సోమవారం, మే 15, 2023

కంత్రీ నెంబర్‌ వన్‌!



అధినేత కుర్చీలో కూర్చుని ఏదో దురాలోచనలో ఉండగా, సెక్రటరీ హడావుడిగా వచ్చాడు.

''సార్‌... నమస్కారం. మీరేం కంగారు పడకండి. నిబ్బరంగా ఉండండి. నేను చూసుకుంటాను...'' అన్నాడు చేతులు కట్టుకుని వినయంగా.

''నేను కంగారు పడ్డం దేనికయ్యా...'' అన్నాడు అధినేత అయోమయంగా.

''అదే సార్‌... పొద్దున్న పేపర్లలో వార్తలు చదివి వెంటనే ఆదరాబాదరా బయల్దేరానండి. వచ్చేటప్పుడు వైద్యుల్ని కూడా వెంట బెట్టుకుని వచ్చానండి. బయట వెయిట్చేస్తున్నారండి. పిలవమంటారా?''

''వైద్యులేంటయ్యా... దేనికి?''

''ఒకాయన షాక్తగిలిన వాళ్లని తేరుకునేలా చేయడంలో స్పెషలిస్టండి. ఇంకొకాయన తలకేదైనా బొప్పి కడితే ట్రీట్మెంటు ఇవ్వడంలో ఆరితేరినాయనండి. మరొకాయన ఎక్కడ ఎలాంటి ఎదురు దెబ్బ తగిలినా చిటికెలో చికిత్స చేసేస్తాడండి. బీపీ, హార్టుబీట్చూసే డాక్టర్లను కూడా తెచ్చానండి. వీళ్లతో పాటు ఎందుకైనా మంచిదని సిగ్గుతో చితికిపోతుంటే ధైర్యం నూరిపోసే సైకాలజిస్టుని కూడా తీసుకొచ్చేశానండి...''

''వీళ్లంతా ఎందుకయా? ఇప్పుడు నాకేమయిందని?''

''భలేవారు  సార్‌. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మీకేమీ కాకుండా చూసుకోవడం సెక్రటరీగా నా బాధ్యత కదండీ? మీకెందుకు మీరు ధైర్యంగా ఉండండి. వాళ్లని లోపలికి రమ్మంటాను. ఆపై అంతా వాళ్లే చూసుకుంటారు. అన్నట్టు... ఇంట్లో ఎక్కడా అద్దాలు లేకుండా తీసేయమని నౌకరుకి ఫోన్చేశానండి. తీసేశాడా?''

''అవునయ్యా... పొద్దునే లేచి మొహం కడుక్కుని అద్దంలో చూసుకుందామంటే అది కనిపించలేదు. బాత్రూం, బెడ్రూమ్‌, డ్రెస్సింగ్ రూమ్స్లో కూడా అద్దాలు కనిపించలేదు. అది నీ పనా? ఎందుకలా?''

''సార్‌... నాకు తెలుసండీ. పొద్దున్నే అన్ని పేపర్లలోనూ పెద్ద పెద్ద అక్షరాలతో మొదటి పేజీల్లో వచ్చిన హెడ్లైన్స్చూసి మీరెంత బాధ పడి ఉంటారో ఊహించగలనండి. అలాంటప్పుడు అద్దంలో మీ మొహం మీరు చూసుకోవాలన్నా కూడా  సిగ్గుగానే ఉంటుందండి. ఆ మాత్రం బాధ కూడా మీకు ఉండకూడదలని అలా చేశానండి. ఇప్పటికైనా కాస్త తేరుకున్నారాండీ?'' అంటూ సెక్రటరీ మంచినీళ్ల గ్లాసు అందించాడు.

ఆ సరికి అధినేత మొహం కందగడ్డలాగా తయారైంది. కోపం నషాళానికి ఎక్కింది.

విసురుగా లేచి నుంచుని నీళ్ల గ్లాసు విసిరికొట్టి, ''నోర్ముయ్‌! నీకసలు బుద్ధుందా? ఏం వాగుతున్నావ్‌?'' అంటూ పైకప్పు ఎగిరిపోయేలా అరిచాడు.

సెక్రటరీ ఒక్కసారిగా ఉలిక్కి పడినా అధినేత మొహాన్ని పరిశీలనగా చూస్తూ, ''ఆఖరికి నేను భయపడినంతా జరుగుతోంది. మీరు పెద్ద షాక్కే గురయ్యారన్నమాట. లేకపోతే మీ క్షేమం కోసం ఆరాటపడే నా మీదే అరుస్తారా చెప్పండి? అయినా పర్వాలేదులెండి. మీ పెర్సనల్సెక్రట్రీగా ఇవన్నీ నేను లెక్క చేయను. మీరు మాత్రం అలా నిదానంగా కూర్చోండి చెప్తాను...'' అంటూ అధినేతని కూర్చోబెట్టబోయాడు.

అధినేతకి ఏమీ అర్థం కాలేదు. ఏం చెప్పినా సెక్రటరీ వినేలా లేడని గ్రహించి, కోపాన్ని తమాయించుకుని, ''సెక్రట్రీ... నేను బాగానే ఉన్నాను కానీ, ముందసలు నీ హడావుడి దేనికో, డాక్టర్లని ఎందుకు తీసుకొచ్చావో, పేపర్లలో వార్తలేంటో, నువ్వెందుకు కంగారు పడుతున్నావో చెప్పరా బాబూ, నీకు పుణ్యం ఉంటుంది...'' అన్నాడు.

అప్పటికి సెక్రటరీ కుదుటపడ్డాడు.

''అదేసార్. మీరు జారీ చేయించిన జీవో నెంబర్వన్ని హైకోర్టు అడ్డంగా కొట్టేసింది కదండీ. అన్ని పేపర్ల మొదటి పేజీల్లోనూ అదే వార్తండి. ప్రభుత్వానికి ఇదొక షాక్అని ఒకళ్లు రాస్తే, గట్టి ఎదురుదెబ్బ తగిలిందని మరోకరు హెడ్డింగ్పెట్టారండి. ప్రభుత్వానికి మొట్టికాయ పడిందని, తల బొప్పి కట్టిందని... ఇలా అందరూ తలొక రకంగా రాశారండి. మరి ప్రభుత్వమంటే మీరే కదండీ? ఆ పళంగా మీరెంత మధన పడి ఉంటారోనని తెగ వర్రీ అయిపోయానండి. అందుకే ఎక్కడ దెబ్బ తగిలినా ట్రీట్మెంటు చేయడానికి సిటీలో స్పెషలిస్టులందరినీ కారెక్కించుకుని చక్కా వచ్చేశానండి. మీరేమో ఇదంతా అర్థం చేసుకోకుండా నా మీద అరుస్తున్నారు...'' అన్నాడు ఉడుకుమోత్తనంగా.

అప్పటికి అధినేతకి అంతా అర్థమై ఒక్కసారిగా నవ్వొచ్చేసింది.

''..హ్హ..హ్హా! సెక్రట్రీ... అదా సంగతి! చంపేశావయ్యా. నీ కంగారుతో నన్ను తికమక పెట్టేశావ్‌...'' అన్నాడు అధినేత నవ్వుతూనే.

సెక్రటరీ తెల్లమొహం వేసి, ''అదేంటి సార్‌? అంత తేలిగ్గా నవ్వేస్తున్నారు? తమంతటి వారైన తమరు ప్రజానీకం పేరు పెట్టి, జనం మేలు కోరి ఓ జీవో జారీ చేయించినప్పుడు, రాష్ట్రంలోనే అత్యున్నత న్యాయస్థానమైన హైకోర్టు దాన్ని వెంట్రుక ముక్కలా తీసి అవతల పారేస్తే మీకేమాత్రం నామోషీగా లేదాండీ? నామర్దాగా అనిపించడం లేదాండీ? అసలిదెంత అప్రతిష్టండీ? తల్చుకుంటే నాకే తల కొట్టేసినంత పనయ్యిందండి. మీరు మాత్రం ఇలా ఇంత నిబ్బరంగా ఎలా ఉండగలుగుతున్నారండీ?'' అన్నాడు ఆశ్చర్యంగా.

అధినేత నవ్వాపుకుని, ''నా మీద నీ అభిమానం చూస్తుంటే ముచ్చటేస్తోందయ్యా. అందుకే నువ్వొట్టి వెర్రిబాగులవాడివైనా పనిలో కంటిన్యూ చేస్తున్నాను'' అంటూ వంగి సెక్రటరీకి కనిపించేలా తల వంచి చూపించాడు.

ఆ తల చూసిన సెక్రటరీ ఆశ్చర్యపోయాడు. తల నిండి బొడిపెలే. అధినేత పాలనలో కంకర లేచిపోయిన రోడ్డులాగా ఎగుడు దిగుడుగా అన్నీబొప్పులే కనిపించాయి.

''చూశావా సెక్రట్రీ. కంగారు పడకు. లెక్క పెట్టాలని కూడా చూడకు, కష్టం. ఇవన్నీ ఏంటనుకున్నావ్‌. కుర్చీ ఎక్కిన దగ్గర నుంచి మనం తీసుకున్న నిర్ణయాల మీద హైకోర్టు, సుప్రీంకోర్టు వేసిన మొట్టికాయలేనయ్యా ఇవన్నీ. వందలకొద్దీ ఉంటాయనుకో. మందలింపో, హెచ్చరికో, చీవాట్లో... ఏదైనా కానీ న్యాయస్థానాలిచ్చిన ఇలాంటి తీర్పులతో నా తల బొప్పి కట్టేసిందయ్యా. అందుకని ఇక నెప్పి తెలియడం మానేసింది'' అన్నాడు అధినేత ఎప్పుడూ అలవాటైన విధంగా అదోలా నవ్వుతూ. ప్రజలకి లాగే ఆ నవ్వుకి అర్థం ఏంటో సెక్రటరీకి కూడా అంతుపట్టలేదు. కానీ ఎన్ని వ్యతిరేక తీర్పులొచ్చినా అధినేత సిగ్గుపడడానికి, సరిదిద్దుకోడానికి, తరచి చూసుకోడానికి, తడిమి చూసుకోడానికి, సవరించుకోడానికి అతీతంగా ఎదిగిపోయాడని మాత్రం అర్థమైంది. దాంతో కుదుటపడ్డాడు.

''అమ్మయ్య. పోన్లెండి. కోర్టుల చివాట్లు, మందలింపులకేముందండి. మీరు స్థిమితంగా ఉన్నారు, నాకదే చాలు. కానీ సార్‌... నాకు అర్థం కాక అడుగుతానూ... మీరు జీవో నెంబర్వన్ని ప్రజల పేరు చెప్పే కదండీ జారీ చేశారు? మరిలా ఎదురు తన్నిందేం?'' అన్నాడు అమాయకంగా.

అధినేత తల తడుముకుంటూ, ''చూడు సెక్రట్రీ. మనమేం చేసినా ప్రజల పేరు మీదే చేస్తామయ్యా. కానీ లోపల ఉద్దేశాలు మాత్రం వేరే ఉంటాయన్నమాట...'' అన్నాడు గుంభనంగా.

''అదికాద్సార్‌. జాతీయ రహదారుల మీద ప్రదర్శనలు, ఆందోళలను జరిగితే జనానికి చికాకని, ట్రాఫిక్జామ్లవుతాయని, అంబులెన్సులు సైతం ఆగిపోతాయని, ప్రయాణాలు ఆలస్యమవుతాయని మీరు అప్పట్లో నాతో చెప్పారండి.  అసలు ప్రజల ప్రాణాలు కాపాడ్డానికేనని కూడా అన్నారండి. మరి వీటన్నింటినీ కోర్టు అర్థం చేసుకోలేదేంటారా?

''ఇవన్నీ ఆ జీవో జారీ చేసేప్పుడు నీకు, ప్రజలకీ చెప్పిన కారణాలయ్యా. కానీ మన మనసులో ఉన్న అసలు ఉద్దేశం వేరు...''

''ఏంటండి అది?''

''జాగ్రత్తగా విను సెక్రట్రీ. నువ్వు అమాయకుడివి కాబట్టి, రేప్పొద్దున నేను ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా నువ్వు అర్థం చేసుకోవాలి కాబట్టి చెబుతున్నా. నా పాలనలో మనం చేసే పనులన్నీ ప్రజల పేరు మీద, వారి మేలు కోసమనే చేబుతామయ్యా. వాటిని పాపం... వెర్రి జనం బాగానే నమ్మేస్తారు. కానీ ఈ ఎగస్పార్టీలున్నాయి చూడు ఆళ్లు మాత్రం ఆవులిస్తే పేగులు లెక్కెడతారు. మన తీసుకునే ఒకో నిర్ణయం వెనుక, జారీ చేసే ప్రతి జీవో వెనుక మన అసలు ఉద్దేశాలేంటో చటుక్కున గ్రహించేస్తారు. గ్రహించి ఊరుకుంటారా? ఆ నిర్ణయాల వల్ల జనానికి ఎంత నష్టం కలుగుతుందో చెప్పడానికి ఆందోళనలు చేపడతారు. రోడ్ల మీదకొచ్చి సభలు, సమావేశాలు పెడతారు. తెల్లారి లేస్తే నాలుగు కాసులు సంపాదించుకోడానికి ఎవరి పనుల మీద వాళ్లు తిరిగే సామాన్యులంతా ఇలాంటివి జరిగినప్పుడే కదా గుమిగూడతారు? అప్పుడు ఆ ఎగస్పార్టీవోళ్లు మన నిర్ణయాల వల్ల ఎంత చేటు జరుగుతుందో విడమర్చి చెబుతారు. అప్పుడేమవుతుంది? జనం చైతన్యవంతులైపోతారు. మరి అలా జనం తెలివిమీరిపోతే, మన పప్పులు ఉడుకుతాయా? ఉడకవు. మన ఉద్దేశాలు నెరవేరుతాయా? అవవు. మరందుకనే ఈ నెంబర్వన్జీవోని జారీ చేయించానన్నమాట. అర్థమైందా?''

''ఆహా... ఇప్పటికి అర్థం అయింది సార్‌. పైకి ప్రజల ప్రయోజనాలని అడ్డం పెట్టి, లోపాయికారీగా ప్రతిపక్షాల నోరు నొక్కడమన్నమాటండి. మరందుకేనన్నమాట, ఎవరైనా సరే సభలు, సమావేశాలు, నిరసన ప్రదర్శనలు లాంటివి...  జాతీయ రహదారులు, మున్సిపాల్టీ రోడ్లు, గ్రామాల రహదారుల మీద పెట్ట కూడదని రూలెట్టాశారన్నమాట. ఆహా...ఏం తెలివి సార్‌? ఈ రోడ్లన్నీ నిషేధించేస్తే ఇక ఎక్కడెట్టుకోవాలండీ సభలు, అడవుల్లో తప్ప! మీకు మీరే మేధావండి బాబూ...''

''మరందుకేరా... ఎగస్పార్టీవోళ్లు ఏకంగా కోర్టుకు పోయారు. కోర్టుకి కూడా అంతా అర్థమై కొట్టేసిందన్నమాట. తెలిసిందా?''

''తెలిసిందండి. అందుకేనన్నమాట, స్వాతంత్రం రావడానికి కూడా ఇలా రోడ్ల మీద జరిగిన సభలు, ఆందోళనలే కదా కారణమని కోర్టు వ్యాఖ్యానించింది. ప్రజల ప్రాధమిక హక్కులకు కూడా ఇది భంగమని కుండబద్దలు కొట్టేసింది. నిజానికి నాకింకోటి కూడా అర్థమవుతోందనండి. గతంలో మీలాగా ఎవరూ పాదయాత్రలు అవీ చేసి, ప్రజల మనసు దోచుకోకుండా కూడా దీన్ని ప్రయోగించి ఉంటారు కదండీ? అసలు ఇలాంటి జీవో ఉంటే మీరు కూడా పాదయాత్ర చేయడానికి వీలుండేది కాదేమోనండి. అవునంటారా?''

''కాదనడానికేముందిరా. అదే మన దురుద్దేశమయినప్పుడు?''

''కానీ సార్‌. మరిప్పుడెలాగండీ? అవతల ఎన్నికలు కూడా వస్తున్నాయి. హైకోర్టు వ్యాఖ్యానాలని అడ్డం పెట్టుకుని మిమ్మల్ని ఏద్దేవా చేస్తూ, జీవో నెంబర్వన్ను కోర్టు కొట్టేసింది కాబట్టి రెచ్చిపోయి ప్రతిపక్షాలన్నీ రోడ్ల మీదకొచ్చి మీ నిజ స్వరూపాన్ని బట్టబయలు చేస్తే ఏం చేయాలండీ?''

అధినేత పగలబడి నవ్వేశాడు. ''ఓరెర్రి సెక్రట్రీ! జీవో ఉంటే మనం చేసే ఎదవ పన్లకి ఊతంగా ఉంటుందని తప్ప, అది లేకపోతే ఏం చేయలేమని కాదు కదయ్యా! అధికారం చేతిలో పెట్టుకుని ఎగస్పార్టీవోళ్లని నానా తిప్పలు పెట్టడానికి మనం బెదిరించి, దువ్వి  మచ్చిక చేసుకున్న పోలీసులు లేరా? పెంచి పోషించుకుంటున్న గూండా అనుచరులు లేరా? ప్రతిపక్షాల సభలకి చోటిస్తే ఊళ్లకి ఊళ్ల మీదే కక్ష కట్టడం లేదా? లేనిపోని రూల్సెట్టి  ఆ గ్రామాల్లో ఇళ్లను బుల్డోజర్లు, క్రేన్లు పెట్టి కూలగొట్టడం లేదా? ఎగస్పార్టీవోళ్ల సభలెట్టే చోట కరెంటు ఆపు చేయించడం లేదా? ప్రతిపక్ష నాయకులు చేతులూపకూడదని, జనానికి అభివాదాలు చేయకూడదని శాంతి భత్రతల పేరు చెప్పి అడ్డమైన ఆంక్షలు పెట్టడం లేదా? అంతెందుకయ్యా, ఎగస్పార్టీవాళ్ల సభలకు వెళితే చాలు, జనాలకి రేషన్కార్డులు, ప్రభుత్వ పధకాలు రద్దు చేయడం లేదా? మనకి ఎదురు తిరిగితే ఏమవుతుందో ప్రజానీకానికీ, ఇతర జననాయకులకీ ఈ పాటికే అర్థమైపోయిందయ్యా. అయినా మననేం చేయగలరు చెప్పు... బోధపడిందా? హహ్హహ్హా!''

అధినేత అతివిశ్వానికి, అహంకార ధోరణికి  సెక్రటరీ బిత్తరపోయాడు. ఏమనాలో తోచలేదు.

మనసులో మాత్రం, ''ఆ జీవో నెంబర్వన్సంగతెలా ఉన్నా, నువ్వు మాత్రం కంత్రీ నెంబర్వన్అని బోధపడింది'' అనుకున్నాడు.

పైకి మాత్రం వినయంగా, ''ఇక వెళ్లొస్తాను సార్‌...' అని బయటకి నడిచాడు.

అధినేత మరో జీవో కోసం దురాలోచనలో పడ్డాడు!

-సృజన

PUBLISHED ON 15.5.2023 ON JANASENA WEBSITE

బుధవారం, మే 10, 2023

అభినవ పురాణం!



శిష్యుడు వచ్చేసరికి గురువుగారు చెవిలో పువ్వు పెట్టుకుని చాప మీద కూర్చుని వ్యాసపీఠంపై పెద్ద పుస్తకం పెట్టుకుని శ్రద్ధగా చదువుకుంటున్నారు. శిష్యుడు వచ్చి నిశ్శబ్దంగా  చాప మీదే చతికిలపడ్డాడు.

గురువుగారు  పువ్వు తీసి శిష్యుడి చెవిలో దోపి, ''ఆహా... ఏమి ఘట్టంరా. కృష్ణుడు మన్ను తిన్నాడని బలరాముడు యశోదకి చెప్పాడురా.  పళంగా యశోద వచ్చి కృష్ణుడి చెవి మెలిపెట్టి నోరు చూపించమంది. కృష్ణుడు నోరు తెరిచాడు...'' అంటూ చెబుతుండగా శిష్యుడు అందుకున్నాడు.

''ఇదంతా నాకు తెలుసు గురూగారూ! మా బామ్మ చెప్పింది. అప్పుడా కృష్ణుడి నోటిలో మొత్తం లోకాలన్నీ కనిపించాయంట కదా... '' అన్నాడు.

గురువుగారు తన్మయత్వంతో కళ్లు మూసుకుని, ''ఆహా...  తర్వాత ఏం జరిగిందంటే...'' అంటూ మొదలుపెట్టగానే, శిష్యుడు అడ్డుతగిలాడు.

''అదేంటి గురూగారూ! నేనేదో మీ దగ్గర రాజకీయ పాఠాలు నేర్చుకుందామని వస్తే, మీరు పురాణాలు వల్లిస్తున్నారూ? పోనీ నన్ను మళ్లీ రమ్మంటారా?''

''ఒరే, రాజకీయాల్లో ఆరితేరాలంటే పురాణాలు కూడా తెలుసుకోవాలిరా. అందుకే ఇవాళ ఇలా మొదలెట్టాను...''

''ఊరుకోండి సార్‌. పవిత్ర పురాణాలెక్కడ? అపవిత్ర రాజకీయాలెక్కడ? వాటికీ వీటికీ లంకె ఎలా కుదురుతుంది?''

''ఎందుకు కుదరదురా? పురాణాల్లో కథలన్నీ ఇప్పుడు కూడా జరుగుతున్నాయని తెలీదా?''

''ఏంటో గురూగారూ! మీరేదేదో చెబుతారు. మహిమలు, మాయలు ఉన్న పురాణ కథలు ఇప్పుడు జరగడం ఏంటి సార్‌. నాకేమీ అర్థం కావడంలేదు...''

''ఓరెర్రోడా...  కథల్లో అంతరార్థం గ్రహించుకుని ఇప్పటికి అన్వయించుకోవాలిరా...''

''అదికాద్సార్‌... నాకు పురాణాల గురించి తెలిసిందే తక్కువ. మీరేమో అంతరార్థం, అన్వయం అంటారు. నాలాంటి మట్టి బుర్రగాడికి అవన్నీ ఎలా కుదురుతాయి సార్‌? అదేదో మీరే చెప్పి పుణ్యం కట్టుకోండి...''

''సర్లె... ఎంత దద్దమ్మవైనా కాస్తో కూస్తో కథలు విని ఉంటావు కదరా. పోనీ సినిమాలైనా చూసి ఉంటావుగా? కాబట్టి నీకు తెలిసిన పాత్రల పేర్లు చెప్పు. అలాంటి వాళ్లు ఇప్పుడున్నారో లేరో చెబుతాను సరేనా?''

''...భక్త ప్లహ్లాద సినిమా  టీవీలో చూశాను సార్‌... అందులో హిరణ్యాక్షుడని ఉంటాడండీ...''

''మరి వాడేం చేశాడు? భూమిని చాపలాగా చుట్ట చుట్టేసి పట్టుకుపోయాడు అవునా? మరి ఇప్పుడు కూడా హిరణ్యాక్షుల్లాంటి రాజకీయ నేతలు ఉన్నారు కదరా... ప్రభుత్వ భూముల్ని, పోర్టుల్ని ఆక్రమిస్తున్నారా? ఎవరెవరికో ధారాదత్తం చేస్తున్నారా? కబ్జాలకు పాల్పడుతున్నారా?  అసలు నీ పరగణాని పాలిస్తున్న ముఖ్యనేతని, ఆయన అనుచరులని మర్చిపోతే ఎలారా? ఏవేవో పరిశ్రమలు వస్తాయని, ఉద్యోగాలు ఏర్పడుతాయని జనాన్ని నమ్మించి వేలకు వేల ఎకరాలు అయినవారికి అప్పగించి, అందుకు ప్రతిగా వాటాలు అందుకోవడం లేదూ? మరి ఇది భూమిని చుట్ట చుట్టేయడం కాదంటావా? మరి వస్తాయని ఆశ పెట్టిన పరిశ్రమల జాడ ఎక్కడైనా కనిపిస్తోందా? ఉన్నవి కూడా ఉడాయిస్తుంటే ఇక ఉద్యోగాల సంగతి వేరే చెప్పాలా? ఇక  ముఖ్యనేత అండ చూసుకుని అధికార పార్టీ అనుచరులు, నేతలు కలిసి ఎక్కడ ఎలాంటి విలువైన భూమి కనిపించినా వదుల్తున్నారా? ప్రైవేటు వ్యక్తుల భూముల్ని కూడా అక్రమంగా అన్యాక్రాంతం చేస్తున్న వీరి ఆగడాలు అడుగడుగునా కనిపంచడంలేదా? మరి వీళ్లంతా  హిరణ్యాక్షులకేమైనా తీసిపోతార్రా? అంటే అలనాటి పురాణం ఇప్పుడు కూడా జరుగుతున్నట్టే కదా? కాదనగలవా?''

''ఇంకేమనగలను సార్‌, మీరింతబాగా అన్వయించాక? అన్నట్టు ఈమధ్యనే పేపర్లో చదివాను సార్‌. అధికార పార్టీకి చెందిన నేతలు, నాయకులు, ప్రజాప్రతినిధులు కలిసి ఎక్కడికక్కడ భూముల్ని తవ్విపోగులు పెట్టి మట్టిని తరలించి అక్రమంగా అమ్మి సొమ్ము చేసుకుంటున్నారట సార్‌. అంటే మట్టి తినడమే కదా సార్‌? ఇందాకా మీరు చెప్పారే, కృష్ణుడు మన్ను తిన్నాడని యశోద నోరు తెరవమంటే లోకమంతా కనిపించిందని. ఇదీ అలాగే ఉన్నట్టుంది సార్‌. నేను కూడా బాగా అన్వయించానంటారా?''

''ఏడిశావ్దరిద్రుడా. ఆయన కృష్ణుడు అయితే వీళ్లు నికృష్టులురా. ఆయన చూపించింది అద్భుతమైన లీల అయితే వీళ్లది అవినీతి గోల. వీళ్లని  సీబీఐ వాళ్లో నోరు తెరవమంటే ఎక్కడలేని గనులు, కొండలు, ఖనిజాలు, ఇసుక పర్రలు కనిపిస్తాయి. కానీ వీళ్లు నోరు తెరవరు. ఒక వేళ తెరిచినా తిన్నదంతా అరాయించేసుకుని ఒట్టి నోరు చూపిస్తారు...''

''బాగా చెప్పారు సార్‌. మరయితే హిరణ్యాక్షుడి సోదరుడు హిరణ్యకశిపుడు కూడా ఇప్పుడున్నాడంటారా?''

''మరయితే  హిరణ్యకశిపుడు ఏం చేశాడో ఒక్కసారి గుర్తు చేసుకుని చెప్పు...''

''... గుర్తొచ్చిందండి. తానే దేవుడినన్నాడండి. తనను తప్ప ఎవరినీ పూజించకూడదన్నాడండి. రాజ్యంలో ప్రతి దేవాలయంలోనూ తన ప్రతిమలే నిలబెట్టించాడటండి. బ్రహ్మ ఇచ్చిన వరాలతో రెచ్చిపోయాడండి. తన మాటకి ఎదురు చెప్పిన వాళ్లని చంపించాడండి. ఆఖరికి తన కన్నకొడుకుని కూడా చంపడానికి చూశాడండి...''

''నీకా కథ బాగానే గుర్తుందిరా. కానీ  హిరణ్యకశిపుడిలాంటి నేతని మాత్రం పోల్చుకోలేకపోతున్నావ్‌. నిన్ను, నీ నేలని పాలిస్తున్న ముఖ్యనేత కూడా అంతే కదరా. జనం కోసం తపస్సు చేశాడు.  తపస్సుకి మెచ్ఛి జనం ఇచ్చిన ఓట్ల వరంతో విర్రవీగుతున్నాడు. ఎదురు చెప్పిన వాడిని వేధిస్తున్నాడు. ప్రశ్నించిన వాడిని నానా అక్రమ కేసులు బనాయించి కక్షసాధిస్తున్నాడు. ఆఖరికి సొంత పార్టీ వాళ్లయినా తనది తప్పంటే సహిస్తున్నాడా? గుండాల చేత కొట్టిస్తున్నాడు. పార్టీ నుంచి వెలి వేస్తున్నాడు.  ఇవన్నీ చాలక, తానే దేవుడన్నట్టు అందరినీ నమ్మించడానికి ఊరూవాడా పోస్టర్లు వేయిస్తున్నాడా లేదా? 'మా దేవుడు నువ్వే', 'మాకు అండ నువ్వే' అంటూ జనం తన్మయత్వంతో పూజిస్తున్నట్టు తనకు తానే ప్రచారం చేసుకోవడం లేదూ? అహంకారంతో విర్రవీగిన అలనాటి హిరణ్యకశిపుడి వారసుడు వీడేనంటే తప్పేమైనా ఉంటుందంటావా?''

''తప్పేంటి సార్‌, అక్షరాలా నిజమైతేనూ? మరయితే నాకు కంసుడి కథ కూడా గుర్తొస్తోందండి. వాడు కూడా ఇప్పుడు ఉన్నాడంటారా?''

''ముందు  కంసుడేం చేశాడో నీకు గుర్తున్నంత వరకు చెప్పు చూద్దాం...'

''ఏముందండీ? కన్న తండ్రినే ఖైదు చేయించాడండి. సొంత చెల్లెల్నే నానా పాట్లూ పెట్టాడండి. జైల్లో వేసి బంధించాడండి. తనను చంపబోయేవాడు ఎక్కడో పెరుగుతున్నాడని తెలిసి రాజ్యంలోని పిల్లల్నందర్నీ చంపడానికి రాక్షసుల్ని పురమాయించాడండి...''

''మరి ఇంత చెప్పినవాడివి, అధికార మదంతో విర్రవీగుతున్న నీ నేత పనుల్నే మర్చిపోతే ఎలారా? పురాణాల్ని కథల్లాగా కాదురా,  కథల్లోని సంఘటనలతో పోల్చుకోవాలి. మరి నీ నేత తండ్రి చనిపోగానే  స్థానంలో కూర్చోవాలని చూశాడా? సంతకాల సేకరణ చేశాడా? అప్పట్లోలాగా రాజ్యాలు, రాచరికాలు లేకపోబట్టి కానీ లేకపోతే తండ్రి సింహాసనాన్ని వెంటనే ఆక్రమించుకునేవాడే కదా? ఇక తల్లినే పార్టీ నుంచి తప్పించాడా లేదా? ఇక సొంత చెల్లెలు పరిస్థితి ఏంటో చూస్తున్నావుగా? అంతెందుకు,  బాబాయి హత్యకు దారితీసిన పరిస్థితుల్ని తల్చుకుంటే చాలదూ?  అధికారం కోసం అయినవారిని సైతం కకావికలు చేసిన కంసుడి వారసుడికి కథకి ఇంతకంటే అన్వయాలు ఎక్కడుంటాయి? ఇక తనను ఓడించేవాడు ఎవడైనా ఉన్నాడనిపిస్తే చాలు వాళ్ల మీదకి గుండాల్ని ఉసిగొల్పడం లేదూ? వాళ్ల మీద ఎక్కడ లేని ఆంక్షలు విధించడం లేదూ? ఎవరైనా నిరసన ప్రదర్శనలు చేస్తుంటే అనుచరులు, పోలీసుల చేత చితగ్గొట్టించడం లేదూ? అన్యాయపు సెక్షన్లతో కేసులు పెట్టించడం లేదూ? ఎక్కడికక్కడ తన మనుషులని పెట్టుకుని ఎదురుతిరిగిన వాళ్లని నానా పాట్లూ పెట్టడం లేదూ? ఇదంతా చూస్తూ కూడా  అభినవ కంసుడిని కనిపెట్టకపోతే ఎలారా?''

''ఆహా... చాలా బాగా చెప్పారు సార్‌. మరయితే రావణాసురులు, కుంభకర్ణులు, దుర్యోధనులు, దుశ్శాసనులు, శకునులు, సైంధవులు... ఇలాంటి వాళ్ళు కూడా ఉండే ఉంటారు కదండీ?''

''అడుగడుగునా వాళ్లే కదరా? పాండవులకి నిలువ నీడ లేకుండా చూడాలనుకున్నాడు దుర్యోధనుడు. మరిప్పుడు ప్రతిపక్షాలకు నిలువ నీడ లేకుండా చేయాలనే ఉద్యేశంతో చెలరేగుతున్న నేతని పోల్చుకోలేవా? మాయా జూదంతో పాండవులను ఓడించాడు శకుని. అలా మాయ మాటల పాచికలాడి జనాన్ని నమ్మించిన శకుని జాడ కనిపించ లేదా? నిండు సభలో ద్రౌపది వలువలు ఊడదీయాలని చూశాడు దుశ్శాసనుడు. మరి మహిళలపై అత్యాచారలతో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న నీ రాష్ట్రంలో అడుగడుగునా చెలరేగి పోతున్న అధికార పార్టీ అనుచరుల ఆగడాలను గ్రహించలేవా? మారీచుడిని బంగారు లేడిలాగా కనిపించేలా చేసి సీతను ఎత్తుకుపోయాడు రావణాసురుడు. అలాగే స్వర్ణయుగాన్ని చూపించి నమ్మించి అసాధ్యమైన హామీలిచ్చి అధికారాన్ని అందుకున్న నేతల తీరు కానుకోలేవా? పరికించి చూస్తే... ప్రజల మేలుకు అడ్డుపడుతున్న సైంధవులు, సామాన్యులు కష్టాలు పడుతున్నా మొద్దు నిద్రపోతున్న అధికార కుంభకర్ణులూ, చనిపోయిన వారికి ప్రభుత్వం ఇచ్చే పరిహారంలో కూడా వాటాలడుగుతూ జనాన్ని నిలువునా దోచుకుంటున్న పాలక పార్టీ దుష్టచతుష్టయాలు, ప్రకృతి వనరుల్ని సైతం కబళిస్తున్న కబంధులు, అక్రమ వ్యాపారాలతో విజృంభిస్తున్న రాకాసి మూకలూ... ఇలా పురాణాల్లో ఉండే పాత్రలన్నీ మన చుట్టూ వికటాట్టహాసాలు చూస్తూ తిరుగుతూ ఉంటే పోల్చుకోలేకపోతే ఎలారా?''

''అవునండోయ్‌. మరైతే గురూగారూ, పురాణాల్లోలాగా ఇలాంటి రాక్షసులని తుదముట్టించడానికి  రాముడు,  కృష్ణుడు,  ఉగ్ర నరసింహుడు,  పరశురాముడు కూడా వస్తారంటారా?''

''జనచైతన్యమే అవతార పురుషుడిని చూపిస్తుందిరా. తాము ఓటేసి గెలిపించిన వాళ్లంతా తమను ఎలా దోచుకుంటున్నారో, ఎలా వేధిస్తున్నారో, ఎలా రెచ్చిపోతున్నారో, ఎలా విర్రవీగుతున్నారో, ఎలా పేట్రేగిపోతున్నారో, ఎలా పీడిస్తున్నారో, ఎలా పీల్ఛి పిప్పి చేస్తున్నరో, ఎలా మోసం చేస్తున్నారో, ఎలా మాయ చేస్తున్నారో...  సామాన్యులు అవగాహన చేసుకుంటే చాలురా. వాళ్ల చేతిలో ఓటే రామబాణమై రావణాసురుడి తలలు ఖండిస్తుంది.  ఓటే సుదర్శన చక్రమై రాక్షసులను తుదముట్టిస్తుంది. దుష్ట పాలకుల నైజం గ్రహించిన ప్రతి ఓటరూ  పరశురాముడే.  ఉగ్ర నరసింహుడే. అర్థమైందా?''

''అద్భుతం సార్‌. మీరు చెప్పిన అభినవ పురాణాన్ని నిత్యం పారాయణ చేస్తాను''

-సృజన

PUBLISHED ON 7.5.2023 IN JANASENA WEBSITE