శనివారం, సెప్టెంబర్ 13, 2014

ఆయన సినిమాలు ముత్యాల ముగ్గులు



'కొంటె బొమ్మల బాపు... 
కొన్ని తరముల సేపు... 
గుండెలూయలలూపు!' 
అంటూ ఆరుద్ర కూనలమ్మ పదాల మాలికతో బాపుపై భక్తిని చాటుకున్నారు. 
గీసిన బొమ్మలయినా, తీసిన బొమ్మలయినా... 
అవి చూసినవారి గుండెల్లో బొమ్మల కొలువులాగా కళకళలాడిపోతాయి. 
ఏమని చెప్పగలం బాపు సినిమాల గురించి! 
కళ్ల ముందు నుంచి ఆయన తరలి వెళ్లిపోయిన తర్వాత కన్నీరు నిండిన కళ్లలో ఆయన చిత్రాలే సినిమా రీలులాగా కదులుతున్నాయి. 
ఒకో సినిమా ఒకో రసరమ్య గీతమై అభిమానుల మనసుల్లో తారాడుతున్నాయి. 'సాక్షి' నుంచి 'శ్రీరామరాజ్యం' దాకా ఆయన వెండితెరపై మలిచిన ఏ సినిమాను తల్చుకున్నా అదొక తీయని అనుభూతినే గుర్తుకు తెస్తుంది. 
ఆయన సినిమాలు... చిత్రసీమ ముంగిట్లో ముత్యాల ముగ్గులు! 
సినిమా రంగం సింహద్వారానికి కట్టిన మామిడాకు తోరణాలు! 
సినీ వేలుపు మెడలో అలంకరించిన నిలువెత్తు కనకాంబరం దండలు! వాటికి వేవేల దండాలు...! ఏ సినిమా చూసినా ఆయన విలక్షణమైన ముద్ర కనిపిస్తుంది. అందుకే చిత్రరంగంపై అవన్నీ చెరిగిపోలేని, మరిచిపోలేని ముద్రను వేశాయి. ఒకో సినిమా ఒకో రకం అనుభూతిని, రసానుభూతిని ప్రేక్షకుల గుండెల్లో మిగిల్చినవే.

సినిమా ఎలా ఉండాలో ఆయనకు సుస్పష్టమైన అవగాహన ఉంది. అంతకు ముందు తీసే తీరుపై అంతులేని నమ్మకం ఉంది. అందుకనే 1967లో తొలి సినిమా 'సాక్షి' తీస్తూనే 'ఇది సాక్షినామ సంవత్సరం' అని నిబ్బరంగా చాటుకోగలిగారు. ఆ ప్రచారం చూసి కొందరు 'పొగరు' అన్నారు. కానీ ఆ సినిమా విడుదలయ్యాక తెలిసింది అది ఆత్మవిశ్వాసం అని! ఇండోర్‌ స్టూడియోల గదుల్లో, కృత్రిమ సెట్టింగుల హంగుల మధ్య సినిమాలు చూసిన ప్రేక్షకులకు 'సాక్షి' ఓ సరికొత్త వాతావరణాన్ని చూపించింది. ఔట్‌డోర్‌లో పకడ్బందీగా తీస్తే సహజత్వం ఎలా వెల్లివిరుస్తుందో సినిమావాళ్లకు కూడా చవిచూపించింది. ఇప్పటికీ చెప్పుకోదగిన ఓ పాఠంలా మిగిలింది. పల్లెటూరిలోని మనుషుల నైజాలను నిజాలుగా ఆవిష్కరించింది. అందుకనే ప్రతి వూరూ ఆ సినిమాను తనదనుకుంది. మన వూర్లోనే జరిగిన కథనుకుంది. ఆదరించి అక్కున చేర్చుకుంది.

అందులో 'అమ్మకడుపు చల్లగా... అత్త కడుపు చల్లగా... బతకరా... బతకరా పచ్చగా...' అనే పాటను కేవలం ఒకటి రెండు రోజుల్లో తీసినట్టు బాపు ఓ సందర్భంలో చెప్పారు. కొన్నేళ్ల తర్వాత ఆ విషయమై ఎవరో ప్రస్తావిస్తే 'ఇగ్నోరెన్స్‌ ఈజ్‌ బ్లిస్‌' అని నవ్వేశారాయన. తన సినిమాల మీద తనే కార్టూన్లు వేసుకోగలిగిన నిబ్బరి బాపు. అక్కినేని నాగేశ్వరరావు ద్విపాత్రాభినయంతో బాపు తీసిన 'బుద్ధిమంతుడు' (1969) చిత్రం కూడా పల్లె రాజకీయాలను కళ్లకు కడుతుంది. అందులో అక్కినేనిని ఆయన పూర్తి ఆస్తికుడైన అన్నయ్యగా, పరమ నాస్తికుడైన తమ్ముడిగా రెండు విభిన్నమైన కోణాల్లో అద్భుతంగా ఆవిష్కరించారు. 'భూమ్మీద సుఖపడితే తప్పులేదురా... బులబాటం తీర్చుకుంటే తప్పులేదురా...' అంటూ తిరిగే తమ్ముడికి, 'నను పాలించగ నడచి వచ్చితివా...' అంటూ భక్తితత్పరతతో మైమరచి పోయే అన్నయ్యకి తేడా చూపించిన తీరు అద్వితీయం.


'అంతా భగవంతుడు చూసుకుంటాడనే' అన్నయ్యకు, సమాజంలోని అన్యాయాన్ని ఎదురించేవాడు నాస్తికుడైనా దేవుడికి ఇష్టుడవుతాడని చెప్పించిన తీరు మనసులకు హత్తుకుంటుంది. గోదావరి అన్నా, తీర ప్రాంతాలన్నా బాపుకి ఎంత ఇష్టమో 'అందాల రాముడు' (1973) సినిమా చూస్తే అర్థం అవుతుంది. రాజమండ్రి నుంచి భద్రాచలం వరకు లాంచీలో జరిగే ప్రయాణంగా సాగిపోయే ఈ సినిమా గోదావరి అందాలకు పట్టిన నీరాజనం! ప్రకృతి రమణీయతకు నిలువుటద్దం! ఈ ప్రయాణంలోనే పేద, ధనిక తారతమ్యాలు, సమాజంలో విభిన్న మనస్తత్వాలు అన్నీ తారసపడి ప్రేక్షకులను కూడా గోదావరి లాంచీపై ఆహ్లాదకరమైన ప్రయాణం చేయిస్తాయి. వీటి మధ్యలో అల్లుకున్న ఓ చక్కని ప్రేమకథ సినిమాను రక్తి కట్టిస్తుంది. 'మనుషుల్లారా మాయామర్మం వద్దన్నాడోయ్‌...' అని 'రాముడేమన్నాడోయ్‌' పాటలో చెప్పిస్తారు. ఇందులో ప్రతి పాటా ఓ రసగుళికే. 



ఇక 'ముత్యాల ముగ్గు' (1975) మరో అద్భుతాన్ని వెండితెరపై ఆవిష్కరించింది. అందులో ముళ్లపూడి వెంకట రమణ రాసిన సంభాషణలన్నీ రికార్డులాగా వెలువడి రికార్డు సృష్టించాయి. ఆయన సంభాషణలకు తగినట్టుగా అందులో కాంట్రాక్టర్‌ అనే విలన్‌ పాత్రను బాపు మలిచిన తీరు అద్వితీయం. అపురూపం. 'మడిసన్నాక కూసింత కలాపోసన ఉండాలయ్యా...', 'డిక్కీలో తొంగోబెట్టేస్తాను...', 'ఆ ముక్క నే లెక్కెట్టుకోక ముందు సెప్పాల...' 'ఏముందీ నిన్ను కరుసు రాయించి ఆయన కాతాలో జమేస్తే సరి...' లాంటి డైలాగులను రావుగోపాలరావు చేత పలికించిన పంథా విలనిజానికి విలక్షణతను ఆపాదించాయి. ఈతరం పిల్లలు ఇప్పుడు ఆ సినిమాను చూసినా అందులో మమేకమైపోతారనడంలో సందేహం లేదు. 'ఏదో ఏదో అన్నది... ఈ మసక వెలుతురు... గూడి పడవలో విన్నది కొత్త పెళ్లి కూతురు...' 'నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది... కన్నుల్లో నీరు తుడిచి కమ్మని కల ఇచ్చింది...' పాటలను బాపు వెండితెరపై ఆవిష్కరించిన తీరు ప్రేక్షకులను మంత్రుముగ్ధుల్ని చేస్తుంది. అందుకే ఆ సినిమా బాపు తీసిన ఆణిముత్యాల్లాంటి చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. 

కృష్ణంరాజు, వాణిశ్రీలతో తీసిన 'భక్త కన్నప్ప' (1976) భక్తి ప్రధానమైన సినిమాను కూడా ఎలా వ్యాపారాత్మకంగా, జనరంజకంగా తీయవచ్చో చెబుతుంది. అప్పటికి కృష్ణంరాజు, వాణిశ్రీకు ప్రేక్షకుల్లో ఉన్న ఇమేజ్‌ వేరు. కమర్షియల్‌ పంథాలో సాగుతున్న వారిని ఓ పౌరాణిక నేపథ్యంలో ఉన్న కథలో పాత్రలుగా చూపిస్తూనే అప్పటి యువతకి నచ్చే విధంగా పాటలు, పోరాటాలతో చక్కగా మలిచారు బాపు.

అలాగే పాండవులు, కృష్ణుడి పాత్రలను సాంఘికంగా మలుస్తూ ఓ పల్లెటూరిలో జరిగే రాజకీయాలు, అన్యాయాల నేపథ్యంలో తీసిన 'మనవూరి పాండవులు' (1978) ప్రేక్షకులకు విపరీతంగా ఆకట్టుకుంది. ఇందులో కూడా రావుగోపాలరావును ప్రతినాయకుడిగా తీర్చిదిద్దిన తీరు పల్లెటూరి మోతుబరుల అకృత్యాలకు అద్దం పడుతుంది. ఈ అన్యాయాలను సహించలేని ఐదుగురు యువకులను పాండవులుగా తీర్చిదిద్దుతూ, ప్రతినాయకుడి తమ్ముడి పాత్రలో కృష్ణంరాజును సాంఘిక కృష్ణుడిగా చూపించడం బాపు విలక్షణ శైలికి అద్దం పడుతుంది. 'పాండవులు పాండవులు తుమ్మెద...', 'ఒరేయ్‌ పిచ్చి సన్నాసి...' లాంటి పాటల చిత్రీకరణ గురించి ఇప్పటికీ అభిమానులు చెప్పుకుంటారు. చిత్రం చివర్లో వూరందరూ చైతన్యవంతులై రావుగోపాలరావు అనుచరులను తరిమికొడుతున్నప్పుడు కృష్ణంరాజు చేత 'మేలుకున్న వూరు దేవుడి విశ్వరూపం లాంటిది...' చెప్పించినప్పుడు థియేటర్లలో చప్పట్లు మోగుతాయి. చిరంజీవికి మంచి గుర్తింపు తెచ్చిన తొలిచిత్రాల్లో ఒకటిగా ఇది నిలిచిపోతుంది. ఆ తర్వాత కాలంలో చిరంజీవి కథానాయకుడిగా తీసిన 'మంత్రిగారి వియ్యంకుడు' (1983) మరో చిరస్మరణీయమైన సినిమాగా నిలిచిపోయింది.

ప్రయోగాలకు కూడా బాపు పెద్ద పీట వేసేవారు. ఓ చిన్నపిల్లవాడి కథతో తీసిన 'బాలరాజు కథ' ఇప్పటికీ పిల్లల్ని, పెద్దల్నీ ఆకట్టుకుంటుంది. ఆ కథలో ఓ గుడిలో రాసి ఉన్న నీతి సూత్రాలు ఓ పిల్లవాడి జీవితంలో ఎలా నిజమయ్యాయో, అవి ఆ పసి మనసుకు ఎంత గొప్ప జీవిత సత్యాలు బోధించాయో పిల్లల స్థాయిలో చిత్రీకరించిన తీరు ప్రేక్షకుల మనసుల్లో హత్తుకుపోతుంది. అలాగే వాణిశ్రీని మేకప్‌ లేకుండా చూపించాలనుకోవడం అప్పట్లో ఓ సాహసం. ఆ సాహసాన్ని 'గోరంత దీపం' చిత్రంలో చేశారు బాపు. ఆ చిత్రం వ్యాపారాత్మకంగా విజయవంతం కాలేదనే సత్యాన్ని స్వీకరిస్తూ గోరు మీద దీపం కాలుతున్నట్టుగా కార్టూన్‌ వేసి అభిమానులను నవ్వించారు బాపు. వ్యాపారాత్మకతలను పక్కన పెడితే గోరంత దీపంలో తెలుగు వాడి ఆత్మ కనిపిస్తుంది. మధ్యతరగతి లోగిళ్లలోని విచిత్రమైన మనస్తత్వాలను వాస్తవికమైన రీతిలో ప్రతిబింబించిన తీరు, బాపు చిత్రీకరణలోని విలక్షణ శైలిని చాటి చెబుతుంది. 

ఇక 'పెళ్లి పుస్తకం..'. ఈ సినిమా గురించి ఏమని చెప్పాలి? ఉద్యోగాల కోసం 'పెళ్లి కాలేద'ని అబద్దం చెప్పిన ఓ జంట కథ ఇది. 'శ్రీరస్తు.. శుభమస్తు..' పెళ్లి పాటకు ఓ బ్రాండ్‌ అయిపోయింది. ఈ పాటని బాపు తెరకెక్కించిన విధానం నభూతో.. నభవిష్యత్‌ అనొచ్చు. 'మిస్టర్‌ పెళ్లాం'ది మరో వింత. ఉద్యోగం చేస్తున్న భార్య, వంటింట్లో గరెటె తిప్పుతున్న మగాడు.. అదీ కథ. మగవాడి మనస్తత్వానికి రాజేంద్రప్రసాద్‌ పాత్ర పరాకాష్ట. చివరి చిత్రం 'శ్రీరామరాజ్యం'లోనూ బాపు ముద్ర స్పష్టంగా కనిపించింది. వయసు మీరినా ఆయన మార్క్‌ చెరగలేదనడానికి... అదో నిదర్శనంలా నిలిచింది. ఇలా చెప్పుకొంటూ పోతే.. ప్రతి సినిమా భావి దర్శకులకు ఓ పాఠంలా మారిపోతుంటుంది. తెలుగు సినీ వాకిట్లో ప్రతి చిత్రం ఓ ముత్యాల ముగ్గులా మెరిసిపోతుంటుంది.

PUBLISHED IN EENADU ON 01/09/2014

శుక్రవారం, జూన్ 27, 2014

పరాజయ పాఠాలు




'నమస్కారం గురూగారూ'
'రారోయ్‌ రా! ఏంటీ చాలా కాలమైంది. మొహం అలా వేలాడేసుకుని ఉన్నావేం?'

'మీకు తెలియనిదేముంది గురూగారూ! ఫలితాలు గూబ గుయ్యిమనిపించాయి. పరువు, పవరు కూడా పరారయ్యాయి. అత్త తిట్టినందుకు ఏడవాలో, ఆడపడుచు నవ్వినందుకు ఏడవాలో తెలియని పరిస్థితిలో పడ్డా. ఎవరికీ మొహం చూపించలేక యాత్రలకు పోయి వచ్చా'

'అంతేలేరా, లోకం తీరే అంత. కానీ, అలా బెంబేలు పడిపోయి మొహం దాచేసుకుంటే ఎలారా?'

'ఇంకేం చేయమంటారు చెప్పండి. సిగ్గుతో చితికిపోయాననుకోండి. పైగా ప్రచారంలో రెచ్చిపోయి మరీ, కుర్చీ నాదేనన్నట్టు ఎడాపెడా వాగేశాను కదండీ? దాంతో అద్దంలో కూడా నా మొహం నేనే చూసుకోలేకపోయానంటే నమ్మండి'

'వార్నీ, ఆత్రగాడికి బుద్ధి మట్టం అన్నట్టు, నా దగ్గర రాజకీయ పాఠాలు పూర్తిగా నేర్చుకోరా ఆ తరవాత కాస్తో కూస్తో అనుభవం ఏడిశాక బరిలోకి దిగచ్చునంటే వినకుండా, మహా నేతలాగా పోజెట్టి దూకేశావు. బొక్కబోర్లా పడ్డావు. కుర్చీ ఏక్కేద్దామన్న దురదేగానీ, ఎక్కేందుకు దమ్ముందో లేదో చూసుకోలేదు మరి. ఏం చేస్తాం...'

'ఏంటి గురూగారూ మీరు కూడానూ. చచ్చిన పామును ఇంకా ఎందుకండీ చంపడం? ఇప్పుడేం చేయాలో చెప్పుదురూ'

'సర్లేరా, నీ అరకొర బుద్ధితో వేసిన గెలుపు సూత్రాలు బెడిసికొట్టినా, పరాజయ పర్వంలో పాఠాలు బోలెడున్నాయి. అవైనా ఒంటపట్టించుకో మరి'

'పరాజయంలో పాఠాలేముంటాయండీ, మీది మరీ చోద్యం కాకపోతేనూ?'

'ఓరమాయకుడా, రాజకీయం అంటే అదేరా! సమకాలీన నేతల్ని చూసైనా నేర్చుకునే తెలివిడి ఏడ్వాలి. గెలిచినోడు ఎంత సందడిగా మీటింగులు గట్రా పెడతాడో, అంతకంటే హడావుడిగా నువ్వు మీటింగులు పెట్టుకోవాలి'

'ఓడినోడికి మీటింగులేంటండీ?'

'ఎందుకుండవురా... చతికిల పడ్డానికి కారణాలు విశ్లేషించుకుంటున్నట్టు కనబడాలి. ప్రజలు ఛీ కొట్టడమే ఏకైక కారణమని నీకు తెలిసినా, ఏవేవో కారణాలు వెతికి మైకుల ముందు పళ్లికిలిస్తూ చెప్పాలి'

'మరి ఎలాంటి కారణాలు చెప్పాలండీ?'

'ఓడిన నేతల్ని గమనించలేదురా? గెలిచినోడు ప్రజల్ని హామీల మత్తులో ముంచేశాడని వాగొచ్చు. ఆ హామీలని జనం పాపం... అమాయకంగా నమ్మడంవల్లే వాళ్ల గెలుపు సాధ్యమైందని వదరచ్చు. వాళ్లు చెప్పినవేమీ చేయలేరని, ఆ సంగతి ప్రజానీకానికి నిలకడ మీద తెలుస్తుందని బోర విరుచుకుని మరీ మాట్లాడొచ్చు. దీన్ని నిస్సిగ్గు నిబ్బరమంటారు'

'కానీ గురూగారూ, ప్రచారంలో నేను కూడా అడ్డదిడ్డమైన హామీలిచ్చా కదండీ? నా మాటలు విని జనం నవ్వుకోరాండీ?'

'ఒరే జనానికన్నీ తెలుసురా. కానీ, వాళ్లు నవ్వుకుంటారని, ఏదేదో అనుకుంటారనీ నువ్వనుకుంటే ఎలారా? నీకేదో గొప్ప చిత్తశుద్ధి గట్రా ఉన్నట్టు బిల్డప్పులివ్వద్దూ? అంచేత నువ్విచ్చిన హామీలే నికార్సయినవన్నట్టు, అవతలివాళ్లవి వట్టి డొల్ల మాటలన్నట్టు నోటికొచ్చినట్టు పేలడమే. ఈ విద్యను ఒంటపట్టించుకోడానికి కావలసిన అర్హతలన్నీ ఇప్పుడు నీలో ఉన్నాయి మరి'

'ఆహా... ఓడినవాడిలో కూడా ఆత్మవిశ్వాసాన్ని పెంచుతారు గురూగారూ మీరు'

'ఏడిశావ్‌లే... ఆత్మవిశ్వాసం లాంటి మంచి పదాలెందుకు? మనలో మాటగా అనుకోవాలంటే ఇది ఆత్మవంచననుకోవాలి'

'అర్థమైంది గురూగారూ! మనం ఓడించినా ఇతడు పాపం మన గురించే ఆలోచిస్తున్నాడని ప్రజలు జాలిపడేలా మాట్లాడాలన్నమాట'

'జనం అలా జాలి పడతారనేది వట్టి భ్రమేనని నీకు తెలిసినా, నువ్వు మాత్రం గెలిచినా ఓడినా నీ మనసంతా ప్రజల కోసమే దిగులు పడుతున్నట్టు పైకి కనిపించాలి. కాబట్టి లోలోపల నీ మనసు భగభగలాడిపోతున్నా, పైకి మాత్రం వినయంగా మొహంపెట్టి ప్రజల తీర్పును గౌరవిస్తున్నట్టు సెలవీయాలి. అసలింతగా జనం నువ్వంటే కుతకుతలాడిపోతున్నట్టు ఫలితాలనుబట్టి తెలిసినా, నువ్వు మాత్రం మెత్తగా మాట్లాడుతూ ప్రజల వ్యతిరేకతను ముందుగా గమనించలేకపోయామని నమ్రత చూపించాలి. నిజానికి వినయం, నమ్రత నీ ఒంటికి సరిపడవనుకో... కానీ అవన్నీ నీలో ఉన్నట్టు సాధ్యమైనంత భ్రమ కల్పించడానికి ఎక్కడలేని కృషీ చేయాలి. అర్థమైందా?'

'బాగా తెలిసిందండి. ఇక మీదట నేనేం చేయాలో కూడా సెలవిద్దురూ'

'ఇక నీకెలాగూ చేయడానికి ఏమీ లేదు కాబట్టి, గెలిచినోడు ఏం చేసినా అందులో తప్పు పట్టాలి. మంచి చేసినా అందులో చెడు వెతకాలి. ఆడు ఏం మాట్లాడినా దానికి లేనిపోని దురుద్దేశాలు అంటగట్టాలి. ఏ పథకం పెట్టినా బొక్కలెతకాలి. లేనిపోని లెక్కలు, నిజాలు తీసి మసి పూసి మారేడుకాయ చేసి ఏకడానికి ఎలాంటి వీలు దొరుకుతుందా అని ఎదురు చూస్తున్నట్టు రెచ్చిపోవాలి... తెలిసిందా?'

'బ్రహ్మాండంగానండి. కానీ గురూగారూ, జనం నమ్ముతారంటారా?'

'ఓరెర్రోడా... నిన్ను జనం నమ్మితే ఓడేవోడివే కాదు కదరా, ఆ సంగతి నీకేల? ప్రస్తుతం నువ్వున్న పరిస్థితుల్లో ఇంతకు మించి చేయడానికేం లేదు మరి'

'అర్థమైంది గురూగారూ! ఇక రెచ్చిపోతా చూడండి'

PUBLISHED IN EENADU ON 27/06/2014

మంగళవారం, జూన్ 17, 2014

ఇలాగైతే కష్టమే!



'ఎంత దారుణం?'
'వట్టి దారుణమా, మహా ఘోరం!'

'ఎన్నడైనా కనీవినీ ఎరుగుదుమా?'

'పిదప కాలం... పిదప బుద్ధులూను'

'అసలివన్నీ బాగుపడే లక్షణాలేనా అని!'

'ఒంటిమీద స్పృహ ఉండే మాట్లాడుతున్నారా?'

'అబ్బే, ఏదో సంధికాలం మాటల్లా ఉన్నాయి'

- ఆ హాలులో సమావేశమైన అందరూ తలో మాటా అంటున్నారు. అందరి ముఖాల్లోనూ విషాదం తాండవిస్తోంది. ఒకడు నెత్తిన చెంగేసుకుని కూర్చుంటే, మరొకడు ముక్కుకు తువ్వాలు అడ్డుపెట్టుకుని విచారంగా ఉన్నాడు. వాళ్లందరి నిట్టూర్పులతో గది నిండిపోయింది. ఇంతలో ఒకడు కిటికీ తలుపు తీశాడు. బయట పచ్చని మొక్కల నుంచి రివ్వుమంటూ చల్లని గాలి చొచ్చుకొచ్చింది. నులివెచ్చని సూర్యకిరణాలతో గది నిండిపోయింది.

'ఆ తలుపేసేయవయ్యా. తాజా గాలి వచ్చేస్తుంది. కాలుష్యం తప్ప పీల్చుకోగలమా మనం?' అని ఓ పెద్దాయన కేకలేశాడు.

'మరే... మరే... మర్చిపోయాస్మండీ. సువాసనలు, తూరుపు వెలుతురు మన ఒంటికి సరిపోవు కదా?' అని నాలుక్కరుచుకుంటూ వాడు తలుపు మూసేశాడు.

'ఛ...ఛ... అలగా జనాన్ని అందలం ఎక్కిస్తే ఇదిగో... ఇలాగే ఏడుస్తుంది. ఎక్కడో టీ అమ్ముకునేవాణ్ని, రైలు బోగీలు తుడుచుకునేవాణ్ని, దేశదిమ్మరిని తీసుకొచ్చి అధికార పీఠం మీద కూర్చోబెడితే ఇదే ప్రమాదం'

'కాదా మరి? ఆ పాటికి ఆయనొక్కడే రాజకీయాల్ని ప్రక్షాళన చేసెయ్యడానికి వచ్చినట్టు ఏమిటండీ ఆ మాటలు? వింటుంటే ఒళ్లంతా కంపరం ఎక్కిపోతోంది. మంత్రులందరూ ఏటా ఆస్తుల్ని ప్రకటించాలట? మంత్రుల బంధువులెవరికీ వ్యాపారాలు ఉండకూడదట. అయినవాళ్లెవరూ ప్రభుత్వ ఆస్తులు పొందకూడదట. ఏమిటండీ ఈ నిబంధనలు? ఇహ... ఆ పాటికి మంత్రి పదవులెందుకంట? నాలుక గీసుకోవడానికి కూడా పనికొస్తాయా అని? ఇలాటి పద్ధతులతో రాజకీయాల్ని భ్రష్టుపట్టిస్తే రాబోయే కాలంలో మనలాంటి నీచ నేతలు ఎలా బతకాలి చెప్పండి?'

'ఏమండీ మీరు చెప్పండి! ఇలాంటి సూత్రాలు కానీ పాటించి ఉంటే మీరు ఇన్నేసి కోట్లు సంపాదించేవారా అని? మూడు నాలుగేళ్లలో మీ బంధుజనమంతా ప్రభుత్వ భూముల్ని ఎకరాలకు ఎకరాలు గుత్తకు తీసుకోలేదాండీ? అహ... మీ చుట్టాల్లో, అయినవారిలో, దూరపు బంధువుల్లో ఒక్కరంటే ఒక్కరు అణగారి ఉన్నారా? అసలు మీరెంత దోచారో తేల్చుకోవడానికి ఈ దర్యాప్తు సంఘాలకు ఎన్ని ఏళ్లు పడుతుందో ఎవరైనా లెక్క చెప్పగలరాంట? ఇప్పుడు వీరొచ్చి పెడ పాలనకు పగ్గాలు వేస్తానంటారా? ఈయన తినడు... మరొకర్ని తిననివ్వడు. ఇదేం సిద్ధాంతమంట?'

'బాగా చెప్పారు. అధికారం అంటే ఏంటండీ అసలు? మన చుట్టూ ఉన్నవాళ్లకు ఇంత తినిపించి, మనం అంతకంత భోంచేయాలి కానీ- నోరు కట్టేసుకోండంటే ఎలా? ఈ లెక్కన మనం తిండి, తిప్పలు లేకుండా ప్రజాసేవ చేయాలన్నమాట. పోనీ చేసినా మాత్రం పదవులు శాశ్వతం అంటారా? ఇవాళ పవర్‌లో ఉంటే, రేపు పవర్‌కట్‌లో పడతాం. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ఇంగితమైనా ఏడ్చిందా అని!'

'అది సరేనండీ బాబూ... సంపన్నుల కోసం కాకుండా పేదల కోసం నేతలంతా పనిచేయాలట! పేదల్ని, పేదరికాన్ని నిర్మూలించేస్తే ఇక ఎవరికి చేస్తాడట ఈయన సేవ? పేదల కోసం పని చేయాలంటున్నాడు కదా, మరి అలా చేయడానికైనా పేదలు మిగిలి ఉండాలా అక్కర్లేదా చెప్పమనండి. పేదజనాన్ని అలా చెప్పుకింద తేలులా తొక్కిపెట్టి ఉంచకపోతే- రేప్పొద్దున్న ఎవరి కోసం పథకాలు పెడతాం? ప్రజాధనాన్ని దోచుకోవాలంటే పథకాలు ఉండాలా అక్కర్లేదా? మరి ఆ పథకాలు పెట్టాలంటే పేదలు లేకపోతే ఎలా? ఇలా అధికారాన్నంతా ఉపయోగించేసి ఈయనగారు దేశంలో పేదలనేవాళ్లు లేకుండా చేసేస్తాడేమోనని తెగ భయంగా ఉంది... ఓ రాత్రి వేళ దేశమంతా అభివృద్ధి సాధించేసినట్టు, పేదలు రైతులు సామాన్యులు కళకళలాడుతూ తిరుగుతున్నట్టు పీడకలలు వచ్చేస్తున్నాయండీ బాబూ. ఇక నిద్రపడితే ఒట్టు!'

'అసలు దేశంలోనే కుంభకోణాలు లేకుండా చేద్దామంటాడే. ఇదెక్కడి కోణమండీ? అసలు ఏ కోణంలో ఆలోచిస్తున్నాడో అర్థం కాకుండా ఉంది. అవినీతికి ఆస్కారం లేకపోతే, సంపాదనకు వీలు కాకపోతే, బంధుజనాన్ని ఉద్ధరించలేకపోతే, మన భావి తరాలను తిని కూర్చోగలిగేలా చేయలేకపోతే, నల్లధనాన్ని విదేశాలు దాటించలేకపోతే, చట్టాలతో ఆడుకుని చుట్టాలకు మేలు చేయలేకపోతే... ఇక ఈ రాజకీయాలెందుకంట, అధికారం ఎందుకంట? హాయిగా ఏ హిమాలయాల్లోకో పోయి ముక్కు మూసుకుని తపస్సు చేసుకుంటే సరి!'

-ఇలా అందరూ తలో రకంగా తమ కసిని, ద్వేషాన్ని, కోపాన్ని వెలిగక్కుతుంటే ఓ పెద్దాయన లేచాడు.

'ఒరేయ్‌... ఆగండ్రా. మనలో మనం మనసు విప్పి మాట్లాడుకోవాలంటే- మనమంతా నీచాతి నీచులం! ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి దాన్ని అడ్డంపెట్టుకుని అవినీతి అక్రమాలకు పాల్పడినవాళ్లం. కానీ, మనందరం ఒక విషయంలో మాత్రం ఉమ్మడిగా విఫలమయ్యాం. ఇంతమందిమి ఉన్నాం, ఎందుకు? ఒక్కరంటే ఒక్కరం ప్రజాచైతన్యాన్ని గమనించలేకపోయాం. అదేగనుక సకాలంలో తెలుసుకుని ఉంటే కొన్నాళ్లు మేత మానేసైనా జాతి సంగతి ఆలోచించి తిరిగి మభ్యపెట్టే ప్రయత్నాలు చేసేవాళ్లం. చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏం లాభం? ప్రజల చేతిలో ఓడిపోయి దిగాలు పడ్డాం. ఇక జరగాల్సింది ఏమిటో గ్రహించండి. మనం చేసిన నికృష్ట పనులే అవినీతి కేసులై మనల్ని చుట్టుకోబోతున్నాయి. అవి మనల్ని కాటేయకముందే మనం దోచుకున్నదంతా ఏం చేయాలో ఆలోచించండి. అది మానేసి మోడీనో, బాబునో తిట్టుకుంటూ కూర్చుంటే ఒరిగేదేముంటుంది? కాబట్టి ఎవరి జాగ్రత్తలు వారు తీసుకోండి. ఇక పొండి!'

PUBLISHED IN EENADU ON 17/06/2014

సోమవారం, మే 19, 2014

నవ రాగాలు


ఎన్నికల ఫలితాలు వచ్చిన సంబరంలో యువతీ యువకులు కేరింతలు కొడుతూ ఒక చోట చేరారు. ఓటు హక్కు వినియోగించుకుని, అవినీతికి వ్యతిరేకంగా నవతరం తీర్పునిచ్చి ఆ ఫలితాలను ఆస్వాదిస్తున్న వాళ్లంతా సంబరాలు చేసుకుంటున్నారు.
'ఇప్పుడు అందరం సరదాగా తలా ఒక పాట పాడాలి...' అన్నాడో సరదాల కుర్రాడు.

'అయితే ఓ షరతు. అన్నీ పేరడీ పాటలే పాడాలి...' అందో కిలకిలల కన్నెపిల్ల. అందరూ సరేనంటే సరేననుకున్నారు.

ఆ రాగాల సరాగాలు ఇలా సాగాయి.

* * *

'ఎందుకొచ్చిన ఎన్నిక

ఓ అవినీతి బాలకా!

గెలవడమంటే తేలికా?

జైలుకి పదమ్మా చాలిక!'

అన్నాడో తుంటరి. అంతా కిసుక్కున నవ్వారు.

తరవాత వంతు అందుకున్నాడొక యువకుడు

'కారులో కటకటాలకెళ్లే

కరుకు బుగ్గల కటికవాడా!

కొల్లగొట్టిన కోట్ల సొమ్ము

ఎలా వచ్చెనో చెప్పగలవా?' అంటూ నవ్వేశాడు. ఇంతలో పక్కనున్నవాడు అందుకుని

'కడుపు కాలే కష్టజీవులు

కూలికెళ్లి పన్నులు కడితే...

వాళ్ల సొత్తును అక్రమంగా

మింగినావు తెలుసుకో!'

అందరూ చప్పట్లు కొట్టారు.

ఒకమ్మాయి గొంతు సవరించుకుంది-

'అండా దండా ఉంటాడని

మీ నాన్న మాటకు అండనిస్తే

గుండె లేని మనిషల్లే...

కొండా కోనలు కాటేశాడా?

అప్పనంగా... దోచి...

మహ గొప్పలు నీవు చెప్పుకొంటే

వస్తుందమ్మా ఒక రోజు...

అక్రమాలకు జైలు ఆ రోజు!' అంది రాగయుక్తంగా. కుర్రాళ్లంతా వంత పాడుతూ కేరింతలు కొట్టారు.

మరో అమ్మాయి లేచి సన్నని గొంతుకతో ఇలా పాడింది

'ఇది కుట్రల కాలమనీ... తప్పుల తరుణమనీ

తొందరపడి ఓ కాకిపిల్ల ముందే కూసింది...

విందులు చేసింది

ఇక కసిరే కేసులు కాల్చునని

మరి ముసిరే తప్పులు తరుమునని

ఎరుగని కాకిపిల్ల ఎగిరింది

విరిగిన రెక్కల ఒరిగింది

నేలకు కూలింది...' అనగానే నవ్వులు మిన్నంటాయి.

ఇంతలో ఓ బండకళ్లద్దాల బుల్లోడొకడు లేచాడు

'బాబూ వినరా

తండ్రీ కొడుకుల కథ ఒకటి

కలతలు ఉన్న కమ్మని సీమలో

సాగించారు కుతంత్రాల కాపురం...' అనగానే అందరూ ఫకాలుమని నవ్వారు.

ఇంతలో ఓ అమ్మాయి లేచి నిలబడి స్టెప్పులు వేస్తూ మొదలెట్టిందో పాట

'డిఫెక్ట్‌గాడే బలే డిఫెక్ట్‌గాడే...

కటకటాలకు కనెక్ట్‌ అయితే...

డిస్కనెక్ట్‌ కాడే...!' అనేసరికి పకపకలు మిన్నంటాయి.

మరో కుర్రాడు లేచి అందుకున్నాడు

'ఎవడు వాడు? ఎచటి వాడు?

ఇటు వచ్చిన కంత్రీగాడు...

ప్రజల ధనం జనుల ధనం

దోచుకునే దొంగవాడు

భూమి ధనం గనుల ధనం

కబళించే దుండగీడు

తగిన శాస్తి చేయరా... ఆ...ఆ...ఆ...

తరిమి తరిమి కొట్టరా' అంటూ పాడుతుంటే కుర్రాళ్లంతా కోరస్‌ పాడి రక్తి కట్టించారు.

ఇంతలో ఓ యువకుడు అలనాటి ఓ అందాల నటుడిని అనుకరిస్తూ ఓ చేత్తో కాలర్‌ పట్టుకుని మరో చేతి చూపుడు వేలు పైకెత్తి పాడసాగాడు...

'ఎవరి కోసం ఎవరి కోసం

ఈ దోపిడీ పర్వం? ఈ అవినీతి సర్వం?

ఎవరి కోసం... ఎవరి కోసం...

పథకాల భిక్ష నువ్వే పెట్టి

పేదల ఆశలు కొల్లగొట్టి

భూములన్ని చుట్టబెట్టి జనుల జెల్ల కొట్టావు

బతుకు నీకు ఇచ్చాము...

ఉతికి ఉతికి దోచావు...'

అనేసరికి అందరూ పగలబడి నవ్వసాగారు.

ఇంతలో ఓ పెద్దాయన అటుకేసి ముసిముసిగా నవ్వుతూ వచ్చారు. 'సరేలెండర్రా... పోయిన అవినీతి సంగతి వదిలేసి ఇప్పుడు వచ్చిన కొత్త శకం గురించి కూడా పాడండి మరి' అన్నారు.

యువతరమంతా ఒక చోట చేరి కోరస్‌గా అందుకున్నారు

'అదిగో నవలోకం... విరిసే మన కోసం' అంటూ పాడారు.

'ఉందిలే మంచి లోకం ముందుముందున

అందరూ సుఖపడాలి నందనందన' అంటూ కేరింతలు కొడుతూ ఆనందించారు!

PUBLISHED IN EENADU ON 19/05/2014

బుధవారం, మే 07, 2014

అదీ అసలు సంగతి!




'ఏంటయ్యా సెక్రట్రీ... బయటేంటి కోలాహలం?' 
'ఎక్కడెక్కడి నుంచో చాలామంది తమ దర్శనానికి వచ్చారండి' 
'ఎవరు వాళ్లు?' 
'అదే అడిగానండి. అందరూ తమ తమ వృత్తి వ్యాపారాలేమిటో చెప్పారండి' 
'ఏమని చెప్పారు?'
'వాళ్లలో కొందరు దొంగలండి. మరి కొందరు దోపిడిదారులండి. కొందరు హత్యలు కూడా చేసిన వాళ్లున్నారండి. ఇంకా అవినీతిపరులు, అక్రమ వ్యాపారులు, కోర్టు కేసుల్లో నిందితులు, బెయిల్‌ మీద ఉన్నవాళ్లు, లంచగొండులు అంటూ చెప్పుకొచ్చారండి' 
'ఏంటిట సంగతి?' 
'మిమ్మల్ని కలుస్తామంటే ఠాఠ్‌... వీల్లేదని కేకలేశానండి. మరి ఇట్లాంటి దగుల్బాజీలు వచ్చారంటే మీకెంత అప్రతిష్ఠ, ఎంత నామర్దా అనండి. అయితే వాళ్లు వినలేదండి. నువ్వెళ్లి మేమెవరో అయ్యగారికి చెప్పూ, ఆయనకు అర్థమవుతుందిలే... నువ్వెవడివో కొత్తోడిలా ఉన్నావని హాల్లో కూర్చుండిపోయారండి. మరి పోలీసుల్ని పిలిపించి బయటికి గెంటెయ్యమంటారా?' 
'భలేవాడివయ్యా సెక్రట్రీ! నీకింకా కొన్ని విషయాలు బోధపడినట్టు లేదు. వాళ్లంతా మనకు కావలసిన వాళ్లేలే. త్వరలో అధికారంలోకి రాబోతున్నామనే అభిప్రాయంతో పరాకు లేకుండా పేర్లు చెప్పుకొని పోదామని వచ్చుంటారు' 
'అయ్యా... ఇలాంటివాళ్లతో మీరు కలిసి మాట్లాడితే అంతగా బాగుండదేమోనండి. సెక్రట్రీగా నా బాధ్యత గుర్తొచ్చి చెబుతున్నాను. ఆనక మీ ఇష్టం' 
'ఓరోరి... వెర్రి సెక్రట్రీ! మనం ఎదిగిందే ఇలాంటివాళ్ల అండదండలతోరా! వాళ్లందరూ వేర్వేరుగా చేసిన పనులన్నీ మనం ఒక్కళ్లమే ఎడాపెడా చేసేసి ఈ దశకొచ్చాం కదా? పులకరించిపోయి పలకరించడానికి వచ్చుంటారు. పద మాట్లాడదాం. అన్నట్టు... వాళ్లందరికీ కూల్‌డ్రింకులు పంపించు'

* * *
'దండాలండయ్య. తమరు పెద్ద మనసు సేసుకుని తమ దర్శనం కలిగించడమే మా అందరి పున్నెమండి. ఈల్లంతా తమర్ని దగ్గరగా సూడాలని, కుదిరితే ఒక్కసారి తాకాలని తెగ సంబరపడిపోతుంటే నేనే దగ్గరుండి తీసుకొచ్చానండి' 
'మీ అభిమానం సరేకానీ, ఇలా అందరూ ఒకేసారి వచ్చేస్తే ఎలాగయ్యా? మీడియా చూ స్తే కోడై కూయదూ?' 
'ఆ... మీడియాదేముంది లెండయ్య. ఎన్నిసార్లు తమరి లీలల గురించి రాయలేదూ? అది కోడై కూస్తే తమరు సూత్తా వూరుకుంటారా? పామై బుసకొట్టడం లేదూ. పత్రికల్లో తమరి కుంభకోణాలు, అక్రమార్జనలు, అవినీతి లావాదేవీలు, లోపాయకారీ యవ్వారాలు, దోపిడిలు, హవాలా పనులు... ఇవన్నీ చూసినప్పుడల్లా మేమంతా ఉబ్బితబ్బిబ్బైపోతామండి. అందుకనే అందరం కూడబలుక్కుని బయల్దేరి వచ్చామండి. తమరు మా యందు దయుంచాలి' 
'సర్లెండయ్యా, అధికారం అందనీయండి. ఇక మనందరికీ స్వర్ణయుగమే. ప్రజాపథకాలు పెట్టి వాటికి లబ్దిదారులుగా అర్హుల్ని పక్కనపెట్టి మిమ్మల్నే ఎంపిక చేయిస్తా. ప్రాజెక్టులు మొదలుపెట్టి అసలైన టెండర్లను నిరాకరించి మీకే కాంట్రాక్టులు ఇప్పిస్తా. మీరే పనీ చేయకపోయినా అంచనాలు పెంచేసి బిల్లులు పాస్‌ చేయిస్తా. పరిశ్రమలకని చెప్పి రైతుల నుంచి భూములు వూడలాక్కుని మీకే ఇప్పిస్తా. ఎంచక్కా రియల్‌ఎస్టేటు వ్యాపారం చేసుకుందురు గాని. ఇలా చిన్న చితక పనుల నుంచి పెద్ద పెద్ద గనుల దాకా అందరం కలిసి దోచుకుందాం. సరేనా? ఇక పోయిరండి...' 
'దండాలయ్య... ఇక ఉంటామండి'
* * *
'ఏం సెక్రట్రీ, ఇప్పుడర్థమైందా మన సంగతేంటో?' 
'అబ్బో... అద్భుతంగానండి. ఇంతలేసి పెద్దమనుషులొస్తే గ్రహించుకోలేకపోయాను క్షమించండి' 
'పర్లేదు లేవయ్యా. ఇంతకీ ప్రచారం బాగా జరిగిందా? మన ఉపన్యాసాలెలా ఉన్నాయి? జనం ఏమనుకుంటున్నారో వాకబు చేశావా?' 
'ఎందుకు చేయనండి. అది నా బాధ్యతే కదండీ? తమరు అమాయక జనాన్ని బాగా నమ్మించారండి. మిమ్మల్ని విమర్శించినవారి పుట్టుపూర్వోత్తరాలు బయటికి లాగి విషయం ఉన్నా లేకున్నా వూదరగొట్టి ప్రజల్ని గందరగోళ పరచారండి. దోచుకుతిన్న కోట్లాది రూపాయల్ని పకడ్బందీగా వూర్ల వూర్లకీ చేరవేసి చాపకింద నీరులా పంచి పెట్టించారండి. మందు సీసాలు లోడ్లకు లోడ్లు తరలించి తెగ తాగించారండి. రకరకాల పథకాలు ప్రకటించి ప్రలోభాలకి, భ్రాంతులకి గురి చేశారండి. ఇక దొంగ ఓట్లకి, రిగ్గింగులకి, బూత్‌కాప్చరింగులకి ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేశారండి. ఇన్ని చేశాక ఇక తిరుగేముంటుందండీ?' 
'అయితే గెలుస్తామంటావ్‌?' 
'సార్‌... అక్కడే చిన్న సందేహమండి. తమరు కోప్పడనంటే చెబుతాను. మీరు చేసిన ప్రసంగాలే మిమ్మల్ని ఓడిస్తాయేమోనని నా భయమండి' 
'అదేం అపశకునమయ్యా, ఏమన్నాను నేను?' 
'ఏముందండీ? తమరు ప్రజల్ని నమ్మించే ఆవేశంలో అసలు సంగతి మర్చిపోయినట్టున్నారు. ప్రతీసభలో ఒకేరకమైన పిలుపునిచ్చారండి. అదే సందేహంగా ఉందండి' 
'చంపకుండా అదేంటో సెప్పవయ్యా...' 
'అదేసార్‌! నీతిపరులకే ఓటెయ్యమని, మేలు చేసేవారినే ఎన్నుకోవాలని, నిజాయతీ నేతలకే పట్టం కట్టాలని, సచ్ఛీలురనే గెలిపించాలని... పదే పదే చెప్పారండి. మరి జనమంతా మీ మాట వినేట్టయితే, ఆ లెక్కన ఓట్లన్నీ మీకు పడవు కదండి? తమరి చరిత్రను తమరే మరిచిపోయి ఇలా పిలుపిస్తే ఎలాగండి? అదొక్కటే నా బెంగండి. వెళ్లొస్తానండి!'

PUBLISHED IN EENADU ON 07.05.2014