పూర్వము భారవి అనే సంస్కృత కవి వుండేవాడు. ‘కిరాతార్జునీయం’ సహా ఆరు మహాకావ్యాలను రచించిన ఇతడు ఆరో శతాబ్దానికి చెందిన వాడు. ఇతడి గురించిన ఆసక్తికరమైన కథ ఒకటుంది.
భారవి చిన్నతనంలోనే కవిత్వం చెప్పేవాడు. కావ్యాలు వ్రాసేవాడు. ఊర్లో వాళ్ళంతా చాలా మెచ్చుకునేవారు.
భారవి తండ్రితో ‘నీకొడుకు చాలా బాగా రాస్తున్నాడయ్యా!’ అనేవారు.
ఆయన మాత్రం ‘వాడింకా చిన్నవాడు యింకా నేర్చు కోవలిసింది చాలా వుంది. ఏదో రాస్తాడులే!’ అని తేలిగ్గా అనేవాడు.
భారవికి తన తండ్రి తనను మెచ్చుకోవడం లేదని చాలా అసంతృప్తి ఉండేది.
తల్లి దగ్గర ‘నాన్నగారు నన్ను తీసిపారేసినట్టు మాట్లాడతారు. ఊళ్లో వారంతా నన్ను మెచ్చుకుంటూ వుంటే చులకనగా... ఆ.. ఏమున్నది, యింకా వాడు చిన్నవాడు అన్నట్టు మాట్లాడతారు.’ అని చాలా సార్లు చెప్పుకున్నాడు.
ఎన్నాళ్ళయినా తండ్రి ధోరణి మారక పోయే సరికి భారవికి తండ్రిమీద కసి పుట్టింది, ఆయనను చంపాలని నిశ్చయించుకున్నాడు.
ఒకరోజు రాత్రి ఆయన వంటింట్లో భోజనం చేస్తున్నాడు భార్య వడ్డిస్తూ వుంది.
భారవి, అన్నం తిన్నాక పెరట్లోకి చెయ్యి కడుక్కునేందుకు వస్తే చంపెయ్యాలని పెద్ద బండరాయి పట్టుకొని పెరట్లో ఒక పక్క కాచుకొని కూర్చున్నాడు.
అప్పుడు భారవి తల్లి భర్తతో… ‘మీరెందుకు వాడిని అస్తమాను చిన్నబుచ్చినట్లు మాట్లాడుతారు? వాడు చాలా బాధ పడుతున్నాడు. వూరు ఊరంతా వాడిని మెచ్చుకుంటూ వుంటే మీరు మాత్రం వాడికేమీ తెలీదని అంటారట!’
అప్పుడు తండ్రి నవ్వి.... ‘పిచ్చిదానా! నాకు మాత్రం వాడిని చూసి గర్వంగా లేదనుకున్నావా? తండ్రి పొగిడితే బిడ్డకు ఆయుఃక్షీణం అంటారు. అంతే కాకుండా పొగడ్త మనిషిని పాడు చేస్తుంది, వాటి అభివృద్ధికి ఆటంకమవుతుంది. ఇంకా యెంతో పైకి రావలిసినవాడికి గర్వం పెరిగి తనంతవాడు లేడని విర్రవీగుతాడు, దానితో వాడి అభివృద్ధి ఆగిపోదా?’ అన్నాడు.
అంతా విన్న భారవికి బుర్ర తిరిగి పోయింది.
పశ్చాత్తాపంతో కుమిలి పోయాడు. వెంటనే బండ అక్కడ పారవేసి లోపలికి వెళ్లి తండ్రి పాదాలమీద పడి భోరున ఏడ్చాడు.
తాను తండ్రిని చంపాలనుకున్న విషయం చెప్పి ‘నాకేదయినా శిక్ష వేయమ’ని బ్రతిమాలుకున్నాడు.
’పశ్చాత్తాపం తో నీపాపం పోయింది! శిక్ష ఎందుకు?’ అని తండ్రి చెప్తున్నా వినకుండా తనకు ‘శిక్ష వేయమ’ని పట్టు బట్టాడు.
తండ్రి ‘సరే అలాగయితే మీ అత్తవారింట్లో ఒక సంవత్సరం ఉండిరా. నువ్వెందుకు ఉన్నావో ఎవరికీ, చివరికి నీ భార్యకు కూడా ఏ కారణాలు చెప్పకుండా ఉండాలి’ అన్నాడు.
‘ఇదేం శిక్ష? ’ అన్నాడు భారవి.
తండ్రి నవ్వి ‘అది చాల్లే వెళ్ళు!’ అన్నాడు.
భారవికి చిన్నతనంలోనే పెళ్లయింది. అప్పటికి యింకా భారవి భార్య కాపురానికి రాలేదు.
సరేనని భారవి అత్తగారి వూరికి వెళ్ళాడు. వాళ్ళు అల్లుడుగారు వచ్చారని చాలా మర్యాద చేశారు.
రోజుకో పిండివంట చేసి ఆదరించారు. నెల రోజులు గడుస్తున్నా అల్లుడు వెళ్ళటం లేదేమని వాళ్ళు విసుక్కున్నారు.
చిన్న చిన్న పనులు చెయ్యమని చెప్పడం ప్రారంభించారు. మర్యాదలు తగ్గాయి. బావ మరుదులు పొలం పనులు కూడా పురమాయించారు.
అందరూ విసుక్కుంటూ మాట్లాడేవారు...
దేనికీ బదులు చెప్పకుండా విసుక్కోకుండా అన్ని పనులు చేసేవాడు.
అతని భార్యను కూడా పొలం పనులకు పంపేవారు. భారవి భార్యకు చాలా బాధగా వుండేది. భర్తకు ఆవిడ ‘మీరు మీ ఊరు వెళ్లిపోండ’ని యెంతో చెప్పి చూసింది.
భారవి సమాధానం చెప్పకుండా మౌనం వహించేవాడు.
ఇలా సంవత్సరం గడిచింది. అప్పుడు భారవి ‘యింక నేను మావూరికి పోయివస్తాన’ని బయల్దేరాడు.
ఇంత హఠాత్తుగా ఎందుకు వెళ్లాలని అంటున్నాడో వాళ్లకు అర్థం కాలేదు.
భార్యకు, అత్తామామలకూ విషయం వివరించి ‘నాశిక్ష పూర్తి అయింది అందుకని వెళుతున్నాను!’ అని చెప్పాడు.
ఇది విని వాళ్ళు తమ ప్రవర్తనకు సిగ్గుపడ్డారు.
భారవి తనతండ్రి వేసిన శిక్ష తనలో ఎంతో ఓర్పును, నేర్పును, సహనాన్ని, అవగాహనను పెంచాయని గ్రహించాడు.
తండ్రిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకండి! మీ అభివృద్ధిని కోరుకునే వారిలో ఆయనే ప్రథముడు.
కోపంగా మాట్లాడే ప్రతివారి ని శతృత్వముతో చూడరాదు.
చిన్నప్పుడు తల్లి కోప్పడిందని, తండ్రి దండించాడని వారి మీద కోపం పెంచుకోకండి!
అదంతా మీరు బాగుపడాలనీ, వృద్ధి లోకి రావాలనీ చేసి వుంటారని గుర్తు పెట్టుకోండి!
తల్లిదండ్రులను ద్వేషించకండి!
అంతకంటే పాపం ఇంకోటి వుండదు!

కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి