బుధవారం, జులై 25, 2018

రాజకీయ పరిష్వంగనం!

‘నమస్కారం గురూగారూ! ఉన్నపళంగా రమ్మని కబురంపించారు, ఏమైనా అర్జంటు పనాండీ?’


‘రారా... నువ్వొచ్చేలోగా హాలంతా పచార్లు చేస్తూనే ఉన్నాన్రా. మొత్తానికి వచ్చావ్‌...’
‘అయ్‌బాబోయ్‌! మీరు పచార్లు చేస్తూ మరీ ఎదురు చూశారంటే అదేదో గొప్ప పనే అయ్యుంటుందండి. చెప్పండి..’
‘అదేరా... ·ôÙడు కళ్లూ తెరిచి ఉండగా, ఓ కన్నును మాత్రమే నెమ్మదిగా మూసి తెరవడం నీకు వచ్చా రాదా అని కనుక్కుందామనీ...’
‘అదేంటి గురూగారూ! ఏదో కొంపలారిపోయే పననుకుంటే, ఇలా కన్నుకొట్టడం వచ్చా అని అడుగుతున్నారు?’
‘భలేవాడివిరా! ఇప్పుడదే సంచలనం అయిపోయిందిరా బాబూ... అదెంత గొప్ప విద్యో ఇప్పుడే టీవీ చూస్తుంటే అర్థమైంది. అందుకే మరి ఆదరాబాదరా కబురంపించాను. కాబట్టి నే చెప్పేదేంటంటే, నీకు కన్ను కొట్టడం వస్తే ఫర్వాలేదు. లేకపోతే ఎవర్నైనా కుర్రవెధవల దగ్గరకి పోయి ఎలా కన్నుకొట్టాలో నేర్చుకో...’
‘ఇప్పుడంత హడావుడిగా నేర్చుకోవడం ఎందుకండీ? కాస్త వివరంగా చెబుదూ?’
‘ఒరే... నువ్వు నా దగ్గర రాజకీయ పాఠాలు నేర్చుకోడానికి చేరావ్‌. నిన్ను సాధ్యమైనంత నీచ రాజకీయ వేత్తగా మార్చాలనేదే నా ధ్యేయం. ఆ ప్రయత్నంలో నువ్వు కూడా ఎంతో కొంత ఎదిగావు, కాదనను. కానీ ఇంకా రాటుదేలలేదురా. చుట్టూ జరుగుతున్న రాజకీయ తతంగాన్ని చూసుకోకుండా, నీ దారిన నువ్వు పోతున్నావు. అదే నా బాధ...’
‘అయ్యో బాధ పడకండి గురూగారూ! నన్నీ మాత్రమైనా మార్చింది మీరే. ఏదో కాలం కలిసిరాక ప్రతిపక్షంలో పడిపోయి, పక్షవాతం వచ్చినట్టు అయిపోయి, దిక్కుతోచక తిరుగుతున్నాను కానీ... మీ శిష్యుడిగా నా బాధ్యత మరువలేదండి. ఇంతకీ ఇప్పుడింత కంగారు ఎందుకు పడ్డారో తెలియజేయండి...’
‘అక్కడికే వస్తున్నానురా. మొన్న లోక్‌సభ ప్రత్యక్షప్రసారాలు టీవీలో వచ్చాయి చూశావా? అప్పుడు తెలిసిందిరా మనమెంత వెనకపడిపోయి ఉన్నామో. ఆ ప్రసారాల్లో కాంగ్రెస్ యువ‌నేత రాహుల్‌గాంధీ చేసింది చూశాక ఇక ఆగలేకపోయారా. ఇక నువ్వు ఏం చేస్తావో తెలియదు కానీ, వెంటనే కన్నుగీటడం నేర్చుకోవాల్సిందే...’
‘ఆ.. నేనూ చూశానండోయ్‌. ఆయనగారు ప్రధానమంత్రిని విమర్శిస్తూ ప్రసంగించి, ఆనక అకస్మాత్తుగా వెళ్లి ఆయన్ని అనూహ్యంగా కౌగలించేసుకున్నారండి. ఇదేంట్రా బాబూ... ఇలా చేశాడని నేను నోరెళ్ల‌బెట్టి చూసేంతలోగానే, చేతులూపుకుంటూ నడుచుకొచ్చేసి తన సీట్లో చతికిలబడ్డారండి. తర్వాత మొహం పక్కకు పెట్టి అదోరకంగా కన్నుగిలిగారండి. కానీ నాకు తెలియక అడుగుతాను గురూగారూ, కన్నుకొట్టడం అంత గొప్ప విద్యాండీ?’
‘ఓరి సన్నాసీ! అదే కదురా చెబుతుంట? కన్నుగీటడం పలురకములు. రోడ్డు మీద ఓ కుర్రాడు, ఓ అమ్మాయిని చూసి కన్నుగీటాడనుకో. వాడిని ఆకతాయంటాం. ఆ అమ్మాయి చెప్పు తీసి కొట్టచ్చు, లేదా పోలీసులకు చెబితే ఈవ్‌టీజింగ్ కింద‌ అరెస్టు కూడా చేయించొచ్చు. అది తుంటరి కన్నుగీత. మామూలుగా పనీపాటా లేని పోరంబోకులు, దగుల్బాజీలు చేసే పని అది. ఇక నువ్వు నీ స్నేహితుడి కేసి చూసి కన్ను కొట్టావనుకో. అది సరదా కన్నుగీత. నువ్వు ఎదుటివాడిని బుట్టలో వేయడానికో, లేదా ఉబ్బేయడానికో ఓ అబద్ధం ఆడి, ఆనక మరొకరి కేసి చూసి కన్ను చికిలించావనుకో. అది అతితెలివి కన్నుగీత...’
‘అబ్బో... కంటికొట్టుడులో ఇన్ని రకాలున్నాయా?’
‘ఇంకా ఉన్నాయిరా బడుద్దాయ్‌! ఒకోసారి ఈ కన్నుగీత నిన్ను రాత్రికి రాత్రి పెద్ద ప్రముఖుడిని చేసేయవచ్చు కూడా. ఆమధ్య ఓ మలయాళ నటి ఎవరో ఇలాగే చేసి, దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించలేదూ?’
‘అవునండి. ప్రియావారియర్‌ అంటారండి. ఏదో సినిమా కోసం కన్నుగీకిందండి. నేను కూడా చూశానండి. కానీ అది నటనలో భాగం కదా గురూగారూ? మరి మన యువనేత కన్నుగీకుడేంటండి?’
‘ఒరే... అది నటనైతే, ఇది మహా రాజకీయ నేత్ర విన్యాసంరా బాబూ. ఆయన కన్నార్పడం తన పక్కన కూర్చున్న వాడికే అయినా, నిజానికి అది దేశ ప్రజలందరికీ కొట్టినట్టేరా నాయనా. అంతకు ముందు ఆయనేం చేశాడో గుర్తుందా?’

‘ఎందుకు లేదండి? ప్రధానమంత్రిని నానా మాటలూ అని, ఎంచక్కా వెళ్లి కౌగలించుకున్నారండి. మరి పనిలో పనిగా ఆ కన్నుగీటడంతో పాటు, ఆ కౌగిలింతలు కూడా నేర్చుకోమంటారా?’ 
‘కొంచెం ఎదుగుతున్నావురా..సంతోషం. ఈ కౌగిలింతలు కూడా పలు రకములు. విదేశాల్లో పరిచయం అవ్వగానే కౌగలించుకుంటారు చూడు. అది మర్యాద కౌగిలింత. నువ్వేదయినా గొప్ప పని సాధించినప్పుడు... అహ... నువ్వేమీ సాధించలేదనుకో, కానీ అలాంటి సందర్భంలో నీ సన్నిహితులు కౌగలించుకుంటారు చూడు, అది ఆత్మీయ కౌగిలింత. ఇద్దరు కలిసి ఏ బ్యాడ్మింటనో లాంటి ఓ ఆట ఆడేశాక, ఎవరు •Þలిచినా సరే, మరొకర్ని కౌగలించుకుంటారే, అది క్రీడాస్ఫూర్తి కౌగిలింత. ఇక మనకిష్టం ఉన్న వాళ్లను వాటేసుకున్నామనుకో, అది అభిమాన కౌగిలింత. అర్థమవుతోందా?’
‘ఆహా.. గురూగారూ! ఏది ఏమైనా మీతో మాట్లాడ్డమే ఓ ఎడ్యుకేషనండీ... కౌగిలింతల్లో మర్మాలు ఎంతబాగా చెబుతున్నారండీ!’
‘ఓరే.. గిరీశంలాగా నన్ను ఉబ్బేయాలనుకోకు. నా దగ్గర నేర్చుకున్న పాఠాలు నా మీదే ప్రయోగించాలనుకోకు. ఇంకా చెబుతాను విను. ఆమధ్య ఓ హిందీ సినిమా వచ్చింది చూశావా? అందులో సంజయ్‌దత్‌ అనే కథానాయకుడు అందరికీ కౌగలించుకుంటూ ఉంటాడు, గుర్తొచ్చిందా?’
‘వచ్చిందండీ. మున్నాభాయ్‌ సినిమా అండి. అందులో నేల తుడిచే ముసిలాడిని, కోపంతో బాధ పడుతున్నవారిని వెళ్లి వాటేసుకుంటాండండి. ఆ సినిమాలో అది బాగా హిట్టయిందండి.. కానీ నాకు అర్థం కాక అడుగుతానండీ, ఆ మున్నాభాయ్‌ కౌగిలింతకి, ఈ పొలిటికల్‌ భాయ్‌ కౌగిలింతకి తేడా ఏంటండీ?’
‘ఆ సినిమాలోది మానవత్వాన్ని చూపించే చర్యరా బాబూ. ఇది అలాకాదు, మన యువనేత నేర్పుతున్న ఓ వింత, విచిత్ర విన్యాసం. నీ కొడుకును కౌగలించుకుని ఆనందించడాన్ని పుత్రగాఢ పరిష్వంగనం అంటారు. కానీ ఇలా ప్రతిపక్ష నాయకుడిని ముందు విమర్శించి, ఆనక తీరిగ్గా వెళ్లి వాటేసుకోడాన్ని రాజకీయ అతి చాతుర్య గాఢపరిష్వంగనం అనుకోవచ్చు...’
‘వార్నాయనో! పైకి ఏమీ తెలియని అమాయకుడిలాగా కనిపిస్తాడు కానీ ఈ యువనేత మహా గడుగ్గాయిలా ఉన్నాడండోయ్‌. ప్రియావారియర్‌ నుంచి, మున్నాభాయ్‌ నుంచీ ఈ విద్యలు నేర్చుకున్నాడంటారా?’
‘ఇది నేర్చుకుంటే వచ్చేది కాదురా. స్వయంగా, స్వభావ సిద్ధంగా పెరిగిపోయే లక్షణం. Ëదాన్నుంచి మనం ఏం నేర్చుకోవాలనేదే ముఖ్యం’
‘ఏం నేర్చుకోవచ్చంటారు గురూగారూ!’
‘ప్రజల్ని ఏమార్చే గొప్ప కనికట్టురా ఇది. అనేసిన మాటలు అనేసి, తర్వాత వెళ్లి మీద పడి పట్టేసుకున్నామనుకో, ఆహా.. ఎంతటి మంచి మనసు, ఎంతటి గొప్ప విశాల హృదయం, అనిపించదూ? అదన్నమాట కిటుకు. ఇక ఆ కన్నుగీకుడుంది చూశావూ? తన వాళ్లకి తానెందుకు అలా చేశానో చెప్పే నేత్రావధానం అన్నమాట. .తెలిసిందా?’
‘కానీ గురూగారూ! నాదో చిన్న సందేహం. ప్రజలు ఇలాంటి కిటుకుల్ని గమనించరంటారా?’
‘ఓరి పిచ్చి సన్నాసీ.ప్రజానీకం నాకన్నా, నీకన్నా, ఆ యువనేత కన్నా తెలివైన వాళ్లురా. వాళ్లు అందరినీ గమనిస్తూ ఉంటారు. అలా గమనించబట్టే మనం ఇలా వెనక బెంచీల్లో ఉన్నామన్న సంగతి తెలుసుకో ముందు. ప్రజలకి ఎప్పుడు ఎవరిని కౌగలించుకోవాలో, ఎవరికి కన్నుకొట్టాలో బాగా తెలుసు. అది మనకి అనవసరం. కొత్త విద్యలు ఎవరిలో కనిపించినా, ముందు నేర్చుకోవడమే మన పని. కాబట్టి వెళ్లి కన్నుకొట్టడం, కౌగిలించడం నేర్చుకుని వచ్చి కనబడు’.
-ఎ.వి.ఎన్‌.హెచ్‌.ఎస్‌.శర్మ

గురువారం, జనవరి 25, 2018

వైవిధ్యమైన నటనకు గీటురాళ్లెన్నో!



దర్పం, రాజసం ఉట్టిపడే 
ఓ అందాల రాజకుమారి... 
అందం, అమాయకత్వం ప్రతిబింబించే 
ఓ ప్రేయసి... 
చిలిపిదనం, చలాకీదనం కలగలిసిన 
ఓ పడుచుపిల్ల... 
హుందాతనం, గాంభీర్యం కనబరిచే ఓ ప్రౌఢ... 
నటి కృష్ణకుమారి నటజీవన ప్రస్థానంలో గుర్తుండిపోయే పాత్రలెన్నో! 
ఆమె అభినయ వైవిధ్యానికి గీటురాళ్లెన్నో!! 
పాత్ర ధరించినా ఆ పాత్రలో ఒదిగిపోవడం కృష్ణకుమారి నైపుణ్యం. ఎలాంటి నటనైనా అది ఆమెకే సాధ్యమనేలా మెప్పించడం ఆమెకు సుసాధ్యం. 
* తెలుగు చిత్రసీమకు రెండు కళ్లయిన   ఎన్‌.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు సరసన అసమాన అభినయాన్ని పండించి రాణిస్తూనే... కాంతారావుతో కలసి 28జానపద చిత్రాల్లో అభిమానులను అలరించారు. ఎన్టీఆర్‌తో దాదాపు 25 సినిమాలు, అక్కినేనితో సుమారు 18 చిత్రాలు చేసిన కృష్ణకుమారి వారితో దీటైన నటనతో ఆకట్టుకున్నారు. కాంతారావుతో ఎన్నో జానపద చిత్రాల్లో నటించారు. ‘బందిపోటు’, ‘అగ్గి   పిడుగు’, ‘లక్షాధికారి’, ‘నిండు సంసారం’, ‘వరకట్నం’, ‘కులగోత్రాలు’, ‘భార్యాభర్తలు’, ‘జ్వాలాద్వీప రహస్యం’, ‘గురువును మించిన శిష్యుడు’, ‘చిక్కడు దొరకడు’, ‘చదువుకున్న అమ్మాయిలు’ లాంటి సినిమాల్లో ఆమె నటన గుర్తుండిపోతుంది. ఆమె వైవిధ్యభరితమైన అభినయానికి వెండితెర ఆనవాళ్లు ఎన్నో... 

* అమ్మాయిల వెంటపడి తిరిగే ఓ సంపన్నుడు (అక్కినేని) తనను చులకనగా చూస్తే చెంప దెబ్బకొట్టిన ఆభిజాత్యం... అతడే పట్టుదల పట్టి తనను పెళ్లి చేసుకునే పరిస్థితుల్లో ఏమీ చేయలేని నిస్సహాయత... భర్తననే అధికారంతో అతడు తనను వశపరుచుకోవాలని చూసినప్పుడు నిబ్బరంగా తన అయిష్టతను వెలిబుచ్చే ధైర్యం... ఇవన్నీ ఒకే పాత్రలో ఆమె అభినయించిన తీరు ‘భార్యాభర్తలు’ సినిమాలో చిరస్మరణీయం. తనకిష్టంలేని వాడే పెళ్లిచూపులకు వచ్చినప్పుడు ‘ఏమని పాడెదనో ఈ వేళ... మానస వీణ మౌనముగా నిదురించిన  వేళ...’ పాటలో ఆమె నటన అద్భుతమనే చెప్పాలి. సినిమాలో ఒక సన్నివేశంలో  అక్కినేనితో ఆమె, ‘‘మనసు ప్రమేయం లేని ఈ దేహమేగా మీకు కావలసింది... అనుభవించండి’’ అంటూ శరీరాన్ని అప్పగిస్తున్నట్టుగా ముందుకొచ్చి నిలబడుతుంది. నటన మోతాదులో ఏ మాత్రం తేడా వచ్చినా  కరుణరసభరితమైన ఆ సన్నివేశం అభాసుపాలవుతుంది. అయితే కృష్ణకుమారి ఆ సన్నివేశాన్ని అద్వితీయంగా పండించారు. 

* తాను ప్రేమించింది ఓ సామాన్యమైన యువకుడిని (జగ్గయ్య)... కానీ అతడి స్నేహితుడు (ఎన్టీఆర్‌) తనను ఇష్టపడతాడు.ప్రియుడి త్యాగంతో అతడి స్నేహితుడికే ఇల్లాలవుతుంది... పెళ్లయ్యాక భర్తకు   అనుమానం మొదలవుతుంది... ఇలాంటి కథతో నడిచే ‘గుడిగంటలు’ సినిమాలో కత్తిమీద సాములాంటి పాత్రను కృష్ణకుమారి అలవోకగా మెప్పించారు. ఓ కన్నెపిల్లగా చలాకీతనాన్ని చూపినా... ప్రేమించినవాడితో పెళ్లికాని పరిస్థితుల్లో బేలతనాన్ని కనబరచినా... పెళ్లయ్యాక భర్త అనుమానిస్తున్నా నిశ్చలంగా తన పవిత్రతను నిరూపించుకునే హుందాతనాన్ని ప్రదర్శించినా కృష్ణకుమారికే చెల్లింది. 
* దేశాన్ని గడగడలాడిస్తున్న బందిపోటును పట్టుకోడానికి వెళ్లే ఓ ధీరోదాత్తురాలైన రాజకుమారిగా... ఆ బందిపోటే ప్రజారంజకుడని తెలిసి మనసిచ్చిన అమ్మాయిగా... ఆకట్టుకునే కృష్ణకుమారిని ‘బందిపోటు’ సినిమాలో చూస్తాం. 

* ఇంకా... కులం గోత్రం లేని పిల్లను పెళ్లాడావంటూ అత్తింటి వారు వెలివేస్తే వారి కోసమే పాటుపడుతూ... కులం కన్నా గుణం మిన్న అని నిరూపించి కుటుంబాన్ని కలిపే కోడలిగా ‘కులగోత్రాలు’ సినిమాలో ఆమె నటన మరుపురానిదే. అలాగే... పేదింటి పిల్లగా ఒకరిని ప్రేమించినా,   సంపన్నురాలైన తన స్నేహితురాలు కూడా అతడినే ప్రేమిస్తోందని తెలిసి మానసికంగా నలిగిపోయే పాత్రలో ‘చదువుకున్న అమ్మాయిలు’లో చక్కని నటన చూపించింది. అన్ని వ్యసనాలు ఉండి కూడా కపట వేషాలతో తనను ప్రేమించిన వాడిని తన అమాయకత్వంతో ఆకట్టుకుని అతడిని మంచి మార్గంలోకి మార్చిన అమ్మాయిగా ‘అంతస్తులు’ సినిమాలో అలరించింది. ఇక జానపద, పౌరాణిక చిత్రాల్లో కూడా పాత్రకు తగినట్టు ఒదిగిపోయి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు కృష్ణకుమారి.
PUBLISHED IN EENADU ON 25.01.2018

అందంగా... అమాయకంగా... అభినయంలో అపురూపంగా


‘‘చెడిపోవడమనేది మనిషి  మనసును బట్టి ఉంటుంది. నీ వ్యక్తిత్వం, నీ మనోబలం స్థిరంగా ఉంటే ఎక్కడున్నా చెడు జరగదు. నువ్వు సినిమాల్లో నటించడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు.  మిగతాది నీ విజ్ఞతకే వదిలేస్తున్నా’’
- ఇది ప్రముఖ నటి కృష్ణకుమారికి వాళ్ల నాన్నగారు రాసిన ఉత్తరం. సినిమాల్లో అవకాశాల గురించి ఆయనకు తెలియజేస్తూ కృష్ణ కుమారి 70 ఏళ్ల క్రితం రాసిన ఉత్తరానికి ప్రత్యుత్తరమిది. మంచి చెడుల వ్యత్యాసం గురించి చెబుతూనే తాను ఎంచుకున్న రంగంలో ప్రవేశానికి అనుమతిస్తూ ఆయనిచ్చిన ప్రోత్సాహం తెలుగు చలన చిత్రసీమకు ఓ అందాల తారను పరిచయం చేసింది. ఓ అసమాన నటి ముందడుగు వేయడానికి దోహదపడింది. అలా కృష్ణకుమారి 1951లో ‘నవ్వితే నవరత్నాలు’ సినిమాతో వెండితెరపై తొలి అవకాశాన్ని అందుకున్నారు. అయితే ఆ సినిమా కన్నా ముందు ‘మంత్రదండం’ విడుదలవడం విశేషం. అందంతో, అందుకు తగిన నాజూకు తనంతో, అమాయకత్వాన్ని ప్రతిబింబించే ముఖంతో వెండితెరపైకి అడుగుపెట్టిన కృష్ణకుమారి అలనాటి చిత్రాల్లో అప్పటి  యువకుల హృదయాలను కొల్లగొడుతూనే సహజమైన అభినయంతో ఆకట్టుకుంటూ తన సినీ ప్రస్థానాన్ని కొనసాగించారు. 
చిన్నతనంలోనే వేదాంతం జగన్నాథశర్మ వద్ద శాస్త్రీయ సంగీతం నేర్చుకున్న కృష్ణకుమారి, సినిమాల్లో ఎలాంటి పాటల్లోనైనా ఉత్సాహంగా నర్తిస్తూ ఆకట్టుకునేవారు. రెండున్నర దశాబ్దాల పాటు దాదాపు 150 చిత్రాల్లో నటించి వైవిధ్యమైన పాత్రలు పోషించిన కృష్ణకుమారి మూడుసార్లు జాతీయ అవార్డులను, రాష్ట్ర స్థాయిలో నంది అవార్డులు, కాంచనమాల, సావిత్రి, ఎన్టీఆర్‌ అవార్డులు, బ్రిటన్‌లోని బర్మింగ్‌హాం సంస్థ వారి జీవన సాఫల్య  అవార్డును... అన్నింటినీ మించి ప్రేక్షకుల హృదయాలలో చెరిగిపోని అభిమానాన్ని ఆర్జించుకున్నారు. అలనాటి అగ్రతారలైన ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌లతో పాటు కాంతారావు, హరనాథ్‌, జగ్గయ్య లాంటి మేటి నాయకుల సరసన నటించి ప్రేక్షకాదరణ పొందారు. 

సంప్రదాయ కుటుంబానికి చెందిన కృష్ణ    కుమారి, పశ్చిమ బెంగాల్‌లోని నౌహతిలో 1935లో పుట్టారు. ముగ్గురు అక్కచెల్లెళ్లలో ఆమె చిన్నవారు. ప్రముఖ నటి ‘షావుకారు జానకి’ ఆమె అక్కే. మరొక అక్క దేవకి కూడా ఒకటి రెండు సినిమాల్లో నటించినా ఆ తర్వాత చిన్నవయసులోనే చనిపోయారు. తండ్రి ఉద్యోగరీత్యా కృష్ణకుమారి పలు ప్రాంతాల్లో చదువుకున్నారు. రాజమండ్రి, చెన్నై, అస్సాం, కోల్‌కతాల్లో చదువుకుని మెట్రిక్‌ పూర్తయ్యేనాటికి చెన్నైకి చేరారు. అదే ఆమె నట జీవితానికి మలుపుగా మారింది. ఇంటర్‌లో చేరేలోగానే ఆమెను వెండితెర  అవకాశం ఆహ్వానించింది. ఓసారి ‘స్వప్న సుందరి’ సినిమాకు వెళ్లిన కృష్ణకుమారి,  తమిళనాడు టాకీస్‌ సౌందరరాజన్‌ కుమార్తె భూమాదేవి కంటపడ్డారు. సౌందరరాజన్‌ తీయాలని తలపెట్టిన ఓ సినిమాలో కథా  నాయికగా అమాయకంగా కనిపించే అమ్మాయి కోసం వెతుకుతున్న ఆమెకు కృష్ణకుమారిలో ఆ లక్షణాలన్నీ కనిపించాయి. అలా వచ్చిన అవకాశం గురించి చెబుతూనే కృష్ణకుమారి అప్పటికి కోల్‌కతాలో ఉంటున్న తండ్రికి ఉత్తరం రాయడం, ఆయన వెంటనే సరేననడం జరిగిపోయాయి. ఆ సినిమానే ‘నవ్వితే నవరత్నాలు’. తొలి చిత్రంలో నటిస్తుండగానే ఏకంగా 14 సినిమాల్లో అవకాశాలు వచ్చి   పడ్డాయి. అప్పటికి ఆమె వయసెంతనీ? కేవలం పదహారేళ్లు! 
సినిమాల్లో చురుగ్గా ఉన్న సమయంలోనే కృష్ణకుమారి, స్నేహితుల ద్వారా పరిచయమైన వ్యాపారవేత్త అజయ్‌ మోహన్‌ ఖైతాన్‌ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. వారి కుమార్తె దీపిక. పెళ్లయ్యేనాటికి కృష్ణకుమారి నటించిన ‘నిండు సంసారం’, ‘వరకట్నం’ సినిమాలు విజయవంతంగా ఆడుతున్నాయి. అవకాశాలు చేతినిండా ఉన్నా ఆమె గృహిణిగానే ఉండడానికి ఇష్టపడ్డారు. అయితే పెళ్లయిన రెండేళ్లకు భర్త ప్రోత్సాహంతో నటించడం మొదలు పెట్టి దాదాపు 50 సినిమాలు చేశారు.
PUBLISHED IN EENADU ON 25.01.2018

మంగళవారం, జూన్ 13, 2017

పాటలా... అవి కావు... నవ పారిజాతాలు! రసరమ్య గీతాలు!!


శివుడి శిరసు నుండి జాలువారిన గంగ...కొండకోనలదాటి... పంటసీమలు తడిపి...సామాన్యుడి కుండలో కొలువై దాహం తీర్చినట్టు...జ్ఞానపీఠ అవార్డు గ్రహీత అయిన సినారె కలం...సినిమా పాటలను సైతం సాహితీ సౌరభాలతో గుబాలించేట్టు చేసింది! 
సామాన్య ప్రేక్షకుడికి కూడా ఉన్నత సాహిత్య విలువలను పరిచయం చేసింది!అత్యుత్తమ భావజాలాన్ని అలతి పదాలతో అందించింది!
అందుకే సినారె...
‘సంగీత సాహిత్య సమలంకృతు’డయ్యాడు! ‘
లలిత కళారాధనలో ఒదిగే చిరుదివ్వెను నేను...’ అంటూనే వెండితెర సాహిత్యంలో సూర్యసమానుడయ్యాడు!! 
ఆయన పాటలు... నవపారిజాతాలు... రసరమ్య గీతాలు! 
సామాన్య ప్రేక్షక జన మనోరంజితాలు!!

సినిమా అంటేనే సామాన్య ప్రేక్షకుడిని ఆకట్టుకునేది. ఏది రాసినా, ఏది తీసినా చదువురాని వాడికి సైతం సులువుగా అర్థమయ్యేలా ఉంటేనే ప్రయోజనం నెరవేరుతుంది. ఇలాంటి రంగంలో కూడా డాక్టర్‌ సి. నారాయణ రెడ్డి రాసిన పాటలు సాహితీ గౌరవం పొంది అలరించాయి. అదే సమయంలో సామాన్యుడిని సైతం ఆకట్టుకున్నాయి. 
‘గులేబకావళి కథ’ సినిమాలో ‘నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని...’తో మొదలైన ఆయన సినీ సాహితీ ప్రస్థానం 3,500లకు పైగా గీతాలతో సుసంపన్నమైంది. ప్రేమగీతాలు రాసినా, జానపద గీతాలు రాసినా, భావగీతాలు రాసినా, విషాద గీతాలు రాసినా సినారె కలం తనదైన ముద్రతో ‘వెండి’తెరపై ‘బంగారు’ సంతకం చేసింది!

* అది...ప్రేయసీ ప్రియులు పాడుకునే యుగళగీతం. నటించేది ఎన్టీఆర్‌, జమున. 
తోటలో మాల కడుతూ ఎదురుచూస్తున్న ఆమె ఆలోచనలు ఎలా ఉంటాయి? 
‘తోటలో తొంగి చూసిన’ ఆ రాజు నవ్వులు ఆమెకెలా అనిపిస్తాయి?
‘నవ్వులా? అవి కావు... నవపారిజాతాలు...
రవ్వంత సడిలేని రసరమ్య గీతాలు...’లా కనిపిస్తాయిట!

మరి అంతటి ప్రేమను ఆమెలో చూసిన ఆ రాజు ఏం చేశాడు?
‘ఎలనాగ నయనాల కమలాలలో దాగి...
ఎదలోన కదిలే తుమ్మెద పాట...’ విన్నాడు!

‘ఆ పాట నాలో తియ్యగ మోగనీ... అనురాగ మధుధారలై సాగనీ...’ అన్నాడు!
‘ఏకవీర’ చిత్రంలో ‘తోటలో నా రాజు...’ పాట 
అటు రసజ్ఞులను, ఇటు సామాన్యులను కూడా ఒకేలా ఆకట్టుకుంది.

* మరో సందర్భం... అభిమాన ధనుడైన సుయోధనుడి మయసభ మందిర ప్రవేశం. 
దుర్యోధనుడి పాత్రలో ఎన్టీఆర్‌ ధీరగంభీరంగా నడుస్తూ వస్తుంటే ఆయనకు స్వాగతం పలికే సందర్భంలో సినారె కలం కూడా అంతే గంభీరంగా ముందుకు ఉరికింది.

‘శత సోదర సంసేవిత సదనా... అభిమానధనా... సుయోధనా...’ అంటూ స్వాగతం పలికింది. అంతటితో ఆగలేదు. సుదీర్ఘ సంస్కృత సమాసాలతో ఆ సందర్భాన్ని సుసంపన్నం చేసింది.

‘ధరణి పాల శిరోమకుట మణి తరుణ కిరణ పరిరంజిత చరణా...’ అని సంబోధించింది.
‘కదన రంగ బాహుదండ ధృత గదా ప్రకట పటు  సౌర్యాభరణా...’ అని మెచ్చుకుంది. 

‘శ్రీక్రిష్ణ పాండవీయం’ సినిమాలో ఇలాంటి పదాలతో సాగిన ఈ పాట కూడా నేల ప్రేక్షకుడి చేత ఈలలు వేయించింది.

* హీరో హీరోయన్‌తో కలసి విహార యాత్రకు వెళ్లే సందర్భంలో పాట రాయాల్సి వస్తే ఇంకెవరైనా అయితే శృంగార పరంగా రాస్తారు. కానీ సినారె ఆ సందర్భానికి తెలుగు సంస్కృతి వైభవానికి అద్దం పట్టేలా పాటను మలిచి అందరినీ ఆకట్టుకున్నారు. 

శోభన్‌బాబు నటించిన ‘విచిత్ర కుటుంబం’లోని 
‘ఆడవే జలకమ్ములాడవే... కలహంస లాగ... జలకన్య లాగ...’ అంటూ మొదలు పెట్టి...

‘ఆంధ్ర సంస్కృతికి తీయని క్షీరధారలై జీవకళలొల్కు గోదావరి తరంగాల...’లోను, 
‘కృష్ణవేణీ తరంగిణి జాలిగుండెయే సాగరమ్మై రూపు సవరించుకొను నీట...’
‘నాటి రాయల పేరు నేటికిని తలపోయు తుంగభద్రానదీ తోయ మాలికలందు...’ 

-సాహిత్యాన్ని జలకాలాడించారు! 
సినిమా పాట చేత పుణ్యస్నానాలు చేయించారు!!

* ఇలా ఎన్నెన్నో పాటలు ఆయన కవితాశక్తికి నిదర్శనంగా నిలుస్తాయి. 
‘కంచుకోట’లో ‘సరిలేరు నీకెవ్వరూ...’ పాట విన్నా, 
‘స్వాతి కిరణం’లో ‘శృతి నీవు, గతి నీవు, శరణాగతి నీవు భారతీ...’ పాటను తల్చుకున్నా, 
‘కళ్యాణి’ సినిమాలో ‘లలిత కళారాధనలో వెలిగే చిరుదివ్వెను నేను... మధుర భారతి పదసన్నిధిలో ఒదిగే తొలి పువ్వును నేను...’ పాట చూసినా... 
ఇలా ఒకటా రెండా ఏ పాటను గమనించినా... అవన్నీ 
చిత్రసీమలో ‘చిత్రం... భళారే విచిత్రం...’ అనిపించేవే. 
‘ఛాంగురే... భళారే... సినారె’ అనిపించేవే!!

PUBLISHED IN EENADU ON 13/06/2017


మంగళవారం, ఏప్రిల్ 25, 2017

కళా తపస్వి! అసమాన యశస్వి!!


ఆయన సినిమాల్లో...గజ్జెలు ఘల్లుమంటే... ప్రేక్షకుల గుండెలు ఝల్లుమంటాయి...అందెల రవళి వింటుంటే... అభిమానుల హృదయాలు అంబరాన్ని తాకుతాయి...అమృతగానాలు చెవినపడి.... అమితానందపు యెదసడిని కలిగిస్తాయి...సంగీత, నృత్యాలు కలగలిసి... సాగరసంగమాన్ని తలపిస్తాయి...ఈ గాలి, ఈ నేల, ఈ సినిమా తమదనిపిస్తాయి...ఆయన సినిమాలు చూస్తుంటే...సరస స్వర సుర ఝరీ గమనం గుర్తొస్తుంది...నాద వినోద నాట్య విలాసాలు మురిపిస్తాయి... సత్సంప్రదాయ సంగీత జ్యోతులు వెలుగులీనుతాయి...సుమధుర సాహితీ సౌరభాలు మైమరపిస్తాయి...ఆయన కె. విశ్వనాథ్‌. కళాతపస్వి విశ్వనాథ్‌! ఇప్పుడు ప్రతిష్ఠాత్మక దాదా సాహెబ్‌ అవార్డు గ్రహీతగా ఆయన వెండితెర కృషి తెలుగు చిత్రసీమకే ఓ తీపి గుర్తు! 
ఏ ఖజురహోలోనో, హాళీబేడులోనో, అజంతా ఎల్లోరా గుహల్లోనో శ్రద్ధగా చెక్కిన శిల్పాల్లాగా ఆయన సినిమాలు సినీ ప్రేక్షకుల కళ్లముందు కొలువుదీరాయి. విశ్వనాథ్‌ చిత్రాలన్నీ విలక్షణమైనవే అయినా వాటిలో శంకరాభరణం గురించి మొదటగా చెప్పుకోవాలి. ఇన్నేళ్ల తర్వాత కూడా ఆ సినిమాను చూస్తే మనవైన సంగీత, సాహిత్య, నృత్య కళలపై గౌరవం ఉప్పొంగి, గర్వం పెల్లుబుకుతుంది.
విశ్వనాథ్‌ అభిమానిగా తనను తాను చెప్పుకునే దర్శకుడు బాపు ఓ సందర్భంలో చెప్పిన ముచ్చట ఇక్కడ ప్రస్తావించుకోవాలి.
శంకరాభరణాన్ని చూడ్డానికి బాపు ఓ థియేటర్‌కి వెళ్లార్ట. విరామ సమయంలో ఇద్దరు స్కూలు పిల్లలు పరుగున వచ్చి ఆటోగ్రాఫ్‌ అడిగార్ట. పెన్ను లేదమ్మా అంటే ఓ అమ్మాయి కంపాస్‌ బాక్స్‌ తెరిచి అందులోని పెన్సిల్‌ ఇచ్చిందిట. బాపు సంతకాన్ని చూశాక ఓ అమ్మాయి ‘మీరు విశ్వనాథ్‌ కారా?’ అని అడిగింది. కాదని బాపు చెబితే, ఆ పిల్ల రెండో పిల్లతో, ‘ఆ కంపాస్‌ బాక్స్‌లో లబ్బర్‌ ఇలా ఇవ్వవే’ అంటూ వెళ్లిపోయిందట.
అదీ... అప్పట్లో శంకరాభరణం పిల్లలపై సైతం కలిగించిన ప్రభావం!
ఆ సినిమా వచ్చినప్పుడు అప్పటి యువతీ యువకులు ఆ సినిమాను పదే పదే చూడ్డం ఉత్తమాభిరుచికి నిదర్శనంగా భావించారు. హాలు నుంచి బయటకి వస్తూ ‘దీన్ని నేను చూడ్డం తొమ్మిదో సారి’ అనో పదో సారి అనో చెప్పడాన్ని గర్వంగా అనుకున్నారు. ఇక పెద్దలైతే ఆ సినిమా ఆడినంత కాలం వీలున్నప్పుడల్లా ఏదో గుడికి వెళ్లినంత పవిత్రంగా థియేటర్స్‌కి వెళ్లి పదేపదే చూశారు.
వ్యాపారాత్మక సూత్రాలను పట్టుకుని వేలాడే చాలా సినిమాల్లో ఉండే అంశాలు ఏమున్నాయని శంకరాభరణంలో?
హీరో స్టారా... కాదు!
హీరోయిన్‌ అందాల తారా... కాదు!
ఫైటింగులు అదిరిపోయాయా... అసలు లేనేలేవు!
ఓ వయసు మళ్లిన సంగీత కళాకారుడికి, ఓ నృత్య కళాకారిణికి ఏర్పడిన అనుబంధంతో అల్లుకున్న కథ...
పాటలు చూస్తే సంగీత కచేరీకి వెళ్లినట్టు ఉంటాయి...
నృత్యాలన్నీ ఏ కళాక్షేత్రంలోనో సంప్రదాయ ప్రదర్శనకు వెళ్లినట్టు అనిపిస్తాయి...
మరేముంది ఆ సినిమాలో?
ప్రేక్షకులను కట్టిపడేసే కథనం ఉంది!
కళాభిరుచిని తట్టిలేపే మాయాజాలం ఉంది!
పాశ్చాత్య సంగీత పెనుతుపాను తాకిడికి రెపరెపలాడిపోతున్న సత్సంప్రదాయ సంగీత జ్యోతిని చేతులడ్డి కాపాడుకోవాలనే సంకల్పాన్ని కలిగించే అద్భుతమైన దృశ్య పరంపర ఉంది.
అందుకే అది జాతీయ అవార్డును గెలుచుకోవడమే కాదు, ఫ్రాన్స్‌లో జరిగిన చలన చిత్రోత్సవంలో ప్రేక్షకుల ప్రత్యేక అవార్డును కూడా అందుకుంది! అన్నింటికన్నా తెలుగు సినీ అభిమానులు గర్వంగా చెప్పుకోగలిగే ఓ గొప్ప చిత్రంగా నిలిచిపోయింది!
కె. విశ్వనాథ్‌ తొలిసారి దర్శకుడిగా మారి తీసిన ‘ఆత్మగౌరవం’ సినిమాలోనే ఆయన ప్రతిభ ఏంటో తెలుస్తుంది. తొలి చిత్రంతోనే నంది అవార్డును అందుకున్న ఆ సినిమాను అక్కినేని, కాంచన, రాజశ్రీలతో రైతుకుటుంబం నేపథ్యంలో తీశారు. అందులో ‘అందెను నేడే అందని జాబిల్లి... నా అందాలన్నీ ఆతని వెన్నెలలే...’ అన్న పాటని, ‘రానని రాలేనని వూరక అంటావు... రావాలని ఆశ లేనిదే ఎందుకు వస్తావు?’ పాటని చూస్తే రొమాంటిజమ్‌ అంటే ఏమిటో అర్థం అవుతుంది. ఆ పాటల చిత్రీకరణ తీరు ఈనాటి యువతరానికి కూడా గిలిగింతలు పెడుతుంది.
ప్రేమికుల మధ్య ఉండే సున్నితమైన భావజాలాన్ని ప్రేక్షకుల హృదయాలకు చక్కిలిగింతలు పెట్టే రీతిలో చిత్రీకరించే ఒరవడి ఆయన ప్రతి సినిమాలోనూ కనిపిస్తుంది. సంగీత నృత్య భరితమైన శంకరాభరణంలో కూడా మరచెంబుతో ఆయన నడిపిన ప్రేమ రాయబారాలను ఎవరు మాత్రం మరిచిపోగలరు? ‘ఓ సీత కథ’లో ‘మల్లె కన్న తీయన మా సీత మనసు...’ పాటను గుర్తుకు తెచ్చుకోండి. బావామరదళ్ల మమకారం ఎంత సహజంగా తెరమీద ఒదిగిందో తెలుస్తుంది. ఒకరి మీద ఒకరికి కలిగీకలగని ఇష్టాన్ని, ఆ ఇష్టత వ్యక్తమయ్యే సున్నితమైన తీరుని అర్థం చేసుకోవాలనుకుంటే ‘సాగరసంగమం’లో ‘మౌనమేలనోయి... ఈ మరపురాని రేయి’ పాటను ఓసారి చూడండి. సరిగమలతో సైతం ప్రేమలేఖను పంపవచ్చనే సంగతిని ‘సప్తపది’ చెబుతుంది. ‘నగుమోము కనలేని నా బాధ తెలిసి... నను బ్రోవ రారాదా?’ అనే సంగీత కృతి స్వరకల్పనను కాగితంపై రాసి పంపితే ఏ ప్రేయసి పరిగెత్తుకుని సంకేత స్థలానికి రాకుండా ఉండగలుగుతుంది? ఇద్దరు కళాకారుల మధ్య అల్లుకున్న అనుబంధాన్ని చెప్పడానికి ఇంతకు మించిన ఉదాత్తమైన సన్నివేశం ఏముంటుంది? ఇంత చక్కని ఆలోచన ఎవరికి కలుగుతుంది, కళాతపస్వికి తప్ప! ఇలా చూస్తే ‘శుభలేఖ’లో ‘రాగాల పల్లికిలో కోయిలమ్మ...’ పాటను తల్చుకున్నా, ‘ఆపద్బాంధవుడు’లో ‘ఔరా.. అమ్మకచెల్ల.. ఆలకించి నమ్మడమెల్ల..’ పాటను చూసినా, ఇలా ఒకటేమిటి, విశ్వనాథ్‌ సినిమాల్లో సున్నితమైన భావజాలాన్ని, ప్రేమ చేసే ఇంద్రజాలాన్ని మనసుకు హత్తుకుపోయే రీతిలో చిత్రీకరించే తీరుకు మెచ్చుతునకలు అనేకం కనిపిస్తాయి.
ఇక ఆయన వెండితెరపై మలిచిన పాత్రల్ని చూస్తే, కళాతపస్వి మహా సాహసి అని కూడా అనిపిస్తాయి. హీరో అంధుడు... హీరోయిన్‌ మూగది... ఇక వాళ్ల మధ్య సంబంధం కళానుబంధం! సినిమా రంగంలో వ్యాపారాత్మక సూత్రాలు, ఫార్ములాలు రాజ్యమేలుతున్న రోజుల్లో ఈ కథను వూహించడానికి ఎంత ధైర్యం కావాలి? నిర్మాతకి చెప్పాలంటే తన ఆలోచనలపైన ఎంత స్పష్టత ఉండాలి? కానీ ఆ సినిమా వెండితెరపై ‘సిరివెన్నెల’ కురిపించింది. చూడలేనివారికి సైతం బృందావనాన్ని కళ్ల ముందు నిలిపింది. మరో సినిమాలో కథానాయిక పలుకే బంగారమైన మూగది. నాట్యమంటే మక్కువ. మరి కథానాయకుడు? డప్పు కళాకారుడు. ఆ కుటుంబంపై ఆధారపడే అతడే ఆమెకు రక్షకుడిగా మారతాడు. అతడి నిజాయితీ, అభిమానం ఆమెలో ప్రేమను రగిలిస్తే ఆ మూగ ఇష్టాన్ని తెరపై ఎలా చూపించాలి? ఎవరికైనా కష్టమేమో కానీ విశ్వనాథ్‌కేం? ఆమె కాలికి కట్టుకునే ‘సిరిసిరి మువ్వ’లు గాలికి అల్లాడి, అల్లాడి... కిందనే ఉన్న డప్పుపై పడి చప్పుడు చేస్తాయి. ఆ చప్పుడులో ఆమె గుండె చప్పుడు వినిపిస్తుంది ప్రేక్షకులకు. ఎంత చక్కని వ్యక్తీకరణ? ఎంత సున్నితమైన చిత్రీకరణ? ఎన్నో సినిమాల్లో ప్రేక్షకులు తొలి రేయిని చూసి ఉంటారు. ఆ సన్నివేశంలో పాటల్ని కూడా ఆస్వాదించి ఉంటారు. కానీ తొలిరాతిరి భార్యను చూస్తూనే ఆమె చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ‘అయిగిరి నందిని... నందిత మోహిని... విశ్వవినోదిని నందినుతే...’ అంటూ పాడుతూ పూజ చేసే భర్తను చూశారా? ఆ సన్నివేశంలో భార్య తెల్లబోవచ్చు. కానీ చిన్నప్పటి నుంచి ఇంట్లో అమ్మ, ఆలయంలో అమ్మవారు తప్ప మరో స్త్రీమూర్తిని వేరే దృష్టిలో చూడని ఆ యువ పూజారికి, మనసు అన్యాక్రాంతమైన భార్య జగన్మాతగా కనిపించడంలో వింత లేదని అర్థం చేసుకునే ప్రేక్షకుడు మాత్రం తెల్లబోడు. పైగా ఆ అద్భుత వైవిధ్య చిత్రీకరణకు జోహార్లు అర్పిస్తాడు. అందుకే ‘సప్తపది’, పది కాలాల పాటు చెప్పుకునే సినిమాగా మిగిలింది. ఇవన్నీ పక్కన పెడితే హీరో ఒట్టి వెర్రిబాగులవాడు. వయసు ఎదిగినా బుద్ధి మందగించిన వాడు. అమ్మాయి వీపు తోముతున్నా, గుడి మెట్లు కడుగుతున్నా పని మీద శ్రద్ధ తప్ప, మరే ధ్యాసలూ ఉండనంత అమాయకుడు. అలాంటి హీరోతో ‘స్వాతిముత్యం’లాంటి సినిమా తీశారు విశ్వనాథ్‌. అలా ఆయన ఓ చెప్పులు కుట్టేవాడితో స్ఫూర్తిని పంచగలరు. ఓ ఆవులు కాసేవాడితో మంచితనానికి అర్థం చెప్పించగలరు. ఓ జాలరితో బంధమంటే ఏంటో చూపించగలరు. బాధ్యతను తప్పించుకోడానికి సన్యాసులలోనైనా చేరడానికి సిద్ధపడే ఓ బద్ధకస్తుడితో పని విలువేంటో తెలియజెప్పగలరు.
సమాజంలో వేళ్లూనుకు పోయిన సమస్యలను కూడా విశ్వనాథ్‌ చిత్రాలు కట్టెదుట నిలిపి, నిలదీసి మరీ పరిష్కారాలు సూచిస్తాయి. ఆచార వ్యవహారాల కన్నా మానవత్వం గొప్పదని శంకరాభరణం చాటి చెప్పడాన్ని ఎలా మర్చిపోగలం? మనుషులను విడదీసే కుల వ్యవస్థను చెరిపివేయాలని ‘సప్తపది’ స్పష్టం చేస్తే ఎలా కాదనగలం? చేసే పని తపస్సయితే అదే మనల్ని ఉన్నత స్థాయికి తీసుకువెళుతుందని ‘స్వయంకృషి’ చెబితే ఒప్పుకోకుండా ఎలా ఉండగలం? అవినీతి అక్రమాలను ఎదుర్కొనడానికి హింస మార్గం కాదని, శాంతియుత మార్గమే ఉత్తమమని ‘సూత్రధారులు’ బోధిస్తే అంగీకరించకుండా ఎలా ఉండగలం? వరకట్నం సమస్యని సునిశిత హాస్యంతో మేళవించి ‘శుభలేఖ’ చూపిస్తే ఆలోచించకుండా ఎవరుండగలం? ఎంత ఉన్నతమైన వ్యక్తినైనా అసూయాద్వేషాలు అధఃపాతాళానికి దిగజారుస్తాయని ‘స్వాతికిరణం’ కళ్లు తెరిపిస్తే కాదనగలమా?
కె. విశ్వనాథ్‌, సమాజాన్ని సినిమా జాగృతం చేయగలదని మనసా, వాచా, కర్మణా నమ్మారు. ఆ నమ్మకానికి వూహను జోడించి, అందమైన కథను అల్లి ప్రేక్షకుల మనస్సులలో చెరిగిపోని ముద్ర వేసే అరుదైన, అద్భుత చిత్రాలను వెండితెరపై కమనీయంగా మలిచారు. అందుకే ఆయన కళాతపస్వి మాత్రమే కాదు, చిరకాలం తల్చుకోగలిగే అసమాన యశస్వి!!
published in EENADU on 24.04.2017