మంగళవారం, డిసెంబర్ 24, 2013

అసలైన ఆత్మవిమర్శ


'నమస్కారం గురూగారూ!' 
'ఏంట్రోయ్‌... చాలా కాలానికి కనిపించావ్‌. ఎక్కడికి పోయావ్‌?' 
'ఇంట్లోనే తలుపులు మూసుకుని కూర్చున్నాను గురూగారూ...' 
'వార్నీ... అదేం బుద్ధి, ఒంట్లో బాగానే ఉందా?' 
'ఆరోగ్యానికేం ఢోకా లేదండి. కానీ ఆత్మవిమర్శ చేసుకుంటూ ఉండిపోయా...' 
'ఆత్మవిమర్శా!! నీకిలాంటి విద్యలు కూడా వచ్చునేంట్రా?'
'ఏముంది గురూగారూ... రాజకీయాలు నేర్చుకోవాలంటే పాఠాలు చదవడం కాదూ, సమకాలీన నేతల్ని గమనించి వాళ్ల అడుగుజాడల్లో నడవాలని చెప్పారు కదండీ మీరు? దాన్నిబట్టే అలా చేశానండి...'

'అది సరే కానీ, ఈ కాలంలో ఆత్మవిమర్శ చేసుకునేవాళ్లు ఎవరున్నార్రా?' 
'ఎందుకు లేరండీ? మొన్న నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు వచ్చాక దేశ మహారాణమ్మ, ఆవిడగారి సుపుత్రుడు అదే అన్నారు కదండీ? ఇదేదో కొత్తగా ఉందని గది తలుపులు బిడాయించుకుని కూర్చున్నానండి. కానీ ఆత్మవిమర్శ ఎలా చేసుకోవాలో మాత్రం తెలియలేదండి...'

'నీ తెలివి తెల్లారినట్టేఉంది. వాళ్లనుంచి నువ్వు నేర్చుకోవలసింది ఆత్మవిమర్శ చేసుకుంటాననడమే. చేసుకోవడం కాదు...'

'రెండింటికీ తేడా ఏంటండీ?' 
'మైసూర్‌పాక్‌ ఫొటో చూసినదానికి, దాన్ని తినడానికి ఉన్నంత. ఫొటో నోరూరించినా తినడానికి పనికిరాదు కదా! అలాగన్నమాట...'

'అంటే వాళ్లు దేశ ప్రజలందరికీ మైసూర్‌పాక్‌ పెట్టినట్టేనంటారా?' 
'మాటల మైసూర్‌పాక్‌. వాళ్లేదో అన్నారని నువ్వు గదిలో దూరి కిందా మీదా పడ్డం చూస్తే నువ్వింకా ఏమీ ఎదగలేదని తేలిపోయిందిరా...'

'అంటే వాళ్లు సందర్భానికి తగినట్టు ఆ పదాన్ని చక్కగా ఉపయోగించుకున్నారని నాకిప్పుడు అర్థమైంది గురూగారూ...' 
'పోన్లే... ఆమాత్రం గ్రహించావ్‌ అంతేచాలు. కానీ వాళ్లు మాత్రం నీలా నీచరాజకీయ నేతగా ఎదగాలనుకునేవాళ్లకు రాచమార్గం చూపించినట్టే. సమకాలీన నేతల నుంచి నేను నిన్ను నేర్చుకోమన్నది అందుకే...'

'అర్థమైందండి. కానీ వాళ్ల నుంచి ఏం నేర్చుకోవచ్చో కాస్త నా మట్టి బుర్రకు అర్థమయ్యేలా చెబుదురూ?' 
'సర్లె... కాగితం, కలం పుచ్చుకొని అఘోరించు. మనం చేసిన వెధవ పన్లేంటో, వాటి ఫలితాలెలా ఉంటాయో తెలిసినప్పుడు గబుక్కున పరిగెత్తుకుని పోయి బజార్లో నిఘంటువొకటి కొనుక్కుని అందులో పవిత్రమైన పదాలేంటో వెతుక్కోవాలి. ఆత్మవిమర్శ చేసుకుంటాం, ప్రజల తీర్పు శిరసావహిస్తాం, జనాభిప్రాయాన్ని గౌరవిస్తాం... లాంటివన్నమాట. వీలైనంత గంభీరంగా మొహం పెట్టి, మైకు ముందు నిలబడి, ఈ పదాలను పలికేశాక, ఆనక నువ్వు మనసులో కిసుక్కున నవ్వేసుకున్నా పర్వాలేదు. భర్త చిటికెన వేలుచ్చుకుని వచ్చి, చూపుడువేలుతో దేశాన్నే శాసిస్తున్న ఆ మహారాణమ్మ నుంచి, ఆవిడగారి ఏలుబడి నుంచి నీలాంటి బడుద్ధాయ్‌లు ఎంతైనా నేర్చుకోవచ్చురా. పదిమంది మోసే పల్లకిలో ఓ బొమ్మరాజును పెట్టి, తెర వెనక నుంచి అధికారం చలాయించడం మీద వఠ్ఠి పాఠమేంటి, ఓ ఉద్గ్రంథమే రాయవచ్చు. పార్టీలో అనుభవజ్ఞులైన పెద్దలందరినీ నోరెత్తనీయకుండా అడుగులకు మడుగులొత్తించుకునే విద్యల్లో కొన్ని నేర్చుకోవడానికైనా నీ జన్మ సరిపోదు. తన కొడుకు తప్ప దేశానికి కానీ, పార్టీకి కానీ వేరే దిక్కులేనంతగా రాజకీయం నడుపుతున్న తీరుతెన్నులు నీలాంటివారికి పెద్దబాలశిక్షలు కాదా చెప్పు? చేతకాని విధానాల వల్ల ధరవరలు పెరిగిపోయి సామాన్యులు అతలాకుతలమైపోతున్నా పొద్దున్నే అట్టు తినేవాడెవడూ పేదోడు కాదనే కాకిలెక్కల హయామును ఏమనాలి? మద్దతిస్తున్నవాళ్లు అవినీతి అక్రమాల్లో కూరుకుపోయినా నిమ్మకు నీరెత్తినట్టు నిబ్బరంగా ఉండటం ఎంత గొప్ప పాఠమో అర్థం చేసుకుంటే మనలాంటివాళ్లం ఎంత వెనకబడి ఉన్నామో తెలుస్తుంది. అధికారం కోసం జైల్లో ఉండేవారినీ విడిపించి జతకట్టడం, అవినీతి అక్రమార్కులతో కుమ్మక్కైనా సరే అధికారం కోసం పాకులాడటం, గెలవలేమని తెలియగానే ప్రత్యర్థులపై కులమతాలనైనా అడ్డంపెట్టి బురదజల్లడం, అవసరమైతే ప్రజల మధ్యే చిచ్చుపెట్టడం, నియంతలకు నియంతలాగా వ్యవహరించడం... అబ్బో- ఇలా ఎన్ని నేర్చుకోవాలి, ఎన్ని ఒంటపట్టించుకోవాలి? వీటిలో లవలేశమైనా నేర్చుకుంటే నీ ఎదుగుదలకు డోకా ఉండదనుకో!'

'అబ్బ... ఎంత బాగా చెప్పారండీ! ఇంగితం ఉన్నవాళ్లందరికీ ఇన్ని సంగతులు తెలిసిపోతున్నా వాళ్లు మాత్రం నిజమైన ఆత్మవిమర్శ చేసుకోలేదంటారా గురూగారూ?' 
'ఓరెర్రోడా! ఆత్మవిమర్శ చేసుకునే బుద్ధి, నిజాయతీ, చిత్తశుద్ధి ఉండుంటే అధికారంలో ఉండి ఇలాంటి అవకతవక, అయోమయ, అధ్వాన, అవినీతి, అక్రమ, అన్యాయ, అతలాకుతల, అకృత్య కార్యకలాపాలను అఘోరిస్తారా చెప్పు? సరే... ఒకవేళ నిజంగానే ఆత్మవిమర్శ చేసుకోవాలని వాళ్లు అనుకున్నారనే అనుకో. వాళ్లని వాళ్లు తిట్టుకోవడానికి ఏ భాష మాత్రం సరిపోతుందో చెప్పగలవా? మరి వాళ్ల తాజా మాటలు కూడా ఓసారి గుర్తు తెచ్చుకో. జరిగిందేదో జరిగినా ముందు జరగబోయే కార్యక్రమానికి సమాయత్తం కావాలని ఆ మహారాణమ్మగారు తమ అనుచరవర్గానికి పిలుపు ఇవ్వలేదూ. అంటే ఏంటర్థం? తిరిగి ప్రజల నెత్తిన మాటల టోపీ పెట్టడానికి ఎన్ని రకాల టక్కుటమార విద్యలున్నాయో, అన్నీ ఉపయోగించమనేగా? కాబట్టి సందేహాలు పక్కన పెట్టి ఆ మహనీయుల అడుగుజాడల్లో నడవడానికి సమకట్టు. అర్థమైందా?'

'అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినట్టు అర్థమైంది గురూగారూ! ఇక చూస్కోండి. నేను చేసిన ఎన్ని పనులు బయటపడినా నిజమైన ఆత్మవిమర్శ జోలికి మాత్రం పోను. కానీ ఆ పదాన్ని మాత్రం ఎడాపెడా వాడేసుకుంటాను. వస్తానండి, అర్జంటుగా సభొకటి పెట్టాలి!'

PUBLISHED IN EENADU ON 24.12.2013

శనివారం, డిసెంబర్ 07, 2013

మహా వాడకం!




'దండాలు బాబయ్యా...' 
'ఎవర్రా నువ్వు, ఏం కావాలి?' 
'పని కోసం వచ్చానండయ్య. తమరు తలూపితే తమ కాడ పడుంటానండయ్య...' 
'నా దగ్గర పనా, ఉందని నీకెవరు చెప్పారు?' 
'నేనే గమనించానండయ్య. గోదారికి ఈ దరిని వూళ్లో సభెట్టారు కదండయ్యా, దాన్ని టీవీలో చూశానండయ్య. ఆ లెక్కన మీకాడ శానా పనుందని అనిపించి చక్కా వచ్చానండయ్య' 
'టీవీలో చూసి వచ్చావా? ఏం చూశావ్‌, ఏం చేస్తావ్‌?' 
'బలేవోరండయ్య... టీవీలో మీ యవ్వారం, ఆ తీరు, ఆ గోటు, ఆ నీటు చూసేసరికి కళ్లు తిరిగాయండయ్య. అసలొక మడిసిని ఇంతబాగా ఉపయోగించుకోవచ్చని మిమ్మల్ని చూసే తెలిసిందయ్యా. మీకెందుకు, నాకొక్క అవకాశం ఇవ్వండి. ఇంకెంత బాగా ఉపయోగపడతానో తమరికే తెలుస్తుంది' 
'వార్నీ... నువ్వెక్కడ దొరికావురా. విషయం చెప్పకుండా సతాయిస్తున్నావ్‌? గోటంటావ్‌. నీటంటావ్‌. ఇంతకూ ఏం చూశావో అది చెప్పవేం?' 
'అయ్యబాబోయ్‌... తమరికి ఎరిక లేదన్నమాట. అంతేలెండి. మీకలాంటి బుద్ధులన్నీ పుట్టుకతోనే అబ్బేసుంటాయి. అంచాత అలవోకగా చేసేత్తారు. అందుకే నాలాటోడైతే మీ మనసెరిగి మరింత బాగా నడుసుకోవచ్చని ఆశ కలిగిందండయ్య. తమరు కాదనకూడదు...'
'ఇదెక్కడి గొడవరా, ముందు కాళ్లొదులు. నన్ను కాస్త కదలనీ. ముందు నీకీ బుద్ధెందుకు పుట్టిందో చెప్పేడు. పనిదేముంది ఇస్తాలే. పడుందువుగాని...' 
'అమ్మయ్య- మనసు తేట పడిందండయ్య. ఇప్పుడు చెబుతానండయ్య. మొన్న సభలో తమరు మాట్లాడారు కదండయ్య. ఓ చేత్తో మైకట్టుకున్నారండయ్య. రెండో చెయ్యి తమరు దంచే వూకదంపుడు ఉపన్యాసానికి అనుకూలంగా మాంసాన్ని కైమా చేస్తున్నట్టు వూగుతోంది కదయ్య. అలా వూపాక ఆ చెయ్యి ఎక్కడ పెట్టారో నేను గమనించానండయ్య. ఆ చేతిని అప్పుడప్పుడు దించుకోడానికి వీలుగా మీ కాపలావోడిని వంగోమన్నారు కదయ్య. ఆడి వీపు మీద ఎంత విలాసంగా చెయ్యి ఆన్చారండయ్య. మరది గోటు కాదా, నీటు కాదా, రాజసం కాదా? అబ్బో, ఈ లెక్కలో మడిసిని వాడుకోవడంలో మీ తరహా మరెవ్వరికీ సాటి రాదండయ్య. అందుకే వచ్చానయ్య. మీ కాడ వంగున్నవాడి కన్నా నేను ఇంకా బాగా వంగోగలనయ్య. తమరు పనిచ్చారంటే చాలు... ఇక చూస్కోండి నా పనితనం ఏంటో చూపిస్తా...'

'వార్నీ అదా, బాగానే గమనించావ్‌? ఇంతకూ ఏం చేస్తావో, ఏం చేయగలవో చెప్పు చూద్దాం...' 
'అయితే చెబుతా వినుకోండయ్య. తమరికి పొద్దున్నే మెలకువ రాగానే తమరి కనురెప్పల్ని విప్పదీస్తానండయ్య. కళ్లు తెరిచాక ఆవులిస్తే చిటికేస్తానండయ్య. ఒళ్లు విరుచుకున్నాక లేచి కూచోబెడతానండయ్య. మంచం దిగ్గానే కాళ్లకు చెప్పులు తొడుగుతానండయ్య. బ్రెష్షు మీద పేస్ట్‌ వేస్తానండయ్య. తమరు దయతలచి నోరు తెరిస్తే పళ్లు తోముతానండయ్య. ఆపై నాలుక గీస్తానయ్య. మొహం తొలుస్తానయ్య. తడి మొహాన్ని తువ్వాలుతో తుడుస్తానయ్య. తమర్ని కూచోబెట్టి కాఫీ తాగిస్తానయ్య. స్నానం చేసేప్పుడు వీపు రుద్దుతానయ్య. అలా మీకాడే పడుండి కనిపెట్టుకుని చూస్తానండయ్య. దగ్గితే తలమీద తడతానయ్య. తుమ్మితే చిరంజీవ అంటానయ్య. జలుబొస్తే చీదిస్తానయ్య, తమరు సభల్లో మాట్లాడేప్పుడు మైకు నేనే పట్టుకుంటానయ్య. కావాలంటే మీ బదులు అచ్చం మీలాగ నేనే నా చెయ్యి వూపుతానయ్య. ఇంకిన్ని మాటలెందుకయ్య, తమరి అడుగులకు మడుగులొత్తుతానండయ్య...'

'వహార్నీ... గట్టి పిండానివే. కానీ మరి ఇంత ఇదిగా నిన్ను వాడుకున్నాననుకో, చాలా విమర్శలు వస్తాయిరా...' 
'భలేవోరండీ బాబూ... ఈ పన్లన్నీ చాలా చిన్నచిన్నవే... అసలు తమరు మనరాష్ట్రంలో మడుసుల్ని, వస్తువుల్ని వాడుకోవడం ముందు ఇవన్నీ ఎంతనీ?' 
'ఏంటేంటీ, ఏమన్నావ్‌? నేనేమేమి వాడుకున్నానో కూడా తెలుసా నీకు, ఏంటో చెప్పు?'

'అయ్యబాబోయ్‌... తమరు నాచేత వాగిద్దామని అంటున్నారు కానీ, ఒక్క నాకే ఏంటి, తమరి గురించి ప్రపంచికమంతా ఎరికేనయ్య. తమరు వాడుకోనివాళ్లంటూ మనకాడ ఉన్నారేంటయ్య? ఈ ఇలాకాలోనే కాదు... రాట్రంలో, దేశంలో, ఆ మాటకొస్తే ప్రపంచకంలో కూడాను లేరు. తమరు సొంతంగా అధికారంలో లేకపోయినా తండ్రిగారి అధికారాన్ని వాడుకున్నారు కదయ్యా? దాన్ని అడ్డం పెట్టుకుని అధికారుల్ని వాడుకున్నారాండయ్య? ఆళ్లతోపాటు మంత్రుల్ని, నాయకుల్ని ఎడాపెడా వాడేసుకోలేదయ్యా? ఆ తరవాత తమరి నాయనగారి దగ్గరకు పనులమీదొచ్చే వారందర్నీ మీ ఇంటికి దారి మళ్లించి, బేరాలెట్టి, రేటు ఫిక్సింగులు చేసి ఆళ్లందరి డబ్బును వాడుకోలేదాండయ్య? అందుకోసం మన రాట్రంలోని భూముల్ని గనుల్ని వాడుకోలేదా చెప్పండయ్య? అక్కడితో ఆగారాయ్యా? మడుసుల్ని, వనరుల్ని అడ్డగోలుగా వాడేసుకుని సంపాదించిన సొమ్ముల్తో ఆ మూల కోల్‌కత నుంచి ఈ మూల మలేసియా దాకా ఎక్కడెక్కడో దొంగ కంపెనీలెట్టడానికి అవకాశాలన్నీ వాడుకోలేదా చెప్పండయ్య? వట్టి అవకాశాలేనా... అడ్డదారి పన్లూ సేయడానికి చట్టాల్ని వాడుకున్నారు, అయ్యి అడ్డొస్తాయంటే ఆ చట్టాల్లో సవరణలు చేయడానికీ చట్టసభను వాడుకున్నారు. ఇన్నీ చేసినా ఇంతా చేసినా- మెత్తగా మాట్లాడతా... అమాయకులైన జనాన్ని వాడుకున్నారు. అబ్బో... ఎన్నని చెప్పగలనండయ్య, ఒకటా రెండా? ఇక్కడికిక్కడ చెప్పగలనా? చివరాకరికి తమరు చేసిన అడ్డదిడ్డమైన పన్లన్నీ బయటపడిపోయి జైల్లోకెల్లాక కూడా ఏకంగా ఢిల్లీలోని పెద్ద తలకాయల్నీ వాడేసుకున్నారని అంతా అంటున్నారయ్య. అందుకే ఇంతలేసి ఎదవ పన్లు సేసినా సటుక్కున జైల్లోంచి బెయిలుచ్చుకుని వచ్చేశారని సెబుతున్నారయ్య. మరి ఇంతలా ఏది పడితే దాన్ని, ఎవర్ని పడితే వాళ్లని వాడుకోవడం ముందు నేను చేసే పనులెంతయ్య? పని ఇచ్చినప్పుడు ఎలా పడితే అలా వాడుకోవచ్చయ్య. మరి రేప్పొద్దున్న మీరు కలలు కంటున్నట్టు కుర్చీలో కూర్చోగలిగితే అప్పుడింకెంత వాడేసుకుని ఎంత సంపాదిత్తారో చెప్పడానికి నా బతుకు సరిపోదయ్య...!'

PUBLISHED IN EENADU ON 07.12.2013

గురువారం, సెప్టెంబర్ 12, 2013

బాధ్యతల మర్మం


'ఏంటో గురూగారూ! బతుకు దుర్భరమైపోయిందంటే నమ్మండి...'
'వూరుకోరా! భలే జోకేశావు. మనవల్ల ప్రజానీకం బతుకులు దుర్భరమవుతాయి కానీ, మనవి కావడం ఏమిటిరా?'

'అబ్బే... జనఘోష కాదండీ. మా ఇంటి ఘోష. మొన్న మా ఆవిడ ఉంగరం పోగొట్టింది. అదేమిటంటే నాదా బాధ్యత అని ఎదురు ప్రశ్నించింది. పైగా నా జీవితం తెరిచిన పుస్తకం, కావాలంటే పేజీలన్నీ చదువుకొమ్మంటోంది. ఈ ధోరణి ఏమిటో అర్థం కావడం లేదు'

'బాగుంది. మీ టీవీలో ఎక్కువగా ఏ కార్యక్రమాలు చూస్తారు?'

'వార్తలండి...'

'మరదీ సంగతి! రాజకీయాలన్నీ మీ ఇంట్లోకి ప్రవహించేస్తున్నాయని తెలుసుకో. మొన్న ప్రధాని ప్రసంగాన్ని మీ ఆవిడ విని బాగా ఒంటపట్టించుకుందన్నమాట. అర్థమైందా?'

'అర్థమైంది కానీండి... మరి ఆయన దగ్గర్నుంచి మా ఆవిడ వరకు ఎవరైనా సరే- ఇలా బాధ్యత లేకుండా ఉంటే ఎలాగండీ?'

'సర్లే... ఈ సంగతి అర్థం కావాలంటే అసలు బాధ్యతంటే ఏమిటో, దాని అర్థాలు సమయాన్నిబట్టి ఎలా మారిపోతాయో తెలుసుకోవాలి'

'అదేంటండీ? పదానికి అర్థం ఎప్పుడైనా ఒకటేగా?'

'ఆత్రగాడికి బుద్ధి మట్టు అని ఓ సామెత ఉందిరా. అది నీకు సరిగ్గా సరిపోతుంది. తెలుగు నిఘంటువులో అర్థం ఎప్పుడూ ఒకటే ఉంటుంది. రాజకీయ నిఘంటువులో మాత్రం సమయాన్నిబట్టే కాదు, నీ స్థానాన్నిబట్టి కూడా అర్థాలు మారిపోతాయి'

'భలే ఆశ్చర్యంగా ఉందే! ఎప్పుడెప్పుడు ఎలా మారతాయో కాస్త చెప్పరూ?'

'మరైతే రాసుకో. బాధ్యత అనే పదం చాలా బరువైనది. అది ఒక వ్యక్తి నిజాయతీకి, నిబద్ధతకి సంబంధించినది. కానీ, నువ్వు నేర్చుకుంటున్నది రాజకీయ పాఠాలు. అందుచేత దీనికి ఎప్పుడూ ఒకే అర్థం తీసుకోకూడదు. ఉదాహరణకి, నువ్వు అధికార పీఠం మీద ఉన్నావనుకో. బాధ్యతనే పదం ఉన్నట్టుండి తేలికైపోతుంది. ఇక్కడే మన ప్రధానిగారిని చూసి, చాలా నేర్చుకోవాలి. లక్షల కోట్ల రూపాయల బొగ్గు గనుల కేటాయింపులో కుంభకోణాలు బయటపడి, చెరగని మసిలాగా, వదిలించుకోని నుసిలాగా మారి కేంద్రప్రభుత్వం ఒంటినిండా, ముఖంనిండా అంటుకుపోయిందా? కానీ, ఆయన బాధ్యత వహించారా? లేదే. ఆనక ఈ వ్యవహారంపై విచారణ చేపట్టాక కీలకమైన దస్త్రాలు రాత్రికి రాత్రి హుష్‌కాకీ అయిపోయాయా... అప్పుడు కూడా ఆయన అవి మాయం కావడానికి నేనెలా బాధ్యత వహిస్తానని ఎదురు ప్రశ్నించారు కదా? కాబట్టి నువ్వు కుర్చీలో ఉంటే బాధ్యతాయుతంగా ఉండక్కర్లేదు. ఏమంటావు?'

'అనడానికేముందండి బాబూ, అదరగొట్టేశాక. మరైతే కుర్చీ ఎక్కినవాళ్లు బాధ్యత వహించే విషయాలే ఉండవంటారా?'

'ఎందుకుండవురా. బోలెడు ఉంటాయి. కానీ అవేమిటో నువ్వే వూహించు చూద్దాం...'

'ప్రజల కష్టనష్టాలను పట్టించుకోవడమేనాండీ?'

'లాభం లేదురా. నువ్వింకా చాలా ఎదగాలి. అదే ప్రజల కష్టనష్టాలు పట్టించుకున్నట్టు కనిపించాలని నువ్వు అని ఉంటే సంతోషించేవాడిని...'

'దానికీ దీనికీ ఏంటండీ తేడా?'

'నక్కకి, నాకలోకానికి ఉన్నంత ఉందిరా. పట్టించుకోవడం వేరు, అలా కనిపించడం వేరు. ప్రజల కోసమే నీ యావ, నీ ఆశ, నీ జీవితం, నీ జన్మ అన్నంత బాధ్యతగా పైకి కనిపించాలి. వాళ్ల సంక్షేమం కోసం అంతకంటే బాధ్యతగా పథకాలను ప్రవేశపెట్టాలి. అయితే ఈ బాధ్యత మాత్రం వేరు. ఎందుకంటే ఆ పథకాలు నిజానికి నీ కోసమే కదా? అంటే వాటిని అడ్డం పెట్టుకుని ఖజానా సొమ్మును దారి మళ్ళించడానికి, నీ కుటుంబానికి, నీ అనుచరవర్గానికి ఉపయోగపడేలా అమలు చేస్తావు కదా? మరి అది ఎలాంటి బాధ్యతో అర్థం చేసుకో...'

'అవునండోయ్‌! ఈ బాధ్యతకు మాత్రం నిఘంటువులో అర్థమే వర్తిస్తుందన్న మాట. మరి ఇలా, బాధ్యతాయుతంగా మసలినవారు, మెలిగినవారు, వినుతికెక్కినవారు, విఖ్యాతి గాంచినవారు, విరాజిల్లినవారు, విజయం సాధించినవారు ఎవరైనా ఉన్నారాండీ?'

'ఎందుకు లేరురా సన్నాసీ! మనరాష్ట్రం నడిబొడ్డున ఉదాహరణలు పెట్టుకుని ఎక్కడో వెతుకుతావేంటి? సీఎం కుర్చీ ఎక్కగానే ఎంతో బాధ్యతగా రోజుకో రకం పథకాలు పెట్టిన వైఎస్‌ని మరిచిపోతే ఎలా? మరాయన మనం చెప్పుకొన్న బాధ్యతతో పథకరచన చేయబట్టే కదా, ఆయన కుటుంబం లక్షకోట్లకు పడగలెత్తింది? ఆయన అనుచర వర్గమంతా అంతస్తులు పెంచుకున్నది? ఇక ఆయనగారి సుపుత్రుడు అంతకంటే బాధ్యతగా మసులుకోబట్టే కదా, అనేకానేక కంపెనీలు రాష్ట్రం పరిధులు దాటి మరీ విస్తరించినది? ఆ పథకాల వెనక ఉన్న బాధ్యతకు అర్థం నిజంగా నిఘంటువులోనిదే అయితే, ఈ పాటికి ఎక్కడా పేదవాళ్లనేవాళ్లు ఉండనే కూడదుగా? ఇలాంటి బాధ్యతనెరిగి మసలుకునేవారు ఢిల్లీ కుర్చీ నీడలో కావలసినంత మంది కనిపిస్తారు. దేశంలో జరిగిన లక్షల కోట్ల కుంభకోణాలకు వాళ్ల బాధ్యతాయుతమైన ప్రవర్తనే కారణమని వేరే చెప్పాలా?'

'ఆహా... చక్కగా బోధపడిందండి. ప్రజలను నమ్మించేప్పుడు ఒకరకం బాధ్యత, పథకాలు రచించేప్పుడు ఒకరకం బాధ్యత, అమలు చేసేటప్పుడు మరోరకం బాధ్యత, అవకతవకలు బయటపడినప్పుడు ఇంకో రకం బాధ్యత వహించాలని తెలిసిందండి. మొత్తానికి ఎంతో బాధ్యతాయుతంగా నాకీ సంగతులు చెప్పినందుకు మీకు కృతజ్ఞతలు చెప్పడం నా కనీస బాధ్యతని అనిపిస్తోందండి...'

'ఏడిశావ్‌లే! నేను చెప్పినవన్నీ పాటించి నికార్సయిన నీచనేతగా ఎదిగి చూపించడమే నీ అసలైన బాధ్యతని మరిచిపోకు. ఇలా హెచ్చరించడం కూడా నా బాధ్యతేరోయ్‌! ఇక వెళ్లిరా!'

PUBLISHED IN EENADU ON 12.09.2013

శనివారం, ఆగస్టు 31, 2013

అవకతవక సినిమా!



'యూపీఏ ప్రొడక్షన్స్‌... సోనియా సమర్పించు... మన్మోహన్‌ చిత్రవారి 'అవకతవక భారతం' సినిమా. కడుపుబ్బ నవ్వించే నాయకుల విన్యాసాలు, కడుపు రగిలించే కుంభకోణాలు, కంటతడి పెట్టించే ధరవరలు, ఉత్కంఠ కలిగించే ఉద్వేగాలు, నమ్మశక్యం కాని వాగ్దానాలు, గిలిగింతలు పెట్టే అవకాశవాద పొత్తులు, నరాలు తెగిపోయే సస్పెన్స్‌, అబ్బురపరచే పోరాటాలు... ఆలసించిన ఆశాభంగం! రండి బాబూ రండి... నేడే చూడండి!' 
'ఏం రేపు ఆడదా?' 
'అదే సస్పెన్స్‌' 
'ఇంతకీ హీరో ఎవరు?' 
'ఒకరు కాదు...' 
'ఓ, బహుతారా చిత్రమా, ఎవరెవరో వాళ్లు?' 
'గండర గండడు ద్రవ్యోల్బణం, విచిత్ర వేషాల విదేశ మారక ద్రవ్యం, అంతుపట్టని అభినయ విన్యాస రాజకీయం...' 
'మరి కథానాయికలు ఎవరు?' 
'ఎన్నెన్నో అందాల ఉల్లిపాయ, పచ్చని సోయగాల పచ్చిమిరపకాయ, తళుకు బెళుకుల బంగారం...' 
'అబ్బో, భలే జంటలే! మరి విలన్‌ ఎవరు?' 
'అమెరికా డాలర్‌' 
'మరైతే హాస్యనటులు ఎవరో?' 
'పాలక పల్లకీ మోతగాళ్లు, ఆ పార్టీల నేతలే హాస్యగాళ్లు...' 
'చాలా బాగుంది... ఇంతకీ కథేంటి?' 
'ఇంతవరకు భారతీయ వెండితెరపై కనీవినీ ఎరుగని కథ. అంతులేని, అంతుపట్టని, చిత్రవిచిత్ర మలుపులతో కూడిన అద్భుతమైన కథ...' 
'అవునా? మరి అంత చక్కని కథకు స్క్రీన్‌ప్లే ఎవరు?' 
'ఒక్కరు కాదు. అదే ఈ సినిమా ప్రత్యేకత. అందరు నేతలు తలో సన్నివేశాన్నీ సృష్టించారు. తలో దృశ్యాన్నీ ఆవిష్కరించారు...' 
'ఇంతకీ ఇంత గొప్ప చిత్రానికి దర్శకుడు ఎవరు నాయనా?' 
'అది కూడా చిత్రమే. తెరమీద పేరు కనిపించేది ఓ తలపండిన దర్శకుడిది. కానీ, తెర మీద సినిమా మొత్తాన్ని నడిపించేది మాత్రం ఓ దర్శకురాలు. ఏ సన్నివేశం తీసుకున్నా అందులోని షాట్‌లన్నీ ఎలా తీయాలో చెప్పేది ఆవిడే. ఈయన మాత్రం- లైట్సాన్‌, యాక్షన్‌, కట్‌... చెబుతారంతే!' 
'ఆహా, ఏం సినిమా అయ్యా! వింటుంటేనే అదిరిపోతోంది. మరి పాటలు ఉన్నాయా?' 
'ఉన్నాయి కానీ, అన్నీ విషాద గీతాలే...' 
'వార్నాయనో! వినగలమా?' 
'టికెట్‌ కొనుక్కుని వెళ్లాక వినక చస్తారా? వెక్కి వెక్కి ఏడుస్తూ మరీ వింటారు. ఇప్పటికే ఆ పాటలన్నీ విశేష ఆదరణ పొందాయి. దేశంలో ఏ మూల చూసినా ప్రజలంతా వాటిని సణుక్కుంటూ, గొణుక్కుంటూ, నిర్వికారంగా, నిర్వేదంగా పాడుకుంటూనే ఉన్నారు' 
'భలే బాగున్నాయయ్యా ఈ సినిమా విశేషాలు. ఆ కథేంటో కూడా కాస్త చెబుదూ?' 
'అనగనగా ఓ సామాన్యుడు. ఆశలు తప్ప ఏదీ ఆశించనివాడు. ఎవరొచ్చి ఏది చెప్పినా నమ్మేంత అమాయకుడు. గుమ్మం దగ్గరకు వచ్చి అడిగితే చాలు తన దగ్గరున్న ఓటును వెంటనే ఇచ్చేసే దానగుణం కలవాడు. అలాంటి సామాన్యుడికి ముగ్గురు ఆడపిల్లలు. పెద్ద కూతురు ఉల్లిపాయ- బాధ్యతలు తెలిసిన పిల్ల. ఎప్పుడూ వంటింట్లో సహకరిస్తూ చేదోడు వాదోడుగా ఉంటుంది. రెండో పిల్ల- పచ్చిమిరపకాయ. అక్కకు తోడుగా రుచులు పండిస్తుంది. మూడో పాప- బంగారం లాంటి పిల్ల. శుభకార్యాల నిర్వహణలో ముక్కుపుడక, తాళిబొట్టు, ఉంగరాల దగ్గర్నుంచి, గాజులు, నగల వరకు స్థోమతను బట్టి సమకూరుస్తూ, తళుక్కున మెరుస్తూ పరువు కాపాడుతూ ఉంటుంది. ముగ్గురమ్మాయిలతో గుట్టుగా సాగిపోతున్న ఆ సామాన్యుడి కుటుంబంలో ఒక్కసారిగా కలవరం పుట్టింది...' 
'ఏమిటా కలవరం?' 
'ద్రవ్యోల్బణం, విదేశ మారక ద్రవ్యం, రాజకీయమనే ముగ్గురు సంపన్నుల బిడ్డల చూపు ఈ ఆడపిల్లల మీద పడింది. ముగ్గురూ కలిసికట్టుగా వాళ్లని వలలో వేసుకున్నారు' 
'ఇదేం కథయ్యా, వీళ్లు హీరోలంటావ్‌? మళ్ళీ వల్లో వేసుకున్నారంటావ్‌?' 
'అదే ఈ సినిమాలో మలుపు. సందేహాలుంటే సినిమా పేరోసారి తల్చుకో. నోర్మూసుకుని వింటే విను. లేకపోతే చూడకతప్పని సినిమా చూడు' 
'సర్లే, మధ్యలో ఆపన్లే. అప్పుడేమైందో చెప్పు' 
'ఆ ముగ్గురివల్ల ముచ్చటైన ముగ్గురు అమ్మాయిలు సామాన్యుడికి అందకుండా పోయారు. పెద్దపిల్ల ఉల్లిపాయ, రెండో పిల్ల పచ్చిమిర్చి విపరీత ప్రవర్తనలవల్ల సామాన్యుడి కుటుంబం అల్లకల్లోలమైంది. అక్కలిద్దర్నీ చూసి బంగారం కూడా పట్టపగ్గాలు లేకుండా పొగరుతో వగలు పోసాగింది' 
'మరి ఆ సంపన్నుల అడ్డదిడ్డ బిడ్డల్ని అదుపు చేసేవారే లేరా?' 
'ఉంటే అది ఈ సినిమా ఎందుకవుతుంది, ఆ పేరెందుకు నప్పుతుంది? అసలే సామాన్యుడు సతమతమవుతుంటే అమెరికా డాలర్‌ కూడా రంగప్రవేశం చేసి విశ్వరూపం చూపించసాగింది. దాంతో సామాన్యుడి కుటుంబం చితికిపోయింది. ఈ కష్టాలు చాలవన్నట్టు సామాన్యుడి కుటుంబ పెద్ద అకస్మాత్తుగా జబ్బుపడి మంచమెక్కాడు' 
'సామాన్యుడి కుటుంబ పెద్దా, ఆయనెవరు?' 
'రూపాయి!' 
'అరె పాపం... అప్పుడేమైంది?' 
'ఇంకా ఏమవ్వాలి? పతాక సన్నివేశం ఆసుపత్రి అత్యవసర విభాగానికి చేరింది. రూపాయి ప్రాణం నిలబెట్టడానికి ఆక్సిజన్‌ పెట్టసాగారు. సెలైన్‌ ఎక్కించసాగారు. బయట ఎర్రలైటు. లోపల నీరసించిన రూపాయి. అంతటా ఉత్కంఠ...' 
'ఇంతకీ దర్శకులు, స్క్రీన్‌ప్లే రచయితలు చివరికి ఏం చేస్తారయ్యా?' 
'ఏంటి చేసేది! వాళ్లేం చేయకే కదా, కథ ఇలా తయారైంది?' 
'మరి చివరికి ఏమవుతుంది?' 
'ఈ అవకతవకల కథకు ముగింపు ఎలా పలకాలో వాళ్లకే తెలియడం లేదు. మిగతా కథ భారతీయ వెండితెరపై చూడాల్సిందే... అర్థమైందా? ఆ... రండి బాబూ రండి... నేడే చూడండి...' 
'అవున్లే దీన్ని నేడే చూడాలి. రేపు అనుమానమే. వెళ్లి ప్రచారం చేసుకో... పో'

PUBLISHED IN EENADU ON 31.08.2013

శనివారం, ఆగస్టు 24, 2013

అప...హాస్యం!



'హ హ్హ హ్హ హ్హ హ్హా!'
శంకర్రావు నవ్వుకి వంటింట్లో ఉన్న పంకజాక్షి ఠారెత్తిపోయి పరిగెత్తుకుని వచ్చింది. వీధి గదిలో శంకర్రావు పొట్టపట్టుకుని దొర్లుతూ నవ్వుతున్నాడు. వూరినుంచి వచ్చి, పాత దినపత్రికలు సర్దే పని పెట్టుకున్న భర్త ఎందుకు అంతగా నవ్వుతున్నాడో పంకజాక్షికి అర్థం కాలేదు.

'దినపత్రికలో జోకులేముంటాయండీ? మీది మరీ చోద్యం కాకపోతే' అంది పంకజాక్షి.

'నీ మొహం, ఇందులో మన నేతల మాటలు చూడు. అన్నీ బ్రహ్మాండమైన జోకులే...' అన్నాడు శంకర్రావు నవ్వుతూనే.

'చాల్లెండి సంబరం. మీతో మాట్లాడుతూ కూర్చుంటే నాకు అవతల పోపు మాడిపోతుంది' అంటూ వెళ్లబోయింది పంకజాక్షి.

శంకర్రావు ఆమెను వారించి, 'ఇవతల దేశంలో పరిస్థితే మాడిపోతోంది. సంగతేమిటో తెలిస్తే నువ్వూ నాలాగే నవ్వుతావు మరి' అన్నాడు.

'అయితే ఉండండి. స్టవ్‌ కట్టేసి వస్తా' అంటూ పంకజాక్షి క్షణాల్లో వచ్చి, 'ఇప్పుడు చెప్పండి ఆ జోకులేంటో?' అంది సరదా పడుతూ.

శంకర్రావు ఆమె చేతికి తాను చదువుతున్న పాత దినపత్రిక ఇచ్చి ఓ వార్త చదవమన్నాడు. అది స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మన్మోహన్‌ ప్రసంగం.

పంకజాక్షి చదువుతూ 'చిరునవ్వుల భారతమే మా ప్రభుత్వ లక్ష్యం...' అనేసరికి, శంకర్రావు 'అదే... అదే...' అంటూ మళ్ళీ నవ్వసాగాడు.

పంకజాక్షి మొహం చిట్లించి, 'ఇందులో నవ్వడానికేముంది? ముందు మీరు మీ పేరును శంకల్రావు అని మార్చుకోండి. మీకన్నీ శంకలే...' అంది.

'నీ తలకాయ్‌, చిరునవ్వుల భారతమేమిటి... ఇప్పటికే భారతమంతా అట్టహాస ప్రహసనమైతేనూ. ప్రజలంతా పగలబడి నవ్వుకుంటున్నారు. ఆ నవ్వులు మామూలివా? విషాదం నుంచి పుట్టిన వినోదం. ఈ ప్రభుత్వ విన్యాసాలను చూసి ఏడవలేక నవ్వుతున్న నిర్వేదం. మన భారత ప్రభుత్వమనే తెల్లతెర మీద కనిపించేది ఒకరు. ఆయన కేవలం పెదవులు మాత్రమే కదుపుతారు. కానీ, మాటలు ఆయనవి కావు. తెర వెనక నుంచి పలికేది మరొకరు. కుర్చీలో కూర్చుని ఆడేది ఒకరు. ఆడించేది వేరొకరు. పల్లకి మీద బొమ్మ ఒకరు. పల్లకిని మోసేది ఎవరెవరో. కానీ, వూరేగేది మాత్రం వీరెవరూ కాదు. ఇదొక విచిత్ర అధికార ప్రకరణం. ఎన్నడూ చూడని సరికొత్త పెత్తన ప్రహసనం. ఈ తైతక్కల ప్రభుత్వాన్ని చూసి ప్రజలంతా నిత్యం నవ్వుకుంటూనే ఉంటే, ఇంకా చిరునవ్వుల భారతమంటే పొట్ట పగిలిపోదూ?' అంటూ వివరించాడు శంకర్రావు.

'అవునండోయ్‌. మీరు చెబుతుంటే నాకూ నవ్వొస్తోంది. ఉండండి ఇంకా చదువుతా. ఇంకెన్ని జోకులున్నాయో...' అంటూ కొనసాగించింది.

'పేదలు అర్ధాకలితో అలమటించరాదనేదే మా ప్రభుత్వ లక్ష్యం...' అంటూ చదువుతున్న పంకజాక్షి కూడా నవ్వేసింది.

'చూశావా... నీకు కూడా నవ్వాగడం లేదు?' అన్నాడు శంకర్రావు. 'ఓ పక్క పేదరికం మీద పనికిమాలిన సర్వేలు అవీ చేసేది వీళ్లే. అట్టు తింటే అమీరని, ఇడ్లీ తింటే గరీబు కాదని, సాయంత్రానికి పదో, పాతికో జేబులో పడ్డవాడు సంపన్నుడేనని దిక్కుమాలిన నిర్వచనాలు ఇచ్చేదీ వీళ్లే. దేశంలో ఎక్కడ చూసినా నిత్యావసరాల ధరవరలు ఆకాశం పరిధులు దాటి రోదసిలోకి సైతం రాకెట్లలా దూసుకుపోతున్నాయి. నేతల దౌర్జన్యాల్లా నిరుద్యోగం పెరిగిపోతోంది. నాయకుల నిజాయతీలాగా సంక్షేమం అంతకంతకు సన్నగిల్లుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన మాటలకు నవ్వు రాదా మరి?' అన్నాడు.

పంకజాక్షి నవ్వుతూనే చదవసాగింది. 'రకరకాల జాడ్యాల నుంచి భారత్‌ను విముక్తం చేసే రోజు ఇంకెంతో దూరంలో లేదు...' అంటూనే నవ్వేసింది.

'అసలైన జాడ్యాలు తలచుకునే కదా నీకు నవ్వొస్తుంట? నిజమే మరి. లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలు జరిగాయి. ఆటల్లో వేటాడారు. బొగ్గు గనుల్లో తవ్వుకున్నారు. ఫోన్ల పేరు చెప్పి పిండుకున్నారు. దర్యాప్తులో వేలెట్టి అడ్డుకోబోయారు. దస్త్రాలు సైతం మాయం చేశారు. సుప్రీంకోర్టు చేత చివాట్లు తిన్నారు. వీటి నుంచి కాక ఇక వేటి నుంచి భారత్‌ విముక్తి పొందాలి?' అంటూ శంకర్రావు నవ్వసాగాడు.

పంకజాక్షి మరో పేజీ తిప్పి, ముఖ్యమంత్రి ఉపన్యాసం చదివింది. 'చూశారా, రాష్ట్రంలో ఏడున్నర కోట్లమందికి కిలో రూపాయికే బియ్యం ఇస్తున్నారంట. భలే, మొత్తం జనాభాయే ఎనిమిదిన్నర కోట్లయితే ఇదెక్కడి ప్రసంగమండీ చోద్యం కాకపోతే?' అంది మరింత నవ్వుతూ.

'అందుకే మరి... దినపత్రికలు చదవమనేది. రాష్ట్ర జనాభాలో ఇరవై శాతానికి కార్డులే లేవు. నలభై శాతం గులాబీ కార్డులవారికి చౌక బియ్యం ఇవ్వరు. మిగిలినవాళ్లు ఏడున్నర కోట్లంటే, ఒకటో తరగతి చదువుతున్న మన బుజ్జిగాడు కూడా పొర్లి పొర్లి మరీ నవ్వుతాడు' అన్నాడు శంకర్రావు.

'మొత్తానికి మన నేతలు భలే నవ్వించార్లెండి...'

'కాబట్టే, దినపత్రికలు చదివితే ఆరోగ్యమని చెప్పేది. ఓ నాయకుడు కోట్లకు కోట్లు కళ్లముందు దోచుకుంటూనే స్వర్ణయుగం తెస్తానంటాడు. మరో నాయకుడు ప్రజల ఆస్తులు కొల్లగొడుతూ, వాళ్ల కోసమే తన బతుకంటాడు. ఇంకో నేత దేశం వెలిగిపోతోందంటాడు. ఇక మనం కామెడీ సినిమాలకు వెళ్లక్కర్లేదు. హాస్యపత్రికలు కొనక్కర్లేదు. లాఫింగ్‌ క్లబ్బుల్లో చేరక్కర్లేదు. ఎ...హే...మం...టావ్‌?'

పంకజాక్షి మరోసారి నవ్వేసింది.
PUBLISHED IN EENADU ON 24.08.2013

గురువారం, ఆగస్టు 15, 2013

బీదల వైభవం



'ఏంటి మావా? ఎప్పుడూ మొహం దిగులుగా పెట్టుకుని తెగ ఆలోచిస్తూ కూర్చునేవాడివి. ఇవాళేంటి? మంచి దిలాసాగా కాలు మీద కాలేసుకుని వూపేస్తూ నీలో నువ్వు నవ్వుకుంటున్నావు... ఏంటి కత?'
'మరేంటనుకున్నావే? ఇన్నాళ్లూ మనవన్నీ బీదల పాట్లు అనుకున్నాం... రెక్కాడితే కానీ డొక్కాడదు... దరిద్రగొట్టుగాళ్లమని ఈసురోమని ఉండేవాడిని... ఇప్పుడు తెలిసింది అసలు సంగతి'

'ఓసోస్‌... ఇంతలోకే ఏం మారిపోయిందేంటి? మన బతుకులు ఎప్పటిలాగే ఏడుస్తున్నాయే?'

'నువ్వూరుకోవే... మనం ఇన్నాళ్లూ అజ్నేనంలో కొట్టుమిట్టాడిపోయాం. మన యువరాజుగారి మాటలు విన్నాక తెలిసింది. ఇందాకా రచ్చబండకాడ పేపరు చదువుతుంటే విన్నాన్లే. అబ్బో... ఎంత బాగా చెప్పాడే? వినగానే మెదడులో మబ్బులన్నీ విడిపోయాయనుకో'

'యువరాజుగారంటే ఆ సోనియా అమ్మ కొడుకేగా... ఇంతకీ ఏం చెప్పాడేంటి ఆయన?'

'అదేమన్నా మామూలు విషయమేంటే? పేదరికమనేది వట్టి భావనంట. అంతా మనం అనుకునేదేనంట. మన ఆలోచనలనుబట్టే ఆ భావన పుడుతుందేగాని నిజానికి పేదరికమన్నది లేనేలేదంట. మరి ఆయన చెప్పినట్టు పేదరికమనేదే లేదనుకో, ఇక మనం దిగులు పడ్డమెందుకు? అందుకే మరి లోపల్నుంచి సంబరం తన్నుకొస్తా ఉంది'

'వార్నీ! అదా సంగతి... నువ్వూ నీ తెలివీ ఏడ్చినట్టే ఉన్నాయి. పొద్దున్న తిండి గొంతు దిగిందో లేదో, రాత్రికి ఆకలేస్తే ఏం తినాలో తెలీదు మనకి. నులక మంచమ్మీద కాళ్లు వూపేసుకుంటూ మనం పేదలం కాదని వూరికే అనేసుకుంటే సరిపోతుందేటి? ఆ యువరాజా బాబుకేం... ఎన్నయినా చెబుతాడు. కడుపునిండిన వాడు. ఆయనగారి మాటలు విని కడుపులో కాళ్లు పెట్టుకుని కూర్చున్నామనుకో, డొక్కలెగరేయాల్సిందే. ముందా మంచం దిగి పిల్లల కడుపు నిండే దారేదో చూడు'

'వూరుకోవే... వెధవ నస, వెధన నసాని. నీదెప్పుడూ ఒకటే గోల. ఆయనేం చెప్పాడో ఓసారి నిదానంగా ఆలోచించి చూడు. నిజమేంటో తెలుస్తాది. అసలు పేదలంటే ఎవరు? ఏది లేనివాడిని పేదవాళ్లని అంటాం? మన సంగతే చూడు. కంతల్దో, కన్నాల్దో ఓ పూరి గుడిసంటూ ఉందా? వూగేదో, వూడేదో ఓ నులక మంచముందా? కలో, గంజో తింటున్నామా లేదా? మరీపాటి కూడా లేనివాళ్లు లేరేంటి? మరి వాళ్లకంటే మనం గొప్పే కదా? ఓసారి ఆలోచించు'

'నిన్ను చూస్తుంటే రాత్రి వూళ్లో పంచాయతీ ఎన్నికలోళ్లు పోయించిన మందు మత్తు ఇంకా దిగినట్టు లేదు. సిగ్గు లేకపోతే సరి. ఏ పూటకాపూట కాయకష్టం చేస్తే కానీ ఇంత కూడు కూడా నోటి దగ్గరకి రాదు. మన బతుకులు గొప్పంటావేంటి? ఆయనకేం? తల్లి చాటు బిడ్డ. ఆ సోనియా అమ్మ చంకనేసుకుని సాకుతూ, రేపో మాపో పెద్ద కుర్చీ ఎక్కించేద్దామని ఆలోచిస్తోంది. వాళ్లకి ఆ కుర్చీలు, అవి ఎక్కే దారులే కనిపిస్తాయి కానీ మనలాంటి పేదల బతుకుల్లో అతుకులు అగపడతాయా? ఆయనేదో అన్నాడంట... ఈయన కులాసాగా కూర్చున్నాడంట. లే...లే...'

'అది కాదే. మరాయన మాటల్లో అసలు పసేమీ లేదంటావా?'

'పసా, నసా? దిక్కుమాలిన గొడవ. ఆ యువరాజు నాయనమ్మ ఇందిరమ్మ ఏమంది? దేశంలోంచి అసలు పేదరికాన్నే తరిమేస్తామంటూ గొప్పలు చెప్పారా లేదా? మరి తరిమారా? ఎక్కడ చూసినా పేదల్నే తరిమి తరిమి కొడుతున్నారు. ఇక యువరాజు నాన్న ఏమన్నారో గుర్తు లేదా? పేదవాళ్ల బతుకుల్లో పూలు పూయించేస్తామన్నారు. కానీ మనకి అడుగడుగునా ముళ్లే కదా ఉన్నది? ఇప్పుడీయనగారి అమ్మగారి మాటలూ అంతే. ఈవిడగారి హయాములోనే కదా, ఆ మధ్యన పేదరికం మీద సర్వేలు, గట్రా చేసి మాగొప్ప విషయాలు చాటి చెప్పారు... గుర్తుకు రాలే? పొద్దున్న ఫలహారంగా ఇడ్లీలు, అట్టు తింటే పేదవాడికింద లెక్కలోకి రారని, రోజుకి ఇరవయ్యో పాతికో సంపాదించేవాళ్లెవర్నీ పేదలని అనక్కర్లేదని నానా కూతలు కూశారు. ఇవన్నీ చూడకుండా యువరాజుగారు కలతనిద్రలో వాగినట్టు ఏదో అంటే దాన్నే పట్టుకుని వేలాడుతున్నావ్‌... నేను చెబుతున్నది బుర్రలోకెక్కుతోందా?'

'ఎక్కడమేటే బాబూ... రాత్రి ఎక్కిందంతా దిగిపోతేను? నువ్విన్ని విషయాలు విడమరిచి చెప్పాక ఇంకా బుర్రకెక్కదా? ఏదో అదాటున ఆయన మాటలు నిజమే కాబోలనుకున్నాను. కానీ ఆయనగారి నాయనమ్మ నుంచి ఇప్పటి వరకు ఎవరెన్ని మాటలు చెబుతున్నా మన పేదల బతుకులు ఇలాగే నానాటికీ తీసికట్టు అన్నట్టు ఉన్నాయని తెలుసుకోలేకపోయాను. నువ్వనేది నిజమేలే...'

'ఇంకా నెమ్మదిగా అంటావేంటి? ఎవరెన్ని చెప్పినా మన బతుకులేవీ మారవు. అంతగా అంతా భావనలోనే ఉందంటే ఆ యువరాజుగారే భావించుకోవచ్చుగా... పెద్ద కుర్చీలో తానే కూర్చున్నట్టు... దేశానికి రాజైపోయినట్టు... చాలా చక్కగా పరిపాలిస్తున్నట్టు... దేశవిదేశాల్లో ఆయనగారి సత్తా గురించి మీటింగులు గట్రా పెట్టేసి మరీ పొగిడేస్తున్నట్టు... అమ్మా బాబూ కలిసి మన దేశానికి బంగారు తాపడం చేసేసినట్టు... ఇంకా ఇలా తోచినట్టు! పడక పడక మన పేదరికం మీద పడాలేటి... ఏమంటావు?'

'ఇంకేమంటాను, నువ్వింత బాగా చెప్పాక? నువ్వేటంటే నేనూ అదే అంటాను. పేదరికమంటే వట్టి భావనన్నాడు! ఛీ... ఇందులో ఏదో కొత్త సంగతి ఉందనుకున్నాను... మన దరిద్రం మారదని తోచలేదు... మా బాగా చెప్పావే... మొత్తమ్మీద నాకంటే బుర్రున్నదానివే'

'ఈ సంగతి నీకు ఇన్నాళ్లు కాపురం చేశాక తెలిసిందేంటి? కానీ ఓ సంగతి చెప్పనా? నిజానికి నేను బుర్రలేనిదాన్నేలే...'

'అదేంటి?'

'అంత బుర్రే ఉంటే నిన్ను కట్టుకుంటానేంటి? ఇకనైనా లే. లేచి సాయంత్రానికి నాలుగు నూకలు తీసుకొచ్చే దారేదో చూడు!'

PUBLISHED IN EENADU ON 13.08.2013

బందిపోటుకి 50 ఏళ్లు

అరాచకత్వం అధికారం చెలాయిస్తున్నప్పుడు...
ప్రజాచైతన్యం ఓ కథానాయకుడి రూపం దాలుస్తుంది...
అవినీతి అక్రమాలు ప్రజావంచనకు పాల్పడినప్పుడు...
ఆ కథానాయకుడి వీరత్వం నీరాజనాలు అందుకుంటుంది...
'బందిపోటు' సినిమా వెండితెరపై ఆవిష్కరించినది ఇదే!
అందుకే 50 ఏళ్లయినా అదొక చెరగని జ్ఞాపకంగా మిగిలింది!

ఆత్మవిశ్వాసాన్ని పోత పోసినట్టుండే ఆరడుగుల కథానాయకుడు... పొగరు, తలబిరుసు కలబోసిన అందాల రాకుమారి... ఇక వీరిద్దరి మధ్య జరిగే ప్రేమకథ ఆకట్టుకోకుండా ఎలా ఉంటుంది? నందమూరి తారక రామారావు కథానాయకుడిగా, కృష్ణకుమారి కథానాయికగా 50 ఏళ్ల క్రితం విడుదలైన 'బందిపోటు' సినిమా అందుకనే అఖిలాంధ్ర ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. జానపద బ్రహ్మ విఠలాచార్య దర్శకత్వంలో నిర్మాతలు సుందర్‌లాల్‌ నహతా, డూండీలు తీసిన ఈ సినిమా పేరును తల్చుకోగానే ఇప్పటికీ ఆ దృశ్యాలు కళ్లముందు కదలాడుతాయి.
సినిమా మొదట్లోనే అడవిలో విహారానికి వచ్చిన రాకుమారిని కాపాడిన కథానాయకుడు ఆమె అందానికి ముగ్ధుడైపోతే, అతడిలోని చిలిపిదనం వెల్లువెత్తి ప్రేక్షకుల చేత నవ్వులు పూయిస్తుంది. ఎంత సాహసవంతుడైనా ఓ సామాన్య యువకుడి చొరవను సహించలేని రాకుమారి రాచరికపు అహంకారం కస్సుమంటుంటే ప్రేక్షకులందరూ ముసిముసిగా నవ్వుకుంటారు. రాజుగారి అనారోగ్యాన్ని సాకుగా తీసుకుని అరాచకం సాగించే బావమరిది రాజనాలలాగా రెచ్చిపోతే, ఎదురు తిరిగిన కథానాయకుడు అందుకు దీటుగా విజృంభిస్తాడు. చిన్నాన్నని, తండ్రిని మోసగించి చంపించిన రాజనాల దౌర్జన్యాల బారి నుంచి ప్రజల్ని కూడా రక్షించడానికి తానే బందిపోటుగా మారతాడు. ఇదేమీ తెలియక ఆ బందిపోటును బందీ చేస్తానని బయల్దేరిన రాకుమారికి కథానాయకుడు నిజమేమిటో చెప్పాలనుకున్నాడు. అందుకే ఓ పాటందుకుని... 'వగల రాణివి నీవే...' అన్నాడు. 'సొగసుకాడిని నేనే...' అని కూడా చెప్పాడు. ఆపై... 'ఈడు కుదిరెను, జోడు కుదిరెను, మేడ దిగిరావే' అంటూ పిలిచాడు. బందిపోటనుకుని బంధించడానికి వచ్చిన రాకుమారికి అతడి ప్రేమ కబుర్లు చికాకు కలిగించకుండా ఎలా ఉంటాయి? కాబట్టే, అతడు 'పిండి వెన్నెల నీకోసం... పిల్లతెమ్మెర నాకోసం... రెండు కలిసిన నిండు పున్నమి రేయి మనకోసం...' అని ఎంతగా చెప్పినా వినలేదు. చివరికి ఆమెను బంధించి గుహలోకి తీసుకెళ్లి మరీ రాజ్యంలో జరుగుతున్న అరాచకాలను వివరించాల్సి వచ్చింది. బందిపోటు మంచి మనసు అర్థమైన వెంటనే రాకుమారి, ఇక ఇప్పటికే ఆలస్యమైందని చటుక్కున ప్రేమలో పడుతుంది. ఇంకేముంది? డ్యూయట్టే!



ఆమె అక్కడ అంతఃపురంలో. అతడు అడవిలోని గుహలో. వెండితెర రెండు భాగాలైన రవికాంత్‌ నగాయిచ్‌ చక్కని ఫొటోగ్రఫీ సాక్షిగా, ఘంటసాల అద్భుతమైన సంగీతం బాసటగా ఆమె తీయని గొంతెత్తి, 'వూహలు గుసగులాడె... నా హృదయము వూగిసలాడె...' అని ప్రేమను బయటపెట్టేసింది. ఆపై వివశమైపోయి 'వలదన్న వినదీ మనసు... కలనైన నిన్నే తలచు...' అని కూడా చెప్పేసింది. చివరికి 'నీ ఆనతి లేకున్నచో విడలేను వూపిరి కూడా...' అనేసింది. మరి అతడు వూరుకుంటాడా? 'నను కోరి చేరిన వేళ... దూరాన నిలిచేవేల?' అని ప్రశ్నించి మరీ దగ్గరయ్యాడు. ఇంకేముంది? వాళ్ల ప్రేమకు 'దివి మల్లెపందిరి వేసింది... భువి పెళ్లి పీటను వేసింది'! ప్రేక్షకులంతా కేరింతలు కొట్టారు.
ఓ సినిమా జనరంజకంగా రూపొందాలంటే ఏమేం అంశాలుండాలో అన్నీ సమపాళ్లలో కుదిరిన 'బందిపోటు', విఠలాచార్య దర్శకత్వ పటిమను, మహారథి కథలోని పట్టును చాటి చెబుతుంది. రాజైన బావగారిని బంధించి, మేనకోడలైన కృష్ణకుమారిని పెళ్లి చేసుకుని సింహాసనం ఎక్కాలనుకునే రాజనాల క్రౌర్యం, అతడిని ముప్పుతిప్పలు పెట్టి నవ్వులు పండిస్తూనే అతడి నిజస్వరూపాన్ని బయటపెట్టే ఎన్టీఆర్‌ ధీరత్వాలను కథ, కథనాలు కదం తొక్కిస్తాయి. కోటలోకి చొరబడి రాకుమారిని ఉడికించడం, మారువేషాలతో రాజనాలను ఏడిపించడం లాంటి ఎన్నో సన్నివేశాల్లో ఎన్టీఆర్‌ నటన ప్రేక్షకుల చప్పట్లను, ఈలల్ని అందుకుంటుంది. ముఖ్యంగా రాకుమారి అంతఃపురంలో అద్దం వెనక నుంచి ఎన్టీఆర్‌, తాగిన మత్తులో ఉన్న రాజనాలను ఆటపట్టించే సన్నివేశం థియేటర్లలో నవ్వులు పండించింది. ఇక పతాక సన్నివేశాలను ఈస్ట్‌మన్‌ కలర్‌లో చూపించడం మరింత ఆకర్షణను చేకూర్చింది. ఈ సినిమా అప్పట్లో 5 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకొంది. మొత్తానికి ఇప్పటి తరంవారు ఏ సీడీయో వేసుకుని చూసినా హాయిగా ఆనందించగలిగే అపురూప జానపద చిత్రం 'బందిపోటు'.

PUBLISHED IN EENADU ON 15.08.2013

శనివారం, జూన్ 15, 2013

భ్రష్టయోగానందం



శిష్యుడు వచ్చేసరికి గురువుగారింట్లో హడావుడిగా ఉంది. చాలామంది నేలమీద చాపలు పరచుకుని కూర్చుని ఉన్నారు. గోడ మీద కట్టిన పెద్ద ప్రకటనపై 'రాజకీయ యోగా తరగతులు' అని రాసి ఉంది. దాని కింద 'భ్రష్టయోగి' అని ఉంది.
శిష్యుడు నేరుగా ఇంట్లోకి వెళ్లి గురువుగారిని చూసి, 'ఇదేం సందడి గురూగారూ?' అని అడిగాడు.

'అహ... ఏం లేదురా! అమెరికా, చైనాల్లో రకరకాల యోగ విధానాల గురించి పత్రికలో చదివా. ఆ పళంగా ఆలోచనొచ్చి బోర్డెట్టేశా. ఇంతమంది వస్తారనుకోలేదు' అన్నారు.

'ఎందుకు రారండి? కుంభకోణాల గురించి చదువుతున్నారు కద? కళ్లు మూసి తెరిచేంతలో కోట్లకు కోట్లు వచ్చే అవకాశం ఇంకెక్కడ ఉంటుంది చెప్పండి? ఎలాగోలా ప్రజల్ని నమ్మించి ఒక్కసారి అధికారంలోకి వస్తే చాలిక జీవితంలో స్థిరపడిపోవచ్చు' అంటూ శిష్యుడు నవ్వాడు. ఆపై ఇద్దరూ కలిసి హాల్లోకి వచ్చారు.

గురువుగారు ఉపోద్ఘాతం మొదలుపెట్టి, 'ఈ సరికొత్త యోగా నేర్చుకుంటే రాజకీయాల్లో సునాయాసంగా దూసుకుపోవచ్చు. శ్రద్ధగా నేర్చుకుంటే మనసా, వాచా, కర్మణా దిగజారిపోవచ్చు' అన్నారు. అందరూ ఆనందంగా సర్దుకుని కూర్చున్నారు.

'ముందుగా ధ్యానమార్గం చెబుతాను. దీని పేరు 'కాసు మీద ధ్యాస'. అందరూ కళ్లు మూసుకుని భృకుటి మధ్యలో నోట్లకట్టలను ఊహించుకోండి. మీకెంతగా ఏకాగ్రత కుదిరితే అంతగా నీచోపాయాలు తడతాయి. మనిషిగా దిగజారి, నీచ నేతగా విశ్వరూపం దాలుస్తారు' అంటూ గురువుగారు ఉపోద్ఘాతం దంచారు.

ఇంతలో ఒకడు 'ఈ ధ్యానమార్గంలో ఆదర్శప్రాయంగా ఎదిగిన మహానుభావులెవరైనా ఉన్నారాండీ?' అని అడిగాడు.

గురువుగారి పక్కనే కూర్చున్న శిష్యుడు అందుకుని, 'ఉన్నారున్నారు. వారే జగన్నాటక సూత్రధారులు. వారెంతగా ఎదిగారంటే నిఘా, దర్యాప్తు, రక్షక దళాలు మొత్తం నివ్వెరపోయి నేరుగా వారిని కారాగారంలోకి పంపించారు. వారి గురించి పేపర్లలో రోజుకో పతాకవార్త రాసినా ఏళ్లకేళ్లు గడిచిపోతాయి. తరచు వారి ముఖారవిందాన్ని పత్రికలు ప్రచురించక తప్పడంలేదు' అన్నాడు.

వచ్చినవారంతా తన్మయులైపోయి, 'ఆహా... ఎంత ప్రచారం! ఎంత ప్రాచుర్యం! జన్మంటే అదీ. మేమూ ఉన్నాం ఎందుకూ? ఇన్నాళ్లు బతికినా ఒక్క చెడ్డ పని చేయలేకపోయాం. కనీసం చుట్టుపక్కలవారి చేతనైనా ఛీకొట్టించుకోలేకపోయాం' అంటూ తెగ బాధ పడిపోయారు.

గురువుగారు వారిని ఓదార్చి, 'నీచ రాజకీయాల్లో నిస్పృహ కూడదు నాయనలారా! మీలాంటి ఉత్తములను చెడగొట్టడానికే నేను భ్రష్టయోగిగా మారాను. ఇప్పుడు ఆసనాలు సాధన చేద్దాం. ముందుగా 'విచిత్ర ముఖాసనం' నేర్పుతాను. అందరూ సాధ్యమైనంత ఏడుపు మొహం పెట్టండి. మీరు కావాలని నవ్వినా అది ఏడ్చినట్టుండాలి' అన్నారు. అందరూ ముఖాల్ని అష్టవంకర్లు తిప్పుతూ సాధన చేశారు.

'దీనివల్ల లాభమేమిటండీ?' అన్నాడొక సాధకుడు.

'నీ ఏడుపంతా ప్రజల కోసమేనని సభల్లో నమ్మించవచ్చు. నిజానికి నీ ఏడుపు అధికారం కోసమని వేరే చెప్పక్కర్లేదు కదా?' అంటూ వివరించాడు శిష్యుడు, గురువుగారి సైగనందుకుని.

'ఇప్పుడు 'చంచల హస్త నిమురాసనం'. మీరు జనంలోకి వెళ్లగానే ముసిలమ్మనో, చిన్నపిల్లనో చటుక్కున దొరకబుచ్చుకోవాలి. చేతులు సాధ్యమైనంత వణికిస్తూ వాళ్ల తలవంచి నిమరాలి. మొహమంతా తడమాలి. వీలుంటే నూనె వాసనని చూడకుండా నడినెత్తి మీద ముద్దు పెట్టేయాలి' అన్నారు గురువుగారు.

శిష్యుడు అందుకుని 'దీని వల్ల ఈయనకు మనమంటే ఎంతో ప్రేమనుకుని జనం కళ్లకు బైర్లు కమ్మేస్తాయి' అంటూ వివరించాడు. సాధకులందరూ ఒకరి తలలు ఒకరు నిమురుకోసాగారు.

'ఇప్పుడు 'ఇచ్చిపుచ్చుకాసనం'. ఎడమ చేతిని వీపు వెనక నుంచి తీసుకొచ్చి ఎదుటివారి చేయి పట్టుకోవాలి. అదే సమయంలో కుడిచేత్తో కరచాలనం చేయాలి' అంటూ గురువుగారు చెప్పేసరికి అందరూ ఆపసోపాలు పడసాగారు.

'దీని వల్ల రక్తప్రసరణలో అవినీతి కణాలు పెరిగి ఎదుటివారికి కొద్దిగా లాభం చూపించి, దొడ్డిదారిన దోచేసే లాఘవం ఒంటపడుతుంది. నీకది, నాకిది లాంటి పథకాలను సులువుగా అమలు చేసే తెలివి పెరుగుతుంది' అని వివరించాడు శిష్యుడు.

'ఆ తరవాత 'అధికార వక్రాసనం' నేర్చుకుందాం. ఏదైనా ఒక కుర్చీ మీద కూర్చుని చేతులతో కుర్చీ వెనక భాగాన్ని, కాళ్లతో కుర్చీ కాళ్లను పెనవేయాలి' అని గురువుగారు చెప్పారు. ఆయనలా అనగానే 'దీనివల్ల అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలు పనులు చేసే ఆలోచనలు పెల్లుబుకుతాయి. పదవిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలని పట్టు చిక్కుతుంది' అంటూ శిష్యుడు విప్పి చెప్పాడు.

'తరవాతది 'జనవంచక జెల్లాసనం'. పైకి మెత్తగా నవ్వుతూ ఎదుటివారు చూడకుండా వారి నెత్తిమీద జెల్ల కొట్టాలి. ఇందువల్ల జనాన్ని నమ్మించి రకరకాల పథకాల ఆశ చూపిస్తూ వారి సొమ్మునే కొల్లగొట్టే నయవంచక నైపుణ్యం అలవడుతుంది' అని గురువుగారు చెప్పగానే సాధకులంతా ఒకరికొకరు జెల్లలు కొట్టుకున్నారు.

'అన్నింటికన్నా ముఖ్యమైనది ఇప్పుడు చెబుతాను. ఇది 'నిర్లజ్జాకర నవ్వాసనం'. ఎన్ని వెధవ పనులు బయటపడినా, ఆఖరికి జైల్లో కూర్చున్నా, ఎలాంటి సిగ్గూశరం లేకుండా, పెద్ద ఘనకార్యం చేసినట్టు నవ్వేసే లౌక్యం వస్తుంది. ఇవన్నీ సాధన చేస్తే మీరొక నీచ రాజకీయ నేతగా ఎదుగుతారనడంలో సందేహం లేదు' అంటూ ముగించారు గురువుగారు.
సాధకులంతా ఉత్సాహంతో 'ఛీఛీ'లు కొట్టారు!

PUBLISHED IN EENADU DAILY ON 15.06.2013

బుధవారం, మే 29, 2013

సానుభూతి వేషాలు!



'గుండెల్లో గునపాలు... గుచ్చారే నీ వాళ్లు...
విరిగినది నీ మనసు... అతుకుటకు లేరెవరూ...'

'ఏంట్రోయ్‌... అంత బరువైన కూనిరాగం పాడతా వత్తన్నావు? కొంపదీసి ఖూనీగానీ కానిచ్చావేటి?'

'అదేంటి గురూగారూ, అంత మాటనేశారు? ఖూనీ చేస్తే కులాసాయే కానీ, కుదేలైపోతామా చెప్పండి...'

'మరంత ఏడుపుగొట్టు పాట పాడే అవసరం ఎందుకొచ్చిందా అని?'

'ఏముంది గురూగారూ! నా దారిన నేనేదో ప్రజాసేవ చేసుకుపోతుంటే చట్టం వూరుకోడం లేదండి. కోడిగుడ్డుకు ఈకలు పీకి అవన్నీ వెధవ పన్లంటోందండి. రేప్పొద్దున ఎటు తిరిగి ఎటొచ్చినా జనం గుండెల్లో సానుభూతిని సజీవంగా ఉంచాలని తాపత్రయమండి. అందుకు మీరేమైనా ఐడియాలు ఇస్తారేమోనని ఇలా వచ్చానండి'

'ఓరెర్రోడా! లొల్లాయి రాగాలు తీత్తే సానుబూతి కురిసిపోద్దేంట్రా? దానికెంత తతంగముంటదీ? ఓ లెక్క ప్రెకారికంగా దాన్ని జమాయించుకోవాల మరి. ఎక్కడా జనం సూపు జారిపోకండా కాపు కాయాల. రాజకీయాల్లో సానుబూతనేది శానా గొప్పదొరే. ముందా సంగతి మనసులోలెట్టుకో'

'అందుకే కదండీ, చట్టం తన పని తాను చేసుకుపోతుంటే, నేనిలా పనిగట్టుకుని మీ దగ్గరకి వచ్చింది? నాకిన్ని సూత్రాలు బోధించి మీ పని కూడా మీరు కానివ్వండి మరి...'

'సానుబూతి సునామీలో జనాన్ని నిలువునా ముంచేయాలనుకుంటే ముందుగా సేయాల్సిన పనొకటుందిరా. ఎకాఎకినెల్లి అద్దం ముందు నుంచోవాల. నీ మొగాన్ని పరీచ్చగా సూసుకోవాల. ఏ మూలనైనా సిరునవ్వు జాడలు గట్రా కనిపిత్తే ఎంటనే తుడిసేసుకోవాల. వీలయినంత దిగులుగా మొగమెట్టడం నేరుసుకోవాల. ఆనకే జనం ముందుకెల్లాల. ఎల్లాక ఆల్ల కట్టాలు ఎరికొచ్చి నువ్వు పద్దాకా కుమిలిపోతున్నట్టు సూసినోల్లంతా నమ్మేట్టు కనిపించాల. అయ్యోపాపం... బిడ్డ, మన కోసమెంత తల్లడిల్లిపోతున్నాడో, ఏలకి తిండైనా తింటన్నాడో లేదోనని పెజానీకమంతా బెంగెట్టేసుకునేలా నీ వాలకం ఉండాల. ఆల్ల అమాయకత్వం చూసి నీకో పక్కనుంచి గబుక్కున నవ్వొచ్చేత్తన్నా, తత్తరపడిపోకుండా తమాయించుకుని అది నవ్వో ఏడుపో తెలీనంతగా మొగమెట్టేయాల. ఇది తొలి మెట్టన్నమాట'

'అబ్బో... కష్టమేనండి. వాళ్లని నమ్మించి, వూరించి, వూదరగొట్టి, ఆశపెట్టి అధికారంలోకి వచ్చాక... వాళ్లకి తెలీకుండానే వాళ్ల సొమ్ముల్ని చుట్టుతిప్పుకొచ్చి మన జేబులో పడేసుకుంటున్న విషయం జనంలోకి వెళ్లగానే గుర్తొచ్చేస్తుందండి. ఆ పళంగా పెదాలపై తెగ నవ్వు, కులుకు, కులాసా, దిలాసా వచ్చేస్తుంటాయండి. లోపలినుంచి తన్నుకొచ్చే సంబరాన్ని అదిమిపట్టి పైకి అలా అయోమయం మొహం పెట్టడమంటే మరి... మహా నటుడైతేనే సాధ్యమండి. అయినా నేర్చుకుంటాలెండి, తప్పుతుందా? రాజకీయాల్లోకి దిగాక ఇలాంటి కష్టాలెన్నయినా దిగమింగుకోవాలి మరి. ఇక తతిమ్మా సూత్రాలేంటో చెప్పరూ?'

'ఇక పీటమెక్కగానే నువు సేసేవెలాగూ ఎదవ పన్లే కాబట్టి అయి ఎలాగోలా బయటపడక మానవు. ముందుగా ఎగస్పార్టీవోల్లు పత్రికలోల్లని కేకేసి ఇదిగో ఈడింత ఎదవ, అంతెదవ, మరీ ఇంతోటెదవనుకోలేదూ... ఇందులో దోసేసాడు, అందులో నొక్కేసాడు, ఆకాడ దాచేసాడు, ఈకాడ బొక్కేసాడు, ఇల్లిక్కడ గిల్లేసాడు, అల్లక్కడ నొల్లేసాడు, మాయసేసాడు, ముంచేసాడని మొదలెడతారు. అయ్యన్నింటినీ కూడా నువ్వు సానుబూతికి జమేసేసుకోవాల. ఎలాగో సెబుతానినుకో. ఇదిగో అమాయక జనాలూ... సూసారా, నేనేదో మీకింత మేలు సేద్దారని నానా పన్లూ సేత్తాంటే, ఈల్లు ఓర్వలేకపోతన్నారూ, నా మీద కుట్రలు గట్రా పన్నేత్తన్నారని సెప్పేసేసి ఆ పత్రికలోల్లనే కేకేసి కూసేయాల. ఈలుంటే నీకంటూ ఓ పేపరెట్టుకుంటే ఇంకా మంచిది. అంటే ఎవరే తప్పు సూపెట్టినా ఎదురెట్టేయడన్నమాట. ఇంకా కావలిస్తే ఆల్ల సెరిత్రలోకి పోయి అక్కడేమీ లేకపోయినా ఉన్నదాన్నే బూతద్దంలో సూపిత్తా ఈల్లేం తక్కువ కాదని వాగేయాల, అచ్చేయాల'

'మరి చట్టం సీన్లోకొస్తేనోనండీ?'

'ఏముందిరా... ఎదురెట్టేవోడికి సెట్టమైనా ఒకటే, నేయమైనా ఒకటే. ఆకరికి ఆ దేవుడే దిగొచ్చి నువ్వొట్టి దగుల్బాజీవని సెప్పినా, మొన్నోపాలి టెంకాయ కొట్టనందుకు పగబట్టేసాడని బుకాయించడమే! నీ మీద వాగినోల్లది కుట్ర, కూపీ లాగినోల్లది కుట్ర, రుజువులు సూపినోడిది కుట్ర, సివరాకరికి సిచ్చ పడినా కోర్టోల్లది కూడా కుట్రే అని గగ్గోలు పెట్టేయాల'

'ఆహా బాగుందండీ. మరి అరెస్టయిపోయి జైల్లో పడితేనోనండీ?'

'అదింకా మంచిదొరే. సినేమావోల్లు సూడు, మా సినిమా బయటకొచ్చి ఇన్ని వారాలైంది, అన్ని వారాలైందని సెబతా సాటుకుంటారుగా? అట్టాగే నువ్వు లోపలికెల్లి ఆర్నెల్లయింది, ఏడాదైందని వాల్‌పోస్టర్లు గుద్దించి వూరూవాడా మైదా పిండెట్టి అతికించేయాల. నీ కంటూ పేపరుంటే ఇక రోజూ అదే పని మరి. అందరూ కలిసి దరమ దేవత గుడ్డలూడదీసేత్తన్నారూ, నిజాల నోరు నొక్కేత్తన్నారూ, నేయ దేవత పీక పిసికి సంపేత్తన్నారూ... అంటూ సానుబూతి పిండుకోవాల. అక్కడికి నువ్వేదో పరమ అవతార పురుసుడవన్నట్టన్న మాట. వీలుంటే సెల్లినో, తల్లినో, బామ్మర్దినో జనంలోకి పంపి మైకులిచ్చి ఎక్కడలేని ఏడుపులూ ఏడవమనాల'

'సరే కానీ గురూగారూ! చేసిన పన్లన్నీ రుజువైపోయి జనాలు మన నీచ నిజ స్వరూపాన్ని, అవినీతి విశ్వరూపాన్ని తెలుసుకుని చైతన్యవంతులేపోతేనోనండీ?'

'అప్పుడిక నిజమైన ఏడుపుగొట్టు పాటలు పాడుకుంటా, నీమీద నువ్వే సానుబూతి పడొచ్చు. రాగానే పాడావు సూడు ఆ పాట పల్లవోసారి అను'

'నీ ఆశ అడియాస... చేజారే మణిపూస... బతుకంతా అమావాస... లంబాడోళ్ల రాందాస...'

'అదీ అసల్లెక్క. ఇక పోయిరా!'


PUBLISHED IN EENADU ON 28.05.2013

బుధవారం, మే 08, 2013

అన్నగారి ఆత్మఘోష




అయ్యారే... ఇదేమి సభామంటపము? సర్వాంగ సుందరముగా, శోభాయమానంబుగా వెలుగొందుచున్నదే! మహామహుల మూర్తిమత్వ ధీరగంభీర ప్రతిమా స్వరూపములకు ఆలవాలమై అలరారుచున్నదే!
ఓహో... అవగతమైనది! ఇయ్యది... అఖిల భారతావని అప్రమేయ అధికార విలాసములకు ఆటపట్టు! సకల జనాభీష్టములకు అనుగుణముగా సాకారమైన సంపూర్ణ స్వేచ్ఛాస్వాతంత్య్రాలకు పట్టుగొమ్మ! ఇంద్రప్రస్థ మహానగరాన వెలసిన అత్యద్భుత, అద్వితీయ, అనుపమాన, అపురూప సభామంటపము! పార్లమెంటు పరిపాలనా ప్రాంగణము!
ఎవరది? ఆ చెంతన విగ్రహ రూపమెవరిది? నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనమై, నిజాయతీకి నిత్య దర్పణమై నిలుచుండిన ఆ స్వరూపము టంగుటూరి ప్రకాశం పంతులుగారిదేనా! కాక మరెవ్వరు? బ్రిటిష్‌వారి తుపాకి గుండుకు ఎదురుగా గుండెనిలిపి నిలిచిన అసమాన ధైర్యసాహసాలకు ప్రతిరూపమైన తెలుగుతేజం అదే! ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉన్నత హోదానందుకుని కూడా, నిరుపేదవలె నిత్యజీవనము సాగించిన నిరుపమాన రాజకీయ దురంధరా, మీకిదే నా వందనము! కానీ పంతులుగారూ! గమనించితిరా? నేటి రాజకీయ దౌర్జన్య, దురాగత, దుర్నిరీతి, దుర్విధానములను? పదవి పొందిన మర్నాటి నుంచి ప్రజా ప్రయోజనములను పక్కనపెట్టి, స్వీయ కుటుంబ సంక్షేమమే పరమావధిగా... ఆంధ్ర రాష్ట్రమున సస్యశ్యామలమైన వ్యవసాయ సుక్షేత్రములను, అంతులేని ఖనిజ సంపదలకు ఆలవాలమైన సువిశాల గనులను, అస్మదీయులకు అడ్డగోలుగా కట్టబెట్టి... అందుకు ప్రతిఫలంబుగా తన కుపుత్రుని సంస్థల్లోకి పెట్టుబడులను ఆకర్షించి అచిరకాలముననే లక్షలాది కోట్ల రూపాయల అక్రమార్జనకు తెరతీసిన నేటి మనరాష్ట్ర పాలకుల నీచ నికృష్ట రాజకీయ తెంపరితనమును చూచితిరా? సామాన్య జన జీవనాల్లో ఇసుమంతైననూ మార్పు తీసుకురావాలనే తపనతో నిరంతరము పరితపించిన మీ విధానములెక్కడా? అధికారము కోసమే కలవరిస్తూ, అందుకోసం అమాయక ప్రజలను మభ్యపెట్టి, ఆశపెట్టి, భ్రమలు కల్పించి, భ్రాంతుల్లో ముంచి, మాయ చేసి, అబద్ధపు వాగ్దానాల వలలో పడేసి, అసంబద్ధ పథకాల అనుచిత విధానాలతో ఆకర్షించి... అధికారం అందగానే దురహంకారులై, దుర్య్యాపార కార్యకలాపములకు ద్వారాలు తెరచి... ప్రజాధనాన్ని కొల్లగొడుతున్న నేటి ప్రభువుల నిర్లజ్జాకర పరిపాలనా ప్రాధాన్యములెక్కడ? అహో... తలచుకుంటున్న కొద్దీ మనసు వికలమైపోవుచున్నదే!
ఆ పక్కన ఎవరు? ఓ... ఎన్‌జీ రంగా గారా? అయిదు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయవేత్తగా రికార్డును నెలకొల్పి, పద్మవిభూషణ్‌ అందుకుని, తెలుగువారి తెగువను జాతి మరువలేని రీతిలో తేటతెల్లం చేసిన మీకిదే అభివందనం! అన్నదాతల సంక్షేమం కోసం అకుంఠిత దీక్షతో పోరాడి, రైతు ఉద్యమానికి ఆద్యులైన మీ కృషి సదా, సర్వదా సంస్మరణీయం! కానీ... నేడు మన తెలుగు రాష్ట్రమున... అధికారమును అధిరోహించిన అవినీతి పాలకుల పాలబడిన కర్షకుల కన్నీటి గాథలు మీ చెవిని తాకలేదా రంగాజీ? రైతులే తమకు దేవుళ్లంటూ, కర్షకులే తమ కళ్లంటూ కల్ల మాటలాడి, కపట ప్రేమలొలకబోసిన మాయదారి నేతల మోసపూరిత విధానాలతో అన్నదాతలు నిలువునా నీరుగారిపోతున్నారు! ఇది మనలాంటి కర్షకమిత్రులకెంత మనోక్లేశము! ఎంత దుర్భరము!

అటు పక్క ఆ తెలుగు తేజమెవరిది? ఓహో... భోగరాజు పట్టాభి సీతారామయ్యగారిదా? స్వాతంత్య్ర సమర యోధునిగా, ఉత్తమ రాజకీయ నేతగా తెలుగువారి ఖ్యాతిని ఇనుమడింపజేసిన మీకిదే అభివందనము. దేశాభివృద్ధికి బ్యాంకుల వ్యవస్థ ఎంతగానో దోహద పరుస్తుందని నమ్మి, ఆంధ్రా బ్యాంకు సంస్థాపకునిగా వినుతికెక్కిన మీ దూరదృష్టికి జోహార్లు! కానీ... ఈనాటి బ్యాంకుల వ్యవస్థలో చోటు చేసుకుంటున్న అవాంఛిత విధానములను గమనించితిరా పట్టాభిగారూ? స్వార్థపరులైన వాణిజ్యవేత్తలతో, అవినీతి రాజకీయ నేతలతో జట్టుకట్టి, నల్ల ధనమును తెల్లగా మార్చడంలో అనుచిత విధానాలకు అవి ఆటపట్టుగా మారుతున్నవని వినికిడి! ఎంతటి దర్వ్యవస్థ ఇది?

ఏమైననూ మీవంటి తెలుగు తేజముల సరసన పార్లమెంటు భవనమున సముచిత స్థానమును పొందుట నాకెంతో ముదావహము! ఏమంటిరి? తెలుగువారి ఆత్మగౌరవమును, దేశవిదేశాలలో సైతము చాటి చెప్పిన ఘనత నాదేనందురా? అదియంతయూ మీ అభిమానము! తెలుగు ప్రజల అద్వితీయ ఆదరణ ఫలితము!!

ఒక్కసారి... ఈ మహోన్నత సభాభవన ప్రాంగణమును పరికించి చూసెద! అయ్యదే... అది ఏమి? శోభాయమానమైన ఈ సభామండపమున గోడలకు ఆ మసి ఏమి? అసీ! బొగ్గు నుసి! దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న అపార బొగ్గు నిక్షేపాలను వెలికి తీసి, జాతి ఉద్ధరణకు దోహద పడవలసిన దేశాధినేతలు, నిర్లజ్జగా వాటిని అవినీతిపరులకు అప్పగించిన విధము ఎంతటి దుర్భరము? ఎంతటి దుస్సహము? ప్రతిపక్షములన్నియూ కోడై కూస్తున్ననూ, నిఘా సంస్థలు నిజాలు వెల్లడిస్తున్ననూ చలించక, నైతిక బాధ్యతగానైనను వ్యవహరించక, మొండికెత్తి వ్యవహరిస్తున్న ఈనాటి నేతల కార్యకలాపములకు నేనిక మౌనసాక్షిగా నిలబడవలసిందేనా?

అరెరె... అక్కడదేమి? ఏదో మడుగు వలె గోచరించుచున్నదే! అఘో... అవినీతి మడుగు! అడుగడుగునా అవినీతి కుంభకోణాలతో కునారిల్లుతున్న ఇప్పటి పాలకుల అనుచిత విధానములన్నియు ఇక్కడ బురద మడుగుగా నా కళ్లకు కన్పట్టుచున్నది! దూరశ్రవణ పరికరములలో అదనపు సౌకర్యములను కల్పించు నెపముతో కుంభకోణము... అంతర్జాతీయ ఆటగాళ్లు అరుదెంచే అరుదైన సందర్భమున వసతి కల్పించు పనిలో సైతము కుంభకోణము... ప్రభుత్వ యంత్రాంగములో భాగమయ్యే అత్యున్నత పదవుల కోసము సైతము అవినీతికి పాల్పడు కుంభకోణము... ఎటు చూసినా అవినీతి, అక్రమములే! హతవిధీ!

ఆ... అదేమి ఆక్రందనము? ఎవరది... అక్కడ ఎవరో స్త్రీ రోదించుచున్నదే? అరెరే... ప్రజాస్వామ్య ప్రతిరూపమా? ఎంతటి ఘోరము! నిండు సభలో ఆమె విలువల వలువలను వలచుచున్నారే! ఎంతటి దురహంకారము! ఇటువంటి దృశ్యములను చూచుటకా నేనిట కొలువైనది?

నేనిదే ఎలుగెత్తి చాటుచున్నాను. దేశ ప్రజల మనసులలో నిత్య చైతన్య విస్ఫులింగాలను పుట్టించే స్ఫూర్తికి, నా ప్రతిమ నిలువెత్తు నిదర్శనమై నిలుచుగాక! అవినీతిని దునుమాడి, అక్రమార్కులను తరిమికొట్టే జనజాగృతి దావానల సదృశమై రగులుగాక!

PUBLISHED IN EENADU ON 08.05.2013

శనివారం, మే 04, 2013

పథకాల పరమార్థం!




శిష్యుడు రాగానే గురువుగారు ప్రసాదం పెట్టారు. శిష్యుడు దాన్ని కళ్లకద్దుకుని నోట్లో వేసుకుని, 'ఇదేంటి గురూగారూ! కొత్తగా?' అన్నాడు.
'అహ... ఏం లేదురా! ఇవాళే కొత్తగా 'శిష్యప్రసాదం' అనే పథకాన్ని ప్రవేశపెట్టా. ఇన్నాళ్లుగా నా దగ్గరకు రాజకీయాలు నేర్చుకోడానికి వస్తున్నా ఏమీ పెట్టలేదుగా? అందుకని!'

ఇంతలో గురువుగారి సతీమణి వచ్చి దానిమ్మ గింజలు ఇచ్చారు. శిష్యుడు నోరెళ్లబెట్టగానే గురువుగారు వివరించారు...

'ఇది ఆవిడ ప్రవేశ పెట్టిన 'దానిమ్మహస్తం' పథకం... ఇవాళ నీ పంట పండిందిలే. నోట్లో వేసుకో'

'ఆహా... ఎంతదృష్టం. ఇలా పథకం మీద పథకం ప్రవేశపెట్టడానికి కారణమేంటి గురూగారూ?'

'ఒరే... నువ్వు నా దగ్గర శిష్యరికం చేసి ఎంతోకొంత ఎదిగావనుకున్నా కానీ, లేదని తేలిపోయిందిరా. పథకాలకు కారణాలడుగుతావేంటి... అడిగితే మాత్రం చెబుతానా, చెప్పినా నిజం చెబుతానా? కాబట్టి, నోరు మూసుకుని ఇచ్చింది పుచ్చుకోవడమే...'

'బుద్ధొచ్చిందండి. కానీ గురూగారూ... ఈ పథకాలనేవి ఎన్ని రకాలు, వాటిని ఎప్పుడు ఎలా ఉపయోగించుకోవాలో చెబుతారా?'

'అది చెప్పాలనే కదరా ఇలా మొదలెట్టింది? రాసుకో. పథకాలు ప్రధానంగా రెండు రకాలు. బయటికి కనిపించేవి, పైకి కనిపించనివి. కనిపించేవాటి పేరెలాగూ తెలుస్తుంది. కనిపించని వాటి పేర్లు మాత్రం నువ్వే కనిపెట్టాలి. అది నీ రాజకీయ చాతుర్యం మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు ఇటీవల మన సీఎం ప్రవేశపెట్టిన పథకాల గురించి చెప్పు చూద్దాం...'

'ఓ... పేపర్లలో చదివానండి. ఆడపిల్లల కోసం 'బంగారు తల్లి', పేదవారి కోసం 'అమ్మహస్తం', బడుగుల కోసం 'పచ్చతోరణం' పెట్టారండి. ఉద్దేశాలు మంచివే కదండి...'

'అవి మంచివో కావో ప్రజలు తేలుస్తారు... మనం చదువుకుంటున్నది రాజకీయ పాఠాలు కాబట్టి వాటి అంతరార్థాలు తెలుసుకోవాలి. వాటిలో ఒకటి 'కంగారు తల్లి'. ఎందుకంటే ఓ పక్కన కాలం గడిచిపోతోంది. మరో పక్క ఈ సీఎం సామర్థ్యంపై విమర్శలు వినిపిస్తున్నాయి. కాబట్టి ఆయన కంగారుగా పథకం ప్రకటించేశాడు. దీని గురించి తమకేమీ తెలీదని ఆ పార్టీలోనే సన్నాయి నొక్కులు వినిపిస్తున్నాయి... గమనించావా? అంటే ఎవరితోనూ చర్చించకుండా, ఎలా అమలు జరపాలో కూడా ఆలోచించకుండా ప్రకటించాడనే కదా? దీనివల్ల జరిగే మేలు పక్కన పెడితే, ఇది ప్రచారానికి మాత్రం బంగారు తల్లే! ఇక రెండోది, మన భాషలో 'అమ్మో...హస్తం'. అధికారంలో ఇన్నాళ్లు ఉండి ఏమీ చేయలేకపోయేసరికి రాబోయే ఎన్నికల్లో పరిస్థితి తలచుకుని 'అమ్మో...' అనుకుని- పెట్టారన్నమాట! ఇక ఆ పచ్చతోరణం 'మెరమెచ్చు తోరణం' అన్నమాట. తొమ్మిదేళ్ల క్రితం కట్టిన అధికార పచ్చతోరణం వాడిపోయేసరికి సవాలక్ష తోరణాలు వెదికి ఇది కనిపెట్టారన్నమాట...'

'బాగుంది కానీండీ, మరి కనిపించని పథకాలన్నారు... అవేంటండీ?'

'పైకి బంగారు తల్లి కనిపిస్తోందా, మరి కనిపించకుండా అమలు చేస్తున్నది 'దొంగారు తండ్రి' పథకం. మంత్రివర్గంలో అవినీతి ఆరోపణలు ఉన్నవాళ్లను కాపాడ్డానికి చేసే కృషి అంతా దీని కిందకే వస్తుంది. అలాగే అనుకోకుండా దొరికిన కుర్చీని కాపాడుకోవడానికి చీటికీ మాటికీ ఢిల్లీ పరిగెత్తడం 'అధిష్ఠాన అనుగ్రహ' పథకమన్నమాట. ఇలా 'తాత్సార పథకం', 'ఉదాసీన పథకం' లాంటివెన్నో కనిపిస్తాయి...'

'సరే గురూగారూ! కనిపించేవో, కనిపించనివో అసలీ పథకాల ప్రయోజనమేంటండీ?'

'పథకాలనేవి అధికారానికి పట్టుకొమ్మలురా! సాధ్యమో, అసాధ్యమో నీకిష్టం వచ్చినన్ని పథకాలు జనంలోకి విసిరిపారెయ్యాలి. తొమ్మిదేళ్ల క్రితం వైఎస్‌ చేసిందిదే కద? అవన్నీ మేడిపండులాగా నిగనిగలాడినా, విప్పి చూస్తే అన్నింట్లోను అవినీతి పురుగులే కదా? ఉచిత విద్యుత్‌- అనుచిత విద్యుత్‌ అయిపోయిందా? జలయజ్ఞం- అక్రమార్కుల ధనయజ్ఞం అయిపోయిందా? ఆరోగ్యశ్రీ- అనారోగ్యశ్రీ అయిపోయిందా? ఇలా చెబితే చాంతాడంత! ఇక ఆయన కనిపించకుండా అమలు జరిపిన పథకాలకు మనం 'పుత్రశ్రీ', 'జామాత మజా', 'గని గజినీ', 'హవాలా వల', 'బంధోద్ధరణ', 'గాలి గిలి', 'భూ భోజన', 'అక్రమ జీవో భవ', 'అవినీతి వాడి', 'కరెన్సీ కరకర' లాంటి బోలెడు పేర్లు పెట్టుకోవచ్చు... ఏమంటావు?'

'అద్భుతం గురూగారూ! ఇక ఇలాంటి పథకాలను భవిష్యత్తులో ఎలా ఉపయోగించుకోవాలో కూడా చెబుదురూ...'

'చెప్పడానికేముందిరా! సమకాలీన రాజకీయాలు చూసి అల్లుకుపోవాలి. అవతల కర్ణాటక ఎన్నికల్లో పార్టీలన్నీ ఆడుతున్న 'జజ్జనకరి జనారే...' చూస్తున్నావుగా? రూపాయి బియ్యాలు, విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, ఉచిత అంతర్జాలాలు, రుణాల మాఫీలు, రోగులకు పింఛన్లు అంటూ చేస్తున్న వాగ్దాన పథక వీరంగాలు గమనించు. అంతక్రితం తమిళ మహారాణి టీవీలు, గ్రైండర్లు, తాళిబొట్లు, పురిటినొప్పుల బిల్లుల్లాంటి పథకాలను దృష్టిలో పెట్టుకో. ఇక నువ్వు బియ్యం ఇవ్వడమే కాదు, 'వండి వార్చే' పథకం పెట్టు. నంచుకోవడానికి 'ఆవకాయ బద్ద' పథకం పెట్టు. దురదేస్తే 'ఉచిత గోకుడు' పథకమను, స్నానం చేసేప్పుడు 'వీపు రుద్దుడు' పథకమను... ఒకటేంటి? నీ నోటికొచ్చినట్టు వాగు. ఆనక అధికారంలోకి వచ్చాక వాటి అమలు పేరుతో కనిపించని 'నిలువు దోపిడి' పథకం అమలు చెయ్యి!'

'ధన్యోస్మి గురూగారూ... ధన్యోస్మి!'

PUBLISHED IN EENADU ON 04.05.2013

మంగళవారం, ఏప్రిల్ 09, 2013

యువరాజ నీతి




కోటలో రాజమాత గంభీరంగా పచార్లు చేస్తున్నారు. ఎంతసేపు ఆలోచించినా ఏమీ పాలుపోలేదు.
'ఎవరక్కడ?'
'చిత్తం మహారాణీ...'
'వెంటనే ప్రధానామాత్యుని పిలిపించు...'
'అవశ్యం...'
రాజమాత పచార్లు చేస్తుండగానే ప్రధానామాత్యులవారు వచ్చారు.
'అమ్మా, పిలిపించారట...' అంటూ ఆగాడు. అంతకుమించి అతడేనాడూ మాట్లాడి ఎరుగడు.
'ప్రధానామాత్యా! యువరాజు సంగతి ఆందోళన కలిగిస్తున్నది. అతడేదేదో మాట్లాడుతున్నాడు. వాటి అర్థములేమిటో, మూలములేమిటో తెలియడం లేదు...'
ప్రధానామాత్యులవారు ఎప్పటిలాగే నవ్వీ నవ్వనట్టుగా నవ్వారు. ఆయన మాట్లాడరని తెలిసిన రాజమాత కొనసాగించారు...

'మీకు తెలియనిదేమున్నది? మా రాజవంశ చరిత్ర మొత్తము తమకు అవగతమే. మహారాజులుంగారు మరణించునాటికి యువరాజు వట్టి బుడతడు.అతడిపైనే ఆశలు పెట్టుకుని పెంచుకుంటూ వచ్చాను. సింహాసనం ఎక్కే అవకాశం వచ్చినా నేను తెరచాటునే ఉండిపోయి, అధికార పీఠం మీద మిమ్మల్ని కూర్చోబెట్టాను. ఎప్పటికైనా యువరాజులుంగారు ఆ పీఠం మీద కూర్చుంటారని ఆశ పడ్డాను. కానీ వారు దీన్ని అర్థం చేసుకున్నట్టు లేరు. వివాహం చేసుకోనన్నారు. పోన్లే అనుకున్నాను. పిల్లల్ని కంటే వాళ్లే వారసులనే భావం కలుగుతుందన్నారు. సరే, కుర్రతనమని వూరుకున్నాను. ఇక ఇప్పుడు అధికారమే వద్దంటే తట్టుకోలేకపోతున్నాను. ఈ సువిశాల భారతావనికి రాజై, నన్ను మురిపిస్తాడనుకుంటే ఈ మాటలేమిటి? ప్రజలకే అధికారం ఇవ్వాలంటాడేమిటి? అధికారాన్ని వికేంద్రీకరణ చేస్తానంటాడేమిటి? నా ఒక్కడి అధికారంవల్ల ఏమీ కాదంటాడే? ప్రజలందరికీ దాన్ని పంచుతానంటాడేమిటీ... హతవిధీ!'

ప్రధానామాత్యులవారు నోరు మెదపబోయారు. ఇంతలో రాజమాతే అందుకోవడంతో ఆ ప్రయత్నం మానుకున్నారు.

'పిల్లవాడిని వైద్యుడికి చూపించాలనిపించింది. మీరేమంటారు?'

అలవాటుగా ఆయనేమీ అనలేదు. నవ్వీనవ్వనట్టు నవ్వబోయి నవ్వలేక, నవ్వనట్టు పెదిమలు బిగపట్టి నవ్వకుండానే తలూపి, 'నేను ఇప్పుడే పిలిపిస్తాను...' అని మాత్రం అనేసి వూరుకున్నారు.

కాసేపట్లోనే ప్రధానామాత్యులవారి వెంట రాజవైద్యుడు వచ్చాడు. వస్తూనే నమస్కరించి, 'అమ్మా... యువరాజులవారి మాటలు నేనూ విన్నాను. ప్రధానామాత్యుల ద్వారా తమరి ఆవేదనా అర్థం చేసుకున్నాను. నేనిప్పుడే వెళ్లి యువరాజులవారిని ఏకాంతంలో కలిసి మాట్లాడి అసలు సంగతేమిటో తెలుసుకుని వస్తాను' అన్నాడు.

రాజమాత గంభీరంగా తలూపారు.

రాజవైద్యుడు యువరాజుల గదిలోకి వెళ్లారు. బయట రాజమాత పచార్లు చేయసాగారు. ప్రధానామాత్యులవారు ఆమెకేసి చూస్తూ యథాప్రకారం నిర్భావం తొణికిసలాడే ముఖంతో నిశ్చలంగా నుంచున్నారు. కాసేపటికి రాజవైద్యులవారు బయటికి వచ్చారు.

* * *

రాజమాత, ప్రధానామాత్యులవారి ముందు ఆసీనుడైన రాజవైద్యుడు గొంతు సవరించుకున్నాడు.

'అమ్మా... మొదట యువరాజులంవారిని శారీరకంగా పరీక్షించాను. నిక్షేపంగా నిగనిగలాడుతూ ఉన్నారు. ఆపై ఆయనతో మాట్లాడి ఆయన మానసిక పరిస్థితిని అంచనా వేయడానికి ప్రయత్నించాను...'

రాజమాత ఆసక్తిగా మొహం పెట్టారు. ప్రధానామాత్యులవారు ఏ భావం కనిపించనీయకుండా జాగ్రత్త పడ్డారు.

రాజవైద్యుడు కొనసాగించాడు. 'యువరాజులవారు అలా మాట్లాడటానికి నాకు మూడు కారణాలు కనిపిస్తున్నాయి. ప్రథమ కారణం. వారు మీకంటే మేధావి. ఇప్పటి దేశ, రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మీ బాటనే ఎంచుకోవడానికి నిర్ణయించుకున్నారేమోననేది నా అనుమానం. అనగా... తమరు తెరవెనక ఉంటూ ప్రధానామాత్యులవారిని పీఠంపై కూర్చోబెట్టి అధికార దండమే వారికిచ్చి, ప్రచ్ఛన్నంగా ఆదేశాలిస్తూ ఆడిస్తున్నారే....'

రాజమాత చికాగ్గా మొహం పెట్టి, 'అంత విపులముగా అక్కర్లేదు. క్లుప్తంగా చెప్పండి...'

రాజవైద్యుడు సర్దుకుని, 'అదేనమ్మా... అధికార పీఠమునకు దూరంగా ఉంటూనే కీలక బాధ్యతలు చేపట్టి ముందుకుసాగే ఆలోచన ఆయనకూ ఉండి ఉండవచ్చు. అందువల్ల తప్పులకు బాధ్యతను మరొకరిపై నెట్టివేస్తూ, తాను మాత్రం స్వేచ్ఛగా ఉండటమన్నమాట. కారణమిదే అయిన, యువరాజులవారు అధికార చక్రం తిప్పుతూ మీకు ఆనందం కలిగించగలరనడంలో సందేహం లేదు'

'మరి రెండో కారణం?' అన్నారు రాజమాత ఆతృతగా.

'యువరాజులుంగారు భిన్నమైన మార్గంలో సాగుతున్నారనుకుంటాను. ఎప్పుడూ ఒకేలాంటి ఉపన్యాసముల వల్ల ఫలితం ఉండదన్నది ఆయన ఆలోచన కావచ్చు. అందువల్ల ప్రజలను కొత్తరీతిలో ఆకట్టుకునేలా మాట్లాడి అధికారం చేజిక్కించుకోవచ్చనే ఎత్తుగడ కావచ్చును. ప్రజల మద్దతంటూ ఏమాత్రం లభించినా ఎలాగూ పీఠం ఎక్కేది తానే కాబట్టి ఇలా మాట్లాడే అవకాశం ఉంది. అంటే- లోపల ఒకటి, బయట మరొకటన్నమాట. కారణమిదైనా తమరు చింతించాల్సిన అవసరం లేదు...'

'సరిసరి... మూడో కారణం ఏమిటంటారు?' అన్నారు రాజమాత, రాజవైద్యుడి సాగతీతకు అడ్డుకట్ట వేస్తూ.

'ఏముందమ్మా! తమకు, ఇతర రాజకీయ దురంధరులకు నచ్చినా నచ్చకపోయినా యువరాజులుంగారు నిజంగానే సరికొత్త విప్లవాత్మక మార్పులను కోరుకుంటూ ఉండి ఉండవచ్చు. నవసమాజ నిర్మాణం దిశగా ఆలోచిస్తుండవచ్చు'

'అంటే, ఏ కారణమో కచ్చితంగా చెప్పలేరన్నమాట' అన్నారు రాజమాత.

'అంతేకదమ్మా... మబ్బులో పొద్దు, మనసులో మాయ ఏం తెలుస్తాయనే సామెత ఉండనే ఉంది కదా?' అన్నాడు రాజవైద్యుడు.

రాజమాత నిట్టూర్చారు. ప్రధానమాత్యులవారు నిట్టూర్చబోయి ఆపేశారు!

PUBLISHED IN EENADU ON  9.4.2013

సోమవారం, మార్చి 18, 2013

అవినీతోపాఖ్యానం




చంచల్‌గుడా జైల్లో చంచలంగా పచార్లు చేస్తున్నాడు అక్రమార్కుడు. ఇంతలో కొందరు ఖైదీలు గుంపుగా దగ్గరకు వచ్చారు. వారిలో బలిష్ఠంగా ఉన్నవాడొకడు చటుక్కున వచ్చి అక్రమార్కుడి చేతులు పట్టుకున్నాడు.
'తప్పదు. కాదనకూడదు. నేను అఖిలాంధ్ర ఖైదీల అధ్యక్షుణ్ని. మన వాళ్లంతా మీకు సన్మానం చేయాలనుకుంటున్నారు. తమరు ఒప్పుకోవాలి' అన్నాడు చొరవగా.

అక్రమార్కుడు మొహం చిట్లించాడు. 'ఉండవయ్యా! అసలే బెయిల్‌ రాక నేనేడుస్తుంటే సన్మానమేంటి మధ్యలో' అన్నాడు చిరాగ్గా.

'అమ్మమ్మా! ఎంత మాట. అసలు మీకు సన్మానం చేయడానికి కారణం అదే. మేమంతా చిన్నాచితకా దొంగతనాలు గట్రా చేసి వచ్చినోళ్లం. గబుక్కున చేసిందేదో రుజువైపోయి జైల్లో పడ్డాం. మరి మీరో? తమరి నేరాల చిట్టా ఓ పక్కన తేలేలా లేదు. ఒకదాన్ని లాగుతుంటే మరొకటి బయటపడుతోంది. అందుకే కాస్త పెద్ద మనసు చేసుకుని మా బోటివాళ్లకు కొన్ని చెడ్డ మాటలు చెప్పాలి. తప్పదు. పైగా మాకు ఓట్లు కూడా ఉన్నాయి' అన్నాడు ఖైదీల అధ్యక్షుడు.

ఆఖరి మాట అక్రమార్కుడికి బాగా నచ్చింది.

'ఏమిటో మీ అభిమానం మీరూను. సరే అలాక్కానీండి' అన్నాడు అక్రమార్కుడు.

* * *

మర్నాడు సభలో ముందుగా సభాధ్యక్షులు- 'వారు ఈ సన్మానానికి ఒప్పుకోవడమే మనందరి అదృష్టం. మన ఖైదీల్లో బాగా చదువుకున్నవారిని, కవుల్ని ఎంపిక చేశాం. వాళ్లిప్పుడు అక్రమార్కులవారిని వేదికపైకి ఆహ్వానిస్తారు' అన్నాడు.

వెంటనే కొందరు చెట్లకున్న ఆకులు తెంపి జల్లుతూ తమ పాండిత్యాన్ని ప్రదర్శించారు.

'అగణిత అక్రమ వక్ర మార్గ వైతాళికా!
ద్విగుణీకృత దుశ్చరిత్ర దురంధరా!
చండ ప్రచండ నీచకృత్య నిర్నిరోధా!
బహుపరాక్‌... బహుపరాక్‌...'
అంటూ అక్కడున్న ఓ గట్టు ఎక్కించారు.

అధ్యక్షుడు గొంతు సవరించుకుని, 'దొంగల్లారా, నేరగాళ్లలారా! అక్రమార్కులవారు జైల్లో ఉన్నా బయటి నీచ రాజకీయాలను నడుపుతున్న సంగతి తెలిసిందే. వారికి అనేక అత్యవసర అకృత్య కార్యకలాపాలు ఉన్నందున త్వరగా ముగించాలని కోరుతున్నాను' అన్నాడు.

వెంటనే ఓ ఖైదీ లేచి, 'ముందుగా నేనొక పద్యాన్ని ఆయన కోసం రచించాను' అంటూ మొదలు పెట్టాడు.

'చేత చిన్న ముద్ద చూపించి బులిపించి...
బంగారు భూముల్ని చుట్టబెట్టి...
సెజ్‌ తాయిలాలు సిరి దోచు పథకాలు...
కరకు నేతా! నిన్ను చేరి కొలుతు!'
ఖైదీలందరూ చప్పట్లు కొట్టారు.

ఆ ఖైదీ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ, 'నేను బతికుండగా అనేక దోపిడిలు చేశాను. ఎన్నోసార్లు జైలుకు వస్తూ వెళ్తున్నాను. నేను చేసిన పనులు బయటపడినప్పుడు నాకెంతో సిగ్గుగా అనిపించేది. ఇప్పుడు ఈ అక్రమార్కులవారిని చూశాక నా భావాలెంత తప్పో తెలిసివచ్చింది. కోట్లు దోచుకుని కూడా ఈయనగారు సిగ్గనేది లేకుండా ఉండగలగడం అత్యద్భుతం. కోర్టుకు వెళ్లినప్పుడల్లా ఏదో ఘనకార్యం చేసినట్టుగా నవ్వుతుండటం ఆశ్చర్యకరం. ఇది మనలాంటి నీచులందరూ నేర్చుకోవాల్సిన గొప్ప లక్షణం' అన్నాడు.

తరవాత మరో ఖైదీ లేచి, 'నేను శ్రీమాన్‌ అక్రమార్కులవారికి ఒక కవితాంజలిని సమర్పించదలిచాను...' అంటూ గొంతు సవరించుకున్నాడు.

'ఎవ్వారి తరమవును ఈ వెధవ పనులు...
అవని నేరములందు అన్నిటను మిన్న...
అసురులైన ఈతీరు అందుటను సున్న...
అన్నన్న! ఇది కదా... అకృత్యమన్న!'

ఆపై అతడు తన ఉపన్యాసం కొనసాగిస్తూ, 'మనమందరం నీచమైన పనులుచేసి చెడ్డవాళ్లమని అనిపించుకున్నవాళ్లమే. కానీ ఈయన? పైకి మంచిగా కనిపిస్తూ, అందరికీ మంచి చేయడానికే తన అవతారమన్నట్టు నమ్మిస్తూ మనందరికన్నా ఎక్కువగా దోచారు. ఇంత దోచి కూడా జనానికి మేలు చేసినట్టు నమ్మబలుకుతున్నారు. ఆ నంగనాచి, నయవంచక నయావిధానాలను నేర్చుకోండానికి మనం ఎన్ని జన్మలెత్తాలో అర్థం కాకుండా ఉంది' అన్నాడు.

ఇలా కొందరు మాట్లాడాక అధ్యక్షుడు లేచి, 'ఇప్పుడు అక్రమార్కులవారు మనందరికీ నీచ నికృష్ట పనులు చేయడంలో ఎలాంటి నైపుణ్యం చూపించాలో వివరిస్తారు. శ్రద్ధగా విని మరింత చెడిపోవాలని కోరుతున్నాను' అన్నాడు.

నవ్వో, ఏడుపో తెలియని మొహంతో అక్రమార్కుడు లేచి, 'మీ అందరి అభిమానం చూస్తుంటే ఆనందంగా ఉంది. కాబట్టి, నాకు తెలిసిన కొన్ని చెడ్డమాటలు చెబుతాను. ఇవాళ ఎంత దోచుకున్నావన్నది కాదు ప్రశ్న. రేపు ఎంత దోపిడి చేస్తామనేదే పాయింటు. మీరందరూ ముందుచూపులేని మామూలు, సాదాసీదా, అమాయక నేరగాళ్లు. నేనలా కాదు. రానున్న కొన్నేళ్లపాటు నిరాటంకంగా, నిరంతరాయంగా, నిర్భయంగా, నిశ్చింతగా కోట్లకు కోట్లు దోచుకోవడానికి పథక రచన చేసిన నీచ రాజకీయవేత్తను. అన్నింటికన్నా పెద్దసంపద ప్రజాధనం. దాన్ని దోచుకోవాలంటే అధికారం కావాలి. అందుకు ముందుగా ప్రజల్ని నమ్మించాలి. నిజానికి అదొక కళ. అంత తొందరగా అలవడదు. ఒకసారి అధికారం అందాక అమాత్యుల నుంచి, అధికారుల నుంచి, అనుచరుల నుంచి అందరికీ అవినీతి రుచి చూపించాలి. అదే నా కల. ఇప్పటికే అధికారాన్ని అడ్డం పెట్టుకుని చాలా దోచాను. ఇవాళ జైల్లో ఉన్నా నాకు దిగులు లేదు. ఇది ఒకరకంగా ప్రజల్లో సానుభూతి కలిగించాలని ప్రయత్నిస్తున్నాను. నా కల నెరవేరితే మిమ్మల్నందరినీ విడుదల చేయిస్తాను. నా మంత్రివర్గ సహచరులుగా నియమించుకుంటాను' అంటూ ముగించాడు.

ఖైదీలందరూ ఆనందంతో చప్పట్లు మోగించారు. ఇంతలో పోలీసుల విజిల్‌ వినిపించడంతో అందరూ ఎవరి పనుల్లో వారు మునిగిపోయారు.

PUBLISHED IN EENADU ON 18.03.2013