్వు పుట్టగానే పరిమళించినట్టు చిన్ననాటి నుంచే రచనలు ఆరంభించారు. లలిత గీతాలు, పాటలు, భావ కవితలు, రేడియోలో నాటకాలు, కావ్యాలు ఇలా ఎన్నో సాహితీ ప్రక్రియలను జీవితాంతం కొనసాగించారు. విజయనగరంలో డిగ్రీ చేశాక పెద్దాపురంలో ఉపాధ్యాయుడిగా కొంత కాలం ఉన్నారు. తర్వాత 1920లో వైద్యంకోసం రైలులో వెళుతూండగా ప్రకృతినుండి లభించిన ప్రేరణ కారణంగా "కృష్ణపక్షం కావ్యం" రూపు దిద్దుకొంది. 1922లో భార్యా వియోగానంతరం ఆయన రచనలలో విషాదం అధికమయ్యింది. తరువాత మళ్ళీ వివాహం చేసుకొని, పిఠాపురం హైస్కూలులో అధ్యాపకునిగా చేరారు. కాని పిఠాపురం రాజుగారికి కృష్ణశాస్త్రి భావాలు నచ్చలేదు. దాంతో ఆ ఉద్యోగం వదలి బ్రహ్మసమాజంలోను, నవ్య సాహితీసమితిలోను సభ్యునిగా, భావ కవిత్వోద్యమ ప్రవర్తకునిగా దేశమంతటా ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సమయంలో ఎందరో కవులతోను, పండితులతోను పరిచయాలు కలిగాయి. ప్రాచ్య, పాశ్చాత్య సాహిత్యాన్ని అధ్యయనం చేశారు. పిఠాపురంలోని హరిజన వసతి గృహంతో సంబంధం ఏర్పరచుకొని హరిజనోద్ధరణ కార్యక్రమాలలో పాల్గొన్నందున బంధువులు అతనిని వెలివేశారు. అయినా వెనుకాడని కృష్ణశాస్త్రి వేశ్యావివాహ సంస్థను ఏర్పాటు చేసి ఎందరో కళావంతులకు వివాహాలు నిర్వహించారు. సంఘ సంస్కరణా కార్యక్రమాలు నిర్వహిస్తూనే "ఊర్వశి" అనే కావ్యం వ్రాశారు. 1929లో విశ్వకవి టాగూర్ తో పరిచయం ఏర్పడింది. వారిద్దరి మధ్య సాహితీ సంబంధాలు ఏర్పడ్డాయి. 1933-41 మధ్య కాలంలో కాకినాడ కాలేజీలో తిరిగి అధ్యాపకవృత్తిని చేపట్టారు. 1942లో బి.ఎన్. రెడ్డి  ప్రోత్సాహంతో మల్లీశ్వరి (1951) చిత్రానికి పాటలు వ్రాశారు. సినిమా పాటలకు కావ్య గౌరవాన్ని కల్పించారు.

మొత్తం మీద దాదాపు 170 పాటలు రాశారు. గొప్ప వక్తగా, రచయితగా, భావకవుల ప్రతినిధిగా పేరుపొందిన కృష్ణశాస్త్రి గొంతు 1963లో అనారోగ్యకారణంగా మూగవోయింది. కాని ఆయన రచనా పరంపర కొనసాగింది. ఆయన కి అనేక సన్మానాలు ప్రశంసలు లభించాయి. 1980లో మరణించారు. జీవిత సాఫల్యానికి గుర్తుగా కళాప్రపూర్ణ, సాహిత్య అకాడమీ, పద్మ భూషణ్ అవార్డులు అందుకున్నారు. 


ఆదివారం, ఫిబ్రవరి 01, 2026

వేటూరి పాటల్లో అలంకారాలు



వేటూరి సుందరరామమూర్తి జయంతి నివాళిగా అయన పాటలలో ని కొన్ని అలంకారాలను గుర్తు చేసుకుందాం. ఇవి కేవలం కొన్నే.  తెలుగు భాషలో అలంకారాలు వేటూరి పాటల్లో సొబగులద్దుకున్నాయి. భాషలో ఆయా అలంకారాల గురించి పూర్తిగా తెలియకపోయినా, ఆయన పాటలను తల్చుకుంటే కొంత వరకు తెలిసే అవకాశం ఉంది.
పాటలు - అలంకారాలు 
.......
అర్ధాలంకారాలు 
ఉపమాలంకారం   

త్యాగరాజ కీర్తనల్లె ఉన్నాది బొమ్మ  (శుభోదయం చిత్రం -  కంచికి పోతావా కృష్ణమ్మా )

పాలకడలిలా వెన్నెల పొంగింది..
పూల పడవలా నా తనువూగింది
ఏ మల్లెల తీరాల నిను చేరగలను?
మనసున మమతై కడతేరగలను! -  పంతులమ్మ (మానస వీణ మధుగీతం) 

ఉత్ప్రేక్షాలంకారం 
మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరుచిరు నవ్వులు కాబోలు
ఉరిమే ఉరుములు సరిసరి నటనల సిరిసిరి మువ్వలు కాబోలు
పరవశాన శిరసూగంగా...  ధరకు జారెనా శివగంగా
(శంకర నాద శరీర పర - శంకరాభరణం)

రూపకాలంకారం  

కైలాసాన కార్తీకాన శివరూపం
ప్రమిదే లేని ప్రమధాలోక హిమదీపం (సాగర సంగమం - నాద వినోదం )

శబ్దాలంకారాలు 

లాటనుప్రాసాలంకారం    

మారేడు నీవని ఏరేరి తేనా..
మారేడు దళములు నీ పూజకు  (భక్త కన్నప్ప శివ శివ శంకర)

కాళింది మడుగున కాళీయుని పడగల
ఆబాలగోపాలం ఆ బాలగోపాలుని
అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నులజూడ
తాండవమాడిన సరళి గుండెలనూదిన మురళి
ఇదేనా ఇదేనా ఆ మురళి (సప్తపది - వ్రేపల్లియ ఎద జల్లున్న )

యమకాలంకారం  

ఐలవ్ యు ఓ హారిక మన ప్రేమకే జోహారిక  (ఛాలెంజ్)

వృత్యనుప్రాసాలంకారం   

ఓహో లైల ఓ చారుశీలా కోపమేలా
మనకేలా గోల మందారమాలా మాపటేళ
ఒహొ పిల్లా... శుభానల్లా...
సరాగంలో... విరాగాలా...
మిసమిస వయసు రుసరుసల దరువుల
గుసగుస తెలిసె కలికి చిలకా
కసికసి పెదవి కదలికల కవితల
పిలుపులు తెలిసె కవిని గనకా   (చైతన్య) 

ఛేకానుప్రాసాలంకారం 

తుళ్ళి తుళ్ళి నిన్నమొన్న తూనీగల్లే ఎగిరిన
పిల్లదాని కొచ్చిందీ కళ... పెళ్లికళా..
తలపులన్ని వలపులైన చూపులు విరితూపులైన
పెళ్లికొడుకు నవ్వితే తళా... తళ తళా  (అడవి రాముడు కోకిలమ్మ పెళ్ళికీ  )

తొలకరి కోరికలే తొందర చేసినవే...ఈ విరి సెయ్యకే ఆవిరి తీరగా(ఇంటింటి రామాయణం -మల్లెలు పూసే)

అతిశయోక్తి అలంకారం :
రవి వర్మ కె అందని ఒకే  ఒక  అందానివో (రావణుడే రాముడైతే )
సారాలంకారం
చినుకులా రాలి..నదులుగా సాగి
వరదలై పోయి..కడలిగా పొంగు..
నీ ప్రేమ..నా ప్రేమ..నీ పేరే నా ప్రేమ
నదివి నీవు..కడలి నేను
మరచి పోబోకుమా..మమత నీవే సుమా..(నాలుగు స్తంభాలాట  )
ముక్తపదగ్రస్తలంకారం
గజ్జెఘల్లుమంటుంటే... గుండె ఝల్లుమంటుంది
గజ్జెఘల్లుమంటుంటే గుండె ఝల్లుమంటుంది
గుండె ఝల్లుమంటుంటే... కవిత వెల్లువవుతుంది
గుండె ఝల్లుమంటుంటే కవిత వెల్లువవుతుంది

అంత్యానుప్రాసాలంకారం 

ఏకాంత వేళ.. కౌగిట్లో
ఏకాంత సేవ.. ముచ్చట్లో
పడుచమ్మ దక్కే.. దుప్పట్లో
దిండల్లె ఉండు.. నిద్దట్లో

మంగళవారం, జనవరి 20, 2026

పాకిస్తాన్‌లో ఉంటూ అయోధ్య రాముడి కోసం తపించిన రాజపుత్ర వీరుడు!






అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణం జరుగుతున్న వేళ, పాకిస్తాన్‌లోని సింధ్ (ఉమర్‌కోట్ రియాసత్) పాలకుడు, రాజపుత్ర వీరుడు 'రాణా హమీర్ సింగ్' రావల్సా ..
రామయ్యకు దాదాపు 6 కోట్ల రూపాయలను విరాళంగా సమర్పించారన్న విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు..

ఇది సామాన్యమైన వంశం కాదు... చరిత్రలో షేర్ షా సూరి దెబ్బకు భయపడి పారిపోతున్న మొఘల్ చక్రవర్తి హుమాయున్‌కు తమ కోటలో ఆశ్రయం ఇచ్చిన ధీర సోధా రాజపుత్ర వంశం వీరిది..

అక్బర్ పుట్టింది కూడా వీరి కోటలోనే! "శరణు కోరి వచ్చిన వారిని ప్రాణాలకు తెగించి కాపాడటమే రాజపుత్ర ధర్మం" అని చరిత్ర సాక్షిగా నిరూపించిన గొప్ప వంశం వీరిది..

నేటికీ పాకిస్తాన్ గడ్డపై రాణా హమీర్ సింగ్ జీ ఒక సింహంలా, రాజసంతో జీవిస్తున్నారు:

శిరస్సుపై రాజపుత్రుల తలపాగా, నుదుటన తిలకం ధరించి సగర్వంగా ఉంటారు..

తమ ఆధీనంలోని 25,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 'గోవధ'ను పూర్తిగా నిషేధించిన ధర్మకర్త.
ఇప్పటికి 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు..

అక్కడి హిందువులు, ముస్లింలు అందరూ వీరిని తమ రాజుగా భావించి గౌరవిస్తారు..

కోనసీమ ప్రభల తీర్థం... కథా కమామీషు!



 

తెలుగువారికి ముఖ్యమైన పండుగ సంక్రాంతి. ఏ రోజుకు ఆ రోజే ప్రాధాన్యం కలిగిన పర్వదినాలివి. అందుకే ‘పెద్ద పండుగ’ అనీ పిలుస్తారు. భోగి అనగానే- వాడవాడలా వేసే మంటలు, చిన్నపిల్లలకు పోసే భోగిపళ్లు, లక్ష్మీదేవి అనుగ్రహం కోసం తీర్చిదిద్దే బొమ్మల కొలువులు గుర్తుకొస్తాయి. వ్యవసాయదారుల పండుగ కనుమ. సంక్రాంతిని పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల్లో అనేక ఉత్సవాలు జరుగుతాయి. సంక్రాంతి వేడుకల్లో కోనసీమకొక ప్రత్యేకత ఉంది. కోనసీమకే ప్రత్యేకమైన ‘ప్రభల తీర్థం’ ఒకటి. కోనసీమలో సంక్రాంతినాడు కొన్ని చోట్ల, కనుమనాడు అనేక చోట్ల ఈ తీర్థాలు నిర్వహిస్తారు. అన్నింటిలోనూ ప్రఖ్యాతి పొందింది- జగ్గన్నతోటలో జరిగే ప్రభల తీర్థం. అమలాపురానికి దగ్గరలోని మొసలపల్లి-ఇరుసుమండ గ్రామాల మధ్య గల ఏడెకరాలను జగ్గన్నతోటగా పిలుస్తారు.

దేశమంతా జరుపుకునే సంక్రాంతి అందరికీ ఒకటే అయినా ప్రాంతాన్ని బట్టి కొత్త రూపు దిద్దుకుంటుంది.
కొబ్బరాకుల నడుమనున్న కోనసీమకి సంక్రాంతి తెచ్చే వన్నె వేరు.
సంక్రాంతికి మాత్రం కోనసీమ పచ్చ పట్టుపరికిణీ కట్టుకున్న పల్లెపడుచులా ముస్తాబవుతుంది.
ముత్యాల ముగ్గుల నడుమ సంబరంగా నర్తిస్తుంది. ప్రతి ఇంటా సంతోషం మంచు జిల్లై కురుస్తుంది. అక్షరానికందని అదొక వర్ణనాతీత అనుభూతి.

 




పురాణాల్లోని ‘ఏకాదశ రుద్రుల’కు ప్రతీకలైనవారు కోనసీమలోని ఇరుగుపొరుగు గ్రామాల్లో కొలువై ఉన్నారంటారు. మొసలపల్లి గ్రామదైవం భోగేశ్వరస్వామి ఆహ్వానం మేరకు వీరందరూ సంవత్సరానికి ఒకసారి సమావేశమై లోక కల్యాణం కోసం చర్చలు సాగిస్తారట. అలా 11మందీ ఒకచోట నిర్వహించే సమావేశమే ప్రభల తీర్థం పరమార్థమని భావిస్తారు. 

🥀🌺వారు: వ్యాఘ్రేశ్వరం (విశ్వేశ్వర రుద్ర రూపం) వ్యాఘ్రేశ్వరుడు, కృష్ణరాయుడి (కె) పెదపూడి (మహాదేవ రుద్రరూపం) మేనకేశ్వరుడు, ఇరుసుమండ-ఆనంద (త్రయంబక రుద్రరూపం) రామేశ్వరుడు, వక్కలంక (త్రిపురాంతక రుద్రుడు) విశ్వేశ్వరుడు, నేదునూరు (కాలరుద్రుడు) చెన్నమల్లేశ్వరస్వామి. అలాగే ముక్కామల (కాలాగ్ని రుద్రుడు) రాఘవేశ్వరుడు, మొసలపల్లి (నీలకంఠ రుద్రుడు) భోగేశ్వరుడు, పాలగుమ్మి (మృత్యుంజయ రుద్రుడు) చెన్న మల్లేశ్వరుడు, గంగలకుర్రు (సర్వేశ్వర అగ్రహారం) వీరేశ్వరుడు, గంగలకుర్రు (సదాశివ రుద్ర రూపం) చెన్నమల్లేశ్వరుడు, పుల్లేటికుర్రు (శ్రీ మన్మహాదేవ రుద్రరూపం) అభినవ వ్యాఘ్రేశ్వరుడు. వీరిలో మొదటివాడైన వ్యాఘ్రేశ్వరస్వామి ప్రభల తీర్థానికి అధ్యక్షత వహిస్తాడంటారు. అందుకే ఆ ప్రభ వచ్చేవరకు భక్తులు మొక్కులు తీర్చుకోకుండా వేచి ఉంటారు.

తాటి దూలాలకు టేకు చెక్కలు అమర్చి, వెదురు బొంగుల్ని ఒక క్రమపద్ధతిలో గోపురం ఆకారంలో వంచి కడతారు. ఆ మధ్య ఖాళీలను రంగురంగుల నూతన వస్త్రాలతో అల్లికలా తీర్చిదిద్దుతారు. ఎర్రని గుడ్డను వెనక వైపు తెరలా కట్టి ఉంచుతారు. ముందు, వెనక భాగాల్ని జీవాత్మ పరమాత్మల ప్రతీకలుగా పరిగణిస్తారు. పైభాగంలో ఆలయాల్లోని ఇత్తడి కలశాలను బోర్లించి కట్టి- ఆ పైన వరి కంకులు, నెమలి పింఛాలు, పూల దండలు, ఇతర సామగ్రితో అలంకరిస్తారు. వాటి మధ్యలో ఉత్సవ విగ్రహాలు ఉంచడానికి వీలుగా గద్దెలు ఏర్పాటుచేస్తారు. వాటిమీద ఆయా గ్రామాల్లోని శివుడి ఉత్సవ విగ్రహాలు ఉంచడం ఒక సంప్రదాయం.

అనంతరం మేళతాళాలు,మంగళ వాద్యాలు, వేదమంత్రాల మధ్య వూరేగింపుగా బయలుదేరతారు. ప్రభలను మామూలు రహదారుల వెంటగాని, వాహనాల మీదగాని తీసుకు వెళ్లరు. ఎంత దూరమైనా భక్తులు భుజాల మీద మోస్తూ, పంట చేల మధ్య నుంచి వూరేగింపుగా వెళతారు. కొన్ని చోట్ల ఆరడుగుల నీటిలో నుంచి గోదావరి కాలువల్లోకి దిగి, ప్రభల్ని నేర్పుగా ఒడ్డుకు చేరుస్తారు.

ఈ ప్రభల్ని పరమశివుడి వెంట ఉండే వీరభద్రుడి ప్రతీకలుగా భావించి ‘వీరభద్ర ప్రభలు’గా పిలుస్తారు. పగలంతా పూజలు చేసి మొక్కుబడులు తీర్చుకుంటారు. రాత్రి సంప్రదాయ నృత్యాలు, కళా ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. కోనసీమలో జరిగే ఈ ప్రభల తీర్థాన్ని తిలకించడానికి, ఇందులో పాలుపంచుకోవడానికి- రాష్ట్రేతరులే కాక, విదేశాల్లో నివసించేవారూ వస్తారు. భక్తిభావాన్ని చాటుకుంటూ, ఆనందాన్ని మూటకట్టుకుని తిరిగి వెళతారు. ఇలాంటి సంప్రదాయాల్లో ఆధ్యాత్మిక భావనలతో పాటు సామాజిక ప్రయోజనాలూ భాసిస్తాయి!