మంగళవారం, జనవరి 20, 2026

పాకిస్తాన్‌లో ఉంటూ అయోధ్య రాముడి కోసం తపించిన రాజపుత్ర వీరుడు!






అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణం జరుగుతున్న వేళ, పాకిస్తాన్‌లోని సింధ్ (ఉమర్‌కోట్ రియాసత్) పాలకుడు, రాజపుత్ర వీరుడు 'రాణా హమీర్ సింగ్' రావల్సా ..
రామయ్యకు దాదాపు 6 కోట్ల రూపాయలను విరాళంగా సమర్పించారన్న విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు..

ఇది సామాన్యమైన వంశం కాదు... చరిత్రలో షేర్ షా సూరి దెబ్బకు భయపడి పారిపోతున్న మొఘల్ చక్రవర్తి హుమాయున్‌కు తమ కోటలో ఆశ్రయం ఇచ్చిన ధీర సోధా రాజపుత్ర వంశం వీరిది..

అక్బర్ పుట్టింది కూడా వీరి కోటలోనే! "శరణు కోరి వచ్చిన వారిని ప్రాణాలకు తెగించి కాపాడటమే రాజపుత్ర ధర్మం" అని చరిత్ర సాక్షిగా నిరూపించిన గొప్ప వంశం వీరిది..

నేటికీ పాకిస్తాన్ గడ్డపై రాణా హమీర్ సింగ్ జీ ఒక సింహంలా, రాజసంతో జీవిస్తున్నారు:

శిరస్సుపై రాజపుత్రుల తలపాగా, నుదుటన తిలకం ధరించి సగర్వంగా ఉంటారు..

తమ ఆధీనంలోని 25,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 'గోవధ'ను పూర్తిగా నిషేధించిన ధర్మకర్త.
ఇప్పటికి 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు..

అక్కడి హిందువులు, ముస్లింలు అందరూ వీరిని తమ రాజుగా భావించి గౌరవిస్తారు..

కోనసీమ ప్రభల తీర్థం... కథా కమామీషు!



 

తెలుగువారికి ముఖ్యమైన పండుగ సంక్రాంతి. ఏ రోజుకు ఆ రోజే ప్రాధాన్యం కలిగిన పర్వదినాలివి. అందుకే ‘పెద్ద పండుగ’ అనీ పిలుస్తారు. భోగి అనగానే- వాడవాడలా వేసే మంటలు, చిన్నపిల్లలకు పోసే భోగిపళ్లు, లక్ష్మీదేవి అనుగ్రహం కోసం తీర్చిదిద్దే బొమ్మల కొలువులు గుర్తుకొస్తాయి. వ్యవసాయదారుల పండుగ కనుమ. సంక్రాంతిని పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల్లో అనేక ఉత్సవాలు జరుగుతాయి. సంక్రాంతి వేడుకల్లో కోనసీమకొక ప్రత్యేకత ఉంది. కోనసీమకే ప్రత్యేకమైన ‘ప్రభల తీర్థం’ ఒకటి. కోనసీమలో సంక్రాంతినాడు కొన్ని చోట్ల, కనుమనాడు అనేక చోట్ల ఈ తీర్థాలు నిర్వహిస్తారు. అన్నింటిలోనూ ప్రఖ్యాతి పొందింది- జగ్గన్నతోటలో జరిగే ప్రభల తీర్థం. అమలాపురానికి దగ్గరలోని మొసలపల్లి-ఇరుసుమండ గ్రామాల మధ్య గల ఏడెకరాలను జగ్గన్నతోటగా పిలుస్తారు.

దేశమంతా జరుపుకునే సంక్రాంతి అందరికీ ఒకటే అయినా ప్రాంతాన్ని బట్టి కొత్త రూపు దిద్దుకుంటుంది.
కొబ్బరాకుల నడుమనున్న కోనసీమకి సంక్రాంతి తెచ్చే వన్నె వేరు.
సంక్రాంతికి మాత్రం కోనసీమ పచ్చ పట్టుపరికిణీ కట్టుకున్న పల్లెపడుచులా ముస్తాబవుతుంది.
ముత్యాల ముగ్గుల నడుమ సంబరంగా నర్తిస్తుంది. ప్రతి ఇంటా సంతోషం మంచు జిల్లై కురుస్తుంది. అక్షరానికందని అదొక వర్ణనాతీత అనుభూతి.

 




పురాణాల్లోని ‘ఏకాదశ రుద్రుల’కు ప్రతీకలైనవారు కోనసీమలోని ఇరుగుపొరుగు గ్రామాల్లో కొలువై ఉన్నారంటారు. మొసలపల్లి గ్రామదైవం భోగేశ్వరస్వామి ఆహ్వానం మేరకు వీరందరూ సంవత్సరానికి ఒకసారి సమావేశమై లోక కల్యాణం కోసం చర్చలు సాగిస్తారట. అలా 11మందీ ఒకచోట నిర్వహించే సమావేశమే ప్రభల తీర్థం పరమార్థమని భావిస్తారు. 

🥀🌺వారు: వ్యాఘ్రేశ్వరం (విశ్వేశ్వర రుద్ర రూపం) వ్యాఘ్రేశ్వరుడు, కృష్ణరాయుడి (కె) పెదపూడి (మహాదేవ రుద్రరూపం) మేనకేశ్వరుడు, ఇరుసుమండ-ఆనంద (త్రయంబక రుద్రరూపం) రామేశ్వరుడు, వక్కలంక (త్రిపురాంతక రుద్రుడు) విశ్వేశ్వరుడు, నేదునూరు (కాలరుద్రుడు) చెన్నమల్లేశ్వరస్వామి. అలాగే ముక్కామల (కాలాగ్ని రుద్రుడు) రాఘవేశ్వరుడు, మొసలపల్లి (నీలకంఠ రుద్రుడు) భోగేశ్వరుడు, పాలగుమ్మి (మృత్యుంజయ రుద్రుడు) చెన్న మల్లేశ్వరుడు, గంగలకుర్రు (సర్వేశ్వర అగ్రహారం) వీరేశ్వరుడు, గంగలకుర్రు (సదాశివ రుద్ర రూపం) చెన్నమల్లేశ్వరుడు, పుల్లేటికుర్రు (శ్రీ మన్మహాదేవ రుద్రరూపం) అభినవ వ్యాఘ్రేశ్వరుడు. వీరిలో మొదటివాడైన వ్యాఘ్రేశ్వరస్వామి ప్రభల తీర్థానికి అధ్యక్షత వహిస్తాడంటారు. అందుకే ఆ ప్రభ వచ్చేవరకు భక్తులు మొక్కులు తీర్చుకోకుండా వేచి ఉంటారు.

తాటి దూలాలకు టేకు చెక్కలు అమర్చి, వెదురు బొంగుల్ని ఒక క్రమపద్ధతిలో గోపురం ఆకారంలో వంచి కడతారు. ఆ మధ్య ఖాళీలను రంగురంగుల నూతన వస్త్రాలతో అల్లికలా తీర్చిదిద్దుతారు. ఎర్రని గుడ్డను వెనక వైపు తెరలా కట్టి ఉంచుతారు. ముందు, వెనక భాగాల్ని జీవాత్మ పరమాత్మల ప్రతీకలుగా పరిగణిస్తారు. పైభాగంలో ఆలయాల్లోని ఇత్తడి కలశాలను బోర్లించి కట్టి- ఆ పైన వరి కంకులు, నెమలి పింఛాలు, పూల దండలు, ఇతర సామగ్రితో అలంకరిస్తారు. వాటి మధ్యలో ఉత్సవ విగ్రహాలు ఉంచడానికి వీలుగా గద్దెలు ఏర్పాటుచేస్తారు. వాటిమీద ఆయా గ్రామాల్లోని శివుడి ఉత్సవ విగ్రహాలు ఉంచడం ఒక సంప్రదాయం.

అనంతరం మేళతాళాలు,మంగళ వాద్యాలు, వేదమంత్రాల మధ్య వూరేగింపుగా బయలుదేరతారు. ప్రభలను మామూలు రహదారుల వెంటగాని, వాహనాల మీదగాని తీసుకు వెళ్లరు. ఎంత దూరమైనా భక్తులు భుజాల మీద మోస్తూ, పంట చేల మధ్య నుంచి వూరేగింపుగా వెళతారు. కొన్ని చోట్ల ఆరడుగుల నీటిలో నుంచి గోదావరి కాలువల్లోకి దిగి, ప్రభల్ని నేర్పుగా ఒడ్డుకు చేరుస్తారు.

ఈ ప్రభల్ని పరమశివుడి వెంట ఉండే వీరభద్రుడి ప్రతీకలుగా భావించి ‘వీరభద్ర ప్రభలు’గా పిలుస్తారు. పగలంతా పూజలు చేసి మొక్కుబడులు తీర్చుకుంటారు. రాత్రి సంప్రదాయ నృత్యాలు, కళా ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. కోనసీమలో జరిగే ఈ ప్రభల తీర్థాన్ని తిలకించడానికి, ఇందులో పాలుపంచుకోవడానికి- రాష్ట్రేతరులే కాక, విదేశాల్లో నివసించేవారూ వస్తారు. భక్తిభావాన్ని చాటుకుంటూ, ఆనందాన్ని మూటకట్టుకుని తిరిగి వెళతారు. ఇలాంటి సంప్రదాయాల్లో ఆధ్యాత్మిక భావనలతో పాటు సామాజిక ప్రయోజనాలూ భాసిస్తాయి!


అమ్మాయిని పొగడడంలో... అగ్రతాంబూలం!



 



అబ్బాయి ప్రేమలో పడితే, అమ్మాయిలో అన్నీ అందాలే కనిపిస్తాయి. ఆ అందాన్ని పోల్చడానికి ఎన్నో ఉపమానాలు వెతుక్కుంటాడు. ఆమె ముఖంలో చందమామను చూస్తాడు. నవ్వులో వెన్నెలను గమనిస్తాడు. ఆమె నడకను హంసలతో, ఏనుగులతో పోలుస్తాడు. ఇక ఆ అబ్బాయి సినిమా హీరో అయితే, ఆ అమ్మాయి హీరోయిన్ అయితే ప్రేమ గీతాలు వెలువడుతాయి. తొలి సినిమా నుంచి తాజా సినిమా వరకు దేన్ని తీసుకున్నా, అమ్మాయిని పొగడని ప్రేమ గీతాలు ఉంటాయా? ఒకో పాటది ఒకో ఒరవడి. సినిమా తీరును బట్టి, నిర్మాత అభిరుచిని బట్టి, గీత రచయిత సత్తాను బట్టి మాటలు మారవచ్చు... పోలికలు మారవచ్చు... భాష మారవచ్చు... భావం మారవచ్చు... కానీ పొగడ్తలు మాత్రం మారవు. ఇలాంటి పాటలన్నీ ప్రేక్షకులను ఆకట్టుకున్నవే.

మరి ఇలాంటి పొగడ్తల్లో అత్యుత్తమమైనవేవి?

అలా వెతుకుదామనుకున్నా... పుంఖాను ఫుంఖాను పాటలు గుర్తుకొస్తాయి.  ఫలానాదే గొప్పదని చెప్పలేం కూడా.

అయితే ఒక్కసారి ఈ పొగడ్తలను చూడండి...

‘‘వెన్నెలలో... చల్లని గాలిలో... వీచే మల్లెల పరిమళానికి నువ్వు’’ అంటే ఏ అమ్మాయి పొంగిపోదు?

‘‘ఆకాశంలో తారలన్నీ అమ్మాయిలైతే, వాళ్లంతా చక్కిలిగింతలు పెట్టుకుంటూ సంబర పడుతుంటే... ఆ పరవశం నేనైతే, ఆ పరిమళం నువ్వు’’ అంటే అమ్మాయి ఎంత ఆనందపడిపోతుంది?

‘‘కోయిల పాటలో మాధుర్యమే నువ్వు...‘‘

‘‘చందమామతో కలువలు కులికే సరసమే నువ్వు...‘‘

‘‘అసలు అమ్మాయిలందరూ తమకు ఉండాలని కోరుకునే అందాలన్నీ నీవే... నిన్ను అందుకునే ఆనందమంతా నేను...’’

అబ్బో...ఇలాంటి అపురూపమైన పొగడ్తలన్నీ కలిసి ఒకే పాటలో ఉంటే?అదొక మంచి పాట అవుతుంది కదా?

ఈ పాటికి ఆ పాట గుర్తుకొస్తే... సరే!

లేకపోతే దాని గురించి చెప్పుకుందాం. అంత మంచి పాట రాసిన ఆ గీత రచయితని తల్చుకుందాం. ఎందుకంటే... ఆ పాట, ఆ రచయిత భాష రెండూ గొఫ్పవే మరి.

ముందు ఆ పాటను చదవండి మరి...

పల్లవి :
రాగమయీ రావే అనురాగమయీ రావే
రాగమయీ రావే అనురాగమయీ రావే
రాగమయీ రావే...
అనుపల్లవి :
నీలాల గగనాన నిండిన వెన్నెల
నీలాల గగనాన నిండిన వెన్నెల
నీ చిరునవ్వుల కలకలలాడగ
రాగమయీ రావే అనురాగమయీ రావే
రాగమయీ రావే...

చరణం : 1
చివురులు మేసిన చిన్నారి కోయిల
మరిమరి మురిసే మాధురి నీవే
చివురులు మేసిన చిన్నారి కోయిల
మరిమరి మురిసే మాధురి నీవే
తనువై మనసై నెలరాయనితో
కలువలు కులికే సరసాలు నీవే
సరసాలు నీవే సరాగాలు నేనే
రాగమయీ రావే అనురాగమయీ రావే
రాగమయీ రావే...

చరణం : 2
సంజెలలో సంజెలలో హాయిగ సాగే చల్లనిగాలిలో
మరుమల్లెల విరజాజుల పరిమళమే నీవు
జిలుగే సింగారమైన చుక్క కన్నెలు అంబరాన
జిలుగే సింగారమైన చుక్క కన్నెలు అంబరాన
సంబరపడు చక్కిలిగింతల పరవశమే నేను
నవ పరిమళమే నీవు
రావే రాగమయీ నా అనురాగమయీ
రావే రాగమయీ నా అనురాగమయీ

చరణం : 3
నీడజూసి నీవనుకొని పులకరింతునే
అలవికాని మమతలతో కలువరింతునే
నీ కోసమే ఆవేదన నీ రూపమే ఆలాపన
కన్నెలందరూ కలలు కనే అందాలన్నీ నీవే
నిన్నందుకొనీ మైమరచే ఆనందమంతా నేనే
రావే రాగమయీ నా అనురాగమయీ
రావే రాగమయీ నా అనురాగమయీ

బాగుంది కదా పాట. ‘జయభేరి’ సినిమాలోది. పి. పుల్లయ్య దర్శకత్వంలో 1959లో వచ్చింది.  రాసింది ‘‘వచన రచనకు మేస్త్రీ అని పేరు పొందిన మల్లాది రామకృష్ణ శాస్త్రి’’. సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు.

ఈ పాటలో తెర మీద హీరో అక్కినేని నాగేశ్వరరావు, హీరోయిన్ అంజలీదేవి కనిపిస్తారు. పాత్రల పరంగా అతడు కాశీనాథ్. పండిత కుటుంబానికి చెందిన వాడు. గాయకుడు, స్వరకర్త. ఆమె మంజుల. నిమ్న కులానికి చెందిన నాట్య కళాకారిణి. 17వ శతాబ్దానికి చెందిన కథలో ఈ ఇద్దరి కళాకారుల ప్రేమ అప్పట్లో సామాజికంగా ఎలాంటి సంచలనం కలిగించిందో, కళనే నమ్ముకున్న ఆ ఇద్దరూ ఎలాంటి అవమానాలు ఎదుర్కొన్నారో, ఎలా అత్యున్నతంగా ఎదిగారో అనేదే కథ. శారదా పిక్చర్స్ ద్వారా వచ్చిన ఈ సినిమా అప్పట్లో గొప్ప  కళాత్మక సినిమాగా పేరు తెచ్చుకుంది. వ్యాపారాత్మకంగా కూడా లాభాలు అందుకుంది. అంతేకాదు ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డు కూడా పొందింది. నటీనటుల అభినయం గురించి కానీ, దర్శకత్వం గురించి కానీ, సంభాషణలు గురించి కానీ, నేపథ్య గాయకులు ఘంటసాల, సుశీల తదితరుల గాన మాధుర్యం గురించి కానీ చెప్పడం కష్టం. చూడడమే నయం. స్వయంగా అనుభూతి చెందడమే అత్యుత్తమం.

 

సుమధుర రచనల మేస్త్రి...

మల్లాది రామకృష్ణ శాస్త్రి ప్రతిభ అనేక రంగాల్లో ప్రస్ఫుటం. వేదవిద్య, మహాభాష్యం, బ్రహ్మసూత్రాలను అభ్యసించిన ఆయనకు... నాట్యకళ, చిత్రలేఖనం, సంగీతంలో కూడా  ప్రవేశం ఉంది. అలంకార, వ్యాకరణ తర్క శాస్త్రాలను పూర్తిగా అధ్యయనం చేసారు. అంతే కాదు ఖగోళ, జ్యోతిష్య శాస్త్రాలు కూడా వీరికి తెలుసు. చిన్నతనం నుంచే రచనలో రాణించారు. అవన్నీ పలు పత్రికల్లో అచ్చయ్యాయి. ఇక నాటకాలు, నవలలు చిరకీర్తిని ఆర్జించి పెట్టాయి. ‘కృష్ణాతీరం’ నవల అచ్చ తెలుగు నుడికారానికి పట్టం కట్టిన రచనగా తెలుగు సాహిత్య చరిత్రలో గొప్ప పేరు పొందింది.

 కృష్ణా జిల్లాలో చిట్టి గూడూరు అనే కుగ్రామంలో 1905లో పుట్టిన ఆయన, మచిలీపట్నంలో బియ్యే చదివాక, మద్రాసు వెళ్లి సంస్కృతాంధ్రాలలో ఎమ్మే పట్టా అందుకున్నారు. పదిహేనేళ్లకే పెళ్లి. నలుగురు సంతానం. ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు.  కొంతకాలంపాటు గుంటూరులో పాములపాటి వెంకట కృష్ణయ్యచౌదరి నడిపే దేశాభిమాని పత్రికకు ఉపసంపాదకుడిగా పనిచేశారు. తెలుగు సినీ పరిశ్రమలో దిగ్దర్శకులు గూడవల్లి రామబ్రహ్మం ‘పల్నాటియుద్ధంసినిమా రచనకు సంబంధించి సలహాల కోసం శాస్త్రిగారిని మద్రాసుకు ఆహ్వానించారు. అలా 1945మార్చి 24 మద్రాసులో అడుగుపెట్టిన రామకృష్ణ శాస్త్రిగారు తర్వాతి కాలంలో తెలుగు చలన చిత్ర సీమకు సరికొత్త భాషాపరమైన సొబగుల్ని మాటలు, పాటల ద్వారా పరిచయం చేసి కొత్త ఒరవడికి నాంది పలికారు. మద్రాసులో ప్రముఖ రచయిత సముద్రాల రాఘవాచార్యకూ మల్లాది రామకృష్ణశాస్త్రికీ చక్కటి సాన్నిహిత్యం ఉండేది. రామకృష్ణ శాస్త్రి చాలాకాలంపాటు తెలుగు సినీ పరిశ్రమలో "ఘోస్ట్ రైటర్"గా ఉన్నారు. 1952కు ముందు సినిమాల్లో చాలా వాటిల్లో వీరి పేరు ఉండేదికాదని పలువురు సినీ ప్రముఖులు చెబుతారు. చిన్న కోడలు (1952) చిత్రంతో శాస్త్రిగారు అజ్ఞాతవాసాన్ని వీడి తెరమీదికొచ్చారు. తన సొంత పేరుతో 39 చిత్రాలలో 200కు పైగా పాటలను రాశారు. మద్రాసులోని పానగల్లుపార్కులో ఓ చెట్టుకింద ఉన్న రాతిబల్ల మీద కూర్చుని సాయంత్రం వేళ్లలో విద్వత్సభలను నడిపేవారు. ఈ సభల్లో అనేక శాస్త్రాలకు సంబంధించి, అనేక విషయాలకు సంబంధించి, అనేక రంగాలకు సంబంధించి, భాషకు, భావానికీ, అభివ్యక్తీకరణకీ సంబంధించి అనర్గళంగా మాట్లాడేవారు. ఆ సమావేశాలకు హాజరైనవారిలో, పానగల్లు పార్కుకు వచ్చి తనను కలిసిన వారిలో ఆకలితో ఉండేవారికి తన బ్యాగులో ఉన్న హోటల్ భోజనం టిక్కెట్ల కట్టలోంచి ఓ టిక్కట్టును చింపి ఇచ్చి వారి కడుపు నింపేవారు.  అలాంటి వాళ్లకి అన్నం పెట్టించడం కోసమే ఆయన తన చేతికి డబ్బు రాగానే పాండీ బజార్ లో ఉన్న హోటల్ కి వెళ్లి ప్రత్యేకంగా భోజనం టిక్కెట్ల పుస్తకాన్ని కొనుక్కొచ్చేవారని ఆయన్ని బాగా ఎరిగినవారు చెబుతారు. రామకృష్ణశాస్త్రిగారు దాదాపు వందకి పైగా భాషల్లో పండితులని ప్రతీతి. సినీ రచయిత, కవి ఆరుద్ర మద్రాసులో మల్లాది రామకృష్ణశాస్త్రిగారింటికి తరచూ వెళ్లి అనేక విషయాలు తెలుసుకోవడంలో ఆసక్తిని కనబరిచేవారు. ఓ రోజున ఆరుద్ర నేరుగా "గురువుగారూ మీకసలు ఎన్ని భాషలు తెలుసును?" అని అడిగారు. దానికి సమాధానంగా శాస్త్రిగారు జాబితా రాసుకోమని చెబితే, అప్పుడు ఆరుద్ర "అలా కాదు. మీకెన్ని భాషల్లో కవిత్వం చెప్పగల సాధికారత ఉందో, అన్ని భాషల్లోనూ ఈ విసనకర్ర ఆకులపై ఒక్కో ఆకుమీద ఒక్కో సంతకం చొప్పున ఆయా భాషల్లోనే చేసివ్వండి" అంటూ తాటాకు విసనకర్రను, ఇంకు పాళీ కలాన్ని ఆయన చేతికి ఇచ్చారు. అప్పుడు శాస్త్రిగారు ఒక్కో ఆకుమీద ఒక్కో భాషలో సంతకం చేస్తూ పోతే మొత్తంగా ఆ తాటాకు విసనకర్రకు రెండు వైపులా ఉన్న ఆకులన్నీ నిండిపోయాయి. ఇది స్వయంగా రామకృష్ణశాస్త్రిగారి పెద్ద కుమారుడు మల్లాది నరసింహశాస్త్రిగారు చెప్పిన విషయం.

 ఆయన కృష్ణా పత్రికలో ఛందోబద్ధమైన కవిత్వం రాశారు. ఈ పత్రికలోనే ‘చలువ మిరియాలు’ పేరుతో ఆయన రాసిన వ్యంగ్య వ్యాసాలకు అశేషమైన పాఠకాదరణ లభించింది. తన 19వ ఏటనే కథారచన ప్రారంభించి దాదాపు 125 కథలను రాశారు. వీరు రాసిన ‘డుమువులు’ కథ 14 భారతీయ భాషలలోకి అనువాదం అయింది. అహల్యా సంక్రందనం, హంసవింశతి గ్రంథాలకు అమూల్యమైన పీఠికలు వ్రాశారు.

సినీ సాహిత్య పరిమళాలు...

బాలరాజు (1948),చిన్న కోడలు (1952), (గీత రచయితగా తొలిచిత్రం)

·, కన్యాశుల్కం (1955)రేచుక్క (1955), చిరంజీవులు (1956), కార్తవరాయని కథ (1958), జయభేరి (1959), తల్లి బిడ్డ (1963), జ్ఞానేశ్వర్ (1963), దేశద్రోహులు (1964), రహస్యం (1967), వీరాంజనేయ (1968), అత్తగారు కొత్తకోడలు (1968) లాంటి చిత్రాల్లో పాటలు వింటే ఆయన ప్రతిభ ఏంటో తెలుస్తుంది.

ఇంకా... పల్నాటియుద్ధం, దొంగరాముడు, సువర్ణసుందరి, రాజనందిని లాంటి పెక్కు సినిమాలకు మాటలూ, పాటలూ వ్రాసి, తెలుగు సినిమా సాహిత్యానికి ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చారు.

ఒకో పాట ఒకో రసగుళిక...

తెలుగు వారికి చిరకాలం గుర్తుండే పాట అయిన 'కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్' (పాత దేవదాసు సినిమా లోనిది).  సముద్రాల వారు రాసినట్టు సినిమాలో ప్రకటించినప్పటికీ, ఆ పాట అసలు రచయిత శ్రీ రామకృష్ణ శాస్త్రి గారేనన్న విషయం సినీ పండితులందరికీ తెలుసు. తరువాత చాలా కాలానికి ఆ పాట అసలు, సిసలు రచయిత మల్లాది వారేనని అందరికీ తెలిసిపోయింది. ఆ పాటను గురించి అంతరార్ధాన్ని వేదాంత భాషలో ఎంత గొప్పగా చెప్పారో చూడండి. తెలుగు భాషలో 'కుడి' అంటే శరీరం అనే అర్ధం కూడా ఉంది. 'యోగం', 'ధ్యానం' అంటే పూర్తి అవగాహన ఉన్నవారికి, 'కుడి' యే ఒక గుడి. ఇక 'ఎడం' అంటే దూరం. శరీరం విడిపోయినంత మాత్రాన ఓడిపోయినట్లు కాదు. శరీరం పోయినా ప్రేమ మాత్రం ఎన్నటికీ ఓడదు. దేవదాసు తన్ను తాను ఓదార్చుకుంటూ పాడిన గొప్ప వేదనాభరితమైన గీతమది. పెళ్లి అనేది ప్రేమకు ముగింపు కాదు, కానేరదు! పార్వతిని పెళ్లి చేసుకోనంత మాత్రాన 'ప్రేమ యుద్ధం' లో తాను ఓడిపోలేదని, తన్ను తాను సముదాయించుకుంటాడు.  ఇలా ఈయన రాసిన ప్రతి పాటకూ ఇంత అర్ధం చెప్పవలసినదే! అంత గొప్పపాటలు అవి.

జయసింహ చిత్రంలో 'నడిరేయి గడిచేనే చెలియా' అనే పాట రాసారు. 'కన్యాశుల్కం' చిత్రానికి 'చిటారు కొమ్మన మిఠాయి పొట్లం', బికారి రాముడు చిత్రానికి 'వాడేనే చెలి వాడేనే', రంగేళి లీలల నా రాజా, టాక్సీరాముడు చిత్రం కోసం రావోయీ రావోయీ మనసైన రాజా - వంటి పాటలు రాసారు. ఏరు నవ్విందోయ్ ఊరు నవ్విందోయ్, భలే భలే పావురమా గడుసుపావురమా, నీ సరి నీవేనమ్మా, అల్లవాడే రేపల్లెవాడే, చికిలింత చిగురు సంపెంగి గుబురు, ఎందాక ఎందాక ఎందాక అందాక అందాక అందాక, ఏనాటికైనా నీదాననే, మనసు నీదే మమత నాదే, నాదానవే నే నీవాడనే, మిగిలింది నేనా బ్రతుకిందుకేనా, తెల్లవారవచ్చే తెలియక నా సామి మళ్ళీ పరుండేవు లేరా, కనుపాప కరువైన కనులెందుకు... వంటి ఎన్నెన్నో పాటలు మల్లాది రామకృష్ణ శాస్త్రి ప్రత్యేకతలను వివరిస్తాయి.
రచనల పరిమళం...
మల్లాది వారి తొలికథ ‘భారతి‘లో ప్రచురించినప్పుడు వారి వయస్సు పదిహేనేళ్లు. ఆయన సాహితీ విశ్వరూపం గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే 'కృష్ణాతీరం' చదవవలసినదే! అందులో వారి వ్యక్తిత్వపు ఛాయలు 'అప్పన్న' అనే ఒక వినయ శీలుడి పాత్రలో పూర్తిగా కనిపిస్తాయి. వారిలోని చతురత, విశాలభావాలు, అభ్యుదయ భావాలు, మానవీయ దృక్పథం, వీటినన్నిటినీ చూస్తే ' అప్పన్న' పాత్ర వారిదేనని అనిపిస్తుంది. 'తేజో మూర్తులు' అనే గ్రంధం కూడా విశేషమైన పేరు ప్రఖ్యాతులు పొందింది.  ఆయన పూర్తి చేయలేకుండా వెళ్ళిపోయిన మరొక్క గొప్ప గ్రంధం 'క్షేత్రయ్య'. షుమారుగా 200 లకు పైగా కథలు వ్రాసిన ఘనుడీయన. ఆయన కథలలో, సర్వమంగళ, ద్రౌపదీవస్త్రాపహరణం, ఆనందవల్లి, కూతఘనం, శిలువ లాంటి కథలన్నీ కృష్ణా తీరాన్నే నేపధ్యంగా తీసుకొని రాసినవే!

సోమవారం, జనవరి 19, 2026

కం సుందరి దేవి... త్యాగానికి విలువేది?






మనలో చాలామందికి ఆమె పేరు తెలియదు.
మన పాఠ్యపుస్తకాల్లో ఆమె కథ ఎప్పుడూ చెప్పలేదు.

కానీ దేశానికి అత్యంత అవసరమైన సమయంలో, ఆమె నిశ్శబ్దంగా చరిత్రను మార్చింది.

ఆమె పేరు మహారాణి కంసుందరి దేవి.
బిహార్‌లోని దర్భంగాకు చివరి మహారాణి.

1962 ఇండో–చైనా యుద్ధ సమయంలో, దేశం తీవ్రమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఎలాంటి హంగు లేకుండా, ఎలాంటి ప్రచారం కోరుకోకుండా, ఆమె భారతదేశానికి 600 కిలోల బంగారం, తన ప్రైవేట్ విమానం, ఇంకా విలువైన భూములను అర్పించింది.

అది ఏ పదవికోసం కాదు.
అది ఎలాంటి గుర్తింపుకోసం కాదు.

ఆమె చేసినది ఒక్కటే —
దేశం పట్ల తన కర్తవ్యం.

అప్పుడు ఆమెకి అధికార బలం లేదు.
మీడియా వెలుగులు లేవు.
సభలు, నినాదాలు లేవు.

కేవలం ఒక రాజకుటుంబానికి చెందిన మహిళగా కాకుండా,
ఒక నిజమైన భారతీయురాలిగా ఆమె తన బాధ్యతను నిర్వర్తించింది.

ఇలాంటి త్యాగాలు చేసిన దేశభక్తులను గుర్తించాల్సిన చరిత్ర,
వారి గురించి మౌనంగా ఉండిపోయింది.

కొన్ని కథలు మాత్రమే వెలుగులోకి వచ్చాయి.
మరికొన్ని కథలు —
ఈ మహారాణి కథలాగానే —
కాలగర్భంలో మాయమయ్యాయి.

2026 జనవరి 12న ఆమె శాంతంగా ఈ లోకాన్ని వీడింది.
కానీ ఆమె చేసిన సేవలు ఎప్పటికీ భారతదేశంతోనే ఉంటాయి.

(హిందూ ధర్మచక్రం)

శనివారం, జనవరి 17, 2026

నేటికీ మార్మోగే... వివేకానందుడి గళం



ప్రియమైన అమెరికా సోదరసోదరీమణులారా.!

        

1893 సెప్టెంబర్11 పవిత్రమైన రోజు!అద్భుతమైన రోజు.!! 

‘బానిస దేశం నుండి వచ్చిన ఈ సన్యాసి మనకేం చెబుతాడు? మనకేం సందేశం ఇస్తాడు..?’ అని ప్రపంచ మత పెద్దలు వెక్కిరించగా...


తన వాగ్ధాటితో నిండైన ఆత్మవిశ్వాసంతో ధృఢ సంకల్పంతో తన భారతదేశ సందేశాన్ని, తన భారతీయసంస్కృతిని హిందూ నగారాను తన కంచుకంఠంతో ఉర్రూతలూగించి ప్రపంచ మత పెద్దల ప్రశంసలందుకొన్న రోజు.!

ఆయనే.. ఆ మహనీయుడే..    'స్వామి వివేకానంద!’


1893 సెప్టెంబర్ 11న అమెరికాలోని చికాగో నగరంలో ప్రపంచ మత సభలో ఆయన మాటలు ఇప్పటికీ మన హృదయాంతరాళలో మారుమోగుతూనే ఉంటాయి. అదీ ఆయన ఘనత!!


“ప్రియమైన అమెరికా సోదరసోదరీమనులారా.!”

అని ఆయన పలికిన ఆ రెండు మాటలే ఆ ప్రాంగణాన్ని కరతాళద్వనులతో మారుమోగించింది.!


ఎందుకు..?

ఎందుకు..?ఎందుకు...?                                 

అప్పటి వరకు ప్రసంగించిన వారంతా Ladies & Gentle men..అని సభికులను సంభోదించారు.  

అంటే...

వారి మధ్య ఉన్న బంధం కేవలం స్త్రీ పురుష సంబంధం మాత్రమే!

కానీ మన మధ్యనున్నది 'సోదరీయ బంధం, ఆత్మీయ బంధం.' అని గుర్తు చేశాడు వివేకుడు.

అందుకే ఆ చప్పట్లు! 

అందుకే ఆ సంతోషం!! 

అందుకే ఆ వాణికి  అంత ఆదరణ!!!

ఆ మహాశయుని స్మరిస్తూ..

విశ్వమత మహాసభ, చికాగో, సెప్టెంబర్ 11వ తేది,  1893వ సంవత్సరం.

స్వామి వివేకానంద ప్ర‌సంగం...

“అమెరికన్ సోదర, సోదరీ మణులారా...

మాకు మీరిచ్చిన మనోపూర్వకమైన స్వాగతాన్ని పురస్కరించుకుని ఈ  సమయంలో మీతో మాట్లాడం నాకు చాలా ఆనందంగా ఉంది.

ప్రపంచంలోని అత్యంత ప్రాచీన యతి సంప్రదాయం తరఫున మీకు నా అభివాదాలు; సమస్త మతాలకు, సమస్త ధర్మాలకు తల్లి అనదగ్గ సనాతన ధర్మం పేర మీకు 

నా అభివాదాలు; నానా జాతులతో, నానా సంప్రదాయాలతో కూడిన భారత ప్రజల తరఫున మీకు నా అభివాదాలు.

సహన భావాన్ని వివిధ దేశస్థులకు తెలిపిన ఘనత, గౌరవం సుదూర దేశస్థులైన ప్రాచ్యులకు చెందటం ఎంతో సమంజసమని, అటువంటి ప్రతినిధుల గురించి ఈ సభావేదిక నుంచి మీకు తెలిపిన వక్తలకు కూడా నా అభివాదాలు. సహనాన్ని, సర్వమత సత్యత్వాన్ని, లోకానికి భోదించిన సనాతనధర్మం నాదని గర్విస్తున్నాను. సర్వమత సహనాన్నేకాక సర్వమతాలూ సత్యాలనే మేం విశ్వసిస్తాం.

సమస్త మతాలకు చెందిన, సమస్త దేశాలనుంచీ పరపీడితులై, శరణాగతులై వచ్చినవారికి శరణమిచ్చిన దేశం నా దేశమని గర్విస్తున్నాను. రోమన్ల నిరంకుశత్వానికి గురై తమ దేవాలయం తుత్తునియలైన ఏటనే దక్షిణ భారతదేశానికి వచ్చి, శరణుపొందిన యూదులను –నిజమైన యూదులనదగ్గవారిలో మిగిలినవారిని – మా కౌగిట చేర్చుకున్నామని తెలపటానికి గర్విస్తున్నాను. 

మహాజొరాస్టరీయ సంఘంలో మిగిలినవారికి శరణు ఇచ్చి –నేటికీ వారిని ఆదరిస్తున్న(సనాతన) ధర్మం నా ధర్మమని గర్విస్తున్నాను.

సోదరులారా, ప్రతిరోజూ కోట్లాది మంది పారాయణం చేస్తున్న, నేను కూడా అతిబాల్యంనుంచి పారాయణ చేస్తూన్న ఒక స్త్రోత్తం నుంచి కొన్ని చరణాలను ఉదహరిస్తాను: 

“వివిధ ప్రదేశాల్లో జన్మించిన నదులు సముద్రంలో కలసినట్లే, వివిధ భావాలచే మనుషులు అవలంభించే వివిధ ఆరాధనా మార్గాలు వేరువేరుగా కనపడినా,, నన్నే చేరుతున్నవి.”

ఎవరు ఏ రూపంలో నన్ను గ్రహిస్తారో, నేను వారినలాగే అనుగ్రహిస్తున్నాను. అందరూ సమస్త మార్గాల ద్వారా  చివరికి నన్నే చేరుతున్నారు”```

అని భగవద్గీత లో తెలిపిన అద్భుతసిద్ధాంతాన్ని ప్రపంచంలో ఇంతవరకు జరిగిన మహోత్కృష్ట సమావేశాల్లో ఒకటైన ఈ మతమహాసభే  సమర్థిస్తూ, ముక్తకంఠంతో  లోకానికి చాటుతుందని చెప్పవచ్చును. శాఖాభిమానం, స్వమత దురభిమానం, దానివల్ల కలిగిన మూర్ఖత్వం సుందరమైన యీ జగత్తును చిరకాలంగా అక్రమించాయి.

వాటివల్ల దౌర్జన్యాలు జరిగి అనేకసార్లు ఈ భూమి రక్తసిక్తమైంది.  ఈ ఘోర రాక్షసులు చెలరేగి ఉండకుంటే, మానవ సమాజం నేటికంటే విశేషాభివృద్ది చెంది ఉండేది.

కానీ ఆ దౌర్జన్య శక్తుల అంతకాలం  ఆసన్నమైంది.

ఈ మహాసభ గౌరవార్థం నేటి ఉదయం మోగించిన గంట 

కత్తితో కానివ్వండి, కలంతో కానివ్వండి, సాగించే సర్వవిధాలైన స్వమత దురభిమానానికీ, పరమత ద్వేషానికి ముగింపు వాక్యం కావాలి.

నానావిధాలైన హింసకు మాత్రమేకాక, కొందరిలోని నిష్టుర ద్వేషభావాలకు శాంతిపాఠం కాగలదని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను.”

అని గర్జించిన..

ఆ..మహానుభావుడికి శతకోటి వందనాలు సమర్పిస్తూ.