బుధవారం, ఏప్రిల్ 02, 2014

గూడు వెనుక గూడుపుఠాణి!



'గూడు గూడనియేవు... 
గూడు నాదనియేవు... 
నీ గూడు ఏదిరా గురుడా! 
బొమ్మ లోపలి గాలి... 
తుస్సుమన్నాదంటే... 
మిగిలేది బొమికలే నరుడా!' 
- జనచైతన్యానంద స్వాముల వారు తత్వం పాడుతుంటే శిష్యుడు మౌనంగా వచ్చి కూర్చున్నాడు. పాట పూర్తవగానే 'సామాన్యుడి జీవిత లక్ష్యం ఓ గూడు ఏర్పాటు చేసుకోవడమే కదా స్వామీ! మరి మీ తత్వం వారికి బోధపడుతుందంటారా?' అని అడిగాడు.
'నేనీ తత్వాన్ని అందుకున్నది సామాన్యుల కోసం కాదు నాయనా! వారి ఆశల్ని ఆసరా చేసుకుని అడ్డంగా దోచుకుంటున్న అవినీతి నేతల్ని ఉద్దేశించి. సామాన్యుడి అవసరం, నాయకుల స్వార్థానికి బలవుతున్నప్పుడు మనలాంటి వాళ్లం ఒట్టి తత్వాలు పాడకూడదు నాయనా! వారిని చైతన్యవంతుల్ని చేయాలి. మన దేశాటన పరమార్థం అదే కదా?' అన్నారు స్వాములవారు.

'అర్థమైంది స్వామీ! ఇందాకా వూళ్లోకి వెళ్లినప్పుడు ఓ చిత్రమైన సంగతిని గమనించాను. అది చెబుదామనుకుని వచ్చి మీ తత్వంలో పడిపోయాను..'

'చెప్పు నాయనా!'

'అదేంటో స్వామీ ఈ వూరిలో చాలా చోట్ల మొండి గోడలతో మిగిలిపోయిన ఇళ్లు కనిపించాయి. వాటిలో పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి. పాపం.. ఈ వూరిలో చాలామంది సామాన్యులు ఓ గట్టి గూడు కట్టుకుందామని ఆశపడి, ఆర్థిక ఇబ్బందులతో మధ్యలోనే ఆపేసినట్టున్నారు. ఆ సంసారుల తాపత్రయం చూస్తే బాధ కలిగింది స్వామీ!'

'ఇలాంటి ఇళ్లు ఈ రాజ్యంలో చాలా ఉన్నాయి నాయనా! కానీ అవి అలా ఆగిపోడానికి కారణం ఆర్థిక ఇబ్బందులు కావు. పాలకుల నిర్లక్ష్యాదౌర్భాగ్యాలు! వారి నీచ రాజకీయాలు!'

'ఎంత దారుణం! ప్రజల గోడు పట్టని ఆ పాలకులు ఎవరు స్వామీ?'

జనచైతన్యానంద స్వాముల వారు తన జోలె లోంచి మాయాదర్పణం తీసి, శిష్యుడికిచ్చి చూడమన్నారు. శిష్యుడు చూస్తూ చెప్పసాగాడు..

'ఆశ్చర్యం స్వామీ! ఎవరో ఇళ్లు కడతామంటూ సభల్లో వూదరగొడుతున్నాడు. సామాన్యులు కాసులు గుమ్మరిస్తున్నారు. కానీ ఆ కాసుల్ని కొందరు నాయకులు కుంచాలతో కొలిచి తమ వారికి పంచుతున్నారు. సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు నిర్వేదంతో చూస్తున్నారు. మరి కొన్ని చోట్ల సామాన్యులను ఇళ్లలోంచి గెంటేసి ఎవరెవరో వాటిని ఆక్రమించుకుంటున్నారు. ఇదేమి అరాచకం స్వామీ?'

'ఈ రాజ్యంలో ఇంతవరకు యథేచ్ఛగా సాగిన నీచ రాజకీయం నాయనా! ఏవేవో స్వగృహ పథకాల పేరు చెప్పి కనీస ధరలకే ఇళ్లు కట్టించి ఇస్తామంటూ ప్రచారం చేసుకున్నారు నేతలు. ఆ మాటలు నమ్మి కోట్లాది రూపాయల్ని ప్రజలు చెల్లించారు. పాలకుల నిర్లక్ష్యం, పేరుకుపోయిన అవినీతి వల్ల ఆ సొమ్ములు స్వాహా అయిపోయాయి. కట్టిన ఇళ్లు నాసిరకంగా మిగిలాయి. ఇలా కేవలం ఒక పథకం వల్లనే దాదాపు 365 కోట్ల ప్రజాధనం అతీగతీ లేకుండా వ్యర్థమైందని నా దివ్యదృష్టికి గోచరిస్తోంది. ఇక బడుగులకు ఉచితంగా ఇళ్లిస్తామని వూరించి, ఆ వంకతో అధికంగా అయినవారికి కేటాయించుకున్నారు..'

'అయ్యయ్యో స్వామీ! ఈ అరాచక ప్రభుత్వ అకృత్యాలను అడిగేవారే లేరా?'

'అడిగినా ప్రయోజనం ఏముంటుంది నాయనా! అధికార మదంతో కళ్లు మూసుకుపోయిన ఓ అమాత్యవర్యుడు ఏమన్నాడో తెలుసా? ప్రభుత్వం తమది కాబట్టి ఇళ్లను తమ ఇష్టం వచ్చినవారికి ఇచ్చుకుంటామంటూ సాక్షాత్తూ రాజసభలోనే అహంకరించాడు..'

'ఔరా! ఇక ఈ ప్రజలు తమంత తాము తంటాలు పడాల్సిందేనా స్వామీ?'

'అందుకుగల అవకాశాలను అంతకంతకు భారం చేసింది నాయనా ఈ అరాచక ప్రభుత్వం. భూముల ధరలు, నిర్మాణానికి అవసరమయ్యే సామగ్రి ధరలు ఇవన్నీ ఈ నేతల నిర్వాకం వల్ల నాలుగు రెట్లు పెరిగిపోయాయి..'

'హతవిధీ! ఇంత చేసిన ఈ నేతలు ఇంకేం బాగు పడతారులెండి స్వామీ?'

'పిచ్చివాడా! నీ బుద్ధి హిమాలయాల్లో చలికి గడ్డకట్టుకుపోయినట్టుంది నాయనా! ఇలాంటి అయోమయ, అవకతవకల పాలనను అందించిన ఈ రాజ్యపు రాజావారి కుటుంబం మాత్రం కోట్లకు పడగలెత్తింది నాయనా! ఆ రాజుగారి కొడుకు వందేసి గదుల భవంతులను కట్టుకున్నాడు. పొరుగు రాజ్యానా కోటలు నిర్మించుకున్నాడు. రాజుగారి బంధుకోటి.. ఒకోటీ.. ఇంకోటీ.. మరింకోటీ.. అంటూ కోట్లు కొల్లగొట్టుకున్నారు నాయనా!'

'ఇప్పుడర్థమైంది స్వామీ! మీరు మొదట్లో ఆ తత్వం ఎవరిని ఉద్దేశించి పాడారో! నేను వెంటనే వూర్లోకి వెళ్లి సామాన్యులను కలసి ఈ రాజ్యంలో జరిగిన అక్రమాలను తెలియజేసి వారిని చైతన్యవంతుల్ని చేస్తాను. ఆశీర్వదించండి స్వామీ!'

'ప్రజాదరణ ప్రాప్తిరస్తు!'

PUBLISHED IN EENADU ON 02/04/2014

శనివారం, మార్చి 29, 2014

ప్రచారమా... మజాకా?




'నమస్కారం గురూగారూ!' 
'ఏంట్రోయ్‌! ధగధగలాడిపోతున్నావ్‌? ఇస్త్రీచేసిన ఖద్దరు చొక్కా వేశావ్‌. మొహాన పౌడర్‌ దట్టించావ్‌. మూతి కొసలు చెవులకు అంటుకునేలా నవ్వేస్తున్నావ్‌. ఏంటి సంగతి?' 
'మీకు తెలియనిదేముంది గురూగారూ! ఎన్నికల్లో నిలబడ్డా కదండీ? ప్రచారానికి ఏమైనా కిటుకులు చెబుతారేమోనని వచ్చానండి' 
'రాక రాక నా దగ్గరికే వచ్చావా? కానీ, నా సలహాలు నీకంతగా నచ్చవేమోరా!' 
'అమ్మమ్మ ఎంతమాట. తమరు రాజకీయ దురంధరులు. రాజకీయాలను కాచి వడపోసినవారు'
'ఆపరా ఆపు. కాచి వడపోసి కాఫీలా తాగేశాననలేదు. రాజకీయాలకు తొలిమెట్టయిన పొగడ్తలు బాగానే ఒంటపట్టాయి కానీ, అవన్నీ నా దగ్గర ప్రయోగించకు. సరే, అడిగావు కాబట్టి చెబుతున్నా వినుకో. ముందా చొక్కా తీసి, నలిపేసి, మళ్ళీ వేసుకో. దట్టించి కొట్టిన ఆ పౌడర్‌ తుడిచేసుకుని ఇన్ని నీళ్లచుక్కలు మొహాన కొట్టుకో. ఆ నవ్వులాపేసి, సాధ్యమైనంత ఏడుపు మొహం పెట్టుకో!' 
'అదేంటి గురూగారూ! అలా చెప్పారు?' 
'కాదేంట్రా మరి? చక్కగా ఇస్త్రీచేసిన వెయ్యి రూపాయల నోటులాగా ప్రజల దగ్గరికి వెళ్లావనుకో... ఏమనుకుంటారు? కిందటిసారి మనం ఓటేశాక మనిషిలో చాలా మార్పొచ్చిందీ, ఆడిమటుకు ఆడు సుఖాలు అనుభవించేత్తన్నాడూ, మన బతుకులు మాత్రం ఇట్టాగే పడి ఏడుస్తున్నాయీ అనుకోరా?'

'ఓహోహో, అర్థమైందండీ మీ మాటల్లో మర్మం. కానీ, నవ్వితే తప్పేంటండీ?' 
'మరి కాదా! ప్రజానీకం పుట్టెడు బాధల్లో ఉంటే- నీకు నవ్వెలా వస్తుందిరా? వాళ్ల బాధలు చూసి, కష్టాలు విని, మనసంతా తల్లిడిల్లిపోతున్నట్టు, ఇప్పటిదాకా ఏడ్చి ఏడ్చి ఇక తప్పక కళ్లు తుడుచుకుని ప్రచారానికి చక్కా వచ్చినట్టు, ప్రజలకు సేవచేసే అవకాశాన్ని మరోసారి ఇవ్వకపోతే ఇప్పటికిప్పుడే గుండె పగిలి ప్రాణం పోయేట్టు... నీ వాలకం కనిపించాలిరా! వాళ్లని ఓదారుస్తూ, నువ్వూ ఓదార్పు పొందుతున్నట్టు ఆకట్టుకోవాల్రా. రాజకీయాల్లోకి రాగానే సరిపోదురా, కిటుకులు లేకపోతే చుట్టూ ఉన్నవాళ్లని చూసి నేర్చుకో!'

'ఇంతలా నేర్చుకోవడానికి ఎవరున్నారండీ?' 
'నామినేషన్‌ వేసిన ఉత్సాహంలో బుర్ర మసకేసిపోయిందేంట్రా? రాష్ట్రంలో సుడిగాలిలా తిరిగేస్తున్న యువనేతను మర్చిపోయావా? దొరికిందే ఛాన్సుగా తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని భూములు, గనులు ఎవరెవరికో ధారాదత్తం చేయించి, ఆ లోపాయికారీ లావాదేవీల సాక్షిగా కోట్లు కొల్లగట్టి, కోటలు కట్టి కూడా జనం కోసం జావగారిపోతున్నట్టు, వాళ్ల కోసమే బతుకీడుస్తున్నట్టు, మనసేడుస్తున్నట్టు, తనువంతా తపించిపోతున్నట్టు కనిపించడంలే? అద్దిరా ప్రజల ముందుకెళ్లే జోరూ ఓట్లడిగే తీరూను. నేర్చుకోండ్రా... ఎప్పుడు బాగుపడతార్రా?'

'గురూగారూ! కోప్పడకండి. మీరు చెప్పినట్టే వేషం, భాష, హావభావాలూ మార్చేస్తా. ఇంకా ఏం చేయాలో కాస్త చెబుదురూ?' 
'నేను చెప్పడం కాదురా, నీ చేతే చెప్పిస్తా. ఉదాహరణకి నువ్వు ప్రచారంలో భాగంగా ఓ గుడిసెలోకి వెళ్లావనుకో. అక్కడొక ముసిలోడు సీవెండి బొచ్చెలో బువ్వ తింటున్నాడనుకో. అప్పుడేం చేస్తావు?'

'ఏముందండీ? ఆడు అన్నం తినేదాకా బయట అరుగుమీద చతికిలబడి, చేయి కడుక్కోవడానికి బయటకొచ్చినప్పుడు నమస్కారం చేసి ఓటడుగుతానండి' 
'మరదే, ఇవన్నీ ఎప్పటివో పాత పద్ధతులు. ఇప్పుడు కొత్త తరహాలొచ్చేశాయి. మొన్న పేపర్లో చదవలే? నువ్వు చటుక్కున చొరవ తీసుకుని గుడిసెలోకి జొరబడిపోయి ఆడు తింటున్న సీవెండి బొచ్చె చనువుగా తీసేసుకుని లోపలున్న కలో గంజో, అన్నం మెతుకులో తీసి ప్రేమగా నోట్లో పెట్టేయాలి. ఆడు ఆశ్చర్యపోయి నోరెళ్లబెడితే పక్కనున్న ఏ ఆవకాయ పిండో నంజుకో అన్నట్టు నాలిక్కి రాసేయాలి. ఆడికి పొలమారితే చటుక్కున బుర్రమీద తట్టి, గ్లాసులో నీళ్లు తీసి పట్టించేయాలి. ఈ పన్లన్నీ చేస్తూనే... 'ఈసారి గనక నాకే ఓటేస్తే ఇంతకంటే చాలా చేస్తా'నని చెప్పి ఒప్పించేయాలి. ఆడు తేరుకునేలోగా ముందుగానే ఏర్పాటు చేసుకున్న ఫొటోగ్రాఫరు క్లిక్కుమనిపించాడో లేదో చూసుకుని బయటకొచ్చేయాలి. తెలిసిందా?'

'అద్భుతం సార్‌! ఈ మాత్రం అందిస్తే ఇక ఆపై రెచ్చిపోతానండి. వీధి కుళాయి దగ్గర ఏ మహిళైనా నీళ్లు పట్టుకుంటుంటే చనువుగా వెళ్లి బిందె తీసి చంకకందిస్తానండి. ఇంకా వీలుంటే ఇంటి దాకా బిందె మోసుకెళ్లి దించి వస్తానండి. ఏ అక్కో ఎసట్లోకి బియ్యం తీసుకుని కనిపిస్తే చొరవగా వెళ్లి బెడ్డలేరుతానండి. ఏ తల్లయినా పిల్లాడికి మొహం కడుగుతూ కనిపిస్తే చటుక్కున నాలిక గీసేస్తానండి. ఏ పిల్లకో జడ వేస్తుంటే దువ్వెన తీసుకుని చిక్కులు తీసేస్తానండి...'

'వార్నీ! అల్లుకుపోవడంలో నీ తరవాతేరా. కానీ, జాగ్రత్తరేయ్‌. ఇక తరవాత ముఖ్యమైనవి హామీలురా. అవి సాధ్యమా, కాదా, వీలవుతాయా, లేదా అనే మీమాంసలు పక్కనపెట్టి ఎడాపెడా ఏది తోస్తే దాన్ని వాగెయ్యి. జనాల కాళ్లకి వేళ్లకి అడ్డంపడుతూ, ఇంటి వాకిట్లోనే ప్రభుత్వాన్ని నడిపేస్తానను, నీ సొమ్మేం పోయింది? ఎలాగోలా అధికారంలోకి రావడమే కదా నీ లక్ష్యం?'

'అవునండోయ్‌, ఇక చూస్కోండి ప్రచారంలో దున్నేస్తా'
'పోయిరా... శుభం!'

PUBLISHED IN EENADU ON 28.03.2014

మంగళవారం, మార్చి 11, 2014

టోకున టోపీ


'అయ్యా... కొంప మునిగిపోయింది. వార్త వినగానే సెలవు రద్దుచేసుకుని పరిగెత్తుకు వచ్చేశా. ఇప్పుడేం చేద్దామని సెలవు?'
'ఛ ఛ వూరుకో! అపశకునం మాటలు నువ్వూను. మన కొంప మునగడమేంటయ్యా?'

'అయ్యా... మనం కొంపలు ముంచేవాళ్లం, కూల్చేవాళ్లమని ఇన్నాళ్లూ తెగ సంబరపడిపోయేవాడినండి. ఇప్పుడు మన కొంపకే ఎసరు వచ్చినట్టుందని గాబరాగా ఉందండి'

'వూరికే నాన్చక విషయమేంటో చెప్పవయ్యా. ఏదో కొత్త సెక్రట్రీవి కదా, పనికింకా అలవాటు పడలేదని వూరుకుంటుంటే నన్నే కంగారు పెట్టేస్తున్నావు'

'అయ్యా... తమరిది నిబ్బరమో నిండా మునిగిన ధైర్యమో తెలియడం లేదండి. అమ్మో అమ్మో... ఒకటా రెండా- ఏకంగా ఎనిమిది వందల కోట్ల రూపాయల ఆస్తులు జప్తు చేయడమంటే మాటలేంటండి? ఈపాటికి తమరికి ఏ గుండెపోటో వచ్చేసుంటుందని, ఐసీయూలో చేరిపోయి ఉంటారని ఆదరాబాదరా పరిగెత్తుకు వస్తే, తమరేమో నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారు. నాకేమీ అర్థం కావడం లేదండయ్య!'

'వార్నీ, అదా నీ కంగారు? ముందు నిదానంగా కూర్చుని కాసిని మంచినీళ్లు తాగు. దుడుకు తగ్గాక దూకుడు పెంచుదువుగాని'

'ఏంటో, మీరెన్ని చెప్పినా మనసు కుదుటపడటం లేదండి. అన్నేసి వందల కోట్ల ఆస్తుల్ని జప్తు చేశారంటే... రేప్పొద్దున తమరి లావాదేవీలన్నీ ఏమవుతాయి? ఎలా తేరుకుంటాయనేదే దిగులండి'

'అదిగో మళ్ళీ గింగిరాలెత్తుతున్నావు. సర్లె, నువ్వు కొత్తోడివిలే కానీ- ఇది మనకొక లెక్క కాదయ్యా. మనం దిగమింగిన దాంట్లో ఇదెంత? సముద్రంలో కాకిరెట్టంత. గిన్నెడు పాయసంలో కిస్‌మిస్‌ పండంత. వందెకరాల జామ తోటలో ఓ లేత పిందంత. నీకో పట్టాన అర్థం కాదులే. అందుకే పనిలోకి చేరగానే మన చరిత్రంతా చదువుకోమని చెప్పింది. అదంతా తెలుసుకుని ఉంటే ఇంత గాబరా పడేవాడివి కాదు. ఇంకా నయం... నీకే గుండెపోటో వచ్చేసింది కాదు... వట్టి కంగారుగొడ్డులాగున్నావే?'

'అమ్మయ్య, ఇప్పటికి నా ప్రాణం కుదుట పడిందండి. నిజానికి తమరి చరిత్ర చదువుదామని పాత దస్త్రాలు తీశానండి. అమ్మో, ఎన్నెన్ని కుంభకోణాలు, ఎన్నెన్ని దారుణాలు, ఎన్నెన్ని అకృత్యాలు? అవన్నీ చదవాలంటే నా జీవితం సరిపోదనిపించిందండి. ఎలాగోలా ఉపోద్ఘాతాలైనా చదివి తమరి నిజస్వరూపాన్ని తెలుసుకోడానికి ప్రయత్నిస్తానండి. అయినా, నాకు తెలియక అడుగుతానండీ... అవడానికి ఇది పెద్ద దెబ్బే కదండి? ఇక తమరి పరువేం కాను, మరి ప్రజలకు మొహమెలా చూపిస్తారండీ? కాస్తయినా సిగ్గేయదూ?'

'హ హ హ్హ... పిచ్చోడా! ఆ సిగ్గు, పరువులాంటివి ఉండేడిస్తే అసలిలాంటి పనులు చేస్తామా చెప్పు? అవి వదిలేశాకే కదా, ఇవన్నీ మొదలెట్టింది? అయినా అట్టాంటివి మా ఇంటా వంటా లేవనుకో. అయినా ఇదీ మన మంచికేలే...'

'మంచికా, అదెలాగండి? ఏమిటో, మీరే కాదు, మీ మాటలూ ఓ పట్టాన మింగుడుపడటం లేదండి. ఆస్తులు జప్తుచేశారంటే, అక్రమాలు బయటపడ్డట్టే కదండీ, నిజాలు పట్టుబడ్డట్టే కదండీ? మరి ప్రజానీకానికి తమరి మీద నమ్మకం తగ్గిపోతుందేమోనని నా బెంగండి!'

'చూడు సెక్రట్రీ. జనం మీద నాకెలాంటి దిగులూ లేదయ్యా. వాళ్ల అమాయకత్వం మీద నాకంత నమ్మకం. వట్టి వెర్రిబాగులోళ్లనుకో. వాళ్ల కళ్లముందే మనం వెయ్యి రూపాయలు దోచేసుకుని జేబులో పెట్టేసుకున్నా, ఒక్క రూపాయి వాళ్ల మొహాన పడేస్తే సంబరపడిపోతారు. మొదట్నుంచీ మన సిద్ధాంతం అదే కదా? ఆ దార్లోనే మరి మనం ఎన్నో వేల కోట్ల రూపాయలు వెనకేశాం. చరిత్ర చదువుకో బాగుపడతావు'

'అవుననుకోండి. కానీ ఇలాంటి అవినీతి, అవకతవక, అకృత్య కార్యకలాపాల వల్ల మొత్తం వ్యవస్థ నాశనమైపోతుందని, చుట్టుతిరిగి ఈ అవినీతి వ్యవహారాలన్నీ కలిసి తమ జీవితాలనే అతలాకుతలం చేస్తాయని జనం తెలుసుకోలేరు... పాపం!'

'ఏందయ్యో, ప్రజానీకం మీద అంతేసి జాలి పడిపోతున్నావ్‌. జాగ్రత్త... ఆరోగ్యానికి అంత మంచిది కాదు. పది కాలాలపాటు పది కాసులు వెనకేసుకుంటూ అంతస్తు మీద అంతస్తులు పెంచుకోవాలంటే ఇట్టాంటి దరిద్రగొట్టు ఆలోచనల్ని దరి చేరనివ్వకూడదు. నాలాంటివాడి దగ్గర పనిచేయాలంటే నువ్వూ ఇవన్నీ నేర్చుకోవాలి మరి'

'సరేనండయ్య. కానీ, ఇప్పుడు ఆ జప్తు యవ్వారం నుంచి బయట పడేదెలాగో కాస్త చెబుదురూ'

'ఏముందయ్యా, మాటకు మాట అనడమే. మన జనాదరణ చూసి అధికార పార్టీకి దడ పట్టుకుందని, అందుకే ఇలా కక్షకట్టి సాధిస్తోందని, నోట్లో వేలు పెట్టినా కొరకడం రాని నాలాంటివాడిమీద లేనిపోని అభాండాలు వేసి కేసులపాలు చేస్తోందని వూదరగొట్టే ఏర్పాట్లు చూడు. వెర్రిజనం కాబోసనుకుని మన మీద సానుభూతి కురిపించేత్తారు. వారంతా కళ్లొత్తుకునేలా నమ్మించడానికి మన అనుచరవర్గాల్ని సభలెట్టి మైకుల్లో ఉపన్యాసాలు దంచమను. వూరూవాడా పోస్టర్లు అతికించి కరపత్రాలు పంచి నానా అల్లరీ చేయమను. అర్థమైందా?'

'ఆహా, అద్భుతం సార్‌! మీ సానుభూతి వేషాలు చూస్తుంటే రసానుభూతి కలుగుతోందండి. ఎవరైనా ఒకరికి ఒక టోపీ పెట్టగలరు. మీరు మాత్రం ప్రజలందరికీ ఒకే టోపీ వేయడంలో ఘనాఘనులు. తమరి దగ్గర పనిచేయడం నా పూర్వజన్మ సుకృతమంటే నమ్మండి'

'జాగ్రత్త... భక్తితో కళ్లుతిరిగేను. పడతావ్‌. పోయిరా!'

PUBLISHED IN EENADU ON 11/03/2014

శనివారం, ఫిబ్రవరి 22, 2014

మహా మాయగాళ్లు!


'అర్భక భద్ర' అవార్డుల ప్రదానోత్సవం...
ఓ హాలు ముందు పెద్ద పెద్ద అక్షరాలతో రాసిన ప్రచారపత్రం చూసి సామాన్యుడికి ఆసక్తి కలిగింది. ఉత్సాహంగా లోపలికి వెళ్లి కూర్చున్నాడు. వేదిక మీద ఒకాయన నల్లకోటు, నల్లటోపీ పెట్టుకుని అప్పుడే ఉపన్యాసం మొదలుపెట్టాడు.

'అందరికీ నమస్కారం. వీధుల్లో గారడీలు చేసేవారి నుంచి వేదికలపై మ్యాజిక్కులు చేసేవారి వరకు మా ఇంద్రజాలికులకు ఉన్న ప్రజాదరణ అందరికీ తెలిసిందే. రేపు ఇంద్రజాలికుల (మెజీషియన్ల) దినోత్సవం. మమ్మల్ని మించిన ఇంద్రజాల మహేంద్రజాలికులను సత్కరించుకోవాలనే సంకల్పం కలిగింది. వారు గారడీ, గజకర్ణ, గోకర్ణ, టక్కుటమార, ట్రిక్కుటెక్కుటెక్నిక్కుల హైటెక్కు విద్యల్లో ఆరితేరినవారు. వాళ్లందరికీ ఉచిత రీతిన బిరుదులిచ్చి గౌరవించాలనే ఈ సభ పెట్టాం...'

సామాన్యుడు తన పక్కనున్న వ్యక్తిని గోకి, 'ఇంతకూ ఎవరువాళ్లు?' అన్నాడు ఉత్కంఠతో.

'ఇంకెవరు, మన రాజకీయ నాయకులు' అన్నాడాయన.

'అదేంటి, వాళ్లు మ్యాజిక్కులు చేయడం ఏంటి?'

'భలేవాడివే. ప్రజల మనశ్శాంతిని, భద్రతలను, నిశ్చింతను, భవిష్యత్తుపై భరోసాను, ధీమాను, ధైర్యాన్ని ఉన్నపళంగా మాయం చేయడంలే? వాళ్లను మించిన మెజీషియన్లు ఎవరుంటారు?'

'నిజమే. మరి అర్భక భద్ర ఏంటి?'

'వీరి పాలనలో అర్భకుడు ఎప్పుడూ ఎదుగూబొదుగూ లేకుండా భద్రంగా ఉంటాడని...'

సామాన్యుడు సంబరంగా వేదికపైకి చూశాడు. అక్కడ ఉపన్యాసం కొనసాగుతోంది. '...నిత్య రాజకీయ సమస్యలతో సతమతమవుతున్న సామాన్యులకు ఒకింత వినోదం కలిగించడానికే ఈ ప్రయత్నం. మేం రాజకీయ నేతల స్వరూపాలను సూచనాత్మకంగా తెలిపే దృశ్యాలను ఇక్కడి తెరపై ఆవిష్కరిస్తాం. వాటినిబట్టి ఎవరికి ఏ బిరుదు ఇవ్వాలో సభికులే సూచించాలని కోరుతున్నాం' అన్నాడు.

అందరూ చప్పట్లు కొట్టారు. వేదికపై మెజీషియన్‌ 'అబ్రకదబ్ర' అనగానే తెరపై దృశ్యాలు ప్రత్యక్షమయ్యాయి.

ముందుగా ఓ పెద్ద చెయ్యి కనిపించింది. దాని వేళ్లకు దారాలు కట్టి ఉన్నాయి. ఆ దారాలకు ఒక బొమ్మ వేలాడుతోంది. తలపాగాతో, తెల్లటి గెడ్డంతో ఉన్న ఆ బొమ్మ, ఆ చెయ్యి ఆడించినట్టల్లా ఆడుతోంది. నేపథ్యంలో 'నోట మాట రాదు... నొసలు ముడుచుకోదు... చిరునవ్వు మాయదు... చిటపటలాడదు... చేష్టలుడిగిన బొమ్మ... చేతలుండని బొమ్మ... చెవిలోన పువ్వులు పెట్టునమ్మ...' అనే పాట వినిపించింది.

సభలోంచి ఒక వ్యక్తి నుంచుని, 'దేశంలోని అత్యున్నత పీఠంపై కూర్చుని మౌనంగా మహేంద్రజాలం చూపించిన నేత ఈయన. రిమోట్‌ కంట్రోలుతో నడిచే రోబో లాంటివాడు. ఈయన హయాములో జరిగిన కుంభకోణాల వల్ల వేలకోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయం మాయమైపోయింది. ఏం జరిగినా నిమ్మకు నీరెత్తినట్టు ఉండే ఈయనకు 'మహానత్త మాయక' అనే బిరుదు నప్పుతుంది' అన్నాడు. సభికులంతా అంగీకార సూచకంగా కరతాళధ్వనులు చేశారు.

వేదికపై మళ్ళీ 'అబ్రకదబ్ర' అనగానే తెరపై దృశ్యం మారింది. పచ్చగా కళకళలాడే ప్రాంతం కనువిందు చేస్తుండగానే ఉన్నట్టుండి అందులోని పంటపొలాలు మాయమయ్యాయి. భూములు, కొండలు 'హాం... ఫట్‌' అయిపోయాయి. నేపథ్యంలో 'ఎదురులేని కొడుకు... ఎన్నదగిన కొడుకు... నాన్న కుర్చీ కింద నంజుకున్న కొడుకు... కోట్లు కొల్లగొట్టి కులుకుతున్న కొడుకు... జైలుకెళ్లి జెల్లకొట్టిన కొడుకు...' అనే పాట వచ్చింది.

సభికుల్లోంచి ఒకతను లేచి, 'ఈయన సామాన్యుడా? గాలి, నీరు, భూమి, నింగి, నిప్పులను కూడా మటుమాయం చేసిన ఘనుడు. ఇతడికి 'పంచభూత వంచక మాంత్రిక' అనే బిరుదే సరైనది' అన్నాడు. అందరూ ఈలలు వేశారు.

వేదికపై దృశ్యం మారింది. ఓ యువకుడు ఏవేవో కాగితాలు చింపేస్తున్నాడు. ఉన్నట్టుండి 'నాన్సెస్‌' అని అరుస్తున్నాడు. ఓసారి గెడ్డంమాసి, మరోసారి దాన్ని నున్నగా గీసి అటూ ఇటూ నడిచేస్తున్నాడు. నేపథ్యంలో 'అందాల బుజ్జి బాలుడితడు... అమ్మ కొంగున వూయలూగునితడు... వారసత్వపు పాలపీకనెప్పుడూ నోట కరుచుకుని పీల్చుచుండునితడు...' అంటూ వినిపించింది.

సభికుడొకడు లేచి, 'ఇప్పుడిప్పుడే మేజిక్కులు నేర్చుకుంటున్నాడు. కానీ, ఏదీ సరిగా చేయలేకపోతున్నాడు. భవిష్యత్తులో గొప్ప ఇంద్రజాలికుడు కావాలనుకుంటున్నాడు. కాబట్టి, ఇతడికి 'నిరర్థక బాల మాయావి' బిరుదు ఇద్దాం' అన్నాడు.

ఇంతలో వేదిక మీదనుంచి భయంకర శబ్దాలతో దృశ్యం ప్రత్యక్షమైంది. తెరపై అంతా శూన్యం. ఆ శూన్యంలో ఉన్నట్టుండి పేలుళ్లు. ఎవరూ కనిపించకుండా మంత్రదండం తిరుగుతోంది. వెనక నుంచి, 'అధికారం మాయమమ్మా... న్యాయం ధర్మం మాయమమ్మా... సుఖం శాంతి మాయమమ్మా... దేశమంతా గందరగోళమమ్మా... సామాన్యుడు అతలాకుతలమమ్మా... అంతా నీ చలవమ్మా' అనే పాట కోరస్‌లో వినిపించింది.

ఇక ఉండబట్టలేని సామాన్యుడు లేచి నుంచున్నాడు. 'ఈమె సామాన్యురాలు కాదు. విదేశం నుంచి వచ్చిన ఈమె మ్యాజిక్కులు ఎవరికీ సాధ్యం కావు. కాబట్టి 'ప్రచ్ఛన్న పరిపాల భయంకర ఇంద్రజాలిక' అందాం' అన్నాడు. సభికులంతా లేచి నుంచుని మరీ కేరింతలు కొట్టారు!

PUBLISHED IN EENADU ON 22.02.2014

మంగళవారం, జనవరి 28, 2014

ఎన్నికల సరంజామా!



'గురూగారండీ... మరేం- ఎన్నికలొస్తున్నాయ్‌ కదండీ, బజార్లో సరంజామా కొనుక్కోవడానికి జాబితా రాసుకుని బయల్దేరానండి. ఇవి సరిపోతాయో లేదో కాస్త చెప్పరూ?' అంటూ ఓ పెద్ద సంచీ వూపుకొంటూ వచ్చాడు శిష్యుడు. 
గురూగారు వాడిని ఎగాదిగా చూసి, 'ముందు నీ జాబితా ఏంటో చెప్పు. దాన్నిబట్టి నీ బుద్ధేంటో, దాని లోతేంటో చెబుతా...' అన్నారు నిదానంగా.
'ఓ... మా ఆవిడను అడిగితే బోలెడు సరకులు చెప్పిందండి. మొదటగానేమో రెండు కిలోల మైదాపిండండి. ఆ తరవాత పురికొసలండి...' 
'మైదాపిండి, పురికొసలా? అవెందుకురా?'

'బలేవారే. మైదాపిండిని ఉడకబెట్టి పార్టీ జెండాల్ని పురికొసలకు అతికించడానికండి...'

'అబ్బో... మిగతా జాబితా కూడా చదివి ఏడు...'

'వెదురు బొంగులండి. ఎక్కడ పడితే అక్కడ పాతేసి జెండాలు కట్టడానికండి. ఆ తరవాతేమో పేడముద్దలండి...'

'పేడముద్దలా... అవెందుకు?'

'ఎదర పార్టీవాళ్ల జెండాల మీదకు విసరడానికండి. ఇంకానేమో వూరి చివర ఏట్లోంచి ఓ ట్యాంకుడు బురదండి. ప్రత్యర్థులపై బురద జల్లడానికండి. ఓ బస్తాడు బొగ్గులు, డజను చాటలండి. బొగ్గులు బాగా రాజేసి, ప్రతిపక్షంపై నిప్పులు చెరగడానికండి. అలాగే రెండు బస్తాల దుమ్ము, పారలండి. ఎగస్పార్టీ వాళ్లపై దుమ్మెత్తిపోయడానికండి. రెండు డ్రమ్ముల కిరసనాయిలు, నాలుగు డజన్ల అగ్గిపెట్టెలండి... ఉపన్యాసం ఇస్తూ వేరే పార్టీలపై మండిపడ్డానికి ఉంటాయని మా ఆవిడ చెప్పిందండి. అలాగే పోటీ నేతల మీద కారాలు, మిరియాలు నూరడానికి ఎండుమిర్చి, మిరియాలు, రోలు, పొత్రం ఇంకానేమో...'

ఆ సరికి గురువుగారికి కడుపులో తిప్పింది. 'ఆపరా బడుద్ధాయ్‌...' అంటూ ఒక్క అరుపు అరిచారు. 
శిష్యుడు డంగైపోయాడు.

'ఇన్నాళ్లూ నా దగ్గర రాజకీయాల్లో నేర్చుకున్నది ఇదేనట్రా బుద్ధి లేనోడా! ఎన్నికల సరంజామా గురించి భార్యల్ని అడుగుతార్రా ఎవరైనా? ముందా జాబితా చింపెయ్‌...'

శిష్యుడు వెంటనే చింపేసి, 'బుద్ధొచ్చిందండి. మరి ఎన్నికలకు ఎలా సిద్ధమవ్వాలో మీరే చెప్పండి గురూగారూ...' అన్నాడు.

గురువుగారు నిట్టూర్చి మొదలెట్టారు. 'ఓరి పిచ్చోడా... నేను చెప్పడం కాదురా. సమకాలీన రాజకీయాలను గమనించి నువ్వే తెలుసుకోవాలి. మొన్నటికి మొన్న మనదేశ యువరాజావారు ఎలాంటి ఉపన్యాసం దంచారో గుర్తు తెచ్చుకో. ఉదాహరణకు ఆయనేమన్నారు? మీ గిన్నెలో అన్నాన్నవుతా, ఆదుకునే అన్ననవుతా, నడిపించే సేనానవుతా, చేతిలో పుస్తకమవుతా... అనే ధోరణిలో రెచ్చిపోలేదూ? ఆ మాటల మతలబులు నేర్చుకోవాలి. తెలిసిందా?'

'ఓ... తెలిసిందండి. ఇంతకంటే బాగా చెబుతా వినండి. మీ టిఫిన్‌ తినే చెంచానవుతా. మీ ఇడ్లీలోకి చెట్నీనవుతా. మీ రోట్లో రోకలవుతా. మీ బకెట్లో చెంబునవుతా. మీ చొక్కాకు గుండీనవుతా. ఇలాగే కదండి...'

గురువుగారు పకపకా నవ్వారు. 'బాగా చెప్పావురా. ఆయన ఉపన్యాసం కంటే నీదే బాగుంది. ఆయన ఇంకా ఏమన్నారు? ప్రత్యర్థి పార్టీలు బట్టతలవాళ్లకు క్షవరం చేయించే బాపతని, మాటలు అమ్మేసే రకమని అన్నారు చూశావా? ఆ చాతుర్యం ఒంటపట్టించుకోవాలి...'

'చాలండి గురూగారూ! ఈ మాత్రం చెబితే రెచ్చిపోనూ. ఎగస్పార్టీవాళ్లు గుడ్డివాళ్లకు కళ్లజోళ్లు అమ్మే రకమని అనొచ్చండి. చెవిటివాళ్లకు రేడియోలు, మూగవాళ్లకు మైకులు, పొలాలు లేనివాళ్లకు నాగళ్లు, చొక్కాల్లేనోళ్లకు గుండీలు ఇస్తారని చెప్పేసేసి చాలా చెప్పొచ్చండి. అనడానికేముందండి... అయినా నాకు తెలియక అడుగుతానండీ, ఎగస్పార్టీవాళ్లు క్షవరం చేస్తారనడానికి ఇంకా ఏం మిగిల్చారండి వీళ్లు?'

'అబ్బో... అదరగొట్టావురా. నిజమే. మొత్తం క్షవరమంతా వాళ్లే చేశాక ఇంకేం మిగిలిందని? ఇక రాజమాత ఉపన్యాసం కూడా చదువుకో. అవినీతి మీద యుద్ధం చేయాలంటున్నారు. అసలు జరిగిన అవినీతంతా వాళ్ల హయాములోదే కద? లక్షల కోట్ల రూపాయల అక్రమాలు జరిగిన విషయాలేవీ గుర్తేలేనట్టు మాట్లాడారు చూశావా? అలాగే మనరాష్ట్రంలో యువనేత ఉపన్యాసాలు వింటున్నావుగా? స్వర్ణయుగం తెచ్చేస్తానంటున్నాడు... తండ్రిని అడ్డంపెట్టుకుని బంగారం లాంటి రాష్ట్రాన్ని దోచిన సంగతి దాచేసి! నువ్వు కూడా ఆ తెలివి కనబరచాలి...'

'అవునండి. మనం చేసిన అవకతవక, అక్రమాల పనుల గురించి ఎత్తకుండా, మళ్ళీ అధికారమిస్తే వాటినే తుదముట్టించేస్తామనొచ్చండి. అంతేకదండి'

'అద్గది. దార్లోకొచ్చావు. ఇప్పుడు రాసుకో, ఎన్నికలకు ఎలా సిద్ధం కావాలో. ఏమాత్రం సంకోచించకుండా ఎడాపెడా వాడేసుకోడానికి బోలెడన్ని అబద్ధాలు సిద్ధం చేసుకో. ఓడిపోతామనే భయం మనసులో ఉన్నా దాన్ని కప్పిపుచ్చుకొని మాట్లాడే నిబ్బరాన్ని, సిగ్గులేనితనాన్ని ఒంటపట్టించుకో. ప్రత్యర్థుల మీద రువ్వడానికి బోలెడు జోకులు, ఛలోక్తులు రాసుకుని ఉంచుకో. ఎగస్పార్టీవాళ్లకు అంటగట్టడానికి కులతత్వం, మతతత్వం, వేర్పాటువాదం, అవసరమైతే ప్రజల మధ్యే చిచ్చుపెట్టే నైపుణ్యం, అవినీతిపరులు జైల్లో ఉన్నా వారిని విడిపించి మరీ నాటకాలాడించే నేర్పరితనం, దొంగలతోనైనా దోస్తీకట్టే చాతుర్యం, అమలు చేసే ఉద్దేశం లేకపోయినా ఏకబిగిన చదవడానికి అర్థంపర్థం లేనివైనా సరే బోలెడు హామీలు రాసుకుని ఉంచుకో. ఇవన్నీ బజార్లో దొరికేవి కాదు కాబట్టి, ఆ సంచి అవతల పడేసి నీ బుర్రకు పదునుపెట్టుకో. అప్పుడిక నీదే గెలుపు. ఇక పోయిరా!'

PUBLISHED IN EENADU ON 28/01/2014