శుక్రవారం, ఆగస్టు 18, 2023

అబద్దాల చక్రవర్తి!



అధినేత అద్దంలో చూసుకుంటూ ముసిముసి నవ్వులు నవ్వుకుంటుంటే, సెక్రటరీ వచ్చాడు.

''రావయ్యా సెకట్రీ! నీకోసమే చూస్తున్నాను. నిన్న స్వతంత్ర దినం సందర్భంగా మనం ఇచ్చిన స్పీచ్ఎలా ఉంది?''

''అదిరిపోయింది సార్‌...''

''నేనడిగింది నీ అభిప్రాయం కాదయ్యా... నువ్వెలాగూ నేనేది చెప్పినా అదిరిందనే అంటావు. జనం ఏమనుకున్నారూ అని...''

''వాళ్ల పరిస్థితి కూడా ఇంచుమించు అదే సార్‌. ఎలాగూ వినక తప్పదు కాబట్టి విన్నాక తలలూపేశారండి...''

''అంటే మన ప్రసంగంతో ఏకీభవించారంటావా?''

''ఏకీభవించక చేసేదేముందండీ? తమరు ఎక్కడ ఏ ప్రసంగం చేసినా చెప్పేదదే కదండీ? పైగా మీ స్పీచ్కూడా ఆళ్లకు తెలిసిందే కదండీ? పార్టీ సమావేశమైనా, ప్రభుత్వ కార్యక్రమమైనా, ప్రారంభోత్సవమైనా, బడి పిల్లలు పాల్గొనే సభలాంటిదైనా, ఆఖరికి బారసాలైనా, పెళ్లయినా తమరి ధోరణి అదే కదండీ? ఓ మార్పా, ఓ చేర్పా, ఓ సమయమా, ఓ సందర్భమా? ఇక అందులో కాదనేదేముందండీ?''

''అంతేనంటావా? అయినా అదేంటోనయ్యా సెక్రట్రీ, మైకు మూతి ముందుకు రాగానే మనకి మైకం కమ్మేస్తుందయ్యా. బుర్రలో ఉన్నవన్నీ నోట్లోంచి కుమ్ముకుంటూ బయటకొచ్చేస్తాయి. ఆ తొందర్లో ముందెనకలుండవనుకో. అయినా అన్నీ చెప్పానా లేదా అని అనుమానం వస్తూ ఉంటుంది. అందుకే నిన్ను అడుగుతుంటా. నువ్వయితే మనలో మన మాటగా ఉన్నదున్నట్టు చెబుతావని. ఏమీ మర్చిపోలేదు కద?''

''అబ్బే... ఏదీ మర్చిపోలేదండి. ఓ టేపు రికార్డరు లాగా, ఓ సినిమాలో సన్నివేశంలాగా అన్నీ అలాగే ఉన్నాయండి. తమరి హయాంలో చేసినవెన్నో ఉన్నట్టు, మీరు తప్ప మరెవరూ అంతలేసి పనులు చేయనట్టు, అసలు మీ వల్లనే బడుగుల బతుకులు బాగుపడినట్టు, ఆమాటకొస్తే సామాన్య జనానికి అంతక్రితం ఊపిరి తీసుకోవడం కూడా రానట్టూ, తమరి ప్రభుత్వం వచ్చాకనే గాలి పీల్చుకుంటున్నట్టు... అబ్బబ్బ... ఏం చెప్పారండి బాబూ! వింటున్న నాకే దిమ్మదిరిగిపోయిందంటే నమ్మండి''

''మరి చెప్పొద్దుటయ్యా? ఈ వెర్రి జనానికి ఏదీ పట్టదనుకో. ఇంటికెళ్లగానే అన్నీ మర్చిపోతారు ఎర్రెదవలు. అందుకే పదే పదే అదే అదే సోది చెబుతూ ఊది ఊది ఊదరగొడుతూ ఉంటా. అయినా ఆళ్ల బుర్రల్లోకి ఎక్కిందో లేదో డౌటేననుకో...''

''ఎక్కకేం చేస్తుందండీ. అందుకే మీరు చెబుతూ ఉంటూ ఎవరూ నోరెత్తలేదండి. అసలు ఇంతలేసి అభివృద్ది పనులు మన చుట్టూ జరిగిపోయాయా, మన బతుకులన్నీ ఇంతలా బాగుపడిపోయాయా, మన రాష్ట్రం మరీ ఇంతగా వెర్రెత్తినట్టు ప్రగతి దారుల్లో పిచ్చి పరుగులెట్టేస్తోందా, కాస్తయినా వెనకా ముందూ చూసుకోకుండా ఎదిగిపోతోందా, అసలు బడుగులనేవారు లేనే లేరా, సామాన్యులందరూ అసామాన్యలైపోయారా, పేదరికమనేది పేరుకైనా లేదా... అని ఒకటే దిగ్భ్రాంతకి గురయిపోయారండి. కొయ్యబొమ్మల్లా అందరూ మాన్ప్రడిపోయారంటే నమ్మండి. ఆ షాక్లో పడి గుడిసెకెళ్లి నేల మీద చింకి చాప పరుచుకుని పడుకున్నాక కూడా భ్రమలు తొలగవనుకోండి. ఆ మత్తులో, ఆ మైకంలో స్వర్ణయుగం అంటే ఇదేనని నిద్రలో కలవరించినా ఆశ్చర్యంలేదండి. ఆయ్‌...''

''...హ్హ...హ్హా! మనకి కావలసిందదేనయ్యా. ఈ వెర్రి జనాన్ని ఎప్పుడూ మత్తులో ముంచెత్తాలయ్యా. లేకపోతే ఏమరిపోతారు. ఆళ్లు గంజినీళ్లు తాగుతున్నా, అదే పరమాన్నమన్నట్టు నమ్మించాలి. చెమటలు చిందిస్తూ తెగ కష్టపడక తప్పకపోయినా మనవల్లనే ఆ పాటయినా సుఖంగా ఉన్నట్టు భ్రమ కల్పించాలి. నిజానికి అదో కళ అనుకో...''

''అబ్బో... ఆ కళలో తమరి తర్వాతేనండి బాబూ అందరూనూ. అబద్దాన్ని నిజంగా చెలామణీ చేయడంలోనూ, నిజాన్ని దాచిపెట్టి అబద్దాన్ని అలవోకగా అందలమెక్కిండంలోనూ, నిజాన్ని మసిబూసి మారేడుకాయ చేయడంలోనూ, అబద్దాన్ని అలంకరించి తైతక్కలాడించడంలోనూ ... నిజంగా మీరు ఆరితేరిపోయారంటే అందులో ఆవగింజంతయినా అబద్దం లేదంటే నమ్మండి...''

''వార్నీ... మొత్తానికి నువ్వుండవలసినవాడివయ్యా. ఇంతకీ నా ఉపన్యాసంలో నిజాలూ, అబద్దాలూ తార్మార్తక్కిడ మార్అయిపోయాయంటావ్‌. ఏదీ ఒక్కసారి ఏది నిజమో, ఏది అబద్దమో చెప్పి చూడు. నా నైజం నీకెంత మాత్రం అంతుచిక్కిందో చూస్తాను... అహ... మనలో మన మాటలే...''

''అమ్మమ్మ... అంతలా నన్ను ఆకాశానికెత్తేయకండి. తమరి నైజం తెలుసుకోవడం నా తరమా? మీ స్పీచ్విని జేజేలు కొట్టే జనంలాగా నన్నూ జమేయకండి మరి. అయినా తమంత వారు తమరు అడిగారు కాబట్టి చెబుతానండి. ఆనక అబద్దపు కేసులవీ పెట్టించకూడదండి మరి...''

''...హా...ర్నీ! భయపడకయ్యా... ఆ కేసులన్నీ ఎగస్పార్టీ వాళ్ల కోసమూ, మనల్ని ప్రశ్నించే వాళ్ల కోసమయ్యా. నీలాగా, నా జనంలాగా ఎర్రిబాగులవాళ్ల కోసం కాదులే. ధైర్యంగా చెప్పు. వింటాను...''

''అమ్మయ్య... అలా భరోసా ఇచ్చారు కాబట్టి సరేనండి మరి. అసలు మిమ్మల్ని మించిన గుండెలు తీసిన బంటు ఎవరుంటారనిపించిందండీ బాబూ మీ ఉపన్యాసం విన్నాక. ఆహా... ఏం చెప్పారండీ? పాదయాత్రల కాలంలో కేంద్రం మెడలు వంచుతానని భ్రమ కల్పించారు కదండీ? మరి ఈ నాలుగేళ్లలో ఏం చేశారండీ? నలభై సార్లు ఢిల్లీ వెళ్లి పెద్దలందరికీ మూడు నామాల వాడి బొమ్మలు చేతిలో పెట్టి మెడలు వేలాడేసుకుని వచ్చేశారండి. మాట్టాడితే మూడు రాజధానులంటున్నారు కానీ, నాలుగేళ్లయినా ఒక్క చోట కూడా రాజధాని నిర్మాణానికి ఇటుకేసింది లేదండి. అవునాండీ? అయినా సరే, స్వతంత్ర దినోత్సవం నాడు మళ్లీ మూడు రాజధానుల మాటెత్తడానికి ఎంత ధైర్యం కావాలండీ తమకి? ఎంత నిస్సిగ్గు నిబ్బరం ఉంటే అలా మాట్లాడగలరు చెప్పండి? ఇహ... గాంధీగారి మాటెత్తి ఆయన కలలు కన్న గ్రామ స్వరాజ్యం తమరి వల్లనే సాకారమైనట్టు ఎంత తెగువగా బొంకారండీ? వింటున్న నాకే బుర్రగిర్రున తిరిగిపోయిందండి బాబూ. ఓ పక్క గ్రామాల్లో సమాంతర వ్యవస్థను ఏర్పాటు  చేసి వాలంటీర్లకీ, గ్రామ సచివాలయ సిబ్బందికీ లేనిపోని పెత్తనం కట్టబెట్టి, ప్రజల ఓట్లతో గెలిచిన సర్పంచుల్ని ఉత్సవ విగ్రహాలుగా మార్చేసి కూడా... అంత ధీమాగా బోరవిరుచుకుని మరీ ఎలా బుకాయించారండీ బాబూ? నాకయితే కళ్లు బైర్లు కమ్మాయనుకోండి. అసలన్నింటి కంటే పెద్ద జోకేంటంటేనండీ, ఓ పక్క పోలవరంతో సహా అన్ని జల ప్రాజెక్టులూ తాబేలుతో పందెం కట్టి ఓడిపోతుంటే, తమరు మాత్రం అన్నింటి పనులూ చకచకా సాగిపోతున్నాయని వాగడానికి ఎంత తెగింపు కావాలండి బాబూ?  ఆ విషయంలో మీకు జోహార్లండి! అసలది కాదండి బాబూ హైలైటు. సామాజిక న్యాయం అనే మాటకి తమరే అసలైన అర్థం చెప్పినట్టు మాట్టాడారు చూడండి... అందుకెంత తెగింపు ఉండాలండీ? ఓ పక్క పదవులను అత్యధికంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కట్టబెట్టామని చెప్పారు కానీండీ, ఆ పదవుల్లో ఉన్న వారికి చిన్నపాటి నిర్ణయమైనా తీసుకోడానికి అధికారం ఇచ్చారా చెప్పండి? అసలు ఉపముఖ్యమంత్రులను కూడా ఏనాడైనా నోరెత్తనిచ్చారాండీ? ఇక మంత్రుల సంగతి చెప్పేదేముందండీ? వాళ్లందరినీ ఊరేగే విగ్రహాలుగా మార్చేసి, ప్రతి చిన్న విషయం కూడా తమరికి తెలియకుండా పరిష్కారం కానంతగా అధికార కేంద్రీకరణ చేసుకుని కూడా... అబ్బబ్బబ్బ... వికేంద్రీకరణ గురించి, సామాజిక న్యాయం గురించీ అనర్గళంగా స్పీచ్దంచగలిగారంటే... ఆహా... అది కాదుటండీ, అసలు సిసలు రాజకీయ చాతుర్యం? ఓ పక్క విద్యార్థుల్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్తామంటారా? మరో పక్క విద్యావ్యవస్థ మొత్తం గబ్బు పట్టిన సంగతిని మర్చిపోతారా? ఆ మాటకొస్తే... రైతులకు పాదయాత్రల సందర్భంగా మీరిస్తానన్నదెంత, ఇప్పుడిస్తున్నదెంత అనేది చూసుకోకుండా కేంద్రం ఇచ్చే సాయాన్ని కూడా మీరే ఇస్తున్నట్టు బరితెగించి ఉపన్యాసం దంచారు చూడండి... అది కాదుటండీ... అరాచకీయ నైపుణ్యం? ఓ పక్క రైతుల ఆత్మహత్యల్లో మన రాష్ట్రం పైపైకి ఎగబాకుతున్న నిజాన్ని విస్మరించి కూడా ఇలా మాట్లాడారంటే...  అసలు ప్రపంచ నీచ రాజకీయ చరిత్రలో ఎవరికుంటుందండి బాబూ ఇంత దబాయింపు? వేర్వేరు కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేశానంటూ ఎంత ఘనంగా గొప్పలు చెప్పుకున్నా, తమరు ఓటు బ్యాంకు కోసం ప్రవేశపెట్టిన నవ రత్నాల పధకాల నిధుల్నే వాటి ద్వారా మళ్లిస్తూ వంచన చేస్తున్ననిజాన్ని మరుగునపరిచారు చూశారా... ఆ గుండె ధైర్యానికి జేజేలండి. అమ్మమ్మమ్మ... అంబేద్కర్సూక్తుల్ని ఎంత బాగా వాడుకున్నారండి బాబూ. నాకయితే మతిపోయిందంటే నమ్మండి. చేతులకు సంకెళ్లు లేకపోయినా, భావాలకు స్వేచ్ఛ లేకపోతే అది స్వతంత్రం కాదంటూ భలే అబద్దాలు దంచికొట్టాశారు చూడండి అంతకుమించిన దగాకోరుతనం ఎవరికుంటుందండీ, తమకు తప్ప? అహ... ఓ పక్క తమరి హయాంలో ఎవరికి భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది చెప్పండి? నిలదీసిన ప్రతిపక్షాల వారిపై రాజకీయ కక్ష కడతారా, నిజం రాసే పత్రికలపై అక్రమ కేసులు పెడతారా, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపే వారిపై ఉక్కుపాదం మోపుతున్నారా, నిరసన ప్రదర్శన చేసే వారు ఆడవాళ్లని కూడా చూడకుండా ఈడ్చి పారేయిస్తున్నారా, ఎలుగెత్తి ప్రశ్నించే వారిని గృహనిర్బంధాలు, ముందస్తు అరెస్టులంటూ అణచేస్తున్నారా, అసలు ఎవరినైనా నోరెత్తనిస్తున్నారా అంట? ఇంత చేస్తూ కూడా ప్రజల స్వేచ్ఛ గురించి స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అంత అలవోకగా నీతులు వల్లించడం ఎవరి వల్ల సాధ్యమవుతుంది చెప్పండి? అసలదీ ఇదీ కాదండీ, అన్నీ మీకు తెలిసి కూడా, మీరు మాట్లాడిన దాంట్లో నిజాలేంటో, అబద్దాలేంటో తెలిసి కూడా, మీ సెక్రట్రీని అయిన పాపానికి నన్ను అమాయకంగా అడుగుతున్నారు చూడండి... ఆహా...ఆహా... ఎంత నంగనాచితనం? ఎంత బరితెగించినతనం? ఒక్క మాటలో చెప్పాలంటే తమరు సాక్షాత్తూ... నిజాలకు పాతరేసే అబద్దాల చక్రవర్తులండి! అబద్దాలు చెప్పి నమ్మించే నిజమైన నీచ రాజకీయ రాజాధిరాజులండి!''

సెక్రట్రీ చెప్పినదంతా ఆనందంగా, తమకంగా, ముసిముసినవ్వులు నవ్వుతూ, తన్మయత్వంతో, తనివి తీరా విన్నాడు అధినేత.

''నువ్వు చెప్పిన విషయాలన్నీ బాగానే ఉన్నాయి కానీ సెక్రట్రీ, ఇంతకీ నువ్వు నన్ను తిడుతున్నావా? పొగుడుతున్నావా? సమర్ధిస్తున్నావా? వ్యతిరేకిస్తున్నావా?''

''అయ్యా... మీ ఉప్పు తిని బతుకుతున్నవాణ్ని. ఏదో చెప్పమంటే చెప్పాను. నన్ను మాత్రం ఇలాంటి చిక్కు ప్రశ్నలేసి ఇబ్బంది పెట్టకండి మహాప్రభో!''

అధినేత పగలబడి నవ్వేశాడు.

''భయపడకయ్యా సెక్రట్రీ! నా వెర్రి ప్రజలెంతో నువ్వూ అలాంటివాడివే నాకు. నేను ఎదగాలంటే నీలాంటోళ్లు ఉండాలయ్యా. కాబట్టి ధైర్యంగా ఇంటికి పోయి రేపు నేను తీసుకురాబోయే స్వర్ణయుగం గురించి కలలు కంటూ పడుకో. పోయిరా''

-సృజన

PUBLISHED ON 18.08.2023 ON JANASENA WEBSITE

మంగళవారం, ఆగస్టు 01, 2023

చిగురించిన సీత!

 


         

 “నౌ యువార్ ప్రెగ్నెంట్…” అని డాక్టర్ వసుంధర చెప్పగానే చెప్పలేని అనుభూతికి లోనయింది సీత.

          సంతోషించాలా?  బాధపడాలా?

          రెండూ కలిసిన భావాల ఉధృతిని నిభాయించుకోవడం మూడు పదులు చూడని సీతకి కష్టమైంది.

          వెంటనే ఆమె కళ్లల్లో ఓ పొరలాగా చెమ్మ అల్లుకుంది. ఆ చెమ్మ చెలియలి కట్ట దాటబోతుంటే చూపుడు వేలితో అద్దుకుంది. మనసులో ఏదో ఉద్వేగం.

          ఆపుకుందామనుకున్నా ఆగని కన్నీటి ధారను ఇక ఆపలేకపోయింది.

          తల వంచుకుని కూర్చుండిపోయింది.

          డాక్టర్ వసుంధర తన కుర్చీలోంచి లేచి వచ్చి సీత భుజం మీద చెయ్యి వేసి నొక్కింది.

          “కంట్రోల్ యువర్ సెల్ఫ్‌ సీతా! నువ్వీ క్షణం కోసం ఎంత ఎదురు చూశావో గుర్తు చేసుకో. ఇప్పుడు నువ్విలాంటి ఎమోషన్స్ రానివ్వకూడదు. అది బిడ్డ ఎదుగుదల పై ప్రభావం చూపిస్తుంది…”

          ఆమె ఏవేవో జాగ్రత్తలు చెప్పుకుపోతోంది.

          సీత హ్యాండ్ బ్యాగ్ లోంచి కర్చీఫ్ తీసుకుని మొహమంతా తుడుచుకుంది.

          ఓసారి దీర్ఘంగా ఊపిరి తీసుకుంది. క్షణాల్లో మామూలు మనిషైంది.

          ‘తనిలా బేలగా ఉండకూడదు. ఈ క్షణం నుంచి ఎన్నో తట్టుకోవాలి…’ అనుకుంది నిశ్చలంగా.

          అలనాటి సీతకి రాముడే అగ్నిపరీక్ష పెట్టాడు.

          ఈనాటి సీతకి అడుగడుగునా అగ్నిపరీక్షలే.

          ఎందుకంటే… సీత భర్త రామ్మోహన్ చనిపోయి రెండేళ్లయింది!

***

          ఫొటోలో రామ్మోహన్ నవ్వుతున్నాడు. ఆ నవ్వు సీత కళ్లలో అలుక్కుపోయింది. కారణం కన్నీళ్లు.

          “రామ్మోహన్… నన్ను క్షమించగలవా? నేను చేసింది తప్పా?” అని మూగగా అను కుంది. ముద్ద మందారాన్ని ఆ ఫొటో ముందు పెట్టింది. భర్తను ఏకాంతంలో రామ్మోహన్ అనే పిలిచేది. ఇప్పుడు కూడా ఏకాంతమే. గదిలో టేబుల్ మీద రామ్మోహన్ ఫొటో. దాని ఎదురుగా కుర్చీలో సీత.

          “నువ్వేమన్నావ్ రామ్మోహన్? ఆఖరి రోజుల్లో నీ మాటలు మర్చిపోగలనా? నేను మోడులా మిగిలిపోకూడదన్నావ్. చిగురించాలన్నావ్. అదే జరిగిందిప్పుడు. కానీ… ఇది కాదు కదా నువ్వు కోరుకున్నది? నీ ఉద్దేశం వేరు కదా? అందుకే నన్ను క్షమించు…” అనుకుంటూ ఆ ఫొటో తీసుకుని కొంగుతో తుడిచి పెట్టింది.

          టేబుల్ సొరుగు లాగింది. అందులో పైకి కనిపిస్తూనే ఉంది అయిదేళ్ల నాటి పెళ్లి శుభలేఖ.

          ‘సీతా వెడ్స్ రామ్మోహన్!’ ఇటు పక్క ఇంగ్లిషులో. అటు పక్క తెలుగులో.

          ‘జానక్యాః కమలాంజలి పుటేః యా పద్మరాగాయితాః’

          రోజుకోసారైనా ఆ శుఖలేఖ చదువుకోవడం అలవాటు సీతకి.

          రామ్మోహన్ నవ్వంటే సీతకిష్టం. సీత కళ్లంటే రామ్మోహన్‌ కి ఇష్టం.

          ఆ నవ్వు కోసమే అతడి కేసి చూసేది. ఆ చూపు కోసమే అతడు నవ్వేవాడు.

          ఒకే ఆఫీసులో ఉద్యోగాలు ఆ నవ్వుల్ని, ఆ చూపుల్ని దగ్గర చేశాయి.వాళ్ల మనసుల్ని ఒక్కటి చేశాయి. ఆఖరికి ఇద్దరికీ పెళ్లి చేశాయి.

          కానీ… ఆ పెళ్లి ముచ్చట మూడేళ్లకే ముగిసిపోయింది.

          తల్చుకుంటే ఇప్పటికీ కలలాగా అనిపిస్తుంది సీతకి!

          రామ్మోహన్‌ కి పిల్లలంటే ఇష్టం.

          “ఇదిగో సీతా… ఇప్పుడే చెబుతున్నాను. నో మెజర్స్. ఆరు నెలలు తిరక్కుండా ప్రెగ్నెన్సీ రావాలి. తెలుసా?” ఫస్ట్ నైట్ రామ్మోహన్ చిలిపిగా చెప్పిన మాటలు గింగురు మంటూనే ఉంటాయి సీత చెవుల్లో. ఆ రాత్రి ఆ మాటలు విని సిగ్గుల మొగ్గయింది తను.

          ఆ పై రోజులు వారాలయ్యాయి. వారాలు నెలలయ్యాయి. అవన్నీ ఎలా గడిచాయో తెలియలేదు ఇద్దరికీ.

          ప్రపంచంలో ఆనందం మాత్రమే ఉందేమో అనేంత హాయిగా గడిపారు ఇద్దరూ.

          ఆ తర్వాత నుంచి మొదలైంది నిరీక్షణ.

          సీతకి ప్రతి నెలా బెంగే. నెలసరి రెండు రోజులు ఆగితే ఏదో ఆశ. నాలుగు రోజులు ఆగితే  తెలియని ఆనందం. కానీ… వచ్చేస్తే ఏదో తెలియని ఆవేదన. ఆ ఆవేదన దుఃఖమ య్యేది. ఆ దుఃఖం నిరాశగా మారేది.

          ఇద్దరూ తిరగని ఆసుపత్రి లేదు. చేయించుకోని పరీక్షలు లేవు. ఏవేవో రిపోర్టులు. ఏవేవో కారణాలు. ఎన్నెన్నో జాగ్రత్తలు. అన్నీ పాటించేది సీత.

          అల్లోపతి, ఆయుర్వేదం, హోమియో, యునానీ… అందరు స్పెషలిస్టుల్నీ కలిసే వారు ఇద్దరూ.

          ఏ మందులో ఏముందో? ఏది ఎలా పనిచేస్తుందో? అన్నీ వాడేవారు.

          గుళ్లు, గోపురాలు, క్షేత్రాలు, వ్రతాలు, పూజలు… అన్నీ అయ్యాయి.

        ‘రామ్మోహన్‌ కి శుభవార్త చెప్పే క్షణాలు తన జీవితంలో అసలు ఉన్నాయా?’ అనిపిం చేది. ఆ ఊహకి ఏడుపొచ్చేది.

          “ఏంటే… ఇన్నాళ్లయింది? ఇప్పుడే వద్దనుకున్నారా?” అంటూ అడిగేవారు స్నేహితురాళ్లు.

          “దేవుడిస్తే దెయ్యం కంటుంది… నువ్వేం బెంగ పడకమ్మా…” అనేది అత్తగారు. 

          ఆ నిరీక్షణలోనే రెండేళ్లు గడిచిపోయాయి.

          “నాకు చచ్చిపోవాలని ఉంది…” అంది సీత ఓ రాత్రి రామ్మోహన్‌ తో. అలా అంటుండగానే ఏడుపొచ్చేసింది. రామ్మోహన్ చటుక్కున లేచి ఆమె కన్నీళ్లు తుడిచాడు.

          “ఛ…ఛ… అవేం మాటలు? ఇలా ఎప్పుడూ మాట్లాడకు. ఇప్పుడేం కొంప మునిగిం దని? అయినా మన పెళ్లయి ఏమంత కాలం గడించిందని?” అంటూ ఓదార్చాడు.

          కానీ… సీతకు తెలుసు, రామ్మోహన్ పిల్లల కోసం ఎంత ఎదురుచూస్తున్నాడో! అతడికి పిల్లలంటే ఎంత ఇష్టమో!

          “అసలు మనకి పిల్లలు పుడతారా?” అని బేలగా అడుగుతూ అతడి గుండెల పై వాలిపోయింది.

          ఆ ప్రశ్నకు రామ్మోహన్ వద్ద కూడా జవాబు లేదు. 

          ఇలాంటి రాత్రులు ఏన్నో గంభీరంగా గడిచాయి వాళ్లకి.

***

          సీతకి ఊహ తెలిసే సరికే  నాన్న లేడు. ఓ పక్క ఉద్యోగం చేసుకుంటూ తనను పెంచుకొచ్చిన అమ్మంటే ప్రాణం సీతకి. చదువయ్యి, తను కూడా ఉద్యోగంలో చేరాక, అమ్మని అపురూపంగా చూసుకోవాలనుకుంది. కానీ ఆ అవకాశం రాలేదు. సీత ఉద్యోగం లో చేరిన కొన్నాళ్లకే అమ్మ ఓ రాత్రి గుండెపోటుతో నిద్రలోనే చనిపోయింది.

          నాన్న లేని బాల్యం ఓ అగ్ని పరీక్ష.

          అమ్మ లేని జీవితం ఓ అగ్ని పరీక్ష.

          అప్పుడే రామ్మోహన్ తోడుగా నిలిచాడు. భరోసానిచ్చాడు. ధైర్యాన్నిచ్చాడు. ప్రేమని చ్చాడు. జీవితాన్ని కూడా ఇచ్చాడు.

          అలాంటి రామ్మోహన్‌ కి తనేం ఇవ్వగలిగింది?

          ఈ ఆలోచన అనుక్షణం ఎదురయ్యే అగ్నిపరీక్షే సీతకి.

          కానీ… అంతకు మించిన అగ్నిపరీక్ష విధి ఆమెకు విధించింది.

***

          ఓ రోజు ఆఫీసులో క్యాంటిన్‌ కి వెళుతూ కళ్లు తిరిగి పడిపోయాడు రామ్మోహన్. ఆఫీసులో అందరూ కలిసి ఆసుపత్రికి తీసుకెళ్లారు. డాక్టర్ రొటీన్ పరీక్షలు చేశాడు. ఏవో మందులు ఇచ్చాడు. ఇద్దరూ వారం రోజులు సెలవు పెట్టేశారు. చిత్రంగా చాలా నీరస పడిపోయాడు రామ్మోహన్.

          అత్తయ్య, మావయ్య బెంగపడిపోయారు. ఇద్దరూ వృద్ధులే. రామ్మోహన్ ఒక్కడే కొడుకు. అతడి మీదే కళ్లు పెట్టుకుని పెంచుకొచ్చారు. ఓ పక్క వాళ్లకి ధైర్యం చెబుతూ రామ్మోహన్ని ఆసుపత్రులకు తీసుకెళ్లేది సీత. ఓ డాక్టర్ కొన్ని టెస్టులు చేయించి ఆ రిపోర్టులు పుచ్చుకుని మరో డాక్టర్ దగ్గరకి వెళ్ల మనేవాడు. ఆ డాక్టర్ మళ్లీ టెస్టులు చేయించేవాడు. ఇలా కొన్ని వారాలు గడిచాయి.

          ఆఖరికి విషయం తేల్చారు. స్టొమక్‌ లో మాలిగ్నెంట్ ట్యూమర్!

          అది తట్టుకోలేని అగ్ని పరీక్ష సీతకి.

          స్కానింగులు… బయాప్సీలు… ట్యూమర్ మార్కర్స్ టెస్టులు… అన్నీ అయ్యాక క్యాన్సర్ అని తేల్చారు.

          ఓ పక్క ఉద్యోగం… మరో పక్క వృద్ధులైన అత్తమామలు… మరో పక్క రామ్మోహన్ పరిస్థితి.

          అన్నీ ఒక్కతే అయి ఎదుర్కొంది సీత.

          రామ్మోహన్‌ కి కీమో థెరపీ మొదలు పెట్టారు. అతడి రూపం పూర్తిగా మారిపోయింది.

          ఇప్పుడిక సీతకి ఏ ఆశా లేదు. రామ్మోహన్‌ కి నయమైతే చాలు.

          ‘దేవుడా… నాకు పిల్లలు అక్కర్లేదు. ఆయన్ని దక్కించు…’ అంటూ మూగగా ప్రార్థిం చేది.

          బయటకి మాత్రం చిరునవ్వుతో అత్తయ్యకి, మావయ్యకి ధైర్యం చెప్పేది.

          “తల్లిలా చూస్తున్నావ్… నేనే నీ బిడ్డనయ్యానా సీతా?” అనేవాడు రామ్మోహన్.

          తనకు దుఃఖం తన్నుకొచ్చేది. అయినా మొహంలో బెంగ కనిపించకుండా మాట్లాడాల్సి వచ్చేది.

          “సీతా! నాదో కోరిక. నాకేదేనా అయితే… నువ్వు మోడులాగా మిగిలిపోకూడదు. మళ్లీ పెళ్లి చేసుకుని చిగురించాలి… సరేనా?” అన్నాడు రామ్మోహన్ రెండో రౌండ్ కీమో థెరపీకి ఆసుపత్రిలో జాయినయ్యాక.

          ఆ తర్వాత అతడు మాట్లాడే అవకాశం రాలేదు.

          అతడి శరీరం ఇక తట్టుకోలేకపోయింది.

          కానీ… ఆ అగ్ని పరీక్షను సీత తట్టుకుంది. నిలదొక్కుకుంది. అత్తమామల్ని ఓదార్చే బాధ్యత ఆమెను ఆరిందాగా మార్చింది. వాళ్లకి ధైర్యం చెప్పింది.

          “ఇక మీరే నాకు పిల్లలు, పెద్దలు కూడా…” అంది. తిరిగి ఉద్యోగంలో చేరింది. జీవితాన్ని ఎదుర్కొంది సీత.

***

          “అమ్మా సీతా! నువ్విలా మిగిలిపోకు. నీకంటూ జీవితాన్ని ఏర్పరుచుకో. వాడి చివరి కోరిక కూడా అదేగా?” అంటూ నచ్చచెప్పబోయింది ఓసారి ఆమె అత్తగారు.

          సీతకి గుండెల్లో గుబులుగా అనిపించింది. ఏమీ మాట్లాడలేదు.

          మావయ్యగారు అందుకున్నారు…

          “సీతా! మా గురించి ఆలోచించకమ్మా… మేం ఏదైనా వృద్ధాశ్రమంలో చేరుతాం. నువ్వు అప్పుడప్పుడొచ్చి చూస్తూ ఉందుగానిలే…” అంటూ వివరించారు.

          కళ్లలో నీళ్లు చిప్పిళ్లాయి సీతకి.

          వాళ్లేం చెప్పబోతున్నారో అర్థమైంది.

          ‘ఎంత మంచిగా ఆలోచిస్తున్నారు? కన్న కొడుకు కళ్ల ముందే వెళ్లిపోయినా, ఆ దుఃఖాన్ని తట్టుకుని నా గురించి దిగులు పడుతున్నారు. చూసే దిక్కులేని వృద్ధాప్యం. మావగారు ప్రైవేటు ఉద్యోగి కావడంతో పెన్షన్ సదుపాయం కూడా లేదు. ఏవో కొన్ని డిపాజిట్లు తప్ప ఎలాంటి ధైర్యం లేదు. నేనే వాళ్లకి ఆధారం. కానీ… వాళ్లు మాత్రం అవేమీ కాకుండా, కేవలం నా జీవితం చిగురించాలని కోరుకుంటున్నారు…’

          అలా అనుకోగానే రామ్మోహన్ గుర్తొచ్చాడు సీతకి.

          అమ్మ పోయేముందు తరచు ఇంటికి వస్తుండేవాడు. అమ్మతో ఎంతో బాగా మాట్లాడే వాడు. ఏదో రోజు తనే మా ప్రేమ గురించి చెబుదామనుకున్నాడు. కానీ అంతలోనే అమ్మ పోయింది. అప్పుడు తనకు ఎంత ధైర్యంగా నిలిచాడు!

          ఆ దుఃఖంలో, ఆ ఒంటరి తనంలో ఎంత ఓదార్పునిచ్చాడు!

          తనే గనుక తల్చుకుంటే బోలెడంత కట్నం ఇచ్చి పిల్లనిచ్చే సంబంధాలు ఎన్ని ఉండవని! కానీ వాటన్నింటినీ కాదని, వెనకా ముందూ ఏమీ లేని తనని ఎంచుకున్నాడు.

          అత్తయ్య, మావయ్య కూడా  ఏమీ అనలేదు సరికదా, ఎంతో సంతోషించారు.

          “ఒరే… ఒక్కగానొక్క కొడుకువి. నీ ఆనందమే మా ఆనందం…” అంటూ తనని వాళ్ల జీవితాల్లోకి నిండుగా ఆహ్మానించారు.

          అలాంటిది ఇప్పుడు… రామ్మోహన్ అనుకోకుండా వెళ్లిపోయాడని… నేను మరో తోడు వెతుక్కోవాలా? ఇదేనా బంధాలకు విలువ? ఇలా సాగేవి సీత ఆలోచనలు.

          కానీ… పగలంతా ఉద్యోగం, బాధ్యతలతో గడిచిపోయినా, రాత్రి గదిలో పడుకున్న ప్పుడు ఒంటరితనం ముప్పిరిగొనేది సీతని!

          ఎలాంటి తోడు, ఎలాంటి బంధం లేని నిస్సారమైన జీవితం నిలువెత్తున నిలబడి ప్రశ్నించేది.

          ‘ఎన్నాళ్లిలా? ఇప్పుడంటే అత్తమామలు ఉన్నారు. ఆ తర్వాత? ముప్ఫై ఏళ్లు కూడా లేని తను ఇలా ఒంటిగా, మోడుగా జీవితమంతా గడపగలదా?’ ఇలాంటి భావాలు కూడా ఓ అగ్నిపరీక్షే సీతకి!

***

          నిస్సారంగా సాగిపోతున్న సీత జీవితంలో రమణ పరిచయం ఓ మలుపు. సీతకి ఆ ఊరి నుంచి బదిలీ అయింది. ఆ ఊరు దగ్గరే కాబట్టి అత్తమామల్ని కదపలేదు. వాళ్ల కోసం ఓ వంట మనిషిని కుదిర్చి తను మాత్రం వెళ్లింది. వారాంతాల్లో అత్తమామల దగ్గరకే వచ్చేసేది. ఆ కొత్త ఊళ్లో కొత్త మనుషుల మధ్య రమణ స్నేహం సీతకి ఓ వరమే.

          సీత కథంతా విన్న రమణ ఇచ్చిన భరోసా అంతా ఇంతా కాదు.

          ఆ మాటలు ఎంతో పాజిటివ్‌ గా ఉండేవి.

          “జీవితంలో ఏ దశలోనూ నిరాశను రానీయకూడదు సీతా! లోకం ఏమనుకున్నా నీ జీవితం నీది. దాన్ని నీకు కావలసినట్టు మార్చుకోవడం నీ హక్కు…” అంటూ సాగే రమణ మాటలు సీత మీద ఎంతో ప్రభావం చూపించేవి.

          వీకెండ్స్‌ లో  రమణని ఇంటికి కూడా తీసుకెళ్లేది సీత. అత్తమామలకు కూడా రమణ కలివిడితనం, ఉత్సాహం, కబుర్లు ఎంతో నచ్చేవి.

          ఆఖరికి రమణ దగ్గర కూడా అత్తమామలు తమ ఆలోచనలు చెప్పేవారు.

          “నువ్వైనా చెప్పు రమణా… సీత అలా ఉండిపోవడం మాకు మా కడుపు కోత కన్నా ఎక్కువగా బాధ పెడుతోంది. ఎలాగోలా తనకొక బంధం ఏర్పడాలనే మా కోరిక…” అనే వాళ్లు.

          “నా ప్రయత్నం కూడా అదేనండీ… కానీ పరిస్థితులు కూడా కలిసి రావాలిగా?” అంటూ రమణ ఇచ్చే భరోసా తనకి కూడా ఎంతో ఆనందాన్ని ఇచ్చేది.

***

          గతం జ్ఞాపకాలన్నీ ఇప్పుడు సీత కళ్ల ముందు కదలాడుతున్నాయి. డాక్టర్ వసుంధర చెప్పిన మాటలు సీత చెవుల్లో రింగురుమంటున్నాయి.

          “నీది ప్రెసైజ్ ప్రెగ్నెన్సీ సీతా! చాలా జాగ్రత్తగా ఉండాలి. లేని పోని ఆలోచనలు మనసులోకి రానివ్వకు. ఎలాంటి ఆందోళనకు చోటివ్వకు…” అంటూ డాక్టర్ చెప్పిన మాటలు తల్చుకుంది సీత.

          రేపు… ఈ సంగతి అత్యయ్యగారికి చెప్పాలి… అనుకుంటూ కడుపు మీద అపురూపం గా నిమురుకుని నిద్రలోకి జారుకుంది సీత.

          మర్నాడు అత్తయ్యగారిని తన గదిలోకి పిలిచి కూర్చోబెట్టి నెమ్మదిగా చెప్పింది సీత. అసలిదంతా ఎలా మొదలైందో వివరించడానికి ప్రయత్నించింది. ఆఖరుగా డాక్టర్ వసుంధర చెప్పిన మాటలు కూడా చెప్పింది.

          అంతా విన్న అత్తయ్య గారు నమ్మలేనట్టుగా వింది. కాసేపు మౌనంగా ఉన్నాక చెప్ప లేని ఉద్వేగానికి గురయ్యిందావిడ. తర్వాత తేరుకుని నెమ్మదిగా తమాయించుకుని, “నాకు చాలా ఆనందంగా ఉందమ్మా… ఇప్పుడు నీకంటూ ఓ బంధం ఏర్పడుతోంది. నీ జీవితం మీద మాకిక ఎలాంటి బెంగా ఉండదు…”

          ఆవిడ సంస్కారానికి మనసులోనే జోహార్లు అర్పించింది సీత.

          ఆ పై ఆవిడ మరో సంగతి కూడా గుర్తు చేసింది.

          “సీతా! ఇప్పుడు సరే… నాలుగో నెల వచ్చిన దగ్గర్నుండి అందరూ తలో మాటా అంటారు. సమాజం అలా ఉంది. మరి ఎలా ఎదుర్కొంటావో… నీకు మాత్రం మా భరోసా ఎప్పుడూ ఉంటుంది…” అందావిడ.

          నిజమే… రాబోయే రోజులే అసలైన అగ్నిపరీక్ష సీతకి!

          ఆఫీసులో గుసగుసలు మొదలయ్యాయి.

          “ఏంటిది? భర్త పోయి రెండేళ్ల తర్వాత ఎలా?”

          “ఎవరితోనైనా సహజీవనం చేస్తోందేమో?”

          “ఏకంగా పెళ్లే చేసుకోవచ్చుగా? ఈ చాటు మాటు వ్యవహారాలెందుకూ?”

          ఆ తర్వాత గుసగుసలు కాస్తా వ్యాఖ్యానాలుగా మారాయి.

          “సిగ్గు లేకపోతే సరి…”

          “ఎవరేమనుకుంటారోననే జంకు కూడా ఉండదు ఇలాంటి వాళ్లకి…”

          అడపాదడపా ఆ వ్యాఖ్యలు, విమర్శలు చెవిన పడుతూనే ఉన్నాయి సీతకి!

          అయినా అప్పటికే అగ్నిపరీక్షలకి అలవాటు పడిపోయిన సీత వేటికీ చలించలేదు.

          ఇంట్లో అత్తగారు కూడా చెప్పేవారు. చుట్టు పక్కల వాళ్లు, దూరపు బంధువుల వాళ్ల  ఆరాలు మొదలయ్యాయిట. ఎప్పుడూ రాని వాళ్లు ఇంటికి రావడం, ఎప్పుడూ పలకరిం చని వాళ్లు కూడా ఫోన్లు చెయ్యడం… చివరకి సీత మాట ఎత్తడం! అందరికీ ఆవిడ ఖరా ఖండిగానే జవాబు చెప్పారుట.

          “చూడండి… సీత జీవితం తనిష్టం. అది ఆమె వ్యక్తిగతం. మాకేమీ అభ్యంతరం లేదు. మీకిక ఈ విషయం అనవసరం…”

***

          ఇలా ప్రశ్నార్థకాలు… ఆరాలు… వ్యాఖ్యానాలు… విమర్శలు… ఆరోపణలు… ఛీత్కారాల మధ్యే తొమ్మది నెలలు గడిచిపోయాయి సీతకి. డాక్టర్ వసుంధర సలహా పై ఆసుపత్రిలో చేరింది. అత్తమామలు, రమణ తప్ప కన్నెత్తి చేసినవారు లేరు.

          ఆఖరికి సీత ఎదురుచూసిన క్షణం రానే వచ్చింది.

          పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.

          ఆసుపత్రి నుంచి వచ్చేసే ముందు రోజు డాక్టర్ వసుంధర సూచన పై బిడ్డను ఎత్తు కుని కాన్ఫరెన్స్ హాలులోకి వచ్చింది సీత. అత్తమామలు, రమణ కూడా వచ్చి కూర్చున్నా రు.

          హాలు నిండా విలేకరులు కూర్చుని ఉన్నారు. ఫొటోగ్రాఫర్లు ఫొటోలు తీయసాగారు. టీవీల వాళ్లు వీడియో కెమేరాలు సవరించుకున్నారు.

          ఆ హడావుడి మధ్య డాక్టర్ వసుంధర చెప్పడం మొదలు పెట్టారు.

          “ఇది చాలా అరుదైన కేసు. అందుకే మిమ్మల్నందరినీ పిలిచాను. ఈమె పేరు సీత. భర్త చనిపోయి రెండేళ్లయింది. అంతక్రితం నుంచి సీత, ఆమె భర్త రామ్మోహన్ ఇద్దరూ మా ఆసుపత్రికి వచ్చేవారు. పిల్లలు పుట్టకపోవడంతో కృత్రిమ పద్ధతిలో గర్భధారణ కోసం ప్రయత్నించాను. కానీ ఈలోగానే అనుకోకుండా రామ్మోహన్ క్యాన్సర్ సోకి అకస్మాత్తుగా మరణించారు. తర్వాత రెండేళ్లకి సీత వచ్చి తనకు సంతానం కావాలని అడిగింది. అది కూడా రామ్మోహన్ ద్వారానే అని చెప్పింది. ఎందుకంటే సంతాన సాఫల్య ప్రయత్నాల కోసం రామ్మోహన్ స్పెర్మ్‌ మా ఆసుపత్రిలో స్టోర్ చేశాం. దాని ద్వారా సంతానం పొందే వీలుందా అనేది సీత కోరిక. ఇది వైద్య శాస్త్రానికి కూడా ఓ సవాలే. ఎందుకంటే ఇంత వరకు ఇలా అడిగిన వారు ఎవరూ లేరు. ఎన్నో సార్లు ప్రయత్నించాం. కానీ వీలు కాలేదు. ఆఖరికి ఓసారి కాంజుగేషన్ అయింది. ఈ విషయంలో సీత అత్తమామల సహకారం కూడా అరుదైనదే. తమ కొడుకు మరణించాక రెండేళ్లకి తమ కోడలి ద్వారానే తమకి వారసుడు రావడం వాళ్లకి కూడా ఆనందమే కదా. కానీ ఈలోపు వాళ్లు ఎన్ని ప్రశ్నలు, సవాళ్లు ఎదుర్కొని ఉంటారో అందరూ ఊహించ గలిగిందే… అందుకనే సమాజ పరంగా కూడా ఇది అరుదైన అంశం…”

          డాక్టర్ వసుంధర చెప్పిన వివరాలు వినగానే విలేకర్ల సందడి మొదలైంది. అరుదైన హ్యూమన్ యాంగిల్ స్టోరీ కావడంతో సీత అభిప్రాయాలు అడగసాగారు. వరస పెట్టి టీవీ ఛానెళ్లకి ఇంటర్వ్యూలు ఇచ్చింది సీత.

          “ఇందులో మీరెవరికైనా కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నారా?” అంటూ అడిగాడో విలేకరి.

          “అవును… ఏం చేయాలో తోచని స్థితిలో ఇలా ప్రయత్నించవచ్చంటూ సలహాని చ్చిన నా స్నేహితురాలు రమణ సాయం మరిచిపోలేను. నిరాశలో కూరుకుపోయిన నా కోసం అనేక సార్లు ఆసుపత్రులకి తిరిగి వివరాన్నీ సేకరించి, డాక్టర్లతో మాట్లాడింది. నన్ను మానసికంగా సిద్ధం చేసింది…” చెప్పింది సీత.

          ఆ ప్రెస్మీట్, ఆ హడావుడి పూర్తయ్యాక ఒడిలో ఒద్దికగా పడుకున్న బిడ్డను ఆనందం గా చూసుకుంది సీత. ఆ ఆనందం… రాముడు మాట మీద మంటల్లో దూకి అగ్నిపునీతగా బయటకి వచ్చిన అలనాటి సీతను తలపించేదే!

PUBLISHED ON NECHELI.COM WEB MAGAZINE 4TH ANNIVERSERY SPL ISSUE IN JULY, 2023