బుధవారం, జూన్ 24, 2026

కొండను తొలిచిన సా‘మాన్యుడు’!




కళ్ల ముందే భార్య చనిపోయింది...

కన్నీరుమున్నీరయ్యాడు...

ఆ బాధ నుంచి తేరుకుని తన బతుకేదో తాను చూసుకుని  ఉంటే అతడి గురించి చెప్పుకోవలసిన పనే లేదు...

కానీ అతడలా చేయలేదు...

తన భార్యలాగా తన ఊళ్లో మరెవరూ చనిపోకూడదనుకున్నాడు...

ఒక సుత్తి, ఒక ఉలి తీసుకుని ఆ ఊరికి అడ్డంగా ఉన్న కొండను తొలవడం మొదలు పెట్టాడు...

ఉదయం నుంచి సాయంత్రం వరకు అదే పని...

రోజులు గడిచాయి...

నెలలు మారాయి...

సంవత్సరాలు దొర్లాయి...

అతడిది మాత్రం ఒకటే పని...

ఎండ...

వాన...

చలి...

పని ఆపలేదతడు...

అలా ఏకంగా 20 ఏళ్లు!

మొదట్లో అతడిని చాలా మంది పిచ్చివాడన్నారు...

ఆ తర్వాత పట్టించుకోవడం మానేశారు...

అర్థం చేసుకున్న కొందరు మాత్రం చేతనైన సాయం చేశారు...

భార్య పోయిన బాధ లోంచి, ఊరికి ఉపకారం చేసే అతడి సంకల్పానికి, వెనుదిరగని అతడి పట్టుదలకి ఆ కొండ తలవంచింది! దారిచ్చింది!!

అతడి పేరు దశరథ్ మాంఝీ...

‘ద మౌంటైన్ మ్యాన్’!

ఏమిటతడి కథ?...

బీహార్ రాష్ట్రంలోని ఒక చిన్న గ్రామం గెహ్లౌర్...

ఆ ఊరి చుట్టూ భారీ కొండలు...

ఊర్లో వాళ్లు ఆసుపత్రికి వెళ్లాలన్నా...

మార్కెట్‌కు వెళ్లాలన్నా...

పాఠశాలకు వెళ్లాలన్నా...

ఆ కొండ చుట్టూ తిరిగి వెళ్లాల్సిందే...

దాదాపు 55 కిలోమీటర్లు...

ఆ ఊరివాడే దశరథ్ మాంఝీ...

నిరు పేద కూలీ...

రోజూ కష్టపడితేనే కుటుంబానికి భోజనం...

అతడి భార్య ఫల్గుణీ దేవి...

ఒక రోజు ఆమె భర్తకు భోజనం తీసుకెళ్లడానికి కొండ ఎక్కుతూ వెళ్తోంది...

అనుకోకుండా జారి కిందపడింది...

తీవ్రంగా గాయపడింది...

ఆసుపత్రికి తీసుకెళ్లాలి...

కానీ మధ్యలో పెద్ద కొండ...

రోడ్డు లేదు...

సమయానికి వైద్యం అందలేదు...

ఆమె మరణించింది...

దశరథ్ మాంఝీ గుండె పగిలిపోయింది...

భార్యను కోల్పోయిన బాధ ఒకవైపు...

తన గ్రామ ప్రజలు కూడా ఇదే కష్టాన్ని అనుభవిస్తున్నారనే ఆలోచన మరోవైపు...

అప్పుడు అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు...

"ఈ కొండే నా భార్యను నాకు దూరం చేసింది...దీన్ని తొలిచేస్తాను...’’

జనం నవ్వారు...

పట్టించుకోలేదతడు...

ఒక సుత్తి, ఒక ఉలి కొనుక్కున్నాడు...

అనుకున్న పని మొదలుపెట్టాడు!

అలా 22 ఏళ్లు గడిచాయి...

అందరూ అసాధ్యం అన్న పనిని అతడు సాధ్యం చేశాడు!

కొండలోంచి 360 అడుగుల పొడవు...

30 అడుగుల వెడల్పు...

25 అడుగుల లోతు గల మార్గాన్ని సృష్టించాడు!

ఒకప్పుడు 55 కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సిన దూరాన్ని, కేవలం 15 కిలోమీటర్లకు తగ్గించాడు!! 

-   ఇవిగివిగో అతడి వివరాలు... 

దశరథ్ మాంఝీ బీహార్‌లోని గయ సమీపంలో ఉన్న గెహ్లౌర్ అనే గ్రామంలో పేద దళిత కుటుంబంలో 1934లో పుట్టాడు. అక్కడే పెరిగాడు. పెళ్లి చేసుకున్నాడు. భార్య చనిపోయాక 1960 నుండి 1982 వరకు దాదాపు 22 సంవత్సరాల పాటు ఒంటరిగా కొండను తొలిచాడు.

అతడు చేసిన ఈ అద్భుతాన్ని గుర్తించి బీహార్ ప్రభుత్వం గౌరవించింది. 2007లో ఆయన క్యాన్సర్‌తో మరణించినప్పుడు, బీహార్ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది.

 

  • ఆయన జీవిత కథ ఆధారంగా బాలీవుడ్ దర్శకుడు కేతన్ మెహతా "Manjhi - The Mountain Man" (2015) అనే సినిమాను రూపొందించారు. ఇందులో నవాజుద్దీన్ సిద్దికీ, దశరథ్ మాంఝీ పాత్రలో అద్భుతంగా నటించారు.
  • ప్రముఖ నటుడు అమీర్ ఖాన్ తన "సత్యమేవ జయతే" టీవీ షో మొదటి ఎపిసోడ్‌ను దశరథ్ మాంఝీ జీవితానికే అంకితం చేశారు.
  • ఓ శిలా విగ్రహం, ఓ పోస్టల్ స్టాంపు అతడి పట్టుదలకు జోహార్లు చెబుతాయి.
  • అతడి గురించి తెలిశాక మనలో కలిగే స్ఫూర్తి... ఎప్పటికీ ఆరిపోని జ్యోతి.

 

సోమవారం, జూన్ 22, 2026

తర్కమా? వివేకమా?



 ఒక ఇరవై ఐదేళ్ల యువకుడు ఒక ప్రముఖ గురువుగారి తలుపు తట్టి, “నేను మీ దగ్గరకు వేదాలు నేర్చుకోవడానికి వచ్చాను” అని చెప్పాడు.
​గురువుగారు అతనిని చూసి, “నీకు సంస్కృతం వచ్చా?” అని అడిగారు.
​“రాదు” అని సమాధానం ఇచ్చాడు ఆ యువకుడు.
​“పోనీ, భారతీయ తత్వశాస్త్రం (ఫిలాసఫీ) ఏమైనా చదివావా?”
​“లేదు. కానీ మీరేం కంగారు పడకండి. నేను ఇప్పుడే హార్వర్డ్ యూనివర్సిటీలో ‘లాజిక్’ (తర్కశాస్త్రం) మీద నా పీహెచ్‌డీ పూర్తి చేశాను. నా చదువుని పరిపూర్ణం చేసుకోవడం కోసం ఈ వేదాలను కూడా కొద్దిగా చదువుదామని వచ్చాను.”
​అప్పుడు గురువుగారు, “నువ్వు వేదాలు చదవడానికి ఇంకా సిద్ధంగా లేవని నా అనుమానం. ఎందుకంటే అది ప్రపంచంలోనే అత్యంత లోతైన జ్ఞానం. కానీ, నీకు ఇష్టమైతే నేను తర్కశాస్త్రంలో ఒక చిన్న పరీక్ష పెడతాను. అందులో నువ్వు పాస్ అయితే, నీకు వేదాలు నేర్పిస్తాను” అన్నారు.
​ఆ యువకుడు సరేనన్నాడు.

​గురువుగారు తన రెండు వేళ్లు పైకెత్తి ఇలా అడిగారు: “ఇద్దరు వ్యక్తులు ఒక పొగగొట్టం (చిమ్నీ) గుండా కిందకు దిగారు. అందులో ఒకరి ముఖం శుభ్రంగా ఉంది, మరొకరి ముఖం మసిగా (నల్లగా) అయిపోయింది. ఇప్పుడు వీరిద్దరిలో ఎవరు ముఖం కడుక్కుంటారు?”
​ఆ యువకుడు గురువుగారి వైపు ఆశ్చర్యంగా చూస్తూ, “నిజంగా ఇదేనా తర్కశాస్త్ర పరీక్ష?” అని అడిగాడు.
​గురువుగారు అవునన్నట్లు తలూపారు.
​యువకుడు పూర్తి నమ్మకంతో, “ముఖం మురికిగా ఉన్నవాడే కడుక్కుంటాడు” అని చెప్పాడు.
​“తప్పు!” అన్నారు గురువుగారు. “లాజిక్ ఆలోచించు. ముఖం మురికిగా ఉన్నవాడు అవతలి వ్యక్తి శుభ్రమైన ముఖాన్ని చూసి, తన ముఖం కూడా అలాగే శుభ్రంగా ఉందనుకుంటాడు. కానీ, ముఖం శుభ్రంగా ఉన్నవాడు అవతలి వ్యక్తి మురికి ముఖాన్ని చూసి, తన ముఖం కూడా మురికిగా ఉందేమో అనుకుంటాడు. కాబట్టి, ముఖం శుభ్రంగా ఉన్నవాడే మొదట ముఖం కడుక్కుంటాడు.”

​“చాలా తెలివైన ప్రశ్న,” అన్నాడు యువకుడు. “నన్ను ఇంకో ప్రశ్న అడగండి.”
​గురువుగారు మళ్లీ రెండు వేళ్లు పైకెత్తి అదే ప్రశ్న అడిగారు: “ఇద్దరు వ్యక్తులు పొగగొట్టం గుండా కిందకు దిగారు. ఒకరి ముఖం శుభ్రంగా ఉంది, మరొకరిది మురికిగా ఉంది. ఎవరు ముఖం కడుక్కుంటారు?”
​“మనం ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ముఖం శుభ్రంగా ఉన్నవాడే కడుక్కుంటాడు” అన్నాడు యువకుడు.
​“తప్పు! ఇద్దరూ ముఖం కడుక్కుంటారు” అన్నారు గురువుగారు. “లాజిక్ చూడు. ముఖం శుభ్రంగా ఉన్నవాడు అవతలి వ్యక్తిని చూసి తన ముఖం మురికిగా ఉందనుకుని ముఖం కడుక్కోవడం మొదలుపెడతాడు. అది చూసి, ముఖం మురికిగా ఉన్నవాడు కూడా తను ముఖం కడుక్కోవాలని గ్రహించి కడుక్కుంటాడు. కాబట్టి ఇద్దరూ కడుక్కుంటారు.”
​“నేను ఇలా ఆలోచించలేదు. లాజిక్‌లో నేను తప్పు చేయడం నాకు ఆశ్చర్యంగా ఉంది. నన్ను మళ్లీ పరీక్షించండి” అన్నాడు యువకుడు.

​గురువుగారు మూడోసారి అదే ప్రశ్న అడిగారు: “ఇద్దరు వ్యక్తులు పొగగొట్టం గుండా కిందకు దిగారు. ఒకరి ముఖం శుభ్రంగా ఉంది, మరొకరిది మురికిగా ఉంది. ఎవరు ముఖం కడుక్కుంటారు?”
​“ఇద్దరూ కడుక్కుంటారు” అన్నాడు యువకుడు.
​“తప్పు! ఎవ్వరూ కడుక్కోరు” అన్నారు గురువుగారు. “లాజిక్ ప్రకారం... ముఖం శుభ్రంగా ఉన్నవాడు ఎదుటివాడిని చూసి తన ముఖం మురికిగా ఉందనుకుంటాడు. కానీ, ఆ మురికిగా ఉన్నవాడు ప్రశాంతంగా కూర్చుని ముఖం కడుక్కోకపోవడం చూసి, ముఖం శుభ్రంగా ఉన్నవాడు కూడా ‘నా ముఖం బానే ఉందేమో’ అని ఊరుకుంటాడు. కాబట్టి ఇద్దరిలో ఎవ్వరూ ముఖం కడుక్కోరు.”
​ఆ యువకుడు తట్టుకోలేకపోయాడు. “నాకు వేదాలు చదివే అర్హత ఉంది. దయచేసి నాకు చివరిగా ఒక్క అవకాశం ఇవ్వండి” అని బ్రతిమాలాడు.

​గురువుగారు మళ్లీ తన రెండు వేళ్లు పైకెత్తేసరికి అతను నీరసపడిపోయాడు. గురువుగారు అదే ప్రశ్న అడిగారు: “ఇద్దరు వ్యక్తులు పొగగొట్టం గుండా కిందకు దిగారు. ఒకరి ముఖం శుభ్రంగా ఉంది, మరొకరిది మురికిగా ఉంది. ఎవరు ముఖం కడుక్కుంటారు?”
​“ఎవ్వరూ కడుక్కోరు!” అని అరిచాడు యువకుడు.
​“తప్పు! వేదాలు చదవడానికి కేవలం లాజిక్ (తర్కం) ఎందుకు పనికిరాదో ఇప్పుడు నీకు అర్థమైందా? అసలు ఇద్దరు వ్యక్తులు ఒకే పొగగొట్టం గుండా కిందకు దిగినప్పుడు... ఒకరి ముఖం శుభ్రంగా, ఇంకొకరి ముఖం మురికిగా ఉండడం ఎలా సాధ్యం? నువ్వు అడిగే ప్రశ్నలోనే అర్థం లేదు, అది ఒక పిచ్చి ప్రశ్న! జీవితాంతం ఇలాంటి అర్థం లేని ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ ఉంటే, నీకు దొరికే సమాధానాలు కూడా అంతే అర్థం లేకుండా ఉంటాయి.”

​సారాంశం:

 కేవలం తర్కం  ఉండడం కంటే, ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోగలిగే విచక్షణ లేదా వివేకం  ఉండడం చాలా ముఖ్యం.

అహల్యకు శాప విమోచనం (పిల్లల కోసం రాముడి కథ-17


 మహర్షి విశ్రామిత్రుడితోను, ఇతర మునులతోను కలిసి రామలక్ష్మణులు మిథిలకు వెళుతూ, మార్గమధ్యంలో విశాల నగరం చేరుకున్నారు. రాముడి అడిగిన మీదట విశ్వామిత్రుడు ఆ నగరం ఏర్పడడానికి గురించిన కథంతా చెప్పాడు. విశాల మహారాజు సుమతి వారందరికీ తగిన రీతిలో ఆతిథ్యమిచ్చాడు. ఆ రాత్రికి అక్కడే విశ్రమించిన వారు, ఆ మర్నాడు తమ ప్రయాణాన్ని కొనసాగించి మిథిలా నగరానికి చేరుకున్నారు. విశ్వామిత్రుడితో ఉన్న మునులందరూ అందమైన మిథిలను చూసి ఎంతో ఆనందానికి గురై ‘బాగు బాగు’ అంటూ ప్రశంసించారు. మిథిలకు సమీపంలోనే ఉన్న ఒక వనంలో ఒక ఆశ్రమాన్ని రాముడు చూశాడు. అది బాగున్నప్పటికీ అందులో ఎవరూ లేకపోవడాన్ని గమనించాడు. ఆ సంగతినే విశ్వామిత్రుడిని అడిగాడు.
‘‘మహాత్మా... ఈ ఆశ్రమంలో మునులెవ్వరూ కనిపించడం లేదేమిటి? పురాతనమైన ఈ ఆశ్రమం ఎవరిది? దీని వివరాలు తెలియజేయమని కోరుతున్నాను’’ అని వినయంగా అన్నాడు.
అందుకు విశ్వామిత్రుడు, ‘‘రామా... ఈ ఆశ్రమం ఒక మహాత్ముని కోపం కారణంగా శాపానికి గురైంది. ఆ వివరాలన్నీ  చెబుతాను విను’’ అంటూ చెప్పడం ప్రారంభించాడు. 
‘‘మహాత్ముడైన గౌతమ మహర్షి ఆశ్రమం ఇది. ఒకానొకప్పుడు దివ్య శోభలతో విలసిల్లుతూ ఉండేది. దేవతల పూజలు సైతం అందుకునేది. గౌతముడు తన భార్య అహల్యతో కలిసి ఇక్కడ ఉంటూ ఎన్నో సంవత్సరాలు తపస్సు చేశాడు. ఒకరోజు గౌతమ మహర్షి ఆశ్రమంలో లేని సమయం చూసుకుని ఇంద్రుడు అతడి రూపం ధరించి అహల్య దగ్గరకి వచ్చాడు. 
‘‘సుందరీ... కోరిక కలిగిన వారు సమయం కోసం ఆగరు.  నాకు నీతో కలవాలనే కోరిక కలిగింది’’ అన్నాడు. 
అహల్య తన భర్త రూపంలో వచ్చిన వాడు ఇంద్రుడేనని తన తపశ్శక్తితో గ్రహించింది. దేవతలకు రాజయిన వాడు మారువేషంలో వచ్చి ఇలా మాట్లాడుతున్నాడేమిటని అహల్య ఆలోచనలో పడింది. 
తర్వాత, ‘‘ఓ దేవేంద్రా... నేను నా దాంపత్య జీవితంలో సుఖంగా ఉన్నాను. నీవు ఇక్కడి నుంచి వెంటనే వెళ్లిపో. నీ గౌరవాన్ని, నా గౌరవాన్ని కూడ నిలబెట్టు’’ అంది. 
అందుకు ఇంద్రుడు నవ్వుతూ, ‘‘సుందరీ... నీ ప్రవర్తనకు సంతోషించాను. ఎలా వచ్చానో, అలాగే వెళ్లపోతాను’’ అంటూ ఆశ్రమం బయటకి వచ్చాడు. అదే సమయానికి, నదీ స్నానం చేసి వచ్చిన గౌతమ మహర్షి ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. ఆశ్రమం నుంచి తన వేషంలో బయటకి వస్తున్న ఇంద్రుడిని చూసి ఆగ్రహించాడు.
‘‘ఓరీ దుర్మతీ... నా రూపం ధరించి వచ్చి అనుచితంగా ప్రవర్తించావు. కాబట్టి నువ్వు వృషణములను కోల్పోతావు’’ అని శపించాడు. వెంటనే ఇంద్రుడి వృషణములు నేలపై రాలి పడ్డాయి. 
కోపంతో ఉన్న గౌతముడు, అహల్యను కూడా శపించాడు. ‘‘నువ్వు కొన్ని వేల సంవత్సరాల పాటు ఇక్కడే పడి ఉంటావు. అన్నపానాలు లేకుండా నిరాహారంగా గాలి మాత్రమే భుజిస్తూ ఎవరికీ కనిపించకుండా తపిస్తావు’’ అన్నాడు. ఆ తర్వాత, ‘‘చాలా కాలం తర్వాత దశరథుడి కుమారుడైన శ్రీరాముడు వచ్చినప్పుడు నీకు శాపవిమోచనం కలుగుతుంది. శ్రీరాముడికి అతిథి సత్కారాలు చేశాక నీలో లోభమోహాలు నశించి నన్ను చేరుకుంటావు’’ అని చెప్పి ఆశ్రమాన్ని విడిచి తపస్సు చేసుకోడానికి హిమాలయాలకు వెళ్లిపోయాడు. 
గౌతముడి శాపానికి గురైన ఇంద్రుడు దీనంగా మహర్షులు, చారణులతో కూడి ఉన్న అగ్ని మొదలైన దేవతల దగ్గరకు వెళ్లాడు.
‘‘సమస్త దేవతలారా... మహర్షులారా... చారణులారా... మహాత్ముడైన గౌతముడికి కోపం తెప్పించి ఆయన తపస్సును భగ్నం చేశాను. దేవతల మేలు కోసమే ఇదంతా చేశాను. గౌతముడి శాపం వల్ల నేను అశక్తుడనయ్యాను. కాబట్టి మీరంతా నాకు సాయపడాలి’’ అని వేడుకున్నాడు. 
అప్పుడు దేవతలంతా పితృదేవతల దగ్గరకి వెళ్లి, ‘‘యగ్జ్యాల్లో మీ భాగంగా వచ్చే మేకపోతు వృషణాలను ఇంద్రుడికి ఇవ్వండి’’ అని కోరారు. వారందుకు అంగీకరించారు. 
విశ్వామిత్రుడు ఈ కథంతా చెప్పి, ‘‘రామా... అప్పటి నుంచి పితృదేవతలు వృషణాలు లేని మేకలనే స్వీకరిస్తున్నారు. ఇంద్రుడు ‘మేష వృషణుడు’ అయ్యాడు. ఇప్పుడు నీవు ఈ ఆశ్రమంలో అడుగుపెట్టు. అహల్యకు శాపవిమోచనం కలిగించు’’ అన్నాడు. 
ఆపై విశ్వామిత్రుడు, లక్ష్మణులతో కలిసి రాముడు గౌతముడి ఆశ్రమంలోకి అడుగుపెట్టాడు. కఠోరమైన తపస్సు చేస్తూ ఎవరికీ కనిపించకుండా, తేజోరూపంలో ఉన్న అహల్యను చూశాడు. శ్రీరాముడి దర్శనం అయిన వెంటనే అహల్యకు శాప విముక్తి కలిగింది. ఆమె తన పూర్వరూపంలో అందరికీ కనిపించింది. రామలక్ష్మణులు ఆమెకు భక్తితో నమస్కరించారు. అహల్య వారికి అర్ఘ్యపాద్యాలతో అతిథి సత్కారాలు చేసింది. ఆకాశం నుంచి దేవతలు దుంధుభులు మోగిస్తూ పుష్ప వర్షం కురిపించారు. గంధర్వులు గానం చేశారు. అప్సరసలు నాట్యం చేశారు. శ్రీరాముడు తన ఆశ్రమానికి వచ్చినట్టు గ్రహించిన గౌతమ మహర్షి ఆ క్షణమే అక్కడకి చేరుకున్నాడు. తపస్సుతో పవిత్రురాలైన అహల్యను దేవతలు ప్రశంసించారు. గౌతముడు అహల్యతో కలిసి,  శ్రీరాముడిని భక్తిశ్రద్ధలతో పూజించి పరమానందభరితుడయ్యాడు. ఆపై శ్రీరాముడు లక్ష్మణుడితో కలిసి విశ్వామిత్రడి వెంట మిథిలా నగరానకి బయల్దేరాడు. జై శ్రీరామ్.

అహల్యకి శాప విమోచనం (పిల్లల కోసం రాముడి కథ-17)

 


సైన్స్ చెబుతున్న తులసి మహిమ