తెరవెనుక ఘంటసాల గళం... తెర మీద ఏఎన్నార్ అభినయం...
తెర వెనుక సుశీల గానమాధుర్యం... తెర మీద జమున నటనా లాలిత్యం...
''ఈ వేళ నాలో ఎందుకో ఆశలు... లోలోన ఏవో విరిసెలే వలపులూ...''
పల్లవి చదవగానే 'మూగనోము' సినిమా గుర్తొస్తే, పాత సినిమాల అభిమానులన్నమాటే. పాత పాటలంటే చెవి కోసుకుంటారన్నమాటే!
ఈ పాట వెనుక ఓ ఆసక్తికరమైన సంగతి ఉంది.
ఇంత హిట్ సాంగ్ ని చాలా హడావుడిగా కేవలం ఒక్క రోజు వ్యవధిలో చిత్రీకరించారు. అప్పటికి సినిమా తీయడం మొత్తం అయిపోయింది. అక్కినేని కాల్షీట్లతో సహా అందరి పనీ పూర్తయింది. అక్కినేని, జమునలపై పాటలన్నీ కూడా అయిపోయాయి. మరి ఎందుకు అంత హడావుడిగా ఈ పాట తీశారు?
అదే తెలుసుకుందాం. ఈ పాట స్థానంలో అంతకు ముందే ఓ పాట తీశారు. అది 'అందం నీలో ఉందని, అది అందుకునే వీలుందని, తొందర చేసెను హృదయం, తొలి పందెం వేసెను పరువం...' అనే పాట.
'మూగనోము' సినిమా తీసిన ఏవీయం సంస్థ నిర్మాత ఏవీ మెయ్యప్పన్ చెట్టియార్ కి ఈ పాట చిత్రీకరణ నచ్చలేదు. షూటింగ్ మొత్తం అయిపోయాక రషెస్ చూస్తున్నప్పుడు ఆయన దీన్ని గమనించారు. పాటను కొంత అవుట్ డోర్ లోను, మరి కొంత ఇన్డోర్ లోను తీశారు. ఆయా సీన్లు అంతగా మ్యాచ్ కాలేదని ఆయనకి అనిపించింది. దర్శకుడు యోగానంద్ ని పిలిపించి చూడమన్నారు. ఆయన కూడా ఏకీభవించారు. ఓ పక్క అక్కినేని అదే రోజు సాయంత్రం విమానంలో హైదరాబాద్ బయల్దేరుతున్నారు. అక్కినేనికి కూడా చూపించారు. చూశాక, 'అందులో మొదటి పాట ఎలా ఉంది?' అని అడిగారు చెట్టియార్.
'బాలేదు' అన్నారు అక్కనేని కూడా. అయితే రీషూట్ చేద్దాం అన్నారు. అయితే ఆ మర్నాటి నుంచి అక్కినేనికి మరో సినిమా షూటింగ్ హైదరాబాద్ లో ఉంది. మరెలా? అక్కినేని ఆ సినిమా నిర్మాతకు ఫోన్ చేసి గడువు అడిగారు. ఆ నిర్మాత సరేనన్నారు. దాంతో 'ఎళ్లుండి రీషూట్ పెట్టుకుందాం' అనుకున్నారు. ఈలోగా నిర్మాతకి మరో ఆలోచన వచ్చింది.
అసలా పాటనే మార్చేస్తే? నిర్మాత తల్చుకుంటే కొదవేముంది? ఆయన వెంటనే సంగీత దర్శకుడు గోవర్దన్కి విషయం చెప్పి, 'దాశరథి చేత మరో పాట రాయించండి. అది కూడా సాయంత్రానికి అయిపోవాలి' అని హుకుం జారీ చేశారు.
ఇంకేముంది? ఆగమేఘాల మీద సంగీత దర్మకుడు, గీత రచయిత, నిర్మాత కొత్త పాట మీద కూర్చున్నారు. గోవర్దన్ ట్యూన్ ఇవ్వడం, అది నిర్మాతకు నచ్చకపోవడం ఇలా కాసేపు సాగింది. విసుగెత్తిన చెట్టియార్ కి 'ఇది కాదు పని' అనిపించింది. వెంటనే తాను విన్న ఓ హిందీ పాట ట్రాక్ను తెప్పించారు. అది అప్పటికే బాగా హిట్టయిన ట్యూన్.
'ఇదిగో... ఈ ట్యూన్కి తెలుగు పాట రాసేయండి. పెట్టేద్దాం' అన్నారు.
ఆ హిందీ పాట 'దోకలియా' అనే సినిమాలోది. అదే తెలుగులో 'లేత మనసులు' సినిమా.
ఆ పాట... 'తుంహారీ నజర్ క్యో కఫా హోగయీ... ఖతా బఖ్ష్ దో గర్ ఖతా హోగయీ’ అనేది.
అది వింటూ దాశరథి రాత్రికి రాతి 'ఈవేల నాలో ఎందుకో ఆశలు... లోలోన ఏవో విరిసెలే వలపులు...' పాట రాశారు.
మర్నాటి ఉదయమే ఘంటశాల, సుశీలకు కబురెళ్లింది. వాళ్లు రాగానే పాట రికార్డింగ్ జరిపించేశారు.
ఆ పాట ట్రాక్ సిద్ధం కాగానే ముందుగా జమునను పిలిపించి పాటకు అనుగుణంగా ఆమె క్లోజప్ షాట్లు తీసేశారు. మర్నాడు అక్కినేని రాగానే హీరోహీరోయిన్లు కలిసి నటించే సీన్లన్నీ చకచకా తీసేశారు. పాట పాట తీసేసి, కొత్త పాట పెట్టేసి సినిమాను రెడీ చేశారు. ముందుగా అనుకున్నట్టుగానే సినిమా 1969 ఫిబ్రవరి 13న విడుదల అయింది. సినిమా శతదినోత్సవం చేసుకుంది. హిందీ పాటకి కాపీ ట్యూన్ అయినప్పటికీ తెలుగు పాట కూడా హిట్టయిపోయింది.
https://youtu.be/h2Kmo85h4Xg?si=s0RGfYqTSFcR80UK
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి