హాస్యం వేరు... వేదాంతం వేరు... రెంటికీ పొంతన కుదరదు. వేదాంతం చెబుతుంటే నవ్వు రాదు. రాకూడదు కూడా. హాస్యంగా చెప్పాలంటే వేదాంతం నప్పదు. అలాంటిది హాస్యాన్ని, వేదాంతాన్ని కలగలిపి పాట రాయాలంటే ఎంత కష్టం? కత్తి మీద సాము లాంటిదే. ఏమాత్రం మోతాదు తప్పినా వేదాంతం అభాసుపాలవుతుంది. లేదా హాస్యం పేలవంగా మిగిలిపోతుంది. అలాంటి పాట ఒకటి నాకు భలే నచ్చుతుంది. పాత పాట. 'అర్థాంగి' (1955) సినిమా లోది. అందులోని ఏ వాక్యాన్ని తీసుకున్నా, ఏ చరణాన్ని తీసుకున్నా అది నికార్సయిన వేదాంతమే. వింటుంటే 'నిజమే కదా!' అనిపిస్తుంది. కానీ చెప్పే తీరులో మాత్రం హాస్యం తొణికిసలాడుతుంది. ఇక చిత్రీకరణ అయితే ఇంకా నవ్వులు పూయిస్తుంది.
ఆ పాటే... 'నవ్వే వాళ్ల అదృష్టమేమని, ఏడ్చేవాళ్లని ఏడవనీ...' పాట.
సినిమాలో ఆ పాట వచ్చే సందర్భం చాలా గంభీరమైనది. ఓ పక్క జమీందారు గుమ్మడి చావు బతుకుల్లో ఉంటాడు. ఇంట్లో వాళ్లు అందరూ విషాదంలో మునిగిపోతారు. జమీందారు చిన్న కొడుకు జగ్గయ్య అప్పటికే ఇల్లు వదిలి ఓ వేశ్య సురభి బాల సరస్వతి ఇంట్లో ఉంటుంటాడు. అతడిని తీసుకు రావడానికి మనిషిని పంపినా, ఆఖరికి పెద్ద కొడుకు అక్కినేని నాగేశ్వరరావు వెళ్లి బతిమాలినా రానంటాడు. జమీందారు మొదటి భార్య కొడుకు అక్కినేని అయితే, రెండో భార్య కొడుకు జగ్గయ్య. చావు బతుకుల మధ్య ఉన్న జమీందారు, తన ఆస్తిని అక్కినేనికి అప్పగించి కన్నుమూస్తాడు.
జమీందారు ఇంట్లో అందరూ ఘొల్లు మని ఏడుస్తుంటే... అక్కడ సురభి బాల సరస్వతి ఇంట్లో ఈ పాట మొదలవుతుంది.
''ఏడవనీ... ఏడ్చేవాళ్లని ఏడవనీ...'' అని!
సినిమాలో గంభీరమైన సన్నివేశం చూస్తున్న ప్రేక్షకులంతా చటుక్కున కులాసా వాతావరణంలోకి మారిపోతారు. దీని వల్ల రెండు ప్రయోజనాలు నెరవేరుతాయి. ఒకటి ప్రేక్షకుల మూడ్ మారి రిలాక్స్ కావడం. రెండు, సినిమాలో చిన్న కొడుకు ఎంత బాధ్యతా రహితంగా తయారయ్యాడో బలంగా చెప్పగలగడం. ఇది మంచి స్క్రీన్ప్లే టెక్నిక్. దర్శకుడు పి.పుల్లయ్య ప్రతిభ కూడా.
ఇక పాట విషయానికి వస్తే... రాసింది ఆచార్య ఆత్రేయ. సినిమాలో 9 పాటలుంటే అన్నీ ఆత్రేయ కలం నుండి జాలువారినవే.
మణిలాల్ బెనర్జీ రాసిన బెంగాలీ నవల 'స్వయంసిద్ధ' ఆధారంగా తీసిన ఈ సినిమాకు స్క్రీన్ప్లే అందించింది కూడా ఆత్రేయనే.
చాలా గంభీరమైన విషాద సన్నివేశం వెంటనే ''ఏడవనీ...'' అంటూ మొదలయ్యే పాట రాయడం, సాహసమే కాదు సమయస్ఫూర్తి కూడా అనిపిస్తుంది.
ముందు పాట ఎలా సాగిందో చూద్దాం!...
''ఏడవనీ... ఏడవనీ... ఏడ్చే వాళ్లని ఏడవనీ
ఎదుటి వాళ్లు బాగున్నారని ఏడవనీ
నవ్వే వాళ్ల అదృష్టమేమని ఏడ్చేవాళ్లని ఏడవనీ ఏడవనీ!
నవ్వండి నవ్వే వాళ్లతో నవ్వండీ
నాలుగు ఘడియల నర జీవితము
నవ్వుల తోడుగ చేయండి ||ఏడ్చేవాళ్లని||
వచ్చిన వాళ్లు పోతారు
పోయిన వాళ్లు రాబోరు
ఈ రాకపోకల సందున ఉంది
రంజైన ఒక నాటకము
కదిలిస్తే అది బూటకము
అది అంతా ఎందుకు కానీ
అనుభవించి పోనీ
జీవిని అనుభవించి పోనీ! ||ఏడ్చే వాళ్లని||
ఉండేది ఎంత కాలమో
ఊడిపోతాము ఏ క్షణమో
రేపన్నది రూపే లేనిది
ఈ క్షణమే నీకున్నది
అందాన్నీ, ఆనందాన్నీ
అనుభవించి పోనీ
జీవిని అనుభవించి పోనీ
ఏడ్చేవాళ్లని ఏడవనీ
కళ్లు కుట్టి ఏడవనీ
కడుపు మండి ఏడవనీ
కుళ్లి కుళ్లి ఏడవనీ
ఏడవనీ ఏడవనీ''
-ఈ పాటకి సంగీత దర్శుకుడు మాస్టర్ వేణు ఓ నాటక ఫక్కీలో బాణీ కట్టారు. హార్మోయినం పెట్టి పట్టుకుని మీటలు నొక్కుతూ జగ్గయ్య చేసే అభినయాన్ని చూసి తీరాలి. సురభి బాల సరస్వతి వగలు, వయ్యారాలతో కూడిన నటన గిలిగింతలు పెడుతుంది. హాస్య నటుడు రామకృష్ట ఇతర నటీనటులు కలిసి హుషారుగా డ్యాన్సులు, స్టెప్పులతో పాటను రక్తి కట్టిస్తారు.
డెబ్భై ఏళ్ల నాటి ఈ సినిమా పాట, యూట్యూబ్లో ఈతరం వాళ్లు చూసినా ఎంజాయ్ చేసేలా ఉంటుంది.
అసలామాటకొస్తే, అర్థాంగి సినిమా గురించి చాలా చెప్పుకోవచ్చు. నల్లమందు పెట్టి పెంచడం వల్ల బుద్ధిమాంద్యానికి గురైన పెద్దకొడుకుగా అక్కినేని నటన అద్భుతంగా ఉంటుంది. జమీందారు కొడుకు అలాంటి వాడని తెలియకుండా పెళ్లి చేసుకుని, అతడికి చదవు చెప్పి ప్రయోజకుడి చేసే పాత్రలో సావిత్రి అభినయం గురించి ఎంత చెప్పినా తక్కువే. అమాయకుడిగాను, ఆ తర్వాత వివేకవంతుడిగాను నటనలో అక్కినేని చూపించిన వేరియేషన్ చాలా బాగుంటుంది. పుల్లయ్య, శాంతకుమారి దంపతులే ఈ సినిమాకి నిర్మాతలు. విజయవంతమై శత దినోత్సవం జరుపుకున్న ఈ సినిమా జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా నిలవడంతో పాటు ఫిలింఫేర్ లాంటి మరెన్నో పురస్కారాలు అందుకుంది.
https://www.youtube.com/watch?v=PRBdvuLFrYQ
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి