సోమవారం, ఏప్రిల్ 13, 2026

పర్సు పోయి దొరికెన్... పలు పాఠాల్ నేర్పెన్!




నా పర్సు పోయింది... నాలుగు రోజుల తర్వాత దొరికింది... ఈ మొత్తం

వ్యవహారంలో ఓ నిర్లక్ష్యం, వ్యవస్థ పని తీరు, ఓ నిజాయితీ గురించి చెప్పుకోవాలి. వీటితో పాటు ఇది నేర్పిన పాఠాలు కూడా.

మొన్న మంగళ వారం, అంటే ఏప్రిల్ 7ఉదయం మా అమ్మయిని కాలేజీ బస్సు ఎక్కించి మోతీనగర్లో ఐఓబీ ఏటీఎమ్ సెంటర్ కి వెళ్లా, డబ్బులు తీసుకుందామని.

అమ్మయ్య... ఎవరూ లేరు. పొద్దున్నే కదా... నేను లోపలికి వెళ్లే సరికి మరో కస్టమర్ వచ్చి గేటే బయట నుంచున్నాడు. ఒక్క క్షణం తర్వాత వచ్చి ఉంటే  ఇతడి వెనకాల నుంచోవలసి వచ్చేది’ అనుకున్నా. జేబులోంచి పర్సు తీసి అందులోంచి ఏటీఎమ్ కార్డు తీశా. పర్సుని తిరిగి జేబులో పెట్టుకోవచ్చు కదా? అబ్బే... ఏటీఎమ్ యంత్రం మీద పెట్టా. పెట్టేటప్పుడు అనుకున్నా కూడా... దీన్ని గుర్తుపెట్టుకుని

తీసుకోవాలని. ఇది అతి విశ్వాసం. పైగా నిర్లక్ష్యం కూడా.

ఎందుకంటే... అంతక్రితం ఓసారి ఐసీఐసీఐ ఏటీఎమ్ కి వెళ్లినప్పుడు

ఇలాగే పర్సును పక్కన ఉన్న చెక్క ర్యాక్ మీద పెట్టి మర్చిపోయి ఇంటికి వచ్చేసి మళ్లీ గుర్తొచ్చి పరిగెత్తా. అది అక్కడే ఉంది. అప్పుడే

అనుకున్నా... ఇంకెప్పుడూ ఇలా పర్సును ఎక్కడా పెట్టకూడదని. ఆ

అనుభవం నేర్పిన పాఠాన్ని నిర్లక్ష్యం చేశానన్నమాట.

సరే... ఇప్పటి విషయానికొస్తే, కార్డు స్లాట్ లో పెట్టాక... పిన్ నెంబర్, ఎమౌంట్ వివరాలు కొట్టా. ఫోన్లో ఓటీపీ వచ్చాక ఎంటర్ చేశా.  నోట్లు వచ్చాక తీసి జేబులో పెట్టుకున్నా. కార్డు మరో జేబులోకి తోసేశా. తర్వాత పర్సు అక్కడే మర్చిపోయి బయటకి వచ్చి బండెక్కి ఇంటికి వచ్చేశా. బండి పార్క్ చేసి జేబు చెక్ చేసుకుంటే పర్సు లేదు. మైగాడ్’ మర్చిపోయాననుకుని వెంటనే వెళ్లి చూస్తే పర్సు లేదు.

అందులో క్యాష్ కొంచెమే ఉన్నా, కావలసిన కార్డులన్నీ ఉన్నాయి. పాన్, ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, ఎక్రిడిటేషన్, బ్యాంకుల క్రెడిట్, డెబిట్ కార్డులు, మెంబర్ షిప్ కార్డులు, వెహికిల్ ఆర్సీలు వగైరా... వగైరా.

ఏం చేయాలి? కాసేపు అయోమయం.

తర్వాత వెంటనే సెల్ తీసి బ్యాంకుల మొబైల్ యాప్స్ ఓపెన్ చేసి క్రెడిట్, డెబిట్ కార్డులను బ్లాక్ చేశా. డ్రైవింగ్ కార్డు ఒరిజినల్ ఉందో, డూప్లికేట్ ఉందో గుర్తులేదు. ఇంటికెళ్లి చూడాలి.

సరే... ఆ తర్వాత చేసిన పని అక్కడే నుంచుని 100కి ఫోన్ కొట్టి విషయం చెప్పా. లొకేషన్ చెప్పేసరికి దగ్గర్లోని పీఎస్ నుంచి ఫోన్

వస్తుందని చెప్పారు. వెంటనే ఫోన్ కి మెస్సేజ్ వచ్చింది. కాసేపట్లో పోలీసుల నుంచి ఫోన్. ‘‘అక్కడే ఉండండి వస్తున్నామ’’న్నారు. కేవలం 5 నుంచి 10 నిమిషాల్లో పొలీస్ పెట్రోలింగ్ కారు వచ్చింది. వ్యవస్థ బాగానే పనిచేస్తోందనిపించింది. నేనున్న ఏరియా పరిధిలోని బోరబండ పోలీస్ స్టేషన్ కారు అది. అందులోంచి పొలీస్ శీతల్ సింగ్ దిగి వివరాలు

కనుక్కున్నారు. అక్కడే లొకేషన్ ఫొటోలు తీసుకున్నారు. నన్ను,

ఆయనను కలిపి డ్రైవర్ ఫొటో తీశాడు. నా వివరాలన్నీ చేతిలో ఉన్న ట్యాబ్ లో ఎంటర్ చేశారు. వెంటనే నా సెల్ కి మెసేజ్ వచ్చింది. నాకయితే ముచ్చటేసింది.

‘సర్... ఇంత ఫాస్టుగా వచ్చేశారే...’ అన్నాను ఆశ్చర్యంగా. అప్పుడు చెప్పారు, 100 కి కానీ, 112 కి కానీ ఫోన్ చేస్తే 10 నిమిషాల లోపు లొకేషన్లో ఉండాలనేది వాళ్లకి ఉన్న ఆదేశాలు. తర్వాత మీరు బోరబండ పీఎస్ కి వెళ్లి కంప్లైంట్ చేయండి అని చెప్పి వెళ్లి పోయారు. నేను

కాసేపట్లో పీఎస్ కి వెళ్లా. రిసెప్షన్ లో చెబితే అక్కడ యూనిఫామ్ లో ఉన్న అమ్మయి కాగితం, పెన్ను ఇచ్చి రాయమంది. రాశాక దగ్గరుండి మరో పోలీస్ దగ్గరకి తీసుకెళ్లింది. ఆ పొలీస్ నన్ను ఎస్ ఐ సైదులు దగ్గరకి తీసుకెళ్లారు. ఆయన అంతా విని కృష్ణ అనే పొలీస్ ని పిలిచి కేసు

అప్పగించారు. తర్వాత నేను, అతను కలసి స్పాట్ ఏటీఎమ్ దగ్గరకి

వచ్చాం. ఏటీఎమ్ లో సీసీ కెమేరాలు ఉన్నాయో లేదో చూశాక

అతడు చెప్పాడు. మీ పర్సు తీసుకుపోయిన వ్యక్తిని పట్టుకోడానికి మూడు ఛాన్సులున్నాయని.

1. సీసీ కెమేరా ఫుటేజి ద్వారా అసలు మీ తర్వాత ఎవరు ఆ పర్సు

తీశారో గమనించవచ్చు. కానీ కేవలం వ్యక్తి ఫొటో వల్ల అంతగా ప్రయోజనం ఉండదు.

2. సీసీ కెమేరాల్లో అతడి వెహికిల్ నెంబర్ కనిపిస్తే వెంటనే ట్రేస్ చేసి కాల్

చేయవచ్చు.

3. బ్యాంక్ ఏటీఎమ్ లావాదేవీలు పరిశీలించి మీ తర్వాత డబ్బులు డ్రా చేసిన వ్యక్తి ఎకౌంట్ నెంబర్ ద్వారా చిరునామా, ఫోన్ నెంబర్లు తీసుకోవచ్చు.

ఇలా చెప్పిన తర్వాత అతడు నేరుగా బ్యాంక్ మేనేజర్ గదిలోకి వెళ్లి ఐడెండిటీ కార్డు చూపించాడు. ఇద్దరం కూర్చున్నాక మేనేజర్ మీరు

ఎన్నింటికి డబ్బు డ్రా చేశారని అడిగాడు. నేను నా సెల్ ఫోన్ కి వచ్చిన

బ్యాంక్ మెస్సేజి చూపించా. ఉదయం 7.53 గంటలు. తర్వాత సీసీ కెమేరా ఫుటేజిలో 7.50 నుంచి వీడియో చూపించారు. అందులో నేను రావడం నుంచి పర్సు వదిలేసి వెళ్లడం వరకు సినిమా కనిపించింది. నేను వెళ్లిన వెంటనే ఆ వ్యక్తి లోపలికి వచ్చాడు. అతడు టోపీ పెట్టుకుని ఉండడంతో ఫేస్ సరిగా కనిపించలేదు. అతడు డబ్బు డ్రా చేస్తుండగానే నా పర్సును గమనించాడు. దాన్ని తీసి ఓపెన్ చేసి ఏమున్నాయో చూశాడు. తర్వాత తన డబ్బు డ్రా చేసి నా పర్సుతో సహా వెళ్లిపోయాడు. నాతో వచ్చిన పోలీస్ కృష్ణ సీసీ కెమేరా వీడియోనంతా తన సెల్

ఫోన్లో చిత్రీకరించారు. ఫుటేజిలో అతడి టూవీలర్ కనపించింది కానీ

దాని మీద నెంబర్ ప్లేటు లేదు. అంటే... తొలి రెండు ఛాన్సులూ

లేవు. ఇక మిగిలింది అతడు ఏ బ్యాంకు కస్టమర్ అనేది. అదే బ్యాంకు కస్టమర్ అయితే అతడి ఎకౌంట్ వివరాలు వెంటనే చూడవచ్చు. కానీ అతడు వేరే బ్యాంక్ కస్టమర్. దాంతో ఆ వివరాల కోసం ఒక లెటర్ రాసి  ఇస్తే ఏటీఎమ్ నిర్వాహకులకు, బ్యాంకు వాళ్లకి విషయం చెప్పి వివరాలు తెప్పించుకోవాల్సి ఉంటుందని, దీనికి రెండు రోజులైనా పడుతుందని మేనేజర్ చెప్పారు.

ఇక చేసేదేముంది?

అక్కడికక్కడే లెటర్ రాసి మేనేజర్ కి ఇచ్చి నాదీ, పోలీసులదీ నెంబర్లు ఇచ్చి వివరాలు రాగానే చెప్పమని వచ్చేశాం.

నేను బ్యాంకులకు వెళ్లి కొత్త డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డుల కోసం అప్లై చేసి వచ్చా. ఆధార్ కార్డును డౌన్ లోడ్ చేసుకోవచ్చు. పాన్ కార్డు తీసుకోవచ్చు. డ్రైవింగ్ లైసెన్స్ తోనే తలనెప్పి. పోలీసు స్టేషన్లో ఎప్ఐఆర్ తీసుకుని, దానితో పాటు కొత్త కార్డు కోసం అప్లై చేయాలి.

ఏం చేయాలో తేల్చుకుంటుండగానే నాలుగు రోజులు గడిచాయి. శనివారం అంటే, 11వ తారీకున నాకొక కాల్ వచ్చింది. అందులో వ్యక్తి నా పర్సు  తనకు దొరికిందని చెప్పాడు. నా ఫోన్ నెంబరు మీకెలా తెలిసిందంటే వస్తే చెబుతానన్నాడు. సరే... మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానని చెప్పా. అతడు మోతీ నగర్లో రాయుడు రెస్టారెంటు దగ్గరకి రమ్మన్నాడు.

నా అంతట నేను వెళ్లిపోతే ఎలా? అందుకని పోలీసు కృష్ణ గారికి ఫోన్ చేశా.

అయితే మీరు అక్కడికి వెళ్లండి. మా కానిస్టేబుల్ హరిబాబును పంపిస్తా. అతడేమంటాడో చూద్దాం...’ అన్నారు. నేను వెంటనే

బోరబండ పీఎస్ కి వెళ్లి హరిబాబుతో సహా రాయుడు రెస్టారెంటుకి బయల్దేరాం.

నాకు ఫోన్ చేసిన వ్యక్తినెంబర్లు తీసుకుని హరిబాబు వెంటనే అతడి వివరాలు మొత్తం వాళ్ల ఫ్యామిలీ  ఫొటోలతో సహా ట్రేస్ చేశారు. అతడు ఏ డిపార్టుమెంటు ఉద్యోగో కూడా తెలుసుకున్నారు.

‘‘మీరు ఒంటరి గానే వెళ్లి అతడికి ఫోన్ చేయండి. ఇద్దరం ఉన్నట్టు గమనిస్తే అతడు రాకపోవచ్చు. అతడు రాగానే నేను మీ దగ్గరకి వస్తా’’ అని హరిబాబు సూచించారు. నేను అక్కడే చెట్టు కింద నుంచుని ఫోన్ చేశా. నాకు కొద్ది దూరంలోనే హరిబాబు నుంచుని నన్ను గమనిస్తున్నారు. నేను ఫోన్ చేసిన దాదాపు అరగంటకి ఆ వ్యక్తి

వచ్చాడు. ‘‘మీరేనా పర్సు వదిలేసింది?’’ అని      అడుగుతూ నా పర్సు తీసి నాకిచ్చాడు. నేను దాన్ని చెక్ చేస్తుండగానే పోలీస్

హరిబాబు వచ్చి మా పక్కన నుంచున్నాడు. తన ఫోన్ లో ఏటీఎమ్ వీడియో ఫుటేజి ఓపెన్ చేసి ఆ వ్యక్తికి చూపించాడు. అతడి పేరు సుధాకర్. ఎలక్ట్రిసిటీ డిపార్టుమెంటు.

‘‘అవునండీ... నేనే తీసుకుని వెళ్లా. ఆధార్ కార్డు లోని ఎడ్రస్ ద్వారా ఒక

అపార్టుమెంటుకి వెళ్లా కూడా. అయితే అక్కడ ఎవరూ లేరన్నారు. అప్పుడు మీ ఫోన్ నెంబర్ కోసం కార్డులన్నీ చూశా. ఆఖరికి ఎక్రిడిటేషన్

కార్డు లో చివర మీ ఫోన్ నెంబరు ఉంది. దాన్ని బట్టి మీకు ఫోన్ చేశా’’ అని వివరించాడు.

‘‘ఇలా ఏమైనా దొరికితే దగ్గర్లోని పోలీసులకు చెప్పాలి కదండీ?’’ అని హరిబాబు అడిగాడు.

‘‘నాకా ఆలోచన రాలేదండీ...’ అన్నాడతడు.

‘‘నా పర్సు దొరికిన రోజో, మర్నాడో బ్యాంక్ మేనేజర్ కి ఇవ్వలేకపోయారా? నాలుగు రోజులు ఎందుకు ఊరుకున్నారు?’’ అని నేను అడిగా.

‘‘ఆ రోజు ఇంకా బ్యాంక్ తెరవలేదండీ... తర్వాతి రోజు నేను ఆధార్ కార్డులోని అడ్రస్ వెతుక్కుంటూ ఒక అపార్టుమెంటుకు వెళ్లా కూడా. ఈ లోగా నా పనులు. ఇవాళ కార్డులన్నీ మరోసారి చెక్ చేస్తే ఒక దాంట్లో మీ ఫోన్ నెంబర్ దొరికింది. వెంటనే కాల్ చేశా’’ అన్నాడతడు.

‘‘మరి మీ బండికి నెంబర్ ప్లేటు లేదేంటి?’’ అని అడిగా.

‘‘మేం డిపార్టుమెంటు వాళ్లమే కదండీ? అందుకని పోలీసులు పట్టుకోరు. అందుకే పట్టించుకోవలేదు...’’ అన్నాడు.

నా పర్సులో అన్నీ సరిగానే ఉన్నాయి, డబ్బుతో సహా. పోలీస్ హరిబాబు ఆ వ్యక్తి ఐడెండిటీ కార్డు ఫొటో తీసుకున్నాడు. నా పర్సు ఫొటో కూడా తీసుకున్నాడు. తర్వాత ఎస్ ఐ కి ఫోన్ చేసి చెప్పి, మమ్మల్ని ఇక వెళ్లవచ్చన్నాడు. నేను హరిబాబుకి, ఆ వ్యక్తికి థ్యాంక్స్ చెప్పా. ఇద్దరూ కనీసం కూల్ డ్రింక్ అయినా తాగుదాం రండన్నా వినలేదు. పన్లు ఉన్నాయంటూ వెళ్లిపోయారు.

ఈ వ్యవహారంలో నేర్చుకోవలసిన కొన్ని పాఠాలు ఉన్నాయి. అవి ఇవి...

1.         పర్సును ఎక్కడా నిర్లక్ష్యంగా పెట్టకూడదు. ఎప్పుడు తీసినా జేబులోనే పెట్టుకోవాలి.

2.         పర్సులో ముఖ్యమైన కార్డుల డూప్లికేట్స్ ఉండాలి తప్ప, ఒరిజినల్స్ ఉంచకూడదు.

3.         పర్సులో ఏమేమి ఉన్నాయో ఒక లిస్టు రాసుకుని ఇంట్లో వేరే చోట భద్రంగా ఉంచుకోవాలి.

4.         ముఖ్యమైన కార్డులకు సంబంధించిన డిజిటల్ కాపీలు భద్రం చేసుకోవాలి. ఈ రోజుల్లో డిజీ లాకర్లు, యాప్స్ లాంటి అవకాశాలు ఉన్నాయి కదా. మన కార్డుల ఫొటోలను తీసుకుని మన ఈమెయిల్ కి మనమే పంపుకుని ఏ డ్రైవ్ లోనో సేవ్ చేసుకోవాలి. వీలుంటే రెండు మూడు డిజిటల్ ప్లాట్ ఫారమ్స్ లో దాచుకోవాలి. మన  కుటుంబ సభ్యులతో కూడా షేర్ చేసుకోవచ్చు.

ఈ పాఠాలను మర్చిపోకుండా అమలు చేయడం ఆఖరి పాఠం.

మంగళవారం, మార్చి 17, 2026

అపురూపమైన అక్కాచెల్లెళ్ల కథ (పిల్లల కోసం రాముడి కథ13)


 

దివి నుండి భువికి దిగివచ్చిన గంగ (పిల్లల కోసం రాముడి కథ14)


 

అపురూపమైన అక్కాచెల్లెల్ల కథ (పిల్లల కోసం రాముడి కథ-13)

విశ్వామిత్రుడితోను, ఇతర మునులతోను కలిసి మిథిలా నగరానికి వెళుతున్న రామలక్ష్మణులు శోణా నదీ తీరంలో విశ్రమించారు. అయోధ్య నుంచి రామలక్ష్మణులు బయల్దేరి అప్పటికి పదకొండు రోజులు గడిచాయి. ఆ మర్నాడు తిరిగి వారి ప్రయాణం మొదలైంది. ఆ మధ్యాహ్నానికల్లా వాళ్లు పవిత్రమైన గంగానది తీరానికి చేరుకున్నారు. హంసలతో, బెగ్గురు పక్షులతో కూడిన ఆ గంగాతీరం ఎంతో అందంగా కనిపిస్తోంది. అందరూ ఆ తీరంలో ఓ ప్రాంతాన్ని శుభ్రపరుచుకుని నివాసానికి అనువుగా మార్చుకున్నారు. ఆ తర్వాత పుణ్య స్నానాలు చేసి, రుషులకూ పితృదేవతలకు తర్పణాలు ఇచ్చారు. అగ్నిహోత్రాన్ని ఏర్పాటు చేసుకుని హవిస్సులు సమర్పించారు. తరువాత భోజనాలు చేసి అందరూ విశ్వామిత్రుని చుట్టూ కూర్చున్నారు.

అప్పుడు రాముడు కుతూహలంతో విశ్వామిత్రుని ఇలా ప్రశ్నించాడు.

''మహానుభావా! ఈ గంగానదిని గురించి తెలుసుకోవాలని ఉంది. స్వర్గలోకంలోను, భూలోకంలోను, పాతాళలోకంలో కూడా ఈ గంగానది ఎలా ప్రవహిస్తోంది? అందుకు గల కారణమేంటి? ఏ విధంగా సముద్రాన్ని చేరింది? దయచేసి వివరించండి'' అంటూ వినయంగా అడిగాడు.

అప్పుడు విశ్వామిత్రుడు గంగానది కథను చెప్పాడు.

పూర్వం హిమాలయం అనే ఓ మహా పర్వతము ఉండేది. హిమవంతుడు అనే ఆ పర్వత రాజు, మేరువు అనే మరో మహా పర్వతుడి కూతురైన మేనను పెళ్లి చేసుకున్నాడు. వారిద్దరికీ సాటిలేని సౌందర్యవతులైన ఇద్దరు కుమార్తెలు కలిగారు. వారిలో పెద్ద కూతురే ఈ గంగాదేవి. రెండో కూతురు ఉమాదేవి. అప్పుడు దేవతలందరూ వచ్చి పెద్ద కుమార్తె అయిన గంగను తమకు అప్పగించమని కోరారు. మూడు లోకాలకూ మేలు చేయాలనే ఉద్దేశంతో హిమవంతుడు గంగాదేవిని వారికి అప్పగించాడు. అప్పుడు ఆ దేవతలు గంగను స్వర్గ లోకానికి తీసుకుపోయారు. అలా ఆమె సురగంగ అయింది. ఇక రెండో కుమార్తె అయిన ఉమాదేవి కన్యగానే తీవ్ర తపస్సు చేసింది. హిమవంతుడు ఆమె కోరిక మీద ఆమెను శివుడికి ఇచ్చి వివాహం జరిపించాడు. ఆమే పార్వతి. ఆ విధంగా హిమవంతుడి కుమార్తెలయిన గంగా, పార్వతులు లోకాలలో పూజ్యులయ్యారు.

ఇది విన్నాక రాముడు, ''మహాత్మా! దేవతలు గంగను స్వర్గ లోకానికి తీసుకు వెళ్లారు కదా, ఆపై ఆ నది మానవ, పాతాళ లోకాలకు ఎలా వెళ్లింది? త్రిపథగా ఎలా పేరు పొందింది?'' అని ప్రశ్నించాడు.

అప్పుడు విశ్వా మిత్రుడు అపూర్వమైన అక్కచెల్లెళ్లయిన ఆ గంగా, పార్వతుల గురించి మరిన్ని వివరాలు ఆసక్తికరంగా చెప్పుకొచ్చాడు.

''రామా! శివపార్వతులు పెళ్లి చేసుకున్నారని చెప్పాను కదా, ఆ తర్వాత వాళ్లిద్దరూ ఎంతో అన్యోన్యంగా సంసార జీవితం గడపసాగారు. అలా నూరు దివ్య సంవత్సరాలు  గడిచాయి. అప్పుడు బ్రహ్మాది దేవతలు, 'ఇంత కాలం తర్వాత శివపార్వతులకు కుమారుడు జన్మిస్తే అతడు మహా తేజోమూర్తి అవుతాడు. అతడి ప్రభావాన్ని లోకాలు తట్టుకోలేవు' అని భావించారు. ఆపై వాళ్లు శివుడి దగ్గరకు వెళ్లి, ''పరమశివా! నీ మహా తేజంతో పుట్టే పుత్రుడిని లోకాలు భరించలేవు. కాబట్టి నీ తేజాన్ని నీలోనే ఉంచుకుని పార్వతితో కలిసి తపస్సు చేసి అందరినీ అనుగ్రహించు'' అంటూ ప్రార్థించారు.

దానికి శివుడు సరేనని, ''అయితే నా తేజస్సును ఏదో ఒక చోట నిక్షిప్తం చేయాలి. దాన్ని ఎవరు ధరించగలరో చెప్పండి'' అన్నాడు. అప్పుడు దేవతలు భూమిని చూపించారు. శివుడు తన మహా తేజస్సును భూమిపై వదిలాడు. ఆ తేజస్సు పర్వతాలు, వనాలతో నిండి ఉన్న భూలోకమంతా వ్యాపించిపోయింది. భూమి ఆ ప్రభావాన్ని భరించలేకపోవడంతో దేవతలు ఈసారి అగ్నిదేవుడి దగ్గరకు పోయి, ''నువ్వు వాయు దేవుడితో కలిసి ఆ శివ తేజస్సును భరించు'' అని ప్రార్థించారు. అగ్నివాయువులు కలిసి శివతేజస్సులో ప్రవేశించి దాన్ని ఘనీభవించేలా చేశారు. అదే శ్వేత పర్వతమైంది. ఇదంతా చూసిన పార్వతి దేవి దేవతలపై కోపించింది. ఆ కోపంలో ఆమె, ''పుత్రిడిని పొందాలనే నా కోరికకు మీరంతా అడ్డుపడ్డారు. కాబట్టి ఇకపై మీరు మీ భార్యల ద్వారా సంతానాన్ని పొందలేరు'' అంటూ శపించింది. ఆపై ఆమె భూమికి కూడా శాపాన్నిచ్చింది. ''శివ తేజస్సును భరించలేకపోయిన నువ్వు, ఇకపై అనేక రకాల రూపాలు కలిగి ఉంటావు. అనేక మంది రాజుల చేత పరిపాలించబడతావు. నీకు కూడా సంతాన సుఖ సంతోషాలు ఉండవు'' అంది. ఆ తర్వాత శివపార్వతులు ఇద్దరూ కలిసి ఉత్తర దిశగా వెళ్లి ఓ పర్వతంపై తపస్సులో మునిగిపోయారు.

దాంతో దేవతలు బ్రహ్మ దగ్గరకు వెళ్లారు. ''బ్రహ్మదేవా! ఇంత వరకు మాకు శివుడు మాకు సేనాధిపతిగా వ్యవహరించాడు. ఇప్పుడు తపస్సులో మునిగిపోయాడు. లోక నిర్వహణ కోసం మాకు సేనానాయకుడు కావల్సి ఉంది. ఏం చేయాలో ఆలోచించి దారి చూపించండి'' అని కోరుకున్నారు.

బ్రహ్మ వారిని ఓదార్చి, ''దేవతలారా! పార్వతి శాపం వల్ల మీరెవరికీ పుత్రులు కలిగే అవకాశం లేదు. కానీ శివుడి తేజస్సును అగ్ని దేవుడు ధరించాడు కదా? దానిని గంగలో ప్రవేశపెట్టమని కోరండి. అలా ఆమె ద్వారా ఒక పిల్లవాడు పుడతాడు. అతడే మీకు సేనాధిపతి కాగలడు'' అని సూచించాడు.

దేవతలు అగ్నిదేవుడి దగ్గరకు వెళ్లి బ్రహ్మ ఆదేశాన్ని చెప్పారు. అప్పుడు అగ్ని, గంగ దగ్గరకు వెళ్లి ''నువ్వు శివ తేజస్సును స్వీకరించు. ఇది దేవకార్యం'' అన్నాడు. అప్పుడు గంగ ఓ అందమైన యువతి రూపం పొందింది. అగ్ని దేవుడు ఆమెలో శివ తేజస్సును ప్రవేశపెట్టాడు. గంగా ప్రవాహాలన్నీ ఆ తేజస్సుతో నిండిపోయాయి. గంగ కూడా బ్రహ్మాండమైన ఆ తేజస్సును భరించలేక, అగ్ని సూచనపై దాన్ని శ్వేత పర్వతం దగ్గర విడిచింది. ఆ తేజస్సు ప్రభావంతో ఆ ప్రదేశాలన్నీ బంగారు మయమైపోయాయి. ఆ తేజస్స తీవ్రతను బట్టి ఆయా ప్రదేశాలలో వెండి, రాగి, ఇనుము, తగరము, సీసము లాంటి ధాతువులు ఏర్పడ్డాయి. శ్వేత పర్వతం దగ్గర శరవనమనే రెల్లుగడ్డి అంతా బంగారమైపోయింది. అక్కడే మహా తేజస్వి అయిన కుమార స్వామి ఉద్భవించాడు. ఆ పిల్లవాడికి పాలివ్వడానికి దేవతలు ఆరు మంది కృత్తికలను నియోగించారు. వాళ్లు దగ్గరకు రాగానే ఆ బాలుడు ఆరు ముఖముల వాడై ఆ ఆరుగురు కృత్తికల నుంచి ఒకేసారి పాలు తాగాడు. అందుకే అతడిని కార్తికేయుడని, అగ్ని సంభవుడని కూడా అంటారు. ఆ బాలుడు ఒక్క రోజులోనే  వృద్ధి చెంది మహిమాన్వితుడై దేవ సేనలకు అధిపతి అయ్యాడు.

ఇలా కుమార సంభవం గురించి చెప్పిన విశ్వామిత్రుడు, ఆ తర్వాత రామ లక్ష్మణులకు గంగానది ఆకాశం నుండి ఎలా మానవ లోకానికి వచ్చిందో కూడా వివరించాడు. ఆ కథను వచ్చే భాగంలో తెలుసుకుందాం!