శనివారం, ఫిబ్రవరి 08, 2025

ఎగిరిపోయిన మారీచుడు! నేలకొరిగిన సుబాహుడు!! (పిల్లల కోసం రాముడి కథ-11)


 

ఎగిరిపోయిన మారీచుడు! నేలకొరిగిన సుబాహుడు!! (పిల్లల కోసం రాముడి కథ-11)


అయోధ్య నుంచి విశ్వామిత్రుడితో కలిసి బయల్దేరిన రామలక్ష్మణులు, నాలుగో రోజు రాత్రికి సిద్ధాశ్రమం చేరి అక్కడ విశ్రమించారు. మర్నాడు తెల్లవారుతూనే వాళ్లు స్నాన సంధ్యాదికాలు ముగించి, సర్వసన్నద్ధులై మునులందరి మధ్య ఉన్న విశ్వామిత్రుడి దగ్గరకు వచ్చి  నమస్కరించారు.

''మునీశ్వరా! యాగ సంరక్షణకు మేం సిద్ధంగా ఉన్నాం. రాక్షసులు ఎప్పుడు వస్తారో తెలియజేయండి'' అని వినయంగా అడిగారు.

ఆ మాటలు విని అక్కడ ఉన్న మునులందరూ ఎంతో సంతోషించి, ''నాయనలారా! నేటి నుంచి విశ్వామిత్ర మహర్షి ఆరు రోజుల పాటు మౌన దీక్షలో ఉంటారు. యాగం జరిగే ఈ కాలమంతా మీరు అప్రమత్తులై ఉండి యాగ రక్షణ చేయండి'' అన్నారు.

అప్పటి నుంచి రామలక్ష్మణులు ఆ సమీపంలోనే తిరుగుతూ ధనుర్బాణాలు ధరించి సిద్ధంగా ఉన్నారు. అయిదు రోజుల పాటు యాగం నిరాటంకంగా జరిగింది. ఆరో రోజు వేద మంత్రాల మధ్య యాగం సాగుతుండగా, ఆకాశం నుంచి ఒక భీకరమైన శబ్దం వినిపించింది. వర్షాకాలంలో కమ్ముకొచ్చే మేఘాల మాదిరిగా రాక్షసులు వడివడిగా అక్కడికి వచ్చారు. భయంకరులైన మారీచుడు, సుబాహుడు అనుచరులతో కూడి రాక్షస మాయలు ప్రయోగిస్తూ, ఆ యాగ ప్రదేశమంతా రక్త వర్షం కురిపించసాగారు. అది చూసిన రాముడు వెంటనే ధనుస్సును ఎక్కుపెట్టి లక్ష్మణుడితో, ''లక్ష్మణా! దుర్మార్గులైన ఈ రాక్షసులపైకి మానవాస్త్రాన్ని సంధిస్తున్నాను చూడు! ఇది పెనుగాలి మేఘాలను తరిమినట్లు వీళ్లను చెల్లాచెదరు చేస్తుంది'' అంటూ వెలుగులు చిమ్ముతున్న ఆ బాణాన్ని మారీచుడి గుండెలకు గురి చూసి వదిలాడు. ఆ దెబ్బకు మారీచుడు స్పృహ కోల్పోయి గాలిలో గిరగిరా తిరుగుతూ నూరు యోజనాల దూరం ఎగిరిపోయి ఎక్కడో సముద్రంలో పడిపోయాడు. ఆ తర్వాత రాముడు ఆగ్నేయాస్త్రాన్ని సంధించి సుబాహువు పైకి వదిలాడు. దాని ధాటికి వాడు నేల కూలి మరణించాడు. అదే వేగంతో రాముడు వాయువ్యాస్త్రాన్ని ప్రయోగించి మిగిలిన రాక్షసులందరినీ కూడా తుద ముట్టించాడు.

యాగం పరిసమాప్తమయింది. మునులందరూ రామలక్ష్మణులను ఎంతగానో ప్రశంసించి పూజించారు.

విశ్వామిత్రుడు పరమానంద భరితుడై, ''రామా! నీ వల్ల యాగం నిర్విఘ్నంగా పూర్తయింది. నువ్వు నీ తండ్రికి ఇచ్చిన మాటను నిలబెట్టకున్నావు. ఈ సిద్ధాశ్రమం పేరు నిలబెట్టావు'' అంటూ మెచ్చుకున్నాడు.

ఆ రాత్రి ఆ ఆశ్రమంలో అందరూ నిశ్చింతగా నిద్రపోయారు. తెల్లవారుతూనే  రామలక్ష్మణులు శుచులై, విశ్వామిత్రుడి దగ్గరకు వచ్చి నమస్కరించి, ''మునీశ్వరా! మేము నీ సేవకులం. ఇంకా మేమేం చేయాలో ఆనతియ్యండి'' అని మృదు మధురంగా పలికారు.

విశ్వామిత్రుడితో సహా అక్కడి మునులందరూ కలసి, ''ఓ రామా! మిథిలా నగరానికి రాజయిన జనకుడు ఒక యాగాన్ని చేయబోతున్నాడు. మనమందరం అక్కడికి వెళ్దాం. మీరిద్దరూ కూడా రండి. అక్కడొక అద్భుతమైన ధనుస్సు ఉంది. సాటిలేని శక్తిగల ఆ ధనువు శత్రువులకు భయంకరమైనది. దాన్ని ఎక్కుపెట్టడానికి గంధర్వులు, అసురులు, రాక్షసులు, దేవతలు సైతం సరిపోరు. దాని శక్తిని తెలుసుకోడానికి  ఎందరో రాజులు, రాకుమారులు ప్రయత్నించి విఫలమయ్యారు.'' అంటూ వివరించారు.

ఆ ధనువే శివధనుస్సుగా పేరు పొందింది. పూర్వం శివుడి భార్య సతీదేవి, తన తండ్రి దక్షుడు తలపెట్టిన యజ్క్షానికి ఆహ్వానించకపోయినా వెళ్లి, అవమాన పడి ఆత్మాహుతి చేసుకున్నప్పుడు, ఈ ధనువునే ఉపయోగించి శివుడు ఆ యాగాన్ని ధ్వంసం చేశాడు. ఆ తర్వాత ఆయన దాన్ని దేవతలకు ఇచ్చివేశాడు. మిథిలా నగరానికి ఒకప్పటి రాజైన దేవరాతుడు ఒక యాగం చేసినప్పుడు దేవతలు ఈ ధనుస్సును  

ఆయనకు బహూకరించారు. అప్పటి నుంచి అది ఆ వంశీయులచే పూజలందుకుంటూ ఉంది.

విశ్వామిత్రుడు చెప్పిన మీదట రామలక్ష్మణులు వారందరితో కలిసి మిథిలకు బయల్దేరారు. యాగ సంరంభాలతో కూడిన వంద వాహనాలతో కలిసి వారంతా కదిలారు. విశ్వామిత్రుడు అక్కడి వనదేవతలకు నమస్కరించి వీడ్కోలు తీసుకుని నడవసాగాడు. ఆ ఆశ్రమంలోని జంతువులు, పక్షులు కూడా వారి వెంట సాగుతుండగా, కొంత దూరం తర్వాత విశ్వామిత్రుడు ప్రేమతో వాటిని వారించి వెనుకకు పంపేశాడు. ఆ రోజంతా ఉత్తర దిశగా ప్రయాణించి వాళ్లందరూ సూర్యుడు అస్తమించే వేళకి శోణ నదీ తీరానికి చేరుకున్నారు. ఆ నదిలో స్నానసంధ్యాదికాలు పూర్తి చేశాక విశ్వామిత్రుడితో రాముడు ''మహాత్మా! దట్టమైన వృక్షాలతో ఉన్న ఈ ప్రదేశం ఎవరిది?'' అంటూ కుతూహలంగా ప్రశ్నించాడు.  అందుకు విశ్వామిత్రుడు ఆ ప్రదేశానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన కథను చెప్పాడు.

ఆ కథేంటో వచ్చే భాగంలో తెలుసుకుందాం. జై శ్రీరామ్‌!

సోమవారం, నవంబర్ 11, 2024

రాముడికి దాసులైన దివ్యాస్త్రాలు! (పిల్లల కోసం రాముడి కథ-10)


తాటకను వధించిన రాముడుని దేవతలు, సిద్ధులు ఎంతగానో ప్రశంసించారు. రామలక్ష్మణులు, విశ్వామిత్రుడితో కలసి ఆ రాత్రికి తాటక వనంలోనే విశ్రమించారు. అయోధ్య నుండి బయల్దేరిన వారికిది మూడో రాత్రి. ఆ మర్నాడు ఉదయం విశ్వామిత్రుడు రాముడితో, ''నాయనా! నువ్వు తాటకను చంపినందుకు నాకెంతో ఆనందంగా ఉంది. నీకు దివ్యమైన అస్త్రాలను అందిస్తాను. వాటి వలన యుద్ధంలో నిన్ను ఎదిరించేవారు ఎవరైనా నీకు వశమవుతారు. దేవతలు, అసురులు, గంధర్వులు, నాగులు మొదలైన వారినైనా నువ్వు అవలీలగా జయించగలుగుతావు'' అన్నడు. ఆపై ఆయన తూర్పు ముఖంగా కూర్చుని ఆయా అస్త్రాలకు సంబంధించిన మంత్రాలను రాముడికి ఉపదేశించాడు. దండ చక్రము, కాల చక్రము, విష్ణు చక్రము, ఇంద్రాస్త్రము, శివునికి చెందిన మహా శూలము, బ్రహ్మాస్త్రము, వారుణాస్త్రము, నారాయణాస్త్రము, వాయువ్యాస్త్రము, మానవాస్త్రము లాంటి అనేక రకాల పేర్లు ఉన్న దివ్యాస్త్రాలను అందజేశాడు. కామరూప శక్తి గలవి, మహా బల సంపన్నమైనవి అయిన ఈ అస్త్రాలన్నింటినీ పొందడం దేవతలకు కూడా సైతం సాధ్యం కాదు. ఆ అస్త్రాలకు సంబంధించిన దేవతలందరూ వచ్చి, రాముడికి నమస్కరించి, ''ఓ రామా! ఇక నుంచి మేమంతా నీ సేవకులం. ఏ పని చెబితే అది చేస్తాం''అన్నారు. రాముడు ఆ అస్త్రాలన్నింటినీ చేతితో తాకి, ''నేను తలుచుకున్నప్పుడు రండి'' అంటూ వారిని పంపివేశాడు. తిరిగి వాళ్లు ముగ్గురూ తమ ప్రయాణం కొనసాగించారు. మార్గమధ్యంలో రాముడు  విశ్వామిత్రుడిని ప్రార్థించి, తను పొందిన దివ్యాస్త్రాలను ఉపసంహరించే విద్యలను కూడా అడిగి పొందాడు. తర్వాత విశ్వామిత్రుడి సూచనతో రాముడు, ఆయా అస్త్రాలకు సంబంధించిన మంత్రాలను లక్ష్మణుడికి కూడా బోధించాడు.

అలా వారు ముగ్గురూ కొంత దూరం ప్రయాణించాక ఓ కొండ పక్కగా ఒక అందమైన వనం చేరుకున్నారు. రాముడది చూసి, ''స్వామీ! ఈ వనం చూడ ముచ్చటగా ఉంది. ఇదొక ఆశ్రమమని కూడా తోస్తున్నది. దీని గురించి తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది'' అని అడిగాడు.
విశ్వామిత్రుడు ఆ కథంతా చెప్పాడు.
''రామా! మహా విష్ణువు, లోక కళ్యాణం కోసం చాలా కాలం ఇక్కడ తపస్సు చేశాడు. అదే సమయంలో ప్రహ్లాదుడి మనుమడు, విరోచనుడి కొడుకు అయిన బలి చక్రవర్తి, ఇంద్రాది దేవతలను జయించి ముల్లోకాలకు రాజయ్యాడు. పరాజయం పొందిన దేవతలందరూ కలిసి ఇక్కడ తపస్స చేసుకుంటున్న మహావిష్ణువుని ప్రార్థించి తమ గోడు చెప్పుకున్నారు. అప్పుడు మహా విష్ణువు, ఇదే ప్రాంతంలో తపస్సు చేసి సిద్ధి పొందిన కశ్యపుడనే మహర్షికి పుత్రుడిగా అవతరించాడు. అతడే వామనుడు. బలి చక్రవర్తి గొప్ప యాగాన్ని తలపెట్టి, అడిగిన వారికి అడిగినట్టు దానాలు చేస్తున్న సమయంలో వామనుడు అక్కడికి వెళ్లి మూడడుగుల భూమిని యాచించాడు. బలి ఇవ్వగానే వామనుడు, అంతకంతకు ఎదిగిపోయి, రెండడుగులతో భూమినీ ఆకాశాన్నీ కొలిచి మూడో అడుగును బలి చక్రవర్తి తలపై మోపి, అతడిని అధోలోకానికి అణగదొక్కాడు. ముల్లోకాలనూ తిరిగి ఇంద్రుడికి ఇచ్చేశాడు. వామనుడి పాద స్పర్శతో పవిత్రమైన ప్రదేశమిది. తపస్సులకు సిద్ధి కలిగించే ఈ ఆశ్రమం, సిద్ధాశ్రమంగా పేరు పొందింది. అందుకే నేను కూడా ఇక్కడికే వచ్చి ఉంటున్నాను'' అంటూ వివరించాడు.
ఈ కథను వింటూనే రామలక్ష్మణులిద్దరూ  విశ్వామిత్రుడితో పాటు సిద్ధాశ్రమంలోకి ప్రవేశించారు. వారిని చూడగానే అక్కడి మునులందరూ ఆనందంతో సంబర పడుతూ స్వాగతం పలికారు. రామలక్ష్మణులు కొంత సేపు ప్రయాణపు బడలిక తీర్చుకున్నాక, విశ్వామిత్రుడి దగ్గరకు వచ్చి వినయంగా నమస్కరించి, ''మహాత్మా! ఇక మీరు నిశ్చింతగా యాగాన్ని ప్రారంభించడండి. రాక్షసుల బెడద లేకుండా మేము రక్షిస్తాం'' అన్నారు. విశ్వామిత్రుడు ఎంతో ఆనందించి అందుకు తగిన ఏర్పాట్లు చేశాడు. ఆ రాత్రి రామలక్ష్మణులిద్దరూ అక్కడే విశ్రమించారు.  మరునాటి నుంచి రామలక్ష్మణులు ఏ విధంగా యాగ సంరక్షణ చేశారో వచ్చే భాగంలో తెలుసుకుందాం. జై శ్రీరామ్‌!

ఆదివారం, అక్టోబర్ 13, 2024

కుదరని సినిమాతో... మొదలైన ‘ముత్యాల ముగ్గు’!


ఓసారి ముళ్లపూడి  వెంకట రమణకి ఓ మంచి ఆలోచన వచ్చింది.  త్యాగయ్య జీవితాన్నీ,  రాముడి కథనూ  సమాంతరంగా చూపిస్తూ ఓ సినిమా చేయాలని! అందులో రాముడిగా ఎన్టీఆర్‌, త్యాగయ్యగా ఏఎన్నార్‌ అయితే బాగుంటుందని కూడా అనుకున్నారు.  'త్యాగరాజ రామాయణం' అని పేరు కూడా ఊహించారు.  అనుకుంటే సరిపోతుందా? లెక్కలు వేసుకోవాలి కదా! అలా బడ్జెట్‌ ఎంతవుతుందో చూస్తే అదొక భారీ సినిమా అవుతుందని తేలింది. నిర్మాతల కోసం అన్వేషణ మొదలైంది. ఎమ్వీఎల్ గా ప్రసిద్ధుడైన రచయిత, నిర్మాత మద్దాలి వెంకట లక్ష్మీ నరసింహ రావు అప్పట్లో నూజివీడు కాలేజీలో పనిచేస్తుండేవారు. ఆయన అక్కడి జమీందారీ వంశానికి చెందిన యువకుల్ని ఈ సినిమా నిర్మాణానికి ఒప్పించారు. అన్నీ కుదురుతున్నాయనుకునే సమయానికి 1974లో  ఏయన్నార్ గుండె జబ్బు చికిత్స కోసం  అమెరికా వెళ్ళాల్సి వచ్చింది. దాంతో ప్రాజెక్ట్ ఆగింది.  ఆయన తిరిగి వచ్చే లోగా తక్కువ బడ్జెట్ తో చిత్రాన్ని నిర్మించాలని నిర్మాతలు ముళ్ళపూడిని కోరారు. అప్పుడు ఆయన వాళ్లకి చెప్పిన కథే 'ముత్యాల ముగ్గు'. 'ముత్యాల ముగ్గు' మరపురాని సినిమాగా మిగిలిపోయినా, ముళ్లపూడి ఊహించిన త్యాగరాజ రామాయణం మాత్రం మరుగున పడిపోయింది.