శనివారం, ఏప్రిల్ 20, 2024

స్మరించండి! తరించండి!!


అనగనగా అయిదేళ్ల పిల్లాడు. తల్లి దాసి. ఆమె యజమాని కొందరు సన్యాసులకు నాలుగు నెలలు ఆతిథ్యమిచ్చాడు. దాసిని వారి సేవలకు నియోగించాడు. ఆ పిల్లాడు ఆ వేదపండితులకు మంచి నీళ్లు అందించడం, దర్భాసనాలు వేయడం, మడి బట్టలు తేవడం లాంటి చిన్న చిన్న పనులు చేస్తుండేవాడు. భగవంతుడి గురించి ఆ సన్యాసులు చేసే చర్చలను చాలా శ్రద్ధగా వినేవాడు. వాళ్లు చేసే నిత్య ఆరాధనా విధానాలను ఆసక్తిగా గమనిస్తూ ఉండేవాడు. ఆ పిల్లాడి వినయం, నడవడిక ఆ సన్యాసులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కొన్నాళ్ల తర్వాత వాళ్లు వెళ్లిపోతూ, ఆ పిల్లాడిని దగ్గరకి పిలిచి భగవంతుడి తత్వం చెప్పి, ఒక మంత్రం ఇచ్చారు. అప్పటి నుంచి ఆ పిల్లాడు ఆ మంత్రాన్నే నిరంతరం స్మరిస్తూ ఉండేవాడు. పరమాత్మను చూడాలని తపించేవాడు. కొన్ని రోజులకు ఆ పిల్లాడి తల్లి, పాము కరచి చనిపోయింది. అనాధగా మిగిలిన ఆ పిల్లాడు ఎక్కడెక్కడో తిరిగాడు. దొరికింది తినేవాడు. ఎక్కడున్నా, ఎటు పోతున్నా, రాత్రింబవళ్లు ఆ మంత్రాన్ని వదల లేదు. ఆ మంత్రమే అతడి లోకమైపోయింది. ఓ నిర్జనమైన ప్రశాంత ప్రదేశంలో అతడికి ధ్యానం కుదిరింది.  కొన్నాళ్లకు మహా విష్ణువు దర్శనమిచ్చాడు. ఆ తర్వాత అతడు పరమ భక్తుడై భగవంతుడి గురించి ప్రచారం చేస్తూ, పాటలు పాడుతూ జీవితమంతా గడిపేశాడు. ఆ పుణ్యం ఫలితంగా ఆ తర్వాతి కల్పంలో అతడు బ్రహ్మ మానస పుత్రుడిగా జన్మించాడు. అతడే నారదుడు! తన పూర్వజన్మ గురించి వ్యాసుడికి స్వయంగా నారదుడే చెప్పాడు. దాసీ పుత్రుడిని, దేవర్షిగా మార్చిన ఆ మంత్రాన్ని వ్యాసుడు, భాగవతంలో అందించాడు.

ఆ మంత్రం తెలుసుకుందాం.

''నమో భగవతే తుభ్యం

వాసుదేవాయ ధీమహి

ప్రద్యుమ్నాయ అనిరుద్ధాయ

నమః సంకర్షణాయచ''

అద్భుతమైన ఈ మహా మంత్రాన్ని మనందరం స్మరిద్దాం. తరిద్దాం!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి