మంగళవారం, జనవరి 20, 2026

అమ్మాయిని పొగడడంలో... అగ్రతాంబూలం!



 



అబ్బాయి ప్రేమలో పడితే, అమ్మాయిలో అన్నీ అందాలే కనిపిస్తాయి. ఆ అందాన్ని పోల్చడానికి ఎన్నో ఉపమానాలు వెతుక్కుంటాడు. ఆమె ముఖంలో చందమామను చూస్తాడు. నవ్వులో వెన్నెలను గమనిస్తాడు. ఆమె నడకను హంసలతో, ఏనుగులతో పోలుస్తాడు. ఇక ఆ అబ్బాయి సినిమా హీరో అయితే, ఆ అమ్మాయి హీరోయిన్ అయితే ప్రేమ గీతాలు వెలువడుతాయి. తొలి సినిమా నుంచి తాజా సినిమా వరకు దేన్ని తీసుకున్నా, అమ్మాయిని పొగడని ప్రేమ గీతాలు ఉంటాయా? ఒకో పాటది ఒకో ఒరవడి. సినిమా తీరును బట్టి, నిర్మాత అభిరుచిని బట్టి, గీత రచయిత సత్తాను బట్టి మాటలు మారవచ్చు... పోలికలు మారవచ్చు... భాష మారవచ్చు... భావం మారవచ్చు... కానీ పొగడ్తలు మాత్రం మారవు. ఇలాంటి పాటలన్నీ ప్రేక్షకులను ఆకట్టుకున్నవే.

మరి ఇలాంటి పొగడ్తల్లో అత్యుత్తమమైనవేవి?

అలా వెతుకుదామనుకున్నా... పుంఖాను ఫుంఖాను పాటలు గుర్తుకొస్తాయి.  ఫలానాదే గొప్పదని చెప్పలేం కూడా.

అయితే ఒక్కసారి ఈ పొగడ్తలను చూడండి...

‘‘వెన్నెలలో... చల్లని గాలిలో... వీచే మల్లెల పరిమళానికి నువ్వు’’ అంటే ఏ అమ్మాయి పొంగిపోదు?

‘‘ఆకాశంలో తారలన్నీ అమ్మాయిలైతే, వాళ్లంతా చక్కిలిగింతలు పెట్టుకుంటూ సంబర పడుతుంటే... ఆ పరవశం నేనైతే, ఆ పరిమళం నువ్వు’’ అంటే అమ్మాయి ఎంత ఆనందపడిపోతుంది?

‘‘కోయిల పాటలో మాధుర్యమే నువ్వు...‘‘

‘‘చందమామతో కలువలు కులికే సరసమే నువ్వు...‘‘

‘‘అసలు అమ్మాయిలందరూ తమకు ఉండాలని కోరుకునే అందాలన్నీ నీవే... నిన్ను అందుకునే ఆనందమంతా నేను...’’

అబ్బో...ఇలాంటి అపురూపమైన పొగడ్తలన్నీ కలిసి ఒకే పాటలో ఉంటే?అదొక మంచి పాట అవుతుంది కదా?

ఈ పాటికి ఆ పాట గుర్తుకొస్తే... సరే!

లేకపోతే దాని గురించి చెప్పుకుందాం. అంత మంచి పాట రాసిన ఆ గీత రచయితని తల్చుకుందాం. ఎందుకంటే... ఆ పాట, ఆ రచయిత భాష రెండూ గొఫ్పవే మరి.

ముందు ఆ పాటను చదవండి మరి...

పల్లవి :
రాగమయీ రావే అనురాగమయీ రావే
రాగమయీ రావే అనురాగమయీ రావే
రాగమయీ రావే...
అనుపల్లవి :
నీలాల గగనాన నిండిన వెన్నెల
నీలాల గగనాన నిండిన వెన్నెల
నీ చిరునవ్వుల కలకలలాడగ
రాగమయీ రావే అనురాగమయీ రావే
రాగమయీ రావే...

చరణం : 1
చివురులు మేసిన చిన్నారి కోయిల
మరిమరి మురిసే మాధురి నీవే
చివురులు మేసిన చిన్నారి కోయిల
మరిమరి మురిసే మాధురి నీవే
తనువై మనసై నెలరాయనితో
కలువలు కులికే సరసాలు నీవే
సరసాలు నీవే సరాగాలు నేనే
రాగమయీ రావే అనురాగమయీ రావే
రాగమయీ రావే...

చరణం : 2
సంజెలలో సంజెలలో హాయిగ సాగే చల్లనిగాలిలో
మరుమల్లెల విరజాజుల పరిమళమే నీవు
జిలుగే సింగారమైన చుక్క కన్నెలు అంబరాన
జిలుగే సింగారమైన చుక్క కన్నెలు అంబరాన
సంబరపడు చక్కిలిగింతల పరవశమే నేను
నవ పరిమళమే నీవు
రావే రాగమయీ నా అనురాగమయీ
రావే రాగమయీ నా అనురాగమయీ

చరణం : 3
నీడజూసి నీవనుకొని పులకరింతునే
అలవికాని మమతలతో కలువరింతునే
నీ కోసమే ఆవేదన నీ రూపమే ఆలాపన
కన్నెలందరూ కలలు కనే అందాలన్నీ నీవే
నిన్నందుకొనీ మైమరచే ఆనందమంతా నేనే
రావే రాగమయీ నా అనురాగమయీ
రావే రాగమయీ నా అనురాగమయీ

బాగుంది కదా పాట. ‘జయభేరి’ సినిమాలోది. పి. పుల్లయ్య దర్శకత్వంలో 1959లో వచ్చింది.  రాసింది ‘‘వచన రచనకు మేస్త్రీ అని పేరు పొందిన మల్లాది రామకృష్ణ శాస్త్రి’’. సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు.

ఈ పాటలో తెర మీద హీరో అక్కినేని నాగేశ్వరరావు, హీరోయిన్ అంజలీదేవి కనిపిస్తారు. పాత్రల పరంగా అతడు కాశీనాథ్. పండిత కుటుంబానికి చెందిన వాడు. గాయకుడు, స్వరకర్త. ఆమె మంజుల. నిమ్న కులానికి చెందిన నాట్య కళాకారిణి. 17వ శతాబ్దానికి చెందిన కథలో ఈ ఇద్దరి కళాకారుల ప్రేమ అప్పట్లో సామాజికంగా ఎలాంటి సంచలనం కలిగించిందో, కళనే నమ్ముకున్న ఆ ఇద్దరూ ఎలాంటి అవమానాలు ఎదుర్కొన్నారో, ఎలా అత్యున్నతంగా ఎదిగారో అనేదే కథ. శారదా పిక్చర్స్ ద్వారా వచ్చిన ఈ సినిమా అప్పట్లో గొప్ప  కళాత్మక సినిమాగా పేరు తెచ్చుకుంది. వ్యాపారాత్మకంగా కూడా లాభాలు అందుకుంది. అంతేకాదు ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డు కూడా పొందింది. నటీనటుల అభినయం గురించి కానీ, దర్శకత్వం గురించి కానీ, సంభాషణలు గురించి కానీ, నేపథ్య గాయకులు ఘంటసాల, సుశీల తదితరుల గాన మాధుర్యం గురించి కానీ చెప్పడం కష్టం. చూడడమే నయం. స్వయంగా అనుభూతి చెందడమే అత్యుత్తమం.

 

సుమధుర రచనల మేస్త్రి...

మల్లాది రామకృష్ణ శాస్త్రి ప్రతిభ అనేక రంగాల్లో ప్రస్ఫుటం. వేదవిద్య, మహాభాష్యం, బ్రహ్మసూత్రాలను అభ్యసించిన ఆయనకు... నాట్యకళ, చిత్రలేఖనం, సంగీతంలో కూడా  ప్రవేశం ఉంది. అలంకార, వ్యాకరణ తర్క శాస్త్రాలను పూర్తిగా అధ్యయనం చేసారు. అంతే కాదు ఖగోళ, జ్యోతిష్య శాస్త్రాలు కూడా వీరికి తెలుసు. చిన్నతనం నుంచే రచనలో రాణించారు. అవన్నీ పలు పత్రికల్లో అచ్చయ్యాయి. ఇక నాటకాలు, నవలలు చిరకీర్తిని ఆర్జించి పెట్టాయి. ‘కృష్ణాతీరం’ నవల అచ్చ తెలుగు నుడికారానికి పట్టం కట్టిన రచనగా తెలుగు సాహిత్య చరిత్రలో గొప్ప పేరు పొందింది.

 కృష్ణా జిల్లాలో చిట్టి గూడూరు అనే కుగ్రామంలో 1905లో పుట్టిన ఆయన, మచిలీపట్నంలో బియ్యే చదివాక, మద్రాసు వెళ్లి సంస్కృతాంధ్రాలలో ఎమ్మే పట్టా అందుకున్నారు. పదిహేనేళ్లకే పెళ్లి. నలుగురు సంతానం. ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు.  కొంతకాలంపాటు గుంటూరులో పాములపాటి వెంకట కృష్ణయ్యచౌదరి నడిపే దేశాభిమాని పత్రికకు ఉపసంపాదకుడిగా పనిచేశారు. తెలుగు సినీ పరిశ్రమలో దిగ్దర్శకులు గూడవల్లి రామబ్రహ్మం ‘పల్నాటియుద్ధంసినిమా రచనకు సంబంధించి సలహాల కోసం శాస్త్రిగారిని మద్రాసుకు ఆహ్వానించారు. అలా 1945మార్చి 24 మద్రాసులో అడుగుపెట్టిన రామకృష్ణ శాస్త్రిగారు తర్వాతి కాలంలో తెలుగు చలన చిత్ర సీమకు సరికొత్త భాషాపరమైన సొబగుల్ని మాటలు, పాటల ద్వారా పరిచయం చేసి కొత్త ఒరవడికి నాంది పలికారు. మద్రాసులో ప్రముఖ రచయిత సముద్రాల రాఘవాచార్యకూ మల్లాది రామకృష్ణశాస్త్రికీ చక్కటి సాన్నిహిత్యం ఉండేది. రామకృష్ణ శాస్త్రి చాలాకాలంపాటు తెలుగు సినీ పరిశ్రమలో "ఘోస్ట్ రైటర్"గా ఉన్నారు. 1952కు ముందు సినిమాల్లో చాలా వాటిల్లో వీరి పేరు ఉండేదికాదని పలువురు సినీ ప్రముఖులు చెబుతారు. చిన్న కోడలు (1952) చిత్రంతో శాస్త్రిగారు అజ్ఞాతవాసాన్ని వీడి తెరమీదికొచ్చారు. తన సొంత పేరుతో 39 చిత్రాలలో 200కు పైగా పాటలను రాశారు. మద్రాసులోని పానగల్లుపార్కులో ఓ చెట్టుకింద ఉన్న రాతిబల్ల మీద కూర్చుని సాయంత్రం వేళ్లలో విద్వత్సభలను నడిపేవారు. ఈ సభల్లో అనేక శాస్త్రాలకు సంబంధించి, అనేక విషయాలకు సంబంధించి, అనేక రంగాలకు సంబంధించి, భాషకు, భావానికీ, అభివ్యక్తీకరణకీ సంబంధించి అనర్గళంగా మాట్లాడేవారు. ఆ సమావేశాలకు హాజరైనవారిలో, పానగల్లు పార్కుకు వచ్చి తనను కలిసిన వారిలో ఆకలితో ఉండేవారికి తన బ్యాగులో ఉన్న హోటల్ భోజనం టిక్కెట్ల కట్టలోంచి ఓ టిక్కట్టును చింపి ఇచ్చి వారి కడుపు నింపేవారు.  అలాంటి వాళ్లకి అన్నం పెట్టించడం కోసమే ఆయన తన చేతికి డబ్బు రాగానే పాండీ బజార్ లో ఉన్న హోటల్ కి వెళ్లి ప్రత్యేకంగా భోజనం టిక్కెట్ల పుస్తకాన్ని కొనుక్కొచ్చేవారని ఆయన్ని బాగా ఎరిగినవారు చెబుతారు. రామకృష్ణశాస్త్రిగారు దాదాపు వందకి పైగా భాషల్లో పండితులని ప్రతీతి. సినీ రచయిత, కవి ఆరుద్ర మద్రాసులో మల్లాది రామకృష్ణశాస్త్రిగారింటికి తరచూ వెళ్లి అనేక విషయాలు తెలుసుకోవడంలో ఆసక్తిని కనబరిచేవారు. ఓ రోజున ఆరుద్ర నేరుగా "గురువుగారూ మీకసలు ఎన్ని భాషలు తెలుసును?" అని అడిగారు. దానికి సమాధానంగా శాస్త్రిగారు జాబితా రాసుకోమని చెబితే, అప్పుడు ఆరుద్ర "అలా కాదు. మీకెన్ని భాషల్లో కవిత్వం చెప్పగల సాధికారత ఉందో, అన్ని భాషల్లోనూ ఈ విసనకర్ర ఆకులపై ఒక్కో ఆకుమీద ఒక్కో సంతకం చొప్పున ఆయా భాషల్లోనే చేసివ్వండి" అంటూ తాటాకు విసనకర్రను, ఇంకు పాళీ కలాన్ని ఆయన చేతికి ఇచ్చారు. అప్పుడు శాస్త్రిగారు ఒక్కో ఆకుమీద ఒక్కో భాషలో సంతకం చేస్తూ పోతే మొత్తంగా ఆ తాటాకు విసనకర్రకు రెండు వైపులా ఉన్న ఆకులన్నీ నిండిపోయాయి. ఇది స్వయంగా రామకృష్ణశాస్త్రిగారి పెద్ద కుమారుడు మల్లాది నరసింహశాస్త్రిగారు చెప్పిన విషయం.

 ఆయన కృష్ణా పత్రికలో ఛందోబద్ధమైన కవిత్వం రాశారు. ఈ పత్రికలోనే ‘చలువ మిరియాలు’ పేరుతో ఆయన రాసిన వ్యంగ్య వ్యాసాలకు అశేషమైన పాఠకాదరణ లభించింది. తన 19వ ఏటనే కథారచన ప్రారంభించి దాదాపు 125 కథలను రాశారు. వీరు రాసిన ‘డుమువులు’ కథ 14 భారతీయ భాషలలోకి అనువాదం అయింది. అహల్యా సంక్రందనం, హంసవింశతి గ్రంథాలకు అమూల్యమైన పీఠికలు వ్రాశారు.

సినీ సాహిత్య పరిమళాలు...

బాలరాజు (1948),చిన్న కోడలు (1952), (గీత రచయితగా తొలిచిత్రం)

·, కన్యాశుల్కం (1955)రేచుక్క (1955), చిరంజీవులు (1956), కార్తవరాయని కథ (1958), జయభేరి (1959), తల్లి బిడ్డ (1963), జ్ఞానేశ్వర్ (1963), దేశద్రోహులు (1964), రహస్యం (1967), వీరాంజనేయ (1968), అత్తగారు కొత్తకోడలు (1968) లాంటి చిత్రాల్లో పాటలు వింటే ఆయన ప్రతిభ ఏంటో తెలుస్తుంది.

ఇంకా... పల్నాటియుద్ధం, దొంగరాముడు, సువర్ణసుందరి, రాజనందిని లాంటి పెక్కు సినిమాలకు మాటలూ, పాటలూ వ్రాసి, తెలుగు సినిమా సాహిత్యానికి ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చారు.

ఒకో పాట ఒకో రసగుళిక...

తెలుగు వారికి చిరకాలం గుర్తుండే పాట అయిన 'కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్' (పాత దేవదాసు సినిమా లోనిది).  సముద్రాల వారు రాసినట్టు సినిమాలో ప్రకటించినప్పటికీ, ఆ పాట అసలు రచయిత శ్రీ రామకృష్ణ శాస్త్రి గారేనన్న విషయం సినీ పండితులందరికీ తెలుసు. తరువాత చాలా కాలానికి ఆ పాట అసలు, సిసలు రచయిత మల్లాది వారేనని అందరికీ తెలిసిపోయింది. ఆ పాటను గురించి అంతరార్ధాన్ని వేదాంత భాషలో ఎంత గొప్పగా చెప్పారో చూడండి. తెలుగు భాషలో 'కుడి' అంటే శరీరం అనే అర్ధం కూడా ఉంది. 'యోగం', 'ధ్యానం' అంటే పూర్తి అవగాహన ఉన్నవారికి, 'కుడి' యే ఒక గుడి. ఇక 'ఎడం' అంటే దూరం. శరీరం విడిపోయినంత మాత్రాన ఓడిపోయినట్లు కాదు. శరీరం పోయినా ప్రేమ మాత్రం ఎన్నటికీ ఓడదు. దేవదాసు తన్ను తాను ఓదార్చుకుంటూ పాడిన గొప్ప వేదనాభరితమైన గీతమది. పెళ్లి అనేది ప్రేమకు ముగింపు కాదు, కానేరదు! పార్వతిని పెళ్లి చేసుకోనంత మాత్రాన 'ప్రేమ యుద్ధం' లో తాను ఓడిపోలేదని, తన్ను తాను సముదాయించుకుంటాడు.  ఇలా ఈయన రాసిన ప్రతి పాటకూ ఇంత అర్ధం చెప్పవలసినదే! అంత గొప్పపాటలు అవి.

జయసింహ చిత్రంలో 'నడిరేయి గడిచేనే చెలియా' అనే పాట రాసారు. 'కన్యాశుల్కం' చిత్రానికి 'చిటారు కొమ్మన మిఠాయి పొట్లం', బికారి రాముడు చిత్రానికి 'వాడేనే చెలి వాడేనే', రంగేళి లీలల నా రాజా, టాక్సీరాముడు చిత్రం కోసం రావోయీ రావోయీ మనసైన రాజా - వంటి పాటలు రాసారు. ఏరు నవ్విందోయ్ ఊరు నవ్విందోయ్, భలే భలే పావురమా గడుసుపావురమా, నీ సరి నీవేనమ్మా, అల్లవాడే రేపల్లెవాడే, చికిలింత చిగురు సంపెంగి గుబురు, ఎందాక ఎందాక ఎందాక అందాక అందాక అందాక, ఏనాటికైనా నీదాననే, మనసు నీదే మమత నాదే, నాదానవే నే నీవాడనే, మిగిలింది నేనా బ్రతుకిందుకేనా, తెల్లవారవచ్చే తెలియక నా సామి మళ్ళీ పరుండేవు లేరా, కనుపాప కరువైన కనులెందుకు... వంటి ఎన్నెన్నో పాటలు మల్లాది రామకృష్ణ శాస్త్రి ప్రత్యేకతలను వివరిస్తాయి.
రచనల పరిమళం...
మల్లాది వారి తొలికథ ‘భారతి‘లో ప్రచురించినప్పుడు వారి వయస్సు పదిహేనేళ్లు. ఆయన సాహితీ విశ్వరూపం గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే 'కృష్ణాతీరం' చదవవలసినదే! అందులో వారి వ్యక్తిత్వపు ఛాయలు 'అప్పన్న' అనే ఒక వినయ శీలుడి పాత్రలో పూర్తిగా కనిపిస్తాయి. వారిలోని చతురత, విశాలభావాలు, అభ్యుదయ భావాలు, మానవీయ దృక్పథం, వీటినన్నిటినీ చూస్తే ' అప్పన్న' పాత్ర వారిదేనని అనిపిస్తుంది. 'తేజో మూర్తులు' అనే గ్రంధం కూడా విశేషమైన పేరు ప్రఖ్యాతులు పొందింది.  ఆయన పూర్తి చేయలేకుండా వెళ్ళిపోయిన మరొక్క గొప్ప గ్రంధం 'క్షేత్రయ్య'. షుమారుగా 200 లకు పైగా కథలు వ్రాసిన ఘనుడీయన. ఆయన కథలలో, సర్వమంగళ, ద్రౌపదీవస్త్రాపహరణం, ఆనందవల్లి, కూతఘనం, శిలువ లాంటి కథలన్నీ కృష్ణా తీరాన్నే నేపధ్యంగా తీసుకొని రాసినవే!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి