ఆహ్లాదం
అక్షరాల సీమలో నా ప్రయాణం
శుక్రవారం, ఆగస్టు 07, 2026
అంతరిక్షంలో అన్నదమ్ముల అద్భుత ప్రయాణం!
భూమి మీద నుంచి 50 ఏళ్ల క్రితం ఇద్దరు అన్నదమ్ములు చెరో దారిలో అంతరిక్షంలోకి బయల్దేరారు. అప్పటి నుంచి ఒక్క క్షణం కూడా ఆగకుండా, విసుగూ విరామం లేకుండా ప్రయాణిస్తూనే ఉన్నారు. వాళ్లలా ఇప్పటికి ఏకంగా 2500 కోట్ల కిలోమీటర్ల దూరం వెళ్లిపోయారు. అంతేకాదు... అంత దూరం నుంచి కూడా భూమికి ఎంతో విలువైన సమాచారాన్ని పంపుతూనే ఉన్నారు.
ఇంతకీ ఆ అపూర్వమైన అన్నదమ్ములు ఎవరో తెలుసా?
వాయేజర్-1, వాయేజర్-2.
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా వీళ్లని తయారు చేసింది. 1977లో వీళ్లని అంతరిక్షంలోకి ప్రయోగించింది.
అన్నదమ్ముల్లాంటి ఈ అంతరిక్ష పరికరాలు (స్పేస్ ప్రోబ్స్) ఇప్పుడు ఎలాంటి ఘనతను సాధించాయో తెలుసా?
మానవులు ప్రయోగించిన ఓ పరికరం ఏనాడూ వెళ్లనంత దూరానికి ఇవి చేరుకున్నాయి.
ఆ దూరం 2500 కోట్ల కిలోమీటర్లకు పైమాటే.
అదెంత దూరమో అర్థం కావాలంటే అసలు మన సౌర వ్యవస్థ గురించి తెలుసుకోవాలి. సూర్యుడు, సూర్యుడి చుట్టూ తిరిగే గ్రహాలను కలిపి సూర్యకుటుంబం అంటారు కదా?
సూర్యుడి నుండి నిరంతరం వెలువడే సౌర పవనాలు (solar winds), అయస్కాంత క్షేత్రం (magnetic field) కలిసి అంతరిక్షంలో ఏర్పరిచే ఒక భారీ 'బుడగ' లాంటి రక్షిత ప్రాంతాన్ని హెలియో స్పియర్ అంటారు. గెలాక్సీలోని ఇతర నక్షత్రాల విస్ఫోటనాల నుండి వచ్చే ప్రమాదకరమైన కాస్మిక్ కిరణాల (cosmic rays) నుండి ఇది మన సౌర వ్యవస్థ లోపలి గ్రహాలను రక్షిస్తుంది.
ఈ హెలియో స్పియర్ వెలుపలి సరిహద్దు (outer boundary)ను హెలియో పాజ్ అంటారు. ఈ ప్రాంతంలో సూర్యుడి నుండి వచ్చే సౌర పవనాలు తమ వేగాన్ని కోల్పోయి, నక్షత్రాల మధ్య ఉండే వాయువులు, ధూళితో (interstellar medium) ఢీకొంటాయి.
నాసా ప్రయోగించిన వాయేజర్ 1, వాయేజర్ 2 వ్యోమనౌకలు ఈ సరిహద్దును దాటి పోయాయి. వాయేజర్ 1 ఆగస్టు 2012లో, వాయేజర్ 2 నవంబర్ 2018లో 'హీలియోస్పియర్' దాటిపోయి రికార్డు సృష్టించాయి.
ఇక అక్కడి నుంచి మొదలయ్యే ప్రాంతాన్ని నక్షత్రాంతర రోదసి (interstellar space) అంటారు.
అద్భుత ఆవిష్కరణ...
అక్కడ అవి చేసిన ఒక అద్భుతమైన ఆవిష్కరణ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది.
సౌర వ్యవస్థ చివర భాగంలో ఉన్న హెలియోపాజ్ ప్రాంతంలో ప్లాస్మా ఉష్ణోగ్రతలు 54,000 నుంచి 90,000 డిగ్రీల ఫారెన్హీట్ వరకు నమోదయ్యాయి. అందుకే ఈ ప్రాంతాన్ని చాలామంది "అగ్ని గోడ" (Wall of Fire) అని పిలుస్తారు.
ఇంతటి భయంకరమైన వేడిలో కూడా వాయేజర్ నౌకలు ఎలా సురక్షితంగా ప్రయాణించాయి?
దీనికి కారణం అక్కడి పదార్థ సాంద్రత చాలా తక్కువగా ఉండటమే. అక్కడ కణాల సంఖ్య చాలా స్వల్పంగా ఉండటంతో, అవి అంతరిక్ష నౌకకు వేడిని బదిలీ చేయలేకపోయాయి. అంటే ఉష్ణోగ్రత చాలా ఎక్కువైనా, వేడి ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. ఎలాగంటే... మనం వేడిగా ఉన్న ఓవెన్లో గాలిలో చేయి కొద్దిసేపు ఉంచినా ఏమీ కాదు. కానీ ఓవెన్ లో వేడెక్కిన ఇనుప పాత్రను తాకితే మాత్రం వెంటనే కాలుతుంది కదా? అలాగన్నమాట.
ఈ మిషన్ మరో ఆసక్తికరమైన విషయాన్ని కూడా వెల్లడించింది. సౌర వ్యవస్థ అంచు ఒక స్థిరమైన సరిహద్దు కాదు. అది సూర్యుని కార్యకలాపాలను బట్టి విస్తరిస్తూ, కుంచించుకుంటూ ఉండే సరిహద్దు. అందుకే వోయేజర్-1, వోయేజర్-2 రెండూ సూర్యుని నుండి వేర్వేరు దూరాల్లో హెలియోపాజ్ను దాటాయి.
ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, హెలియోస్ఫియర్ వెలుపల ఉన్న అయస్కాంత క్షేత్రం, లోపల ఉన్న అయస్కాంత క్షేత్రం దాదాపు ఒకే దిశలో ఉంది. ఇది శాస్త్రవేత్తలను విస్మయానికి గురిచేస్తోంది.
మొత్తం మీద వాయేజర్ సోదరులు దాదాపు 50 సంవత్సరాల తర్వాత కూడా పనిచేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ అమూల్యమైన సమాచారాన్ని భూమికి పంపుతూ, విశ్వ రహస్యాలను ఒక్కొక్కటిగా వెలికితీస్తున్నారు.
మరి ఈ ప్రయోగం ఉద్దేశ్యం ఏమిటి?
వాయేజర్ స్పేస్ ప్రోబ్స్ ను అంతరిక్షంలోకి పంపడం వెనుక ఓ లక్ష్యం ఉంది. అంతుపట్టని ఈ విశ్వంలో ఎక్కడైనా మనలాంటి గ్రహాంతర వాసులు ఉంటే వాళ్లకి మన ఉనికి, మన భూమి గురించి తెలియజేయాలనే. అందుకే వీటిలో ప్రఖ్యాత శాస్త్రవేత్త కార్ల్ సాగన్ ఆధ్వర్యంలో ఒక గోల్డెన్ రికార్డును అమర్చారు. ఇందులో భూమిపై ఉన్న విభిన్న శబ్దాలు (గాలి, ఉరుములు, పక్షులు, జంతువుల అరుపులు), సంగీతం, సంస్కృతుల చిత్రాలతో పాటు, గ్రహాంతర వాసుల కోసం 55 ప్రపంచ భాషలలో శుభాకాంక్షలు రికార్డ్ చేశారు. ఇందులో 55 భాషల్లో శుభాకాంక్షలు ఉన్నాయి. ఈ భాషల్లో తెలుగు కూడా ఉంది. ‘‘తెలుగు మాట్లాడే ప్రజల నుంచి మా శుభాకాంక్షలు’’ అని అందులో ఉంటుంది.
గురువారం, ఆగస్టు 06, 2026
దెయ్యాల గ్రామం... భయాలు, నిజాలు!
దెయ్యాల గురించి వినాలంటే అందరూ రెడీ. కానీ చూడ్డానికి మాత్రం హడల్. అందుకనే చిన్న పిల్లల కథల నుంచి హాలీవుడ్ సినిమాల వరకు దెయ్యం కథలు బోలెడు. కానీ మన దేశంలో ఓ గ్రామానికి గ్రామం ‘దెయ్యాల గ్రామం’గా పేరు పొందిందని మీకు తెలుసా? దాన్ని ‘హాంటెడ్ విలేజ్ ఆఫ్ ఇండియా’గా పిలుస్తారు. ఆ గ్రామం మీద కొందరు పరిశోధకులు ఆధునిక సాంకేతిక పరికరాలతో పరిశోధన కూడా చేశారు. ఆ గ్రామంలోని కొన్ని వింతల గురించి అధికారికంగా చెప్పారు కూడా. మరి ఆ గ్రామం ఏమటో, ఎక్కడుందో తెలుసుకుందామా?
ఆ గ్రామం పేరు ‘కుల్ధారా’. రాజస్థాన్ లోని జైసల్మేర్ కు 18 కిలోమీటర్ల దూరంలో ఉంది. గ్రామమంతా పాడబడిపోయి ఉంటుంది. ఇళ్లన్నీ ఖాళీగా కనిపిస్తాయి.
ఆ గ్రామం భారత ఆర్కియలాజికల్ సొసైటీ ఆధీనంలో ఉంది. ప్రభుత్వం దాన్ని ఓ పర్యటక ప్రదేశంగా మార్చింది. అయితే రాత్రి వేళ మాత్రం ఆ గ్రామంలోకి ప్రవేశం నిషేధం. ప్రధాన ద్వారాలకు తాళాలు కూడా వేసేస్తారు.
- ఆ గ్రామం చరిత్ర ఏంటి?
ఈ గ్రామాన్ని 13వ శతాబ్దంలో 'పాలివాల్ బ్రాహ్మణులు' (Paliwal Brahmins) స్థాపించారు. వారు వ్యవసాయం, వ్యాపారంలో చాలా నైపుణ్యం కలిగినవారు. ఆ కాలంలో కుల్ధారా దాదాపు 84 గ్రామాలతో కూడిన చాలా సంపన్నమైన ప్రాంతం. 19వ శతాబ్దం (సుమారు 1825) ఆరంభంలో జైసల్మేర్ రాజ్యానికి 'సలీం సింగ్' అనే క్రూరమైన, అవినీతిపరుడైన దీవాన్ ఉండేవాడు. అతని కన్ను కుల్ధారా గ్రామ పెద్ద అందమైన కుమార్తెపై పడింది. ఆమెను తనకిచ్చి పెళ్లి చేయమని అడిగాడు. అయితే అప్పటికే ఆ అమ్మాయి పెళ్లి కుదరడంతో గ్రామ పెద్ద అందుకు అంగీకరించలేదు. దాంతో ఆమెను బలవంతంగా పెళ్లి చేసుకోవాలని సలీం సింగ్ నిర్ణయించుకున్నాడు. తన కోరిక తీర్చకపోతే పౌర్ణమి నాటికి గ్రామంపై దాడి చేస్తానని, భారీ పన్నులు విధిస్తానని గ్రామస్తులను సలీంసింగ్ బెదిరించాడు.
తమ కుమార్తెను, గ్రామ గౌరవాన్ని కాపాడుకోవడానికి కుల్ధారా గ్రామ ప్రజలు ఒక సభ ఏర్పాటు చేశారు. అందరూ కలిసి ఓ నిర్ణయం తీసుకున్నారు. చీకటి పడగానే, ఆ 84 గ్రామాలలోని వేలాది మంది పాలివాల్ బ్రాహ్మణులు తమ ఇళ్లను, ఆస్తులను, పశువులను వదిలిపెట్టి ఎవరికీ తెలియకుండా రాత్రికి రాత్రే మాయమయ్యారు. వారు ఎక్కడికి వెళ్లారో ఇప్పటికీ ఒక రహస్యమే.
వారు వెళ్లేముందు ఆక్రోశంతో "ఇకపై ఇక్కడ ఎవరూ స్థిరపడలేరు, ఈ గ్రామం ఎప్పటికీ పాడుబడే ఉంటుంది" అని తీవ్రమైన శాపం పెట్టారని స్థానికులు చెబుతారు.
- దెయ్యాల గ్రామంగా ఎలా మారింది?
అప్పటి నుండి ఇప్పటి వరకు అక్కడ ఎవరూ నివసించలేకపోయారు. అక్కడ నివసించడానికి ప్రయత్నించిన వారు అనేక ఇబ్బందులకు గురయ్యారని, మరణాలు ఎదుర్కొన్నారని స్థానికులు కథలు కథలుగా చెబుతుంటారు.
- పరిశోధన ఏం చెప్పింది?
కుల్ధారా గ్రామంలో ఉన్న అదృశ్య శక్తుల గురించి తెలుసుకోవడానికి భారతదేశంలోనే అత్యంత ప్రముఖమైన పారానార్మల్ బృందం ఒక సమగ్రమైన పరిశోధన చేసింది. 2013 మే నెలలో ఢిల్లీకి చెందిన 'ఇండియన్ పారానార్మల్ సొసైటీ' (Indian Paranormal Society) కి చెందిన సుమారు 30 మంది సభ్యుల బృందం కుల్ధారా గ్రామాన్ని సందర్శించింది. ఈ బృందానికి ప్రముఖ పారానార్మల్ పరిశోధకుడు, దివంగత గౌరవ్ తివారీ (Gaurav Tiwari) నాయకత్వం వహించారు.
ఈ బృందం ప్రత్యేక అనుమతి తీసుకుని రాత్రిపూట చీకటి పడిన తర్వాత మొదలుకుని ఉదయం వరకు ఆ పాడుబడిన గ్రామంలోనే బస చేసింది.
వారు కేవలం నమ్మకాలపై ఆధారపడకుండా, శాస్త్రీయ పద్ధతిలో అత్యాధునిక పరికరాలను ఉపయోగించి పరిశోధన చేశారు. వాతావరణంలోని విద్యుదయస్కాంత క్షేత్రాల్లో వచ్చే ఆకస్మిక మార్పులను గుర్తించడానికి EMF మీటర్లు (Electromagnetic Field Meters) ఉపయోగించారు. దెయ్యాలు లేదా అదృశ్య శక్తులు ఉన్నప్పుడు ఈ తరంగాలు మారుతాయని నమ్ముతారు. అలాగే సాధారణంగా మనుషులు వినలేని అతి సూక్ష్మమైన శబ్దాలను వినడానికి EVP రికార్డర్లు (Electronic Voice Phenomenon Recorders) సాయంతో శబ్దాలను రికార్డు చేశారు.
ఇంకా పరిసరాల ఉష్ణోగ్రతల్లో అకస్మాత్తుగా వచ్చే హెచ్చుతగ్గులను కొలవడానికి లేజర్ థర్మామీటర్లు (Laser Thermometers) వాడారు. అలాగే కంటికి కనిపించని కదలికలను, నీడలను చీకట్లో కూడా రికార్డు చేయగలిగే ‘మోషన్ సెన్సార్లు, నైట్ విజన్ కెమెరాలు’ తీసుకొచ్చి గ్రామంలో అమర్చారు.
- పరిశోధనలో ఏమి గమనించారు?
ఆ రాత్రి వారు గ్రామంలో గడిపిన సమయంలో అనేక భయానక, వింతైన సంఘటనలను నమోదు చేశారు.
· ఉష్ణోగ్రతలో మార్పులు: చుట్టుపక్కల వాతావరణం వేడిగా ఉన్నప్పటికీ, గ్రామంలోని కొన్ని పాడుబడిన ఇళ్ల దగ్గర ఉష్ణోగ్రత అకస్మాత్తుగా పడిపోయి చాలా చలిగా అనిపించినట్లు మీటర్లలో రికార్డ్ అయింది.
· వింత శబ్దాలు, గుసగుసలు: వారి EVP రికార్డర్లలో ఎవరో గుసగుసలాడుతున్నట్లు, అస్పష్టమైన గొంతులు, ముఖ్యంగా పిల్లలు ఏడుస్తున్నట్లు, మాట్లాడుకుంటున్నట్లు శబ్దాలు రికార్డ్ అయ్యాయి.
· నీడలు కదలడం: నైట్ విజన్ కెమెరాలలో కొన్ని ఇళ్ల గోడల వెనుక, వీధుల్లో చీకటి ఆకారాలు (Shadow entities) కదులుతున్నట్లు వారు స్పష్టంగా గమనించారు.
· భౌతిక స్పర్శ: బృందంలోని కొందరు సభ్యులు తమ భుజాలపై ఎవరో చెయ్యి వేసినట్లు, తమను ఎవరో తాకినట్లు అనుభూతి చెందారు.
· వాహనాలపై గుర్తులు: అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మరుసటి రోజు ఉదయం వారు గ్రామం బయట పార్క్ చేసిన తమ కార్ల అద్దాలపై పిల్లల చేతి ముద్రలు, గీతలు ఉండటాన్ని గమనించారు.
ఈ పరిశోధనలన్నింటి ఆధారంగా, కుల్ధారా గ్రామంలో కేవలం మూఢనమ్మకాలు మాత్రమే కాదని, అక్కడ కచ్చితంగా కొన్ని ప్రతికూల శక్తులు (Negative or Paranormal energies) సంచరిస్తున్నాయని ఇండియన్ పారానార్మల్ సొసైటీ అధికారికంగా నిర్ధారించింది.
- ప్రస్తుత పరిస్థితి...
ప్రస్తుతం కుల్ధారా గ్రామాన్ని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) ఒక పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేసింది. పగటిపూట పర్యాటకులు ఈ పాడుబడిన ఇళ్లను, వీధులను మరియు శిథిలమైన దేవాలయాన్ని సందర్శించవచ్చు. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా సూర్యాస్తమయం తర్వాత ఇక్కడికి వెళ్లడానికి ఎవరికీ అనుమతి లేదు. ప్రధాన ద్వారాలకు తాళాలు వేస్తారు.





