‘కళ్లు తెరిస్తే జననం... కళ్లు మూస్తే మరణం’ అంటాడొక కవి.
‘పుట్టుటయు నిజము. పోవుటయు నిజము. నట్టనడిమి పని నాటకము...’ అంటాడొక వాగ్గేయకారుడు.
‘జీవితమే ఒక స్వప్నమహో... మన జననం కమ్మిన నిద్దురహో... ఇక మరణం ఆత్మకు వేకువహో...’ అంటాడొక భావకుడు.
‘మనం అవ్యక్తం నుంచి వచ్చాం... తిరిగి ఆ అవ్యక్తంలోకే మాయమవుతాం...’ అంటాడొక వేదాంతి.
సరే... ఎవరెలా చెప్పినా, ఏం చెప్పినా పుట్టడానికి ముందు మనం ఎవరం? ఎక్కడి నుంచి వచ్చాం? తిరిగి ఎక్కడికి పోతాం? అనే ప్రశ్నల మీద అనేక సిద్ధాంతాలు ఉన్నాయి.
మరి వీటికి సైన్స్ పరంగా జవాబులు వెతికే ప్రయత్నం చేద్దాం.
మన శరీరంలో సుమారు 7 ఆక్టిలియన్ల (octillion) పరమాణువులు (atoms) ఉన్నాయి. ఈ సంఖ్య ఎంత పెద్దదో తెలియాలంటే... 1 పక్కన 27 సున్నాలు పెట్టాలి. మరి ఈ పరమాణువుల వయసు మీ వయసే అనుకుంటున్నారా? కానేకాదు.
వాటిలో చాలా వరకు కొన్ని వందల కోట్ల (బిలియన్ల) సంవత్సరాల నాటివి. మన కణాలలోని కార్బన్, మనం పీల్చే ఆక్సిజన్, మన ఎముకలలోని కాల్షియం... పురాతన విశ్వ ప్రక్రియల ద్వారా రూపుదిద్దుకున్నాయి. అనేక భారీ మూలకాలు నక్షత్రాల లోపల, నక్షత్ర విస్ఫోటనాల ద్వారా ఏర్పడ్డాయి. ఆ పరమాణువులు మనలో భాగం కావడానికి ముందు కొన్ని బిలియన్ల సంవత్సరాల పాటు అంతరిక్షంలో ప్రయాణించాయి. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే, మనం ఈ విశ్వంతోనే తయారయ్యాం. అంటే మనం, మానవ రూపంలో ఉన్న విశ్వమే అన్నమాట. ఇలా బిలియన్ల నాటి కణాలు, బిలియన్ల ఏళ్ల పాటు ప్రయాణించి వచ్చి అద్భుతంగా ఒక చోట చేరితే మన శరీరం తయారైంది. దీన్ని మనం ‘నేను’, ‘నాది’ అనుకుంటున్నాం.
సరే... అలా పుట్టిన మనం ఎదుగుతున్నాం. జీవిస్తున్నాం. ఎవరి జీవితాన్ని వాళ్లం అనుభవిస్తున్నాం. ఆ తర్వాత?
‘జాతస్యహి ధృవో మృత్యు:’ అన్నట్టు మరణిస్తున్నాం.
సరే... ఇప్పుడు రెండో ప్రశ్న దగ్గరకి వద్దాం. ‘ఎక్కడికి పోతున్నాం మనం?’ దీనికి కూడా సైన్స్ పరంగా జవాబు వెతుకుదాం. ఈ జవాబు ఒక రకంగా చూస్తే అమరత్వానికి హామీ లాంటిది. అయితే అది మనలోని పరమాణువులకు. మన శరీరంలోని పరమాణువులు ఎక్కడెక్కడికి వెళ్తాయో చూద్దాం.
శారీరకంగా చనిపోయినప్పుడు మనమేమీ మాయమైపోము. మనల్ని సృష్టించిన ఈ విశ్వంలోకి తిరిగి మనం పరమాణువులుగా మారి వెళతాం.
మన శరీరంలో ఎక్కువగా నీరే ఉంటుంది. సుమారు 60 నుండి 70 శాతం వరకు నీరే. మరణం తరువాత ఆ నీరు ఎక్కడి నుండి అరువుగా తీసుకోబడిందో, ఆ గొప్ప జీవన చక్రంలోనే తిరిగి కలుస్తుంది. అది మట్టిలోకి ఇంకిపోయి, ఆవిరై, మేఘాలుగా మారి, చివరకు మళ్ళీ వర్షంగా కురుస్తుంది. మనమంతా మనవేననుకున్న ఆ పరమాణువులన్నీ నదుల గుండా ప్రవహిస్తాయి. జలపాతాల మీదుగా దూకుతాయి. ఇతర ప్రాణుల శరీరాలలోని నీటిలో సైతం భాగంగా మారుతాయి. ఒకప్పుడు మన రక్తంలో ప్రవహించిన అవే పరమాణువులు, ఒకరోజు ఒక జింక దాహాన్ని తీర్చవచ్చు. నదిగా ఉప్పొంగవచ్చు. ఉదయపు మంచు బిందువులుగా గాలిలో తేలియాడవచ్చు.
ఇక మనలోని మిగిలిన భాగం... అంటే కార్బన్, కాల్షియం, నైట్రోజన్ లాంటి ఇతర మూలకాలతో కూడిన సుమారు 30 శాతం పరమాణువులు తిరిగి భూమిలో కలిసిపోతాయి. సూక్ష్మజీవులు, కీటకాలు మన శరీరాన్ని పోషకాలుగా విచ్ఛిన్నం చేసి, నేలకు ఆహారంగా మారుస్తాయి. ఆ మట్టి నుండి మొక్కలు మొలకెత్తుతాయి. ఆ మొక్కలు జంతువులకు ఆహారంగా మారుతాయి. అలా మనలో కొద్దికాలం పాటు నివసించిన ఆ పరమాణువులు, కొత్త జీవాలకు సంబంధించిన అంతులేని గొలుసుకట్టులో మళ్ళీ మళ్ళీ ఉపయోగించబడతాయి.
ఇక్కడ శాస్త్రీయంగా ఒక నిజం మనకి అద్భుతంగా తోస్తుంది. అదేమిటంటే... ఈ మొత్తం ప్రక్రియలో పరమాణువులు సృష్టించబడవు లేదా నాశనం కావు. మన ఎముకలలోని కార్బన్, భూమి ఏర్పడకముందే ప్రాచీన నక్షత్రాలలో పుట్టింది. మనలో భాగం కావడానికి ముందే, అది డైనోసార్లు, మహా సముద్రాలు, అడవులు వంటి లెక్కలేనన్ని ఇతర అంశాలలో భాగంగా ఉంది. మనం వెళ్ళిపోయిన తరువాత, అది వేలాది ఇతర ప్రాణుల్లో, అంశాల్లో భాగం కావడానికి ముందుకు సాగుతుంది. మనమెవరం శాశ్వతమైన వస్తువులం కాదు. అరువు తెచ్చుకున్న నక్షత్ర ధూళి (stardust)తో తాత్కాలికంగా, అద్భుతంగా ఏర్పడిన అమరికలం మనం.
కాబట్టి మనలో ఉన్నదేదీ శాశ్వతంగా కోల్పోదు. నాశనం కాదు. మనం ఉండకపోవచ్చు. కానీ మనవేనని అనుకుంటున్న మనలోని పరమాణువులు మాత్రం ఉంటాయి. ఈ రోజు మనలాగా ఆలోచించే, నవ్వే, ప్రేమించే పదార్థమే, ఒకరోజు ఎవరో ఒకరి ఇంటి కిటికీ మీద కురిసే వర్షంలా, సూర్యరశ్మి కోసం ఆరాటపడే ఆకులా, లేదా సుదూర తీరంలో అలలా మారుతుంది.
మరణం తర్వాత ఏమి జరుగుతుందనే ప్రతి ప్రశ్నకు ఇది సమాధానం ఇవ్వకపోవచ్చు. కానీ ఇది మన మనసుకు హత్తుకునే ఒక సున్నితమైన, ఓదార్పునిచ్చే విషయాన్ని అందిస్తుంది. మనం ఈ విశ్వం నుండి వచ్చాం, ఏదో ఒకరోజు నిశ్శబ్దంగా అందులోకే తిరిగి వెళతాం. మనం ఎప్పటికీ కనుమరుగవ్వం... కేవలం రూపాంతరం చెందుతామంతే.
ఇప్పుడు చెప్పండి... మరణాన్ని ఒక ముగింపుగా కాకుండా, ఇలా తిరిగి వెళ్ళడంగా ఆలోచిస్తే.... ప్రశాంతంగా లేదూ!

.png)