మంగళవారం, ఏప్రిల్ 08, 2014

జలగానంద


జనచైతన్యానంద స్వాములవారు ఆశీనులు కాగానే ఖద్దరు టోపీ పెట్టుకున్న ఓ వ్యక్తి చకచకా వచ్చి, 'స్వామీ! నేను ఎన్నికల్లో మళ్లీ పోటీ చేస్తున్నాను. నాకు మీ మద్దతు కావాలి' అన్నాడు. స్వాముల వారు చిరునవ్వు నవ్వి, జోలె లోంచి ఏదో తీసి అతడి చేతిలో వేశారు. అది చిటికెడు విబూది! 
'స్వామీ! ఇదేమి?' అన్నాడతడు తెల్లబోయి. 
'సన్యాసుల వద్ద ఇంతకన్నా ఏముంటుంది నాయనా' అన్నారు స్వాములవారు. 
'మద్దతంటే ఇది కాదు స్వామీ! మీ మాట సాయం. మీరు గనుక ఇక్కడి ప్రజలకు నాకే ఓటు వేయమని చెబితే, నేను అధికారంలోకి రాగానే మీకో ఆశ్రమం కట్టిస్తా' అన్నాడా వ్యక్తి కొంచెం వంగి, గుసగుసగా. 
'మునుపు చేసిన పనులు.. 
మునుముందు నడిపించు.. 
మాయ చేసితివేని.. 
మర్మంబు బోధించు.. 
తపన నీకేలరా నరుడా! 
తత్వంబు గ్రహియించు గురుడా!' 
అన్నారు స్వాములవారు. ఏమీ అర్థంకాక ఆ వ్యక్తి తలగోక్కున్నాడు. 
'తీర్థం తీసుకో నాయనా' అన్నారు స్వాములవారు. 
ఆ వ్యక్తి కంగారు పడి 'వద్దు స్వామీ! నా దగ్గర మినరల్‌ వాటర్‌ ఉంది' అంటూ గబగబా వెళ్లిపోయాడు. 
అతడు వెళ్లగానే శిష్యుడు వినయంగా దగ్గరకు వచ్చి, 'స్వామీ! ఆయన్ని ఆశీర్వదించకుండా విబూది, తీర్థం ఇవ్వడానికి కారణం ఏమిటో తెలుసుకోవచ్చా?'
స్వాముల వారు తన జోలెలోంచి మాయాదర్పణం తీసిచ్చారు. శిష్యుడు అందులోకి చూస్తూనే, 'ఇదేంటి స్వామీ? ఎన్నో చెరువులు, నదులు కనిపిస్తున్నాయి. కానీ వాటన్నిటిలో జలగలు ఈదుతూ కనిపిస్తున్నాయి. ఆ జలగలు చూస్తుండగానే పెద్దగా మారిపోతున్నాయి. పాకుతూ నీటిలోంచి బయటకు వచ్చి ఎవరిని కనిపిస్తే వారిని కరిచి రక్తం పీల్చేస్తున్నాయి. చూడలేకపోతున్నాను. ఈ దృశ్యానికి అర్థమేమిటి స్వామీ?' అని అడిగాడు.

అతడు ఇన్నాళ్లూ ఈ ప్రాంతాన్ని ఏలిన పాలకుల ప్రతినిధి. నన్నే ప్రలోభపెట్టబోయాడు. అతడి రాజకీయ భవితవ్యానికి గుర్తుగానే నేను విబూది ఇచ్చాను. ఇక తీర్థం ఇస్తే తీసుకోకుండానే వెళ్లిపోయాడు చూశావా? అందుకు కారణం ఈ పాలకుల వల్ల ఒక ఉద్ధరిణిడు నీళ్లయినా సురక్షితమో కాదో చెప్పలేని పరిస్థితి రాజ్యమేలుతోంది. ఏ తీర్థంలో ఏ క్రిములున్నాయో అనే భయంతోనే అతడు వడివడిగా వెళ్లిపోయాడు'

'ఎంత దారుణం స్వామీ! ప్రజలకు గుక్కెడు మంచినీళ్లయినా సక్రమంగా అందించలేని పాలన ఇక్కడ నడిచిందన్నమాట..'

'అన్నమాటేమిటి నాయనా! ఉన్నమాటే. మంచినీటిలో ప్రమాదకరమైన రసాయనాలు కలిసిపోతున్నా ఈ పాలకులకు చీమ కుట్టినట్టయినా అనిపించలేదు. మనం హిమాలయాల్లో ఉంటాం కాబట్టి మనకు తెలియదు కానీ, ఇక్కడ ఫ్లోరైడు సమస్యనే ఒక భయంకర స్థితి ఉంది.'

'హతవిధీ.. ఏమిటీ స్థితి స్వామీ! ఎంతటి నిరుపేదైనా ఇంటికి వచ్చిన వారికి మంచినీళ్లిస్తాడే? అలాంటిది తమకు ఓటేసి గెలిపించిన ప్రజలకు ఆపాటి కూడా చేయలేకపోతున్నారా ఈ పాలకులు స్వామీ? నేను వూర్లోకి వెళ్లినప్పుడల్లా చూస్తూనే ఉన్నాను. వీధి కుళాయిల దగ్గర పోరాటం, నీళ్ల ట్యాంకుల దగ్గర ఆరాటం గమనించాను.. మరి ఈ నిర్లక్ష్య పాలకులు ఎలాంటి చర్యలూ తీసుకోలేదా స్వామీ?'

'తీసుకోకేం నాయనా! కానీ అవన్నీ ప్రచారం కోసమే. తాగునీటి పథకాల పేరు చెప్పి ఐదేళ్లలో ఐదు వేల కోట్ల రూపాయల ఖర్చు చూపించినట్టు నా దివ్యదృష్టికి గోచరిస్తోంది నాయనా! కానీ వాటిలో అధికభాగం సొమ్ములు పాలకుల అనుచరుల జేబులు నింపాయి. కారణం అవినీతి. అధికారం ఉండడం వల్ల తమకు అనుకూలమైన వారికే పనులు కట్టబెట్టారు నాయనా! అందుకే ఆ పనుల్లో సగం ప్రారంభమే కాలేదు. చాలా వరకు అసంపూర్తిగా నిలిచిపోయాయి. మాయా దర్పణంలో నీకు కనిపించినవన్నీ అవినీతి జలగలు. నీటి పథకాల పేరు చెప్పి ప్రజల సొమ్మును స్వాహా చేసిన స్వార్థపరుల ప్రతిరూపాలు'

'స్వామీ! మీరు చెబుతుంటేనే ఒళ్లు జలదరిస్తోంది. ఈ పరిస్థితి నుంచి ప్రజలను కాపాడడానికి ఏం చేయాలో సెలవీయండి'

'వూర్లోకి వెళ్లి నేను చెప్పిన విషయాలన్నీ సామాన్యులకు అర్థమయ్యేటట్లు వివరించు నాయనా! ప్రజలను చైతన్యపరచడమే మనకు పరమావధి'

'అవశ్యం స్వామీ! తెల్లారి లేచిన దగ్గర్నుంచి మంచినీటి కోసం నానా పాట్లూ పడుతున్న మహిళలకు ఈ పాలకుల రాజకీయ స్వరూపమేంటో విశదీకరిస్తాను. ఈ రాష్ట్రంలో మహిళలందరూ కన్నెర్ర చేస్తే చాలు, ఈ ముదనష్టపు పాలకులు ఇంటిదారి పడతారని ఎలుగెత్తి చాటుతాను. నన్ను ఆశీర్వదించండి!'

'తథాస్తు!'

PUBLISHED IN EENADU ON 08.04.2014

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి