ఆహ్లాదం
అక్షరాల సీమలో నా ప్రయాణం
శుక్రవారం, మార్చి 22, 2024
దశరథుడి యాగంలో దేవతల వ్యూహం! (పిల్లల కోసం రాముడి కథ-4)
దశరథుడు తన కూతురైన శాంతను, అల్లుడైన రుష్యశృంగుడిని అయోధ్యకు తీసుకు వచ్చిన తర్వాత కొంత కాలానికి వసంత రుతువు ప్రారంభమైంది. అప్పుడు దశరథుడు అశ్వమేధ యాగం నిమిత్తం రుష్యశృంగుడిని కలుసుకున్నాడు. ఆయనకు ప్రణామాలు చేసి, ''వంశాభివృద్ధి కోసం చేసే ఈ యాగానికి రుత్విజునిగా ఉండి అనుగ్రహించండి'' అంటూ ప్రార్థించాడు. రుష్యశృంగుడి సూచనలపై యాగానికి సకల ఏర్పాట్లనూ చేశాడు. యాగ నిర్వహణలో పాలు పంచుకోడానికి సుయజ్ఙుడు, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు మొదలైన మహర్షులు, వేద పండితులు వచ్చారు. సరయూ నదికి ఉత్తర తీరంలో గొప్ప యాగశాలను నిర్మించారు. దశరథుడి కోరికపై రాజ పురోహితుడైన వశిష్ఠుడు, యాగ నిర్వహణ బాధ్యతలు తీసుకున్నాడు. యాగం ప్రారంభ సూచకంగా అశ్వాన్ని వదిలిపెట్టారు. దాని వెనుక సాయుధులైన వందలాది మంది యోధులు బయల్దేరి వెళ్లారు. మిధిలాధిపతి అయిన జనక మహారాజు సహా దేశ దేశాలకు చెందిన రాజులకు, ప్రముఖులకు ఆహ్వానాలు పంపించారు. వచ్చేవారి కోసం సకల సౌకర్యాలతో కూడిన వసతి గృహాలను వేలాదిగా నిర్మించారు.
''అతిధులు ఎవ్వరినీ కించపరచ కూడదు. అన్న పానీయాలకు లోటు రానీయకూడదు. ఎవరికైనా ఏదైనా ఇచ్చేటప్పుడు అనాదరణ చూపించరాదు. పరిహాసం చేయరాదు. చులకన భావంతో చేసే దానం వల్ల దాతకు కీడు జరుగుతుంది'' అంటూ వశిష్ఠుడు రాజోద్యోగులకు తగిన సూచనలు చేశాడు.
యాగం కోసం వదిలిన అశ్వం ఒక ఏడాదికి తిరిగి వచ్చింది. అనేక దేశాల నుంచి రాజులు, ప్రముఖులు తరలివచ్చారు. దశరథ మహారాజుకు అనేక రకాలైన కానుకలు సమర్పించారు. మహా వైభవంగా యాగం మొదలైంది. సమృద్ధిగా అన్నదానం జరిగింది. ప్రతి రోజూ వండిన ఆహార పదార్థాల రాశులు కొండలను తలపించాయి.
యాగం పూర్తయిన తర్వాత దశరథుడు పరమానంద భరితుడై రుత్విజులకు భూమి యావత్తూ దానం చేశాడు.
వారంతా ఆయనతో, ''మహారాజా! ఈ సమస్త భూమండలాన్నీ పరిరక్షించడానికి నీవే సమర్థుడవు. అందుచేత మాకు భూమి బదులు మణులో, బంగారమో, గోవులో, మరొకటో, ఏది సిద్ధంగా ఉందో దాన్ని ఇప్పించు'' అన్నారు. దశరథుడు వారికి పది లక్షల గోవులను, పది కోట్ల బంగారు నాణెములను, నాలుగు వందల కోట్ల వెండి నాణెములను దానం చేశాడు. వారా ఆ సంపదనంతా తిరిగి వశిష్ఠుడికి, రుష్యశృంగ మహర్షికి సమర్పించారు. యాగం చూడడానికి వచ్చిన బ్రాహ్మణులకు దశరథుడు, కోశాగారంలోని ద్రవ్యమంతా దానం చేశాడు. అప్పుడొక దరిద్ర బ్రాహ్మణుడు వచ్చి దశరథుడి ముందు చేయి చాచాడు. వెంటనే దశరథుడు తన చేతికి ఉన్న బంగారు కడియాన్ని తీసి ఇచ్చేశాడు. అందరూ దశరథుడిని వేనోళ్ల కొనియాడి, దీవెనలను అందజేశారు.
అశ్వమేధ యాగం పూర్తి కాగానే దశరథుడి చేత రుష్యశృంగుడు, పుత్రకామేష్టి యజ్ఞం చేయించాడు. ఆ యజ్ఞంలో భాగంగా సమర్పించే హవిస్సులను స్వీకరించడానికి బ్రహ్మాది దేవతలు, గంధర్వులు, సిద్ధులు విచ్చేశారు. అప్పుడు దేవతలంతా బ్రహ్మతో రావణాసురుడి వల్ల తామంతా పడుతున్న బాధలను ప్రస్తావించారు.
''ఓ బ్రహ్మదేవా! మీరు అనుగ్రహించిన వరాల ప్రభావంతో లంకాధిపతి రావణుడు అందరినీ చిత్రహింసలకు గురి చేస్తున్నాడు. దిక్పాలకులను, స్వర్గాధిపతి అయిన ఇంద్రుడిని కూడా వేధిస్తున్నాడు. రావణుడు విహరిస్తుంటే సూర్యుడు సైతం తన వేడిమిని తగ్గించ వలసి వస్తోంది. వాయువు కూడా భయంతో మెల్లగా వీస్తున్నాడు. సముద్రుడు తన అలల జోరును తగ్గిస్తున్నాడు. రావణుడు వరగర్వంతో రుషులను, గంధర్వులను, యక్షులను, బ్రాహ్మణులను హింసిస్తున్నాడు'' అంటూ మొర పెట్టుకున్నారు.
అందుకు బ్రహ్మ, ''దేవతలారా! రావణాసురుడు గొప్ప తపస్సు చేసి, దేవ, దానవ, యక్ష, గంధర్వ, కింపురుషుల ద్వారా తనకు చావు లేకుండా నన్ను వరం కోరాడు. మానవుల పట్ల చులకన భావంతో వారిని విస్మరించాడు. కాబట్టి మానవుడి చేతిలోనే అతడి మరణం సంభవిస్తుంది'' అన్నాడు. ఇంతలో అక్కడ గొప్ప తేజస్సుతో విష్ణుమూర్తి శంఖ, చక్ర, గదా, సారంగపాణియై ప్రత్యక్షమయ్యాడు. వెంటనే బ్రహ్మాది దేవతలందరూ చేతులు కైమోడ్చి మొక్కి, ''ప్రభూ! మా అందరికీ నీవే దిక్కు. రావణాసురుడి ఆగడాలను భరించలేకపోతున్నాం. అతడిని అంతమొందించడానికి మానవుడిగా అవతరించమని ప్రార్థిస్తున్నాం'' అంటూ సాగిలపడ్డారు.
అందుకు మహావిష్ణువు, ''దేవతలారా! భయపడకండి. దురాత్ముడు, క్రూరుడు అయిన రావణుని పుత్రులు, మంత్రులతో సహా సంహరిస్తాను. ఆ తర్వాత పదకొండు వేల సంవత్సరాలు మానవలోకంలో ఉండి ఈ భూమండలాన్ని
పరిపాలిస్తాను'' అని వరమిచ్చి, దశరథుడి కొడుకుగా జన్మించడానికి సంకల్పించుకుని అదృశ్యమయ్యాడు.
ఇంతలో పుత్రకామేష్టి హోమకుండం నుంచి కళ్లు మిరుమిట్లు గొలిపేలా ఒక దివ్వ పురుషుడు పైకి వచ్చాడు. అతడి చేతిలో ఓ బంగారు కలశం ఉంది. దాని మూత వెండిది.
ఆ దివ్య పురుషుడు దశరథుడితో, ''రాజా! నీ యాగ, హోమాలతో సంతుష్టులైన దేవతలు పంపగా వచ్చాను. ఈ పాత్రలో దివ్యమైన పాయసం ఉంది. దీన్ని నీ భార్యలకు ఇచ్చినట్టయితే, వారు గర్భవతులవుతారు. నీకు పుత్ర సంతానం కలుగుతుంది'' అన్నాడు. దశరథుడు ఆనందంగా ఆ కలశాన్ని అందుకుని ఆ దివ్యపురుషుడికి ప్రదక్షిణ నమస్కారాలు చేశాడు. వెంటనే ఆ దివ్యపురుషుడు అదృశ్యమయ్యాడు.
దశరథుడు ఆ కలశంలోని పాయసంలో సగాన్ని పట్టపురాణి కౌసల్యకు ఇచ్చాడు. మిగిలిన దాంట్లో సగం రెండో భార్య సుమిత్రకి ఇచ్చాడు. ఆ మిగిలిన దానిలో సగాన్ని ప్రియ భార్య కైకేయికి ఇచ్చాడు. ముగ్గురూ తీసుకోగా ఇంకా మిగిలిన పాయసాన్ని మరోసారి సుమిత్రకే ఇచ్చాడు. దశరథుడి భార్యలైన ఆ ముగ్గురూ ఆ పాయసాన్ని స్వీకరించి దివ్య తేజస్సుతో వెలుగొందారు. త్వరలోనే వాళ్లు గర్భవతులయ్యారు.
ఇలా మహా విష్ణువు మానవుడిగా అవతరించడానికి రంగం సిద్ధమైంది. రావణాసుర సంహారంలో ఆయనకి సాయ పడడానికి ఏఏ దేవతలు ఏఏ రూపాలతో అవతరించారో వచ్చే భాగంలో తెలుసుకుందాం. జై శ్రీరామ్!
శుక్రవారం, మార్చి 15, 2024
అధికార భోజనంబు! అవినీతి వంటకంబు!!
''రారా శిష్యా! ఇంత లేటయిందేం? అదేంటి కళ్లు ఎర్రగా ఉన్నాయ్?''
''ఏం చెప్పమంటారు గురూగారూ! మీరిచ్చిన ఎసైన్మెంటుతో రాత్రంతా కలత నిద్రండి. కలలో ఏవేవో కలలండి...''
''ఇంతకీ ఎసైన్మెంటు గురించి చెబుతావా? కలల గురించి చెబుతావా?''
''మీరేమో మన అధినేత ఎన్నికల ప్రచార సభల ప్రసారాలు, వీడియోలు చూసి నేను గమనించిన అంశాలన్నీ రాసుకురమ్మన్నారు కదండీ?
ఆ పని మీద కూర్చున్నానండి. ఎంతసేపని ఆయన సొల్లు వాగుడు వింటానని చికాకేసి ఛానెల్ మార్చానండి. దాంట్లో 'మాయాబజార్' సినిమా వస్తోందండి. ఇలా రెండూ మార్చి మార్చి చూసేసరికి పొద్దుపోయిందండి. దాంతో రెండూ కలసి కల్లోకొచ్చాయండి...''
''ఇదేదో భలే ఇంట్రస్టింగ్ గా ఉందిరోయ్. ఎసైన్మెంటు గురించి తర్వాత చెబుదువులే కానీ, ముందు ఆ కలేంటో చెప్పు...''
+++++
''హెయ్... లంబూ!''
''హై నాయకా!''
''హెయ్... జంబూ!''
''హై నాయకా!''
''ఇక మన బలగాల్ని ద్విగుణం, త్రిగుణం చేయండి'' అన్నాడు చిన్నమయ.
ఇంతలో అధినాయకుడు అందుకున్నాడు. ''లేని అభివృద్ధిని ఉన్నట్టు ఊదరగొట్టండి. బతుకులన్నీ బాగుపడ్డట్టు భ్రమలు కలిగించండి. రాక్షస మాయలు ఉపయోగించి విజృంభించండి. ప్రచారంలో పరుగులు పెట్టండి...'' అంటూ ఉత్సాహపరిచాడు.
''ఓ... అలాగే! ఓహోహో... అలాగే! అభివృద్ధంటే చేయలేం కానీ, పెచారం ఎందుకు చేయలేం? లేనిది ఉన్నట్టూ, ఉన్నది ఇంకెక్కడా లేనట్టూ అదరగొడతాం...'' అంటూ వంత పాడారు లంబూ, జంబూ.
అధినాయకుడు అలా వెళ్లగానే చినమయ కేసి తిరిగారు ఇద్దరూ.
''ఇన్నావుగా? ఇంకా చూస్తావేం? ఓటర్లను తందనాలాడించడానికి తతంగమేదీ తతంగం?'' అంటూ హడావుడి చేశారు.
చిన్నమయ, ''ఉష్షు... ఆగండి...'' అంటూ దుస్తుల్లోంచి మంత్రదండం తీశాడు.
''అం.... అహా... ఇం... ఇహీ... ఉం... ఉహూ'' అంటూ ఊపేసరికి ఎన్నికల శిబిరాలు 'సిద్ధం'గా కనిపించాయి. వేదికలు, కుర్చీలు వెలిశాయి. కానీ అందులో జనం లేరు!
లంబూ, జంబూ పగలబడి నవ్వసాగారు.
''కుర్చీలు ఖాళీ... వేదికలు ఖాళీ... ఇదేం ఎన్నికల ఏర్పాట్లయ్యా? మనం చెప్పేది వినడానికి జనమేరీ జనం?'' అంటూ ఎకసెక్కం చేశారు.
చిన్నమయ నవ్వుకుని, లంబూ జంబూలను 'ఉష్షు' అంటూ వారించి రాక్షస భటుల్ని పిలవసాగాడు.
''గగ్గోలకా...''
''వై గురూ...''
''గంద్రగోళకా...''
''హై గురూ...''
''ఉగ్రా... ఉద్దండకా... కర్కోటకా... కల్లోలకా...'' అంటూ చిన్నమయ పిలవగానే, రాక్షస సైనికులందరూ ప్రత్యక్షమయ్యారు.
''వెళ్లండి. మీరు ఎక్కడెక్కడి ప్రజల్ని తోలుకు రండి. అధినాయకుడి సభలు నిండుగా కనిపించాలి...''
''మరి జనం రామంటే?''
''బెదిరించండి. అదిలించండి. ఆర్టీసీ బస్సుల్ని కైవసం చేసుకుని అందులో కుక్కండి. కాలేజీ బస్సుల్ని తీసుకొచ్చి వాటిలో కుదేయండి. కావాలంటే ఎక్కడెక్కడి వాళ్లనీ తోలుకురండి. ప్రలోభ పెట్టండి. తప్ప తాగించండి. డబ్బులు ఆశ చూపించండి. బిర్యానీ ప్యాకెట్లు చేతిలో పెట్టండి. రాకపోతే రేషన్ కార్డులు మాయం చేయండి. లబ్దిదారుల జాబితాలో పేర్లు మాయం చేస్తామని హడలకొట్టండి. ఉన్నదంతా ఊడగొడతామని ఉరుకులు పరుగులు పెట్టించండి...''
''లల్లల్లల్ల....లా'' అంటూ రాక్షసులందరూ మాయం అయిపోయి ఊర్లలో ప్రత్యక్షమై జనాల్ని తోలుకురాశాగారు.
అలా విధిలేక వచ్చిన జనం ఎన్నికల శిబిరాల్లో తిరుగుతుంటే చిన్నమయ సృష్టించిన మాయగాళ్లు వారిని ఆకర్షించడానికి పాటలు, ప్రలోభాలతో ఆడసాగారు.
''పథకాలూ... నవ పథకాలూ...
కమిటీలూ... ఉప కమిటీలూ...
తెల్ల కార్డులు... హెల్త్ కార్డులూ...
సంక్షేమానికి సంబంధాలు!
మీట నొక్కితే మీకు సొమ్ములు...
మాటలు వింటే మాయ గొప్పలు...
అందుకోండయ్యా... బాబూ దండుకోండయ్యా!''
ప్రజలంతా విడ్డూరంగా చూడసాగారు. మరో శిబిరంలో ఇంకో సందడి మొదలైంది. నృత్యాలు చూస్తూ అలరించసాగారు.
''సెజ్లు... సెజ్లు... మహాసెజ్ లు...
పంట భూమిలో ప్రగతి సెజ్లు...
అడుగు పెట్టంగానే జాబులు... జాబులు...
జేబులు నిండుగ డబ్బులు... డబ్బులు...
పంచుకోండయ్యా... బాబూ ఎంచుకోండయ్యా!''
అధికారగణం ప్రచార పటాటోపంతో జనానికి కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. ఇంతలో అధికార పార్టీ అభ్యర్థులు శిబిరాల్లోకి పల్లకిలెక్కి రాశాగారు. చిన్నమయ మాయ వల్ల ప్రచారం మత్తులో ఉన్న జనం ఊగిపోతూ పాటందుకున్నరు.
''అభ్యర్థులారా... రారయ్యా...
మా భాగ్యం కొద్దీ దొరికారయ్యా...
ముల్లోకాలను వెతికి చూసినా నాయకులంటే మీరయ్యా...
దయచేయండి... దయచేయండి...
తమంత వారిక లేరండీ...
ఇక తతంగమంతా తమదండి...''
ఇంతలో... ''ఆగండి...'' అనే కేక వినిపించింది. జనం మత్తులోంచి బయటపడ్డారు. ఏం జరిగిందో తెలియక అరుపు వచ్చిన వైపు చూశారు. అక్కడొక స్వామీజీ చిరునవ్వుతో కనిపించారు.
''ఎవరు సామీ తమరు?'' అని అడిగారు జనం.
''నేను నవజన చైతన్యానంద స్వామిని నాయనా! మీరు చూస్తున్నదంతా మాయ. ప్రచార మాయ. ఐదేళ్లుగా ఇలాంటి తతంగంతోనే మిమ్మల్ని ఆకట్టుకుంటున్నారు. ఏమీ లేకపోయినా, ఉన్నట్టు భ్రమ కల్పిస్తున్నారు. ఒక్కసారి మేలుకుని మీ చుట్టూ మీరు చూసుకోండి. మీ బతుకులు ఎలా అణగారిపోయాయో తెలుసుకోండి. ప్రలోభాలకు లొంగకుండా వాస్తవాలు గమనించండి...'' అన్నారు ప్రశాంతంగా.
''ఏమిటి స్వామీ... ఆ వాస్తవాలు?'' అంటూ అడిగారు జనం.
స్వామీజీ నవ్వారు.
''నేను చెప్పడం కాదు నాయనా! మీరే మీ కళ్లతో స్వయంగా వీక్షించండి. పైకి మీ కోసం ఏర్పాట్టు చేసిన మాయ పథకాల వెనుక ఎవరి అవినీతి విందు సాగుతోందో చూడండి...'' అంటూ స్వామీజీ ముందుకు నడిచారు.
ఆయన వెంట జనమంతా ఎన్నికల మాయాబజార్ విడిదిలో వంటశాల వెనక్కి చేరారు. అక్కడ కిటికీ లోంచి లోపల దృశ్యాన్ని చూసి తెల్లబోయారు.
లోపల అధినాయకుడు విశ్వరూపంలో ఉన్నాడు. అతడి ముందు రకరకాల వంటకాల పాత్రలు సిద్ధంగా ఉన్నాయి. అధినాయకుడు ఉత్సాహంగా పాట పాడుతూ వాటిని లాగిస్తున్నాడు. ఆ పదార్థాలన్నీ అతడి నోట్లోకి వెళ్లిపోతున్నాయి.
''హ...హ...హ... హ్హ..హా!!
అధికార భోజనంబు... అవినీతి వంటకంబు...
ఓటర్ల వారి విందు... అహహ్హ నాకె ముందు!
ఔరౌర భూములెల్ల... అయ్యారె స్కాములెల్ల...
వహ్వారె సొమ్ములెల్ల... హహహహ్హహ్హా!
ఇవన్ని నాకె చెల్ల!''
''మజారె కంపెనీలు... మనవారి ఫ్యాక్టరీలు...
వహ్వారె పెట్టుబడులు... హహహహ్హహ్హా!
ఇవన్ని నాకె చాలు!''
అధినాయకుడి అవినీతి విందు భోజనం చూసి జనం నోరెళ్లబెట్టారు.
నవజన చైతన్య స్వామి గొంతు సవరించుకున్నారు.
''చూశారా ప్రజలారా! మీరెంత సేపూ పైకి చూపిస్తున్న ప్రచార మాయలో పడి మోసపోతున్నారు. లోపల అధికార గణం సాగిస్తున్న అవినీతి భోజనం ఎంత పెద్ద ఎత్తున సాగుతోందో గమనించారా? ఇదంతా ఎవరి సొమ్మో తెలుసుకోండి. మీకు దక్కాల్సిందంతా అధినాయకుడు ఎలా బొక్కుతున్నాడో చూడండి... ఇప్పటికైనా మేలుకోండి. ఏం చేయాలో నిర్ణయించుకోండి!'' అంటూ వెళ్లిపోయారు.
++++
శిష్యుడు ఈ కలంతా చెప్పి ''ఈ కలకి అర్థం ఏమిటి గురూగారూ!'' అన్నాడు.
''ఐదేళ్లుగా రాష్ట్రంలో జరుగుతున్నదేరా శిష్యా! అధికార పార్టీ ప్రచారం వెనుక ఏ జరుగుతోందో నీకు కల రూపంలో వచ్చింది. ఇప్పుడు ఒక ఓటరుగా ఏం చేయాలో నువ్వే నిర్ణయించుకో'' అన్నారు గురూగారు.
''అర్థమైంది గురూగారూ! ఇక ఈ రాక్షస మాయలో పడను'' అన్నాడు శిష్యుడు.
''సెభాష్! నీకిచ్చిన ఎసైన్మెంటు పూర్తయింది. ఇక వెళ్లిరా'' అంటూ గురువుగారు, శిష్యుడి భుజం తట్టారు.
-సృజన
PUBLISHED ON 15.3.2024 ON JANASENA WEBSITE