గురువారం, సెప్టెంబర్ 03, 2026

పాముల జనాభా లెక్కలు!


 

మనుషుల జనాభా లెక్కల గురించి తెలుసు. మరి పాముల జనాభా లెక్కల గురించి విన్నారా? అదే జరుగుతోంది ఇప్పుడు మధ్యప్రదేశ్ లో. ఇలాంటి ప్రయత్నం జరగడం ఇదే తొలిసారి. పాము కాటు మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అక్కడి అధికారులు ఆ పని మొదలు పెట్టేశారు కూడా. వాళ్లేమంటున్నారో తెలుసా? ‘‘దేశంలోనే తొలిసారిగా పాముల గురించి శాస్త్రీయంగా జరుగుతున్న అధ్యయనం ఇది’’ అని. ఈ కార్యక్రమం ‘‘స్నేక్ సెన్సస్’’ పేరుతో బాగా ప్రాచుర్యం పొందింది. అలాగని రాష్ట్రం మొత్తం మీద పాములెన్ని ఉన్నాయోనని వెతికి పట్టుకుని ఒకటి... రెండు... మూడు... అని లెక్క పెడతారనుకోకండి.

డెహ్రాడూన్ లోని భారత వణ్యప్రాణి సంస్థ, మధ్యప్రదేశ్ రాష్ట్ర అటవీ శాఖ అధికారులు కలిసి కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఏ జాతి పాములు సంచరిస్తున్నాయి, వాటిలో విషపూరితమైనవి ఏవి లాంటి విషయాలపై సమగ్రమైన సమాచారాన్ని సేకరిస్తారన్నమాట.  అధికారులు మొన్న మార్చిలో పని మొదలు పెట్టారు. ఈ ఏడాది చివరి వరకు అదే పనిలో ఉంటారు.

నిజానికి ఇలాంటి పని కొత్తేమీ కాదు. ఉత్తరాఖండ్ అటవీ ప్రాంతాల్లో పాముల గురించి కొంత సమాచారం సేకరించారు. అలాగే కొన్ని దక్షిణాది రాష్ట్రాల్లో సరీసృపాలు, ఉభయచరాల డేటా సమీకరించారు. అయితే ఇంత పకడ్బందీగా, విస్తృతంగా పాముల గురించి సర్వే చేపట్టడం దేశంలనే తొలిసారి. ఇందుకోసం వందమందికిపైగా సిబ్బందికి రెండు రోజుల పాటు శిక్షణ శిబిరాలు నిర్వహించారు. తొలి దశలో పాముల సంచారం, పాము కాట్ల సంఘటనలు, మరణాల గురించి ఆరా తీశారు. వేర్వేరు సీజన్లలో అయిదు ప్రత్యేక ప్రాంతాల్లో పాములకు సంబంధించిన వీలయినన్ని కోణాల్లో సమాచారాన్ని సేకరిస్తారు. తరచు కనిపించే నాలుగు విషపూరితమైన పెద్ద పాములు ఎక్కడెక్కడ తిరుగుతున్నాయి, వాటిని పట్టుకుని ఏ ప్రాంతంలో వదిలిపెడితే మంచిదనే అంశాలను కూడా తెలుసుకుంటారు. పులులు సంచరించే కన్హా, సత్పుర, పెన్నా అభయారణ్యాలు, గాంధీసాగర్, అమర్ కంటక్  వన్య ప్రాంతాల్లోని మైదాన, నదీపరీవాహక ప్రాంతాల్లో  ఈ పాముల గణన జరుగుతోంది. పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సంస్థ, రాష్ట్ర అటవీ శాఖల సమన్వయంతో ఈ సర్ప సమాచార సేకరణ జరుగుతోంది.  ఈ క్రతువులో 15 మంది పరిశోధకులు పాల్గొంటున్నారని వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ సైంటిస్ట్ డాక్టర్ అభిజీత్ దాస్ చెబుతున్నారు. ఈ సర్వే ఇక ముందు జరగబోయే వన్యప్రాణి సమాచార సేకరణలకు మార్గదర్శకంగా నిలిచేంత సమగ్రంగా ఉంటుందని చెప్పారు. వన్యజంతువుల విషయంలో ప్రజల భద్రతకు తీసుకోవలసిన చర్యలను కూడా ఈ సర్వే సూచిస్తుంది. ఇందులో పాల్గొనే సిబ్బందికి స్నేక్ కిట్లు, జియో టాగ్  కెమేరాలు, జీపీఎస్ పరికరాలు లాంటి ఆధునిక పరికరాలను అందించారు. ఏదైనా పామును ఫొటో తీసిన వెంటనే దాని ద్వారా అది తీసిన ప్రాంతం వివరాలు, ఆ పాము జాతి సమాచారాన్ని విశ్లేషించే ఏర్పాట్లు చేసుకున్నారు. ఇందులో పాముల కదలికలను మరింత కచ్చితంగా తెలుసుకోడానికి రేడియో-టెలిమెట్రీ విధానాలను కూడా ఉపయోగిస్తారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే పాముల్లో రాజులాంటిదైన ‘కింగ్ కోబ్రా’ ఉనికి వివరాలను కూడా తెలుసుకుంటారు.

 

సోమవారం, ఆగస్టు 31, 2026

తెలుగు చమత్కారాలు!



ఓ పల్లెటూరి కిరాణా వ్యాపారి టీచర్ దగ్గరకొచ్చి ‘‘ఏటండీ? ‘సింతపండు' అని రాసినందుకు నా కొడుకుని తిట్టారంట.  చింతపండుని సింతపండు అంటే దాని పులుపేమైనా తగ్గిపోతుందా ? ఎలా వ్రాసినా పర్వాలేదు. కొంచెం కిరణాపద్దులు రాయడం నేర్పండి చాలు’’ అంటాడు. మునిమాణిక్యం వారి రచనలలోని సన్నివేశం ఇది. భాష ప్రయోజనం భావ వ్యక్తీకరణకే. కానీ కొన్ని పదాలు వాటి మూలాలు తెలుసుకుంటే చాలా ఆసక్తి కరంగా ఉంటుంది. చూడండి.

'వాడెదవ' అంటే తిట్టనుకునేరు...చెరకుగడ చివరిభాగం.

tip of the sugar cane అన్నాడు బ్రౌన్.

'సమాజం' అనబోయి 'సమజం' అన్నారనుకోండి. ప్రజా సమూహం కాస్తా 'పశువుల మంద' అయిపోతుంది.

'రామబాణం' అంటే మనకు తెలిసిన అర్ధమే కాదు. 'తాటాకు గ్రంధాలను తొలిచే పురుగు' అనే అర్ధం కూడా ఉంది. 

'శ్రీ' అంటే విషం అనే అర్ధం కూడా ఉందండోయ్.

'దస్తూరి' అంటే చేతిరాత అనే కాదు 'సుంకం' అని కూడా. (customary fee - బ్రౌన్)

ఒకాయన ఉదయాన్నే ఓ పండితుడి ఇంటికి వెళ్లి అతని కుమారుణ్ణి " మీ నాన్నగారున్నారా ? " అని అడిగాడట.

తండ్రికి తగ్గ ఆ కొడుకు "పెరట్లో పుష్పిక విముక్తికై నిష్టీవన కార్యక్రమంలో ఉన్నారు" అన్నాడట ఆ పెద్ద మనిషి అదేదో పూజా కార్యక్రమం అనుకుని వెళ్ళిపోయాడు పాపం. ఇంతకీ ఆ పండితుడు పళ్ళు తోముకుంటున్నాడు. పుష్పికం అంటే పళ్ళ పాచి ( దంత మలం అని శబ్దరత్నాకరం ) నిష్ఠివనం అంటే ఉమ్మేయడం.

ఒక మీటింగులో ఓ వక్త మాట్లాడుతూ "మన మంత్రిగారు సభాజనమును బాగా ఆకట్టుకుంటారు" అన్నాడట . 'సభాజనము' అంటే చుట్టాలను కౌగాలించుకుని సంతోష పెట్టడం (శబ్దరత్నాకరం).

సొంత విషయాలను పదేపదే చెబుతుంటే 'నీ సొద ఆపు’ అంటాం . విసుగెత్తించే ప్రసంగం అనే అర్ధం మాండలికాల్లో ఉంది కానీ "శవాన్ని కాల్చడానికి పేర్చిన కట్టెల పోగు " అనేది నిఘంటు అర్ధం.

ఫలానా రాజకీయ నాయకుడికి ప్రజలు 'బ్రహ్మరధం' పట్టారు అంటారు. గొప్ప సత్కారం అనే అర్ధమే తీసుకుంటాం. కానీ బ్రహ్మరథం అంటే 'చనిపోయిన సన్యాసులను తీసుకుపోయే వాహనం' అని సూర్యరాయాంధ్ర నిఘంటువు లో ఉంది.

' గ్రామీణ ప్రాంతం' అంటున్నాం. 'గ్రామీణ' అంటే వేశ్య అనే అర్ధం కూడా ఉంది.

గందానికి లేని ఒత్తు తగిలించి 'గంధం' అని రాస్తున్నాం.

'బోగి పండుగ' ను 'భోగి పండుగ' అనకపోతే మనకి పండగలా అనిపించదు.

గొడుగు అంటే తెలుసు. మరి 'గిడుగు' అంటే? కర్ర లేని గొడుగు.

పంగనామం అంటే తెలుసు మరి 'బుంగనామం' ఏమిటి ? తెల్ల నామానికి ఎర్ర నామానికీ ఎడము లేకుండా ఉండే నామం.

బాధితులకు నష్ట 'పరిహారం' ఇవ్వాలంటారు. 'పరిహారం' అంటే విడిచిపెట్టడం అనే అర్ధం కూడా ఉంది

'ఇలాగే ప్రయోగించండి' అని చెప్పడానికో, చర్చ కోసమో కాదు ఇది. ఆసక్తి ఉండాలే కానీ నిఘంటువులు తిరగేస్తే ఇలాంటి విశేషాలెన్నో చూడొచ్చని చెప్పడానికి.

 కొసమెరుపు... 

పేషెంట్: డాక్టర్ గారూ!
నా వయస్సు అరవయ్యేళ్ళు
నేనేమి తినాలి? ఏమి తినకూడదు చెప్పండి.
డాక్టర్: ఈ వయసులో మీరు 
ఏది పడితే అది తినకూడదు...
ఏది పడితే అది తినాలి...

 తెలుగా మజాకానా!

శనివారం, ఆగస్టు 29, 2026

బాలీవుడ్ లో నవ్వులు పంచిన తెలుగు వాడు !

తెలుగు ప్రాంతంలో పుట్టి...

ముంబైకి వలస వెళ్లి...

ఆర్థిక ఇబ్బందులు పడి...

రకరకాల  పనులు చేసి...

ఆఖరికి వెండితెరపై ఓ వెలుగు వెలగడం వెనుక... కేవలం విధి మాత్రమే ఉండదు. జీవితంలోని ప్రతి దశలోనూ ఉత్సాహాన్ని, ఉత్సుకతను వదలకుండా ముందుకు సాగే వ్యక్తిత్వం కూడా ఉంటుంది.

అలాంటి వ్యక్తిత్వం ఉన్నవాడే... జానీలీవర్.

బాలీవుడ్ సినిమాల్లో కమేడియన్ గా నవ్వులు పంచిన జానీ లీవర్ తెలుగు వాడేనని చాలా తక్కువ మందికే తెలుసు. ప్రకాశం జిల్లా కనిగిరి స్వస్థలం. అసలు పేరు జాన్ ప్రకాష్ రావ్ జనుముల. తండ్రి హిందూస్తాన్ లీవర్ లో కార్మికుడు.

కడుపు పట్టుకుని వలస వెళ్ళిపోయిన తండ్రి చిటికెన వేలు పుచ్చుకుని చిన్నప్పుడే ముంబై మహానగరం చేరాడు జానీ.   అక్కడ చదువు  7 వ తరగతి దాటలేదు. ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందులు... కుటుంబ పరిస్థితుల మధ్య రాటుదేలాడు.  దొరికిన పనల్లా చేశాడు. ట్రాఫిక్ ఆగినప్పుడల్లా వాహనాల దగ్గరకు పరిగెత్తుకు వెళ్లి పెన్నులు లాంటి వస్తువులు అమ్మడం లాంటి పనుల్లో కూడా అవకాశాలనే చూశాడు. ఆ పనులను కూడా ఉత్సాహంగా కొత్తగా చేయాలని ప్రయత్నం చేసేవాడు. బాలీవుడ్ సినిమాల్లో హీరోల గొంతును అనుకరిస్తూ, మిమిక్రీ చేస్తూ, హిందీ సినిమా పాటలకి డ్యాన్సులు చేస్తూ అమ్మేవాడు. సరదాగా చేసే ఆ పనుల్లోనే ‘సేల్స్ మన్ షిప్’ చూపించేవాడు.

ఒకసారి హిందూస్తాన్ లీవర్ కంపెనీలో ఏదో ఫంక్షన్ జరిగితే, అక్కడ పని చేసే ఉన్నత ఉద్యోగుల గొంతులను మిమిక్రీ చేసి కడుపుబ్బ నవ్వించాడు. దానితో జానీ పేరు పక్కన లీవర్ చేరిపోయింది.  అందిన పనిని ఇష్టంగా చేసే ఆ తత్వమే అతడికి అదే కంపెనీలో ఉద్యోగం వచ్చేలా చేసింది. ఓ పక్క ఉద్యోగం చేస్తుంటేనే అనుకరణ కళతో హాస్యం పండించే అవకాశాలు వచ్చాయి. ఆ అవకాశాలు అతడిని ఇండియాలోనే తొలి ‘స్టాండప్ కమేడియన్’ గా పేరు తెచ్చిపెట్టాయి. జానీ టైమింగ్, హావభావాలు, మిమిక్రీ ప్రతిభ చూసి అనేక కామెడీ షోలు  అతడి కోసం క్యూ కట్టాయి. దాంతో  ఉద్యోగానికి రాజీనామా చేసి, పూర్తి స్థాయి కమెడియన్ గా మారాడు జానీ లీవర్.

అలా ప్రదర్శనలు ఇస్తూ 1982 లో వరల్డ్ టూర్ కోసం బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ బృందం తో కలిసి కామెడీ షో చేసే ఛాన్స్ తలుపు తట్టింది. అది జానీలీవర్ జీవితాన్ని మలుపు తిప్పింది. వెండితెరపై తొలి అవకాశాన్ని అప్పటి నటుడు సునీల్ దత్ ‘దర్ధ్ కా రిస్తా’ లో ఇచ్చాడు. అయితే ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. ఈలోగా తన పని తాను చేసుకుంటూ తనలోని మిమిక్రీ, హాస్యాలను మేళవిస్తూ ‘హసీ కే హంగామా’ పేరుతో ఒక ఆడియో క్యాసెట్ విడుదల చేసాడు. ఆ క్యాసెట్ సూపర్ హిట్ అయింది. దేశ వ్యాప్తంగా ప్రతి ఇంటికి పరిచయం చేసింది. కామెడీ స్టార్ గా మార్చేసింది. ఒక ఛారిటీ షో లో ఆయన ప్రతిభను గమనించిన బాలీవుడ్ నిర్మాత గుల్ ఆనంద్ ‘జల్వా’ సినిమా లో అవకాశం ఇచ్చాడు. ఇక ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు జానీ లీవర్.

1990 లో షారుఖ్ ఖాన్ సూపర్ హిట్ సినిమా బాజీగర్’తో   స్టార్ కమెడియన్ అయిపోయాడు. అయినా కూడా తనకి ఇష్టమైన కామెడీ షో లని మాత్రం వదల్లేదు. ఫిల్మ్ ఫేర్ అవార్డుల సందర్భంగా 1999లో మైఖేల్ జాక్సన్ ని అనుకరిస్తూ జానీ లీవర్ చేసిన స్కిట్ ను ఇప్పటికీ తలుచుకుంటునే ఉంటారు హాస్య ప్రియులు.

మొత్తం 350 పైగా సినిమాల్లో నటించిన జానీ లీవర్,  చాలా భాషల్లో మాట్లాడగలడు కూడా. ముఖ్యంగా తెలుగు, కన్నడ, తమిళం, తుళు. తుళు, తమిళ భాషల్లో సినిమాలు కూడా చేసాడు. తెలుగులో మహేష్ బాబు  హీరో గా పరిచయమైన ‘రాజకుమారుడు’ సినిమాలో ఒక చిన్న పాత్రలో మెరిసాడు కూడా.

సినిమాలతో పాటు, టీవీ షో లు కూడా అనేకం చేసాడు.

జానీ లీవర్ భార్య సుజాత. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె. జానీ  సోదరుడు జిమ్మీ మోసెస్ కూడా హాస్య నటుడుగా, మిమిక్రీ కళాకారుడిగా రాణించాడు.

జానీ లీవర్ చివరిగా 2023 లో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఒక కామెడీ షో లో కనిపించాడు.

 

సోమవారం, ఆగస్టు 24, 2026

దక్షిణామూర్తి, ఇళైరాజాల బంధం... ఓ ఆదర్శం !


చెంబై వైద్యనాద్ భాగవతార్, ఏసుదాస్ గురుశిష్యుల బంధం గురించి చాలా మందికి తెలుసు. అలాంటిదే  వీ. దక్షిణామూర్తి - ఇళైయారాజా బంధం, అనుబంధం కూడా.

ఏసుదాస్, ఇళైరాజా... ఇద్దరూ చరిత్ర సృష్టించిన కళాకారులు. అందుకు తొలి దశల్లో వాళ్ల గురువులు అందించిన సహకారం చెప్పుకోదగ్గది.

ఇళైయరాజాకు తొలిదశ కర్ణాటక సంగీతం గురువు వీ. దక్షిణామూర్తి. ఆయన తమిళ బ్రాహ్మణులు. ఇళైయరాజా తమిళ సమాజంలో మాలగా పేర్కొనే వర్గం వాడు. ఇళైయరాజా కులాన్ని దక్షిణామూర్తి పరిగణనలోకి తీసుకోలేదు! ఇళైయరాజాలోని విద్యార్థిని పరిగణనలోకి తీసుకున్నారు. అతని లోని తపనను పరిగణించారు. తారతమ్యాలు చూపించకుండా ఎంతో చనువుగా ఇళైరాజాను చూసుకున్నారు.

ఇళైయరాజాను తన మంచం మీద కూర్చోబెట్టుకుని మరీ దక్షిణామూర్తి, ఎంతో ఆప్యాయంగా విద్య నేర్పించారు.  ఈ గురుశిష్యులిద్దరూ...సమాజంలోని కులవాద వికృత జీవులకు సరైన పాఠంగా నిలిచారు.

దక్షిణామూర్తిని మలయాళ, తమిళ సినిమా పరిశ్రమలు 'సామి' అని పిలుస్తాయి. ఇళైయరాజా కూడా సామి అనే పిలుస్తారు.

చెంబై వైద్యనాధ్ బాగవతార్, దక్షిణామూర్తి వంటి గురువుల శిష్యరికంలో ఏసుదాస్, ఇళైయరాజాలు కులమతాలకు అతీతంగా రాణించి అంతర్జాతీయ స్థాయి వ్యక్తులయ్యారు.

బ్రాహ్మణ్యం, దళితత్వం పుట్టుకతో రావు.

బ్రాహ్మణ డీఎన్ఏ, దళిత డీఎన్ఏ అని విడివిడిగా లేవు.

బ్రాహ్మణ్యం, దళితత్వం అన్నవి స్థితులు. కొందరు తమ మనస్తత్వ రీత్యా, తమ జీవన విధానంవల్లా ఆ స్థితుల వాళ్లయ్యారు.

ఇవాళ ఏసుదాస్, ఇళైయరాజాలది ఓ  గొప్ప చరిత్ర.

కులం, మతం ఒక మనిషిని ఉన్నతుణ్ణి చెయ్యవు. అతడి తపన, పట్టుదల, వినయం, విద్య పట్ల ఉన్న అనురక్తి... ఇవే ఎవరినైనా గొప్పవాళ్లను చేస్తాయి.

 

గురువారం, ఆగస్టు 20, 2026

కేవీ రెడ్డి అరిస్తే ‘ష్.. గప్‌చుప్’!

క్రమశిక్షణకు ప్రాణమిచ్చే దర్శకుల్లో కె.వి. రెడ్డి ఒకరు. ‘మాయాబజార్’ లాంటి గొప్ప సినిమాను తెలుగు చలన చిత్రసీమకు అందించిన ఆయన ముందు అలనాటి ఏఎన్నార్, ఎన్టీఆర్ కూడా చేతులు కట్టుకుని ఉండేవాళ్లు. సెట్టింగులోకి వచ్చారంటే ఒక పూజ చేస్తున్నంత శ్రద్ధగా పని చేసేవారాయన. పని మొదలు పెట్టాక ఎలాంటి అనవసరపు శబ్దాలు
ఆయనకు వినబడకూడదు. అంతా నిశ్శబ్దంగా సాగిపోవాలి. ఈ విషయంలో నిర్మాతలను సైతం ఆయన లెక్క చేసేవారు కారు. ఓసారి ‘మాయా బజార్’ షూటింగులో అదే జరిగింది. సెట్ లో కేవీ రెడ్డి స్క్రిప్ట్ చూసుకుంటూ పాత్ర దారుల చేత రిహార్సల్స్
చేయిస్తున్నారు . ఓ మూలగా నిర్మాతలైన  నాగి రెడ్డి , చక్రపాణి ఉన్నారు. వాళ్లు ఎవరి గురించో మాట్లాడుకున్తున్నారు. కేవీ రెడ్డి అది గమనించి వారి కేసి ఓసారి సీరియస్ గా చూశారు. అయినా వాళ్లది గమనించలేదు. వాళ్లు మాట్లాడుకోవడం ఆపకపోవడంతో కేవీరెడ్డి ఎలాంటి మొహమాటం లేకుండా గొంతు పెంచి,  "ఉడ్ యూ ప్లీజ్ అవుట్ ..." అన్నారు. సెట్ లో వాళ్లంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారట. వెంటనే నాగిరెడ్డి , చక్రపాణి లేచి నిశ్శబ్దంగా బయటకు వెళ్లిపోయారట.

ఇంకో సందర్భంలో సెట్ బయట ఏఎన్నార్, ఎన్టీఆర్, గుమ్మడి, నాగి రెడ్డి, చక్రపాణి  కూర్చుని ఉన్నారు. ఏయన్నార్ ఏదో జోక్ వేయగానే అందరూ గొల్లుమని నవ్వారు. వెంటనే లోపల నుంచి కేవీ రెడ్డి అరుపు వివిపించింద. అంతే... అందరూ సైలెంట్. ఇలాంటి క్రమశిక్షణను ఈనాటి చిత్ర సీమలో ఊహించగలమా?