శుక్రవారం, జులై 26, 2024

తాటకగా మారిన అందమైన యక్షిణి! (పిల్లల కోసం రాముడి కథ-9)

విశ్వామిత్రుడి వెంట బయల్దేరిన రామ లక్ష్మణులు రెండో రాత్రిని అంగదేశంలోని మునుల ఆశ్రమంలో గడిపారు. ఆ మర్నాడు మళ్లీ వాళ్ల ప్రయాణం మొదలైంది. ఆ ఆశ్రమంలోని మునులు వారి కోసం ఒక నావను సిద్ధం చేశారు. ఆ నావపై గంగానది దక్షిణ తీరానికి వెళ్లసాగారు. ప్రవాహం మధ్యలోకి నావ రాగానే నది వేగం ఒక్కసారిగా పెరిగింది. అలల ఉధృతికి వచ్చే శబ్దాలు అధికమయ్యాయి. ఇది గమనించిన రాముడు కుతూహలంతో విశ్వామిత్రుడిని అడిగాడు. 

''మహాత్మా! ఉన్నట్టుండి నది వేగం ఎందుకు పెరిగింది? నీటిలోంచి వినిపిస్తున్న ఆ భయంకర శబ్దాలకు కారణమేంటి?'' అన్నాడు.

అప్పుడు విశ్వామిత్రుడు ఇలా వివరించాడు.

''రామా! పూర్వం ఒకసారి బ్రహ్మదేవుడు కైలాస పర్వతం మీద తపస్సు చేశాడు. తనకు దగ్గరలో ఒక సరస్సు ఉంటే బాగుంటుందని తలపోశాడు. వెంటనే అక్కడొక చక్కని సరస్సు ఏర్పడింది. బ్రహ్మ మనో సంకల్పం వల్ల పుట్టింది కాబట్టి దానికి 'మానస సరోవరం' అనే పేరు కలిగింది. ఆ సరోవరం నుంచి ఒక నది పుట్టింది. సరస్సు నుంచి పుట్టింది కాబట్టి అది సరయూ నది అయింది. ఆ నది ఇక్కడ గంగానదితో కలుస్తోంది. రెండు నదీ ప్రవాహాల వల్లనే అలల వేగం, శబ్దం కూడా పెరిగాయి. పవిత్రమైన ఈ నదుల సంగమ ప్రదేశానికి నమస్కరించు'' అని చెప్పాడు. రామలక్ష్మణులు భక్తితో ఆయన చెప్పినట్టుగానే చేశారు. 

తర్వాత వాళ్లు గంగానదిని దాటి దక్షిణ తీరానికి చేరి నడవసాగారు. చుట్టూ దట్టమైన అడవి. అలా నడుస్తూ ఉండగా రాముడు ఆసక్తిగా మరో ప్రశ్నను విశ్వామిత్రుడిని అడిగాడు. 

''మహర్షీ! ఎంత దూరం నడిచినా ఎక్కడా మానవ సంచారం కనిపించడం లేదు. క్రూర మృగాలు యధేచ్ఛగా సంచరిస్తున్నాయి. ఇక్కడ పెరిగిన మహా వృక్షాల వల్ల సూర్యరశ్మి కూడా నేల మీద పడటం లేదు. నిర్జనమైన ఈ  అరణ్యం పేరేమిటి?'' అని వినయంగా ప్రశ్నించాడు.

విశ్వామిత్రుడు వివరించాడు.

''రామా! ఇప్పుడు దట్టమైన అడవిలా మారిన ఈ ప్రదేశంలో పూర్వం రెండు దేశాలు ఉండేవి. అవి దేవతలచే ఏర్పడినవి. అవే మలద, కరూశ దేశాలుగా పేరొందాయి. వాటిని దేవతలు ఎందుకు నిర్మించారో కూడా చెబుతాను విను. ఒకప్పుడు దేవతల రాజైన ఇంద్రుడు, వృత్రాసురుడిని చంపాడు. ఆ కారణంగా అతడికి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది. ఫలితంగా అతడిని ఆకలి పీడించసాగింది. అప్పుడు దేవతలు ఇంద్రుడిని పవిత్రమైన ఇక్కడి గంగా జలాలతో మంత్ర పూర్వకంగా  అభిషేకించారు. వెంటనే ఇంద్రుడి మాలిన్యం, పాపము కూడా తొలగిపోయాయి. అందుకు సంతోషించిన ఇంద్రుడు ఈ ప్రదేశంలో ధనధాన్యాలతో తులతూగే రెండు దేశాలు ఏర్పడతాయని, మలద కరూశ దేశాలుగా ప్రసిద్ధికెక్కుతాయని వరం ఇచ్చాడు. అలా దేవతలు నిర్మించిన ఈ దేశాలలో ప్రజలు ఎంతో వైభవంగా జీవించేవారు. అలాంటిది ఒక యక్షిణి కారణంగా ఆ రెండు దేశాలు నాశనమయ్యాయి.  ఆమె పేరు తాటక. పుడుతూనే వేయి ఏనుగుల బలం ఆమె సొంతం. ఆమెకు మారీచుడనే రాక్షసుడు పుత్రుడిగా కలిగాడు. వాడు మహాకాయుడు. ఇంద్రుండంతటి పరాక్రమశాలి. దుర్మార్గులైన ఆ తాటక, మారీచుల వల్లనే ఈ రెండు దేశాలూ ధ్వంసమయ్యాయి. ప్రజలెవరూ ఇక్కడ ఉండలేకపోతున్నారు. ఇక్కడికి ఒకటిన్నర యోజనాల దూరంలోనే ఆమె ఉంటున్నది. తాటకవనంగా పేరొందిన ఆ దారినే మనం ముందుకు సాగాల్సి ఉంది. రెండు దేశాలను కబళించిన ఆ తాటకను నువ్వు వధించాలి. ఈ దేశాలకు ఆమె బెడదను తొలగించాలి'' అన్నాడు.

తాటక గురించి వినగానే రాముడి మనసులో మరో ప్రశ్న ఉదయించింది.

''మునీశ్వరా! సాధారణంగా యక్షులకు అంతటి పరాక్రమవంతులు ఉండవంటారు కదా? మరి అబల అయినప్పటికీ తాటకికి మాత్రం వెయ్య ఏనుగుల బలం ఎలా కలిగింది?'' 

అప్పుడు విశ్వామిత్రుడు తాటకి వృత్తాంతాన్ని విపులంగా చెప్పాడు.

పూర్వం సుకేతుడనే ఒక యక్షుడు ఉండేవాడు.  అతడు మంచి ప్రవర్తన కలిగినవాడు, పరాక్రమవంతుడు. కానీ సంతానం లేనివాడు. ఆ చింతతో అతడు బ్రహ్మ గురించి గొప్ప తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమై అతడికి వెయ్యి ఏనుగుల బలంతో ఒక కుమార్తె పుడుతుందని వరం ఇచ్చాడు. ఆమే తాటక. ఎంతో అందచందాలతో ఎదిగింది. సుకేతుడు ఆమెను జంభాసురుడి కుమారుడైన సుందుడికి ఇచ్చి పెళ్లి జరిపించాడు. వారిద్దరికి పుట్టిన వాడే మారీచుడు. ఒకసారి తాటక భర్త అయిన సుందుడు, అగస్త్య మునికి ఆగ్రహం తెప్పించి ఆయన శాపానికి గురై మరణించాడు. తన భర్త మృతికి కారణమైన అగస్త్యునిపై కోపంతో తాటక, మారీచుడితో కలిసి దాడికి సిద్ధపడింది. తనను చంపడానికి వస్తున్న ఆ ఇద్దరిని కూడా అగస్త్యుడు శాపించాడు. ఆ శాపం వల్ల మారీచుడు రాక్షసత్వాన్ని పొందాడు. తాటక తన సుందరమైన రూపాన్ని పోగొట్టుకుని వికృతమైన నరమాంస భక్షకురాలిగా మారిపోయింది. అగస్త్యుడి మీద కోపంతోనే తాటక, ఆయన సంచరించిన ఈ ప్రదేశాన్ని ధ్వంసం చేసింది. రాక్షస స్వభావంతో నిరపరాధులైన ఇక్కడి జనులను కబళిస్తోంది. 

ఇదంతా చెప్పిన విశ్వామిత్రుడు రాముడితో, ''నాయనా! లోక కంటకిగా మారిన ఆ తాటకను నువ్వు చంపు. స్త్రీని చంపడం అధర్మమని సందేహించకు. ప్రజలకు మేలు చేకూర్చడమే రాజకుమారుడి ధర్మం కదా?'' అన్నాడు. 

దానికి రాముడు వినయంగా,  ''మహర్షీ! మీరు ఏమి చెప్పినా చేయమని నా తండ్రి నన్ను ఆదేశించారు. కాబట్టి నిస్సందేహంగా తాటకను వధిస్తాను'' అన్నాడు. 

అలా అంటూనే తన కోదండాన్ని ఎక్కుపెట్టి నారి సారించి వదలడం ద్వారా ధనుష్టంకారం చేశాడు. ఆ వింటినారి నుంచి వెలువడిన మహా ధ్వనికి దిక్కులు దద్దరిల్లాయి. ఆ భయంకర శబ్దం తాటకి చెవులను సోకింది. వెంటనే తాటక ఆవేశంతో నలుదిక్కులా చూసి, ఆ ధ్వని వినిపించిన వైపు వడివడిగా వచ్చింది. అక్కడ రామలక్ష్మణులు కనిపించారు. 

వికృతమైన ముఖంతో, మిక్కిలి లావైన, ఎత్తయిన శరీరంతో కోపావేశంతో వస్తున్న తాటకను చూసి రాముడు, లక్ష్మణుడితో ''చూశావా లక్ష్మణా ఈమె ఎంత భయంకరంగా ఉందో? ఈమెను చూస్తేనే సామాన్య జనం భయంతో గుండె పగిలి చనిపోతారు. ఈమె ముక్కు చెవులు ఖండించి పారిపోయేలా చేస్తాను'' అన్నాడు. కోపంతో చేతులు పైకెత్తి దూసుకు వస్తున్న తాటకను చూసి విశ్వామిత్రుడు ''రామలక్ష్మణులకు జయమగుగాక!'' అంటూ ఆశీస్సులు అందించాడు. ఈలోగా తాటక సుడిగాలిని సృష్టించి అక్కడంతా దుమ్ము, ధూళి రేగేలా చేసింది. తన మాయాశక్తితో కనబడకుండా రాళ్ల వర్షం కురిపించింది. రాముడు ఒక బాణంతో దుమ్మంతా చెదిరిపోయేలా చేసి, మరికొన్ని బాణాలతో రాళ్లను ఛేదించాడు. తాటక రెండు చేతులను కూడా ఖండించాడు. చేతులు తెగిపోయినా మీదకు వస్తున్న తాటకను లక్ష్మణుడు చూసి ముందుకు దూకి ఆమె ముక్కు చెవులను కోసేశాడు. కామరూపిణి అయిన తాటక తన మాయతో అనేక రూపాలు పొంది వారిని భ్రమపెట్టడానికి ప్రయత్నించింది. రాళ్ల వర్షం కురిపించసాగింది. ఇదంతా గమనిస్తున్న విశ్వామిత్రుడు, వారిని అప్రమత్తం చేశాడు. ''రామా! ఈమెపై జాలి చూపించకు. పాపాత్మురాలైన ఈమె యజ్ఞయాగాలకు అవాంతరాలు కలిగిస్తూ ఉంటుంది. చీకటి పడితే రాక్షసులు మరింత బలం పుంజుకుంటారు. వెంటనే హతమార్చు'' అన్నాడు. 

వెంటనే రాముడు శబ్దవేధి బాణాన్ని సంధించి తాటకపైకి ప్రయోగించాడు. ఆ బాణం గుండెల్లో గుచ్చుకోవడంతో తాటక అక్కడికక్కడే మరణించింది. తాటక మరణించగానే దేవతలు పుష్పవర్షం కురిపించారు. విశ్వామిత్రుడు పరమానందంతో రాముని ప్రశంసించి, ''మనం ఈ రాత్రికి ఇక్కడే విశ్రమిద్దాం. రేపు ఉదయం బయల్దేరి ఆశ్రమానికి చేరుకుందాం'' అన్నాడు. అయోధ్య నుంచి బయల్దేరాక మూడో రాత్రిని రామలక్ష్మణులు తాటక వనంలో గడిపారు. మర్నాడు వారి ప్రయాణం ఎలా సాగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. జై శ్రీరామ్‌!

శనివారం, జులై 06, 2024

రాముడికి అందిన అపురూప విద్యలు!

 


రాముడికి అందిన అపురూప విద్యలు!

తండ్రి దశరథుడి మాట మీద రామలక్ష్మణులు మహర్షి విశ్వామిత్రుడి వెంట బయలుదేరారు. ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్న దేవతలు వారిపై పూల వర్షం కురిపించారు. విశ్వామిత్రుడు ముందు నడుస్తున్నాడు. పదహారేళ్లయినా నిండని లేత వయసులో జులపాల జుట్టుతో ఎంతో సుకుమారంగా అందంగా ఉన్న రాముడు ధనుర్ధారియై ఆయనను అనుసరించాడు. లక్ష్మణుడు తోడుగా నడిచాడు. అమ్ముల పొదులను భుజాన కట్టుకుని, నడుముకు ఖడ్గాలు ధరించికోదండాలు పట్టుకుని ఆ అన్నదమ్ములిద్దరూ హుందాగా నడుస్తుంటే వారి శోభలు నలుదిశలా వెలుగులు చిమ్మాయి. కాలినడకన ఆ ముగ్గురూ అలా ఒకటిన్నర యోజనముల దూరం నడిచారు. ఒక యోజనం ఎనిమిది తొమ్మిది మైళ్లకు సమానం. అంటే సుమారు పన్నెండు, పదిహేను కిలోమీటర్ల దూరం. అలా ప్రయాణించి వాళ్లు సరయూ నదీ తీరానికి చేరుకున్నారు. 

అప్పుడు విశ్వామిత్రుడు ఆగి రాముడితో ఇలా అన్నాడు. 

''నాయనా! ఈ నదీ జలాలతో ఆచమనం చెయ్యి. నీకు బల, అతిబల అనే రెండు మంత్రాలను ఉపదేశిస్తాను. వీటి వల్ల నీకు అలసట కలుగదు. ఆకలిదప్పులు ఉండవు. నువ్వు నిద్రిస్తున్నా, ఏమరుపాటుతో ఉన్నా సరే, నిన్ను ఎవరూ ఏమీ చేయలేరు. ఈ మంత్రాల ప్రభావం వల్ల బల పరాక్రమాల్లో ముల్లోకాల్లోనూ నీకు సాటి రాగలవారు ఉండరు. ఈ విద్యలు రెండూ బ్రహ్మ దేవుడి నుంచి పుట్టినవి. వీటిని అందుకోడానికి అర్హతగల ఉత్తమ గుణాలన్నీ నీలో ఉన్నాయి'' అంటూ వివరించాడు.

రాముడు శుచియై ఆయన నుంచి ఆ రెండు విద్యలను గ్రహించి తేజస్సుతో వెలుగొందాడు. ఆ రాత్రి ఆ ముగ్గురూ సరయూ నదీ తీరంలోనే గడిపారు. రామలక్ష్మణులు వినయంగా విశ్వామిత్రుడి పాదములు ఒత్తుతూ సేవలందించారు. ఆయన విశ్రమించాక ఆ రాకుమారులిద్దరూ ఆ పక్కనే గడ్డి పరుచుకుని కటిక నేలపై పడుకున్నారు.

రాత్రి గడిచింది. తెలతెలవారుతుండగా ముందుగా విశ్వామిత్రుడు లేచాడు. నిద్రిస్తున్న రామలక్ష్మణులను చూసి మృదువుగా మేల్కొలిపాడు. 

''కౌసల్యాదేవికి సుపుత్రుడవైన ఓ రామా! సూర్యోదయం కావస్తోంది. లెమ్ము. దైవికమైన సంధ్యావందనాది క్రియలను ఆచరించు''.

ఆ మేలుకొలుపే...

''కౌసల్యా సుప్రజా రామా! పూర్వాసంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌'' అనే సుప్రభాత శ్లోకంగా ఎంతగానో ప్రాచర్యం పొందింది. 

వెంటనే రామలక్ష్మణులిద్దరూ లేచి, స్నానం చేసి, సూర్యునకు నమస్కరించి అర్ఘ్యప్రదానం చేశారు. దేవతలకు, రుషులకు తర్పణములు ఇచ్చారు. గాయత్రిని జపించారు. అనంతరం ప్రయాణానికి సిద్ధమై విశ్వామిత్రుడికి నమస్కరించారు. 

మళ్లీ ప్రయాణం మొదలైంది. కొంత సేపు నడిచిన తర్వాత వాళ్లు ముగ్గరూ సరయూ నది, గంగానదితో కలిసే చోటుకు చేరుకున్నారు. అక్కడ  దూరంగా ఒక ఆశ్రమాన్ని చూశారు. ఆ పరిసరాలన్నీ ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నాయి. 

అదంతా చూసి రాముడు కుతూహలంతో విశ్వామిత్రుడిని వినయంగా ప్రశ్నించాడు.

''మహాత్మా! పవిత్రమైన ఈ ఆశ్రమము ఎవరిది? ఇక్కడ ఎవరు ఉంటున్నారు? ఈ విషయాలను తెలుసుకోవాలని ఉంది''

విశ్వామిత్రుడు చిరునవ్వుతో చెప్పసాగాడు.

''రామా! విను. పూర్వం ఈ ప్రదేశంలో పరమశివుడు తపస్సు ఆచరించాడు. ఒకసారి మన్మథుడు ఈ ప్రదేశానికి వచ్చి శివుడి తపస్సుకు భంగం కలిగించాడు. తన ధ్యానానికి అంతరాయం కలగడంతో శివుడు కళ్లు తెరిచి కోసంగా చూశాడు. దాంతో మన్మథుడి శరీరం కాలి బూడిదైపోయింది. అప్పటి నుంచి మన్మథుడు శరీరం లేనివాడయ్యాడు. అందువల్లనే మన్మథుడిని అనంగుడు కూడా అంటారు. అతడు కాలి బూడిదయ్యాడు కాబట్టి ఈ దేశానికి అంగదేశమనే పేరు స్థిరపడింది. పరమ శివుడు తపస్సు చేసిన పవిత్ర ప్రదేశం కాబట్టి ఇక్కడ శివభక్తులైన మునులు ఆశ్రమం నిర్మించుకుని తపస్సు చేసుకుంటున్నారు. మనం ఈ రాత్రికి ఇక్కడే గడుపుదాం. రేపు గంగానదిని దాటుదాం'' అంటూ వివరించాడు విశ్వామిత్రుడు. 

విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో ఇలా సంభాషిస్తున్న విషయాన్ని ఆ ఆశ్రమంలోని మునీశ్వరులు దివ్యదృష్టితో చూడగలిగారు. వెంటనే వారంతా ఎంతో ఆనందంగా పులకించి పోతూ వచ్చారు. విశ్వామిత్రుడిని అర్ఘ్య పాద్యాలతో పూజించి వారిని సాదరంగా ఆశ్రమానికి ఆహ్వానించారు. అయోధ్య  కోట నుంచి బయల్దేరిన రామలక్ష్మణులకు ఇది రెండవ రాత్రి. విశ్వామిత్రుడు, ఆశ్రమ మునులు చెప్పుకున్న కథలను, విషయాలను వింటూ వారిద్దరూ విశ్రమించారు. మర్నాడు వారి మూడో రోజు ప్రయాణం ఎలా సాగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. జై శ్రీరామ్‌!

సోమవారం, జులై 01, 2024

గేటు దూకించిన... 'బాల భారతం'



వెండితెరంతా మిలమిలలాడుతున్న నక్షత్రాలు... వాటి మధ్యలో బాణాలతో కట్టిన నిచ్చెన... దానిపైకి గద పట్టుకుని ఎక్కుతున్న బాల భీముడు... నేపథ్యంలో ఘంటశాల గానం...
''మానవుడే మహనీయుడు... శక్తియుతుడు యుక్తిపరుడు మానవుడే మహనీయుడు...''
... మరిలాంటి దృశ్యం పిల్లల్ని కళ్లప్పగించి చూసేలా చేయదూ? మళ్లీ మళ్లీ చూడాలనిపించేయదూ?
సరిగ్గా... యాభై ఏళ్ల క్రితం నాదీ అదే పరిస్థితి! 
అప్పట్లో నేను పిలగాణ్ణే. బహుశా ఆరో తరగతో, ఏడో తరగతో. మా వీధి చివరే ఉండేది సినిమా హాలు. ఊరు చోడవరం. అనకాపల్లి దగ్గర. నాన్నగారు జూనియర్‌ కాలేజీలో ఇంగ్లిషు లెక్చరర్. మనం పండిత పుత్రులమన్నమాట. సరిగ్గా సాయంత్రం నాలుగుంబావు సమయానికి మ్యాట్నీలో ఆ పాట వస్తుందని నాకూ, చెల్లా శీనుగాడికీ తెలుసు. ఇద్దరికీ ఆ సినిమా తెగ నచ్చేసింది. ఆ పాట అయితే మరీనీ. మంచి సినిమా అంటే ఏదో ఓసారి తీసుకెళ్తారు పెద్దవాళ్లు. కానీ మళ్లీ మళ్లీ చూడాలినిపిస్తే ఎలా? 
''ఒరేయ్‌... గేటు దూకి చూసేద్దామేంట్రా?'' అన్నాడు చెల్లా శీనుగాడు.
''మరి పట్టుకోరూ?'' అని నా భయం.
చెల్లా శీనుగాడు నాకన్నా ఒకటో, రెండో క్లాసులు చిన్నవాడే అయినా మహా చలాకీగాడు. 
''ఎహె... ఏం కాదు రా...'' అంటూ వాడు పరుగు. వాడి వెనకే నేను.
ఇద్దరం హాల్లోకి వెళ్లాం. అక్కడ పోస్టర్లు, స్టిల్సు చూస్తున్నట్టు అటూ ఇటూ తిరిగాం. వాటి పక్కగా ఉండేది చెక్క గేటు. మా ప్రాణానికి అది నిలువెత్తుదే. మధ్యలో ఉండే అడ్డ చెక్కలే మాకు నిచ్చెన మెట్లన్నమాట. శీనుగాడు అటూ ఇటూ చూసి గేటు సందుల్లో కాళ్లు పెట్టి చకచకా ఎక్కేశాడు. అటువైపు దిగిపోయి 'ఎక్కెయ్‌...' అన్నట్టు సైగ చేశాడు. నేనూ ఎక్కేశా. అటువైపు దిగాం. నేను దర్జాగా రిజర్వ్‌డ్‌ క్లాసు వైపు వెళుతుంటే వాడు నా చొక్కా పట్టుకుని ఆపాడు. నా చెయ్యి పట్టుకుని, స్తంభాల చాటు నుంచి నక్కుతూ నేల క్లాసు తలుపు కేసి నడిచాడు. ఆ తలుపు ఓరగా చేరవేసి ఉంది. నెమ్మదిగా తీశాడు. లోపలికి దూరిపోయాం. లోపలంతా చీకటి. తెరకేసి చూసేసరికి రంగురంగుల 'బాల భారతం' సినిమా! అప్పుడే అర్జునుడు బాణాలతో ఆకాశానికి నిచ్చెన కట్టేశాడు. బాలభీముడు గద పుచ్చుకుని ఎక్కడం మొదలు పెట్టాడు.
మేం కళ్లప్పగించేశాం. 
''మంచిని తలపెట్టినచో మనిషికడ్డు లేదులే...
ప్రేరణ దైవానిదైన సాధించును నరుడే!''
మేం కాస్త అటూ ఇటూ చూసి ఖాళీగా ఉన్న బెంచీ చూసుకుని తెర మీంచి తల తిప్పకుండానే, తడుముకుంటూ కూర్చున్నాం. 
''గ్రహరాశులనధిగమించి...
ఘన తారల పథము నుంచి...
గగనాంతర రోదసిలో గంధర్వ గోళ తతుల దాటి...
చంద్రలోకమైనా దేవేంద్రలోకమైనా 
బొందితో జయించి మరల భువికి తిరిగి రాగలిగే
మానవుడే మహనీయుడు!''
మేం కిమ్మనలేదు. ఆ సీను అలాంటిది! మా వయసు అలాంటిది!!
అక్కడి నుంచి సినిమా పూర్తయ్యేవరకు చూసేశాం. 
అది మొదలు. ప్రతి రోజూ అదే పని. నాలుగింటికల్లా చెల్లా శీనుగాను వచ్చేసేవాడు. నేను రెడీగా ఉండేవాణ్ణి. 
రోజులన్నీ ఒకేలా గడుస్తాయా? ఆ సంగతి ఇప్పుడు తెలుసు కానీ, అప్పటికి తెలీదుగా.
ఓసారి మామూలుగానే బయల్దేరాం. శీనుగాడు గేటు దూకేశాడు. నేను కూడా ఎక్కి దూకా. 
''ఒరేయ్‌... ఎవర్రా అది?'' అంటూ ఓ కేక వినపడింది.
నా గుండె గుభేలుమంది. హాలు పనివాడో, గేటు కీపరో ఎవరో తెలీదు కానీ వచ్చి నన్ను పట్టుకున్నాడు. బిక్కచచ్చిపోయా. అప్పటికే శీనుగాడు నేల క్లాసు తలుపు తీస్తున్నాడు. మనం వాడిని వెళ్లనిస్తామా?
''అదిగో వాడు కూడా ఉన్నాడు సార్‌...'' అంటూ చూపించేశా.
వాడు చటుక్కున వెళ్లి వాడిని కూడా రెక్క పుచ్చుకుని లాక్కొచ్చాడు. ఈలోగా మరొకడు కూడా వచ్చాడు.
ఇద్దరూ కలిసి మమ్మల్ని ఓ ఆట ఆడుకున్నారు.
''ఒరేయ్‌... చొక్కాలిప్పండ్రా...'' అన్నారు. 
మేం ఏడుపు మొహాలతో చొక్కా బొత్తాలిప్పుతూనే బతిమలాడ్డం మొదలెట్టాం.
''సార్‌... వదిలేయండి సార్‌...''
''తప్పయిపోయింది... ఇంకెప్పుడూ రాం సార్‌...''
మాలాంటి కుర్రాళ్లు దొరికితే కాసేపు కాలక్షేపం చేయకుండా ఎలా ఉంటారు?
''పదండ్రా... మేనేజర్‌ దగ్గరకి తీసుకెళ్దాం...'' అని బెదిరింపులు.
బిత్తరి చూపులతో, బిక్క మొహాలతో మేం. 
నాకు దొరికిపోయినందుకు కాదు బెంగ. ఆ హాలు యజమానిగారబ్బాయి ఎక్కడ చూస్తాడో అని బాధ. ఎందుకంటే... ఆ అబ్బాయి పేరు నానాజీ. ఇంటర్‌ చదివేవాడు. మా నాన్నగారి దగ్గరే రోజూ ట్యూషన్‌కి వచ్చేవాడు. మంచి సినిమా వస్తే మమ్మల్ని రమ్మనేవాడు. అమ్మా, నాన్నగారూ, నేనూ వెళితే టిక్కెట్లు తీసుకోనిచ్చేవాడు కాదు. రిజర్వ్‌డు క్లాసులోకి తీసుకెళ్లి కూర్చోబెట్టేవాడు. ఇంటర్వెల్‌ లో సమోసాలు, కూల్‌డ్రింకులు కూడా పంపేవారు. అలా దర్జాగా సినిమా చూసేవాడిని ఇలా గేటు దాటుతూ పట్టుబడితే ఎంత సిగ్గు చేటు? అదీ నా దిగులు.
ఆఖరికి కాసేపు ఏడిపించాక ఆ హాలు పనివాళ్లు మా చొక్కాలు మాకిచ్చేసి ''పొండి... '' అని వదిలేశారు.
అంతే... బతుకు జీవుడా అనుకుని వాళ్ల ముందే మళ్లీ చెక్క గేటు చకచకా ఎక్కేసి ఇటు వైపు దూకి ఇళ్లకు పరుగో పరుగు. 
మళ్లీ మేం గేటు దూకితే ఒట్టు. 
చోడవరం శ్రీనివాసా థియేటర్‌లో దాదాపు యాభై ఏళ్ల క్రితం నా చిన్ననాటి 'నాటీ' జ్క్షాపకం ఇది. అప్పట్లో మా ఇంటికి దగ్గర్లో రెండు థియేటర్లు ఉండేవి. ఒకటిదైతే మరోటి పూర్ణా థియేటర్‌. ఆ థియేటర్‌ యజమాని కొడుకు పేరు రాజాజీ. నానాజీ, రాజాజీ ఇద్దరూ మా నాన్నగారి స్టూడెంట్లే. అమ్మ ఏ ఉల్లిపాయలో తెమ్మన్నప్పుడు నేను అలా ఏ థియేటర్‌ దగ్గరకి వెళ్లి సరదాగా స్టిల్స్‌ చూస్తున్నా, నానాజీ కానీ, రాజాజీ కానీ చూస్తే... ''బాబూ! లోపలకి వెళ్లి కూర్చో...'' అని చెప్పేవాళ్లు. పైగా హాలు పనివాళ్లని పిలిచి ''ఈ బాబుని రిజర్వ్‌డ్‌ లో కూర్చోబెట్టు'' అనేవాళ్లు. నేను ఉల్లిపాయల మాట మానేసి సినిమా చూసి చక్కా వచ్చేవాడిని. 
అమ్మ తిట్టి పోసేది. ''పకోడీలు వేద్దామని ఉల్లిపాయలు తెమ్మంటే ఇంత సేపా? ఇంత సేపూ ఏం చేశావ్‌?'' అంటూ కేకలేసేది.
అలాంటిది సినిమా హాలు గేటు దూకి దొంగతనంగా సినిమా చూడాలనిపించడమేంటి... ఆకతాయితనం కాకపోతే?! 
మొత్తానికి 'బాల భారతం' సినిమా నాకో గుణపాఠం నేర్పింది. 
ఇంత చెప్పుకుని ఆ సినిమా గురించి చెప్పుకోకపోతే ఎలా? 
పౌరాణిక బ్రహ్మగా పేరొందిన దర్శకుడు కమలాకర కామేశ్వరరావు తీసిన 'బాల భారతం' 1972లో వచ్చింది. అందులో నాకెంతో నచ్చిన 'మానవుడే మహనీయుడు' పాట ఆరుద్ర రాసింది. 
''దివిజ గంగ భువి దింపిన భగీరథుడు మానవుడే...
సుస్థిర తారగ మారిన ధ్రువుడు కూడ మానవుడే...
సృష్టికి ప్రతి సృష్టి చూయు విశ్వామిత్రుడు నరుడే...
జీవకోటి సర్వములో శ్రేష్టతముడు మానవుడే''
ఎంత బాగా రాశాడు! స్వతహాగా నాస్తికుడైనా ఓ పౌరాణిక సినిమాకి మంచి సందర్భంలో పాట రాస్తూ, ఆ అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుని మానవుడి విజయాల గురించి ఎంత స్ఫూర్తిదాయకంగా చెప్పాడు! 
సాలూరి రాజేశ్వర రావు స్వర కల్పనలో ఘంటశాల గానంలో ఆ పాట ఎంత బాగా వచ్చిందో, వెండితెర మీద కూడా అంత అద్భుతంగానూ ఆవిష్కృతమైంది. పిల్లల్ని పాత్రధారులుగా పెట్టినా మహాభారతంలో పాండవులు, కౌరవులు పెద్దవాళ్లయ్యేంత వరకు కథని తీసుకుని, కురువంశం మూలాల నుంచి ధర్మరాజు పట్టాభిషేకం అయ్యేవరకు తీసిన ఆ సినిమా ఇప్పటికీ అందరినీ అలరించేదే. ఎస్వీరంగారావు, ధూళిపాళ, కాంతారావు, హరనాథ్‌, అంజలీదేవి, ఎస్‌. వరలక్ష్మి తదితరుల పాత్రోచితమైన అభినయాలు, ఆకట్టుకునే పాటలూ చాలా చక్కగా అమరాయి. పెద్దయ్యాక అందాల తారగా చిత్రసీమను ఏలిన శ్రీదేవి ఇందులో దుస్సలగా పెద్ద పెద్ద కళ్లతో అలవోకగా నటించేసింది. 
'నారాయణ నీ లీల నవరస భరితం... నీ ప్రేరణచే జనియించెను బాలభారతం...'
'భలె భలె భలె భలె పెద బావా... భళిర భళిర ఓ చిన బావ...'
'ఆడెనోయి నాగ కన్యకా... చూడాలోయి వీర బాలకా...'
'తారంగం తారంగం తాండవ కృష్ట తారంగం...'
'విందు భోజనం పసందు భోజనం...' 
లాంటి పాటలన్నీ చాలా బాగుంటాయి. ఇప్పటికీ ఏ టీవీలోనే ఈ సినిమా వస్తే కళ్లప్పగించి చూస్తూనే ఉంటాను. నేనే కాదు... అందరూనూ!