పంచభూత లింగాలలో అగ్నిలింగంగా భాసిల్లుతున్న అరుణాచల క్షేత్రం తమిళనాడులో తిరువణ్ణామలైలో ఉంది. అరుణ అంటే ఎర్రని, చలం అంటే కొండ అని అర్ధం. అరుణాచలం కొండ అగ్ని రూపంలో సాక్షాత్కరించిన శివ స్వరూపం. అందుకే అరుణాచలంలో గర్భాలయంలోని శివుని దర్శనం కన్నా అరుణాచలం కొండకు చేసే గిరి ప్రదక్షిణకే ప్రాధాన్యత ఎక్కువ. అరుణాచలంలో ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తుంటారు. పౌర్ణమి రోజుల్లో ఈ సంఖ్య రెట్టింపవుతుంది. అయితే అరుణాచలం గిరి ప్రదక్షిణ వలయంలో తప్పకుండా దర్శించ వలసిన 44 అతి శక్తి వంతమైన ఆలయాలు గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
స్మరణతోనే పుణ్యం
తమిళ భక్తులు అన్నామలై గా పిలుచుకునే అరుణాచలం క్షేత్రం పేరు స్మరించినంతనే సకల పాప దోషాలు తొలగిపోయి పుణ్యం లభిస్తుందని విశ్వాసం. ఈ అరుణాచల స్వామి తేజోలింగం, జ్యోతిర్లింగం. అందుకే ఈ క్షేత్రాన్ని అగ్ని క్షేత్రమని కూడా కొనియాడతారు. 14 కి. మీ. ఉన్న అరుణగిరి ప్రదక్షిణ చేయడమంటే సాక్షాత్తు ముక్కంటికి ప్రదక్షిణ చేసినట్లే అని పురాణాలు చెబుతున్నాయి. వేదాలు, ఉపనిషత్తులలో అరుణాచలం కొండ సాక్షాత్తు ఆ మహేశ్వరుడని సెలవిస్తోంది. ఇక ఈ గిరిప్రదక్షిణ చేసే మార్గంలో 44 చిన్న చిన్న ఆలయాలు దర్శించుకుని ప్రధాన ఆలయం దగ్గరకు చేరుకుంటే గిరిప్రదక్షిణ పూర్తైనట్టే! గిరి ప్రదక్షిణ మార్గంలో చూడవలసిన ఆలయాల వివరాలు ఇప్పుడు చూద్దాం.
బ్రహ్మలింగం:
అరుణాచలం గిరి ప్రదిక్షిణ ప్రారంభించాల్సిన ప్రదేశం ఇది. ఇక్కడ ముందుగా వినాయకునికి నమస్కరించుకుని గిరి ప్రదక్షిణ మొదలు పెట్టాలి.
ఇంద్ర లింగం:
ఇది ఇంద్రుడు ప్రతిష్టించిన శివలింగం. దీనికి శుక్రుడు, సూర్యుడు అధిదేవతలు. ఈ లింగాన్ని దర్శించుకుంటే వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి.
అగ్నిలింగం - అగ్ని తీర్థం :
అరుణగిరి చుట్టూ మొత్తం 8 శివలింగాలున్నాయి.. వాటిలో ఏడు రోడ్డుకి ఎడమవైపు ఉంటే అగ్నిలింగం మాత్రం కుడివైపుకు ఉంటుంది. దీనినే అగ్ని తీర్థం అని కూడా అంటారు. ఇక్కడ స్వామి వారిని దర్శించుకుంటే కష్టకాలంలో ప్రమాదాల నుంచి గట్టెక్కిస్తాడని నమ్మకం.
శేషాద్రి స్వామి :
శేషాద్రి స్వామి అరుణాచలంలో చిరకాలం నివసించి ముక్తిని పొందారు. ఈయన ఆశ్రమంలోని సమాధి దర్శనంతో సానుకూల శక్తులు పెరుగుతాయని విశ్వాసం.
దక్షిణా మూర్తి:
శివుని యొక్క జ్ఞాన స్వరూపం దక్షిణామూర్తి. అరుణగిరి ప్రదక్షిణ వలయంలో ఉన్న అతి పురాతనమైన, శక్తివంతమైన దక్షిణామూర్తి ఆలయం తప్పకుండా దర్శించాలి.
రమణాశ్రమం:
రమణమహర్షి ఆశ్రమంలో చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి.
మీనాక్షీ, సుందరేశ్వరుడు, గణేశ ఆలయాలు:
పార్వతీ పరమేశ్వరుల శక్తి ఇక్కడ భక్తుల విశ్వాసం.
ద్రౌపది ఆలయం:
గిరి ప్రదక్షిణ వలయంలో ఉన్న ద్రౌపది ఆలయం నుంచి గిరి దర్శనం అద్భుతంగా ఉంటుంది. జీవితంలో ఎదురుదెబ్బలు తిని విసిగిపోయిన వారికి ఈ ఆలయ దర్శనం మానసిక స్థైర్యాన్నిస్తుంది.
యమలింగం:
యముడు పూజించిన ఈ శివలింగాన్ని దర్శించుకుంటే అకాలమృత్యువు దరిచేరదు. మృత్యుభయం తొలగిపోతుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
పృథ్విలింగం:
అరుణాచలం గిరిచుట్టూ ఉన్న 8 శివలింగాల్లో ఇదొకటి.
గణపతి:
తొండం కుడివైపు తిరిగిఉండే ఈ గణపయ్యను దర్శించుకుంటే అదృష్టం వరిస్తుంది.
దూర్వాస ఆలయం:
ఇక్కడ దూర్వాసుడిని కుంతీ దేవి ప్రతిష్టించిందని చెబుతారు. ఇక్కడున్న వేప చెట్టుకి పసుపు దారాలు కడితే సంతాన భాగ్యం కలుగుతుందని, రాళ్లు పేరిస్తే ఇల్లు కట్టుకుంటారని భక్తుల విశ్వాసం.
కాట్టు శివాశ్రమం:
గిరి ప్రదక్షిణలో భాగంగా ఈ ఆశ్రమాన్ని రోడ్డుపై నుంచి దర్శనం చేసుకుని వెళ్ళిపోవచ్చు.
అప్పు నంది:
ఈ నంది దర్శనం కుటుంబ వివాదాలను సమసిపోయేలా చేసి బంధాలను వృద్ధి చేస్తుంది.
తేయునంది:
ఈ నంది నుంచి చూస్తే గిరి చతుర్ముఖ దర్శనం ఉంటుంది. బ్రహ్మదేవుడు జీవుల సృష్టికి కావాల్సిన జ్ఞానం ఇక్కడి నుంచి పొందారని చెబుతారు.
శోణ తీర్థం:
ఇక్కడ రెండు నందులుంటాయి. ఇక్కడున్న వినాయకుడిని జ్యోతి వినాయకుడు అంటారు. రమణ మహర్షి గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు సేదతీరిన ప్రదేశం ఇది.
నైరుతి లింగం:
గిరి ప్రదక్షిణలో ఉన్న అష్ట లింగాల్లో నాలుగోది ఇది. ఇక్కడ స్వామిని దర్శించుకుంటే రుణ, గ్రహ బాధలు తొలగిపోయి కీర్తి ప్రతిష్టలు వస్తాయి.
నంది ముఖ దర్శనం:
ఇక్కడి నుంచి అరుణ గిరివైపు చూస్తే నంది ముఖంలా కనిపిస్తుంది.
ఎదిర్ నేర్ అన్నామలై:
ఇది అరుణ గిరికి సరిగ్గా వెనుకవైపు ఉంటుంది. ఇక్కడి నుంచి గిరిని చూస్తే శివశక్తి దర్శనం అవుతుంది. అంటే శివుడు ఓ కొండగా, శక్తి మరో కొండగా కనిపిస్తారు.
ఆకాశ నంది:
పంచభూతాల్లో భాగంగా ఉండే నందుల్లో నాలుగోది ఆకాశనంది.
పళని ఆండవార్ ఆలయం:
కుమార స్వామి ఇక్కడ తపస్సుచేసి స్వయంభువుగా వెలిశాడని చెబుతారు. అందుకే ఈ ప్రదేశం అత్యంత శక్తివంతమైనది విశ్వాసం.
రాజ రాజేశ్వరి ఆలయం:
ఇది చిన్న ఆలయమే కానీ మహాశక్తివంతమైన ఆలయం. తప్పకుండా దర్శించుకోవాలి.
సింహ తీర్థం, సింహ నంది:
పంచభూత నందుల్లో ఇది ఐదోది. ఇక్కడున్న సింహ తీర్థంలో నీరు తాగితే ఎంతటి వ్యసనం అయినా మానేయగలుగుతారు.
కన్నప్ప గుడి:
అటవీశాఖ అధీనంలో ఉన్నందున ఈ గుడికి రోడ్డుపై నుంచి మాత్రమే నమస్కారం చేసుకోవాల్సి ఉంటుంది.
గౌతమ ఆశ్రమం:
గౌతమ మహర్షి తపస్సు చేసిన పుణ్య ప్రదేశం ఇది.
సూర్య లింగం:
అరుణగిరిపై నుంచి వెళ్లిన సూర్యుడు తేజస్సు కోల్పోయి ఇక్కడ తపస్సు చేసి మళ్లీ తేజస్సు పొందాడని చెబుతారు. ఇక్కడ ఆదిత్య హృదయం చదువుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్య అయినా పరిష్కారం అవుతుంది.
వరుణ లింగం:
ఈ వరుణ లింగానికి గ్రహదోషాలు తొలగించే శక్తి ఉంది.
మాణిక్య వాచకర్ ఆలయం:
మాణిక్యవాచకర్ గొప్ప శివభక్తుడు. ఈయన శివుని కీర్తిస్తుంటే పరమేశ్వరుడు ఆ శ్లోకాలను రచించి భద్రపరిచాడని చెబుతారు.
ఆది అన్నామలై:
బ్రహ్మదేవుడు ప్రతిష్టించిన ఈ శివలింగం అరుణాచలేశ్వరుడి కన్నా ముందు నుంచే ఉండేదంట!
వాయులింగం:
ఈ ఆలయంలో కొంతసేపు కూర్చుంటే బయట ఎండగా ఉన్నా లోపల చల్లగా ఉంటుంది.
వాయు నంది
: వాయునంది చాలా శక్తివంతమైనది.
భగవాన్ బ్రిడ్జ్:
రమణ మహర్షి సేదతీరిన ప్రదేశం ఇది.
చంద్ర లింగం:
చంద్రుడు ప్రతిష్టించిన శివలింగం ఇది. దీనిని దర్శించుకుంటే జీవితంలో ఉండే కష్టనష్టాలు, బాధలు తొలగిపోతాయని విశ్వాసం.
అధికార నంది:
శ్రీశైలంలో సాక్షి గణపతిలా అరుణాచలంలో అధికారి నంది ఉంటుంది. ఈ నంది చెవిలో గోత్రనామాలు చెప్పుకోవాలి.
అగస్త్య ఆశ్రమం:
ఇక్కడి నుంచి అరుణాచలం కొండను చూస్తే శివపార్వతులు ఇద్దరూ కలసి కనిపిస్తారు. ఇక్కడ దర్శనం చేసుకుంటే వివాహం, సంతాన దోషాలు తొలగిపోతాయి
కుబేర లింగం:
లక్ష్మీదేవి ఈ లింగాన్ని ఆరాధించి కుబేరుడికి అప్పగించింది. ఇక్కడ శివయ్యను దర్శించుకుంటే భోగభాగ్యాలు కలుగుతాయి.
ఇడుక్కు పిళ్లయార్:
చూడటానికి చాలా చిన్నగా కనిపించే ఇది ఆలయం కాదు. లోపల రెండు యంత్రాలు అమర్చారని, గిరిప్రదిక్షిణ వల్ల వచ్చిన అలసట ఈ ప్రదేశం మాయం చేసేస్తుందని నమ్మకం.
పంచముఖ దర్శనం:
ఇక్కడి నుంచి అరుణ గిరిని చూస్తే ఐదు ముఖాలుగా కనిపిస్తుంది. ఈ ప్రదేశం వృత్తి ఉద్యోగాల్లో ఉన్నతిని కలిగిస్తుంది.
ఊసి లింగం:
'ఊసి' అంటే తమిళంలో సూది అని అర్థం. ఇక్కడ శివలింగం సూది ఆకారంలో ఉంటుంది.
పచ్చయ్యమ్మ గుడి:
ఇక్కడ శ్యామలాదేవి పచ్చయ్యమ్మన్ స్వరూపంలో కొలువైంది.
ఈశాన్య లింగం - యజమాన నంది:
ఈశాన్య లింగం దర్శనంతో అష్టదిక్పాలకుల లింగాల దర్శనం పూర్తవుతుంది.
షణ్ముఖ ఆలయం:
ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామివారు ఆరుముఖాల్లో దర్శనమిస్తాడు.
దుర్గాలయం - ఖడ్గ తీర్థం:
ఇక్కడ అమ్మవారు మహిషాసురుడిని సంహరించాడని చెబుతారు.
ప్రవాళ పర్వతం:
అరుణ గిరిప్రదిక్షిణలో ఆఖరి ప్రదేశం ఇది. రమణ మహర్షి తన తల్లికి ఉపదేశం చేసిన ప్రదేశం ఇది.
అరుణాచలంలో నిత్యమూ అన్నివేళలా ఎంతమంది గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. గిరిపైన గల మహౌషధీ ప్రభావం వల్ల శరీరమునకు, శివనామ స్మరణవల్ల మనస్సుకు, శివానుగ్రహం వల్ల ఆధ్యాత్మిక జీవనానికి స్వస్థత చేకూరుతుందని విశ్వాసం. అయితే గిరి ప్రదక్షిణ హడావుడిగా ఏదో మొక్కుబడిగా కాకుండా మొత్తం 44 దర్శనీయ స్థలాలు దర్శిస్తూ ప్రదక్షిణ చేసినప్పుడు గిరి ప్రదక్షిణ ఫలం మరింతగా దక్కుతుంది. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః

కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి