ముందు ఫొటో చూడండి...
వాళ్లిద్దరూ ఎవరు?
కన్నబిడ్డలు వదిలేసిన తల్లితండ్రులు కావచ్చు...
ప్రకృతి వైపరీత్యం వల్ల సర్వం కోల్పోయిన దంపతులు కావచ్చు...
సముద్రం మీద దారితప్పి ఎక్కడో ఒక దీవిలో చిక్కుకున్న ఇద్దరు వ్యక్తులు కావచ్చు...
లేదా అవార్డు గెలుచుకొన్న ఒక ఆర్ట్
సినిమాలో నటించిన నటులు కావచ్చు...
ఈ ఊహలేవీ నిజం
కాదు...
ఇద్దరూ భార్యాభర్తలే కానీ... సర్వం కోల్పోయిన వాళ్లు కాదు...
సర్వం వదులుకుని వచ్చినవాళ్లు!
సమాజం వద్దనుకున్న వాళ్లు కాదు...
సమాజాన్ని కౌగలించుకున్న వాళ్లు!
నిర్భాగ్యుల సేవ కోసం, నగర జీవితంలోని సౌకర్యాలన్నీ వదిలేసి నిరాడంబరంగా బతుకుతున్న వాళ్లు... కాదు కాదు... జీవిస్తున్నవాళ్లు!
ఏ నిరక్షరాస్యులో కాదు...
ఉన్నత విద్యా వంతులు! అసామాన్యులు!! మనలో మాన్యులు!!!
వీళ్ళిద్దరూ డాక్టర్లు. మామూలు డాక్టర్లు కాదు, ఆయన MBBS & MD, ఆమె MBBS.
వాళ్ల కథకి ఇదీ మొదలు...
అది1985. నాసిక్ మహరాష్ట్ర రైల్వే విభాగంలో పనిచేస్తున్న బావూరావ్ కోళే చాలా సంతోషంగావున్నారు. ఎందుకంటే ఆయన కొడుకు రవీంద్ర, MBBS పూర్తి చేసి ఇంటికొస్తున్నాడు. ఆయన వంశంలో మొదటి డాక్టరు కాబోతున్నాడు. కానీ ఆయనకు తెలియదు రవీంద్ర పూర్తిగా వేరే జీవితం ఎన్నుకొన్నాడని. MBBS చివరి రోజుల్లో ఒక వ్యాసం, ఒక పుస్తకం రవీంద్రను మార్చేసాయి. వ్యాసం వ్రాసింది మహాత్మా గాంధీ. అందులో ఆయన ఇలా అన్నారు "ఈ దేశపు పేద, దళిత కోటి ప్రజల హృదయాల నుండి స్రవించిన రక్తంతో పెరిగి, విద్యాబుద్ధులు గడించి వారి గురించి తలవనైనా తలవని ప్రతి వ్యక్తీ దేశద్రోహియే”. ఒక వివేకానంద, ఒక గాంధీ, ఒక వినోబా భావేల జీవితాలు, ఆదర్శాలు, ఆశయాలు రవీంద్రను విపరీతంగా ఆకర్షించాయి, ప్రేరణను ఇచ్చాయి. మనందరం పుస్తకాలు చదువుతాం. కానీ వాటిని మూసేయగానే మన బతుకులు మనవే. కానీ రవీంద్ర అలా అనుకోలేదు. అందుకనే ఇంటికొచ్చాక తల్లిదండ్రులతో స్థిరంగా చెప్పాడు...
"నేను మారుమూల పల్లెల్లోని పేదలకు వైద్య సేవలు అందిస్తాను’’.
అలా డాక్టర్ రవీంద్ర, మహరాష్ట్రలో అత్యంత వెనుకబడిప బైరాఘర్ గ్రామాన్ని ఎన్నుకొన్నాడు. అదే ఎందుకు ? దానికి కారణం MBBS సమయంలో ఆయన చదివిన ఒక పుస్తకం. దాని పేరు ‘Where There Is No Doctor’. రాసింది David Werner. ఆ పుస్తకం కవర్ పేజీ మీద ఒక రోగిని నలుగురు ఒక నులకమంచం మీద పెట్టుకొని తీసుకెళుతూవుంటారు. ఆ ఫోటో పక్కన చిన్నగా Hospital 30 kms away అని వ్రాసి వుంటుంది. ఆ దృశ్యం రవీంద్రను కదిలించింది. వైద్య సౌకర్యాలు లేని ఒక నిరుపేదల గ్రామానికివెళ్ళి వాళ్ళకు సహాయపడాలని ఆనాడే ఆయన అనుకొన్నాడు.
ఓ వాక్యమో, ఓ పుస్తకమో స్ఫూర్తి నివ్వవచ్చు. ఆ స్ఫూర్తి స్థిర సంకల్పమైతే, మొక్కవోని నిర్ణయానికి నాంది పలికితే... జీవితంలో మార్పు కలుగుతుంది. ఆ మార్పు ఎందరో జీవితాల్ని కూడా మారుస్తుంది.
రవీంద్ర కలిగిన మార్పు అలాంటిదే.
అందుకనే రవీంద్ర తన ప్రొఫెసర్ దగ్గరికెళ్ళి అలాంటి చోట ఎలా పనిచేయాలో చెప్పమన్నాడు. అపుడు ప్రొ. జూజు అనే ఆయన చెప్పాడు. ‘‘అలాంటి చోట పనిచేయాలంటే నీకు 3 విషయాలు బాగా తెలిసివుండాలి: 1. Sonography లేదా Blood Transfusion లేకుండానే గర్భిణి స్త్రీలకు ప్రసవం చేయ గలగడం, 2. X-ray లేకుండా న్యుమోనియాకు వైద్యం చేయడం, 3. డయేరియాకు వైద్యం చేయడం’’.
‘‘సరే’’ అన్నాడు రవీంద్ర. 6 నెలలు ముంబాయి లోవుండి వాటిని నేర్చుకొన్నాడు. తర్వాత బైరాఘర్ బయల్దేరాడు.
చేతిలో నాలుగు డబ్బులు... సంచిలో నాలుగు బట్టలు... కానీ గుండెల్నిండా మానవత్వం.
ఆ పల్లెకు బస్సులు లేవు. మహారాష్ట్రలో అమరావతి నుండి 40 కి.మీ. నడచివెళ్ళాలి. అలాగే వెళ్లాడు. చిన్న గుడిశె వేసుకొని రోగులకు వైద్యం చేయడం మొదలు పెట్టాడు. ఆ పల్లె పేదరికం, నిరక్షరాస్యత, వ్యాధులతో నిండివుంది. తాను ఒక్కడు. రోగులు అనేకులు. ఒక్కడే అంతమందిని సేవించడం కష్టమనిపించింది. తనకు ఒక తోడు వుంటే బాగుంటుందని భావించాడు. అందుకు ఓ దినపత్రికలో పెళ్ళి ప్రకటన ఇచ్చాడు.
బిక్షమెత్తడానికైనా సిద్ధమయ్యే భార్య కావాలి...
‘‘డాక్టరు అయిన యువతి కావాలి. షరతులు వర్తిస్తాయి. ఒకటి...40 కి.మీ. నడవగలగాలి. రెండు... రెండున్నర రూపాయలతో పెళ్ళికి ఒప్పుకోవాలి. (1989లో రిజిస్టరు పెళ్ళికి ఫీజు అది) మూడు... కేవలం 400 వందరూపాయలతో నెల పొడుగునా జీవనం చేయగలగాలి. (ఎందుకంటే డాక్టర్ రవీంద్ర నెలకు 400 మంది రోగులకు వైద్యం చేస్తాడు. ఒక రోగి నుండి కేవలం ఒక రూపాయి తీసుకొంటాడు) నాలుగు... అవసరమైతే ప్రజల కోసం భిక్షమెత్తడానికైనా సిద్ధంగా వుండాలి’’.
ఒకే ఒక యువతి సరేనంది. ఆమె పేరు డాక్టర్ స్మిత. ఇద్దరూ దంపతులయ్యారు. కలిసి వైద్యం మొదలు పెట్టారు.
ఆ కుగ్రామంలో నిరాడంబరమైన జీవనంలో,
నిరుపేదల సేవలో... వాళ్ల కొత్త కాపురం కొనసాగింది. డాక్టర్ స్మిత గర్భవతి అయినా
సేవలకు ఎలాంటి లోటు రానీయలేదు.
1991 లో డాక్టర్ స్మిత ప్రసవ సమయం ఆసన్నమైంది. ‘‘నేనే వైద్యం
చేస్తాను’’ అన్నాడు డాక్టర్ రవీంద్ర. ‘‘సరే...’’ అంది ఆ ఇల్లాలు. కానీ ఆమెకు
తీవ్రమైన సమస్యలు వచ్చాయి. ఆ పల్లె ప్రజలు కూడా ఆమెను నగరం తీసుకెళ్ళండి అని
చెప్పారు. ఆమెను అడిగితే ‘‘మీకు లేని సౌకర్యాలు నాకు మాత్రం ఎందుకు?’’
అంది డాక్టర్ స్మిత. ఆయనే వైద్యం చేసాడు. ప్రసవం జరిగింది. అబ్బాయి పుట్టాడు. ఆ
దంపతుల త్యాగం ఆ మట్టిమనుషుల మనసులను కదిలించింది. వాళ్ళకు ఆ యువ దంపతులు
ఆదిదంపతుల్లాగా కనిపించారు.
రోజులు గడుస్తున్నాయి. కేవలం వైద్యమే
కాకుండా ఆ కుగ్రామ వాసుల జీవితాలను మెరుగు పరచడానికి ఇంకా ఏదైనా చేయాలనుకున్నారు
వాళ్లు. ఆ గిరిజన గ్రామస్థులకు ఏడాదిలో నాలుగునెలలు మాత్రం పొలంపని ఉంటుంది. మిగిలిన సమయమంతా
పని వుండదు. కాబట్టి ఆహారం కొరత, డబ్బు కొరత, దాని కారణంగా రకరకాల వ్యాధులు. ఆ పల్లె వాళ్ళకు ఒంటి మీద సరిగా
గుడ్డలు కూడా వుండవు. అందుకే వాళ్ళకు న్యుమోనియా
లాంటి జబ్బులు సర్వసాధారణంగా వస్తుండేవి. దంపతులిద్దరూ అలోచించి, ఈ పరిస్థితి
మారాలంటే ‘వీళ్ళకు ఆర్థిక వనరులు ఏర్పడాలి. అంటే వీళ్ళకు అవసరమైన తిండి గింజలు
వీళ్ళే పండించుకోవాలి’ అనుకున్నారు. అందుకోసమని డాక్టర్ రవీంద్ర నగరంలోని ఒక
వ్యవసాయ సైంటిస్టు స్నేహితుడి సలహాలు తీసుకొని,
విత్తనాల మీద అధ్యయనం చేసి తానే స్వయంగా క్రిమి, కీటకాలను
ఎదుర్కొనగలిగే కొత్త, ఆరోగ్యవంతమైన విత్తనం రకాన్ని కనుక్కొన్నాడు. దాన్ని
సాగుచేద్దామంటే ప్రజలకు నమ్మకంలేదు. అందుకే తన కొడుకును 'నీవు నగరం లో పై చదువులు
వదులుకొని ఒక రైతు కాలేవా?” అని అడిగాడు. 'అలాగే నాన్నా, మీరు ఎలా అంటే అలా'
అన్నాడా సుపుత్రుడు రోహిత్. అపుడు ముగ్గురూ కలిసి తామే స్వయంగా
ఒకచోట భూమి దున్ని తాము తయారుచేసుకొన్న విత్తనాలను నాటి, చక్కటి పంట తీసి
పల్లె వాసులకు చూపించారు. అది వాళ్ళను విశేషంగా ఆకర్షించింది. అందరూ ఆ విత్తనాలను
వాడటం మొదలుపెట్టారు. ఎప్పటికప్పుడు వాతావరణంలో వచ్చే మార్పులను తెలుసుకొని, వాళ్ళను హెచ్చరిస్తూ
పంట నష్టం కాకుండా చేయసాగాడు డాక్టర్ రవీంద్ర. ఆ తరువాత పండిన పంటను ఒక చోట చేర్చి
ప్రజా పంపిణి వ్యవస్థ ద్వారా అందరి ఇళ్ళలో తిండి గింజలు నిలువ వుండేలాగా చేశారు.
ఇపుడు తిండికి లోటు లేదు.
రెండుపూటలా తిండి కారణంగా,
ఆడవాళ్ళకు ఆరోగ్యం మెరుగయ్యింది. గతంలో పుట్టిన 1000 మంది
పిల్లల్లో 200 మంది మరణిస్తుంటే ఇపుడు ఆ సంఖ్య 60 కి తగ్గింది. పల్లె లో వచ్చిన మార్పు వింటే
మనం ఆశ్ఛర్యపోతాం. నగరంలో IIT చదివి ఒక కార్పొరేట్ సంస్థలో ఉద్యోగం చేసే యువతీ యువకులు
ఏడాదికి సంపాదించే డబ్బుకు సమానంగా ఒక్కో రైతు సంపాదిస్తున్నాడు. 300 కుటుంబాలున్న ఆ
పల్లె ఇపుడు చుట్టుపక్కల పల్లెలను కూడా పోషించే స్థాయికి ఎదిగింది.
ఒకప్పుడు ప్రపంచంతో
సంబంధాల్లేకుండా ఉన్న ఆ పల్లె లో వస్తున్న కొత్త ప్రపంచవు వెలుగులు చూసాక
మహరాష్ట్ర ప్రభుత్వపు మంత్రి వచ్చాడు. ఆయన డాక్టర్ రవీంద్ర కుటుంబం చేస్తున్న పని చూసి చాలా సంతోషించి, 'మీరున్న ఈ చిన్న
గుడిశె మీకు తగిన స్థలం కాదు. నేను మీకు ఒక పెద్ద పక్కా ఇల్లు కట్టిస్తాను' అన్నాడు. అందుకు
వాళ్ళు 'మాకు ఇదే చాలు. మీరేదైనా చేయాలనుకుంటే గ్రామానికి రోడ్లు వేయించండి’ అన్నారు. ఇపుడు ఆ పల్లెకు చక్కటి రోడ్లున్నాయి, ఆ పల్లె ఆధారంగా
నడిచే 6 పాఠశాలున్నాయి, 12 వైద్యకేంద్రాలున్నాయి.
కానీ సర్జరీలు చేసే డాక్టరు కావాల్సివచ్చింది. అపుడు డాక్టర్ రవీంద్ర తన రెండవ
కొడుకు రామ్ ను సర్జన్ కమ్మని ప్రోత్సహించాడు. అతను అది పూర్తి చేసి ఇపుడు ఆ
ప్రాంతంలోనే వైద్యసేవలు అందిస్తున్నాడు.
ఒకటి కాదు...రెండు కాదు... దాదాపు మూడున్నర దశాబ్దాలుగా ఆ కుటుంబం తమ జీవితాలను ఆ గ్రామం కోసం అంకితం చేశారు.
వాళ్లకు భారత ప్రభుత్వం 2019లో పద్మశ్రీ
అవార్డులు ప్రకటించింది. ఈ అవార్డు... ఆ కుగ్రామంలో నివసించే నిరుపేదల గుండెల్లో
వారి పట్ల ఉండే ప్రేమ ముందు చిన్నదే.
కొందరు దేవుళ్ళకు గుడులు అవసరంలేదు, పేదల గుండెలే గర్భగుడులు. మన ఇళ్ళలో, పాఠశాలల్లో, కళాశాలల్లో ఇటువంటి మనుషుల గురించి పిల్లలకు చెప్పాలి. మామూలుగా కాదు, హృదయానికి హత్తుకొనేలాగ చెప్పాలి. అప్పుడే తరాలను నడిపించే వ్యక్తులు తరగతి గదుల్లో తయారౌతారు.



కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి