గురువారం, జులై 23, 2026

జాతీయ స్థాయిలో ఓ గొప్ప పాట... అవార్డు వద్దన్న గీత రచయిత



 మరణం అనివార్యమే. కానీ అది ముందుగానే వచ్చి ఇంటి తలుపు తడితే  బాధాకరం. బాధ్యతలు తీరకుండానే, బంధాలు తెంచుకోమంటే విషాదం. కొన్ని రోజులకు మించి తనకు బతుకు లేదని తెలియడం కన్నా, ఆ సంగతి అర్థం కాని పసిపిల్లల గురించి ఆలోచించాల్సి రావడం ఘోరం. అందుకే ‘మాతృదేవోభవ’ సినిమా ఎన్నాళ్లయినా ప్రేక్షకుల మనసుల్ని మెలిపెడుతూనే ఉంటుంది. అందులో సన్నివేశాలు, పాటల్ని ఎప్పుడు తల్చుకున్నా తెలియకుండానే ఓ నిట్టూర్పు  గుండెల్ని తడిమిపోతుంది.

ఆ సినిమాలో ‘‘రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే?’ అనే పాట... మరణాన్ని విశ్లేషిస్తుంది. బతుకును ప్రశ్నిస్తుంది. జీవిత సత్యాన్ని ఆవిష్కరిస్తుంది. 

రాలిపోయె పువ్వా నీకు రాగాలెందుకే

చిత్రం : మాతృదేవోభవ (1993)

సంగీతం : యం యం కీరవాణి

గీతరచన : వేటూరి

గానం : యం యం కీరవాణి 

:పల్లవి:


రాలిపోయె పువ్వా నీకు రాగాలెందుకే.. తోటమాలి నీ తోడులేడులే

వాలిపోయె పొద్దా నీకు వర్ణాలెందుకే.. లోకమెన్నడో చీకటాయెలే

నీకిది తెలవారని రేయమ్మా.... కలికీ మా చిలకా పాడకు నిన్నటి నీ రాగం..

 

రాలిపోయె పువ్వా నీకు రాగాలెందుకే.. తోటమాలి నీ తోడులేడులే

వాలిపోయె పొద్దా నీకు వర్ణాలెందుకే... లోకమెన్నడో చీకటాయెలే 

చరణం :1:

చెదిరింది నీ గూడు గాలిగా

చిలకా గోరింకమ్మ గాధగా...

చిన్నారి రూపాలు కన్నీటి దీపాలు కాగా......

తనవాడు తారల్లో చేరగా...

మనసు మాంగళ్యాలు జారగా..

సింధూర వర్ణాలు తెల్లారి చల్లారి పోగా...

తిరిగే భూమాతవు నీవై..

వేకువలో వెన్నెలవై..

కరిగే కర్పూరము నీవై.. ఆశలకే హరతివై .. 

రాలిపోయె పువ్వా నీకు రాగాలెందుకే.. తోటమాలి నీ తోడులేడులే

వాలిపోయె పొద్దా నీకు వర్ణాలెందుకే... 


చరణం :2: 

అనుబంధమంటేనె అప్పులే..

కరిగే బంధాలన్నీ మబ్బులే..

హేమంత రాగల చేమంతులే వాడిపోయే...

తన రంగు మార్చింది రక్తమే..

తనతో రాలేనంది పాశమే..

దీపాల పండక్కి దీపాలె కొండెక్కి పొయే...

పగిలే ఆకాశం నీవై... జారిపడే జాబిలివై..

మిగిలే ఆలాపన నీవై... తీగ తెగే వీణియవై... 

రాలిపోయె పువ్వా నీకు రాగాలెందుకే.. తోటమాలి నీ తోడులేడులే..

వాలిపోయె పొద్దా నీకు వర్ణాలెందుకే... లోకమెన్నడో చీకటాయెలే

 

మరణం అంచున ఉన్న ఒక తల్లి వేదన పాటలోని ప్రతి పదంలో ప్రతిధ్వినిస్తుంది. జీవితంలోని అనిశ్చితిని ఈ పాట హృదయవిదారకంగా వర్ణిస్తుంది.

వేటూరికి జాతీయ అవార్డు: తెలుగు పాటకు వన్నెతెచ్చిన దిగ్గజ గీత రచయిత వేటూరి సుందరరామమూర్తికి ఈ పాట జాతీయ పురస్కారాన్ని తెచ్చిపెట్టింది.  అయితే ఆయన ఆ అవార్డును తిరస్కరించారని చాలా తక్కువ మందికే తెలుసు. అందకు ఆయన చెప్పిన కారణం... “తెలుగు భాషకు ప్రాచీన హోదా కల్పించలేదు” అనేది. ఈ విషయాన్ని సినిమా దర్శకుడు కె. అజయ్ కుమార్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అప్పట్లో ఆయన... ‘‘ఇది కేవలం నాకు వచ్చిన వ్యక్తిగత అవార్డు. నేను ఎంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. నాకు ఒక్కడి కోసం కాదు..  మన జాతి, మన భాష కోసం” అని ఆయన వ్యాఖ్యానించారని గుర్తు చేసుకున్నారు. తెలుగు భాషాభిమానం, ఆత్మగౌరవం విషయంలో వేటూరి నిబద్ధతను ఇది తెలియజేస్తుంది.  

సినిమా విజయం: కే.ఎస్. రామారావు (క్రియేటివ్ కమర్షియల్స్) నిర్మించిన ఈ సినిమాలోని పాటలన్నీ (వేణువై వచ్చాను, కన్నీటి కాలువలు) బాగా ప్రాచుర్యం పొందినవే.  సినిమా చూస్తున్నప్పుడు థియేటర్లలో ప్రేక్షకులు ఏడ్చేవారు.

మాతృదేవోభవ సినిమా నిర్మాణ వ్యయం 1993లో కేవలం 30 లక్షలు మాత్రమే. ఆ రోజుల్లో ఇది చాలా తక్కువ మొత్తం. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధించి, దాదాపు 7 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది.

సినిమాలోని భావోద్వేగాలు, కథాంశం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.  నేపథ్యం: మాతృదేవోభవ చిత్రం మలయాళంలో హిట్టయిన 'ఆకాశదూతు' చిత్రానికి రీమేక్. బ్లడ్ క్యాన్సర్ బారిన పడి తన రోజులు దగ్గరపడ్డాయని తెలుసుకున్న తల్లి (మాధవి), తన మరణానంతరం తన నలుగురు బిడ్డలు అనాథలు కాకూడదని వారిని వేరే కుటుంబాలకు దత్తత ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ఆ క్రమంలో ఆమె పడే మానసిక సంఘర్షణకు అద్దం పడుతూ సినిమా సాగుతుంది. 


 

విష్ణువు శయనం... విశ్వానికి అభయం